20, మే 2024, సోమవారం

శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము

 

శ్రీమదాంధ్ర

శ్రీమన్నారాయణీయము

[మూలము: శ్రీ నారాయణ భట్ట తిరి ప్రణీతము]

 

 

 


 

 

 

 

 









 

ప్రణీతము

పోచిరాజు కామేశ్వర రావు 





శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము

(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము)

ముందుమాట. 

 

                                                శ్రీరమా సుమనోనాథం కౌస్తుభ మణి భూషితమ్ |

                                                శంఖ చక్ర గదాహస్తం స్మరామి సతతమ్ హరిమ్ ||

 

సాత్యవతేయునకు సంపూర్ణ మనశ్శాంతినిఁ బ్రసాదించినది శ్రీమద్భాగవతము. పోతనామాత్యునకు విశ్వ విఖ్యాతి నొసంగి పరమ పదమును బ్రసాదించినది శ్రీమద్భాగవతము. శ్రీ నారాయణ భట్ట తిరి కవీశ్వరునకు నెన లేని యశస్సును బ్రసాదించినది వ్యాస విరచిత శ్రీమద్భాగవత కౢప్తీకృత శ్రీమన్నారాయణీయము. అట్టి శ్రీమన్నారాయణీయము నాంధ్రీకరించు మహాభాగ్యము సాక్షాచ్ఛ్రీమన్నారాయణుఁడే నాకుఁ బ్రసాదించి నట్లు నేను భావించెదను.

 

ఆస్ట్రేలియా దేశములో సిడ్నీ నగరమున నివసించు మా ద్వితీయ పుత్రిక శ్రీమతి గుడిపాటి సౌజన్యా రామచంద్ర రావు శ్రీ నారాయణ భట్ట తిరి ప్రణీత శ్రీమన్నారాయణీయమును దెనిఁగింప మని నన్ను వేఁడి యా గ్రంథము లోని పుటల ఛాయాచిత్రములు నాకుఁ బంపు చుండఁగఁ దెనుంగు సేత నే నిచట నారంభించితిని. దైవ సంకల్పము లేనిదే యిట్లు జరుగుట యసాధ్యము గదా. 

 

వ్యాస మహర్షి భాగవతము లోని పండ్రెండు స్కంధములను బండ్రెండు స్కంధ పరిచ్ఛేదములుగ గ్రహించి  యొక్కొక్క గాథ నొక్కొక్క దశకములో సంక్షిప్తముగ విరచించి యీ భాగవతోత్తముఁడు నూఱు దశకములలోఁ గేరళ లోని గురువాయూరు పట్టణమున వెలసిన శ్రీమన్నారాయణునకు నంకితముగ నుతించుచు వినిపించు చున్న విధమున రచన కొనసాగించెను. మదీయ రచనా విధానము కూడ నా విధముగనే చాగినది.

 

శ్రీహరి మాహాత్మ్యములను గుణ గణములను గాథల నెవ రెన్ని విధములఁ గీర్తించిన నాలపించిన విన్నను నిత్య నూతనములై విలసిల్లఁ దనివి తీరదు. మూల శ్లోకముల న్యాయము ననుసరించి నూఱు పద్యముల శతకము భంగిఁ బది పద్యముల దశకములలో లలిత శబ్దార్థ నిగూఢ భావములతో విరాజిల్లు నీ భాగవత కథా సమాహారము చదువు నప్పుడు పాఠకులకు నిష్క్లేశమై నూత నోత్సాహము భక్తి ప్రపత్తులను గలుగఁ జేయు ననుటలో సందేహ మావంతయు లేదు.

ఈ శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము నశేష భక్త లోకము పఠించి తరింపఁ గల రని నా యాకాంక్ష విశ్వాసము.

సర్వే జనాస్సుఖినో భవంతు!

గ్రంథ కర్త

పోచిరాజు కామేశ్వర రావు.

రాయపూర్, ఛత్తీస్ ఘఢ్.

25౼9౼2021.

 

శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము

(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము)

 

ప్రథమ స్కంధ పరిచ్ఛేదము

దశకము. 1

భగవన్మహిమ

 

 

శా.

శ్రీ కాంతా రమణీ లలామ కర సంసేవ్యాంఘ్రి నాళీక! ది

వ్యాకార స్తవనీయ రుక్మ మయ భూషాలంకృ తోత్సేధ భా

సా! కాకోదర తల్ప! శంఖ ఘన చక్రాసి ప్రభా భాసితా!

రాకా చంద్ర నిభాస్య! పద్మదళ నేత్ర ద్వంద్వ! నన్గావుమా

1.      

 

 

 

 

లక్ష్మీ దేవి కరపద్మములచే సేవింపఁ బడువాఁడా, దివ్యమైన యాకారము కీర్తనీయము లైన స్వర్ణ మయము లైన భూషణములతో నలంకరింపఁ బడిన దేహముతో  వెల్గు వాఁడా, పన్నగ శయనా, శంఖము చక్రము ఖడ్గముల ప్రభలతో భాసిల్లువాఁడా, పున్నమి నాటి చంద్రుని వంటి ముఖము గలవాఁడా,  పద్మపత్రముల వంటి జంట కన్నులు గలవాఁడా నన్ను రక్షింపుము.  

 

 

 

 

మ.

గురువాయూ రను గ్రామ మందలి ప్రజా కూటంపు భాగ్యం బహో

కర మానంద సుబోధక ప్రవరునిం గాలస్థ లాతీతునిన్

వర నిస్తుల్యుని నిత్యముక్తుని ధరం బ్రాఁబల్కు దండమ్ములే

యరయ న్నేరని బ్రహ్మతత్త్వుఁ బురుషార్థాలి ప్రదున్ నిత్యునిన్ 

2.     

 

 

 

 

ఆహా గురువాయూ రను గ్రామమున నున్న ప్రజ లెంత భాగ్యవంతులో కదా! ఆ గ్రామమున వెలసిన  యత్యానంద రూపుని, జ్ఞాన స్వరూపుని, దేశ కాలముల కతీతుని, నసమానుని, నిత్యము ముక్తుఁ డైన వానిని, వేద చయములే నేరని వానిని, బ్రహ్మతత్త్వునిఁ, బురుషార్థముల నిచ్చు వానిని, నిత్య మైన వానిని  

 

 

 

 

మ.

స్థిర చిత్తమ్మున నాశ్రయించెదము తద్దివ్యానిలగ్రామ నా

థు రమా నాథుని నాత్మ రూపుని వడిం దోరంపుఁ బీడల్ తొలం

గ రతిం గొందఱు గొల్తు రన్యులను వాక్కాయమ్ములన్ బుద్ధులన్

దొరకన్ దుర్లభుఁ డైన నక్కట గనన్ దోర్దండ దూరమ్మునన్

3.     

 

 

 

 

ఆ గురువాయూరు పతిని, లక్ష్మీ పతిని, నాత్మ స్వరూపుని, దట్టమైన మన పీడలు తొలఁగుటకు నిశ్చిత మతిని నాశ్రయించెదము. కొందఱు మనోవాక్కాయమ్ముల నితర దైవములను గొల్చెద రక్కట.  అతఁడు దుర్లభుఁ డైనను జేతికి నందు నంత దూరముననే యుండును.

 

 

 

 

మ.

సహ సత్త్వమ్ము తమో రజో రహితమై స్వచ్ఛమ్మునై నీ వపు

ర్బృహ దంతస్స్థిత పంచ భూత గణ సుస్ఫీతంబ యంచున్ సదా

మహనీయుండు పరాశరాత్మజుఁడు సంభావింప ధన్యుల్ భువిన్

రహినిం గందురు సచ్ఛి దుల్లసన వర్ష్మమ్మున్ సమీక్షించుచున్

4.     

 

 

 

 

సత్త్వగుణముతోఁ గూడి, రజస్తమో గుణములు లేక స్వచ్ఛము నైన నీ శరీరము పంచభూతాత్మక మని  వ్యాస మహర్షి సంభావించెను. అట్టి నీ సచ్ఛిదానంద రూపమును జూచుచు నానందమును బొందెద రచ్చటి ధన్యులైన ప్రజలు.

 

 

 

 

మ.

చలనం బొక్కట పూర్ణముల్ నిరతమున్  సంద్రమ్ము  బ్రహ్మమ్ము రెం

డల నిత్యోల్లస దేవభోజన సమాహారమ్ము  బ్రహ్మమ్మ ని

ర్మలముల్ రెండు విలీన మౌక్తిక నిభ ప్రాణవ్రజోద్భాసి ని

ష్కళుఁ డన్నం గళలం జరింతువు మహా సత్త్వంబు భాసిల్లగన్

5.     

 

 

 

 

పరబ్రహ్మము సముద్రము వంటిది. సముద్రమునకు మాత్రము  చలన ముండును. రెండును నిత్యము పూర్ణములే.  బ్రహ్మము నిత్యము పరమానంద మను నమృతముతో నిండి యుండును. రెండును నిర్మలములే. ముత్యముల వంటి ప్రాణుల సమూహముతో బ్రహ్మము భాసిల్లును.  నీవు నిష్కళుఁడ వైనను గొప్ప బలముతో సకల కళా సహితము రూపమును ధరింతువు.

 

 

 

 

మ.

కలవే కార్యము లెన్న నీ కయిన నీ కారుణ్య దృగ్జాల మం

డలిఁ గల్పాది జనించు లీనములు ప్రాణభ్రాజితశ్రేణు లా

వల సత్త్వమ్ము ధరించి స్వీయ మహిమన్ వైకుంఠ! నిర్జన్మ! నీ

వ లసద్వైభవ శుద్ధ విగ్రహపు రూపార్జించి కన్పింతువే

6.     

 

 

 

 

నీకుఁ జేయ వలసిన కార్యములు లేకున్నను, నీ కరుణావలోకనముల వలన నీ లో లీనమయిన ప్రాణి కోటులు జనించును. ఆవల నీవె సత్త్వ గుణము నూని మహిమముతో జన్మములు లేని వాఁడ వైన నీవు ప్రకాశించు వైభవంపు శుద్ధ రూపముతో నవతరించి కన్పింతువు. 

 

 

 

 

మ.

నవ మేఘాభ సుదీప్త గాత్ర కువలానందప్రదా సుందరై

క వపుస్సంపద పుణ్య దాయకము భక్తశ్రేణికిన్ ధాత్రినిన్

ఛవి రాజద్హృది వాస మౌను రమకున్ స్త్యానమ్మువర్షించు ధ్యా

న విలీనాత్ముల కెల్ల వాయు పుర సన్నాథా నుతింతున్ సదా

7.     

 

 

 

 

నీ మేను నీలి మేఘ శ్యామము. కలువల వలె నానందము నొసంగునది.  సుందర మైన నీ దేహ సౌందర్యము భక్తులకుఁ బుణ్యప్రదము.  కాంతులతో వెల్గు లక్ష్మీ దేవికి నివాస స్థానము నీ హృదయము. నీ ధ్యాన మందు నిమగ్న మైన వారికి నమృత ధారలను గురిపించును.  ఓ గురువాయూరు నాథా నిన్ను నే నెల్లప్పుడు నుతింతును.

 

 

 

 

మ.

అతి కష్టంబని నీదు సృష్టి బహు దుఃఖావేశ సంత్రాస పూ

రితమే యంచుఁ దలంచి యుంటి మును పుర్వీ నాథ యట్లైన నా

యత జీవాళి ధరిత్రి నేల మధురంబౌ నీ వపుశ్చిద్రసా

మృత పానమ్మున సంతసించు నయ నీ మేఁ గాంచి నేత్రమ్ములన్

8.     

 

 

 

 

ఈ నీ సృష్టి కష్ట మని, భయము, దుఃఖము నావేశములతోఁ గూడు కున్న దని నేను మున్ను దలఁచితిని.  అట్లయిన నీ జీవులు భూమిపైఁ దియ్య నైన నీ దేహ చిద్రసామృతమును నేత్రములతో నాస్వాదించి యేల నానందింతురు? 

 

 

 

 

మ.

వినయం బింపుగ నున్న వారికిని సంప్రీతిన్ దరిన్నిల్తువే

యనయమ్మున్ మఱి వేఁడ కుండఁగనె కామ్యార్థమ్ము లీ నేర్తువే

కన నీవే ఘన పారిజాత మిల మోక్షంబీయ నెవ్వారికిన్

మనమున్ నిల్పఁగ నల్ప కామద దివక్ష్మాజమ్మునన్ వ్యర్థమే

9.     

 

 

 

 

వినయ మున్న వారికి నీవు ప్రీతితో నెప్పుడు దాపున నిల్తువు. కోరకుండఁగనే కామ్యార్థముల నిత్తువు. మోక్ష మొసఁగుటకు నీవే పారిజాత ద్రుమమువు. అల్పపుఁ గోరికల నిచ్చు కల్పతరువుపై మనస్సు నిల్పుట వ్యర్థము.

 

 

 

 

మ.

దయతో నిత్తురు మోక్ష మొక్కటియునుం దక్కంగ నన్యార్థముల్

నియతిం గొల్వఁగ నన్య దేవత లిలన్ నీ వీయవే మోక్షముం

బ్రియ మారంగ మహాంచి తార్థములు వారిం గాయ నీశుండ వీ

వయ నీ యంద రమింతు రెల్ల జను లాత్మారామ శౌరీ నుతుల్

10.  

 

 

 

 

ఇతర దేవతలు మోక్షమును దప్ప నన్యము లైన కోర్కెలు నియమముతోఁ గొల్చిన నిత్తురు. నీవు మోక్షము నంచితములైన యర్థముల నిచ్చి వారిని గాతువు. ఆత్మారామా శౌరీ యెల్లరు నీ యందే రమింతురు.

 

 

 

 

మ.

అధికారమ్ము యశస్సు విక్రమము జ్ఞానైశ్వర్య వైరాగ్యముల్

విధివన్మూలము దేవ నామమునకున్ విశ్వేశ్వరా పేర్మి నీ

కధి కాధీనులె యెల్ల దేవతలు పద్మాగార సేవ్యా మహ

ర్ష్యధి కారాధిత నీక చెల్లు నది వాతాగార వాసేశ్వరా

11.   

 

 

 

 

అధికారము, కీర్తి, పరాక్రమము, జ్ఞానము, సంపదలు, వైరాగ్యము భగవంతుఁ డను నామమునకు మూలములు. విశ్వేశ్వరా సమస్త దేవతలు నీ యధీనులే, లక్ష్మీ దేవితో సేవింపఁ బడు వాఁడవు మునులచే నధికముగా నారాధింపఁ బడువాఁడవు కనుక  భగవన్నామము నీకే చెల్లును గురు వాయూరు నివాసముగాఁ గలవాఁడా.

 

 

ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయమున మొదటి దశకము.

 

 

శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము

(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము)

 

ప్రథమ స్కంధ పరిచ్ఛేదము

దశకము. 2

భగవద్రూప భక్తి మాహాత్మ్యము

 

 

శా.

సూర్యోద్భాస కిరీట మూర్ధ! తిలక స్ఫూర్తి ప్రభా ఫాల! యౌ

దార్య భ్రాజిత సద్దయార్ద్ర వర నేత్రా! మందహా సాననా!

వీర్యోద్దండ సునాస! కౌస్తుభ వరాభేద్యాంక! శ్రీవత్స వై

దూర్యోరో వన హార! కుండల ధరా! దుర్వార! శౌరీ! నతుల్

1.      

 

 

 

 

సూర్యుని వలెఁ బ్రకాశించు కిరీట మున్న శిరము గలవాఁడా! తిలకముతో వెల్గు నుదురు గలవాఁడా! యుదారత్వము నిండిన దయా పూరిత నేత్రములు గలవాఁడా! చిరునగవు లొలుకు ముఖము గల వాఁడా! బలమైన పొడవైన ముక్కు గలవాఁడా! నిర్భేద్యమైన కౌస్తుభాభరణము గలవాఁడా! వైదూర్యము వంటి శ్రీవత్సపు మచ్చతో నున్న వక్షమున వనమాలిక గలవాఁడా! కుండలములు ధరించిన వాఁడా! వారింప నశక్య మైన వాఁడా! శౌరీ నమస్కారములు.

 

 

 

 

శా.

కేయూరమ్ములు నంగదమ్ములును సంకీర్ణాబ్ధిసా రోర్మికల్

శ్రేయస్కార గ దాబ్జ చక్ర దర సంసేవ్యంపు హస్తమ్ములున్

ఛాయాభ్రాజిత మేఖలా కటి సువస్త్రస్కంధముల్ వెల్గగం

దోయోత్పాద నికాశ పాదముల విద్యోతమ్ములం గొల్చెదన్

2.     

 

 

 

 

 

కేయూరము లంగదములు రత్నములు పొదిగిన యుంగరములు, శ్రేయముల నొసఁగు గద, పద్మము, చక్రము శంఖములు గల హస్తములు, కాంతుల వెలుఁగు మొలనూలు గల మొల,  మంచి వస్త్రము లూనిన మేను  పద్మముల వంటి ప్రకాశించు పాదములు గల నిన్ను గొల్చెదను.

 

 

 

 

ఉ.

మూడు జగమ్ము లందుఁ గల భూరితమమ్ముల కన్న మిన్నవే

చూడఁగ మోహనమ్ములకు సుందర మోహన రూప మెవ్విధిన్

వాడని నీదు కాంతి ఖగ వాహన కాంతుల నెల్ల మించునే

యేడ నపూర్వపుం జెలువ మెవ్వరు కోరరు చూడఁగన్ హరీ 

3.     

 

 

 

 

ముజ్జగములలోని గొప్ప వాని కన్నింటికి మిన్న, మోహనము లందు మిక్కిలి సుందరమైన మోహన రూపము, యెన్నఁడు వాడని నీ కాంతి పక్షివాహనా  కాంతుల కెల్ల మిన్న, యిట్టి యపూర్వపు టందము గాంచుట నెవ్వరు కోరుకొనరు?

 

 

 

 

ఉ.

ఇంపగు నీదు రూపమున నీప్సిత మేర్పడ నిన్ను జేరఁగన్

సంపద లిచ్చు లక్ష్మి యనిశమ్ము స్వ భక్తుల నెల్ల వీడి సా

ధింపఁగ వా రిలం జపల దేవి యటంచుఁ జెలంగి పల్కుచుం

గంపము మూరి జిత్తమునఁ గాఱియ రేఁగును మిక్కుటమ్ముగన్

4.     

 

 

 

 

ఇంపైన నీ రూపమున నిష్టము కల్గి సంపద లొసంగు నట్టి లక్ష్మీ దేవి నిజ భక్తులను వీడి నిన్ను జేర సాధింపఁగ నీ దేవి చపల యని చెలఁగి పల్కుచు నా భక్తులు మనస్సులందుఁ గంపము మూరి మిక్కుటముగ బాధలు రేఁగును. 

 

 

 

 

మ.

రమణీయమ్మగు రూపుఁ గాంచి స్థిరమై రాణించు నీయం దనం

బ్రమదం బొప్ప రమా సతీ మణియె బ్రామాణ్యంబ నీ భక్తులుం

గమనీయమ్ముగ సంస్తుతింప స్థిరమై కన్పట్ట వా రిండ్ల లో

మమకారమ్మున భర్తపైఁ బరుల సంభావింప రాకుండుటల్

5.     

 

 

 

 

నీ రమణీయమైన రూపమును జూచి ప్రమదముతో లక్ష్మీ దేవి స్థిరముగా నీ యందు నుండు ననుటకుఁ  బ్రమాణము నీ పై మమకారముతో నిన్ను స్తుతించు వారిండ్లలో స్థిరముగా నుండి పరులను గౌరవింప కుండుటయే. 

 

 

 

 

చం.

సుధఁ గురిపించు నీ తనువు సుందర రూపము చిద్రసాయనం

బధికము నై హరించు నది పన్నుగ విన్న జనాళి చిత్తముల్

బుధ జన చోదకమ్మగును బుద్ధిని మత్తిలఁ జేయు గగ్గురౌ

మధు సదృశమ్ము నస్రువుల మై తడియంగఁ జెలంగుఁ జిత్రమై

6.     

 

 

 

 

నీ మేని సుందర రూప మమృతము కురిపించును, అది జ్ఞాన రసమయి నీ కథలు విన్న జనుల మనస్సులను దోచుకొనును. విద్వాంసులకుఁ బ్రేరణ మిచ్చును.  చిత్తములను దేనెవలె మత్తిలఁ జేయును. గగుర్పాటు కలిగించును. సంతోషమున నస్రువులతో శరీరము తడిసి పోవును.

 

 

 

 

మ.

అనయం బా మును లందు రింపుగ రమేశా సుంద రానంద రూ

ప నరశ్రేణికి భక్తియే సులభమై ప్రాప్తించు నంచున్ ధరన్

ఘనముల్ సన్నుత! జ్ఞాన కర్మములు యోగమ్ముల్ సమానంబు కా

వని యెభ్భంగిని భక్తి యోగమున కయ్యా యెంచ నిక్కమ్ముగన్

7.     

 

 

 

 

లక్ష్మీపతీ భక్తియే సులభముగాఁ బ్రాప్తించు నని మును లెల్లపుడు చెప్పుచుందురు. జ్ఞాన కర్మ యోగములు భక్తి యోగమునకు నే  విధముగాను  సరి కావని వచించు చుందురు.

 

 

 

 

చం.

ఉపకృతిఁ గోరకే యిల నిజోచిత ధర్మము లాచరించి చే

యు పనుల యోగ మిచ్చు టెడ యుబ్బి ఫలమ్ములు వేద తత్త్వ బో

ధపు గురు యోగ మెంచ వసుధా జన కష్టము భక్తి యోగ మే

రుపడఁగ నీదు ప్రేమ మది రూఢిగ నిచ్చు ఫలమ్ము సద్యమున్

8.     

 

 

 

 

ఉపకారమును గోరక తన నియమిత ధర్మము లాచరించి చేయు కర్మయోగ ముబ్బి ఫలితము నిచ్చుట సుదూర విషయము.  జ్ఞాన యోగము నాచరించుట జనులకు నతి కష్టము. నీ పైఁ బ్రేమ కలుగ భక్తి యోగము రూఢిగ ఫలమును త్వరితముగ నిచ్చును. 

 

 

 

 

ఉ.

చేయుచుఁ గర్మ సంచయము ఛిద్రము కా నఘ రాశి కొంద ఱా

ధీయుత మార్గ మేని గొని ధీరత భక్తి పథమ్ము నైననున్

ధ్యేయము నుంచి జ్ఞాన గతిఁ దేలు చనార్ద్రపు చిత్తు లన్యులున్

వేయికి మించి పుట్టుకల పిమ్మటఁ జేరఁగ నిన్ను నేర్తురే

9.     

 

 

 

 

కొందఱు కర్మములను జేయుచుఁ బాపములు క్షీణింపఁగ జ్ఞాన మార్గము గాని భక్తి మార్గము గాని గ్రహించి, మఱి కొందఱు జ్ఞానయోగమున ధ్యేయ ముంచి యార్ద్రము గాని చిత్తమున ననేక జన్మముల పిదప నిన్ను జేరఁ గలరు.  

 

 

 

 

ఉ.

ఏపునఁ కల్గు భక్తి కథ లింపుగ నీవి వినంగ జ్ఞానమే

ప్రాపగుఁ గ్లేశ హీనతను బన్నుగఁ దీరును వాంఛితమ్ములే

యో పరమాత్మ శౌరి పురుషోత్తమ వేగమ నన్ను ముంచుమా

నీ పద భక్తి రాగమయ నిర్జర మం దనిలాల యాధిపా

10.  

 

 

 

 

నీ భక్తి గాథలను వినిన జ్ఞానము విరివిగఁ గల్గును.  నీ యాశ్రయము కలుగును. అక్లేశముగఁ గోరికలు దీరును. పరమాత్మా గురువాయూరు నాథా నన్ను ద్వరితముగ నీ పాద భక్తిరస మను నమృతమున ముంచుము.

 

 

ఇది విబుధ జన వినయ పోచి రాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయమున రెండవ దశకము.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము

(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము)

ప్రథమ స్కంధ పరిచ్ఛేదము

దశకము. 3

భక్తి స్వరూప వర్ణనము – భక్తికై ప్రార్థన.

 

 

చం.

మునుఁగుదు రుల్ల సాబ్ధిఁ దవ పుణ్య త రాఖ్యలు పల్కి భక్తినిన్

మననము సేసి రూప గుణ మండల గాథలు సంతతమ్మునుం

దనివిఁ జరింత్రు ధాత్రిని ముదమ్ముగ నిన్ను దలంచి నెమ్మదిం

గనియెద వారి ధన్యులుగఁ గామిత కాంక్షల నందు చుండఁగన్

1.      

 

 

 

 

పుణ్యతమము లైననీ పేళ్లను భక్తితోఁ బలికి సంతోషాబ్ధిని మునుఁగుదురు. నీ రూప గుణ సమూహముల కథలను స్మరించు కొనుచు నిత్యము తృప్తితోఁ జరించెదరు. నిన్ను మదిలోఁ దలఁచుచు సంతోషింతురు. కోరిన కోరికలు నిండు చుండ వారిని ధన్యులుగా నేను దలఁచెదను .

 

 

 

 

ఉ.

రోగపు బాధ లీయ నవరోధ మపేక్ష విహీన మయ్యెనే

నీ గురు పాద సేవకయి నిశ్చల రక్తియు నిండి యుండినం

జాగెద నా మకీర్తనలు చక్కఁగఁ బాడుచు నొంటి పాటునన్

బాగుగఁ బాద పద్మములు భక్తిఁ దలంచి వసింతుఁ గేశవా

2.     

 

 

 

 

రోగములు బాధలు కలిగించు చుండ నీ పాద సేవపై నపేక్ష తగ్గు చున్నది నిశ్చలమైన ప్రేమ యున్నప్పటికిని. కేశవా! నీ నామ కీర్తనములు చక్కఁగాఁ జేయుచుఁ బాడుచు నొంటరిగా నీ పాద పద్మములను భక్తితో దలఁచుచు వసింతును.

 

 

 

 

చం.

కలిగిన నీ దయా ధనము కల్గని సౌఖ్యము లుండ శక్యమే

కలిగిన నాదు రుగ్మతయుఁ గన్మఱుఁ గౌట తలంప వింతయే

కలఁతలు లేక నీ దగు నకామపు భక్తులు ముక్తులై సుఖ

మ్ము లొదవు భవ్య మార్గముల మూరి చరిం త్రనిలాలయప్రభూ

3.     

 

 

 

 

నీ దయ యను విత్త మున్నఁ బొందఁగ లేని సౌఖ్యము లుండఁ గలవా? నాకు కల్గిన రోగము మాయ మగుట నిజముగా వింతయే. కోరికలు లేని నీ భక్తులు కలఁతల నొందక ముక్తులై శ్రేయస్కరము లగు మార్గములఁ జరింతురు. 

 

 

 

 

మ.

తనరన్ మౌనివరేణ్య నారద ముఖాత్మజ్ఞాన సంపన్నులే

యనయంబుం దవ పాదపద్మ యుగ సేవాళిన్ రుజా హీనులై

వినయం బొప్పఁ జరింత్రు మున్గుచును దీపిన్ సచ్చిదానంద వా

ర్ధిని స్వేచ్ఛా గతి వెల్గులం దనరి ధాత్రిం గోర నొండున్నదే

4.     

 

 

 

 

నార దాది యాత్మజ్ఞాన సంపన్నులు నిత్యము నీ పాద పద్మముల సేవలతో నరోగులై వినయము తో నిష్టముతో సచ్చిదానంద మను కడలిలో మునిగి స్వేచ్ఛగా వెలుఁగుచుఁ జరింతురు. ఇంతకు మించినది వేఱొకటి కోరుకొనుటకు నుండునా? 

 

 

 

 

ఉ.

నీ పయి భక్తి గాఢమయి నిల్వఁగ జేయుమ నీరజాక్ష నా

యే పగు పాప సంచయము లిద్ధర ఖండిత మౌట నిక్కమే

యే పిసరంత సందియము నేఁ గనఁ గాదన నౌను మిథ్యలే

యా పథికోక్త తుల్యమయి వ్యాసముని శ్రుతి వాక్కు లెల్లనున్

5.     

 

 

 

 

దేవా నీ పయి నాకు గాఢమైన భక్తినిఁ గలిగించు. నా పాప సంచయము మొత్తము ఖండిత మౌను . దీనిలో సందియము కొంచెమైనను లేదు. కానిచో బాట సారుల మాటల వలె వ్యాస మహర్షి పలుకులు, వేద వచనములు మిథ్యలే యగును.

 

 

 

 

మ.

వశమైనన్ భవదీయ సద్గుణ రసాస్వాదాత్త సద్భక్తి యం

త శమింపం దగి మూడు తాపముల విస్తారమ్ము వర్ధిల్లెడిన్

భృశముం గల్గును జ్ఞాన మంతమున నుర్విన్ బ్రహ్మ సంహర్షమున్

విశదంబై చన నిట్లుఁ గోరఁగను నే వీక్షింప నొండుండునే

6.     

 

 

 

 

నీ సద్గుణము లను రసపు టాస్వాదమునఁ గలిగిన భక్తి మూడు తాపములు నశింపఁ జేయఁ గలిగి యది విస్తారముగా వర్ధిల్లిను. జ్ఞానము కల్గును. తుదిని  బ్రహ్మానందము లభించును. ఇంత కన్న మనకుఁ గావలసినది యేమి?

 

 

 

 

ఉ.

దూరము చేసి బాధలను దూర్ణము చేయుమ రాగ మేర్పడం

జేరఁగ నాదు పాదములు శీఘ్రమ చెల్వగు నీదు క్షేత్రమున్

మూరఁ గరద్వయమ్ము తవ పూజల యందున నీదు మూర్తినే

యారయఁ గన్లఁ ద్రాగఁగఁ బదామృతమే విన నీ చరిత్రనే

7.     

 

 

 

 

దేవా నా బాధలను శీఘ్రమ దూరము చేయుము.  ప్రేమతో నా పాదములు నీ క్షేత్రమును జేరుటకు, నా చేతులు నీ పూజలందు  నిమగ్న మగుటకు, నా కన్నులు నీ రూపమును జూచుటకు, నీ పాదామృతమును నా నోరు త్రాగుటకు, నాచెవులు నీ చరిత్రములు వినుటకును. 

 

 

 

 

ఉ.

వ్యాధి బలార్త చంచలిత మైన మదీయ మనమ్ము లోపలన్

భూధవ నీ చిదాకృతి నపూర్వ ముదావహ ముద్భవింపఁగా

శ్రీధర సేయుమా కృపను శీఘ్రమ మేఁ బులకింపఁ గాంచి నే

త్రాధిక హర్ష కోమల కణాళులుఁ గాఱ భరింతు బాధలన్

8.     

 

 

 

 

దేవా రోగపు బలము తో బాధ పడుచున్న నా మనస్సులో నీ చిద్రూపము వలన నపూర్వ మైన యానందము కలుగు నట్లు చేయుము.  నీ కృపతో మేను పులకింపఁగా నా నేత్రముల నానంద భాష్పములు రాల బాధలను భరింతును.

 

 

 

 

చం.

సుఖములు వొందు చుండి రిలఁ జోద్యము మీఱఁగ నీ యభక్తులే

యఖిలము లైన దుఃఖముల నందితి భక్తుఁడ నైన భావ్య మ

య్య ఖగ విహార వాయు నగ రాధిప కీర్తికి భంగమే యశో

ముఖ తొలగించి బాధలను ముఖ్యునిఁ జేయుమ భక్తు లందునున్

9.     

 

 

 

 

నీకు భక్తులు కాని వారు సుఖముల ననుభవించు చుంటిరి. నేను నీ భక్తుఁడను దుఃఖములను బొందు చున్నాను. భావ్యమేనా? నీ కీర్తి కిది భంగము కాదా కీర్తి మంతుఁడా? నా బాధలను దొలఁగించి నీ భక్తులలో నన్ను ముఖ్యునిఁ జేయుము. 

 

 

 

 

ఉ.

ఇంకను జెప్ప నేల వెత లేర్పడఁ బ్రేలితి మాని యింక నా

వంకను నీ కృపారసము వాఱెడు నంతకు శక్తి మేర నేఁ

బంకజ నేత్ర సన్నతులు పాదనిషేవణ కీర్తనమ్ము ని

శ్శంకను సంతతమ్ము దమిఁ జల్పఁగ మాధవ నిశ్చయించితిన్

10.  

 

 

 

 

ఏమి చెప్పను? బాధల వలన నే నే మేమియో పల్కితిని. నా వంక దయ తో వీక్షించు నంత వఱకును నా శక్తి కొలఁది నుతించుచు నీ పాద సేవనము, నీ కీర్తనము నిత్యము చేసెదను. ఇట్లు మాధవా నిశ్చయించితిని.

 

 

ఇది విబుధ జన వినయ పోచిరా జాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయమున మూడవ దశకము.

ప్రథమ స్కంధ పరిచ్ఛేదము సమాప్తము.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము

(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము)

 

ద్వితీయ స్కంధ పరిచ్ఛేదము

దశకము. 4

అష్టాంగ యోగ, యోగ సిద్ధి వర్ణనము.

 

 

శా.

నీ సేవా రతి నుండ శార్ఙ్గ ధర నే నిత్యమ్ము నా కీయ రా

వే సంప్రీతిఁ గృపార సేక్షణముల న్వీక్షించి యారోగ్య మ

భ్యాసింపంగ సతమ్ము నష్ట విధము ల్భాసిల్లు యోగమ్మునున్

నే సంపూర్ణము విశ్వసింతును మది న్నీ సద్దయా ప్రాప్తినిన్

1.      

 

 

 

 

శార్ఙ్గ ధరా నేను నిత్యము నీ సేవారతి నుండుటకుఁ బ్రీతితో దయారస వీక్షణములఁ జూచి నాకు నారోగ్యము నొసఁగుము. అప్పుడు నే నష్టాంగ యోగము నభ్యసింపఁ గలను. నీ దయా లబ్ధిపై నాకు సంపూర్ణ విశ్వాసము కలదు. 

 

 

 

 

తే.గీ.

బ్రహ్మచర్య మింద్రియ సునిగ్రహము నింక

స్నాన నియ మాచరణములఁ జక్కఁగను బ

విత్రుల మయి దృఢమ్ముగ విరియ భక్తి

సలుపుదుము పద్మ సుఖపు టాసనముల నిది

2.     

 

 

 

 

బ్రహ్మ చర్యము, నింద్రియ నిగ్రహము, స్నాన నియమాచరణములతోఁ బవిత్రులమై నిశ్చలమైన భక్తితోఁ బద్మ సుఖాసనముల నీ యోగము నాచరింతుము. 

 

 

 

 

తే.గీ.

ప్రణవము స్మరించుచు సతము ప్రాణ యామ

మాచరించి యాపి విమలు లగుచు నింద్రి

య విషయమ్ముల మరలించి యంచితముగఁ

జేయుదుము నీ యుపాసన మాయతముగ

3.     

 

 

 

 

ఓంకారమును స్మరించుచుఁ, బ్రాణాయామము నాచరించి నిర్మలుల మింద్రియ విషయములను మఱలించి నీ యుపాసనము చేయుదుము.

 

 

 

 

తే.గీ.

అస్ఫుటమ్మ నీదు తనువు యత్నమునను

దిరిగి తిరిగి చింతింతుము ధీయుతముగ

నీ పదధ్యాన రతులము నిత్య మందు

చేత భక్తి రసమ్మున నీఁత దక్కు

4.     

 

 

 

 

నీ రూపము స్పష్టము కానిది. మఱల మఱల ప్రయత్నించి బాగుగ ధ్యానించి నీ పదము లందు రక్తి నుంచి యుండిన నీ భక్తి రసార్ణవమున నీఁదఁ గలము.   

 

 

 

 

తే.గీ.

సుచిర కాలమ్ము చింతింప సురుచిరముగ

సుంద రావయవ వపువుఁ జూతు మయ్య

యశ్రమముగ నప్పుడు మనమందు నిన్ను

నాశ్రయించి ధ్యానమ్మున నలరఁ గలము

5.     

 

 

 

 

చిరకాలము నిన్ను జింతించిన నందముగ నీ సుందర రూపమును గాంచఁ గలము. అప్పుడు శ్రమ లేకుండ మనస్సులో నిన్ను నాశ్రయించి ధ్యానములో నుండఁ గలము. 

 

 

 

 

తోటకము

తలఁపం బరమాత్మ! సతమ్ము నినున్

విలసిల్ల సమస్తపుఁ బేరిమి రూ

పులఁ బొందఁగ నేర్తురు మోదము భా

సిలు వారి మనమ్మిఁకఁ జిన్మయమై

6.     

 

 

 

 

పరమాత్మా! నిత్యము నిన్ను బేర్మితోఁ దలఁప, గుణములతో సమస్త మైన నీ రూపులను జూడఁ గలరు. వారికి మనస్సు చిన్మయమై యానందము చేకూరును.

 

 

 

 

ఉత్సాహము

ఆసఁ గ్రోలి నీదు రూప మద్భుతమ్ము విశ్వపా

లా సమాధి సంస్థితిం జెలంగి యుండ జాఱ మే

మా సమాధి నుండి యెన్నఁడైన ధ్యాన మింకనుం

జేసి దాని గెల్తు మయ్య శీఘ్రమే భవత్కృపన్

7.     

 

 

 

 

విశ్వపాలా! నీ యద్భుతమైన రూపము నాశతోఁ గ్రోలి సమాధిలో పరవశించి యుండ నెన్నఁ డైన నా సమాధి నుండి జాఱినఁ దిరిగి యధికముగాఁ జేసి దానిని నీ దయతోఁ బొందెదము. 

 

 

 

 

ద్రుతవిలంబితము

అటుల మోదపు టభ్యసనమ్మునం

బటుత రోల్లస పాత్రులమై చెలం

గుటలు నీ పయి కూర్మినె యుందు మే

మిట సురర్షి మునీంద్ర శు కాభమై

8.     

 

 

 

 

ఆ విధముగా నానందపు టభ్యాసమున మిక్కిలి యుల్లాసముతోఁ దనరుట కెల్ల నీ పయి నున్న ప్రేమయే కారణము. మేము నాకముని నారదుఁడు, మునిపుంగవుఁడు శుకుని వలె నుందుము. 

 

 

 

 

శిఖరిణి

పరంధామా! మా కా విధి జయము సంప్రాప్త మగుటన్

వరాంఘ్రిద్యో తైకాగ్రత రయమునన్ భద్ర మగు వే

ళ రాగన్ సన్మోక్షమ్మునను దమి యారంభ మగు యో

గ రమ్యాధీన స్పర్శ మిడమె వరాంగమ్మునఁ దగన్

9.     

 

 

 

 

పరంధామా! మాకు నట్లు విజయము లభింపఁగ నీ పదము లందలి యేకాగ్రతతోఁ దగు సమయమున మోక్షముపై నాసక్తి యారంభమగును. రమ్యమైన యోగ బలమ్మున శిరస్సును దాఁక గలము.

 

 

 

 

తే.గీ.

ఆఱు స్థానమ్ముల నిలిచి యలరు చుండు

నట్టి ప్రాణ మారుతముల నా సుషుమ్న

నాఁ బరగు నాడి నుండి ఘనంపు యోగ

మహిమఁ దెత్తుము తలపైకి మాన్య  గతిని

10.  

 

 

 

 

ఆఱు స్థానముల నున్న ప్రాణ వాయువులను సుషుమ్న నాడి నుండి పైకి వెడలించి యోగ బలము చే శిరస్సును జేర్తుము. 

 

 

 

 

పృధ్వి.

సుసూక్ష్మ మగు దేహ మంత మనుజుల్ దగన్ వీడి వా

ర్వెసం జని లయమ్ము వొందుదురు వేఁడ్క నీయంద నూ

ర్ధ్వ సధ్గగతి కాసతోఁ దల బిలమ్మునం బ్రాణముల్

ప్రసార మొనరించి సేంద్రియములం బరుల్ సేరఁగన్

11.   

 

 

 

 

సూక్ష్మ దేహమును వీడి భక్తులు నీ యందు లయ మవుదురు. స్వర్గముపై నాశ యున్న వారు శిరో రంధ్రము ద్వారా ప్రాణములు విడిచి సూక్ష్మ దేహముతో నూర్ధ్వ లోకముల కేఁగుదురు. 

 

 

 

 

తే.గీ.

చేరుదురు రవి లోకము సేసి పూజ

లగ్ని దిన శుక్ల పక్ష మహా శుభోత్త

రాయ ణాధి దైవములకు నంత ధ్రువ ప

దమ్మునకు భవత్పరులు ముదమ్ము మీఱ

12.   

 

 

 

 

అగ్ని, దిన, శుక్లప క్షోత్తరాయ ణాధి దేవతలకుఁ బూజ చేసి భక్తులు సూర్య లోకము సేరుదురు. అచట నీ యం దనురక్తి నుంచి ముదముగా నంతమున ధ్రువలోకము చేరెదరు. 

 

 

 

 

గజరాజ.

చని భక్తు లా మహర్జగతీ తలమునకుం

గనలంగ శేష వక్త్ర మహోష్ణ శిఖల నీ

ఘన సేవ సేయఁ జక్కఁగ మండక కమలా

సన లోక మందు వాసము కల్గును సతమున్

13.   

 

 

 

 

భక్తులు చని మహర్లోకమున కచట నాదిశేషుని  ముఖ జ్వాలలలో మండి నీ సేవ చక్కఁగఁ జేసి మండక బ్రహ్మ లోకమునకుఁ జేరి నివసింతురు. 

 

 

 

 

మాలిని.

నలువ పదము నీ దైనం బదం బందు నుండం

బ్రళయ మయిన చో నీ భక్తుఁ డందున్ సుముక్తిం

బెలుచ విఱిచి స్వేచ్ఛన్విశ్వభాండమ్ము మున్పే

ని లలిఁ గనును ముక్తిన్నెమ్మి యోజమ్ము మీఱన్

14.   

 

 

 

 

బ్రహ్మ పదమునఁ గాని నీ పదమునఁ గాని యుండ ప్రళయము వచ్చిన నీ భక్తుఁడు ముక్తినిఁ బొందును. లేక యతిశయముతో స్వేచ్ఛగా బ్రహ్మాండమును విఱిచి ప్రళయమునకు మునుపే ముదమున ముక్తిని బొందును.

 

 

 

 

ప్రియంవద.

అనల భూ గగన హవ్య వాహనాం

బు నుత తత్త్వములు మూరు మాయ నా

దనరు నావృతుల దాఁటి యోజ యో

గి నరుఁ డంతఁ గనుఁ గేళి నీ దరిన్

15.   

 

 

 

 

వాయువు భూమి యాకాశము నగ్ని నీరు మహత్తత్త్వములు మాయ యను నావరణములను క్రమముగఁ జని యోగి నీ చెంతకుఁ జేరును.

 

 

 

 

తే.గీ.

అర్చనలు సేయ నివ్విధి నణఁగ రెవరు

హరి జగన్నాథ కాపాడు మయ్య భక్తి

నుచ్చరింతు నీ గుణముల నుత్తమముగ

సచ్చిదాత్మ కానిల పుర సన్నివాస

16.   

 

 

 

 

ఈ విధముగా నర్చనలు చేసిన నెవ్వరు నశింపరు. జగన్నాథా మమ్ము కాపాడుము. గురు వాయూరు నివాసా! సచ్చిదాత్మకా! భక్తితో నీ గుణములను గీర్తింతును. 

 

 

ఇది విబుధ జన వినయ పోచి రాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయమున నాలుగవ దశకము.

 

 

 

 

 

శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము

(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము)

 

ద్వితీయ స్కంధ పరిచ్ఛేదము

దశకము. 5

విరాట్పురుషోత్పత్తి.

 

 

మహాస్రగ్ధర.

సమమై వర్తిల్లు సంవీక్షఁ ద్రిగుణము లిఁకన్ సర్వలోక క్షయంబౌ

సమయ ప్రాప్తమ్మునం దత్సమయమున నగున్ శౌరి నీ మాయయే లీ

నము వ్యక్తావ్యక్తముల్ కానఁ బడవు పరమానంద చిత్తా యిఁకన్ నీ

వమరుండై యుండఁగా రా వమృతమును మృతాహమ్ములుం జంద్ర కాంతల్

1.      

 

 

 

 

ప్రళయ కాలము సంప్రాప్తమైన మూడు గుణములు (సత్త్వరజస్తమో గుణములు) సమముగా నుండును. అప్పుడు నీ మాయ లీనమై యుండును.  వ్యక్తావ్యక్త రూపములు నుండవు. అప్పుడు మృతము గాని,  యమృతము గాని, రేయిగాని పవలు గాని యుండవు. నీ వొక్కడివే పరమాత్మా దృశ్య మగుదువు. 

 

 

 

 

ఉ.

కాలము ముగ్గుణమ్ములును గార్య జగమ్మును జీవ రాశులున్

లీలఁగ నుండు నీ మెయిని లీనము గా నవి రాదు లే వనన్

మూలపు శక్తి రూపుఁడ వమూర్తివి నీ హృది నుండ కున్నఁ ద

జ్జాలము పుట్టఁ బిమ్మటను శక్యమె యంబర పుష్ప భంగినిన్

2.     

 

 

 

 

కాలము, ముగ్గుణములు, కార్య ప్రపంచము, జీవ రాశులు, నీ శరీరమందే లీనమై యుండును. నీవు మూర్తివి  కాని మూల శక్తి రూపుఁడవు. అవి నీ లో లేవని యనలేము. గగన కుసుమముల వలె యవి లేని యెడల మఱల వాని సంభవ మెట్లు కలుగును?

 

 

 

 

తే.గీ.

అజున కవసాన కాలము నందు సృష్టి

సేయ నెంచ మాయ స్వయమ్ముఁజెందఁ గలఁత

త్రిగుణము లలరి ప్రకృతి శక్తియు నదృష్ట

ము తరుణము లుద్భవిల్ల నపుడు చెలంగు

3.     

 

 

 

 

బ్రహ్మ కపు డవసాన కాలము.  ఆ సమయమున నీవు సృష్టి చేయ నెంచఁగా నీ మాయ క్షోభ పడి త్రిగుణము లలర ప్రకృతి, శక్తి, యదృష్టము, కాలముల నుద్భవింపఁ జేయుటకుఁ జెలఁగును. 

 

 

 

 

ఉ.

నీ దగు సన్నిధాన రుచి నేర్పున మాయ సృజింప దాని కీ

వౌదువు సాక్షి జీవులకు నౌదువు బింబము నన్య మౌదువే

నీ దయఁ జోదితంబు నయి నెమ్మిని మాయ జగత్తు సృష్టికిన్

మేదిని బుద్ధి నాఁ బరఁగు మిన్నగు తత్త్వముఁ గల్గఁ జేసెనే

4.     

 

 

 

 

నీ సన్నిధాన ప్రభావమున మాయ సృష్టి చేయఁగా జీవులకు నీవు సాక్షివి. వాని ప్రతి బింబమే నీవు. అన్యుఁడవు కాదు. నీ దయచే జగత్సృష్టికిఁ బ్రేరితమై బుద్ధి యను మహత్తత్త్వమును మాయ సృజించెను.

 

 

 

 

చం.

త్రిగుణము లున్న బుద్ధి యను దివ్యపుఁ దత్త్వము నందు సత్త్వ మిం

పుగ వఱలంగ నే ననెడి భూరి వికల్పపుఁ దత్త్వ మేర్పడెన్

నెగడ తమో గుణ మ్మహము నివ్వటిలెన్ మది నీవు నే ననం

గ గురుత రాంతరమ్మున జగత్తున నంతట నీదు ప్రేరణన్

5.     

 

 

 

 

త్రిగుణములు గల బుద్ధి తత్త్వమున సత్త్వము పెంపొంద నహమ్మను తత్త్వ మేర్పడెను. పిదప నీ ప్రేరణమునఁ దమోగుణము పెరిఁగి యంహకార తత్త్వమున నీవు నే నను భేదము కన్పించెను. 

 

 

 

 

చం.

అహ మది యంత ముగ్గుణము లానఁగ నయ్యెను మువ్విధమ్ములే

రహి గొని సాత్త్వికమ్ము మును రాజిలఁ బిమ్మట రాజసమ్ము వే

విహితము నయ్యెఁ దామసముఁ బెంపెసఁగెన్ విభులై చెలంగ నం

త హరి దజంభ పాశి మరుదశ్విని పుత్రులు నా త్వగాళికిన్

6.     

 

 

 

 

అహంతత్త్వము త్రిగుణము లావేశింప సాత్త్వికము, రాజసము, తామసమని మూడు విధము లయ్యెను. చర్మము మొదలగు జ్ఞానేంద్రియములకు దిక్కు, రవి, వరుణుఁడు, వాయువు , నశ్వినులు  దేవతలై  చెలఁగఁగ

 

 

 

 

తే.గీ.

తనరి యగ్నీంద్ర మిత్రాచ్యుత ప్రజాప

తులును వాగాదులకుఁ బ్రభువు లయి యొప్పు

చుండ నంతఃకరణముల కుద్భవిల్లి

రబ్ధిజ విధి రుద్రులును జీవాత్మ లడరి

7.     

 

 

 

 

వాక్కు మొదలగు కర్మేంద్రియములకు నగ్ని, యింద్రుఁడు, మిత్రుఁడు, నుపేంద్రుఁడు, ప్రజాపతులు దేవతలుగా నంతఃకరణమునకు (మనస్సు, బుద్ధి, యహంకారము, చిత్తములు) చంద్రుఁడు, బ్రహ్మ, రుద్రుఁడు, జీవాత్మలు దేవతలుగాఁ బుట్టిరి. 

 

 

 

 

తే.గీ.

చిత్తము నహంకృతియు బుద్ధి చేరి మనము

సత్త్వగుణమునఁ బుట్టె నీ శక్తి వలన

రాజసము తామస గుణముల జనియించెఁ

దగ దశేంద్రియములు నభో ధ్వనియు నడరి

8.     

 

 

 

 

సత్త్వగుణమున నీ శక్తి వలనఁ జిత్తము, నహంకారము, బుద్ధి, మనస్సులు పుట్టినవి. రాజస గుణము వలన జ్ఞాన కర్మేంద్రియములు పదియుఁ, దామస గుణమున నాకాశపు ధ్వని పుట్టినవి.

 

 

 

 

చం.

అల ధ్వని నుండి పుట్టె దివి యందు జనించె స్పృశమ్ము దానినిం

జల మది వుట్టె స్పర్శనము శబ్దగుణమ్ముల దాన రూపముం

బొలసె బ్రకాశ మందు రసమున్ మఱియున్ సు కబంధ గంధ భూ

ములు వరుసన్ జనించె గుణముల్ గొని కారణ మీవ మాధవా

9.     

 

 

 

 

ధ్వని నుండి యాకాశము పుట్టినది. నభము నుండి స్పర్శము పుట్టెను. దాని నుండి శబ్ద స్పర్శ గుణములతో వాయువు, దాని నుండి రూపము, దాని నుండి తేజస్సు, దాని నుండి రసము, దానినుండి నీరు, నీటి నుండి గంధము భూమి  వాని వాని గుణములతోఁ గ్రమముగఁ బుట్టినవి. 

 

 

 

 

ఉ.

ఈవిధిఁ బంచ భూతములు నింద్రియ పంచకముం దదీయు లౌ

దేవత లెల్ల రేర్పడినఁ దీరుగ నండపు సృష్టిఁ జేసెడిం

జేవయు లేక వేఁడ నిను జేసితి వారిని శక్తిమంతులన్

నీ వటఁ జేరి వారలను నెమ్మినిఁ జేయ పసిండి యండమున్

10.  

 

 

 

 

ఈ విధముగాఁ బంచ భూతములు, పంచేంద్రియములు, వాని దేవతలు పుట్టినను సృష్టి చేయు శక్తి లేక యుండిరి. అప్పుడు నిన్ను వేఁడఁగా నీవు వారిలోఁ జేరి వారిని బ్రహ్మాండమును సృజింపఁ గల శక్తిమంతులను  జేసితివి. 

 

 

 

 

ఉ.

అండము వుట్టి వారిని సహస్ర శకమ్ములు నిల్చె నంత నీ

వండముఁ జేరి భాగముల నంతటఁ జేసి చతుర్దశమ్ములన్

మెండగు లోకముల్ కలుగ మీఱి విరాట్టను పేర వెల్గి తీ

వండగ నిల్చి కావుమ మహానిల పత్తన రాజపుంగవా

11.   

 

 

 

 

ఈ బ్రహ్మాండము వుట్టి వేల సంవత్సరములు నీటిలో మునిఁగి యున్నది. అంత నీ వా యండముఁ  జేరి పదునాల్గు భాగములు సేసి పద్నాలుగు లోకములను సృష్టించి విరాట్టను పేరున వెల్గితివి.  ఓ గురువాయూరు నాథా మాకండగా నిల్చి కావుము.

 

 

ఇది విబుధ జన వినయ పోచి రాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయమున నేనవ దశకము.

 

 

 

 

 

 

 

 

 

 

శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము

(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము)

 

ద్వితీయ స్కంధ పరిచ్ఛేదము

దశకము. 6

విరాట్పురుషుని జగదాత్మ తత్త్వము.

 

 

తే.గీ.

ఇట్లు పదునాల్గు జగముల నెలమి నూను

దేవ పాతాళ మగును ద్వదీయపాద

తల ముపరి భాగ మగు రసాతలము గుల్ఫ

యుగ మగు మహాతలమ పర మోత్త మాత్మ   

1.      

 

 

 

 

పరమాత్మా యిట్లు నీవు పదునాలుగు భువనములను ధరింతువు. నీ పాదములు పాతాళము, పాదోపరి తలము రసాతలము, చీలమండలు మహాతలమును  మఱియు

 

 

 

 

తే.గీ.

పిక్కలు తలాతల మ్మగు విరివి జాను

వులు సుతలము తొడ లగు వితల మతలము

లు పిఱుఁదులు ధర నాభి వేలుపుతెరు వగు

శక్రనిలయము వక్షము చక్ర పాణి

2.     

 

 

 

 

పిక్కలు తలాతలము, మోకాళ్ళు సుతలము, తొడలు వితలము నతలమును , బిఱుదలు భూమి, నాభి యాకాశము, వక్షము స్వర్గము మఱియు

 

 

 

 

తే.గీ.

నిత్య మయి మహర్జన తపస్సత్య లోక

ములు గళ ముఖ ఫాల వరాంగము లయి యితర

ములు భవ దితర తను దేశములఁ దనరెడు

దేవ మ్రొక్కు లిడుదు నీకుఁ గావు మయ్య

3.     

 

 

 

 

కంఠము మహర్లోకము, ముఖము జనలోకము, నుదురు తపోలోకము, శిరస్సు సత్యలోకములు నై విరాజిల్లుదువు. మిగిలిన దేశములు నీ తనువునం దితర భాగములుగా వెలసిన దేవా నీకు మ్రొక్కెదను నన్ను గావుము.

 

 

 

 

ఉ.

ఈశ్వర నీదు సోడు గన నిద్ధపు వేద చతుష్టయంబ యో

విశ్వవిధాయకా కురులు వెల్గెడు చెల్వగు నభ్ర రాశి వా

గీశ్వర గేహమై తనరు నింపగు భ్రూవులు నీ నిశాహముల్

శాశ్వతు లౌదు రెంచ సరసమ్ముగ నీదగు పక్ష్మనేత్రముల్

4.     

 

 

 

 

ఈశ్వరా నీ శిరోరంధ్రము వేదనిచయము, కురులు మేఘములు, నీ కనుబొమలు బ్రహ్మ నివాసము, రాత్రిపవళులు కనుఱెప్పలు, శాశ్వతుఁడగు సూర్యుఁడు నేత్రయుగము.

 

 

 

 

చంచల.

నీ కటాక్ష మోక్ష నైపుణీ భవమ్ము విశ్వ మెల్లఁ

బ్రాకటంపుఁ గర్ణముల్ ప్రభాస దిక్కు లెల్ల నెంచ

నా కవల్ నసా గుహల్ త వాధరద్వయమ్ము లోభ

భీకరత్రపల్ ద్విజాలి ప్రేతరాజు రిక్క లెంచ

5.     

 

 

 

 

నీ దయా వీక్షణముల వలన విశ్వము పుట్టినది. నీ చెవులు దిక్కులు, నీ ముక్కు రంధ్రములు కవలు లైన యశ్వినులు, నీ పెదవులు లోభము సిగ్గును, దంష్ట్ర దంతములు యముఁడు మఱియు నక్షత్రములును.

 

 

 

 

పంచచామరము.

ప్రభూ తవోత్స్మితమ్ము మాయ శ్వాస గాలి నీ రగున్

విభూ రసాల వాక్కు పక్కి విన్కులే స్వరమ్ము లౌ

నభశ్చ రేద్ధ సిద్ధు లాననమ్ము వహ్ని బాహువుల్

ఋభువ్రజమ్ములే స్తనమ్ములే జముండు దేవరా

6.     

 

 

 

 

దేవా నీ చిరునవ్వు మాయ, నీ నిట్టూర్పు గాలి, నీ నాలుక నీరు, పక్షుల కలకలమే నీ వాక్కు, గగనయాన సిద్ధులు నీ స్వరములు, నీ  ముఖ మగ్ని, నీ భుజములు దేవతా సమూహము మఱియు నీ స్తనములే యముఁడు.

 

 

 

 

మేదిని.

నలిన దళాక్ష నీ వెనుక నా నధర్మమే యా

కలువల ఱేఁడు చిత్తమ యగమ్య మౌను హృత్సూ

న లలిత షండ మయ్య వననాథుఁ డౌను నీ కు

క్షి లలి సుగుప్త భాగములు సెప్ప బ్రహ్మమిత్రుల్

7.     

 

 

 

 

పద్మాక్షా యధర్మము నీ వీపు, చంద్రుఁడు నీ మనస్సు, నవ్యక్తమే నీ హృదయ పద్మము, సముద్రుఁడు నీ కడుపు, బ్రహ్మ మిత్రులు నీ శిశ్న వృషణములు. 

 

 

 

 

చం.

వసనము లెంచ సంధ్యలు కృపావనధీ మృగముల్ పిఱుందులే

యసుర మహాంగ ఘోటక వరావళి గోరులు నీదు పోక లే

యసుర గణఘ్న! కాల మగు నారయ నాలుగు వర్ణముల్ దగం

గుసుమ సమాస్య బాహువర ఘోరతరోరు సుపాదజమ్ములే

8.     

 

 

 

 

సంధ్యలు రెండును నీ వస్త్రములు, జంతువులు నీ పిఱుదలు, నేనుఁగు, నొంటె, గుఱ్ఱము మొదలగునవి నీ గోరులు, నీ గమనమే కాలము, నాలుగు వర్ణములు వరుసగా నీ ముఖము, బాహువులు, తొడలు, పాదముల నుండి పుట్టినవి.

 

 

 

 

చం.

లయమును సృష్టి పాలనము లౌకికమౌ క్రియ లౌను నీకు నీ

దయిన పరాక్రమంబ యసురావలి యస్తి నికాయమౌ శిలో

చ్చయ మట నాడులౌ నదులు సాల సమూహము నీదు రోమముల్

జయ మగుఁ గాక చక్ర ధర చారు తనూ విభ వైక దుర్జయా

9.     

 

 

 

 

సృష్టి స్థితి లయములే నీ కార్యకలాపములు. అసుర గణమే నీ పరాక్రమము, పర్వత సమూహములే నీ యస్తి సంచయము, నదులు నీ నాడులు, వృక్షములే నీ రోమములు. అట్టి విరాడ్రూపము కలవాఁడా నీకు జయ మగుఁ గాక.

 

 

 

 

ఉ.

కంటికిఁ గానిపించెడు జగమ్మిది యెల్లయు నీదు మేన మా

వంటి జనమ్ములుం బనులఁ బన్నుగ నిన్ను స్మరింప నొప్పు నీ

వుంటివి యంతరాత్మలను నొప్పుగ నిర్మల చిత్త సత్తమా

యొంటిని నున్న రోగముల నుక్కున వాయు పురీశ మాన్పుమా

10.  

 

 

 

 

దేవా కంటికి కనిపించు జగమెల్ల నీ శరీరమే. మా వంటి వారు పనుల నన్నింటిలో నిన్ను స్మరించు  చుండ నొప్పును. నీవు సమస్త జీవ రాశుల యంతరాత్మలలో నుందువు.  గురువాయూరు నాథా మా రోగములను శీఘ్రముగాఁ బాపుము. 

 

 

 

ఇది విబుధ జన వినయ పోచి రాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయమున నాఱవ దశకము.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము

(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము)

 

ద్వితీయ స్కంధ పరిచ్ఛేదము

దశకము. 7

హిరణ్య గర్భోత్పత్తి. 

 

 

ఉ.

పుట్టితి వీవు చక్రధర భూరి చతుర్దశ లోక జాలమై

బుట్టితి వంత ధాతగను బుణ్యపు సత్య జగమ్ము నూర్ధ్వముం

బట్టి హిరణ్యగర్భుఁ డన బ్రాణి నికాయపు సృష్టి నెంచుచున్

గట్టిగ నా రజోగుణ వికారము నొంది జగత్రయమ్మునన్

1.      

 

 

 

 

దేవా నీవు చతుర్దశ భువనముల రూపులతోఁ బుట్టితివి. అంత బ్రహ్మగా సత్యలోకమునఁ బుట్టి హిరణ్యగర్భుఁడ వని ప్రసిద్ధి చెందితివి. రజో గుణ ప్రభావమున ముల్లోకములఁ బ్రాణి రాశిని సృజింప నెంచితివి.

 

 

 

 

ఉ.

ఆ విధి సంభవించి చతురాననుఁ డారయ లేక చేత నో

ద్భావ విధాన మించుకయుఁ దాపము నొంద చిరమ్ము దేవ దే

వా విధి కంత జేయుమ తపమ్మని వీనుల విందుగన్ నభః

పావన మార్గ వాక్కులను బన్నుగఁ  దేటపడంగఁ  జేసితే

2.     

 

 

 

 

ఆవిధముగా జనించి  బ్రహ్మ సృష్టించు విధానమును దెలియక తాపము చెంది యుండఁగా నంత నాకాశ మార్గమునఁ దపము చేయు మను పల్కులను వినిపింపఁ జేసితివి. 

 

 

 

 

ఉ.

ఎవ్వని పల్కు లివ్వి యని యెల్లెడ నీర నిమగ్న విశ్వ మం

దవ్వనజోద్భవుండు గని యారయ లేక తదర్థ వేదియై

నొవ్వ నొనర్ప వే సమ లనూహ్య తపమ్మును మెచ్చి వాని నీ

వవ్వలి విష్ణుధామము మహాద్భుత లోకముఁ జూపితే హరీ

3.     

 

 

 

 

 

 

అంతట నీరు నిండిన విశ్వములో నెవ్వని పల్కు లివి యని నలినజుఁడు దిక్కులు చూచి కానక యా పల్కుల యర్థము నెఱిఁగి నొవ్వులకు నోర్చి వేలసంవత్సరము లనూహ్యముగాఁ దపము చేయఁగా దేవా నీవు మెచ్చి బ్రహ్మదేవునకు సత్య లోకమున కావల నున్న యద్భుతమైన నీ విష్ణు ధామమును జూపితివి.

 

 

 

 

మ.

అట మాయల్ కనిపింప వెచ్చటను విశ్వౌఘమ్ముపై నుండు న

చ్చట శోకాగ్రహ మోహ భీతులను గాంచన్నేర రెన్నండు నం

చటఁ జెప్పం బడుఁ బాఱు సంతతము బ్రహ్మానందమే వెల్గు న

చ్చట రోచిస్సులుఁ బొందుఁ గాక విజయోత్సాహమ్ము వైకుంఠమే

4.     

 

 

 

 

ఆ వైకుంఠము నందు నెచ్చటను మాయ లుండవు. విశ్వరాశికి నది పైన నుండును.  అక్కడ శోకము, కోపము, మోహము, భీతి మున్నగు నవి కనఁబడ వని చెప్పుదురు. నిత్యము నక్కడ బ్రహ్మానందమే చెలఁగును. అది విజయోత్సాహములతో విరాజిల్లును.

 

 

 

 

చం.

అలరి చతుర్భుజమ్ముల సమంచిత నీల తనుప్రభా ద్యుతుల్

చెలువపు స్వర్ణ భూషణ విశేషరుచుల్ తనరం ద్వదీయ భ

క్తు లలరి యుండ నున్నతపుఁ గూటము నందు నిరస్త పాప సం

కులము వికుంఠ ధామమునకుం బరమంపు జయమ్ము కల్గెడిన్

5.     

 

 

 

 

అచ్చట చతుర్భుజములతో నీలదేహ కాంతులతో నందమైన స్వర్ణ భూషణములతో నీ భక్తులు దనరి యుందురు. ఉన్నతమైన గృహము నందు పాపము లెవ్వియు నుండవు. అట్టి దైన యా వైకుంఠమునకు నిత్యము జయ మగు గాక. 

 

 

 

 

ఉ.

దివ్య వధూమణుల్ కొలువ దేహపుఁ గాంతులు చంచ లాభమై

యవ్యయమై జనోన్మద మహాత్మ్యత వెల్గ నిజార్యు భవ్యమౌ

నవ్య పదాబ్జ సౌరభమునం దమి నుంచును లక్ష్మి యా నివా

సావ్యయ దివ్య ధామము మహా పద మింపుగ నా కొసంగుమా

6.     

 

 

 

 

రమాదేవి యా వైకుంఠమున దేవతా స్త్రీలు కొలుచు చుండఁగా మెఱపు కాంతులఁ బోలు జన సమ్మోహన కరమైన దేహకాంతులతో వెల్గుచుఁ దన నాథుని పాదాబ్జ సేవా రక్తి నుండును.   అట్టి లక్ష్మీదేవి నివాస స్థానమైన వైకుంఠ పదము నా కొసంగుమా.

 

 

 

 

చం.

అజునకుఁ జూపి తీవట నిజాలయ మందును రత్నపీఠ మం

ద జలజనేత్ర కోట్యధిక హర్ముట సన్నిభ భాసమానమౌ

రజత కిరీట కౌస్తుభ వరద్యుతి తో సిరిమచ్చ రూప మం

త జగతి కారకా కృపను దానిని భక్తుఁడ నాకుఁ జూపవే

7.     

 

 

 

 

 

పద్మాక్షా! బ్రహ్మ దేవునకు నీవు నీ ధామమున రత్నపీఠమున నాసీనుఁడవై కోటి సూర్యుల కాంతులతో వెల్గు స్వర్ణకిరీటము, కౌస్తుభ మణి, శ్రీవత్సము తోఁ బ్రకాశించు నీ రూపమును జూపితివి. నీ భక్తుఁడ నైన నాకును నీ రూపమును జూపుము.

 

 

 

 

చం.

గురు ఘన నీల రాత్రిసుమ కోమల గాత్ర రుచిప్రభా దిశా

వర కరు ణాత్త హాస రుచి భాసిత నిర్మల సుంద రాననా

దర స గ దారి పద్మ ధర దార్ఢ్య భుజవ్రజ నిన్ను గాంచఁగన్

సరసిజజుండు సంతసిలెఁ జక్కఁగఁ బాపుమ నాదు రోగముల్

8.     

 

 

 

 

గొప్పదైన మేఘ శ్యామముతోఁ గలువల వంటి మృదు వైన దేహపుఁ గాంతులతో వెల్గు దిక్కులు గలవాఁడా! కరుణా రసార్ద్ర మందహాసముతో వెల్గు ముఖము గలవాఁడా! గద తోఁ గూడి  శంఖము, చక్రము, పద్మములను ధరించిన బలమైన భుజములు గలవాఁడా! నిన్ను జూడఁగనే బ్రహ్మ దేవుఁడు  సంతస మందెను. అట్టి యో హరీ ! నా రోగములను బాపుమ.

 

 

 

 

చం.

అటఁగని నీ పదాబ్జముల నబ్జజుఁ డంత విమోహియై పడెం

బటుతర సంభ్రమమ్మున నపార ముదమ్మున ధన్యుఁడై యనెన్

దిట వగు విద్య నిమ్ము సురదేవ సృజింప జగమ్ము నిర్గుణా

పటు గుణ తెల్పు నీ దగు స్వభావము నట్టి హరిన్ భజించెదన్

9.     

 

 

 

 

బ్రహ్మ నీ పదాబ్జములను గని సంభ్రమాశ్చర్యములతో విమోహియై సంతోషముతో నిట్లు పల్కెను. ఓ దేవదేవా జగములను సృజింపఁ గల్గు పటు తరమైన విద్య నిమ్ము. నిర్గుణా నీ స్వభావమును దెల్పుము. అట్టి హరిని నేను భజించెదను.

 

 

 

 

లయవిభాతి.

అరుణ చరణాబ్జములఁ, బరగ వినయమ్ము, వడ సరసిజజు హస్తమునఁ గర కమల మత్యా

దరముగఁ దగిల్చి యన హరి కమలజా తెలివి విరివి నగుఁ జిక్కవయ కరుమముల కారన్

స్థిరముగ మదిన్నిలిచితి రహిని వహించె మఱి సరసిజభవుం డపుడు గరము, నలినాక్షా

పరమ మగు ప్రేరణ మడరిచితివి సృష్టికి,మధురిపు ముదమిమ్ము కరివరద నుతియింతున్

10.  

 

 

 

 

 

 

వినయము మీఱఁగ బ్రహ్మ  హరి యరుణ చరణాబ్జములపైఁ బడ, హరి తన కర కమల మత్యాదరముగ బ్రహ్మ హస్తమునఁ దగిల్చి  యిట్లు పలికెను. కమలజా! నీకు దెలివి విరివిగా నగును. కర్మపు జెఱలఁ జిక్కవు. స్థిరముగ నీ మదిని నేను నిలిచితిని. హరి యనఁగ నిట్లు బ్రహ్మ యపుడు మిక్కిలి సంతసించెను . నలినాక్షా! జగతి సృష్టికి పరమ మగు ప్రేరణము కలిగించితివి. మధురిపు! కరి వరద! నిన్ను నుతింతును నాకు హర్షము నిమ్ము.

 

 

 

ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయమున నేడవ దశకము.

ద్వితీయ స్కంధ పరిచ్ఛేదము సమాప్తము.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము

(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము)

 

తృతీయ స్కంధ పరిచ్ఛేదము

దశకము. 8.  

ప్రళయ జగత్సృష్టి ప్రకార వర్ణనము. 

 

 

తే.గీ.

ప్రళయ మంత మైనఁ దిరిగి బ్రహ్మ కల్ప

మంత నారంభ మగు మొద లబ్జజుండు

పుట్టి నీ వలనన వేదములను బడసి

చేయుఁ బూర్వ కల్పముఁ బోలు సృష్టి దేవ

1.      

 

 

 

 

మహా ప్రళయము గడచిన పిదప తిరిగి బ్రహ్మ కల్పము ప్రారంభ మగును. నీ వలన నబ్జజుఁ డవ్విధి బుట్టి  వేదములను బడసి పూర్వపు రీతి సృష్టి చేయును.

 

 

 

 

మధ్యాక్కర.

యుగముల చౌకము లెంచ నొక్క వేయి యయిన దినము

నగు బ్రహ్మ కంతియ రాత్రి యగును గడచె నవి పెక్కు

జగముతోఁదాను నీ లోనఁ జక్క లీన మయి పరుండు

నగపడిన నిశీధి దాని నంద్రు నైమిత్తిక లయము

2.     

 

 

 

 

నాలుగు యుగముల సమూహము వేయి గడచిన బ్రహ్మకు నొక పగలు. రాత్రియు నంతియ కాలము. అవి యిప్పటికి పెక్కులు గడచినవి. రాత్రి వేళ జగముతోఁ బాటు తాను నీయందు లీనమై పరుండును. దానినే నైమిత్తిక ప్రళయ మందురు.

 

 

 

 

మధ్యాక్కర.

 

మావంటి వా రుదయమున మానక నిత్య కృత్యములఁ

బోవు విధమ్మున బ్రహ్మ మూరు సృష్టింప జగతిని

నీవ వహింపఁ గృప భృగు నిభులు నజుని భంగి చేత

నావస్థ నిద్రల నుందు రలరి పూర్వ స్మృతులు దనర

3.     

 

 

 

 

మా వంటి వారు ప్రతి దినము సేయు పనుల పగిది నీ యనుగ్రహమున బ్రహ్మ జగతిని సృష్టించును.  భృగు మహర్షి వంటి వారును బ్రహ్మ వలె చేతనులు నిద్ర లందు నుందురు. వారికి పూర్వ స్మృతి యుండును.

 

 

 

 

తే.గీ.

కడచిన విపు డేఁబది యేండ్లు కంజునకు వ

యోర్ధము పరార్ధ మందురు యోగి వరులు

దీని పూర్వార్ధ రాత్రి గతించి పగలు

రాఁగఁ జను నీ విలాసములను వచింతు

4.     

 

 

 

 

ఇప్పుడు బ్రహ్మకు నేబది యేండ్లు గడచినవి. దీనిని పరార్థ మందురు. పూర్వ పరార్థపు రాత్రి  గడచిన పిదప పగలు వచ్చును. ఆ పగటి యందలి నీ విలాసములను వచింతు నిప్పుడు.

 

 

 

 

తే.గీ.

కమల సంభవుం డరసి పగటి ముగింపు

నెంచి శయనింప సంలీన మెలమి నయ్యె

సకల జగతియు నీదైన జఠర మందు

నేక సాగర మయ్యెను లోక మంత

5.     

 

 

 

 

బ్రహ్మ పగలు పూర్తి కాఁగ శయనించెను.  జగత్తంతయు నీ కడుపు నందు లీన మయ్యెను. లోక మంతయు నొక్క సాగర మయ్యెను.

 

 

 

 

ఆ.వె.

వేయి పడగల పయి వెలసి నిద్రింతు వొం

దంగ నీ వమిత ముదపు టనుభవ

మెల్ల యోగ నిద్ర యుల్లము ముద్రింప

విశ్వ మెల్ల మునుఁగఁ బేయ మందు

6.     

 

 

 

 

నీ మనస్సు  బ్రహ్మానందమును బొంద యోగనిద్ర వహించి యాది శేషుని వేయి పడగల పై నిద్రింతువు. విశ్వ మంతయు నీటిలో మునిఁగి యుండును.

 

 

 

 

కం.

నిదురించిన శక్తుల తో

నిదురించితి సకల శక్తి నిలయా ప్రళయం

బది ముగియఁ బ్రభోధింపఁగ

నుదితం బది కాలశక్తి యొప్పుగ నీచే

7.     

 

 

 

 

శక్తులకు నన్నింటికి నిలయ మైన వాఁడా శక్తు లన్నియు నీలో నిదురింపఁ బ్రళయ మంతము కాఁగ మేలుకొలుప మని కాల శక్తి నీచేఁ జెప్పఁడినది, నీవు నిదురించితివి.

 

 

 

 

తే.గీ.

తొంటి నుండి మేల్కొని నట్టి దొడ్డ కాల

శక్తి యుగ చతుష్క సహస్ర సమయ సుప్తు

నిన్ను మేలుకొలిపె రజనీ క్షయమున

వేఁడ మును నీవు మన్నించి విశ్వనాథ

8.     

 

 

 

 

తొలుత నుండియు మేల్కొని యున్న కాలశక్తి వేయి మహా యుగములు పూర్తి యగు రాత్రి గడవఁగనే  నీవు వేఁడిన విధము  నిన్ను మేల్కొలిపినది.

 

 

 

 

తే.గీ.

పన్నుగను లేచి నీటఁ బరున్న దేవ!

కానఁ బడె లీన మైన లోకములు నెల్ల

సూక్ష్మ రూపమ్ములు వహించి చోద్యముగ న

గపడ జగములు నీలోనఁ గాంచి తీవు

9.     

 

 

 

 

అప్పుడు దేవా చక్కఁగ లేచి నీలో లీన మైన లోకములు చోద్యముగ సూక్ష్మ రూపములతో నీ లోపల నగపడ వానినిఁ గాంచితివి.

 

 

 

 

తే.గీ.

మొలిచె దివ్యాబ్జ మర్ధ ముకిలిత మంత

నీదు నాభి రంధ్రము నుండి నెమ్మి దాని

యందు నిముడ సూక్ష్మాకృతి నడరి యెల్ల

వస్తువులు మున్ను నీయంద పమ్మినవియ

10.  

 

 

 

 

దేవా నీ నాభి రంధ్రము నుండి యప్పుడు సగము విరిసిన దివ్య పద్మ మొకటి మొలిచినది. దానిలో నీ యందు మున్నున్న సమస్త వస్తువులు సూక్ష్మ రూపమున నున్నవి. 

 

 

 

 

తే.గీ.

పద్మ కుట్మల మంత ప్రభవము నొంది

నీ తను లత నుండి యెగసి నీర మందు

నుండి విరిసి తనదు వెల్గు లుండ నెల్లె

డలను హరియించె నచ్చటఁ గల తమమ్ము

11.   

 

 

 

 

నీ తను లత నుండి పద్మము మొలిచి యంత నీటి నుండి తేలి విరిసినది. దాని కాంతులతో నంతట నున్న చీకటిని బాఱఁద్రోలినది.

 

 

 

 

తే.గీ.

చిత్ర మన్యములకు నెంచఁ బత్రములు వి

రియ కరమ్ము నీ వీర్యంపు ధృతి సరోజ

మందు నుద్భవించెను విధి యబ్జజుండు

వేద చయము స్వయ మెఱిఁగె విపులముగను

12.   

 

 

 

 

అది యన్యముల కన్నఁ జిత్రముగ నున్నది. పత్రములు వికసింపఁగ నీ బలమున సరోజ మందు బ్రహ్మ యుద్భవించెను.  నీ యనుగ్రహమున వానికి వేద స్వరూప మెల్లయు నవగత మయ్యెను.

 

 

 

 

తే.గీ.

బ్రహ్మ కల్పాది సృష్టించి బ్రహ్మ దేవు

నవ్య యానంత విశ్వేశ దివ్య రూప

సృష్టి చేయించి తీవు నా క్లిష్ట రోగ

చయము వాపు మనిల పురేశ్వర పరాత్మ!

13.   

 

 

 

 

అనంతా బ్రహ్మదేవు నట్లు కల్పాదిని సృష్టించి సమస్త సృష్టిని నీవు వానిచేఁ జేయించితివి. అట్టి గురువాయూరు నాథా పరాత్మా నా రోగములను బాపి రక్షించుము.

 

 

ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయమున నెనిమిదవ దశకము.

 

శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము

(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము)

 

తృతీయ స్కంధ పరిచ్ఛేదము

దశకము. 9

జగత్సృష్టి ప్రకార వర్ణనము. 

 

 

తే.గీ.

నలినజుండు నిలిచి నీదు నాభి నలిని

వనధి నిప్పద్మ మెట్లుండె నని వెఱఁగు వ

డి తిలకింప నల్దిశలు వివృత ముఖుఁ డయి

యంత నష్ట దృక్కులఁ జతురాస్యుఁ డాయె

1.      

 

 

 

 

పద్మ సంభవుఁ డంత నీ నాభి లోని పద్మమున నిల్చి యీ కడలిలో నీ  పద్మ మెట్లు వచ్చెనని యాశ్చర్య పడి నాలుగు దిక్కు లందు ముఖముల నుంచి  నెనిమిది కన్నులతోఁ జూచి నందున నాతఁడు చతురాననుఁ డయ్యెను. 

 

 

 

 

తే.గీ.

కమల మవ్విధి మున్నీటఁ గదల నరసి

దాని కాధారపుఁ దనువు గాన లేక

తాను నిస్సహాయమ్ముగ దాని కుక్షి

నలరి నళిని యెక్కడి దని యరయఁ జాగె

2.     

 

 

 

 

సముద్రమునఁ బద్మమును జూచి, దాని కాధార మైన నీ తనువుఁ జూడలేక  తాను కేవలము నిస్సహాయునిగా నుండెనని యెంచి పద్మ మెక్కడి దని చింతింపఁ జాగెను. 

 

 

 

 

తే.గీ.

తథ్యముగఁ గులీన మగు నిత్తామర యని

యెంచి యేదేని కారణ మంచితమ్ము

వెదక నెంచి నాళ బిలము వెంట నేఁగఁ

జారు వపువు గనఁడు యోగ శక్తి నజుఁడు

3.     

 

 

 

 

తథ్యముగ నీ తామరసము మంచి కులమునది యై యుండునని తలఁచి నాళము వెంట నేఁగి యేఁగి తనదు యోగ బలమునను గూడ నిన్ను గనుఁ గొన లేక పోయెను.

 

 

 

 

తే.గీ.

నాళ వివర మార్గమ్మునఁ గేళి లీల

వంద యేండ్లు వెదకి కాన కందు నెద్ది

మఱలి తమ్మి కుక్షి నిలిచి మౌన మూని

కోరె నేకాగ్రతను నీదు కూర్మి దయను

4.     

 

 

 

 

ఆ నాళము గుండా యాట వోలె వంద యేండ్లు వెదకి దేనినిఁ జూడ లేక తిరిగి పద్మ గర్భమునకుఁ  జేరెను. అప్పుడు మౌనముగా నేకాగ్ర చిత్తమున నీ దయను బ్రేమను వేఁడుకొనెను.

 

 

 

 

తే.గీ.

నూరు దివ్య వత్సరము లేపారి తపము

సేసి బోధ మరసి బ్రహ్మ సెంది హృష్టి

గాంచె నద్భు తాపూర్వ భోగ చయ సంస్థి

తమ్ము నీ దివ్య రూప మంత నిజ హృదిని

5.     

 

 

 

 

నూరు దివ్య సంవత్సరములు తపస్సు చేసి జ్ఞానము నొంది పడగల సమూహమున నున్న నీ దివ్య రూపము నంతఃకరణమునఁ గాంచి సంతసించెను.

 

 

 

 

తే.గీ.

కటక కేయూర హార మకుట కిరీట

రత్న మేఖలా పీతాంబర గళ కౌస్తు

భాభరణ సువిలసి తోత్ప లాభ తనువు

న నిను నలువ యరసె నట్టి నిను గొలిచెద

6.     

 

 

 

 

నీవు కటకములు, కిరీట మకుటములు, కేయూరములు, హారములు, రత్నములు పొదిగిన మొలనూలు, పీతాంబరము, కౌస్తుభము, మున్నగు నాభరణములతో వెల్గుచు నుంటివి.  అట్టి నిన్ను నేను గొలిచెదను.

 

 

 

 

తే.గీ.

శృతి నిచయ వినుత విభవ శ్రీపతి హరి

జయము విభు కంటి ని న్నదృష్టమున నంచు

సృష్టి కార్య నిపుణత నిచ్చి దయఁ జూప

వేఁడె నజుఁ డట్టి నీవు కాపాడు మయ్య

7.     

 

 

 

 

అంత బ్రహ్మ వేదములచే నుతింపఁబడు వాఁడా నా యదృష్టమున నిన్ను జూడఁ గలిగితిని. ప్రభూ నీకు జయ మగును. నాకు జగమును సృజించు నైపుణ్యమును బ్రసాదించు మని వేఁడుకొనెను. అట్టి యో పరమాత్మా నన్ను గాపాడుము.  

 

 

 

 

తే.గీ.

తిరిగి తప మాచరించు విధీ లభించు

భువన రచ నైక దక్షత పూర్ణముగను

గోరికలు దీరు నీకు నేపారు భక్తి

యన్న నీ గిరల నజుఁడు హర్ష మొందె

8.     

 

 

 

 

ఓ నలినజా తిరిగి తపమును జేయుము. అప్పుడు నీకు భువనములను బుట్టించు దక్షత పూర్తిగఁ  గలుగును. నీ కోరిక తీరును. భక్తియుఁ గలుగును. ఆ మాటలకు బ్రహ్మ మిక్కిలి సంతసించెను. 

 

 

 

 

తే.గీ.

తపము దివ్యాబ్దములు నూఱు తమ్మిచూలి

సేసి మతి తపో బలముల వాసిఁ బడసె

ననిల జల కంపి తాబ్జము నారసి యజుఁ

డంతట భవద్బల మహిమ నణఁచె రెంటి

9.     

 

 

 

 

అంత బ్రహ్మ నూరు దివ్య సంవత్సరములు తపము చేసి తపోబలము బుద్ధులను బొందెను. అప్పుడు వాయువు నీరములచే కదలాడు పద్మమును జూచి నీ బలమహిమచే బ్రహ్మ వాయువును నీటిని రెంటిని నణఁచెను.

 

 

 

 

తే.గీ.

నీ యనుగ్రహమునఁ జేసె నీ జగత్ర

యమ్ము కమలమ్ము చేతనె నెమ్మి జీవ

తతి సృజింపఁ దొడఁగెఁ బ్రోవు దయఁ గృపా మ

తీ మరుత్పురేశ దయార్ద్ర దృక్కు లడర

10.  

 

 

 

 

అంత నీ యనుగ్రహమున బ్రహ్మ తామర పూవు తోనే ముల్లోకములను సృజించెను. జీవ రాశులను సృజింపఁ బ్రారంభించెను. ఓ గురువాయూరు నాథా దయా మతీ నీ కృపా వీక్షణములతో నన్ను గావుము.

 

 

 

ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయమునఁ దొమ్మిదవ దశకము. 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము

(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము)

 

తృతీయ స్కంధ పరిచ్ఛేదము

దశకము. 10

సృష్టి భేద వర్ణనము. 

 

 

చం.

బల మది నీ యనుగ్రహ మపారము నుండఁ జెలంగ సృష్టి నా

నలినజుఁ డద్భుత స్థిర వనస్పతి షండ మృగ ద్విజావలుల్

సలలిత కాశ్యపేయ సుర చారణ పన్నగ సంచ యాదిగాఁ

జలిపెను జీవ భేదములఁ జక్కఁగ దేవ! వికుంఠ రాణ్మణీ! 

1.      

 

 

 

 

వైకుంఠవాసా నీ యనుగ్రహ ముండగా నీ బలము చెలంగఁగ బ్రహ్మ దేవుఁ డద్భుతమైన సృష్టినిఁ జేసెను. స్థిరముగా నుండు వృక్షములు, మృగములు, పక్షులు, కశ్యప సంతానము సుర చారణ పన్నగ సమూహములు మున్నగునవి సృజించెను. ఇట్లు జీవ భేదములను గల్పించెను. 

 

 

 

 

ఉ.

మాయఁ గ్రహం బహమ్మును నమర్షము రాగము భీతు లైదు ని

త్యాయత రీతి జీవుల విహారము సేయగఁ దామసమ్మునం

బాయక నీదు పాదములు పద్మభవుండు స్మరించె భక్తితోఁ

బాయఁగ నెంచి దుర్భరపు బాధలు మానస శుద్ధిఁ గోరుచున్

2.     

 

 

 

 

మిధ్యను గ్రహించుట, యహంకారము, కోపము, రాగము, భయ మను నైదు తామస గుణములు జీవులలో విహారము  సేయగా బ్రహ్మ యీ బాధలు తొలఁగుటకుఁ, దన మనశ్శుద్ధినిఁ గోరుచు   భక్తితో నీ పాదములను విడువక స్మరించెను.

 

 

 

 

తే.గీ.

ఘన ముని వరేణ్యులఁ గమలగర్భుఁడు మన

మున సనక సనందన సనాతన సనత్కు

మారుల సృజించి సృష్టింపఁ గోర వారు

వినరు నీ పాదముల భక్తి విస్తరిల్ల

3.     

 

 

 

 

అంత బ్రహ్మ మునివరేణ్యు లైన సనకుఁడు, సనందుఁడు, సనాతనుఁడు, సనత్కుమారులను దన మనస్సంకల్పమున సృజించెను.  వారిని సృష్టినిఁ గొనసాగింపుఁ డనిన వారు నీ యందలి భక్తి తత్పరత నందుకు నంగీకరింప లేదు.

 

 

 

 

తే.గీ.

అంత వచ్చిన కోపము నాఁప నజుని

కనుబొమల మధ్య మృడుఁడు నీ కలను బుట్టి

తెలుప మనెఁ దన పేళ్లును స్థలము లేడ్చి

రుద్రుఁ డనఁ బడె నాతఁడు రోదనమున

4.     

 

 

 

 

అంత నజుఁడు వచ్చిన కోపము నాపుకొనఁగ నతని కనుబొమల నడుము నుండి నీ యంశముతో రుద్రుఁడు పుట్టి యేడ్చుచు దన పేరులను మఱియు నుండు స్థలములను దెలుప మనెను. మిక్కిలిగ రోదనము చేయుటచే నాతఁడు రుద్రుఁ డని ప్రసిద్ధుఁ డయ్యెను.

 

 

 

 

మధ్యాక్కర.

రుద్రులను బదునొకండు రూపముల సృజించి యంత

భద్రాంగనల వారి కిచ్చి భార్యల నీ ప్రేరణంపు

ముద్ర తనర సాదరముగ ముదమార ననె వారి తోడ

రుద్రులారా సృష్టి కార్య రోచిస్సు లగుఁ డింక మీరు

5.     

 

 

 

 

బ్రహ్మ యట్లు పదునొకండు రుద్రులను వారికిఁ దగిన భార్యలను సృజించి, రుద్రులతో నాదరముగా   సృష్టి కార్యములను జేయుఁ డని పలికెను.

 

 

 

 

ఉ.

అంతట సృష్టి సేసిరి భయాంగక రుద్ర చయమ్ము నిండ వే

వింతగ ముజ్జగమ్ములును భీకర చేతన సంచయమ్ములన్

వంత నజుండు నీ గిరలఁ బల్కెను సృష్టిని యాపుఁ డింక మీ

రెంతయు భక్తితోఁ దపము నింపుగఁ జేయుఁడు మంగళం బగున్

6.     

 

 

 

 

అంత వారు భయంకరాకారములు గల రుద్ర గణములను ముల్లోకములు నిండ సృష్టించిరి. అంత బ్రహ్మ భీతిలి నీ పనుపున వారిని సృష్టి నింక నాపుఁ డని చెప్పి మంగళము లగుటకుఁ దపముల నాచరించుఁ డనెను.

 

 

 

 

తే.గీ.

అత్రియు మరీచియును గ్రతు వంగిరసులు

సెలఁగి పులహ పులస్త్య వసిష్ఠ భృగువు

లింక దక్షుఁడు నారదుఁ డెలమి నీకు

దాసుఁ డబ్జ జాంగముల నుద్భవులు వారు

7.     

 

 

 

 

అత్రి, మరీచి, క్రతువు, నంగిరసుఁడు, పులహుఁడు, పులస్త్యుఁడు, వసిష్టుఁడు,  భృగువు, దక్షుఁడు, నీ దాసుఁ డైన నారదుఁడు బ్రహ్మ దేవుని వివిధాంగముల నుద్భవించిరి.

 

 

 

 

మధ్యాక్కర.

సృజియించి ధర్మ కర్దముల సృష్టికర్త పిదప వాణి

ని జలజాక్షి సృజించి కాముని వశుఁ డయ్యె నకట గాంచి

నిజ సుతు లంతట నుడువ నీతి దక్ష సనక ముఖులు

నజుఁడు వీడి తమము శాంతి నందె నీదు కరుణ వడసి

8.     

 

 

 

 

మఱియు ధర్ముని, కర్దముని సృజించి పిదప సృష్టికర్త సరస్వతిని సృజించి యామెను గాంచి కామవశుఁ డయ్యెను. తన పుత్రు లది గాంచి యాక్షేపింపఁ దమోగుణము వీడి నీ కరుణ తో శాంతిని బొందెను. 

 

 

 

 

తే.గీ.

శ్రుతు లఖిల విద్యలు పురాణ తతు లొనర్చి

ముఖ చతుష్కములను జతుర్ముఖుఁడు నేర్పె

సుతుల కంత నెలమి నింక నతఁ డరయక

సృష్టి వృద్ధి భవత్పాద సేవఁ జేసె

9.     

 

 

 

 

వేదములను సకల విద్యలను బురాణములను నాలుగు ముఖముల నొనరించి వానిని సుతులకు నేర్పెను. తదుపరి సృష్టి వృద్ధినిఁ గాంచక నీ పాదసేవల నాశ్రయించెను. 

 

 

 

 

తే.గీ.

తెలిసి వెర వంత విభజించి దేహ మరయ

స్త్రీ పురుషు లయి తా సృజించె మనుజ కుల

మెల్ల నట్ల వృద్ధి పఱచి తీవ శ్రీశ

మారుత పురేశ మాపుమ మా రుజలను  

10.  

 

 

 

 

 

అప్పు డుపాయము తట్టి తన దేహమును రెండు భాగములుగా విభజింప నవి  స్త్రీ మఱియు బురుషునిగ  నయినవి. (వారే శతరూపా  మనువులు.) ఆ దంపతుల నుండి మనుష్య కుల మెల్ల నీ మహిమ వృద్ధి సెందినది. అట్టి గురువాయూరు నాథా మా రోగముల నాపుము.

 

 

 

ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయమునఁ బదవ దశకము. 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము

(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము)

 

తృతీయ స్కంధ పరిచ్ఛేదము

దశకము. 11

హిరణ్యాక్ష హిరణ్యకశిపుల యుత్పత్తి.

 

 

ఆ.వె.

పెరుఁగు చుండ సృష్టి వరుస నొక్క దినంబు

సనక ముఖ సుర వర మునులు గాంచ

నిను వికుంఠ నిలయమునకు నేతెంచిరి

వాయు పుర వరేశ పద్మనాభ

1.      

 

 

 

 

పద్మనాభా! గురువాయూరు ప్రభూ!  యట్లు సృష్టి వృద్ధి సెందుచుండ నొక దినము సనకాది మునులు నిన్ను జూచు కోరికతో వైకుంఠమునకు విచ్చేసిరి. 

 

 

 

 

మ.

అల నైశ్రేయస కాన నాదులును గూపామ్నాయ రత్నాలయ

మ్ములు భాసిల్లఁ గరమ్ము గాంచుచుఁ దమిన్ మోదమ్ముతో నంత మౌ

నులు కక్ష్యాలిని దాఁటి చేరి రట సంతోషమ్ము వర్ధిల్ల నీ

లలి తావాసము వేశ్మరాజ మస మాలంఘ్యంబు లోకంబులన్

2.     

 

 

 

 

అచట నైశ్రేయసము మున్నగు  వనములు, బావులు, రత్నఖచిత గృహములు ప్రకాశించు చుండఁ  గాంచుచు నా మునులు గుమ్మములను దాటి నీ లలితంపు నివాస మసమాన మైనది యలంఘ్యము నైన దానిని సంతోషముగాఁ జేరిరి. 

 

 

 

 

తే.గీ.

నిన్ను గనఁ గోరు వారి నీ నిలయ మొలయు

వారిని జయ విజయు లాప ద్వార పాల

కు లటఁ గోప ముప్పొంగె మునులకు హృదిని

నీదు ప్రేరణమునన దామోదర విభు

3.     

 

 

 

 

నిన్ను జూడఁ గోరు వారును నీ గృహము చేరిన వారిని ద్వారపాలకులు జయ విజయు లాప నా మునులకు మనస్సులో నీ ప్రేరణముననే కోప ముప్పొంగెను.

 

 

 

 

తే.గీ.

అనయ చేష్ట లీ వైకుంఠమునకు మీరు

జేసి నందున రాక్షస జీవిత మగు

మీ కని శపింపఁ బడ నంత నాక మునుల

వేఁడిరి హరి స్మరణ ముండు విధి సతమ్ము

4.     

 

 

 

 

ఆ దేవమునులు నీతిలేని పనులు మీ రీ వైకుంఠమునఁ జేసి నందున మీకు రాక్షస జీవితము కల్గు నని శపించిరి.  అంత జయ విజయలు వారిని తమకు నిత్యము హరి స్మరణ ముండు నట్లుగాఁ జేయ మని వేఁడిరి.

 

 

 

 

చం.

సకలము నీ వెఱింగి మదిఁ జక్కగ వెల్పల కంత వచ్చి తీ

వు కమలఁ గూడి హస్తమును భూర్యహి మారకు నంస మందునం

బ్రకటము గాఁగ నుంచి బలిబంధన! తామరసాక్ష! మౌని స

న్నికటము సంతసం బొసఁగ నీదు మనోహర మూర్తి వారికిన్

5.     

 

 

 

 

జరిగిన విషయ మంతయు నెఱిఁగి, నీవే లక్ష్మీ దేవి తోడు రాఁగ గరుత్మంతుని భుజముపైఁ జేతి నూని మును లున్న చోటునకు వారికి హర్షము కలుగఁగ ముకుందా వచ్చితివి.

 

 

 

 

తే.గీ.

తన్ను నుతియించు మునులను బన్నుగఁ గరు

ణించి నుడులఁ బార్షదులను గాంచి పల్కి

తీవు వైర భావమ్ముతో నింక మూడు

జన్మల పిదపఁ గలుగు నా సరస మీకు

6.     

 

 

 

 

తనను స్తుతించు మునులను గరుణించి శ్రీహరి ద్వారపాలకులను గని మీకు నాపై వైరత్వముతో మూడు జన్మల పిదప నా సామీప్యము దక్కు నని పలికితివి.

 

 

 

 

తే.గీ.

అట్టి నీ భృత్యు లైరి కశ్యప తనయులు

దేవ రిపులు దితి సుతులుఁ జేవఁ గలుగ

సంధ్యలోఁ గష్ట కర్ములు సములు యమున

కెంచ లోక భీకరులు రమేశ వారు

7.     

 

 

 

 

దేవా యట్టి నీ భృత్యులు జయవిజయలు కశ్యపునకు దితికిఁ బుత్రు లైరి. సంధ్యా సమయమునఁ  బుట్టి మహా బలులు వారు లోక భీకరులు కష్టమైన కర్మములు జేయు వారు యమునకు సమ మైన వారు నైరి. 

 

 

 

 

తే.గీ.

ధర హిరణ్యకశిపుఁడు నతని యనుజ వ

రుఁడు హిరణ్యాక్షుఁడు ననఁగఁ గడు ప్రసిద్ధు

లు మఱచి గత జన్మ స్మృతులు ప్రతిఘమ్ము

వూని నొంచిరి త్వదధీనపు జగములను

8.     

 

 

 

 

హిరణ్యకశిపుఁడు తమ్ముఁడు హిరణ్యాక్షుఁడు ప్రసిద్ధులై పూర్వజన్మ స్మృతులను మఱచి కోపముతో నీ యధీనమున నున్న జగములను నొప్పింపఁ జాగిరి.

 

 

 

 

తే.గీ.

అడరఁగ గద కేలను హిరణ్యాక్షుఁ డెల్ల

సురల నసురులను దఱిమి పరులఁ గనక

ముంచి నీ ప్రియ క్షితి జలములఁ జరింపఁ

జాగె గర్వించి యార్చుచు జగము లెల్ల

9.     

 

 

 

 

గదను జేతఁ దాల్చి హిరణ్యాక్షుఁడు సురాసురులను దఱుముచుఁ దన నెదిరించు శత్రువులను గనక నీకు ప్రియయమైన భూమిని నీటిలో ముంచి గర్వముతో నఱచుచు జగము లెల్ల దిరుగఁ  జాగెను.

 

 

 

 

తే.గీ.

విని వరుణిని వలన నీవు తనకు సముఁడ

వని యని వెదకఁ దొడఁగె నిన్నంతఁ దనరి

భక్తులక కనిపింతు కృపా పయోధి!

యాపు మా రోగములు మరుదాలయేశ!

10.  

 

 

 

 

వరుణుని వలన నీవు తనకు సమర మందు సముఁడ వని యెఱిఁగి నిన్ను వెదకఁ దొడఁ గెను. నీవు భక్తులకు మాత్రమే కన్పింతువు. దయానిధీ గురువాయూరు నాథా మా రోగములను మాన్పుము.

 

 

 

ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయమునఁ బదునొకండవ దశకము. 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము

(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము)

 

తృతీయ స్కంధ పరిచ్ఛేదము

దశకము. 12

వరాహావతార వర్ణనము

 

 

తే.గీ.

అంత మను సత్తముండు స్వాయంభువుండు

సృష్టి రతుఁ డకాల జలస్థ సింధునేమిఁ

గాంచి సత్య లోకం బేఁగె మించి మునులఁ

గూడి నీ పద భక్తునిఁ జూడ నజుని

1.      

 

 

 

 

అంత స్వాయంభువ మనువు సృష్టికార్య నిమగ్నుఁడై జలములో మునిఁగి యున్న భూమినిఁ గాంచి మునులు తోడు రాఁగ నీ పాద భక్తుఁ డైన బ్రహ్మ దేవునిఁ జూచుటకు సత్యలోకమన కేఁగెను. 

 

 

 

 

చం.

జనుల సృజించు చుండ ధర సంకట మేర్పడె మున్గ నీటిలో

వినతు లొనర్తుఁ బద్మభవ వేగ జగమ్ము నొసంగుమా తగన్

జనులకు నా మనూత్తముఁడు సాఁగిలి వేఁడ స్వయంభువుండు ధ్యా

న నిరతి నీపద ద్వయము నర్మిలి మధ్వరి! యాశ్రయించెనే

2.     

 

 

 

 

బ్రహ్మను గాంచి యా మనువు బ్రహ్మదేవా జనుల సృజించు కార్య రతుఁడనై యుండ భూమి నీటిలో మునిఁగిపోయి నందున  ప్రజకు సంకటము లేర్పడెను. మాకు నిల్చు స్థలము నీయవే యని నమస్కరింపఁగా నలినజుఁడు  మధురిపు! నీ పద పద్మములను ధ్యానించి యాశ్రయించెను.

 

 

 

 

ఆ.వె.

అక్కట మును ద్రాగ నిక్కబంధమ్ములు

నేను ముంచె దిరిగిఁ నీర మవని

నని స్మరింప నీదు నంఘ్రి బాల కిటివై

పుట్టి తీవు బ్రహ్మ ముక్కు నుండి

3.     

 

 

 

 

మున్న యీ జలములను నేను ద్రాగియుంటిని కదా తిరిగి యీ నీ రెట్లు భూమిని ముంచె నని తలంచుచు దేవా బ్రహ్మ నీ యంఘ్రి ద్వయమును స్మరింపఁగా నీ వాయన ముక్కు రంధ్రము నుండి బాల వరాహమవై పుట్టితివి.

 

 

 

 

తే.గీ.

బొటన వ్రే లంత మేనునఁ బుట్టి యంత

నేనుఁ గంత పెరిఁగి నభ మెల్ల నిండ

నీవ యచ్చెరు వందిరి నీరజ భవుఁ

డును దనూజులు వికచ నలిన దళాక్ష

4.     

 

 

 

 

బొటన వ్రేలు పరిమాణమునఁ బుట్టి చూచుచుండ నేనుఁగు రూప మంత పెరిఁగి యాకాశమంతయు నీవు నిండఁగా  బ్రహ్మ మఱియు పుత్రులు కూడ మిక్కిలి యాశ్చర్యము సెందిరి.

 

 

 

 

ఉ.

అక్కజ మంది చిత్తమున నబ్జజుఁ డివ్విధిఁ దల్పఁ జాగెనే

యిక్కిటి యెట్లు వుట్టెను మదీయ నసా బిల మందు నుండియే

యెక్కడి వాఁ డితం డెవఁడొ యియ్యది యెంచఁగ విష్ణు మాయయే

చక్కఁగ నార్చి తీవు ద్రుటి శైల నిభమ్మయి భీకరమ్ముగన్

5.     

 

 

 

 

అపుడు బ్రహ్మ మనస్సులో నిట్లు తలఁపఁ జాగెను. ఈ వరాహము నా నాసికా రంధ్రము నుండి యెట్లు పుట్టె, నితఁ డెవ్వఁ డెక్కడి వాఁడు నా కిది విష్ణు మాయగాఁ దోఁచు చున్నది. ఇట్లు బ్రహ్మ తలంచు చుండ నంతఁ బర్వతాకారుఁడవై భీకరముగా నార్చితివి.

 

 

 

 

తే.గీ.

జన తపస్సత్య లోక వాస ముని వరులు

నీదు గర్జనమును విని మోదమున ను

తింప నిన్ను హర్షించి గర్జించి మిగులఁ

 దూఱితివి పృథు తర మూర్తిఁ దోయ రాశి

6.     

 

 

 

 

జనలోకము, తపోలోకము సత్యలోకమున నున్న మునులు నీ యఱుపు విని సంతసించి నిన్ను నుతింప హర్షించి గర్జించి మహాకాయా నీవు నీటిలోఁ దూఱితివి.

 

 

 

 

మ.

ఉరువౌ బూడిద రంగుతో నలరి పై కుప్పొంగు రోమమ్ములన్

గురు వాలమ్మది లేచి యుండ బెడఁగౌ ఘోణన్ నతేద్ధాస్యముం

దిరుగం గన్నులు వాఱ మబ్బులును గీర్తింపంగ మున్యోఘముల్

కరుణం గాంచి మునింగి తీవు కుము ఖాకారమ్మునం దోయధిన్

7.     

 

 

 

 

బూడిద రంగు మేనితో నుప్పొంగు రోమములతోఁ బెద్ద తోకను బైకెత్తి ఘోరమైన ముక్కు, వంచిన ముఖముతోఁ గన్నులు ద్రిప్పుచు మబ్బులు పాఱఁగ ముని బృందము కీర్తించు చుండఁ గరుణతోఁ  పంది యాకారముతో సముద్రములో మునిఁగితివి. 

 

 

 

 

చం.

అదరఁగ నెల్ల నక్ర తతు లప్పున భీతిఁ దిమింగలమ్ములే

చెదర నభంగ భంగము లశేషము రేఁగ రసాతలస్థులే

బెదరఁగ ఘోర ఘోషమునఁ బెంపున నార్వఁగఁ దూఱి వారిధిన్

వెదకితి వంత గహ్వరిని వే జల మందు సవిస్తరమ్ముగన్

8.     

 

 

 

 

నీటిలోఁ దిమింగిలములు మొసళ్ళు లెల్ల భీతితో నదరఁగ,  విశేషముగాఁ గెరటములు సెలరేఁగ, రసాతల వాసులు బెదఱ, ఘోరముగ నార్చి జలములలో భూమిని వెదకఁ దొడఁగితివి.  

 

 

 

 

తే.గీ.

అధముఁ డా దైత్యుఁ డుంచఁగ నవని నా ర

సా తలాంతమునను  గాంచి సత్వరమ్ము

లీల నుంచితి కోరను గోల రూప

 క్షితి గణింపక యెదిరించు దితిజ గణము

9.     

 

 

 

 

అధముఁడు హిరణ్యాక్షుఁడు రసాత లాంతరమున భూమిని నుంచఁ గాంచి సత్వరము పుడమిని నీ కోరపై నుంచితివి వరాహావతారా దైత్యగణము నెదిరించిన లెక్క సేయక.

 

 

 

 

తే.గీ.

ధాత్రి నుద్ధరింపఁగ నీదు దంష్ట్రపు మొన

గడ్డి పరక పగిదిఁ గోరఁ గనఁబడె నది

వనధి ఘోరోదకము నుండి వచ్చి తీవు

వాపు రుజలు మాయా కిటి రూప ధారి

10.  

 

 

 

 

నీ దంష్ట్రము చివర నుంచి భూమి నుద్ధరించి నీటి నుండి పైకి వచ్చితివి. అప్పుడు భూమి కడలిలో నీ కోరపై నొక గడ్డిపరక వలెఁ గనిపించెను. అట్టి వరాహ రూపా మా రుజల నాపుము.

 

 

 

ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయమునఁ బండ్రెండవ దశకము. 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము

(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము)

 

తృతీయ స్కంధ పరిచ్ఛేదము

దశకము. 13

హిరణ్యాక్ష వధము 

 

 

ఉ.

నిన్నరయన్ హిరణ్య మయ నేత్రుఁడు కల్ప జలమ్ము లందుఁ దాఁ

గ్రన్ననఁ జాగ జంఘముల కన్నను మించక నీర ముండఁగన్

సన్నుతి చేసి నారదుఁడు శాఠ్య మనమ్మున నీ బలమ్మునే 

సన్నము సేసి యో వరద సంయమి పల్కెను దైత్యుతో నిటుల్

1.      

 

 

 

 

దేవా నిన్ను గనుగొనుటకు హిరణ్యాక్షుఁడు కల్పకాల జలములు తనకు మోకాళ్ల వఱకు వచ్చు చుండఁ దిరుగు చున్నప్పుడు నారద మునీంద్రుఁడు కపటమున నతనిని నుతించి నిన్ను తక్కువ చేసి యసురుని తో నిట్లు పలికెను .

 

 

 

 

తే.గీ.

హరి హరించు చున్నాఁడు నీ యవని నన ము

ని వరుఁ డెక్క డెక్కడ వాఁ డని యసురుఁ డన

నంతఁ జూప నీ పథము నీ చెంతఁ జేరె

జలము నుండి నెత్తుచు నుండ నిలను నీవు

2.     

 

 

 

 

హరి భూమిని దొంగిలించు చున్నాఁడు చూడు మని నారదుఁ డనఁగ నసురుఁ డెక్కడ యెక్కడ వాఁడని యడుగఁగ ముని నీ వున్న దారి చూపెను. అప్పుడు నీవు పుడమిని నీటి నుండి పైకి నెత్తు చుంటివి.

 

 

 

 

చం.

ఎఱుఁగక నిన్ను దైవమ! హసించుచుఁ బల్కె నరణ్య జంతు వం

చఱచుచు నింద సేయుచు నసహ్యపుఁ బల్కుల దైత్యుఁ డంత నీ

వఱమర లేక కాంచి భువి నార్తిఁ జలింప మహత్వ సంపదన్

మఱి జలరాశి నుంచి దితి నందను మార్కొన నుత్సహించితే

3.     

 

 

 

 

దేవా నీ మహిమ మెఱుఁగక దైత్యుఁడు పరిహసించుచు నడవి మృగమా యని యఱచుచు నిందించుచు నసహ్యపుఁ బల్కులు పల్కెను. అంత నీవు బెదరక నీ మహత్వమున భూమిని నీటిలో నిల్పి యా రక్కసుని నెదిర్ప సిద్ధ మయితివి.

 

 

 

 

చం.

గద కర మందుఁ దాల్పఁ గని కర్బురుఁ బూని మహోన్నతమ్మునౌ

గదను సలీలఁ బోర నటఁ గల్గ రవమ్ములు తాఁక రెండుఁ జూ

డఁ దలఁచి దేవ సంఘము లటం దమి నిల్వఁగ ధాత యంతటం

గదిసి వచించెఁ జంపఁ దగుఁ గౌణపు నీ విట సంధ్య లోపలన్

4.     

 

 

 

 

చేతిలో గద నూనిన రాక్షసునిఁ జూచి నీవును గొప్పదగు గదను బూని వానితోఁ బోరు సలుప వాని తాకిడికిఁ గల్గిన ఘోర శబ్దములను విని మీ యుద్ధము జూడఁ గోరి దేవతలు పైన నిల్చిరి. అప్పుడు బ్రహ్మ నీతో వానిని సంధ్యా కాలము లోపుననే చంపు మని పలికెను.

 

 

 

 

ఉ.

అక్కజ మయ్య నీదు గద యయ్యసురేంద్రు గదా విఘాతమై

గ్రక్కునఁ గూలె ధాత్రిని వికారము నొందక యంత నవ్వుచున్

మక్కువ తోడఁ దల్ప మది మానిసి దిండ్ల వధించు జక్రమున్

మిక్కిలి వెల్గి తీ వది సమీర రయమ్మునఁ జేర హస్తమున్

5.     

 

 

 

 

అప్పు డాశ్చర్యముగా నసురు గదా ఘాతమున నీ గద నేలపైఁ గూలెను. దానికిఁ జింతింపక నీవు నవ్వుచుఁ బ్రేమతో రాక్షసాంతకమైన  చక్రమును మనస్సులోఁ దల్పఁగా నది వాయు వేగమున వచ్చి నీ చేతినిఁ జేరఁగా గొప్ప కాంతితో వెల్గితివి. 

 

 

 

 

ఉ.

కాల సమాన దైత్యుఁడు పగం గొని శూలము నేయ నీపయిన్

లీలఁగ దానిఁ జక్రమున లెస్సగ ముక్కలు సేయఁ గాంచి యా

భీలపు ముష్టి ఘాతములఁ బెల్లుగ వ్రేసియు విఱ్ఱ వీఁగి లో

కాలను మోహమం దునుపఁ గల్గెడు మాయలు పన్నె వింతగన్

6.     

 

 

 

 

యమునితో సమాన మగు నా రాక్షసుఁడు పగతో శూలమును నీ పయి విసరెను. లీలఁగా దానిని నీవు జక్రముతో ముక్కలు సేయఁ గాంచి యతఁడు పిడికిలి పోటులు గట్టిగా పొడిచి విఱ్ఱ వీఁగి లోకములను మోహపఱచు మాయల నెన్నొ పన్నెను.

 

 

 

 

తే.గీ.

హర్యరి ఘన మాయాజాల మణఁపఁ దనదు

ఛవి కణమ్ములఁ గోపించి యవిరళమ్ము

ముష్టిఁ బ్రహరింప నసురుండు మూరి కాలి

బొటన వ్రేల నొక్కితి చెవి తటము నందు

7.     

 

 

 

 

హరి చక్రము తన కాంతి కణముల మాయల నన్నింటి నణఁపఁగ రక్కసుఁడు కోపించి అవిరళముగ ముష్టి ఘాతములు నీ పైఁ బ్రసరించెను. అప్పుడు నీవు నీ కాలి బొటన వ్రేలితో నతని చెవి క్రింద నొక్కితివి.

 

 

 

 

చం.

చరణపు ధాటి కోర్వక నసా ముఖ రంధ్రములన్ స్రవింప నె

త్తురు సుమహాజిరుం డసుర తూర్ణము వీడె నిజాసు వాయువుల్

సుర ముని వర్యు లంతట విశుద్ధ ముదా కలి తాత్ములైరి పా

డిరి వర యజ్ఞకాయ నిను డెందమునం దిడి స్తోత్ర పాఠముల్

8.     

 

 

 

 

నీ కాలి తాకిడి నోర్వ లేక నోరు ముక్కుల నుండి రక్తము కాఱఁగా నా మహాకాయుఁడు తన ప్రాణ వాయువులను విడిచెను. అప్పుడు సురముని వర్యులు సంతోషముతో వరాహాకారా నిన్ను మనస్సు నందు నుంచి స్త్రోత్ర పాఠములు పాడిరి.

 

 

 

 

తే.గీ.

త్వచము ఛందము నెఱు లగు దర్భలు కను

లు ఘృత మంఘ్రులు ఋత్విజు లుదర మిడయె

స్రుక్కు ముఖము గ్రహము రస శ్రుతి చమసము

రసము సోమము కంఠ ముపసద మయ్య

9.     

 

 

 

 

దేవా నీ చర్మము ఛందము, రోమములు దర్భలు, కనులు నేయి, పాదములు ఋత్విక్కులు, కడు పగు నిడా పాత్ర, ముఖము స్రుక్కు, నాలుక గ్రహము, చెవి చమసము వీర్యము సోమ రసము కంఠ ముపసదముగా నీవు యజ్ఞ స్వరూఁడవు.

 

 

 

 

తే.గీ.

అవ్విధి ముని నుతుల ముది తాత్ముఁడ వయి

ఘన తనువున విమల యశః కాంతు లలరఁ

జేరి వైకుంఠము సుఖ విహారి వైతి

వాపుమ రుజ లన్నిటి మరు దాలయ ధవ

10.  

 

 

 

 

ఆ విధముగా మునులు నిన్ను స్తుతింప సంతస మంది విమలకాంతులు వెలుఁగఁ దనువున వైకుంఠము సేరి సుఖముగా నుంటివి. ఓ గురువాయూరు నాథా మా రోగముల నాపుము.

 

 

 

ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయమునఁ బదుమూడవ దశకము. 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము

(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము)

 

తృతీయ స్కంధ పరిచ్ఛేదము

దశకము. 14

కపిలోపాఖ్యానము

 

 

తే.గీ.

మనువు పద్మభవ తనూజుఁడు నలినాక్ష

నీ పద సరోజ యుగ్మము నిత్యము స్మరి

యించి కీర్తించి నీదు దివ్యాంచిత చరి

తమ్ముఁ గడపెను మన్వంతరమ్ము రహిని

1.      

 

 

 

 

 

నలినాక్షా పద్మభవుని పుత్రుఁ డైన మనువు నీ పదపద్మములను నిత్యము స్మరించుచు నీ దివ్య చరిత్రమును గీర్తించుచు మన్వంతరము నానందముగా గడపెను.

 

 

 

 

తే.గీ.

కర్ద మాఖ్యుఁడు పుట్టఁగఁ గంజు నీడ

నుండి యప్పుడు సృష్టిని మెండుగ నొన

రింప నెంచి జనకు నాజ్ఞ రేఁగి తప మొ

నర్చెఁ బెక్కేండ్లు నీ చరణములు దలఁచి

2.     

 

 

 

 

ఆ సమయమునఁ గర్దముఁ డును పేరున బ్రహ్మదేవుని నీడ నుండి ప్రజాపతి యుద్భవించెను. జనకుని యాజ్ఞ శిరసా వహించి యతఁడు సృష్టి నొనరించుటకుఁ బెక్కేండ్లు మాధవా నీ పాద పద్మములను దలంచుచుఁ దపము సేసెను. 

 

 

 

 

తే.గీ.

కాల మేఘాభ తనువున గరుడు మూపు

పై నలరి లీలఁ దనర నబ్జమ్ము కర స

రోజమున స్మితాస్యమ్మునఁ దేజ మలర

దర్శన మొసఁగి తీవు కర్దమునకు విభు!

3.     

 

 

 

 

ప్రభూ నీలమేఘ వర్ణపు దనువున గరుత్మంతు మూపున నలరి  కరాబ్జమునఁ బద్మము నూని  నగు మోముతో నతనికి దర్శన మిచ్చితివి. 

 

 

 

 

చం.

పులకిత కాయుఁడై యతఁడు మూరి నుతింప రమాపతీ నినుం

బలికితి వీవు హర్షమునఁ బత్నియగున్ మను పుత్రియే గుమా

ర్తెలు నవకమ్ముఁ బిమ్మట సుధీ కపి లాఖ్య సుతుండ నౌదు నీ

కిలను స్వయమ్ము నా వరము లిచ్చి యదృశ్యుఁడ వైతి వంతలో

4.     

 

 

 

 

అంత కర్దముఁడు పులకితాంగుఁడై నిన్ను నుతింప నతనితో హర్షమున నిట్లు పలికితివి. మనువు  పుత్రి నీకు భార్య యగును దొమ్మండ్రు కుమార్తెల పిదప నేను స్వయముగ నీకుఁ గపిలుఁ డను నామమునఁ బుత్రునిగా జన్మింతును. ఇట్లు వరము లొసంగి దేవా నీ వంతర్దాన మైతివి.

 

 

 

 

తే.గీ.

భార్య శతరూప నతి గుణవతిఁ దనూజ

దేవహూతిఁ గొని మనువు దేవ ముని ను

డువఁగ నీ పనుపున నేఁగెను వడిఁ గాంచఁ

దనదు రాకఁ గాంక్షించు కర్దముని కడకు

5.     

 

 

 

 

మనువు భార్య శతరూపను, గుమార్తె దేవహూతినిఁ దోడ్కొని నారద మునీంద్రు వచనమున మనువు  రాకకు నెదురు చూచు చున్నట్టి కర్దముని కడకు నేఁగెను. నీ ప్రేరణముననే నారదుఁడు  మనువునకుఁ గర్దమునిఁ జూడ మని నుడివెను.

 

 

 

 

ఆ.వె.

దేవహూతి మనువు దేవిగ నీయ గ్ర

హించి కర్దముండు మించి సతము

సేవ లెల్లఁ జేయ దేవి నిన్నర్చించు

వేళఁ దగఁ బ్రసత్తిఁ బేర్మిఁ జూపె

6.     

 

 

 

 

మనువు దేవహూతినిఁ గర్దమునకు భార్యగా నీయ సంతోషముతో గ్రహించెను. కర్దముఁడు దేవా  నిన్ను నర్చుంచు వేళల భార్య తనకుఁ దగిన విధముగా సేవలు చేయ  మిక్కిలి ప్రసన్నుఁడై  ప్రేమఁ జూపెను. 

 

 

 

 

తే.గీ.

నీ యుపాసనా మహిమను నెలఁత కోర్కిఁ

దీర్చుట కొక విమాన మొనర్చి నవ్య

రమ్య తను వూని యభ్ర మార్గమున భార్యఁ

గూడి విహరించె నబలలు తోడు రాఁగ

7.     

 

 

 

 

నిన్నర్చించిన మహిమతో భార్య కోర్కినిఁ దీర్చుటకు నొక్క సుందరమైన విమానమును గూర్చి యాకాశ మార్గమున నూతన సుందర  దేహము నూని పరిచారికలు కొలువ భార్యతోఁ గర్దముఁడువిహరించెను. 

 

 

 

 

తే.గీ.

ఏండ్లు నూ ఱవ్విధి వసించి యెలమి సుంద

రాకృతుల నవ కన్యల నంది స్వీయ  

దార కీయ ముదమ్ము కాంతార గమన

మాపి వేచె నీ జననమ్ము నరయఁ గోరి

8.     

 

 

 

 

వంద యేం డ్లట్లనుభవించి యంద మైన తొమ్మండుగురు కూతుళ్లను బడసి భార్యకు సంతోషము నీయ వానప్రస్థము నాపి  నీ పుట్టుకకు నెదురు చూచు చుండెను.

 

 

 

 

తే.గీ.

సేవ లొనరింపఁ బత్యాజ్ఞ దేవహూతి

కంతఁ గపిలుఁ డనఁగ నీవ వింతగ జని

యించితివి ప్రచారము సేయ నంచితముగ

జగతిఁ బరమాత్మ తత్త్వము సర్వులకును

9.     

 

 

 

 

దేవహూతి పతికి సేవలు సలుపు చుండ నీవు వారికి పుత్రునిగా నుద్భవించితివి. కపిలుఁ డను  నామము గ్రహించి పరమాత్మ తత్త్వమును లోకముల నందఱకుఁ బ్రచారము చేయ నవతార మెత్తితివి.  

 

 

 

 

తే.గీ.

కర్దముం డేఁగె ముదమునఁ గానలకును

సారమతి వీ వలరి మత సార మెల్లఁ

గఱపితివి తల్లి కింపుగఁ గపిల నామ

వాతపుర దేవ రక్షింపు పాపి రుజలు

10.  

 

 

 

 

అంతఁ గర్దమ ప్రజాపతి సంతోషమున వనముల కేఁగెను. దేవా సారమతి వైన నీవు తల్లి దేవహూతికిఁ దత్త్వ సార మంతయు నేర్పితివి. ఓ  వాయుపుర నాథా మా రోగములను బాపుము. 

 

 

 

ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయమునఁ బదునాల్గవ దశకము. 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము

(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము)

 

తృతీయ స్కంధ పరిచ్ఛేదము

దశకము. 15

కపి లోపదేశము

 

 

ఉ.

కూడిన నింద్రి యార్థములఁ గోరి మన స్సది బంధ హేతువే

వీడిన వాని నెల్ల నది వీలగు నింపుగఁ బొంద మోక్షమే

పాడిగ భక్తి యోగమ నివారణ చేయు రతిన్ మహాత్ములం

గూడుమ భక్తికై కపిల! కూర్మి వచించితి దేవహూతికే

1.      

 

 

 

 

 

మనస్సు కోరి యింద్రియ విషయములఁ గూడిన నది బంధమునకుఁ గారణమగును. వానిని వీడిన మోక్షము లభించును. భక్తి యోగమె యీ యాసక్తిని నివారించును. మహాత్ములను గూడిన భక్తి యొనగూరును. కపిల దేవా యిట్లు నీకు తల్లి యైన దేవహూతికిఁ దెలిపితివి.

 

 

 

 

చం.

ప్రకృతి మహత్తహమ్ము నిఁకఁ బంచక మాత్రలు పంచ భూతముల్

సకల మనస్సు నింక దశ సంఖ్యలు నింద్రియ సంచయమ్ములుం

బ్రకటిత పూరుషుండు కలుపంగఁ బదైదు దశమ్ము నారయం

బ్రకృతుల వీడనౌ కపిల! రక్తి వచించితి దేవహూతికే

2.     

 

 

 

 

మూల ప్రకృతి, మహత్తత్త్వము, నహంకారము, పంచ తన్మాత్రలు, పంచ భూతములు, మనస్సు, జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు పదియు, నాత్మ యందున్న పూరుషుండు కలసి యిరువది యైదు తత్త్వములను దెలిసికొనినఁ బ్రకృతి బంధములు తొలఁగునని తల్లికిఁ జెప్పితివి.

 

 

 

 

ఉ.

ఈ పురుషుండు ప్రాకృతపు టీ గుణ రాశికిఁ జిక్కఁ డెన్నడుం

జూపిన రక్తి వీని పయి సూత్ర నిబద్ధునిఁ జేయు వానినే

నీ పయి భక్తిఁ దత్త్వమును నేర్వఁ దొలంగును బంధ మంతయున్

గోపన మెంచుచుం గపిల! కూర్మి వచించితి దేవహూతికే

3.     

 

 

 

 

  పురుషుఁడు ప్రకృతి గుణత్రయమునకుఁ జిక్కఁడు. కాని వానిపై నాసక్తిఁ జూపిన నవి యతనిని  బంధించును. నీ మీద భక్తి తత్త్వమును నేర్చిన బంధము తొలఁగు నని కాపాడ నెంచి  తల్లికిఁ జెప్పితివి.

 

 

 

 

చం.

విమలపు బుద్ధి నాసన విభిన్న విశేషత నభ్యసించచున్

సమధిక వీర్య తార్క్ష్య గత సంచరు దివ్య విభూష ణాయుధాం

క ముదిర వర్ణ తుల్య రుచి కాయు ననున్ స్మరియింపఁగా వలెం

గుముద నిభాక్షికిం గపిల! కూర్మి వచించితి దేవహూతికే

4.     

 

 

 

 

విమలపు బుద్ధితో విభిన్నపు టాసనముల నభ్యసించుచు గరుత్మంతునిపైఁ జరించు నీలి మేఘ వర్ణమున విలసిల్లు దివ్యాభర ణాయుధములఁ బ్రకాశించు నిన్ను స్మరియింప వలె నని పద్మాక్షి తల్లికిఁ జెప్పితివి.  

 

 

 

 

చం.

వినుచు నుతింప నావి యగు విశ్రుత సద్గుణ లీల లన్నిటిన్

వినయము మీఱఁ బ్రాప్త మగు విస్తృత భక్తియ జాహ్నవీ నదీ

వన విమ లాభ చిత్తమున భక్తి జయింప నెఱుంగు మృత్యువున్

వనజదళాక్షికిం గపిల! పమ్మి వచించితి దేవహూతికే

5.     

 

 

 

 

 

నా విశ్రుతమైన గుణములను లీలలను వినుచు నుతించుచు వినయముతో మసలిన నా యొక్క భక్తి ప్రాప్తించును. గంగాజలములతో సమానమగు విమల మైన  చిత్తము నందు భక్తి పుట్టును. భక్తి వలన మృత్యువును గూడ జయింప వచ్చు నని కమలాక్షి తల్లికిఁ జెప్పితివి.

 

 

 

 

ఉ.

అక్కట పెక్కు హింసల నవారిత రీతి నొనర్చు లోలుఁడై

నిక్కపుటాలికిన్ సుతుల నిత్యము లాలన సేయ నర్థమున్

మిక్కిలి పొంద నెంచఁగ నమేయ మభక్తుఁడు పొందు బాధలే

మక్కువ తోడుతం గపిల! మంచ వచించితి దేవహూతికే

6.     

 

 

 

 

భార్యా పుత్రులను లాలింప ధనార్థియై పెక్కు బాధల నవారితముగా నితరుల కొనర్చును. నాకు భక్తుఁడు కాని వాఁ డమేయముగా బాధలు పొందును. ప్రీతితోఁ గాపాడ నెంచి తల్లికిఁ జెప్పితివి.

 

 

 

 

చం.

కలుగును దల్లి గర్భమునఁ గాఱియ లెన్నియొ జ్ఞాన మున్న ము

న్నలఁ బడ భూమిపైఁ దొలఁగు నయ్యెఱు కంతయు బాల్య మందు చి

క్కులు మఱి మిక్కుటమ్ము లిఁకఁ గూరును మోహమ యౌవనమ్మునం

గులసతి కింతయుం గపిల! కూర్మి వచించితి దేవహూతికే

7.     

 

 

 

 

తల్లి గర్భమున నున్నప్పుడు బాధల నెన్నిటినో నరుఁడు పొందును. మున్ను జ్ఞాన మున్నను భూమిపైఁ బడి నంతనే యా జ్ఞానము తొలఁగును. బాల్యమున మిక్కుటపుఁ జిక్కులు కలుగును. యౌవనమున మోహ మావహించు నని కులసతి తల్లికిఁ జెప్పితివి. 

 

 

 

 

ఉ.

తాఁ జను దక్షిణాయన పథమ్మ గృహస్థుఁడు ధార్మికుండు స

త్పూజలు సేసి పెద్దలకుఁ బూజ్య సురాళికిఁ గామహీనుఁడే

తేజపు టుత్తరాయణ గతిం జను నీ వచియించు చేష్టలం

బూజిత మాతకుం గపిల! మూరి వచించితి దేవహూతికే

8.     

 

 

 

 

 

గృహస్థుఁడు ధార్మికుఁడై దేవతలకుఁ బితృ దేవతలకుఁ బూజలు సల్పి దక్షిణాయన మార్గమున నూర్ధ్వ లోకములకుఁ జనును. కోరికలను ద్యజించిన వాఁడు నీ జెప్పిన పనుల నొనరించుచు నుత్తరాయణ మార్గమునఁ జని మోక్షము పొందు నని తల్లికిఁ జెప్పితివి. 

 

 

 

 

తే.గీ.

తెలుప నెఱిఁగిన మాతను దేవ! దేవ

హూతిని నుతింపఁ గరుణింపఁ బ్రీతి భక్తి

యోగమున ముక్తురాలయ్యెఁ బ్రాగుదీచి

నిలిచి తీవు మునులతో జనులఁ దరింప

9.     

 

 

 

 

ఇట్లు నీవు తెలుపగా నెఱింగిన మాతను నిన్ను నుతించిన దేవహూతిని నీవు ప్రీతితోఁ గరుణింపఁగా నామె భక్తి యోగముతో ముక్తురా లయ్యెను. నీవు మునులతోఁ గలసి యీశాన్య దిక్కున కేఁగి జనులను దరింపఁ జేయుటకు నిల్చితివి. 

 

 

 

 

తే.గీ.

భయముల నణఁచు నీ పాద భక్తి తీర్చుఁ

గోరికల నది యని యంటి కూర్మి మీఱ

వేయి మాట లేలయ నిల్పు మాయతంపు

భక్తి మాపు రోగములు పవన పురేశ

10.  

 

 

 

 

వేయి మాట లేల దేవా నీ పాదముల పైని భక్తి భయముల నణఁచి కోర్కులను దీర్చు నని జెప్పితివి. అధికమైన భక్తి మాకిమ్ము. మా రోగములను బాపుము గురువాయూరు నాథా.

 

 

 

ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయమునఁ బదునైదవ దశకము. 

తృతీయ స్కంధ పరిచ్ఛేదము సమాప్తము.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము

(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము)

 

చతుర్థ స్కంధ పరిచ్ఛేదము

దశకము. 16.

నర నారాయణావతార దక్షయాగ వర్ణనములు.

 

 

 

నర నారాయణుల యవతారము:

 

ఉ.

దక్షుఁడు  బ్రహ్మ నందనుఁడు దారగఁ గైకొనియెం బ్రసూతి నా

లక్షణ లక్షితన్ మనువు లాలిత పుత్రిక నంతఁ కల్గ నా

పేక్షత షోడ శాత్మజలు పేర్మి నిడెం బదు ముగ్గురన్ ధరన్

శిక్షకు నెంచి ధర్మునకు శ్రీస్వధ నా పితృ కోటి కంతటన్

రక్షకు లగ్ని భర్గులకు రామల స్వాహను శ్రీ సతీ మణిన్

1.      

 

 

 

 

బ్రహ్మ కుమారుఁడు దక్షుఁడు మనువు కుమార్తె యయిన ప్రసూతిని వివాహమాడెను. వారికిఁ బదునాఱుగురు కుమార్తెలు కలుగఁగఁ బదుముగ్గురను ధర్మునకును, స్వధ యను నామెను పితృదేవతలకు, స్వాహాదేవిని నగ్నికి సతీ దేవిని శంకరునకు నిచ్చెను.

 

 

 

 

తే.గీ.

మూర్తి కా ధర్ముని సతికిఁ బుట్టి రంత

మీరు నారాయణుండవు మిత్రుఁ డా న

రుఁడును సుర లంతఁ గురిసిరి కడు ముదమునఁ

గుసుమ వృష్టిఁ జెలఁగ వాద్యఘోష నుతులు

2.     

 

 

 

 

ధర్మునకు భార్య మూర్తికి మీరు నారాయణునిగా మీ మిత్రుఁడు నరునిగా బుట్టిరి. దేవత లానందముతో నప్పుడు పుష్పవృష్టి కురిసిరి. వాద్యనినాదములతో స్త్రోత్రములు  చెలరేఁగినవి.

 

 

 

 

చం.

కవచ సహస్ర దైత్యుఁడు జగమ్ముల నాఱడి వెట్టు చుండె దై

త్య వధకు వేయివేయి సమ లర్థి తపఃకలులే కతమ్ములౌ  

బవరము తద్విధిం జలిపి వంతున మీ రుభయుల్ సలీల నా

కవచము లన్ని చీల్చి నరకమ్మున కంపిరి ఘోర దైత్యునిన్

3.     

 

 

 

 

వేయి కవచముల కల రాక్షసుఁ డొక్కఁడు జగములను బాధ పెట్టు చుండెను. వాని వధకై వేయి వేయి యేండ్ల తపము యుద్ధములు  కారణములగును.  అవ్విధిఁ జేయుచు మీయిరువురు వంతున యుద్ధము సేసి లీలఁగా నా కవచములను భేదించి వానినిఁ జంపిరి.

 

 

 

 

చం.

నయముగ మోక్ష ధర్మమును నైపుణిఁ జెప్పుచు నాచరించుచున్

దయ నిడి తాప సేంద్రులకుఁ దద్దయు సోదరుఁ గూడి యంత న

క్షయ రుచి నుండగా బదరికా వనిఁ గాంచి తపశ్శమమ్ములన్

భయపడి వాసవుం డనిపె భామల తోడుతఁ బంచబాణునిన్

4.     

 

 

 

 

అంత మోక్ష ధర్మమును మునులకుఁ జెప్పుచు మీ రుభయులు తపము నాచరించుచు బదరికా వనమున నుండ మీ తపశ్శమములకు భీతిల్లి యింద్రుఁడు మన్మథునితో దివ్యాంగనలను పంపెను. 

 

 

 

 

తే.గీ.

నెగడ వడి వసంత మల యానిలులు నప్స

రసల కడకంటి దృష్టి విలాసములు న

నంగుఁడు కలిగింప నిరోధ మైన నీ చ

లింపమి భయపడంగఁ బలికితి నవ్వి

5.     

 

 

 

 

మన్మథుఁడు వసంతము, మలయానిలముల మెఱయఁ జేసి కల్పింపఁ దపస్సునకు నిరోధము, నప్సరసలు కడకంటి చూపులు విసరినను నీవు చలింపక యుంటఁ గాంచి వారు భయపడఁగ నవ్వుచు నీ విట్లు పల్కితివి.  

 

 

 

 

ఆ.వె.

వలదు భీతి మదన వనితలార కొనుఁ డీ

సత్కృతు లన వారు స్మయమున నుతి

యింప నిన్ను జూపి తీవు నీ పరిచారి

కలను గాంతల నట విలసనముగ

6.     

 

 

 

 

ఓ మన్మథా వనితలారా భీతి వలదు. నా చేయు సత్కారములను గొనుఁడు. అని యనిన వారు విస్మయ మంది నిన్ను నుతించిరి. అంత వారికి నీవు విలాసముగా నీ పరిచారికా కాంతలను జూపితివి. 

 

 

 

 

ఉ.

మోహితుఁ జేయ నెంచి నిను మున్గిరి మూర్ఛల మన్మథాదులే

శ్రీహరి నీదు దాసుల విశేష తనుద్యుతిఁ గాంచి నంత వ్రీ

డాహత చిత్తులై కొనిరి యంగన నూర్వశి నీయ లోక స

మ్మోహన నంతఁ గానుకగఁ బూజ లొనర్చి సమాదరమ్మునన్

7.     

 

 

 

 

శ్రీ హరీ నిన్ను మోహింపఁ జేయ నెంచి వచ్చి మన్మథాదులు వారే మూర్ఛలో మునిగిరి. నీ దాసుల శరీర సౌందర్యమును జూచి సిగ్గు నొందిన వారై వారిలో నూర్వశి యను నామెను సకల లోకములను సమ్మోహ పఱచు నామెను నీవు కానుకగా నీయ గ్రహించి యాదరముతో నిన్ను పూజించి వెడలిరి.

 

 

 

 

తే.గీ.

ఇక్కథ నెఱిఁగి యూర్వశి నక్కజముగఁ

గాంచి వగచె నింద్రుండు నీ ఘన మహిమ ద

లంచి యిట్టి రమ్యావతారమున కెక్కుఁ

గృష్ణ నీ నీల విగ్రహాకృతియ వరద

8.     

 

 

 

 

ఇంద్రుఁడు వీరి వలన నీ కథ నెఱిఁగి యూర్వశినిఁ గాంచి యాశ్చర్యపడి నీ గొప్ప మహిమను దలంచి తన పనికిఁ జింతించెను. అట్టి యవతారము కన్నను కృష్ణా నీ నీలమేఘశ్యామ రూపమే మిక్కిలి రమ్యము.

 

 

 

 

 

దక్ష యాగ విధ్వంసము:

 

ఉ.

గారము సేయఁ దండ్రి విధి గర్వము మీఱ రుషాంధుఁ డయ్యెఁ దాఁ

గ్రూరత నెంచఁ డౌర జనకున్ శివునిన్ భవదంశు దక్షుఁడే

ఘోరము గా నశాంతి మఱి గోరము లంతఁ జెలంగె నీశుపై

మూరిన మచ్చరమ్మున విమోహి యుమాసతి దూఱెనే స్తువిన్

9.     

 

 

 

 

తన తండ్రియైన బ్రహ్మ మిక్కిలి గారము సేయఁ దనను దక్షుఁడు గర్వముతో నంధుఁ డయ్యెను.  క్రూరత్వమునఁ దండ్రిని నీ యంశమునఁ బుట్టిన శివునిని గౌరవింపఁడు. ఘోరముగా నశాంతి మఱియు నాపదలు చెలఁగినవి. ఈశ్వరుని పై ద్వేషముతోఁ దన కూతు రుమా సతినిఁ గూడ యాగ సమయమున నవమానించెను.

 

 

 

 

తే.గీ.

శివుఁడు కనలి యణఁచె నా క్రతువును దక్షు

శిరముఁ దెగటార్చె వేఁడఁగ సురలు ప్రాణ

మొసఁగెఁ బూరించె జన్నము నొసఁగె శాంతి

నెలమి శాంతిద కావు మనిలపురేశ

10.  

 

 

 

 

అంత శివుఁ డలిగి యా క్రతువు నణఁచి దక్షుని శిరము ఖండించెను.  సురలు వేఁడఁగా దక్షుని బ్రతికించెను. జన్నమును బూర్తి చేయించెను. శాంతి నొడఁగూర్చెను. ఓ శాంతిప్రదా యనిల పుర నాథా మమ్ము గావుము.

 

 

 

ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయమునఁ బదునాఱవ దశకము. 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము

(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము)

 

చతుర్థ స్కంధ పరిచ్ఛేదము

దశకము. 17.

ధ్రువచరితము.

 

 

తే.గీ.

తనరె నుత్తానపాదుఁడు మను సుతుండు

సతి సునీతియు సురుచియు నతని సతులు

ప్రీతి సురుచి పైన సునీతినే తలఁపడు

సతము శరణాగతి సునీతి సలిపె నీకు

1.      

 

 

 

 

ఉత్తానపాదుఁడు మనువు కుమారుఁడు. అతనికి సునీతి సురుచి యను వార లిద్దఱు భార్యలు. చిన్న భార్య యైన సురుచిపై రాజునకు మక్కువ యెక్కువ. సునీతిని నాదరింపఁడు. నిత్యము నీకు సునీతి శరణాగతియై యుండెను. 

 

 

 

 

మత్తకోకిల.

తండ్రి యంకము నందు నుండ నిదాన ముత్తముఁ డిష్టతన్

గండ్ర యా సురుచీ సుతుం డటఁ గాంచి యాధ్రువుఁ డార్తితోఁ

దండ్రిఁ జేర సునీతి పుత్రుఁడు దాను నెక్క నదల్చెనే

వేండ్ర మేసర పిన్ని యక్కట ద్వేషు లౌదు రభక్తులే

2.     

 

 

 

 

నిదానముగా నొకనాఁడు సురుచి పుత్రుఁ డుత్తముఁ డను వాఁడు తండ్రి యంకమున నుండ సునీత సుతుఁ డైన ధ్రువుఁడు చూచి తాను గూడ తండ్రినిఁ జేరి నెక్క దల్చఁగాఁ బిన్ని సురుచి వానినిఁ దాపము మీఱ గద్దించెను.  నీకు భక్తులు కాని వారు ద్వేషులే కదా.  

 

 

 

 

చం.

వశుఁ డయి నీదు మాయలకు భార్యకు బద్ధుఁడు గాంచు చుండఁగా

నశని నిభంపుఁ బిన్ని వచ నాలికిఁ గాడ్పడి దుఃఖ మొందుచున్

భృశముగ నేఁగఁ దల్లి కడ  కెంచి భవత్పద యుగ్మ మాత్మ యం

దు శరణు వేఁడుమం చనియెఁ దూర్ణము దుష్కృత కర్మ శాంతికై

3.     

 

 

 

 

 

 

నీ మాయాలకు వశుఁడై భార్యకు విధేయుఁడై తండ్రి చూచు చుండఁగాఁ బిడుగుల వంటి పిన్ని మాటలకుఁ గలఁత సెంది దుఃఖించుచు నేడ్చుచుఁ దల్లి చెంత కేఁగెను. అప్పుడు తల్లి యతనితో నీ పదపద్మములను జిత్త మందు నుంచి నిన్ను శరణు వేఁడు మనెను. అప్పుడు పురాకృత పాపపుఁ బనుల కుప శాంతి కల్గు ననెను. 

 

 

 

 

 

తే.గీ.

విని ధ్రువుండు నిన్నర్చింప మనసు నందు

నిశ్చయించి యైదేండ్ల చిన్ని బుడుతండు

వెడలి పురి మధువనమున నడరి తపము

నిన్ను గూర్చి నారద మంత్ర మెన్ని చేసె

4.     

 

 

 

 

ఆ మాటలు విని యైదేండ్ల ధ్రువుఁడు మనస్సులో నిన్ను స్మరించుచు నగరమును వీడి మధువనమున కేఁగి నారదుఁ డుపదేశించి నట్లుగాఁ దపమును జేయఁ జాగెను. 

 

 

 

 

చం.

జనకుఁడు పుత్ర శోకమునఁ జాల తపించుచు నుండ నారదుం

డనువుగ నంత వచ్చి వసు ధాధిపతిం దగ నూఱడింప శాం

తినిఁ బడసెన్ ధృవుండు నటఁ దీక్ష్ణ తపమ్మును వృద్ధి సేయుచున్

నిను మది నుంచి చేసె నతి నిష్ఠ స్మరించుచుఁ బంచమాసముల్

5.     

 

 

 

 

అంతఁ దండ్రి పుత్రుని కొఱకు మిక్కిలి దుఃఖించు చుండ నారదుఁడు వచ్చి రాజు నూఱడింపఁగ శాంతించెను. ధ్రువుఁ డక్కడ తీక్షణమైన తపస్సును నిష్ఠతో నిన్ను మది నుంచి యైదు మాసములు చేసెను.

 

 

 

 

ఉ.

దిక్కులు పిక్కటిల్ల నతి తీక్ష్ణ తపమ్మున కంత నిర్జరుల్

గ్రక్కున వేఁడ నిన్నతనిఁ గావ దయార్ద్ర మనస్సుతో వడిన్

మక్కువ మీఱ వచ్చితి కుమారున కీయ సు దర్శనమ్మునే

యెక్కి విహంగరాజుఁ గరుణింపఁ జిదాకృతి చిద్రసేక్షకున్

6.     

 

 

 

 

ధ్రువుని తీక్ష్ణమైన తపస్సునకు దిక్కు లల్లాడఁగా దేవతలు ధ్రువునిఁ గావుఁ డని  వేఁడఁగా దేవా దయార్ద్ర హృదయుఁడవై ప్రీతితో నతనికి దర్శనమీయ గరుత్మంతు నధిరోహించి నీ చిద్రూప మను చిదానంద రస వీక్షణ నిమగ్నుఁ డైన ధ్రువుని చెంతకు వచ్చితివి.  

 

 

 

 

తే.గీ.

ధ్రువుని త్వద్దర్శ నోల్ల సాబ్ధి వఱలెడు కు

మారు నీ రూప రసపుఁ గన్నీరు వాని

పలుక నేరని వాని విమల కపోల

మున స్పృశించితి నీ శంఖమునను బ్రీతి

7.     

 

 

 

 

నీ దర్శ నానందపు సముద్రమున మునిఁగిన కుమారుని, నీ రూప మను నమృతమున జనించిన కన్నీటితో నున్న వానినిఁ బలుక నేర్వని వానినిఁ గాంచి నీవు ప్రేమతో నీ శంఖముతో నతని కపోలమున స్పృశించితివి.  

 

 

 

 

తే.గీ

నీదు వేద రూప దరము నెమ్మిఁ దాఁక

జ్ఞానము వడసి పొగడంగ వాని నెఱిఁగి

రాజ్య మనుభవించి చిరము రహిని ధ్రువ ప

దముఁ బడయు మంటివి మఱు జన్మ మిఁక లేక

8.     

 

 

 

 

వేద స్వరూప మైన నీ శంఖము తాఁకఁగనే నతని కమిత జ్ఞానము కలిగెను. నిన్ను స్తుతింపఁగ నాతని భావ మెఱిఁగి చిర కాల రాజ్య సుఖముల ననుభవించి పునర్జన్మము లేని పూజనీయ మైన ధ్రువ పదమును బొందఁగల వంటివి.  

 

 

 

 

తే.గీ.

వెడలి తిటు లని రాజాత్మజుఁడు ముదమ్ము

నంది పొగడ నెల్లరుఁ జేరె నంత పురము

పూర్ణ కాముఁడై నీ కృప మూర నంత

జనకుఁ డరుగ వనమ్ము రాజ్యమ్ము నేలె

9.     

 

 

 

 

ఇట్లని దేవా నీవు వెడలితివి. ధ్రువుఁడు సంతసించి యెల్లరు పొగడు చుండ లబ్ధ కాముఁడై నగరమున కేఁగెను. తండ్రి వనముల కేఁగ నీ కృపతో ధ్రువుఁడు రాజ్య మేలెను.

 

 

 

 

ఉ.

ఉత్తముఁ జంప యక్షుఁ డొకఁ డోర్వక యక్షుల పై రణమ్ము దా

నత్తరి యుద్య మింప మను వప్పుడు గోరఁగ నాపె నాజినే

చిత్తము శాంతి నొంద నటఁ జేరి కుబేరుఁడు సంత సించి నే

నిత్తు వరమ్ముఁ గోరు మన నిమ్ముగ నీ పయిఁ గోరె భక్తినే

10.  

 

 

 

 

ఉత్తముని యక్షుఁ డొక్కఁడు చంపఁగ నోర్వక యక్షులపై యుద్ధము చేయుటకు సిద్ధ పడు చుండ మనువు వచ్చి శాంతించు మన యుద్ధము నాపెను. అంత కుబేరుఁడు సంతసించి వరము కోరుకొను మనెను. అప్పుడు ధ్రువుఁడు దేవా నీ పై ధృఢ మైన భక్తినే కోరుకొనెను.

 

 

 

 

తే.గీ.

అంతమున నీదు భటులు తే నంచితపు వి

మానము ధ్రువ పదమ్మును మాతఁ గూడి

చేరె ధ్రువుఁడు స్వజన పాలశీలి దయను

బాపుమ మరుత్పురపతి నా వ్యాధు లన్ని

11.   

 

 

 

 

చిరకాల రాజ్య పాలనము పిదప దేవా నీ భటులు విమానము తీసికొని రాఁగ ధ్రువుఁడు తల్లితోఁ గూడి ధ్రువ పదము చేరెను. నీ వారి నెల్ల కాపాడు నట్టి దేవా గురువాయూరు నాథా నా వ్యాధులను బాపుము.

 

 

 

ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయమునఁ బదునేడవ దశకము. 

 

 

 

 

 

 

 

 

 

శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము

(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము)

 

చతుర్థ స్కంధ పరిచ్ఛేదము

దశకము. 18.

పృథు చరిత్రము.

 

 

తే.గీ.

ధ్రువ కులజుఁడు యశోమూర్తి యవని ధవుఁడు

నంగ నాముఁడు నిజ సుతుం డధమ చరితుఁ

డౌచు వేనుఁ డుంటఁ గలఁగి వే చనె వని

తలఁచుచు మది నీ పాద పద్మ యుగళమ్ము

1.      

 

 

 

 

ధ్రువుని వంశము వాఁడు కీర్తిమంతుఁ డైన యంగ నామపు రాజు తన సుతుఁడు వేనుఁడు దుష్ట చరిత్రుఁ డౌట గని కలఁత సెంది మనస్సులో నీ పాద పద్మములను దలంచుచు వనమున కేఁగెను. 

 

 

 

 

తే.గీ.

పాపి యైనను వేనుఁడు బల్లిదుండు

భూమి పాల నార్హుం డని పురజనమ్ము

సేయ రాజుగ నతని శాసించె నాపఁ

గ్రతువు లిల మెచ్చుకొం చతిగ నిజ బలము

2.     

 

 

 

 

పాపి యైనను బలవంతుఁ డైన వేనుని పుర జనులు రాజుని చేసిరి. అంత నతఁడు తన బలము నత్యంతము మెచ్చుకొనుచు దేశమునఁ గ్రతువులను జేయరాదని శాసించెను.

 

 

 

 

తే.గీ.

తాప సౌఘము నుడువ హితమ్ము రాఁగఁ

దన్ను మించఁగ లే డిట దైవ మొకఁ డ

ని నిను నిందింప వేనుఁడు ముని వరేణ్యు

లు శపియింప శాపాగ్ని మండె శలభ మన

3.     

 

 

 

 

తాపసులు వేనునకు హితము చెప్పుటకు వచ్చిన వారితో తనను మించిన దైవము లేఁడని పల్కుచు నిన్ను నిందించు చుండ మునులు కోపమున శపింపఁగా వారి శాపాగ్నిని మిడుత వలె మండెను.

 

 

 

 

చం.

మరణము నొంద భూధవుఁడు మౌని నికాయము దుష్ట మాన వో

త్కరమున కెంతయుం గలఁగఁగా జననీ పరి రక్షితాంగ మం

దురు వగు సక్థిఁ ద్రచ్చఁ గలు షోచ్చయ నాశము గాఁగ బాహులం

గరముల రుద్దఁ బుట్టితి సుఖమ్ముగ నీవ తదంగజుండవై

4.     

 

 

 

 

రా జట్లు మరణింప దుష్టమానవులు చెలరేఁగ మునులు చింతించు చుండిరి. అప్పుడు తల్లిచే రక్షింపఁ బడిన వేనుని దేహమునఁ దొడలను మథింపఁగా నతని పాపము లన్నియు దొలఁగినవి.  పిదప నతని బాహువులను జేతులతో రుద్దఁగ దేవా నీ వతని యంగ జాతుఁడవై పుట్టితివి. 

 

 

 

 

తే.గీ.

ముని మతానుచరుఁడు పృథు వన బ్రసిద్ధుఁ

డ వతి వీరుఁడవు వినుతుఁడ వల వంది

మాగధుల చేత వేనార్తి నా గళిత వి

భవ మహి విలునం జేసెతి భాగ్యవతిని

5.     

 

 

 

 

మునుల మతమున కనుగుణముగా నడచుచుఁ బృథు వను పేరునఁ బ్రసిద్ధుఁడ వైతివి. వీరుఁడవు వంది మాగధులచే వినుతుఁడ వైతివి. వేనుని భయమున విభవములు లోనికి జాఱిన భూమిని విల్లు ధరించి భాగ్యవతినిఁ జేసితివి.

 

 

 

 

తే.గీ.

భూమి గోవు గాఁగ సురలు మూర దూడ

లుగ నుచిత పాత్ర లంతఁ చేతఁ గొని పితికి

తివి వివిధవస్తువు లశ నాది నిజ వాంఛి

తమ్ముల యదృచ్ఛ నీ వక్కజమ్ము గాను

6.     

 

 

 

 

అప్పుడు భూమి యావు కాఁగ దేవతలు దూడలు గాఁగ నుచితములైన పాత్ర లందు నన్నము మొదలగు వివిధ వస్తువులను నీవు కోరినవి యెల్ల యథేచ్ఛగా నాశ్చర్యముగాఁ బిదికితివి.

 

 

 

 

తే.గీ.

సన్నుతింతువు మఖముల నిన్నె నీవు

నూఱవ తురగ మేధము మీఱు చుండ

నీచ వేషి చలమరియు దాఁచె హరిని

హరిని నోడించె నంత నీ యాత్మజుండు

7.     

 

 

 

 

యజ్ఞములలో నిన్ను నీవే నుతించు కొను నట్లయ్యెను. వందవ యశ్వమేధ యాగము చేయు చుండ మాత్సర్యశీలుఁడు నీచ వేషమున నింద్రుఁడు యాగపు గుఱ్ఱమును దాఁచెను. అప్పుడు నీ పుత్రుఁ డాయింద్రు నోడించెను.

 

 

 

 

తే.గీ.

మఱలఁ దొడఁగ మ్రుచ్చిల శతమఖుఁడు సప్తి

మును లతని వేల్వఁ దల్ప వహ్నిని విరించి

యాపఁ గ్రతువు పరి సమాప్త మయ్యె దర్శ

న మొసఁగితి వీవు మధుసూదన కృప స్వయము

8.     

 

 

 

 

తిరిగి యింద్రుఁడు దొంగిలింప నుద్యమించిన మును లతనిని నగ్నిలో వేల్వఁ దలఁప బ్రహ్మ గారు వచ్చి వారి నాపెను. క్రతువు పూర్తి యయ్యెను. అప్పుడు మధుసూదనా నీవు స్వయముగ దర్శన మొసఁగితివి. 

 

 

 

 

తే.గీ.

పడసి భక్తి మాత్ర వరము పార్థ పృథువు

దా వసించె గంగా నదీ తటము నందు

దేవ! ముని వరులకు నుపదేశము లొన

రింప సనకాదుల నరసి తింపుగ నట

9.     

 

 

 

 

పృథువు నీ భక్తిని మాత్రము వరముగాఁ బడసి యంత గంగానదీ తీరమున నివసించెను. నీ వొకప్పుడు మునులకు నుపదేశముల నొసంగితివి. అక్కడ నీవు సనకాది మహర్షులను జూచితివి.

 

 

 

 

తే.గీ.

జ్ఞానము వడసి బోధింప సనక ముఖులు

సుతుల నిల్పి రాజ్యమునఁ జనితి వటవికి

నట్టి పృథురూప విభు కృప నరసి నాదు

రోగ చయము ఖండించు మరుత్పుర ధవ

10.  

 

 

 

 

దేవా నీవు పృథుచక్రవర్తి రూపమున సనకాది మునులనుండి సుజ్ఞానము వడసి సుతులను రాజ్యమున నిల్పి యడవికి నేఁగితివి. అట్టి యో పృథురూప గురువాయూరు నాథా దయతో నా రోగములను బాపుము.

 

 

 

ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయమునఁ బదునెనిమిదవ దశకము. 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

                                     

 

 

శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము

(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము)

 

చతుర్థ స్కంధ పరిచ్ఛేదము

దశకము. 19

ప్రాచేతసుల కథ.

 

 

తే.గీ.

పృథువు ముని మనుమఁడు ధర్మ కృత్య రతుఁడు

నంతఁ బ్రాచీనబర్హి  స్వీయ సతి యువతి

శతధృతీ సతి యందు సుమతులఁ గనెఁ బ్ర

చేతసుల నీదు సత్కృప చేత సుతుల

  1.  

 

 

 

 

పృథు చక్రవర్తికి ముని మనుమఁడు ధర్మకార్యములు చేయ నాసక్తి కలవాఁ డయిన  ప్రాచీనబర్హికి నతని భార్య శతధృతికిఁ బ్రచేతసు లను బుద్ధిమంతు లైన సుతులు నీ దయను గల్గిరి. 

 

 

 

 

తే.గీ.

పదుగురు ప్రచేతసులు నీ తపమ్ము నందు

నిరతులై నిజ పిత్రిచ్ఛ నరయ సుతుల

నేఁగిరి పడమటి కడలి కెలమి మీఱఁ

గాంచి రట సుందర సరసి నంచితముగ

  1.  

 

 

 

 

పదిమంది ప్రచేతసులు నీ తపము సేయ నిచ్ఛతోఁ దమ తండ్రి కోరిక కనుగుణముగ సుతులఁ బడయఁ బశ్చిమ సముద్ర తీరమునకు నేఁగిరి. అక్కడ వారొక సుందర సరస్సును జూచిరి.

 

 

 

 

తే.గీ.

అంత వచ్చి చిచ్చఱకంటి యచ్చొటునకుఁ

దనరి నీ యడియలఁ బ్రచేతసులఁ గాంచ

నేర్పె కన్పడి వారికి నీదియౌ క

డింది పొగడు నొకటి నీదు డింగరీఁడ

  1.  

 

 

 

 

అంత నీకు భక్తుఁడే యైన శంకరుఁ డంత నచటికి వచ్చి నీ పాద సేవకు లైన ప్రచేతసులను గాంచి వారికి నీ గొప్ప స్తోత్రములలో నొకటి నేర్పెను .

 

 

 

 

తే.గీ.

నీటి నడుమ నుండి గడన మేటి పగిది

తలఁచు చుండి యేండ్లును బ్రచేతసులు సేయఁ

దొడఁగిరి ధ్రువుని వోలె వా రడరి తబము

నీ తలఁపు రహి తేనె మునింగి తాల్మి

  1.  

 

 

 

 

నీటిలో నుండి నీ స్తోత్రమును గొప్పగాఁ దలఁచుచుఁ బెక్కేండ్లు ప్రచేతసులు తపమును ధ్రువుని వలె  నీ తలంపుల యానంద మను తేనెలో మునిఁగి యోర్పుతోఁ జేయు చుండిరి.

 

 

 

 

తే.గీ.

కొల లలరు జన్నములు సేయఁ గొమరుల తబ

ముల వలనఁ దండ్రి కా దోసములు దొలంగెఁ

గలనితపసి ఱేని కడకు నెలమి వచ్చి

తన్నెఱుఁగు నెఱుక నిడ నంతఁ గనె ముత్తి

  1.  

 

 

 

 

హింసలతోఁ గూడిన యజ్ఞములు తండ్రి సేయ దన కుమారులు చేయు తపము వలన నతనికి పాపము లన్ని తొలఁగినవి. నారదుఁడు రాజు వద్దకుఁ బ్రీతితో వచ్చి యాత్మజ్ఞానము బోధింపఁగాఁ బ్రాచీనబర్హి ముక్తిఁ బడసెను.

 

 

 

 

తే.గీ.

అక్కటిక పిక్కటిలఁ జూపి తయ్య నీదు

పొడ ప్రచేతసులకు మేటి పులుఁగు తేరి

వేల్ప! చుట్టలుఁగు మొదలు పెద్ద కైదు

వు లవి కేళ్ల మెఱయ మేని చెలువ మొప్ప

  1.  

 

 

 

 

కనికరము మీఱ నీవు పక్షీరాజు రథమున దేవా చక్రము మొద లైన మహాయుధములు చేతు లందు వెలుఁగ శరీరపు టంద మొప్ప నీ రూపును బ్రచేతసులకుఁ జూపితివి. 

 

 

 

 

తే.గీ.

చనవు లిచ్చితి వడుగక యనువుగాఁ బ్ర

చేతసులకుఁ జేపట్టున సేవ సేయ

కున్నఁ దల్పఁ జాలును మంచి నొదవఁ జూతు

వగ్గికంటి పొగ డొసంగు నక్కఱలను

  1.  

 

 

 

 

అడుగకయే యుక్తముగాఁ బ్రచేతసులకుఁ గోరిక లిచ్చితివి. అవలంబించి నీ సేవ చేయకున్నను నిన్ను దలంచినఁ జాలు మంచినిఁ జేకూర్చుదువు. ముక్కంటి చెప్పిన స్తోత్ర మవసరములను దీర్చును.

 

 

 

 

తే.గీ.

చెట్టు కూతురుఁ జేపట్టి చెలఁగు వార

లయ్య పదిలచ్చ లేఁడాదు లంత బిడ్డ

దక్షుఁ గని వత్తు రంతటఁ దరలి నాదు

చెంత కంచుఁ గనికరించి తెంతయుఁ దమి

  1.  

 

 

 

 

వృక్ష పుత్రిక మారిషను వివాహమాడి పది లక్షల సంవత్సరములు సుఖముగా నుండి దక్షుఁ డను పుత్రునిఁ బొందుదురు. పిదప నన్ను జేరుదు రని కరుణించితివి.

 

 

 

 

తే.గీ.

అంత వారు చాలించి చేయంగఁ దబము

గాంచి చెట్ల కడిఁది యడ్డు నుంచి కినుక

నఱుక నాపెను నలువ కూన నొసఁగంగఁ

జెట్లు గైకొని కడు మురిసిరి సతమ్ము

  1.  

 

 

 

 

అంతఁ బ్రచేతసులు తపము చేయుట చాలించి నీటి నుండి పైకి వచ్చి మిక్కిలి యడ్డుగా నున్న చెట్లను గాంచి కోపముతో నఱుకఁ జాగిరి. అప్పుడు వారిని బ్రహ్మ యాపెను. చెట్లు తమ కూతురు నొసఁగఁగఁ గైకొని చిరకాలము మిక్కిలి సంతసించిరి.

 

 

 

 

తే.గీ.

కొడుకును బడసి దక్షునిఁ గడు నొనర్చి

జన్నములు ప్రచేతసు లంతఁ జదలు తపసి

తెలుప ముత్తి తెఱవు చేరితి రట నిన్ను

వారు కాపాడు నన్ను గాడ్పూరు సామి

  1.  

 

 

 

 

 

అంత వారు కొడుకు దక్షునిఁ బడసి యనేక యాగములు చేసి నారదుఁడు ముక్తి మార్గము దెలుపఁ  బ్రచేతసులు నిన్ను జేరిరి. ఓ గురుయూరు నాథా నన్ను గాపాడుము.

 

 

 

ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయమునఁ బందొమ్మిదవ దశకము. 

చతుర్థ స్కంధ పరిచ్ఛేదము సమాప్తము.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము

(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము)

 

పంచమ స్కంధ పరిచ్ఛేదము

దశకము. 20.

ఋషభ యోగీశ్వర చరిత వర్ణనము.

 

 

తే.గీ.

తనయుఁ డాగ్నీధ్రుఁడు ప్రియవ్రత వసుధేంద్రు

నకు నతని కుమారుఁడు నాభి నర వరేణ్యుఁ

డడరి యొనరింప జన్నము లంతఁ దనిసి

యెలమి నిడితి నీ దర్శన మిష్టి మధ్య

1.      

 

 

 

 

ప్రియవ్రతుఁ డను రాజునకు నాగ్నీధ్రుఁడు తనయుఁడు. ఆగ్నీధ్రుని కొడుకు నాభి. అతఁడు యజ్ఞము లనేకములు చేసెను. అతనికి యాగ సమయమున దేవా సంతృప్తి సెంది నీవు దర్శన మిచ్చితివి.

 

 

 

 

తే.గీ.

మునివరేణ్యు లర్చించి సముచితముగ న

డిగిరి నీ సదృశు సుతుని వగపు దీర

రాజునకు నంత స్వయముగ నే జనింతు

వేగ యని మాయ మైతివి విశ్వమూర్తి!

2.     

 

 

 

 

నీవు ప్రత్యక్షము కాఁగా నచ్చటి మునులు నిన్ను స్తుతించి రాజైన నాభికి దుఃఖము తీర  నీకు సమానుఁ డగు పుత్రు నిమ్మని కోరిరి. నీకు సమానుఁడవు నీవ కనుక నీవే స్వయముగ రాజునకు కుమారునిగా జనింతు నని యదృశ్యఁడ వైతివి.

 

 

 

 

ఉ.

నాభి సతీ శిరోమణికి నందనుఁ డైతివి మేరుదేవికిన్

శోభిల నీదు యంశమ వసుంధరలో ఋష భాభిధానుఁడా

ప్రాభవ మొప్ప సద్గుణములం జరియింపఁగ మానవాళియే

వే భయముల్ దొలంగ రహి వెల్గెను గాంచుచు నిన్ను మాధవా

3.     

 

 

 

 

మేరుదేవీ నాభి దంపతులకు నీ యంశము శోభిల్ల ఋషుభుఁ డను పేరున సకల సద్గుణములతో దేవా నీవు పుట్టితివి. మాధవా మానవాళి యెల్ల భయము లన్నియుఁ దొలఁగఁగ నిన్ను నిత్యము గాంచుచు సంతోషముతో నుండెను. 

 

 

 

 

తే.గీ.

ముజ్జగము లేలఁ గల్గు నీ కజ్జనకుఁడు

నాభి యిచ్చి రాజ్యమ్మును నాతిఁ గూడి

యేఁగి వనము సేవించుచు నెలమి నిన్ను

నెగఁడి చేరె రహిఁ బదమ్ము నీదు పదము

4.     

 

 

 

 

ముల్లోకములను బాలింపఁ గల్గు నీకు నీ తండ్రి రాజ్యము నొసఁగి భార్యతో వనమున కేఁగి నిన్ను సేవించుచు సంతోషముతోఁ దుదిని నీ ధామము సేరెను.

 

 

 

 

తే.గీ.

చలము కిన్కయు వే పూని బలరిపుండు

వర్షముల నాపె నజనాభ వర్ష మందు

నీదు గొప్పను గన లేక నిజ మహత్త్వ

మునఁ గురిసితివి బల్వర్షములు స్వ జగతి

5.     

 

 

 

 

నీ మహత్త్వము నోర్వక ద్వేషము కోపము నూని యింద్రుఁడు వర్షములు భరత వర్షమునఁ గురియ కుండఁ జేసెను. అప్పుడు నీ మాహాత్మ్యమున జగతిలో పెక్కు వర్షములను గురిపించితివి. 

 

 

 

 

తే.గీ.

తనరినను నిజాత్మానందమున నొసంగ

నింద్రుఁడు జయంతి యను కన్య నెలమిఁ బెండ్లి

యాడి కనెను బుత్ర శతము నందుఁ బెద్ద

వాఁడు భరత నామమ్మునఁ బరఁగినాఁడు

6.     

 

 

 

 

ఆత్మానందమునను వెలిఁగినను ఋషభుఁడు  దేవేంద్రుఁడు జయంతి యను కన్య నీయఁగ రహిని బెండ్లియాడి నూర్గురు పుత్రులను గనెను. అందుఁ బెద్ద వాఁడు భరతుఁడు.

 

 

 

 

తే.గీ.

సుతులఁ దొమ్మండ్రు యతు లైరి పతు లయిరి ము

రియలకు భరత వర్షమం దయిదు నలుగు

రు మిగిలిన యెనుబది యొకండ్రు భరతుండు

గాక తపమున విప్ర పుంగవు లయి రిల

7.     

 

 

 

 

అందుఁ దొమ్మండుగురు సన్యాసు లైరి. తొమ్మండుగురు భరత వర్షమున నాయా ఖండములకు రాజు లైరి. భరత చక్రవర్తి కాక మిగిలిన ఎనుబది యొక్క మంది తపములు సేసి విప్రు లైరి.

 

 

 

 

తే.గీ.

మునుల ముందఱ ఋషభుండు పుత్రులకు వి

రక్తి భక్తి ముక్తి గతులు యుక్త రీతి

నుడివి సన్న్యాసి యయి చనె జడుఁడుగాఁ బి

శాచిగను మత్తుని పగిది చక్రహస్త!

8.     

 

 

 

 

ఋషభుఁడు మునుల సభలో పుత్రులకు విరక్తి, భక్తి, ముక్తి మార్గములు బోధించి సన్న్యాసి యై జడునిగా మత్తుని వలె పిశాచిగాఁ గనఁ బడుచు దేవా యెచటికో చనెను.

 

 

 

 

తే.గీ.

స్వయముగఁ బరాత్ముఁడ వయినఁ బరుల కిడుచు

బోధ నవమానము లకట పొందు చుండి

చెందక వికారములు హర్ష సిక్త మనము

నఁ జరియించు చుంటివి మహి నలిననాభ  

9.     

 

 

 

 

స్వయముగా నీవు పరమాత్ముఁడ వైన నితరులకు జ్ఞానము నొసఁగుచు నవమానములను బొందుచు వికారము సెందక హర్ష మగ్న చిత్తమున ధరలోఁ దిరుగు చుంటివి.

 

 

 

 

తే.గీ.

అజగర వ్రత మ్మూని స్వయము పరాత్మ

వయ్యు గోమృగ కాక నిభాచరణము

నఁ గుటకాచలమున దహనం బయితివి

తాపములు వాపు నావి వాతపుర నాథ!

10.  

 

 

 

 

సర్ప వ్రతము నూని స్వయముగఁ బరమాత్మ వయ్యు గోవు, లేడి, కాకుల వలె చరించుచు నీవు కుటకాచలమున దావాగ్నిలో దహన మైతివి. ఓ గురువాయూరు నాథా నా తాపములను బాపుము.

 

 

 

ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయమున నిరువదవ దశకము. 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము

(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము)

 

పంచమ స్కంధ పరిచ్ఛేదము

దశకము. 21.

జంబూ ద్వీపాదుల భగవదుపాసనా వర్ణనము.

 

 

ఉ.

ఉర్వికి మధ్య భాగమున నొప్పు నిలావృత వర్ష మందు నా

పార్వతిఁ దొట్టి దివ్యతమ భామలు మాత్రమ వెల్గుచుండఁగన్

శర్వుఁడు మంత్ర వాక్కుల భృశమ్ము నుతింప సుకర్షణాత్మకా

పర్వఁగ భక్తి నిత్యమును బన్నుగ వేఁడెద నీదు నీడకై

1.      

 

 

 

 

భూమికి మధ్య నున్న యిలావృత వర్షమునఁ బార్వతి మొదలగు దేవ కాంతలు మాత్రము ప్రకాశించు చుండ శంకరుఁడు మంత్ర వచనములతో నుతించు నట్టి   సంకర్షణాత్మకమైన నిన్ను  భక్తితో నిత్యము నీ యాశ్రయమునకై వేడెదను.

 

 

 

 

తే.గీ.

అయ్యిలావృత పూర్వము నందుఁ గలదు

వర్ష మదియ భద్రాశ్వము వారువంపుఁ

దలను శ్రుతులఁ గాచిన నిన్ను దలఁతు నుతుల

మునులు భద్రశ్రవులు కొల్త్రు నిను ననిశము

2.     

 

 

 

 

ఆ యిలావృత వర్షమునకుఁ దూర్పు దిక్కున భద్రాశ్వవర్షము కలదు. హయగ్రీవుని రూపమున వేదములను గాచిన నిన్ను నుతింతును. భద్రశ్రవు లను మునులు నిన్ను నిత్యము  గొల్తురు.

 

 

 

 

తే.గీ.

దక్షిణపు హరి వర్షపుఁ దలము నందు

నున్న ప్రహ్లాద ముఖ నృపా లోత్త మాభి

సేవిత శ్వేత వర్ణ మహా వపువు వి

శుద్ధ బోధదు నృహరిఁ గొల్చుచు నుతింతు

3.     

 

 

 

 

ఇలావృతమునకు దక్షిణమున నున్న హరి వర్షములో ప్రహ్లాదుఁడు మొదలగు నుత్తమ రాజులచేఁ  గొలువఁ బడు నట్టి, తెల్లని దేహమున వెలుఁగునట్టి,  శుద్ధజ్ఞానము నిచ్చు నట్టి  నృసింహా నిన్ను సేవించుచు నమస్కరింతును. 

 

 

 

 

తే.గీ.

అపర దిశఁ గేతుమూల వర్షాఖ్య మలరు

చుండు లీలఁ దనరు దీవు శోభఁ గూర్ప 

రమకు మరుని మే నూనియుఁ బ్రజల పతి సు

తులు రమయు నుతింప నిను నే గొలుతు రతిని

4.     

 

 

 

 

ఇలావృతమునకుఁ బశ్చిమమునఁ గేతుమూల మను వర్షము కలదు. అక్కడ లక్ష్మీదేవికి శోభ నొసంగుచు లీలతో మన్మథుని యాకారమున నుండి ప్రజాపతి పుత్రులు రమా దేవి కీర్తించుచుండ వెలుఁగు నిన్ను బ్రీతితోఁ గొలుతును.

 

 

 

 

ఉ.

ఉత్తర దిక్కునం దనరు నున్నత రమ్యక వర్షమే ధవుం

డుత్తముఁ డైన యా మనువు యుక్త విధమ్మునఁ జేయ సేవలే

నిత్తె మమత్స రాత్మలను నిల్చుచు నుండెడి భక్త వత్సలా

సత్తెపు మత్స్య రూపుఁడ విశాల జగత్ప్రభు కొల్తు నిం దమిన్

5.     

 

 

 

 

ఇలావృత వర్షమునకు నుత్తర దిక్కున రమ్యక వర్షము కలదు. రాజైన వైవస్వత మనువు  తగిన రీతి నిత్యము సేవలు సేయు చుండ మత్సరములేని వారి యాత్మల నిల్చు భక్త వత్సలా మత్స్య రూపుఁడా జగన్నాథా నిన్ను రక్తితోఁ గొల్తును.  

 

 

 

 

తే.గీ.

దానికి నుదీచి నింపు నొదవ హిరణ్మ

యమ్ము నా వర్ష మునఁ గమఠాకృతి పర

గంగఁ గొల్వఁ బితరు లందు ఘనుఁడు నర్య

ముండ యట్టి చిదానంద మూర్తి! కొలుతు

6.     

 

 

 

 

రమ్యక వర్షమునకు నుత్తర దిక్కున హిరణ్మయ వర్షము కలదు. అందుఁ గూర్మపు రూపమున నున్న నిన్ను బితృగణములలో శ్రేష్ఠుఁ డర్యముఁడు గొలుచును. అట్టి చిదానంద స్వరూపా నిన్ను నేను గొల్తును.

 

 

 

 

తే.గీ.

ధరణి సేవింప నుతుల నుత్తర కురుప్ర

దేశముల మేఘములఁ దాఁకు దిట్ట కోఱ

లలర సేవింప విజ్ఞులు మెలఁగు నట్టి

రాజ రక్షించు యజ్ఞవరాహమూర్తి!

7.     

 

 

 

 

ఉత్తర కురు దేశముల భూదేవి నిన్ను సేవించు చుండును. మేఘములను దాఁకు కోఱలు కల యజ్ఞవరాహ మూర్తీ జ్ఞానులచే నుతింపఁ బడుచు మెలఁగు ప్రభూ నన్ను రక్షించు. 

 

 

 

 

తే.గీ.

కింపురుష వర్ష మది దక్షిణంపు టాశ

నుండ జానకీ రాముల గండఁడు హను

మ నుతియించు చుండఁగ రమ్య తనువిలాస

రామ రూప విష్ణువ నాకు రక్ష నిమ్ము

8.     

 

 

 

 

ఇలావృత వర్షమునకు దక్షిణ దిక్కున కింపురుష వర్షము కలదు. అచట జానకీరాములను హనుమంతుఁడు సేవించు చుండును. అట్టి రమ్యమైన రామాత్మక విష్ణూ నన్ను రక్షించుము.

 

 

 

 

తే.గీ.

భార తాఖ్య ఖండమునను నార దాది

మునులు సాంఖ్య యోగ నుతులఁ దనరి కొలువ

సాధు జన చిర రక్షకై జన్మ నొంది

న నరసఖుఁడ నారాయణ నన్ను బ్రోవు

9.     

 

 

 

 

భరత ఖండమున నారదాది మహర్షులు సాంఖ్య యోగ స్తుతలచే నుతియించు చుండ సాధు జనులను రక్షించుటకు నవతరించిన నరునకు సఖుఁడ వైన  నారాయణా  నన్ను రక్షించు.

 

 

 

 

చం.

రవి తను వౌదు ప్లక్షమున రాజ తనుద్యుతి శాల్మలమ్మునన్

హవనమ వా కుశాఖ్యమున నౌదువు వాయువు శాక మందు నీ

వ విధివి యౌదు పుష్కరము నందు జలాధిపుఁ డౌదు క్రౌంచమం

దవనిఁ జెలంగి నీవ యిటు లౌదువు సేవ్యుఁడ వెల్ల వారికిన్

10.  

 

 

 

 

ప్లక్షద్వీపమున సూర్య రూపమున, శాల్మలద్వీపమునఁ జంద్ర రూపమునఁ, గుశ ద్వీపమున నగ్ని రూపమున శాకద్వీపమున వాయువు, పుష్కర ద్వీపమున బ్రహ్మగాఁ గ్రౌంచ ద్వీపమున వరుణ రూపమున నందఱిచే సేవింపఁ బడుదువు.   

 

 

 

 

తే.గీ.

ధ్రువ ముఖోడువులు గ్రహము లవియ నీ క

వయవములు గాఁగ విబుధు లుపాసన మొన

రింప శింశుమార వపువ యింపుగాను

మూడు సంధ్యల దేవ యాపు నరకమ్ము

11.   

 

 

 

 

ధ్రువాది నక్షత్రములు గ్రహములు నీకు నవయవములు కాఁగ విబుధులు మూడు సంధ్య లందు శింశుమార రూపమున నిన్ను నుపాసించు చుందురు. అట్టి దేవా నాకు నరకము రాకుండ నాపుము.

 

 

 

 

తే.గీ.

ఆదిశేషువు పాతాళ మందు నీవు

కదలు పోగులు మెఱయ వేయి దల లసిత

వస్త్ర! హలధర! సేవిత ఫణికళింగ!

రోగములు నావి మాపు మరుత్పుర ధవ!

12.   

 

 

 

 

 

పాతాళమున నాది శేషుఁడవు కదలెడు పోగులతో వేయి తలలతో నీలి వస్త్రములతో నున్నవాఁడా నాగలి ధరించిన వాఁడా, నాగాంగనలచే సేవింపఁ బడువాఁడా గురువాయూరు నాథా నా రోగముల నెల్లఁ బాపుము. 

 

 

 

ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయమున నిరువది యొకటవ దశకము. 

పంచమ స్కంధ పరిచ్ఛేదము సమాప్తము.

 

 

శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము

(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము)

 

షష్ఠ స్కంధ పరిచ్ఛేదము

దశకము 22.

అజామిళోపాఖ్యానము.

 

 

తే.గీ.

భూసురుఁ డజామిళుఁ డనంగ వాసి కెక్కె

ధర్మ రతిఁ జరించుచు గృహస్థ పథ మందు

మదవతిఁ గులట నశ్లీల మహిళఁ గాంచె

నడవి కేఁగి జనకు నాజ్ఞ నచ్చట విభు

1.      

 

 

 

 

అజామిళుఁ డను విప్రుఁడు గృహస్థధర్మము నాచరించుచుఁ బ్రసిద్ధి కెక్కెను. దేవా తండ్రి పనుపున నొక నాఁ డతఁ డడవి కేఁగి యచట మదముతో నున్న యశ్లీల చరిత్ర కులట నొక దానినిఁ జూచెను.

 

 

 

 

తే.గీ.

శాంతుఁ డైనను బ్రకృతిని జాణ తగుల

మున నధర్మ చరితమున ముసలి వాఁడు

నయ్యెఁ బ్రీతి నొసంగి నిజాంగజునకు

నీదు నామముఁ బ్రేమించు నిత్య మతఁడు

2.     

 

 

 

 

స్వభావముగా శాంతమున్న వాఁ డైనను జాణయైన యా స్త్రీ ప్రేమలోఁ బడి యధర్మముగాఁ జరించుచు ముసలి వాఁ డయ్యెను. తన పుత్రునకుఁ బ్రీతితో దేవా నీ నామము నిడి నిత్య మతని యం దిష్టుఁ డయ్యెను.

 

 

 

 

మ.

అవసానంపుఁ దఱిన్ భయంకరులు ధర్మాసన్నులామువ్వురం

గవియం గాంచి యవారితమ్ము నుసుఱుల్ గైకొంచుఁ బోవంగ సుం

త విరాజిల్లఁగఁ బూర్వ బుణ్యమున నీధ్యానంపు మేల్వాసనే

నవ సత్వమ్మున భీతిఁ బిల్చె సుతునిన్ నారాయణా యం చటన్

3.     

 

 

 

 

చివరి దశలో భయంకరు లైన యమభటులు మువ్వురు తన దరికిఁ జేరి ప్రాణములు గొని పోవు తరి పూర్వ పుణ్యమున నీ ధ్యాన వాసనలు కొంచె ముండ భీతితోఁ దన కొడుకును శక్తి తెచ్చుకొని నారాయణా యని పే రుచ్చరించి పిలిచెను.

 

 

 

 

తే.గీ.

పాపి యైనను నీ పేరు పాఱ నోట

నా మహిమ మాత్రమున నంత నంద మొప్పు

వారు పట్టు బట్టల నున్న వారు నీదు

సేవకులు చతుర్భుజులు వేంచేసి రెదుట

4.     

 

 

 

 

పాపాత్ముఁ డైనను నీ పేరు నోట రాఁగ నా మహిమతో నంద మైన వారు పట్టు బట్టల నున్న వారు నాల్గు చేతులు వెలయు వారు నీ సేవకు లెదుట ప్రత్యక్ష మైరి.

 

 

 

 

తే.గీ.

పాశము తగిల్చి లాగఁగఁ బాశిభటులు

వీడుఁ డంచు వారింపఁగ విష్ణుభటులు

పాశి భటు లంత భూసురు పాప కాయ

మెల్ల వారికిఁ దెల్పిరి తెల్లముగను

5.     

 

 

 

 

యమపాశమును దగిల్చి యమభటులు లాగఁగ నీ సేవకులు వీడుఁ డని వారించిరి. అంత యమభటులు వారికి నతని పాప సంచయము నెల్ల వివరముగాఁ దెల్పిరి.

 

 

 

 

ఉ.

పాపము లున్నఁ జేసినను వానికి నిష్కృతి దండనమ్ము లే

రూపునఁ జేయ నొప్పగు విరుద్ధము పండితు లార నీతికిం

బాపము మీరు నిష్కృతికిఁ బన్నుగ నర్థము నేర్వ నోపరే

శ్రీపతి! పల్కి రివ్విధిని శ్రేష్ఠ తరమ్ముగ నీదు సేవకుల్

6.     

 

 

 

 

పాపములు చేసినను వానికి ప్రాయశ్చిత మొనర్చినచో దండనములు విధించుట తగునే? ఓ దండ నీతి పండితులార నీతి కిది విరుద్ధము. మీకు నిష్కృతి యర్థము తెలిసి నట్లు లేదు. శ్రీనాథా నీ సేవకు లిట్లు వారితో శ్రేష్ఠముగాఁ బల్కిరి.     

 

 

 

 

ఉ.

పాపము లాఱు వేదములు పల్కు వ్రతమ్ముల నిశ్చయమ్ముగా

నోపవు రూపు మాపఁగఁ దదుత్థిత వాసన లెల్ల నెన్నడుం

బాపును రెంటి నింపుగను మాధవ పావన పాద సేవయే

శ్రీపతి! పల్కి రివ్విధిని శ్రేష్ఠ తరమ్ముగ నీదు సేవకుల్

7.     

 

 

 

 

వేదములు చెప్పు వ్రతముల వలనఁ బాపము లాఱును. కాని వాని యొక్క  వాసనలను నిశ్చయముగా నవి  మాప లేవు. మాధవ పాద సేవ యా రెంటిని నార్ప గలదు. శ్రీనాథా నీ సేవకు లిట్లు శ్రేష్ఠముగాఁ బల్కిరి.     

 

 

 

 

తే.గీ.

జన్మజన్మలఁ జేసిన శత సహస్ర

పాపముల కయ్యె నిష్కృతి బాఁపఁ డుచ్చ

రింప హరినామ మార్తిని యింపుగాను

బల్కి రివ్విధిఁ బ్రభు నీదు భటులు మించి

8.     

 

 

 

 

విప్రుఁడు హరినామ ముచ్చరింపఁగనే జన్మజన్మల యందుఁ చేసిన వేల పాపములకుఁ బ్రాయశ్చిత్త మైనది. నీ భటు లిట్లు వారితోఁ బల్కిరి. 

 

 

 

 

తే.గీ.

అఘముల హరించు హరి కీర్త నాళి నేర

క నొనరించిన ననలము కాష్ట చయము

నౌషధము రుజల దహించు నట్లు మహిమఁ

బల్కి రివ్విధిఁ బ్రభు నీదు భటులు మించి 

9.     

 

 

 

 

తెలియక చేసినను హరికీర్తనము పాపములను, కఱ్ఱల నగ్ని దహించు నట్లు, నౌషధములు రోగములను బాపు నట్లు, హరించును. నీ భటు లిట్లు పల్కిరి.

 

 

 

 

తే.గీ.

చనిరి యమ భటు లింపుగ విని భవద్భ

టులును వెడలి రజామిళుఁడును దలంచు

చు నిను నిత్యము కతిపయ దినముల కల

భటులు తోడు రాఁ జేరె నీ పదము తుదకు

10.  

 

 

 

 

ఈ మాటలు విని యమ కింకరులు వెడలిరి. నీ భటులు కూడ నేఁగిరి. అజామిళుఁ డంత నిత్యము నీ నామమును దలఁచుచుఁ గొన్ని దినములకు నీ భటులు తోడు రాఁగ నీ దరికిఁ జేరెను. 

 

 

 

 

తే.గీ.

ఇది విని యముండు భీతిఁ దనదు ననుచర

వర్గమును విష్ణుభక్తుల పాలి కేఁగఁ

గూడ దంచు శాసించె ముకుంద! యట్టి

వాతపుర నాథ! నన్ను గాపాడు మయ్య

11.   

 

 

 

 

ఈ కథ విని యముఁడు భయముతోఁ దన భటులను విష్ణు భక్తుల జోలికిఁ బో రాదని శాసించెను. అట్టి ముకుందా గురువాయూరు నాథా నన్ను రక్షింపుము.

 

 

 

ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయమున నిరువది రెండవ దశకము. 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము

(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము)

 

షష్ఠ స్కంధ పరిచ్ఛేదము

దశకము 23.

చిత్రకే తూపాఖ్యానము.

 

 

తే.గీ.

ప్రీతి దక్ష నాముండు ప్రాచేతసుం డ

పరుఁడు పుత్రార్థి సేయ సేవ లధికమ్ము

నీకు నష్ట భుజములఁ గన్పించి తీ వ

సిక్ని సతిఁ జేసి వరము నిచ్చితి వతనికి

1.      

 

 

 

 

ప్రచేతసుల పుత్రుఁ డైన దక్షుఁడు, బ్రహ్మసుతుఁడు దక్షున కితరుఁడు, పుత్రులఁ గోరి నీ కధికముగా సేవలు చేయఁగా నీ వెనిమిది భుజములతో నతనికి దర్శన మిచ్చి యసిక్ని యను దానిని భార్యగా నొసఁగి యతఁడు కోరిన వరమును గూడ నిచ్చితివి.

 

 

 

 

తే.గీ.

వేలు పదునొకండు సుతులు లీలఁ బుట్ట

నతనికి సురముని పలుక నరయ నెల్ల

రంత నీదు తెఱవు దక్షుఁ డంత మునినిఁ

ద్రిమ్మరిగ శపింప దయగ నమ్ముని కొనె

2.     

 

 

 

 

అంత దక్షునకు పదునొకండు వేల మంది పుత్రులు పుట్టిరి. వారెల్లరు నారదముని యాజ్ఞను దేవా నీ మార్గమునఁ జనిరి. దక్షుఁ డప్పుడు కోపించి నారదుని ద్రిమ్మరిగ నుండు మని శపించెను. దానిని నారదుఁడు దయగా నెంచి  స్వీకరించెను.

 

 

 

 

తే.గీ.

కలిగి రఱువది మంది సుకన్య లంత

విశ్వరూపుఁడు మనుమని పేర్మి సుతుఁడు

నీదు స్తోత్ర కవచ మింద్రునికి నొసంగ

జయ మలరె నీ మహిమ లెల్ల జయము లొసఁగు

3.     

 

 

 

 

అంత దక్షునకు నరువది మంది పుత్రికలు కల్గిరి. అతని మనుమని కుమారుఁడు విశ్వరూపుఁ డను వాఁడు నీ స్తోత్రమైన నారాయణ కవచము నింద్రునకు నిచ్చెను. దానితో నింద్రునకు జయము లభించెను. దేవా నీ మహిమ లన్నియు జయ కారకములే.

 

 

 

 

చం.

మును పట శూర సేన వర భూమిని నేలెడు చిత్రకేతు నా

మ నరవరుం డపుత్రుఁడు కుమారుని నంగిరసుం డనుగ్రహిం

చినఁ గనె నంత వాఁ డవిసె శీఘ్రమ చంప సపత్ని వర్గమే

మునిఁగెను రాజు దుఃఖమున మూరి వశం బయి నీదు మాయకున్

4.     

 

 

 

 

పూర్వము శూరసేన దేశము నేలెడు చిత్రకేతుఁ డను రాజునకు పుత్రులు లేరు. అంగిరసుఁ డనుగ్రహింపగా నతనికి పుత్రుఁడు కల్గెను. ఆ పుత్రుఁడు సవతి తల్లుల చేతఁ జంపఁబడెను. రాజు నీ మాయకు లోబడి దుఃఖమున మునిఁగెను. 

 

 

 

 

తే.గీ.

అంగిరసు గూడి నారదుఁ డంతఁ జేరి

తనయు నాత్మను జూపింప దయ నతండు

నే నెవరి సుతఁ డనని ప్రశ్నింప మోహ

మణఁగ నృపు నిల్పెఁ దపసి నీ యర్చనలను

5.     

 

 

 

 

అంగిరసునితోఁ గలసి నారదుఁడు వచ్చి కృపతో  రాజునకు కుమారుని యాత్మను జూపించెను.  ఆ కొడుకు వారినిఁ జూచి తా నెవరి కొడుకు నని ప్రశ్నించెను. అప్పుడు రాజునకు మోహ మంతయు నశించెను. అప్పుడు దేవా నారదుఁడు రాజును నీ యర్చనలలో మునుఁగు నట్లు చేసెను.

 

 

 

 

తే.గీ.

స్తోత్ర మంత్రములు నలువచూలి నేర్ప

నిన్ను నాదిశేషు తనువు నెమ్మిఁ గొలువ

సత దినముల విద్యాధర పతియె కాఁగ

సుస్థిర మతిని సేవించు చుండె నిన్ను

6.     

 

 

 

 

 

నారదుఁడు రాజునకు నీ స్తోత్ర మంత్రములు నేర్పెను. ఆ మంత్రముల రాజు ని న్నాదిశేషువు రూపమునఁ గొలిచి యేడు దినములలో విద్యాధరులకు నధిపతి యయ్యెను. తదనంతరము కూడ చిత్రకేతువు స్థిర చిత్తమున నిన్ను సేవించు చుండెను.

 

 

 

 

తే.గీ.

తమ్మి క్రోవి తెలు పలరఁ దలలు వేయి

మెఱయఁ బొగడు సిద్ధగణము మెలఁగఁ చుట్టు

నిలిచి తీ వతని యెదుట నలరి నుతులఁ

దత్త్వము నుడివి యైతి వంతర్హితమ్ము

7.     

 

 

 

 

దేవా యతని స్తుతులకు మెచ్చి నీవు తెల్లని పద్మముల వర్ణముతో వేయి తలలతో నాదిశేషునిగ సిద్ధ గణములు చుట్టు నుండి పొగడుచుండ నతనికి ప్రత్యక్ష మైతివి.  అంత నతనికి నాత్మ తత్త్వము నొసఁగి యంతర్ధాన మైతివి.

 

 

 

 

తే.గీ.

నీదు భక్తశిఖామణి నెమ్మి నుండె

నీ గుణగణ కీర్తనముల నేల యందు

లక్ష లక్షల యేండ్లు సలక్ష ణేందు

వదన లున్నను విరహిత బంధములను

8.     

 

 

 

 

నీ భక్తుఁడు చిత్రకేతువు నీ గుణ గణములను కీర్తించుచు లక్షణవతు లైన స్త్రీ లనేక లుండ దన్ను  గొలుచుచు బంధములఁ జిక్కక లక్షల యేండ్లు భూ మండలమున నుండెను.

 

 

 

 

ఉ.

కోరిక లెల్ల వీడఁ దలకొంచును నీదగు  ప్రేరణమ్మునం

జేరి మునీంద్ర సంచయము చెన్నుగఁ గొల్చుచు నుండ భక్తితోఁ

దోరపు వెండికొండను వధూమణి పార్వతి యంక మెక్కఁ గే

దారునిఁ గాంచి నవ్వఁగ సుదారుణ శాపము నిచ్చె దేవియే

9.     

 

 

 

 

అంత చిత్రకేతువు యత్నించి కోరికలను వీడి  నీ ప్రేరణముననే వెండికొండకు నేఁగెను. అచ్చట మునులు కొల్చుచుండఁ దన యొడిలో పార్వతీ దేవి నుంచిన శంకరునిఁ జూచి నవ్వెను. పార్వతి యంత కోపముతో నతనిని శపించెను.  

 

 

 

 

ఉ.

అడలఁడు శాప మోచనము నక్కట కోరఁడు పార్వతీ సతిం

బుడమిని వృత్ర దైత్యుఁ డయి పోరున శక్రున కాత్మ తత్వముం

గడు దయఁ జెప్పి శత్రునకు గ్రక్కున మాయము సేసి మోహముం

దడఁబడ కుండఁ జేరె నుచితమ్ముగ నీదు పథమ్ము శ్రీహరీ

10.  

 

 

 

 

చిత్రకేతువు శాపమునకు భయపడ లేదు. పార్వతిని శాప విమోచన మడుగ లేదు.  అంత భూమిపై వృత్రునిగ జన్మించి శత్రువైన యింద్రునకు నాత్మ తత్త్వము నేర్పి యాతని మోహమును గూడ మాయము చేసి తడఁబాటు లేక నీ ధామము చేరెను. 

 

 

 

 

తే.గీ.

నిన్ను నర్చించి దితి  యింద్రుని వధ కొఱకుఁ 

గనె మరుత్తుల సఖు లైరి కౌశికునకు

వారు చెడుఁ గోరి కొలిచిన వఱలు శుభమ

యట్టి నీవు గావుమ నన్ను ననిల పురప

11.   

 

 

 

 

దితి యింద్రుని వధించుటకు నిన్ను నర్చించి మరుత్తులను గనెను. కాని వారు శక్రునకు మిత్రు లైరి. చెడు గోరి నిన్ను గొలిచినను శుభములే కల్గును. అట్టి గురువాయూరు నాథా నన్ను రక్షింపుము.  

 

 

 

ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయమున నిరువది మూడవ దశకము. 

షష్ఠ స్కంధ పరిచ్ఛేదము సమాప్తము.

 

 

 

 

 

 

 

 

శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము

(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము)

 

సప్తమ స్కంధ పరిచ్ఛేదము

దశకము 24.

ప్రహ్లాద చరిత వర్ణనము .

 

 

ఉ.

శ్వేత వరాహ రూపమునఁ జేరి వధింప హిరణ్య నేత్రునిన్

భూతము దా హిరణ్యకశిపుం డను జ్యేష్ఠుఁడు సేసె నిర్జ రా

రాతి సదస్సు నందుఁ బ్రతిరంభము దుఃఖము మీఱగా మహా

భూత ఖరప్రతిజ్ఞ నిను బోరునఁ జంపెద నంచు మాధవా

1.      

 

 

 

 

శ్వేతవరాహ రూపమున నీవు హిరణ్యాక్షునిఁ జంపఁగ నన్నగా వెలసిన హిరణ్యకశిపుఁడు రాక్షస సభలో కోపము, దుఃఖము పొంగఁగ మాధవా నిన్ను యుద్ధములోఁ జంపెదనని పిశాచపు ఘోర ప్రతిజ్ఞ  సేసెను.

 

 

 

 

చం.

తప మొనరించి మిక్కిలి విధాత గుఱించి రయమ్మునన్ వర

మ్ముపడసెఁ జావు లేమి సుర భూజన జంతు చయాదులం  జెలం

గి పొగరుతో దివిన్ గెలిచె ఖిన్నునిఁ జేసి బలారి నీది యై

న పుడమి కెల్ల బాధలను నాటుచు నుండెను నిన్ను నెంచకే

2.     

 

 

 

 

బ్రహ్మను గూర్చి మిక్కిలి ఘోరమైన తపము చేసి నర సుర జంతు జాలములచేఁ జావు లేమిని వరముగాఁ బడసెను.  ఆ గర్వముతో నింద్రుని నోడించి స్వర్గమును గెలిచెను. నిన్నే మాత్రము గణింపక నీ భూమిని బాధలకు గురి చేసెను.

 

 

 

 

చం.

సుర రిపుఁ డంతఁ జంప నిను శోధన సేసెను ముజ్జగమ్ములం

బరఁగితి సూక్ష్మ రూపమున వాని హృదంతర భాగ మంద ని

న్నరయక రాక్షసేంద్రుఁడు భయాకలితుం డయి పాఱె నంచుఁ దా

మరలెను దాన గెల్చె నని మానిసిదిండి చెలంగి యార్చుచున్

3.     

 

 

 

 

 

ఆ రాక్షసుఁడు నిన్ను వధింప నెంచి ముల్లోకములలో వెదకినను నీవు కనిపింప లేదు. సూక్ష్మ రూపమున దేవా నీ వాతని హృదయము నందే వసించితివి. నిన్ను గానక భయముతో నీవు పాఱిపోయితి వని తలంచి హిరణ్యకశిపుఁడు దానె గెల్చె నని పెద్దగా నఱచుచు మరలెను. 

 

 

 

 

మ.

పరమోదారుఁడు వుట్టె దైత్య పతికిం బ్రహ్లాద నాముండునై

వర గర్భమ్మున నుండ నారదుని చే భక్తి ప్రబోధమ్మునుం

ద్వరిత మ్మారసె రాక్షసాన్వయ మహోత్పాదుండు నైనన్ ధరన్

వరదా! భక్త జనాగ్రయాయి యయి నీ భక్తుండు భాసిల్లెనే

4.     

 

 

 

 

అంత నా రాక్షసునకు ప్రహ్లాదుఁ డను బేరున పుత్రుఁడు పుట్టెను. అతడు గర్భము నందు నుండఁగ నారదునిచే భక్తి జ్ఞానమును బడసెను. రాక్షస వంశమునఁ బుట్టినను భక్త జనుల కగ్ర గామియై నీకు పరమ భక్తుఁ డయ్యెను. 

 

 

 

 

ఉ.

హాస్యము పాలు దా నగుట నయ్యసురాలిని నెంచి పుత్రుఁడే

దాస్యము సేయ దుష్టమతి దానవ రా జనిపెం గుమారు గు

ర్వాస్యము విద్య నేర్వ గురు వాక్యము లోర్వ కభద్రమం చనా

లస్యము నీ పదాబ్జముల రక్తిని నిల్పెమదిన్ దృఢమ్ముగా

5.     

 

 

 

 

తన సుతుఁడే నీకు దాస్యము చేయ నసురు లందు దా నపహాస్యము పాలగుదు నని తలంచి దుష్టుఁడు దానవేంద్రుఁడు కుమారుని గురు ముఖముగా విద్య నేర్చు కొనుటకుఁ బంపెను. గురువుల వాక్యములు భద్రములు కావని గణింపక  యాలస్యము కాకుండ నీ పాదము లందే దృఢమైన రక్తిని దన మనస్సులో నుంచెను. 

 

 

 

 

తే.గీ.

ఈవు నేర్చిన విద్యల నేది మిన్న

నీదు భక్తి యన సుతుండు వాదు విని జ

నకుఁ డలుగ గురువుల వా రనఁ బ్రకృతి యని

సుతు నడఁప నెంచె నీ పాద గతుని దేవ

6.     

 

 

 

 

అంత హరణ్యకశిపుఁడు పుత్రుని తో నీవు నేర్చిన విద్యలలో నేది గొప్ప యని యడిగెను. దానికి ప్రహ్లాదుఁడు తండ్రికి, దేవా నీ పై భక్తియే, గొప్ప యని చెప్పఁగా విని రాజు గురువులపై నలిగెను.   వారు బాలుని స్వభావమే యిది యని పల్కిరి. అంతఁ బుత్రుని నీ పాద భక్తుని దండింప నెంచెను రాక్షసేంద్రుఁడు. 

 

 

 

 

చం.

పొడిచిరి ఘోర శూలముల భూరి గజమ్ములు ద్రొక్కఁ దోలిరే

విడువక పుర్వు చేతఁ గఱపించిరి యన్నము నీక మాడ్చిరే

కుడుపునఁ బెట్టిరే విషము గోత్రము నుండి పడంగ ద్రొబ్బిరే

యెడ నిడ నిన్ను నబ్రముగ నింతయుఁ గుందఁడు కుఱ్ఱ దేవరా

7.     

 

 

 

 

అంత రక్కసులు ప్రహ్లాదుని శూలములతోఁ బొడిచిరి. ఏనుగులను నతని పైకిఁ ద్రొక్కఁగఁ దోలిరి. పాములచేఁ గఱపించిరి. యన్నము పెట్టక మాడ్చిరి. విషము కల్పిన యన్నము పెట్టిరి. కొండ పై నుండి క్రిందికిఁ ద్రోసిరి. దేవా యీ చిన్ని బిడ్డఁడు నిన్ను తన యెద లో నుంచ నాశ్చర్యముగఁ గొంచె మైనను దుఃఖింపఁడు. 

 

 

 

 

మ.

చెలరేఁగన్ మది శంక తిర్గి యసురశ్రేష్ఠుండు చెప్పంగ నొ

జ్జలు వారింటన నిర్దయన్ వరుణ పాశవ్రాత బంధంబునన్

నిలిపెం బుత్రుని నైన దైత్య తనయుల్ నేర్వంగ స్వీ యానుయో

క్తలు లేకుండఁగ భక్తి తత్త్వమును వక్కాణించె విజ్ఞానమే

8.     

 

 

 

 

 

అంత హిరణ్యకశిపునకు శంక రాఁగ తిరిగి ప్రహ్లాదుని గురువుల యింటనే విద్య నేర్వఁ గనికరము లేకుండ వరుణ పాశములవంటి త్రాళ్లతో బంధించి యుంచెను.  గురువులు లేని సమయమునఁ బ్రహ్లాదుఁడు రాక్షస పుత్రులకు విజ్ఞాన మైన నీ భక్తి తత్త్వమును నేర్పెను. 

 

 

 

 

ఉ.

బాలుని చెయ్వు లెల్ల విని ప్రస్తుతి నిన్ను జెలంగి చేసెడిం

గాలుని భంగి క్రుద్ధుఁ డయి కారణ మెయ్యది వంశ నాశకా

బాలక నీ బలమ్మునకుఁ బల్కు మనంగ మురారి నాకు నీ

కే లన నీ జగమ్ములకు నెల్ల వికుంఠ నివాసియే యనెన్

9.     

 

 

 

 

దేవా బాలుఁడు నిన్ను స్తుతించుచుఁ జేసెడి చేష్టల నెల్ల విని యముని వలెఁ గ్రుద్ధుఁడై రాజు బాలకా వంశ నాశకా నీ బలమునకు కారణ మెయ్యది యని సుతుని నడిగెను. అంత ప్రహ్లాదుఁడు నాకు నీకు నింక నెల్ల జగమ్ములకు మురారి యా వైకుంఠుఁడే బలమని పల్కెను.

 

 

 

 

ఉ.

ఎక్కడ యెక్క డాతఁడు సురేశ్వరుఁ డా జగ దాత్మ యా హరిన్

గ్రక్కునఁ జూపు మంచుఁ దన కత్తినిఁ ద్రిప్పుచుఁ గొట్ట స్తంభముం

దక్కువ యెంత సెప్పినను దామరసాక్ష భవచ్చరిత్రమున్

వెక్కస మెల్ల నాకు దయ నెమ్మి నొసంగు మరుత్పురాధిపా!

10.  

 

 

 

 

అంత హిరణ్యకశిపుఁ డా హరి, సురేశ్వరుఁడు, జగదాత్మ యెక్కడ యెక్కడ చూపు మని కత్తిని ద్రిప్పుచు స్తంభమును గొట్టెను. అప్పుడు తామరసాక్షా నీ చరిత్ర మెంత జెప్పినను దక్కువయే.  ఓ గురువాయూరు నాథా నాకు నధికముగా దయతో సంతోషము నిమ్ము.

 

 

ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయమున నిరువది నాలుగవ దశకము. 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము

(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము)

 

సప్తమ స్కంధ పరిచ్ఛేదము

దశకము 25.

శ్రీ నృసింహావతార వర్ణనము.

 

 

శా.

ఆవేశం బడరన్ హిరణ్యకశిపుం డా రీతి నా స్తంభముం

జేవాటమ్మునఁ గొట్టఁ బుట్టితివి తచ్ఛేదమ్ము గావించుచున్

రావోత్కర్షతఁ గర్ణముల్ వగులఁగన్ బ్రహ్మాండ దిగ్భాండముల్

వేవేగం దిరుగన్ విధాత బెగడన్ భీతిల్ల దేవారియే

1.      

 

 

 

 

ఆవేశముతో హిరణ్యకశిపుఁడు చేతి కనుకూలముగా స్తంభమును గొట్టిన దానిని బ్రద్దలు కొట్టుకొని యా ఘోషకుఁ జెవులు పగుల, బ్రహ్మాండంపు దిక్కులు గిరగిరఁ దిరుగ, బ్రహ్మ భీతిల్ల, నా రాక్ష సేంద్రుఁడు కంపింపఁగాఁ బుట్టితివి.

 

 

 

 

ఉ.

చూపులు దిక్కులం బఱచి చూడ మృగేంద్రుఁడు కాదు గాంచ నా

రూపము కాదు మర్త్యుఁడు విరోధి జనింప వెలింగి నిట్టనుం

దాపము నొంది తా ననె నితం డెవఁ డెవ్వఁడు భీష ణాజిర

మ్మేపగు తెల్ల రోమముల నెంతయు వింతయ భీతిఁ దూలుచున్ 

2.     

 

 

 

 

స్తంభము నుండి విరోధి జనింప హిరణ్యకశిపుఁడు చూపులు దిక్కులందుఁ బ్రసరించి సింహమును కాదు నరుఁడును కా దితఁ డెవ్వఁ డని తాపముతోఁ బల్కెను. తెల్లని రోమములు, భీషణమైన దేహము వింతగా నుండెనని భయముతో నూగెను.

 

 

 

 

ఉ.

కన్నులు తప్త కాంచన నికాశము లుగ్రము లధ్వ మంటు జూ

లెన్నఁగ నోరు కొండ గుహ యింపుగ నాడెడు నాల్క కత్తియే

మిన్నగ దృశ్యమానములు మేటి రదమ్ములు భీకరమ్ములే

యిన్నర సింహరూప మసు రేంద్ర భయంకరమై విరాజిలెన్

3.     

 

 

 

 

కన్నులు బంగరు కాంతుల నుగ్రముగా నున్నవి. జూలు చూడ నాకాశమును దాఁకుచున్నది. నోరు కొండ గుహ వలె నున్నది. నాలుక కదలుచు కత్తి వలె నున్నది. దంతములు మిన్నగాఁ గన్పించుచు భీకరముగా నున్నవి.  ఈ నరసింహ రూపము దానవేంద్రునకు భయంకరముగా నున్నది.

 

 

 

 

మ.

వలి భంగావృత భీష ణోత్థిత హను ద్వంద్వున్ ఘన గ్రీవునిన్

బలవ ద్ధస్త నఖాంశు శస్త్ర యుతు నభ్ర వ్యాప్త మేఘస్వ నా

కలన ద్రావిత శత్రు కూటు నర నాగద్వేష్య దేహోద్ధతుం

జలి తాత్మాసుర రాజచంద్రుఁ గొలుతున్  సద్భక్తిఁ గేల్మోడ్చుచున్

4.     

 

 

 

 

ముడతలతో నుబికిన భీషణమైన దౌడలు కలవానినిఁ, బెద్ద కంఠ మున్నవానిని, బలమైన చేతి గో ళ్లను నాయుధములు కలవానిని, నాకసమున వ్యాపించు మేఘము వంటి యఱపుల చేతఁ బాఱిన శత్రు సమూహము కలవానిని, నరసింహాకారపు దేహము వానినిఁ జలించిన మనస్సుతో నున్న  దైత్య రాజు గల వానిని భక్తితోఁ జేతులు మోడ్చి గొల్చెదను.

 

 

 

 

ఉ.

అట్టులఁ గాంచి విష్ణు వితఁ డం చసురుండు వధింప దూఁకఁగాఁ

బట్టఁగ నా గదా ధరు సుబాహు యుగమ్మున నీవు వీడి వే

పట్టెము డాలు నూని వడిఁ బాఱుచుఁ దిర్గుచుఁ జిత్ర రీతులన్

ముట్టఁగ నుర్కె నీపయికి భూమిని మ్రింగు విధమ్ము దోఁపఁగన్

5.     

 

 

 

 

ఆ విధముగా నిన్ను గాంచి యితఁడు విష్ణువే యని రాక్షసుఁడు వధించుటకు దూఁకెను. ఆ గదా ధరుని నీవు రెండు చేతులతోఁ బట్టఁగా నతడు విడిపించుకొని ఖడ్గము డాలును బూని వడిగఁ జిత్రమైన  రీతులఁ దిరుగుచు భూమిని కబళించు నట్లున్న నీ పైకి ముట్టడించుటకు నుఱికెను.

 

 

 

 

చం.

గిరగిర కత్తిఁ ద్రిప్పుచును గేలఁ జెలంగెడు క్రూర దైత్యునిం

గరములఁ బట్టి నీ తొడల గ్రక్కున వాలిచి ద్వార మధ్య మం

దు రయము మీఱఁ బూన్చి వడిఁ దోరపు గోళ్ళను జీరి రొమ్ము కం

జర రుధిరమ్ముఁ ద్రాగుచు భృశమ్ముగ నార్చితి త్రెళ్ళ లోకముల్

6.     

 

 

 

 

గిరగిర కత్తి చేతితోఁ ద్రిప్పుచుఁ దిరుగుచున్న దైత్యుని నీవు చేతులతోఁ బట్టి ద్వారమధ్యమున నీ తొడలపై వడిగా నుంచి పెద్ద గోళ్లతో రొమ్మును జీల్చి, కడుపు నుండి కాఱెడు రక్తమును ద్రాగుచుఁ  బెద్దగా లోకములు చచ్చునట్లు నఱచితివి.  

 

 

 

 

ఉ.

చంపి హిరణ్యభోజను భృశమ్ము నసృగ్రస సిక్త దేహివై

పెంపున నారగింప దితి పేరిమి బిడ్డల శేష జీవులం

గంపిత మంబురాశి భువి గట్టులు దిర్దిరఁ దిర్గెఁ ద్రుళ్ళి లో

కంపుఁ జరాచర వ్రజము కంది మునింగెను దైన్య వార్ధిలో

7.     

 

 

 

 

 

హిరణ్యకశిపునిఁ జంపి రక్తముతోఁ దడిసిన దేహివై మిగిలిన రక్కసులను భుజింప సముద్రములు కల్లోలమైనవి. భూమి పర్వతములు గిఱ్ఱున దిరిగినవి. చరాచర జీవ రాశి తపించి దైన్య మనెడు సముద్రమున మునిఁగెను. 

 

 

 

 

చం.

పలల వపా కరాళ తను భైరవ దైత్య వ రాంత్ర మాల మే

నలరెడు వాని దట్టముగ నాగ్రహ మానసుఁడై సభా స్థలిన్

నిలిచిన వాని దుస్సహపు నిస్వన గాత్రునిఁ గాంచి చేరకే

నలినజ శక్ర శంభు ముఖ నాకులు గొల్చిరి యొక్క రొక్కరున్

8.     

 

 

 

 

మాంసము క్రొవ్వులతో నిండిన దేహముతో, రాక్షసుని ప్రేవుల మాల మెడలో నుండ మిక్కిలి కోపముతో సభలో నిలిచిన నిన్ను భరింప రాని నిస్వనములతో నున్న నిన్ను జూచి దరి చేరుటకు సాహసింపక బ్రహ్మ, యింద్రుఁడు, శంకరుఁడు మొదలగు దేవత లొక్కొక్కరు నిన్ను స్తుతించిరి.   

 

 

 

 

చం.

అయినను భీమ రోష యుతుఁ డైతివి బాలుఁడు తాత పంపునన్

భయ మది లేక హ్లాదు నన పాదము లంటి నమస్కరింపఁగా

రయమున శాంతి నొందుచుఁ గరమ్ము శిరమ్మున నుంచ స్తోత్ర సం

చయమునఁ గొల్వ నిచ్చితివి చాల వరమ్ము లకామికిన్ దయన్

9.     

 

 

 

 

అయినను నీవు కోపముతోనే యుంటివి. అప్పుడు బ్రహ్మ పనుపున హ్లాదుని యన్న యైన ప్ర  హ్లాదుఁడు భయము కొంచెమైన లేక యచట నీ పాదము లంటి నమస్కరించెను. అప్పుడు నీవు శాంతించి యతని తలపైఁ జేతి నుంచఁగ నతఁ డనేక స్తుతులతో నిన్ను గొలిచెను. అతఁడు కోరకున్నను దయతోఁ జాల వరముల నిచ్చితివి.

 

 

 

 

తే.గీ.

ఇట్లు కోపి వైతివి తాపనీయ మందు

విదితమే నీ మహిమ రూపు విమల మధికుఁ

డవు జగతి నలంఘ్యుఁడవు ప్రహ్లాద సఖుఁడ!  

వాయు పుర నాథ! నళు లెల్లఁ బాపు మయ్య

10.  

 

 

 

 

  విధముగా నీవు కోపి వైతివి. నీ మహిమము తాపనీయ మను నుపనిషత్తున విదితమే. నీ రూపు విమలము. జగతి నధికుఁడవు నలంఘ్యుఁడవు. ఓ ప్రహ్లాద మిత్రమా గురువాయూరు నాథా నా రోగము లన్నిటినిఁ బాపుము. 

 

 

 

ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయమున నిరువది యైదవ దశకము. 

సప్తమ స్కంధ పరిచ్ఛేదము సమాప్తము.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము

(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము)

 

అష్టమ స్కంధ పరిచ్ఛేదము

దశకము 26.

గజేంద్ర మోక్షము.

 

 

మ.

ధరయం దొక్కఁడు చంద నాగమున నింద్రద్యుమ్నుఁడం బాండ్య రా

జ్య రమానాథుఁడు నీదు భక్తి రస సిక్తాత్ముండు సేవా విలో

ల రతాస్వాంతత నుండగా నచటకున్ రా నా యగస్త్యుండు నా

పర మాభ్యాగత సంయ మీశ్వరుఁ డహో వానిం గనన్నేరఁడే  

1.      

 

 

 

 

దేవా ధరలోఁ బాండ్యరా జయిన నింద్రద్యుమ్నుఁడు నీ భక్తి రసములో మునిఁగిన వాఁడు చందన పర్వతమున నొకనాఁడు నీ సేవా లోల తత్పరతలో నుండఁగా నచ్చటకు నగస్త్య మహర్షి యభ్యాగతి యై రాఁగ నతనిని గమనింపలేదు.

 

 

 

 

తే.గీ.

కుంభసంభవుఁడు శపించెఁ గోప మూని

వాని జడమతి కరి జన్మ వడయు మంచు

నంత గజరాజుగ జనించె వింత నతఁడు

మఱవఁ డైన నీదు స్మృతి రమాసతీశ!

2.     

 

 

 

 

కుంభసంభవుఁ డంతఁ గోపించి యా రాజును జడమైన యేనుఁగు జన్మ మెత్తు మని శపించెను.  అంత నా రాజు గజమై జన్మించెను. అయినను దేవా నీ స్మృతిని నతఁడు మఱవ లేదు. 

 

 

 

 

తే.గీ.

పాల సంద్రము నడుమను శైలరాజ

మా త్రికూటమం దాడుచు నాఁడయేనుఁ

గు లలరఁగఁ జుట్టు వనజంతు కోటి కెక్కి

శక్తి నుండె మీఱరె నీదు భక్తు లెందు

3.     

 

 

 

 

పాల సముద్రము మధ్యన నున్న త్రికూట పర్వతమున నాఁ డేనుఁగులు పెక్కు కొలుచుచుండఁగ వన మృగము లన్నిటి కన్న మిక్కిలి శక్తియుక్తుఁడై యుండెను. నీ భక్తు లెక్కడ యున్న మిక్కిలి యతిశయించుచునే యుందురు కదా.

 

 

 

 

తే.గీ.

నిజ బల మికఁ స్థల మహిమ నెగడ నగ్గ

జేంద్రుఁ డెట్టి బాధలు లేక యెలమి నుండ

నొక్క నాఁ డెండ కోర్వక యక్కరేణు

యుతుఁ డయి కొలను కదిసె నీ యుసిఁ జెలంగ

4.     

 

 

 

 

స్వీయ బలము, స్థల మహత్వము మీఱు చుండ నా గజేంద్రుఁడు బాధల నెఱుఁగక చరించు చుండెను. ఒకనాఁ డెండకు నోర్వక యతఁడు కరేణు సహిత మొక కొలను చేరెను. అదియు నీ ప్రేరణముననే.

 

 

 

 

మ.

ఒనరెన్ దివ్యుఁడు దేవగాయనుఁడు హూహూ నామధేయమ్మునన్

ముని శాపం బిడ దేవలుం డతనికిన్ మున్నుగ్రుఁడై నక్ర మ

య్యెను దత్పద్మిని యంద నుండె నది దంతీం ద్రాంఘ్రిఁ బట్టెన్ వెసం

గని నీటన్ దిగ శాంతికై స్వజన దుఃఖప్రాప్తి కల్పింతువే

5.     

 

 

 

 

హూహూ నాముఁడు గంధర్వుఁ డొకఁడు పూర్వము దేవలుఁ డను మునిచే శపింపఁబడి మొసలి యై యా కొలనులో నుండెను. అది యా గజరాజును గొలనులో దిగుట జూచి దాని కాలిని రయమ్మునఁ బట్టెను. నీ భక్తులకు దేవా సుఖముల నిచ్చుటకే వారికి కష్టముల నొసఁగుదువు.

 

 

 

 

ఉ.

మున్నొనరించి నట్టి ఘన పూజ లొసంగిన శక్తి చేత నా

పన్న కరీశుఁ డా మకరి పాల్పడి పోరెను వేల యేండ్లు నా

సన్నము గాఁగఁ గాలము ప్రసన్నతఁ గొల్వ భవత్పదాబ్జముల్

చెన్నుగ నక్ర బంధనునిఁ జేసితి కుంజర నాథు మాధవా

6.     

 

 

 

 

ఆపదలోఁ జిక్కుకున్న కరీంద్రుఁడు పూర్వము చేసిన పూజల ఫలితముగాఁ గూడిన శక్తితో నా మకరితో వేల యేండ్లు పోరాడెను. నీ పదాబ్జములను గొలుచుటకుఁ గాల మాసన్న మైనందుననే దేవా గజమును మొసలిచే బంధింపఁబడఁ జేసితివి.

 

 

 

 

తే.గీ.

ఆర్తి తోడఁ బూర్వజ్ఞాన కీర్తిమంతుఁ

డిభ వరుండు తొండము నెత్తి యిచ్చుచు విరి

దమ్ములను మున్నెఱుఁగ బ్రహ్మతత్త్వ మలరు

స్తోత్రముల యజించెను దేవ యాత్రముగను

7.     

 

 

 

 

 

అంత నార్తితో నా గజేంద్రుఁడు శక్తి యుడుగఁగఁ బూర్వజ్ఞాన సంపన్నుఁడు తొండముతోఁ బూల నర్పించుచు బ్రహ్మతత్త్వము దనరెడు స్తోత్రములతో నాత్రముగ నిన్ను బ్రార్థించెను.

 

 

 

 

తే.గీ.

నిర్గుణస్తోత్రములు విని భర్గ పద్మ

జాదు లరుగ రకట తమ్ముఁ గాదని దయ

నీవు సర్వాత్మ రయముగ నిల్చి తెదురఁ

దార్క్ష్య వాహనమున ద్విరదమ్ముఁ గావ

8.     

 

 

 

 

నిర్గుణములైన స్తోత్రములచేఁ బ్రార్థింప శంకర బ్రహ్మాదులు తమను గాదని కాపాడ రాకుండిరి. దేవా నీవు సర్వాత్ముఁడవు వేగముగా గరుడని వాహనమున నయ్యేనుఁగును గాపాడ వచ్చి వాని యెదుట నిల్చితివి.

 

 

 

 

తే.గీ.

చక్రమునఁ జంపి మకరి హస్త నలినమ్ము

చే నిమిరితివి గజరాజుఁ జెన్ను మీఱ

శాప మాఱె గంధర్వ రాజ ప్రవరున

కిభ వరుండు నీ సారూప్య మెలమిఁ బొందె

9.     

 

 

 

 

చక్రమును బ్రయోగించి మకరినిఁ జంపితివి. నీ హస్త పద్మముచే నేనుఁగును నిమిరితివి. అంత గంధర్వ రాజ శ్రేష్ఠునకు శాప విమోచన మయ్యెను. ఆ కరీంద్రుఁడు నీ సారూప్యమును బొందెను.

 

 

 

 

తే.గీ.

నన్ను నిన్ను నీ వృత్తముఁ బన్నుగ స్మరి

యింపఁ బొందు శుభమ్ముల నివ్విధమ్ము

పలికి ధిష్ణ్యమ్ముఁ జేరితి వాని తో సు

రుచిరముగ దేవ కావు మరుత్పుర పతి

10.  

 

 

 

 

నిన్ను నన్ను నీ కథను జక్కఁగ స్మరించిన శుభములు బడయఁగల రని గజేంద్రునితోఁ బలికి నతనిఁ గూడి దేవా వైకుంఠము సేరితివి. అట్టి యో గురువాయూరు నాథా నన్ను గావుము.

 

 

ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయమున నిరువది యాఱవ దశకము. 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము

(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము)

 

అష్టమ స్కంధ పరిచ్ఛేదము

దశకము 27.

కూర్మావతార వర్ణనము.

 

 

తే.గీ.

మాల దుర్వాసునకు నీయ వేలుపు టబ

ల లలరి బలారి కతఁ డీయ నలసునఁ గరి

పై నిడఁగ శక్రుఁ డలిగి శాపమ్ము నిచ్చె

ముని యితర సురాంశజులు కోపు లగు టరుదె

1.      

 

 

 

 

దేవతా స్త్రీ లొక తరి దుర్వాస మహర్షికి నొక మాల నిచ్చిరి. ముని దానిని నింద్రున కీయ నతఁ డలుసున  మాల నైరావతముపై వేసెను. దానికి మహర్షి యలిగి యింద్రునకు శాప మిచ్చెను. నీవు కాక యితర సురల యంశమున బుట్టిన వారు కోపులగుట యాశ్చర్యమా? 

 

 

 

 

తే.గీ.

శాప మీయ నింద్రున కింక సకల సురుల

కు నసుర వినిర్జితుల కంత ఘోర జరను

బ్రహ్మ నిడి ముందు శర్వాది పరమ సురులు

మోక్షదా నిన్ను జేరిరి రక్ష కొఱకు

2.     

 

 

 

 

అట్లు ముని శాప మీయ నింద్రుఁడు సకల సురులు ముదిమి యావహింప నసురులచే నోడింపఁ బడి యుండ బ్రహ్మగారిని ముందు నుంచుకొని శంకరాది సురులు రక్ష కొఱకు మోక్షము నిచ్చు నిన్ను జేరిరి.

 

 

 

 

తే.గీ.

నలిన జాదులు చిర కాల మలరి చేయ

స్తుతులు వరద! తేజంపు నీదు వర దర్శ

నమ్ము నిచ్చి యసుర సంధి నెమ్మిఁ ద్రచ్చుఁ

డంబుధి సుధకు సురలార యంటి వీవు

3.     

 

 

 

 

బ్రహ్మాదులు చిరకాలము నిన్ను స్తుతింప నీవు వారికి దర్శన మిచ్చి సురలారా మీ రసురులతో సంధి చేసికొని యమృతమునకై సముద్రమును మథింపుఁ  డని పల్కితివి.

 

 

 

 

తే.గీ.

సంధి కుదుర సురాసుర సంఘ మంతఁ

దే నడరి మందరాద్రి ధాత్రిఁ బడె మంథ

ము నడుమన రేగుపండును బోల నెత్తి

యుంచితి పయోధి గరుడుపై నుండి లీల

4.     

 

 

 

 

సంధి కుదరఁగ దేవతలు రాక్షసులు మందర పర్వతమును దెచ్చు చుండ నా కవ్వము మధ్యలోనె  భూమిపైఁ గూలెను. నీ వప్పుడు గరుత్మంతునిపై నుండి రేగుపండు వోలె దాని నెత్తి పయోధిలో లీలఁగ నుంచితివి.

 

 

 

 

ఉ.

కవ్వపుఁ ద్రాడు వాసుకియె కాఁగఁ బయోధిని సర్వబీజముల్

నివ్వటిలంగ నందు వడి నేర్పునఁ ద్రచ్చఁ దొడంగి రత్తఱిన్

నొవ్వి యెఱుంగ కుండ నపు డుంచితి సర్పముఖంపు దిక్కు నీ

వవ్వర దైత్య వీరుల ననార్జవ లీల విరాజిలం బ్రభూ

5.     

 

 

 

 

వాసుకి కవ్వపుఁ ద్రాడు కాఁగ సక లౌషధ విత్తనములతో నతిశయించు సముద్రమును  నేర్పుతో శ్రమ లేక చిలుకఁ దొడఁగిరి. రాక్షస వీరులను బాము తల వైపు దేవా నీవు కపటత్వమున నుంచితివి.

 

 

 

 

చం.

చిలుకుచు నుండఁగా మునిఁగెఁ జిల్కెడు గుబ్బలి భార మౌటచే

జలమునఁ జింత మున్గిరి భృశమ్ముగ దేవత లెల్ల రంత నీ

వెలమిని వారి కిచ్చుటకుఁ బ్రీతిగఁ బూనితి కూర్మ రూపముం

జెలఁగ కఠోర పృష్ఠము విశేష దయార్ద్ర మనమ్ము మాధవా

6.     

 

 

 

 

అట్లు చిలుకుచు నుండ బరువు చేతఁ బర్వతము నీటిలో మునిఁగి పోయెను. దేవత లందఱు నంత చింతలో మున్గిరి.  అప్పుడు మాధవా నీవు  వారికిఁ బ్రీతినిఁ గూర్ప  కఠోర మైన వీపు గల కూర్మపు రూపమును దయతో నెత్తితివి.  

 

 

 

 

తే.గీ.

మేటి వజ్రము కన్నను మిన్న చిప్ప

లక్ష యోజనముల విశాలమ్ము కల్గ

దానిపై నిడి మున్గిన ధరమును వడిఁ

బైకిఁ దెచ్చితి గుహఁ బోలు వపువు నూని

7.     

 

 

 

 

గొప్పవజ్రము కన్న గట్టి దైన మూపు చిప్ప లక్ష యోజనముల వెడల్పుతో నున్న దాని పైన నా కొండ నుంచి రయమునఁ బైకిఁ దెచ్చితివి. నీ శరీర మొక కొండ గుహ వలె నుండెను.  

 

 

 

 

చం.

త్రుటి గిరి నుద్ధరింప హరి! తోరము ద్రచ్చిరి యుత్సహించి లం

పట మొక యింత వారలును వాసుకి నేరక యుంటకై విభూ

కిటకిట వే ప్రవేశమును గేళి నొనర్చితి వీవు వారిలోఁ

దటపట లాడకుండఁ దమిఁ దామరసాక్ష దయా పయోనిధీ!

8.     

 

 

 

 

హరి త్రుటిఁ గొండ నుద్ధరింప నుత్సాహముతో వారు త్రచ్చఁ జాగిరి. కొంచె మైనను వారికి వాసుకికి శ్రమ తెలియ కుండ నుండుటకు దేవా కరుణానిధీ తామరసాక్షా  తటపట చెందక కిటకిట మన నీవు వారిలో నాట వోలె బ్రవేశించితివి.

 

 

 

 

తే.గీ.

గిరగిర దిరుగుచును లేచు గిరి వరమ్ము

పైన హస్తాబ్జ ముంచి కన్పట్టు నిన్ను

గాంచి దివినుండి శర్వ విరించి ముఖులు

హర్షమునఁ గురిసిరి సుమ వర్ష మపుడు

9.     

 

 

 

 

గిరగిర తిరుగు మందర పర్వతము పై నీ హస్తాబ్జ ముంచి యున్న దేవా నిన్ను జూచి యాకాశము నుండి బ్రహ్మ శివుఁడు మొదలగు సుర లెల్ల సంతోషముతో నీ పైఁ బుష్పవర్షము కురిసిరి.

 

 

 

 

తే.గీ.

కంది రసురులు సర్ప ముఖంపు గాలి

సోఁక సురలకు నించుక క్షోభ కలిగెఁ

గరుణతో మబ్బులఁ గురిసె సురల పైన

వాన దేవ! దైత్యుల మీఁద పడదు వింత

10.  

 

 

 

 

పాము ముఖపు విషవాయువులు తగులఁగ నసురులు చాల కందిరి. తోక వైపు నున్న సురలు కూడ కొంచెము శ్రమ నొందఁగ వారిపై మబ్బులు క్రమ్మి వాన కురిసెను. వింతగా నది రాక్షసులపైఁ గురియ లేదు.

 

 

 

 

తే.గీ.

చిలుకు తఱి లేచెఁ దిమి నక్ర కులము లకట

కాలము గతించినను నిర్వికార మయ్యె

నొక్కఁడవు కేలఁ జిలికితి వురగముఁ గొని

రుజల గురువాయు పురనాథ రూ పడఁచుమ

11.   

 

 

 

 

సముద్రమును జిలుకు చున్నప్పుడు తిమింగిలములు మొసళులు పైకి లేచినవి. ఎంత కాలము చిలికిన సముద్రము నిర్వికారముగా నుండ నప్పుడు నీ చేతులతో సర్పమును బట్టి చిలికితివి. అట్టి గురువాయూరు నాథా నా రోగముల రూపు మాపుము.

 

 

ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయమున నిరువది యేడవ దశకము. 

 

 

 

 

 

 

 

 

 

 

 

శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము

(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము)

 

అష్టమ స్కంధ పరిచ్ఛేదము

దశకము 28.

లక్ష్మీ స్వయంవరము నమృతోత్పత్తి .

 

 

తే.గీ.

కాలకూట విష మ్మది కదలు నగ్ని

వుట్టె నీరధి నమరులు పూజ సేయ

మోద మంది శంకరుఁడు దా నాదరమున

స్వీకరించె దానిని నీకుఁ బ్రీతి నొసఁగ

1.      

 

 

 

 

అంత సముద్రము నుండి కాలకూట విషము కదలుచున్న యగ్ని వలె పుట్టినది. అప్పుడు దేవతలు పూజింపఁగ సంతసించి శంకరుఁడు దానిని దేవా  నీకుఁ బ్రీతి నీయ  మ్రింగెను.

 

 

 

 

తే.గీ.

చిల్కఁగ సురాసురులు పుట్టె శ్రీద సురభి

ఋషుల కిచ్చితి దాని నీవె తదనంత

రమ్ము నశ్వ గజాప్సరో రమణు లభ్ర

తరువుఁ బుట్ట నిచ్చితి వెల్ల సుర వరులకు

2.     

 

 

 

 

 

సురాసురులు కడలిని జిలుకుచు నుండ భాగ్యము లొసఁగు కామధేనువు పుట్టఁగా మహర్షులకు నిచ్చితివి. తదుపరి నుచ్చైశ్రవ మను గుఱ్ఱము, నైరావత మను నేనుఁగు, నప్సరసలు, మఱియుఁ  గల్పతరువు పుట్టిన వానిని దేవతల కొసంగితివి.

 

 

 

 

చం.

జగ దధిపా భవత్పర విచార మనః కమలా సతీ మత

ల్లి గరిమ నుద్భవించె నట లీలఁగ నిర్మలఁ గాంచి లోలు లై

రి గళిత చిత్త సంభ్రమ పరీవృత నిర్జర దాన వేంద్రులే

తగులము కల్గె నెల్లరకుఁ దామర సాక్షినిఁ బెండ్లి యాడఁగా

3.     

 

 

 

 

జగదీశ్వరా నీ పై ననురాగము కల్గిన లక్ష్మీ దేవి యప్పుడు కడలి నుండి యుద్భవించినది. నిర్మల మైన నామెను గాంచి జాఱిన మనస్సుతో సంభ్రమముతో గూడిన వారై దేవ దానవులు లోలు లైరి. ఆమెను బెండ్లాడ నిష్టము కల్గినది వారికి.

 

 

 

 

తే.గీ.

నీక హృదయ మీయ సతికి నిర్జర పతి

రత్న పీఠమ్ము నిచ్చె సురగణ నీత

జలముల నభిషేక మడరి సల్పిరి ముని

పుంగవులు మంత్ర నుతుల నభంగముగను

4.     

 

 

 

 

దేవా నీకు లక్ష్మీ దేవి తన మనస్సు నీయ నెఱిఁగి యింద్రుఁ డామెకు రత్నపీఠము నిచ్చెను. ముని సంఘము దెచ్చిన జలములతో ననర్గళ మత్రోచ్చారణములతో మునివరు లామె నభిషేకించిరి.

 

 

 

 

తే.గీ.

సదభిషే కామల జలానుసరణ ముగ్ధ

భవ దపాంగ వీక్షణ భూషిత వనితా ల

లామను మణి కుండల సహార చయ పీత

వస్త్ర భూషితఁ జేసిరి భామ లంత

5.     

 

 

 

 

అభిషేక జలములతో నీ క్రేగంటి చూపుల ప్రసరణముతోను విలసిల్లు నా లక్ష్మీ దేవిని దేవతా స్త్రీలు మణులతోఁ గూడిన కుండలముల హారములఁ బచ్చని పట్టు వస్త్రముల నలంకరించిరి.

 

 

 

 

తే.గీ.

భృంగ నాద సంకలిత స్రగంగుళీ ర

మ కుచ భార మందగమన మంజు నూపు

ర రవ సవ్రీడ నతముఖి రాగ మలర

నరుగు దెంచె నీదు దరికి నక్కజముగ

6.     

 

 

 

 

తుమ్మెదల నాదము దనర వ్రేళ్ళతో విరిదండ నూనిన రమా సతి, పాలిండ్ల బరువుతో మంద గమనయై మనోజ్ఞమైన యందెల సవ్వడితో సిగ్గుతో తలను దించుకొని యనురాగముతో మాధవా నీ దరికి నాశ్చర్యముగఁ జేరినది. 

 

 

 

 

తే.గీ.

లేశ మైనను దోషము లేక పోదు

సద్గుణ సుర శివ నలిన సంభ వాదు

లం దనియు సర్వ దేవత లందు నుత్త

ముండ వని వేసె వరమాల ముగుద నీకు

7.     

 

 

 

 

సద్గుణులైన బ్రహ్మ రుద్ర సురాదు లందు లేశ మాత్ర మైనను దోషము లేక పోలే దనియు సకల సురు లందు శేష్ఠుఁడ వనియు  దేవా నీ మెడలో లక్ష్మీ దేవి  వరమాల వేసెను.

 

 

 

 

తే.గీ.

లోక మాత ననన్య భావైక చింత

నా రతను నుంచితివి నీ ఘనంపు టురము

నందు నా యురస్స్థిత వీక్ష ణాత్త సంప

దల జగము పరిపుష్టతఁ దనరె మిగుల

8.     

 

 

 

 

అన్య భావములు లేక నీ యందే యనురతి నుంచిన లోక మాత యా దేవిని నీవు నీ వక్షస్స్థలము నందు నుంచితివి. నీ యురమున నిల్చి యామె చల్లని చూపులు ప్రసరింప లోకములు పరిపుష్టము లైనవి.

 

 

 

 

తే.గీ.

వారుణీ సతి మదవతి వనధిఁ జిలుక

చిలుక మోహింపఁ జేయుచు విలసనమ్ము

న జనుల నుదయించెఁ దమో గుణము సెలంగ

నింతిఁ గడు పేర్మి నసురుల కిచ్చి తీవు

9.     

 

 

 

 

అంత వారుణీ దేవి మదమత్త జనులను మోహపఱచుచు విలాసముగాఁ గడలిలో నుదయించెను. తమో గుణ మప్పుడు చెలరేగెను. ఆ యింతిని నీ వసురులకు నిచ్చితివి.

 

 

 

 

తే.గీ.

నీలి మేఘ వర్ణ మలర నీవ జలధి

నమృత కలశ మూని కరము లందుఁ బుట్టి

తయ్య ధన్వంతరి యనఁగ నందముగను

మారు తాల యేశ రుజలు మాన్పు మయ్య

10.  

 

 

 

 

అంత నల్లని మేఘవర్ణముతో నీరధి నుండి చేతులం దమృత కలశముతో నీవే ధన్వంతరి యను నామమునఁ బుట్టితివి.  అట్టి గురువాయూరు నాథా నా రోగములను బాపుము.

 

 

ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయమున నిరువది యెనిమిదవ దశకము. 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము

(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము)

 

అష్టమ స్కంధ పరిచ్ఛేదము

దశకము 29.

మోహిని యవతారము .

 

 

చం.

దనుజులె యాహరించిరి సుధాకలశమ్మును నీవు వచ్చు చుం

డ నతిరయమ్మునం జెలఁగి నాక నివాసుల నూఱడించి దీ

న నయనులం ద్రుటిన్ మఱి కనంబడ కుండఁగ మాయ మైతివే

తనరఁగ నీదు మాయ నమృతమ్మునకై కలహించి రాసురుల్

1.      

 

 

 

 

ధన్వంతరి రూపమున నున్న  దేవా నీవు పైకి వచ్చుచుండ రాక్షసులు వేగముగాఁ జెలఁగి యా యమృత భాండము నపహరించిరి. దీన నేత్రములతో నున్న దేవతలను నీ వూఱడించి మాయతో నంత మాయ మైతివి. అప్పుడు దేవతలు రాక్షసులతో నమృతము కొఱకు కలహించిరి.

 

 

 

 

తే.గీ.

తను వయో రుచు లలరంగఁ దరుణి వైతి

వంగి రాఁ గుచమండల భార మడర

నమృత కుంభ కలహ మది యాపి కదిసి

రరయుచు నురోజ కుంభ తృష్ణాకులు రయి

2.     

 

 

 

 

అంత శరీరకాంతులు మెఱయ జక్కని స్త్రీ మూర్తి వై కుచ భారమున వంగి నడచుచు వచ్చితివి. అమృత కుంభమునకుఁ గలహ మాపి రక్కసులు నీ యురోజ కుంభముల కాకర్షితులై చూచుచు నిన్ను జేరిరి. 

 

 

 

 

ఉ.

ఎవ్వతె వీవు పద్మ నయ నేందు నిభానన మాకు పంచు మం

చవ్వనితా వశాత్ము లయి యందఱు వేఁడ సుధారసమ్ము నా

నెవ్విధి నన్ను నీ కులట నిత్తఱి నమ్ముదు రంచుఁ బల్కుచున్

నవ్వుల దైత్యు లెల్లరను నమ్మఁగఁ జేసితి నీదు మాయచే

3.     

 

 

 

 

రక్కసు లా మానినికి వశులై పద్మనేత్రా యిందు ముఖీ నీ వెవ్వరవు, మాకు నీ యమృతమును బంచు మని యడిగిరి. అసతిని నన్నెట్లు నమ్ముదు రిచ్చట యని నవ్వుచు దేవా నీ మాయచే వారిని నమ్మఁ జేసితివి. 

 

 

 

 

చం.

ముదమున భాండ మిచ్చిరి విమోహత మోహిని కంత దైత్యు లా

సుదతి యొయార మొల్కుచును జూచుచు వారి భరింపఁగా వలెం

గుదురుగ నాదు చేష్ట లని గోముగ నిల్పి సు రాసు రావలిం

బదిలపుఁ బంక్తి భేదమునఁ బంచితి నిర్జర కోటి కా సుధన్

4.     

 

 

 

 

దైత్యు లంత నమృత భాండమును మోహముతో నా మోహిని కిచ్చిరి. ఆ యువిద యొయారము లొలుకుచు వారినిఁ జూచుచు నా పనుల నెల్ల మీరు కుదురుగా భరింప వలె నంచు దేవతలను రాక్షసులను వేఱు వేఱు పంక్తుల నిల్పెను.  మోహినీ రూప దేవా నీవు దేవతలకు నెల్ల నమృతమును బంచితివి.

 

 

 

 

చం.

కల దనురాగ మీ సతికి గాఢముగాఁ దమ పైన నంచు దై

త్యులు మది నుండ మోహమునఁ దూర్ణము పంచితి వా సుధా రస

మ్మల సుర సంచయమ్మునకు నంత ననార్జవ లీల రాహువే

కలఁబడి త్రాగఁ దున్మితివి కంఠము భక్త వశా నిజాకృతిన్

5.     

 

 

 

 

ఈ సతికి మనపై ననురాగము కలదని తలంచుచు మోహముతో నుండిరి. నీ వప్పుడు సుధ నంతయు సురలకే పంచితివి. అంత కపట రీతిని రాహువు కలఁబడి యమృతము త్రాగఁగ నీవు నిజస్వరూపమున వాని కంఠము దునిమితివి. 

 

 

 

 

తే.గీ.

అమృత హరణంపు ఫలితమ్ము ననుభ వింపఁ

జేసి యసురుల నేఁగ నీ వా సురల నె

దిర్చి ఘోరాజిఁ బోర నాదిత్యులు బలి

మాయ మూర్చిల్ల వచ్చితి మఱల నీవు

6.     

 

 

 

 

అమృతము నపహరించిన దానికి ఫలితము ననుభవింపఁ జేసి యసురులను  నీ వేఁగితివి. అంత నా సురల నెదిర్చి ఘోర యుద్ధము సేసిరి రక్కసులు. బలి మాయచే నాదిత్యులు మూర్చిల్లఁగ దేవా మఱల నీవు వచ్చితివి.

 

 

 

 

తే.గీ.

మాలి కాల నేమ్యాదుల మట్టు పెట్టి

చక్రి! శక్రుఁడు బలి పాక జంభ సైన్య

ముల నడంప ఫేనమున నముచిని నంత

నాపితివి నారదునిఁ బంపి యాజి నెమ్మి

7.     

 

 

 

 

చక్రి నీవు మాలి కాలనేమి మొదలగు రాక్షసులను మట్టు పెట్టితివి. ఇంద్రుఁడు బలి, పాకుఁడు, జంభుల సైన్యముల నణఁచెను. నముచిని నురగతోఁ జంపెను. అంత నీవు నారదునిఁ బంపి యుద్ధమును విరమింపఁ జేసితివి. 

 

 

 

 

మ.

వనితా రూపముఁ దాల్చి మోహ గుణ వైవశ్యమ్మునం ద్రోయ నా

దనుజవ్రాతముఁ దా నెఱింగి కన నుత్సాహమ్ముతోఁ బార్వతీ

ఘన భూతావలి తోడు రా శివుఁడు వేగన్ వచ్చి వైకుంఠమే

నిను గీర్తించి నిజాభికాంక్షఁ దెలుపన్ నీ వైతి మాయం బహో

8.     

 

 

 

 

మోహినీ రూపమున నీవు సర్వులను మోహగుణ వివశత్వమునఁ బడవేయ నెఱిఁగి యీశ్వరుఁడు పార్వతి, భూతగణములు తోడు రాఁగ నీ యా రూపమును జూచు వేడ్కతో వైకుంఠమునకు వచ్చి నిన్ను మిక్కిలి స్తుతించి తన కోర్కెను దెల్పెను. అప్పుడు నీవు మాయమైతివి.

 

 

 

 

తే.గీ.

ఉపవనమ్మున నందపు టువిదను గర

కందుక విలాసిని గళిత సుంద రాంబ

ర విచలన్నయనను గాంచి రతిపతి రిపు

వంగజ వశుఁడై  రయమున నక్కునఁ గొనె  

9.     

 

 

 

 

అంతఁ జేతిలో బంతి నిడి యాడుచు నుపవనమున నందమైన యబల యొకతె కన్ను లిటునటు ద్రిప్పుచు నుండ వస్త్రము తొలంగఁగాఁ జూచి కామారి శివుఁడు మన్మథార్తికి లోనై వేగముగ నామెను దన యక్కునఁ జేర్చికొనెను. 

 

 

 

 

తే.గీ.

వీడి కౌఁగిలి పరుగిడ వేగ నీవు

స్ఖలితుఁ డాయె వెంటాడఁగ శర్వుఁ డెఱిఁగి  

తత్త్వము వచించె నీ గొప్పతనము సతికి

నట్టి వాయుపురేశ మమ్మరయు మయ్య 

10.  

 

 

 

 

నీవు కౌఁగిలి విడిపించుకొని పరుగిడితివి. శివుడు వెంట పరువెట్ట రేతస్స్కలనమయ్యెను. దానితో శంకరుఁడు మోహ ముడుగఁ బరమాత్మ తత్త్వము నెఱిఁగి పార్వతికి నీ మాహాత్మ్యమును దెలిపెను. అట్టి గురువాయూరు నాథా మమ్ము కాపాడుము.

 

 

ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయమున నిరువది తొమ్మిదవ దశకము. 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము

(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము)

 

అష్టమ స్కంధ పరిచ్ఛేదము

దశకము 30.

వామనావతారము.

 

 

తే.గీ.

శక్ర నిహతుఁ డయ్యు బలి దోషాచరుండు

శుక్ర దత్త తనుం డయి సుక్రతు చయ

కర్తయై విక్రముండు లోక త్రయమ్ము

వడసెఁ జక్ర భయము లేక పాఱ సురలు

1.      

 

 

 

 

రాక్షసుఁ డైన బలి యింద్రునిచే జంపఁబడియు శుక్రునిచే దేహమును బడసి యనేక క్రతువులు సేసి విక్రమముతో సుదర్శన చక్ర భీతి లేక ముల్లోకములను జయించెను. దేవతలు భయముతో బాఱిరి.  

 

 

 

 

ఉ.

పుత్రుల దుఃఖ మారసి ప్రపూర్ణ విచార మనమ్ము తోడఁ దా

నాత్రత భర్తనే యదితి యార్తిని వే శరణమ్ము వేఁడ లో

కత్రయ రక్షకుం డయిన కైటభ వైరి పయో వ్రతమ్మునే

పాత్రతఁ దెల్పఁ జేసె సతి ద్వాదశ ఘస్రము లంత భక్తితో

2.     

 

 

 

 

అదితి తన పుత్రుల దుఃఖమును జూచి బాధతో నత్యంత విచారముతోఁ దన భర్తయైన కశ్యపుని శరణు వేఁడెను. నారాయణుని పయో వ్రతమును జేయు మని భర్త తెలుప నదితి యా వ్రతమును బండ్రెండు దినములు భక్తితోఁ జేసెను. 

 

 

 

 

తే.గీ.

వ్రత సమాప్తిఁ గన్పట్టితి త్వత్పర సతి

కి వినయకుఁ జతుర్బాహు యుక్తి నసిత వపు

వలర స్వయముగఁ దనయుఁడ నౌదు ననియుఁ

దెల్పి గోప్య ముంచ మనితి దీని నెపుడు

3.     

 

 

 

 

వ్రతము పూర్తి యైన దినమున దేవా నీవు నీ యంద తన మన ముంచిన యదితికి నాలుగు చేతులతో, నీలి వర్ణపు దేహముతోఁ గన్పించి యామెకు స్వయముగఁ దనయుఁడ నౌదు నని పల్కి యీ విషయమును రహస్యముగ నుంచ మంటివి.

 

 

 

 

తే.గీ.

కశ్యపుం దేజము దనరంగ నదితి యుద

రమ్ము సొచ్చి ధాత నుతుల రంజిలుచును

ద్వాదశీ శ్రవణోడు పర్వ దిన మందు

దివ్య వైష్ణ వాకృతిఁ బుట్టితివి స లీల

4.     

 

 

 

 

అంతఁ గశ్యపుని తేజము వడసి యదితి గర్భమునఁ జొచ్చితివి. అప్పుడు బ్రహ్మ నుతించు చుండ ద్వాదశీ శ్రవణా నక్షత్ర పర్వ దినమున వైష్ణ వాకృతి వెలయ లీలఁగాఁ బుట్టితివి. 

 

 

 

 

తే.గీ.

పుష్ప వర్షము కురిసిరి పుణ్య తటినిఁ

దూర్య నాదముల సురలు తోషమునను

బితరు లిడిరి జయజయ రణితము లడరి

పటుతర వటు వైతివి కాంచఁ ద్రుటిని నీవు

5.     

 

 

 

 

అప్పు డా పుణ్యాశ్రమమున సురలు పుష్పవర్షము కురిసిరి. తూర్యనాదములు మ్రోగించిరి. పరమ సంతోషముతోఁ బితృ దేవతలు జయజయ ధ్వానము లొసఁగిరి. త్రుటిలో నీవు పటుతరమైన యట్టి వటువుగా నెదిగితివి.

 

 

 

 

చం.

వడుగు నొనర్చి కశ్యపుఁడు బ్రాహ్మణ ముఖ్యులు నీకు ముంజియుం

బిడి యజినమ్ము దండమును  బ్రీతినిఁ జెన్నగు నక్షమాలతో

ముడుపు లొసంగ నర్చనల మూరుచు నేఁగితి వగ్ని కార్యముల్

కడు వడిఁ జేసి దీప్త వర కాయుడఁ వై బలి యజ్ఞశాలకున్

6.     

 

 

 

 

కశ్యపుఁడు మొదలగు బ్రాహ్మణ శ్రేష్ఠులు  నీకు నుపనయనము కావించిరి. నీకు ముంజియు, నాఁడు మృగ చర్మము, దండము, నక్షమాల, ముడుపులు  బ్రీతితో నిచ్చిరి. అంత నీ వర్చనలు సేసి యగ్నికార్యములు నిర్వర్తించి ప్రకాశించుచు వడివడి  బలి చక్రవర్తి చేయు యజ్ఞశాలకు నేఁగితివి.

 

 

 

 

ఉ.

భావి మహత్వముం దెలుపు పద్ధతి నా నన మేను వెల్గఁగన్

నీ వపు వగ్ర భారమున నేల చలింపఁగ ఛత్ర మార్పునో

నీ వర శత్రు విక్రమము నేర్పున నాఁ గర దండ ముండెనే

వేవురు ఘోర రాక్షసుల భేదిలఁ జేయఁగ నా వెలుంగుచున్

7.     

 

 

 

 

నీ పూవు వంటి మేను భావి మహత్త్వమును దెల్పు నట్లుండ, నీ శరీరపు దొడ్డ భారమున భూమి కంపింప, నీ ఛత్రము శత్రువుల విక్రమము నణఁచు నట్లుండఁ, జేతి దండము ఘోర రాక్షసులను జంపు నట్లుండ వెలుఁగుచు నీవు..

 

 

 

 

తే.గీ.

రాఁగ నీవు నర్మద కుత్తర తటి నశ్వ

మేధ శాలకుఁ గన్నులు మెఱయఁ జూడ

లేక యని రనలార్కులొ లేక ముని స

నత్కుమారుఁడొ యని శుక్ర నరవిమతులు

8.     

 

 

 

 

నర్మదీ నదికి నుత్తర దిక్కున నున్న యజ్ఞశాలకు రాఁగ, శుక్రుఁడు నచ్చటి రాక్షసులు దేవా నిన్ను జూచి కన్నులు మిఱుమిట్లు గొలుప జూడ లేక యితఁ డగ్నియా, సూర్యుఁడా లేక సనత్కుమార మునియా యని పల్కిరి.

 

 

 

 

తే.గీ.

శుక్ర ముఖ మహర్షులు నిన్ను జూచి తోడి

తే నసుర నాథుఁ డతి భక్తి మేను పులక

రింపఁ బాదములు కడిగి యింపుగాను

శిరమునం దాల్చె నీటి రుచిర శరీర

9.     

 

 

 

 

శుక్రాది మునులు నిన్ను జూచి తన వద్దకుఁ దోడ్తేర నసుర నాథుఁడు బలి భక్తితో మేను పులకరింప నందమైన శరీరము గల దేవా నీ పాదములను గడిగి నీటిని దన శిరముపైఁ జల్లుకొనెను.

 

 

 

 

తే.గీ.

క్రతు కృతమున ద్విజ వినయ కారణమున

నసురుఁ డైనఁ బ్రహ్లాద కులాత్మజుండు

వడసె నీ పదాంబువు గంగ వఱలు నది శి

వ శిరమున వాయు పురప! కాపాడు మయ్య

10.  

 

 

 

 

క్రతువులు సేసిన కారణమున, విప్రులపై వినయమున, నసురుఁ డైనను బ్రహ్లాద వంశజుఁడు బలి నీ పాద జలములను శిరమునఁ బడసెను. అది గంగా జలము శివుని శిరస్సుపై వఱలునది.  అట్టి వామనా వాయుపుర నాథా నన్ను గాపాడుము.

 

 

ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయమున ముప్పదవ దశకము. 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము

(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము)

 

అష్టమ స్కంధ పరిచ్ఛేదము

దశకము 31.

బలి దర్ప శమనము, భగవదనుగ్రహ వర్ణనము.

 

 

ఉ.

నిర్భర దేహ దీధితి వినీల ముఖాంబుజ బాలుఁ గాంచి సం

దర్భ సమంజ సార్చనలు దైత్యుఁ డొనర్చియుఁ జేరి పల్కె దై

త్యార్భట యుక్త వాక్యముల నాదర మొప్పఁగఁ బుణ్య విప్ర వం 

శార్భక విత్త భోజన గృహావను లెల్లయు నిత్తుఁ గోరుమా

1.      

 

 

 

 

నిర్భరమైన దేహ కాంతితో నీలవర్ణము, ముఖపద్మముతో నున్న బాలునిఁ జూచి సందర్భమున కుచితముగా బలి దైత్యుఁ డతని నర్చించి యాదరముతో రాక్షసదర్పముతో యుక్త మైన వాక్కు లిట్లు పల్కెను. ఓ  బ్రాహ్మణ బాలకా ధనము, భోజనము, గృహములు, భూములు మున్నగున వన్నియు నిత్తును గోరుకొనుము. 

 

 

 

 

తే.గీ.

అమ్మహోక్తు లన బలి దయా ప్రపూర్ణ

త విని గర్వ మణఁప నెంచి దైత్య కులముఁ

బొగిడి పాదత్రయ ధర నడిగితి వెల్ల

నడుగ హాస్యపుఁ బాలగు నంచుఁ దలఁచి

2.     

 

 

 

 

ఆ గొప్ప పల్కులను విని దయనిండఁగ నసురు గర్వ మణఁచ నెంచి యాతని వంశమును బొగిడి మూ డడుగుల నేల మాత్ర మడిగితివి. అన్నియు నడుగ రక్కసుఁడు నవ్వుల పాలగు నని తలఁచి యట్లడిగితివి.

 

 

 

 

ఉ.

బేలవ నీవు విశ్వపతి వేడెద వక్కట ముప్పదమ్ములన్

స్థూలపు భూమి వేడు మది తూర్ణము నిత్తు నటంచు దర్పుఁడై

ప్రేల మదమ్ముతో నదియు లేఁ డకటా యిడ బంధ దూషణల్

మే లన రాదు గర్వ మది లీలఁగఁ ద్రుంపఁ దలంచితే విభూ

3.     

 

 

 

 

అంత బలి బేలవు నీవు చక్రవర్తిని మూ డడుగుల భూమి మాత్ర మడుగుచున్నా వని దర్పముతోఁ బ్రేలెను. అతఁ డదియు నీయ లేక పోయెను. దేవా నీవు దూషణములు బంధము లతని యెడ మేలు కావని గర్వమును లీలఁగ నశింపఁ జేయ నెంచితివి. 

 

 

 

 

తే.గీ.

మూ డడుగులఁ దనియ కున్న ముజ్జగము లి

డునె తనివి యన వరద! యిడుటకు నుదక

ముఁ గొన బలి తత్పరీక్షార్థము పురికొల్ప

శుక్రుఁ డీకు హరి యితఁ డంచు వచియించె

4.     

 

 

 

 

అప్పుడు నీవు మూ డడుగలకుఁ దృప్తి సెందని వాఁడు ముజ్జగము లిచ్చినను దృప్తి చెందునే యని యంటివి. అంత బలి దాన మిచ్చుటకు జలము గైకొన నతనినిఁ బరీక్షించుటకు నీదు మాయ పురికొల్ప శుక్రుఁడు దాన మీయకు మితఁడు సాక్షాత్తు హరియే యని బలి చక్రవర్తికిఁ జెప్పెను.

 

 

 

 

చం.

అడిగిన వాఁడు శ్రీ హరియె యైన సకాముఁడ నైతి బోధకా

జడియక యిత్తు దాన మన శాపము నిచ్చెను గావ్యుఁ డత్తఱిం  

దొడరక స్వీయ భార్య యిడఁ దోయము దానము సేసె సర్వముం

గడు వడి నీకుఁ జిత్రముగఁ గైటభ మర్దన దానవేంద్రుఁడే

5.     

 

 

 

 

అంత బలి శుక్రునితో నాచార్యా  యడిగిన వాఁడు శ్రీహరియే యైన నేను సంతుష్టుఁడ నైతి నని సంకోచింపక దాన మిత్తు ననఁగ శుక్రుఁడు కోపించి శాప మిచ్చెను. తన భార్య నీళ్లు పోయఁగ బలి  రాక్షసేంద్రుఁడు చిత్రముగ సర్వము నీకు దానము చేసెను.

 

 

 

 

మ.

ఇసు మంతైనను సందియమ్ము మది దైత్యేశుండు దా నుంచకే

వసుధా దానము సేయఁ గుర్సి రటఁ బూ వర్షంబు భట్టారకేం

ద్ర సుపర్వుల్ గను చుండఁగాఁ బెరిగెనే త్వద్దివ్య రూపం బహో

దిస లెల్లన్ వడి నింపె సర్వమును సందీప్తంపు విశ్వాండమున్

6.     

 

 

 

 

 

కొంచెము కూడ శంక లేక దానవేంద్రుఁడు నీకు భూ దానము సేయఁగ మునీంద్రులు దేవతలు పుష్ప వర్షము కురిపించిరి. అంతఁ జూచుచుండగ నీ దివ్యరూపము క్రమ క్రమముగఁ బెరిఁగి పెరిఁగి దిక్కు లెల్ల నిండి బ్రహ్మాండము నిండి పోయెను.

 

 

 

 

చం.

కదియఁగ బ్రహ్మలోకమును గంజుఁడు నీ చరణాగ్ర మంత కుం

డిఁ దనరు నీటితోఁ గడుగ నీరు పవిత్రము సేసె విశ్వమున్

హృదయము పొంగ ఖేచరులు నింపుగ నాట్యము సేసి రెల్లరుం

గదలుచు ధాత్రి మొత్తెఁ దమి గట్టిగ భేరిని జాంబవంతుఁడే

7.     

 

 

 

 

నీ పాదము బ్రహ్మ లోకము సేరఁగఁ దన కమండలువు నీటితోఁ గడిగిన నది విశ్వమును బవిత్రము చేసెను. మనస్సుప్పొంగ సిద్ధ సాధ్య ఖేచరులు నాట్యము సేసిరి. ధరలో గదలుచు జాంబవంతుఁడు భేరిని మ్రోగించెను.  

 

 

 

 

తే.గీ.

తలపడి యనికి దైత్య భటు లనుమతినిఁ

గొనక యోడి రెల్లరు సుర లనుచర తతి

చేతఁ గాలాత్ముఁ డీతఁ డిచ్చె మును జయ మ

ని వల దన బలి యేఁగిరి నేల యడుగు

8.     

 

 

 

 

అంత రక్కసులు బలి యనుమతి లేకయే యుద్ధమునకుఁ దలపడి యెల్లరు నీ యనుచరు లైన సురలకు నోడిరి. అప్పుడు బలి కాలాత్ముఁ డీతఁ డని మున్నితని దయ మనము గెలిచితిమి. ఇంక యుద్ధము వలదని వారింప వారు పాతాళమునకు నేఁగిరి.

 

 

 

 

ఉ.

పాశ నిబద్ధుఁ జేసె బలిఁ బక్షి విభుండు త్రిలోక నాథ దై

త్యేశ వచింపు మూడవది యెచ్చట పాదము  నుంచ మందువో

యీశ! యనంగ నీవు బలి యింపుగ మూర్థ మభీతిఁ జూప నా

వేశన మంతఁ జేసె నటఁ బేర్మి నుతించుచు హ్లాదు నన్నయే

9.     

 

 

 

 

 

గరుత్మంతుఁడు బలినిఁ ద్రాళ్లతోఁ గట్టెను. త్రిలోకపతీ దైత్య నాథా నా యడిగిన మూడవ పాదము నెచ్చట నుంచ నని నీ వడుగఁగఁ బలి భీతిల్లక తన శిరమును జూపించెను. అంత నచ్చటకు హ్లాదు నన్న యైన  ప్రహ్లాదుఁడు  ప్రీతితో నిన్ను నుతించుచుఁ బ్రవేశించెను.

 

 

 

 

చం.

అణఁపఁగ నే నొనర్చితి మదాతిశయ మ్మసురాధి నేత స

ద్గుణయుత పుణ్య కార్యములు తోరము సేసితి దాన నుండుమా

గుణతర లోక మందు నటఁ గూర్తు మహేంద్ర పదమ్మునే స దా

గణితుని నన్ను జేరె దనఁగాఁ జను వాయుపురేశ! కావుమా

10.  

 

 

 

 

నీ మదము నణఁప నింతయుఁ జేసితిని దానవేంద్ర నీవు సద్గుణుఁడవు పుణ్యకార్యములు చేసితివి. గొప్ప దైన సుతల మందు నుండుము.  పిదప యింద్రపదవిఁ బొంది తుదకు నగణితుఁడను నన్ను జేరెద వని పల్కితివి. అట్టి యో గురువాయూరు నాథా నన్ను కావుము.

 

 

ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయమున ముప్పది యొకటవ దశకము. 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము

(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము)

అష్టమ స్కంధ పరిచ్ఛేదము

దశకము 32.

మత్స్యావతారము.

 

 

తే.గీ.

ఆఱవ మనువు కాలాంత మందు మున్ప

సుర హయగ్రీవుఁడు సుసుప్త సుర పురోజు

శ్రుతుల నపహరింపఁగఁ గాంచి సురుచిరంపు

మత్స్య రూపమ్ము నూనితి మామమామ

1.      

 

 

 

 

పూర్వ మాఱవ మనువు కాలాంతమున హయగ్రీవుఁ డను దైత్యుఁడు బ్రహ్మ నిద్రించుచుండ నతని వేదముల నపహరించెను. అది చూచి యో  విష్ణుమూర్తీ నీవు సుందరమైన మత్స్యరూపమును ధరించితివి.

 

 

 

 

తే.గీ.

రాజు సత్యవ్రతుఁడు వర ద్రవిడ దేశ

మునకు నొకనాఁడు తటిని నీటను గలట్టి

యతని తర్పణాయత్త హస్తాంజలి జ్వలి

తంపుఁ జేప కూనగను వింతఁ గనఁబడితి

2.     

 

 

 

 

ద్రవిడ దేశమునకు సత్యవ్రతుఁడు రాజు. ఒకనాఁడు తర్పణము లీయ నీటిలో నున్న నతని చేతిలో మెఱసెడు నొక చేప పిల్లగా నీ వతనికిఁ గనిపించితివి.

 

 

 

 

ఆ.వె.

నీట భయపడు నిను నెమ్మిని రాజర్షి

కొనిచన గృహమునకుఁ గుండిఁ గతిప

య దినముల నయితివి యధికముగఁ గలశ

కూప వాపులకును గొలనులకును

3.     

 

 

 

 

 

నీటిలో భయపడు చున్నట్లున్న నిన్ను జూచి యా రాజర్షి కమండలువులోఁ దన గృహమునకుఁ దీసికొని వెడలెను. అంత కొన్ని దినములకు నీవు కలశము, గుంట, నడబావి, చెఱువులకు కూడ మించి పెద్దఁగ నెదిగితివి.

 

 

 

 

తే.గీ.

చేర్చి యోగ మహిమ నిన్ను సింధు వందు

రాజ సంయమి నీయాజ్ఞఁ బ్రళయ దర్శ

నమ్మడుగ నాఁగు సప్త దినమ్ము లంచు

నుడివి మాయ మైతివి కడువడి జలధిని

4.     

 

 

 

 

అప్పుడు నీ యాజ్ఞ రాజముని  తన యోగ మహిమాతో నిన్ను సముద్రమునఁ జేర్చెను. అతఁడు ప్రళయమును జూపు మని ని న్నడుగఁగ నీ వతని నేడు దినము లాఁగు మని బదులిడి కడలి లోన మాయ మైతివి.

 

 

 

 

 

నీ నుడివిన దినము రాఁగ నీటి ధార

లందు మునిఁగె భూతల మెల్ల నంత రాజు

సప్త ఋషులఁ గూడి యపార జల రయమునఁ

దిరుగు చుండి వేడెను నీదు శరణు వేగ

5.     

 

 

 

 

అంత నీవు చెప్పి నట్లు నీటి ధారలలో జగ మంతయు మునిఁగెను. సప్తర్షులతోఁ గూడి రాజు నీటి వేగమునఁ దిరుగుచు నీ శరణు వేఁడెను. 

 

 

 

 

 

భవదనుజ్ఞ ధరణి నౌక భావ మూని

రాఁగ నెక్కి వారు చలింప వేగముగఁ ద

రణము కంపింప నెల్లరు రహి నొసంగ

దర్శన మిడితి తిరిగి మత్స్య మయి దేవ  

6.     

 

 

 

 

నీ యనుజ్ఞతో భూమి నావ రూపమున వచ్చిన వారు దాని నెక్కిరి.  నావ భీకరముగఁ జలించుచు   నుండ వారు గంపింప వారి కెల్లరకు ముదము నీయ దేవా నీవు తిరిగి పెద్ద మీనంపు రూపమున కనిపించితివి.

 

 

 

 

తే.గీ.

శత సహస్ర యోజనముల జంపు మెయినిఁ  

దేజ మతిశయిల్లఁ జరించు దివ్య మీన

రూప నిన్ను వీక్షించి హర్షు లయి నీదు

కొమ్మునకు నోడఁ గట్టిరి కోర నీవు

7.     

 

 

 

 

లక్ష యోజనముల పొడవున తేజస్సుతోఁ జరించు చున్న యా దివ్య మీన రూపమున నున్నట్టి నిన్ను గాంచి వారు సంతసించి నీవు కోరఁగ నావను నీ కొమ్మునకుఁ గట్టిరి.

 

 

 

 

తే.గీ.

ఓడ లాగుచు నీవు మున్యోఘమునకుఁ

జూపుచు జగద్విభాగపుఁ జోద్యములు చ

రించు చుండ రాజ నుతులు మించ వారి

కెల్ల నుడివితి జ్ఞానము నెలమి తోడ

8.     

 

 

 

 

ఓడను లాగుచు నా ముని సంఘమునకు నక్కజంపు విశ్వభాగములను జూపుచు రాజు కీర్తించు చుండ వారికి జ్ఞానమును బ్రసాదించితివి.

 

 

 

 

తే.గీ.

ముగియఁ బ్రళయ మునిచి సప్తమునులఁ బూర్వ

విధము వైవస్వతుఁ డన నిల్పి మనువుగ క్షి

తీశు సత్యవ్రతుని నంత నెగిచి తీవు

రాక్షసుని హయగ్రీవు నాగ్రహము తోడ

9.     

 

 

 

 

ప్రళయము ముగియఁగ సప్త మునులను యథావిధి నుంచి వైవస్వతుఁ డను మనువుగ సత్యవ్రత రాజును నిల్పి పిమ్మట కోపముతో  రాక్షసుఁడు హయగ్రీవుని వెంటఁ బడితివి.

 

 

 

 

తే.గీ.

పొడిచి నీదు శృంగము చేత బెడిదముగ న

సురు నురమ్మునఁ జంపి యా శ్రుతులు సేకొ

ని యొసఁగితివి విరించికి నెమ్మి దేవ!

గాడ్పుటూరు దేవర మమ్ము గావు మయ్య

10.  

 

 

 

 

నీ కొమ్ముతో రక్కసుని రొమ్ములో గట్టిగ పొడిచి చంపి వేదములను బ్రహ్మకు నొసఁగితివి. అట్టి దేవా గురువాయూరు నాథా మమ్ము రక్షింపుము.

 

 

ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయమున ముప్పది రెండవ దశకము. 

అష్టమ స్కంధ పరిచ్ఛేదము సమాప్తము.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము

(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము)

నవమ స్కంధ పరిచ్ఛేదము

దశకము 33.

అంబరీషోపాఖ్యానము.

 

 

తే.గీ.

మనువు వైవస్వతునకు కుమారుఁ డా న

భాగుఁ డతనికిఁ బుట్టె నాభాగుఁ డతని

కంబరీషుఁడు రాజు సప్తాంబుధి వృత

ధరణికి నిను నీ భక్తులఁ దలఁచు మదిని

1.      

 

 

 

 

వైవస్వత మనువు కుమారుఁడు నభగుఁడు లేక నభాగుఁడు . అతని కుమారుఁడు నాభాగుఁ డతని కంత నంబరీషుఁడు పుట్టెను. సప్తసముద్రములతోఁ గూడిన భూవలయము నంత దేవా యతఁడు నిన్ను నీ భక్తులను దలంచుచుఁ బాలించెను.

 

 

 

 

చం.

సకలము నీదు ప్రీతి కయి చక్కగ దానము సేయు చుండ భ

క్తికి కడు మెచ్చి యాతనికి దేవ ముదమ్ము చెలంగఁ దాను గో

రకయె యొసంగి తీవు పరి రక్షణ సేయ సతమ్ము నాతనిన్

సకృప సహస్ర ధారయుత చక్రము శత్రు పరాక్రమఘ్నమున్

2.     

 

 

 

 

నీ ప్రీతి కొఱకు సర్వము దానము చేయుచు నున్న నతని భక్తికి మిక్కిలి మెచ్చి సంతోషము చెలఁగ నతఁడు కోరకయే రక్షణ మొనగూర్ప నతనికి వేయి యంచులు గలిగిన, శత్రువుల యొక్క పరాక్రమమును నశింపఁ జేయఁ గలిగిన నీ చక్రమును దేవా దయతో నిచ్చితివి.

 

 

 

 

చం.

సముదము ద్వాదశీ వ్రతము సల్పె విధిన్ యమునా నదీ సుతీ

రమున నతండు వత్సరము రమ్య మధూత్తమ కాననమ్మునన్

విమల నిజేశ్వరీ యుతము వేడుచు నిన్ను సదర్చనార్తియై

సముచిత మిచ్చె విప్రులకుఁ జక్కని గోవుల షష్టి కోటులన్

3.     

 

 

 

 

సంతోషముతో యమునా తీరమున రమ్యమైన మధు వనమున నొక్క సంవత్సరము ద్వాదశీ వ్రతమును భార్యా సమేతుఁడై యంబరీషుఁడు చేసెను. ని న్నర్చించు కోరిక మీఱ సముచితముగ విప్రులకు నఱువది కోట్ల గోవులను దానము చేసెను. 

 

 

 

 

తే.గీ.

అర్చనాంత పారణ దినమందు వచ్చె

నటకు దుర్వాస నామ మహర్షి భోజ

నార్థము పరార్తిశీలి రా జడుగ రమ్మ

ని యమున కరిగె మెల్లగ నెరపఁ బనులు

4.     

 

 

 

 

నీ యర్చనాంతమున నొకనాఁడు పారణ దినమున (ద్వాదశి నాఁడు) నచ్చటకు దుర్వాసుఁడు పరులకు బాధల నిడు మనమున నలరు  మునీంద్రుఁడు భోజనార్థము విచ్చేసెను.  రాజు నాతనిని భోజనమునకు రమ్మని యడుగ నతఁడు మెల్లగ నుచిత కార్యము లొనరింప యమునా నదికి  వెడలెను.

 

 

 

 

చం.

ఒదవగ నంత పారణ ముహూర్తపు టంతము భీతి రాజు దా

నుదకము మాత్రమే కొనె మహోన్నత భక్తి చెలంగ నీ పయిం

దదుపరి వచ్చి యచ్చటకుఁ దాపసి దివ్యపు దృష్టిఁ గాంచి బె

ట్టిదమగు రోష మూనుచు వడిన్ సృజియించెను గృత్యనున్ జడన్

5.     

 

 

 

 

పారణ సమయాంతము కానున్న భీతితో నంబరీష చక్రవర్తి జలమును మాత్రము నీపై భక్తి మీఱ  గ్రహించెను. అంత దుర్వాసుఁ డేతెంచి నిజ దివ్య దృష్టితో దాని నెఱింగి మిక్కిలి కోపమున తన జడ నుండి కృత్య యను రక్కసిని సృజించెను.

 

 

 

 

ఉ.

కృత్యను ఖడ్గ ధారిణి విజృంభిత రోష విదగ్ధ విశ్వనున్

నిత్య రమేశ సక్త మది నేత చలింపఁడు గాంచి యింతయుం

గృత్యను గాల్చి చక్ర మది కేళిని భక్తుని నేఁప నెంచ నీ

భృత్యుని, మౌని వెంటఁ బడి వేగమ పర్వెను దండ నార్థియై

6.     

 

 

 

 

ఖడ్గముతో నున్న కృత్యను విజృంభించి లోకములను రోషమున దహించు దానినిఁ జూచి నిత్యము  నిన్ను స్మరించు చిత్తుఁ డంబరీషుఁడు కొంచెమైనను జలింప లేదు. కాని నీ చక్రము నీ సద్భక్తుని భృత్యుని బాధింప నెంచుట చూచి యా కృత్యను గాల్చి ముని వెంటఁ బడి దండింప నెంచి వడిగాఁ బరువెట్టెను.  

 

 

 

 

తే.గీ.

జగము లెల్లఁ దిరుగ భీతిఁ జక్రము ముని

వెంటఁ దగిలె ముని విరించి వీటి కేఁగ

నరికి నడ్డ మే రని ధాత యనుప శివునిఁ

జేర నిను నుతించి మునిఁ బంచె నిను వేడ

7.     

 

 

 

 

లోకము లన్ని తిరిగినను జక్రము వెంటఁబడ భీతితో బ్రహ్మ చెంతకు ముని యేఁగెను. చక్రము నెవ రడ్డఁ గలరని బ్రహ్మ మునిని శివుని కడ కేఁగ మనెను. శివునిఁ జేర ముని శంకరుఁడు దేవా నిన్ను నుతించి మునిని నిన్న శరణు వేఁడ మని పంపెను. 

 

 

 

 

చం.

చని ముని నీదు సన్నిధికిఁ జాఁగిలి మ్రొక్క వచించి తీవు నే

ననిశము భక్త దాసుఁడనె యాదరణీయము జ్ఞానముం దప

మ్మును వినయమ్ము కల్గిననె భూసుర యేఁగుము వేఁడ నంబరీ

షుని వడి నంచు నాతనికిఁ జోద్యము మీఱ దయా పయోనిధీ

8.     

 

 

 

 

అంత ముని నీ సన్నిధిఁ జేరి మ్రొక్కిన దేవా నీ విట్లంటివి. ఓ భూసురా నేను భక్తులకు దాసుఁడను జ్ఞానము తపములు వినయ మున్ననే యాదరణీయములు. కనుక  నీ వంబరీషుని వేఁడు మని యక్కజముగ మునితోఁ బల్కితివి.  

 

 

 

 

చం.

ముని వరుఁ డంట పాదములు భూపతి వెన్కకు నేఁగి చక్రముం

గని నుతియింపఁగాఁ జనియె గ్రక్కునఁ జక్రము కీడు చేసి న

ట్టి నరుని యందుఁ గూడ దయ డిగ్గక నుండు గుణమ్ము విష్ణు భ

క్తిని నుతియించి మౌని యొసఁగెం బృథివీ పతి కంత దీవెనల్

9.     

 

 

 

 

అంత దుర్వాస ముని యంబరీషునిఁ జేరి పాదము లంట రాజు గ్రక్కునఁ బాదములను వెనుకకుఁ  దీసికొని చక్రమును నుతించి వేఁడగ నది వెనుకకు మరలెను. కీడు చేసిన నరుని యందుఁ గూడ దయ వీడని యతని గుణమును విష్ణు భక్తిని నుతించి ముని రాజునకు దీవన లొసఁగెను. 

 

 

 

 

తే.గీ.

తినక యొక యేఁడు రాజుండె ముని వరు కొఱ

కుఁ దనియ నొసఁగి యన్నము సదయ దినెను

భక్తి పెరుగ నంత నృపతి ముక్తి నందెఁ

బవన పురనాథ నన్ను గాపాడు మయ్య

10.  

 

 

 

 

అంబరీషుఁడు తినక ముని కొఱకు నొక్క యేఁ డుండెను. మునికి దయతోఁ దృప్తిగ భోజనము నొసఁగి తాను దినెను. భక్తి వృద్ధి సెంద నతఁడు ముక్తిఁ బడసెను. ఓ గురువాయూరు నాథా నన్ను కాపాడుము.

 

 

ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయమున ముప్పది మూడవ దశకము. 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము

(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము)

నవమ స్కంధ పరిచ్ఛేదము

దశకము 34.

శ్రీరామ చరితము -1.

 

 

తే.గీ.

దశగళ వధకుఁ గోరఁ ద్రిదశులు  ఋష్య

శృంగుఁడు నడుప యాగము సిక్కఁ బాయ

సము సతులు మువ్వురుఁ గుడువఁ జక్కఁగ  దశ

రథున కుదయించితివి నీవ రాముఁడు భర

తుండు లక్ష్మణుండు మఱి  శత్రుఘ్నుఁ డనఁగ

1.      

 

 

 

 

రావణు వధకై దేవతలు కోరఁగా, ఋష్యశృంగుఁ డను మహర్షి పుత్రకామేష్టిఁ జేయింపఁ బాయసము లభింపఁగా రాణులు మువ్వురు కుడువఁగా దశరథునకు దేవా నీవు రామునిగ జన్మించితివి. నీ యంశముననే భరతుఁడు, లక్ష్మణుఁడు మఱియు శత్రుఘ్నుఁడు పుట్టిరి.    

 

 

 

 

చం.

కరమున విల్లు నూని మునికౌశికు యాగము గావఁ దండ్రి పం

పరసి సలక్ష్మణుండ వయి యాద్వయముల్ గొని మార్గఖేద హా

ర రుచిర మంత్రముల్ దగ నృరక్షణ మారసి చంపి తాటకన్

శరమున సిద్ధ ధామమును సంయమి యస్త్రము లీయఁ జేరితే

2.     

 

 

 

 

దేవా చేతిలో విల్లు నూని లక్ష్మణుని తోఁ గలసి తండ్రి యాదేశమున విశ్వామిత్రుని యాగమును గాచుటకు వెడలుచు మార్గాయాసము కలుగకుండుటకు రెండు మంత్రములను ముని యీయఁ గొని మానవ రక్షణార్థము నొక బాణముతోఁ దాటకిని వధించి ముని యస్త్రముల నీయఁగా నంత సిద్ధాశ్రమము చేరితివి. 

 

 

 

 

మ.

త్రుటి మారీచునిఁ జోపి యాగ తటి వే తున్మాడి దైత్యాన్యులం

బటి మన్మాన్పి యహల్యకుం బద రజః ప్రాప్తమ్మునం బాపమే

యట నీ వేఁగి విదేహ రాజు నిలు శైవాస్త్రమ్ము భంజించి యం

తట సీతం గొని తమ్ము లింతులును రా దర్శించితే రాజ్యమున్  

3.     

 

 

 

 

త్రుటి యాగధ్వంసకుఁడు మారీచునిఁ ద్రోలి, పటిమతో నితర రక్కసులను జంపి, నీ పాద ధూళిచే నహల్య పాపమును మాన్పి, విదేహరాజు గృహమున కంత నేఁగి, శివ ధనుస్సు విఱిచి సీతను  గైకొని, భార్యలతోఁ దమ్ముండ్రు తోడు రా రామా నీ పితృ రాజ్యముఁ జేరితివి. 

 

 

 

 

మ.

మును రోషమ్మున నాపఁగాఁ బరశురాముండే ధనుస్స్వీయ భా

స నికాయమ్మును సంగ్రహించి చని యా సాకేత ధామమ్ము సీ

తను గైకొంచు సుఖమ్ముగా మసలితే తమ్ముండు శత్రుఘ్నుతో

జనఁగా నా భరతుండు తాత యిలు రాజ్యం బీయఁ దల్పంగ నీ

జనకుం డాగ్రహ మంది యాపె వడి నా సంరంభముం గైకయే

4.     

 

 

 

 

అంత పరశురాముఁడు కోపమున ని న్నాపఁగా నాతని విల్లు నీ తేజస్సు నెల్ల సంగ్రహించి సీతతో సాకేత పురమున కేఁగి సుఖముగా నుంటివి. అంత శత్రుఘ్నునితోఁ గూడి భరతుఁడు తన తాత గారింటికి నేఁగ దశరథుఁడు నీకు రాజ్యాభిషేకము సంకల్పింపఁ గైక రోషముతో దాని నాపెను.    

 

 

 

 

చం.

జనకుని యాజ్ఞ లక్ష్మణుఁడు జానకి వెంటఁ జనంగఁ గానకుం

జన దరి నాపి పౌరులను జాపము నారలు వేణు లూని గం

గను గుహుఁ డుత్తరింపఁ జని కాంచి యుతథ్యు కుమారు మ్రొక్కి యా

తని నుడిఁ జిత్రకూటమునఁ దద్దయుఁ బ్రీతి వసించి తచ్చటన్

5.     

 

 

 

 

తండ్రి యాజ్ఞఁ దలఁ దాల్చి లక్ష్మణుఁడు, భార్య సీత తోడు రాఁగ జడలను నార చీరల నూని వనమునకు  బయలుదేరి  గంగ యొడ్డునఁ బౌరుల నాపి, గుహుఁడు నదిని దాటింపఁ జని భరద్వాజ మహర్షినిఁ జూచి మ్రొక్కి యా ముని వచనమునఁ జిత్రకూటమునకు నేఁగి ప్రీతితో నచట వసించితివి.

 

 

 

 

తే.గీ.

జనక మృతి భరతు వలన విని సుతార్తి

నుదక మిడి రాజ్య పాదుకలు దయ నిచ్చి

యనుజునకు నత్రి నర్చించి యరిగి దండ

కకు విరాధుఁ జంపి శరభంగ ముని కిచ్చి

మోక్షము కరుణ నుంటివి మోదముగను

6.     

 

 

 

 

అంత భరతుని వలన పుత్రశోకముతోఁ దండ్రి మరణించుటను విని తర్పణము లొసఁగి రాజ్యమును దన పాదుకలను దమ్ముఁడు భరతుని కిచ్చి పంపితివి. అత్రి మహాముని నర్చించి యంత దండ కారణ్యమునకు నేఁగి యచట విరాధునిఁ జంపి శరభంగ మహర్షికి దయతో మోక్ష మొసఁగి యచట సుఖముగా నుంటివి.   

 

 

 

 

మ.

ముని రక్షార్థము సర్వ దైత్యులను నిర్మూలింపఁ జేపట్టి యా

నను బూజింప నగస్త్యు నాతఁ డొసఁగె న్నారాయణేష్వాస మిం

కను బ్రహ్మాస్త్రము నా జటాయువును వీఁకం గాంచి గోదావరీ

వన దేశమ్మున నుండి పంచవటిలో భాసిల్లితే సీతతో

7.     

 

 

 

 

మునులను రక్షింప రాక్షసుల నెల్లఁ జంపు ప్రతిజ్ఞను  బూనితివి. అగస్త్య మహర్షినిఁ బూజింప నీకు నారాయణ బ్రహ్మాస్త్రముల నతఁ డొసఁగెను. అచట జటాయువును గలిసి గోదావరీ నదీ తీర మందుఁ  బంచవటిలో సీతతోఁ గూడి ప్రకాశించితివి.  

 

 

 

 

ఉ.

రాఁగ వరించిశూర్పణఖ రాఘవ తమ్మునిఁ జూపి పంపఁ దా

నేఁగఁగఁ గోసె నాసికను హీన చరిత్ర కతండు దానికిం

గాఁగి ఖరుండు దూషణుఁ డికం ద్రిశిరుండును రా ససైన్యమున్

వేగమ చంపి తెల్లరను బె ల్లసురుల్ పదివేల కెంచఁగన్

8.     

 

 

 

 

అంత శూర్పణఖ రామా నిన్ను వరించి రాఁగ నీవు  తమ్ముని వద్దకుఁ బంపితివి. ఆమె తమ్ముని కడ కేఁగి వరింప మన దుష్ట యగు నామె ముక్కు లక్ష్మణుఁడు కోసెను. దానికిఁ గోపించి ఖరుఁడు, త్రిశిరుఁడు, దూషణుఁడు స సైన్యము రాఁగ యుద్ధమున వారి నెల్లఁ జంపితివి. చచ్చిన యా రాక్షసులు పది వేలకుఁ బైనయే యుందురు. 

 

 

 

 

ఉ.

సోదరి సెప్ప రావణుఁడు చోద్యపు వార్తను రోష మూని తా

నా దరి కంప జింక గతి నశ్రపు నంతట తాటకేయు శా

తోదరి సీత కోరఁ జని త్రుంప మృగమ్ము నదార్వ లక్ష్మణున్

వేదనఁ బంపఁ జూఱకొన వేలుపు గొంగ ధరాత్మభూతనున్

వేదన యున్నఁ గారణము వీని వధింప లభింపఁ బొంగితే

9.     

 

 

 

 

ఆ వింత వార్తను శూర్పణఖ తన యన్న రావణునితోఁ జెప్పఁగా రావణుఁడు కోపముతో నసురుఁ డా మారీచుని జింక రూపమునఁ బంపఁగ సీత కోరికపై దానిని తెచ్చుటకు నీ వేఁగి చంప నది యఱవఁగా సీత బాధతో లక్ష్మణునిఁ బంపఁగ నప్పుడు రావణుఁడు సీతను దొంగిలించెను.  వేదనతో నున్నను వానిఁ జంపుటకుఁ గారణము లభించి నందుకు  రామా నీవు సంతసించితివి.

 

 

 

 

చం.

దశముఖుఁ డాహరించె వసుధా సుతఁ గాఱియ పెట్టి నన్నిటన్

భృశమనుచున్ జటాయు వట బిద్దెను సీతను నీవు రోయు చుం

డ శరపుఁ గార్యమున్నద తటమ్మునఁ జేసి కబంధుఁ జంపి కాం

చి శబరిఁ బంప మారుతినిఁ జేరితి కావు మరుత్పురాధిపా

10.  

 

 

 

 

జటాయువు తనను మిక్కిలి బాధించి సీతను గొనిపోయె నని చెప్పి మరణించెను. నదీ తటమున నుదక కార్యము లతనికిఁ జేసితివి. సీతను వెదకు చుండఁ గబంధుఁ డను రాక్షసునిఁ గని చంపి శబరిని జూచితివి. అంతఁ బంపా తీరమున హనుమంతునిఁ గాంచితివి. ఓ గురువాయూరు నాథా నన్ను కావుము.   

 

 

ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయమున ముప్పది నాలుగవ దశకము. 

 

 

 

 

 

 

 

 

 

శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము

(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము)

నవమ స్కంధ పరిచ్ఛేదము

దశకము 35.

శ్రీరామ చరితము -2.

 

మ.

సుమనస్కుం డనిలాత్మజుం డునుప నా సుగ్రీవ మిత్రత్వమున్

సుమహాదూరము తోలి దుందుభి మెయిం జోద్యంపుఁ బెన్వ్రేలితో

సమయించెన్ సత మద్ది చెట్ల నొక నీ సాయమ్ము దుష్కర్ము నా  

యమరేంద్రాత్మజు వాలిఁ జంపితి మతంగావాస తీరమ్మునం

బ్రమదారత్నమునే తలంచుచు మదిన్ వర్షాంతముం గాంచితే

1.      

 

 

 

 

విమల చిత్తుఁడు హనుమంతుఁడు సుగ్రీవునితో మిత్రత్త్వము నేర్పఱచెను. దేవా రామా దుందుభి కళేబరమును బొటన వ్రేలితో చాలా దూరము త్రోసి, యొక్క బాణమున నేడు మద్ది చెట్లను గూల్చి సుగ్రీవునకు నమ్మకము కలిగించితివి. దుష్టుఁడైన వాలిని సుగ్రీవున కొఱకుఁ జంపితివి. అంత సీతను దల్చుచు మతంగాశ్రమమున వర్ష కాలము ముగియు వరకు నుంటివి.

 

 

 

 

చం.

భయపడి భ్రాత పల్కులకు వానర నాథుఁడు రాఁగ నెల్గు వ్యూ

హ యుతము సీత రోయ ముద మందితి మారుతి కీయ యుంగర

మ్మ యవని జార్థమై దిశల కన్నిట కేఁగెను మార్గ ణార్థమై

రయమున ఋక్ష వానర వరండక మర్మిలి సప్రయాసమే

2.     

 

 

 

 

నీ తమ్ముఁడు లక్ష్మణుని పల్కులకు భయపడి సుగ్రీవుఁడు వానర భల్లూక సేనతో సీతను వెదకుటకు రాఁగ నీవు సంతసించితివి. అప్పుడు నీవు నీ యుంగరమును సీత కానవాలుగ మారుతి కిచ్చితివి. అంత వానర ఋక్ష సమూహము సీతను వెదకుట కన్ని దిక్కులకుఁ బ్రయాసల కోర్చి వెడలెను.  

 

 

 

 

తే.గీ.

వచ్చె సంపాతికి విన నీ వార్త యెరక

లతఁ డనఁ దిమి నుఱికి పురి యందు నరసి

సీత నిచ్చియంగుళి వని చెఱచి యక్షుఁ

జంపి బందియై కాంచి దశగళుఁ గాల్చి

లంక హనుమ మరలి శిరోరత్న మొసఁగె  

3.     

 

 

 

 

దేవా నీ వార్త హనుమ వలన  విని నంతటనె సంపాతి యను గృధ్రరాజమునకు రెక్కలు తిరిగి వచ్చినవి. అతఁడు చెప్పగా హనుమంతుఁడు సముద్రమును దాఁటి, లంకాపురిలో సీతను జూచి యామెకు నుంగరము నిచ్చెను. అశోకవనమును జెఱచెను. అక్ష కుమారుఁడు రావణ కుమారునిఁ జంపి బందియై రావణుని గాంచి లంకను గాల్చి తిరిగి వచ్చి దేవా  నీకు సీత యిచ్చినట్టి శిరోరత్న మొసఁగెను. 

 

 

 

 

మ.

రివటల్ ద్రుంచుచు నుత్సహించి ధృతి సుగ్రీవాంగ దాది ప్లవం

గ వరుల్ రాఁగ సముద్ర పారమును జక్కం జేరి దైత్యానుజ

న్మ వరుం గాచి విపక్ష వార్తలకు నానందించి తత్ప్రోక్తముల్

లవణాంభోధిని దారి వేఁడఁ బలుకన్ రాకున్నయాగ్నేయ శ

స్త్ర వరం బేయఁ జలించి సాగరుఁడు మార్గం బంత వాక్రుచ్చెనే

4.     

 

 

 

 

ఉత్సహించి కొమ్మలు ద్రుంచుచు సుగ్రీవాది వానర వీరులు తోడు రాఁగ రామా నీ వడవిని దాఁటి సముద్రపు టొడ్డునకుఁ జేరితివి. రావణానుజుఁడు విభీషణుఁడు వేఁడఁగ నతనిఁ గాచి తాను జెప్పిన శత్రువార్తలు విని సంతసించి వనధి దాటుటకు మార్గ మడుగ సముద్రుఁడు పలుక కున్నఁ గోపమున నాగ్నేయాస్త్రము నేయఁ జలించి రత్నాకరుఁడు కడలి దాఁటు నుపాయమును జెప్పెను.

 

 

 

 

ఉ.

కట్టి దిగశ్మ రాశులను గంధికి వంతెనఁ జేరి దైత్యులం

గొట్టిరి సాల శైల నఖ ఘోర రదమ్ముల గట్టు దిమ్మరుల్

కట్టఁగ నాగ బంధమునఁ గౌశిక జేతయె తమ్ముఁగూడి ని

న్నిట్టె తెఱల్చెఁ బక్షిపతి యింపగు రెక్కల గాలి యాజిలో

5.     

 

 

 

 

ఎల్ల దిక్కులందుఁ గల ఱాళ్ళతో సముద్రమునకు వంతెన గట్టి లంకఁ జేరి వానరులు దైత్యులను జెట్లు, రాళ్ళు గోళ్లు, దంతములతోఁ గొట్టి పోరిరి. అంత నింద్రజిత్తు నిన్ను తమ్మునిని నాగాస్త్రమున బంధించెను. అంత గరుత్మంతుఁడు రాఁగ నతని రెక్కల గాలియే యా బంధముల నూడదీసెను.

 

 

 

 

తే.గీ.

అనిల జానీత గిరి గంధ మంద శక్తి

ఘాత సౌమిత్రి తేర్కొని కారు కూత

ల యసురుని మేఘనాదుని లయునిఁ జేసె

నాజి నస్త్రజాలమ్మున నడరి మిగుల

6.     

 

 

 

 

పిదప మేఘనాథుని బల్లెపు దెబ్బకు లక్ష్మణుఁడు మూర్చిల్ల హనుమంతునిచేఁ దేఁ బడిన యట్టి సంజీవనీ పర్వతపు గాలి పీల్చి దేరుకొనెను. అంత లక్ష్మణుఁడు విజృంభించి యుద్ధమున నస్త్ర జాలములతో నింద్రజిత్తును వధించెను.

 

 

 

 

తే.గీ.

అసుర మాయలు గన భీతి యావహింప

ధృతి నిడ విభీషణుఁడు నీకుఁ దీర్చి మాయ

ల వెఱ ధ్వజి భక్షకునిఁ జంపితివి రఘువర

కుంభకర్ణు విక్రమమునఁ గ్రూరు నంత

7.     

 

 

 

 

అసురుల మాయలకు భీతి యావహింప విభీషణుఁడు మాయల భయమును విచ్ఛేదము సేసి ధైర్య వాక్కులు పలుక రామా నీవు  విక్రమముతో సైన్య భక్షకుఁ డైన క్రూర కుంభకర్ణునిఁ జంపితివి.

 

 

 

 

చం.

సురపతి పంపఁ దేరు నిఁకఁ జోదకు రావణ శీర్ష పంక్తి సం

గరమున నబ్జ జాస్త్రమున ఖండన చేసి గ్రహించి వహ్ని శు

ద్ధ రమణి సత్వ మీయఁగ మృతప్లవ ఋక్ష వరాళికిన్ సురల్

తరలితి వెల్లరం గలసి త్వత్పురికిం దమిఁ బుష్పకమ్మునన్

8.     

 

 

 

 

 

దేవేంద్రుఁడు నీ కొఱకు రథమును సారథినిఁ బంపఁగ రామా రావణుని పది తలలను యుద్ధమున బ్రహ్మాస్త్రముతో ఖండించితివి. వహ్ని విశుద్ధ రమణి సీతను గ్రహించి దేవతలు మృతు లైన  వానరులను భల్లూకములను బ్రదికింపఁగ  నందఱిఁ గూడి పుష్పక విమానమున నయోధ్యకుఁ జేరితివి.

 

 

 

 

మ.

పరిపాలించితి వూని రాజ్యమును వే వత్సమ్ము లింపారగం

దరుణిన్ మైథిలి గర్భిణిన్ విడిచి తన్యాయాత్ము వాక్యమ్ములన్

దురితుం జంపితి శూద్రునిన్ లవణ దైత్యుం జంపె శత్రుఘ్నుఁడే

వర వాల్మీకి గృహమ్మునం గనె సుతద్వంద్వమ్ము వైదేహియే

9.     

 

 

 

 

అంత రామా నీవు పెక్కు సంవత్సరములు రాజ్యమును బరిపాలించితివి. ఒక దుష్టాత్ముని మాటలకు గర్భిణియైన భార్య సీతను పరిత్యజించితివి. నీ పంపున శత్రుఘ్నుఁడు లవణాసురునిఁ  జంపెను. నీ వొక శూద్రుని దురితునిఁ జంపితివి. వాల్మీకి మునీంద్రు నాశ్రమమున సీత యిద్దఱు మగ బిడ్డలను గనెను.

 

 

 

 

మ.

క్రతు దేశమ్మునఁ బాడి రింపుగ సుతుల్ రామాయణ గ్రంథమున్

యతి వాల్మీకి వచింపఁ గోరితివి భార్యారత్న సంయోగమున్

క్షితి చేరెం ధరణీజ లక్ష్మణునిదౌ కేల్వీడితే కాల వా

క్య తతిన్ భృత్య యుతమ్ము నీవు సరయూ కల్లోలినిన్ మున్గి యా

తత వైకుంఠ పదమ్ము సేరితివి నీ ధామమ్ము దామోదరా

10.  

 

 

 

 

యాగప్రదేశమున నీ సుతులు రామాయణమును గానము సేసిరి. వాల్మీకి మహర్షి వైదేహి యొక్క సచ్ఛారిత్ర్యము నుడువ సీతను గ్రహించుటకు సిద్ధపడితివి. కాని భూదేవి రాఁగ నవనిజ భూమిలోఁ బ్రవేశించెను. కాలపురుషుని వచనముల నాలకించి లక్ష్మణుని వీడి పురజనులతో  సరయూ నదీ తీరమునకు వచ్చి నీవు జలములలో మునిఁగి దామోదరా నీ ధామ మైన వైకుంఠము సేరితివి.

 

 

 

 

ఉ.

మానవ జన్మ మెత్తితివి మానవ సంతతి శిక్షణార్థమే

పూనిన రాగ మెక్కువగ మూరును దుఃఖము నా వచింపగం

గానఁగ నీకు నెక్కడ వికారము లెందును జక్రపాణి నీ

మానస మందు నట్టి విభు మాన్పు మరున్నగరేశ మా రుజల్

11.   

 

 

 

 

మానవులకు ధర్మమును గఱప మానవ జన్మ మెత్తితివి. రాగము మీఱిన దుఃఖములు కల్గునని చూపించితివి. అంతియే కాని నీకు మనస్సులో వికారము లుండునా? అట్టి యో చక్రపాణీ గురు వాయూరు నాథా  మా రోగములను బాపుము.

 

 

ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయమున ముప్పది యైదవ దశకము. 

శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము

(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము)

నవమ స్కంధ పరిచ్ఛేదము

దశకము 36.

పరశురామావతార వర్ణనము.

 

 

ఉ.

సుతునిగఁ బుట్టి తత్రి యనసూయలకున్ భువి దత్త నామ వి

శ్రుతముగ శిష్య బంధనము చొప్పడ నొప్పక స్వీయ భార్య తో

డుతఁ జరియింప హైహయ పటుప్రవరంపు మహీశు భక్తికిన్

వితత ధనమ్ము లిచ్చి నిజ వీర్య లయమ్ము వరం బొసంగితే

1.      

 

 

 

 

 

 

అత్రి యనసూయలకు దేవా నీవు దత్తాత్రేయుఁ డను పేరున పుత్రినిగాఁ బుట్టితివి. శిష్యుల నుంప నిష్ట పడక నీ భార్యతోఁ జరించు చుంటివి. హైహయ వంశపు రాజగు కార్తవీర్యార్జునుని భక్తికి మెచ్చి నీ వతనికి విరివి యగు నైశ్వర్యము లొసంగితివి. నీ చేతి మరణమును గూడ యతనికి వరముగాఁ నిచ్చితివి. 

 

 

 

 

ఉ.

అప్పుడు బ్రాహ్మణద్విషమ యయ్యధి రాట్కుల మెల్ల భూమికిం

దప్పని భార మా వధకుఁ దథ్యము సేయఁగ నర్జు నార్థమై

యొప్పు వరమ్ముఁ బుట్టితివి యుర్విని నా జమదగ్ని రామ నీ

కప్పగ రేణుకా సతికి హర్షము నందఁగఁ జిన్నవాఁడవై

2.     

 

 

 

 

ఆ దినములలో రాజ కుల మెల్ల బ్రాహ్మణులను శత్రువులుగా గణించు చుండెను. భూమికి భారముగాఁ జరించు చున్నది. అంత నీవు కార్తవీర్యార్జునుని వరము నిజము చేయుటకు దేవా జమదగ్నిరేణుకా సతులకు మిక్కిలి హర్షము నిచ్చుచు  వారి పుత్రుని గా రాముఁ డను పేరుతో సుతు లందఱి కన్న చిన్నవాఁడవై పుట్టితివి. 

 

 

 

 

మ.

ప్రమదం బొప్ప నెఱింగితే శ్రుతులు నీ ప్రాయంపు టీరేడులం   

దమి వీక్షింపఁగ నీదు మాత యట గంధర్వేశుఁ గోపించి చం

పు మనంగాఁ బిత సంపి సోదర యుతంబున్ ధిక్కరింపంగ వా

ర మనం గోరితి వెల్లరుం బితను మాత్రాశీస్సులుం బొందితే

3.     

 

 

 

 

నీ పదునాల్గవ యేటనే వేదములను ముదముగా నెఱిఁగితివి. ఒకనాఁడు నీ జనని గంధర్వు నొకనిఁ  దమి వీక్షించిన కారణమునఁ దండ్రి పంపున నీవు తల్లిని, తండ్రి యాజ్ఞ ధిక్కరించిన నీ యన్నలను గూడ  వధించితివి. తిరిగి వారిని మను నట్లు చేయ మని నిన్ను మెచ్చిన తండ్రి నడిగితివి. అంత తల్లి యాశీస్సులను బొందితివి.

 

 

 

 

ఉ.

తెచ్చితి కామధేనువును దీర్పఁగఁ గోరిక తండ్రికిన్ ముదం

బచ్చము నీయఁ దల్లికి మహర్షి భృగూత్తము నాజ్ఞఁ జేరి యా

యుచ్చపు శీత పర్వతము నుగ్రు నుతింపఁ గుఠార మీయఁగా

నచ్చట నుక్త రాక్షసుల నందఱిఁ దున్మి మహాస్త్ర లబ్ధివై

నెచ్చెలి రూపునం గదియ నిన్నకృతవ్రణుఁ డిల్లు సేరితే

4.     

 

 

 

 

తండ్రి కోరిక తీర్చుటకును దల్లి కానందము నిచ్చుటకును బరశురామా నీవు కామధేనువును దెచ్చితివి. నీ తాత భృగు మహర్షి యాజ్ఞతో  హిమవత్పర్వతమున కేఁగి శివుని గూర్చి తపము చేసితివి. శంకరుఁడు గొడ్డలి నిచ్చి కొందఱు రాక్షసులను జంప మనఁగ వారిఁ జంపితివి. అప్పుడు హరుఁడు మహాస్త్రముల నొసంగెను. అకృతవ్రణుఁ డను ముని  మిత్రుఁడు కాఁగ నతనితోఁ గలసి యిల్లు చేరితివి.

 

 

 

 

చం.

కన మృగయాంత మర్జునుఁడు కామదు ఘార్జిత సంపదం దగన్

జనకుఁడు సత్కరించెఁ జని సద్మము గోవుఁ గొనంగ మంత్రి మా

ట నరసి యన్యునిం బనుప టక్కరి సంపె మునిం దిరస్కృతిం

గనలి బలమ్ముఁ గూల్ప మహి గ్రక్కునఁ గ్రేపు హరించె మంత్రియే

5.     

 

 

 

 

కార్తవీర్యార్జునుఁడు వేట యనంతరము జమదగ్నినిఁ జూడఁగ నతఁడు కామధేను వొసంగిన సంపద చేత  నా రాజును సత్కరించెను. రాజంత గృహము చేరి తన మంత్రి చెప్పగాఁ  గామ ధేనువును దీసికొని రమ్మని మఱి యొక మంత్రినిఁ బంపెను. ఆ మంత్రి ముని గోవు నీయఁ దిరస్కరింపఁగ మునినిఁ జంపెను. ఆవు కోపించి యతని సైన్యమును గూల్పఁగ మంత్రి దాని దూడను గొని పోయెను.

 

 

 

 

తే.గీ.

శుక్రుఁడు బ్రతికింప జనకుఁ జొప్పడ వివ

రమ్ములు మహోదరుఁడు కుఠారమ్ము చాప

శరము లీయ నరద మెక్కి చని యడుగ ని

రాకరింప మాహిష్మతీ రాజు దూడ

నీయ నుద్యమించితి వని సేయ నపుడు

6.     

 

 

 

 

శుక్రుఁడు జమదగ్నిని బ్రదికించెను. వివరములు తెలియ, శివభటుఁడు మహోదరుఁడు గొడ్డలి, విల్లు బాణముల నీయ రథము నెక్కి పరశురామా నీవు మాహిష్మతీ రాజు కడ కేఁగి దూడ నిమ్మని యడిగితివి. రాజు తిరస్కరింప యుద్ధము సేయ నుద్యమించితివి. 

 

 

 

 

మ.

అయు తాత్మోద్భవ భీమ సప్తదశ సేనాక్షౌహిణీ నేతృ యో

ధ యుతంబై బహు మిత్ర సంచయ సుసంధానుండునై పోరఁగా

రయ మొప్పార కుఠార బాణ తతిఁ జక్రంబెల్లఁ గూల్పంగ హై

హయుఁడే, పాఱఁగ శేష పుత్రు లిఁక రామా, నీపయిన్ దూఁకెనే

7.     

 

                                                       

 

 

 

పదివేల మంది పుత్రులు, భయంకరమైన పదునే డక్షోహిణుల సేన సేనాపతులతో మఱి మిత్ర వర్గముతోఁ గూడి యుద్ధమునఁ బోరఁగ రామా నీవు గొడ్డలి బాణ సమూహముతో సైన్యము నెల్లఁ గూల్చితివి. మిగిలిన కొడుకులు పాఱిపోవ హైహయుఁడే స్వయముగ నీపై దూకెను.

 

 

 

 

ఉ.

ఆపెను నర్మ దాంబువుల నా దశకంఠు మదమ్ముఁ ద్రుంచెనే

రూపడగంగ నస్త్ర తతులుం గర పంక్తి విముక్తముల్ ద్రుటిం

బాపఁగ వైష్ణవాస్త్రమును బన్నుగ నిన్హరి గా నెఱింగి తాఁ

బాపము వాయ వేఁడె నిను వాని వధింప వికుంఠ మందెనే

8.     

 

 

 

 

కార్తవీర్యార్జునుఁడు నర్మదా జలముల నాపెను. రావణుని గర్వము ద్రుంచెను. అట్టి యా రాజు, తన సహస్ర బాహువుల నుండి వెలువరించిన యస్త్రము లన్నియు నశింపఁగ, ద్రుటిలో వైష్ణవాస్త్రమును గూడ నీవు విఫలము సేయ, నిన్ను విష్ణువుగా నెఱిఁగి పాపములు వోవుటకుఁ బ్రార్థించెను. అవి విని రామా నీ వతనిని వధింప నతఁడు వైకుంఠమును బడసెను.

 

 

 

 

మ.

అలుకన్ హైహయ పుత్రు లప్పఁ గని సంహారమ్ము సేయంగ గుం

డెలు తాటించుచుఁ దల్లి యేడ్వఁ బగులన్ డెందమ్ము నీవంత చిం

తిలి యానం గొని రాజహీనము ద్విజద్వేషక్షితీశాన్వయ

మ్ముల నీక్షించి కుఠార బాణ తతులం బోరం బగం జంపితే

9.     

 

 

 

 

అంత హైహయ రాజపుత్రులు కోపముతో నీ తండ్రి జమదగ్నినిఁ జంపఁగాఁ దల్లి గుండెలు బాదుకొని రోదించుట చూచి నీవు దుఃఖముతోఁ గోపముతో భూమిని రాజహీనముగాఁ జేయఁ బ్రతిజ్ఞను బూనితివి. ద్విజద్వేష రాజ వంశముల నెల్లఁ జూచి గొడ్డలితో బాణములతో యుద్ధమునఁ బగఁ బూని జంపితివి.

 

 

 

 

చం.

జనకునిఁ గాచి క్షత్రియులఁ జంపి త్రిసప్తక వారముల్ భువిం

దనియ సమంత పంచక నదమ్మున శోణిత వారిఁ బెద్దలే

యొనరిచి యిష్టి కశ్యపున కుర్వినిఁ జక్కఁగ నేలవేల్పు సం

తునకు మునీశ్వరుల్ నుడువఁ దూల్పవు సాల్వునిఁ గృష్ణు పా లనన్

10.  

 

 

 

 

అంత నీ తండ్రిని బ్రదికించుకొని క్షత్రియుల నిరువది యొక్క మాఱు చంపి, సమంతపంచకమున  రక్తపు నదులతో బెద్దలను దనిపితివి. అంత యజ్ఞము చేసి భూ భాగ మంతయుఁ గశ్యపాది భూ సురులకు దానము చేసితివి. సనకాది మునీశ్వరులు సాల్వుని కృష్ణుఁడు చంపు నని వచింపఁగ నతనిని చంపక విడిచితివి.

 

 

 

 

చం.

వదలి మహాస్త్రరాజి నల భవ్య మహేంద్రగిరిం దపమ్మొన

ర్పఁ దపసు లుత్తరింపు మన వార్ధి మునింగిన గోవుకర్ణమున్   

బెదరి మహాగ్ని పత్రికిని వేయ స్రువమ్మును నీవు వేగ సే

రు దరికిఁ బోయెఁ గేరళకు రోసి మరుత్పుర నాథ గావుమా

11.   

 

 

 

 

అంత నస్త్రముల నెల్ల విడిచి మహేంద్ర గిరి తటినిఁ దపము చేయు చుంటివి. అచ్చటి తాపసులు గోకర్ణము సముద్రములో మునిఁగినది దాని నుత్తరింపు మని వేఁడిరి. అంత నీ వాగ్నే యాస్త్రము సంధింప సముద్రము భీతిలి నీవు స్రువమును విసర నది యేగి నంత దూరము వెదకి మరలినది. అదియే  పురాతన  కేరళ ప్రదేశము. అట్టి యో గురువాయూరు నాథా నన్ను గావుము.

 

ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయమున ముప్పది యాఱవ దశకము. 

నవమ స్కంధ పరిచ్ఛేదము సమాప్తము.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము

(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము)

దశమ స్కంధ పరిచ్ఛేదము

దశకము 37.

శ్రీకృష్ణావతార ప్రసంగము.

 

 

మ.

పర మానంద వపుర్హరీ! మునుపు దేవవ్రాత దైత్యాంక మం

దురువై చావఁగ శేష దైత్యులు పదం బుచ్చంబు వోజాల కీ

ధరఁ బుట్టంగఁ దదుగ్ర భార ధృతి సంతాపంబునన్ ధాత్రి దా

నరయన్ బ్రహ్మను జేర దేవతలు నయ్యంభోజజుం జేరిరే

1.      

 

 

 

 

పరమానందంపు మేను గల హరీ పూర్వము దేవ దానవ యుద్ధమున విరివిగాఁ జావఁగ మిగిలిన రాక్షసులు పరమ పదము వోఁ జాలక భూమిపైఁ బుట్టిరి. వారి భారమును మోయఁ జాలక భూదేవి తాపముతో బ్రహ్మ దేవునిఁ జూడ నేఁగఁగ దేవతలు నచటకుఁ జేరిరి.  

 

 

 

 

తే.గీ.

దుష్ట జన భారమున నల్గి తోర మంబు

ధి మునుఁగుచు నుంటి దీనను దేవ యకట

యీ సురల నడుగుమ కావు మెలమి నన్న

న ధర విని వారిఁ గని తల్చె నలువ నిన్ను

2.     

 

 

 

 

దుష్ట జనుల భారముతో మిక్కిలి నలిగి కడలిని మునిఁగి యున్నాను దీనురాలినై యని యీ సురల నడుగుము దేవా నన్ను గావు మని భూమి బ్రహ్మతో ననెను. అప్పు డా మాటలు విని దేవతలను జూచుచు బ్రహ్మ దేవుఁడు నిన్ను దలఁచెను.

 

 

 

 

తే.గీ.

నలినజుఁ డనియె సుర లార యిల నిజమ్ము

నుడివె లక్ష్మీధవుండ దక్షుఁ డగుఁ గావ

నిలను మిమ్ముఁ బాలకడలి వలయుఁ జనఁగ

శివుని గూడి పొగడ ననఁ జేరి రటకు

3.     

 

 

 

 

అపుడు బ్రహ్మ సురలారా భూదేవి నిజము పల్కినది, లక్ష్మీపతియే భూదేవిని మిమ్ము రక్షింప దక్షుఁడు, శివునిఁ గూడి మన మందఱము పాల కడలికి నాతని నర్చింప నేఁగ వలయు నని పలుక నందఱు నచటకుఁ జేరిరి. 

 

 

 

 

ఉ.

వా రిలఁ గూడి యేఁగి సిత వార్ధి తటమ్ము భవత్పదాబ్జ చిం

తా రత చిత్త తన్నిలువ తాత మనమ్మున విన్న వాక్యముల్

నీరజ నేత్ర మిన్కు లవి నీవి ముదమ్ము నొసంగ నెల్లరున్

మీ రిట నీ నుడుల్ వినుఁడు మిక్కిలి శ్రద్ధగ నంచుఁ బల్కెనే

4.     

 

 

 

 

వారితోఁ గూడి క్షీరసముద్ర తీరము సేరి దేవా నీ పాద చింతనా రతితో నిలువఁగ నంత  బ్రహ్మ తన మనస్సులో విన్న నీ పల్కులను వారికి ముదము నీయ నీ మాటలు వినుఁ డని నీ పల్కుల నెల్ల వినిపించెను.

 

 

 

 

చం.

ఎఱుఁగుదు భూమి దేవతల యిక్కటు లెల్ల భృశమ్ము పుట్టుదున్

నుఱుమఁగ నద్ధరేశ్వరులనున్ వెస నే నల యాదవుండనై

తఱ చగు వృష్ణి శాఖ నమృతాంధసు లంగనలున్ జనింపఁగా

నెఱుక నొసంగ నం గొలువ నివ్విధిఁ దెల్పెను నీదు పల్కులన్   

5.     

 

                      

 

 

భూమి, దేవతల బాధల నే నెఱుఁగుదును. నేను దుష్ట ధరాపతులను నుఱుముటకు భూమిపై నా యంశతో యాదవునిగాఁ బుట్టెదను. దేవత లందఱు వృష్ణి కులమునఁ బుట్టుఁడు. దేవతా స్త్రీలు జ్ఞానము నొసఁగ నన్ను గొలుచుటకు భూమిపైఁ బుట్టఁ గలరు. ఈ విధముగా నీవు చెప్పిన పల్కులను  బ్రహ్మ వారికిఁ జెప్పెను. 

 

 

 

 

చం.

అవి విని కర్ణపేయములు నందఱు తృప్తిలి నీ కృపారస

మ్ము విరివి గ్రోలి యేఁగిరి నభో గతి నమ్మధురా పురిన్ మఱే

ది వెలుఁగు భావి నీ కతన దేవకి ధన్యను జే కొనెన్ ధరా

ధవుఁ డగు శూర సూనుఁడు వదాన్యుఁడు నా వసుదేవ నాముఁడే

6.     

 

 

 

 

చెవుల కింపైన యా మాటలు విని దేవా నీ కృపారసమును గ్రోలి తృప్తితో నాకాశమార్గమున నెల్లరు నేఁగిరి. ఇచట మధురా నగరిలో దేవకీ దేవిని రాజు శూరసేనుని కుమారుఁడు వసుదేవుఁడు పెండ్లి యాడెను. ఆ మధురా నగరమే మున్ముందు దేవా నీ వలనఁ బ్రకాశింపఁ గలదు.

 

 

 

 

చం.

సముదము గౌరవార్థమున సారథియై చనుచుండఁగా వివా

హమున కనంతరమ్ము పథి నగ్రజ కంసుఁడు నాలకింపఁ గం

స! మగువ యష్ట మార్భకుఁడు చంపును నిన్నను నంతరిక్ష వా

క్యములు కడింది రోషుఁ డయి కాంతను ద్రెక్కొన ఖడ్గ మెత్తెనే

7.     

 

 

 

 

సంతోషముతోఁ గంసుఁడు, దేవకి యన్న, వివాహానంతరము సారథియై దేవకీ వసుదేవులను దీసి కొని చనుచుండ నాకాశ వాణి కంసా యీ భామ యష్టమ పుత్రుఁడు నిన్ను జంపు నని”  పలుకఁగ విని రోషముతో సోదరినిఁ జంప ఖడ్గ మెత్తెను.

 

 

 

 

చం.

విడువఁడు జుట్టు కంసుఁ డయొ వేడ భృశమ్ముగ శౌరి యంతటం

దడఁబడి పుట్టఁ బుత్రులను దప్పక నిత్తు ననంగ నొప్పి తా

విడిచి గృహమ్ము సేరె నటు పిమ్మట నీ సహజన్ము నీయఁ గం

సుఁడు దయ వీడెఁ జంపకయుఁ జోద్యము దుష్టులునుం గృపాత్ములే

8.     

 

 

 

 

ఎంత వేఁడినను గంసుఁడు దేవకి జుట్టు వీడక యున్న నంత వసుదేవుఁడు తడఁబడుచుఁ బుట్టిన పిల్లలను దప్పక నిత్తు నని చెప్పఁగా దయతో నామెను జంపక విడిచి గృహము సేరెను. పిమ్మట పుట్టిన నీ సోదరునిఁ గంసున కీయఁ జంపక నతనిని విడిచెను.  చోద్యము దుష్టులకుఁ  గూడా కృప యుండునా!

 

 

 

 

ఉ.

నారదుఁ డేఁగి కంసు దరి నాక మునీంద్రుఁడు కంస! నీవు నీ

వారలు రాక్ష సాన్వయపు వారలు యాదవు లెల్ల నిర్జరుల్

మూరి వధింప నిన్ను హరి పుట్టు సురార్థిత సత్వరుండునై

నా రుష శౌరి పుత్రులను నర్కి కలంచెను యాదవావళిన్

9.     

 

 

 

 

అంత నీ ప్రేరణముననే నారదుఁడు కంసుని కడ కేఁగి కంసా నీవు నీ వారు దానవాన్వయపు వారు, యాదవు లెల్ల దేవతలు, సురలచేఁ బ్రార్థితుఁడై హరి నిన్ను వధించుటకు పుట్టు నని చెప్పెను. అంత మహా కోపముతోఁ గంసుఁడు యాదవులను గలఁత పెట్టుచు వసుదేవుఁ డిచ్చిన పుత్రుల నందఱను దయ వీడి చంపెను. 

 

 

 

 

ఉ.

దేవకి గర్భ మందు నహి దేవుని యంశము సేర్చి రోహిణీ

దేవికిఁ గుక్షి దాని నిడి దేవర దేవకి కుక్షిఁ జేరితే

దేవ గణమ్ము నిన్ను వినుతింపఁగ మాధవ యట్టి కృష్ణ నం

గావుమ త్రుంచి రోగములు కల్గఁగఁ జేయుమ భక్తి నీపయిన్

10.  

 

 

 

 

దేవకి గర్భమున నేడవ తడవ శేషు నంశమును జేర్చి దానిని రోహిణి గర్భ మందు సంక్రమింపఁ జేసి నీవు దేవకీ గర్భమున నష్టమ పుత్రునిగాఁ జేరితివి. దేవ గణము నిన్ను స్తుతించినది. అట్టి యో కృష్ణా నా రోగములను బాపి నీ పై భక్తి కలుగ జేయుము.

 

 

ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయమున ముప్పది యేడవ దశకము. 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము

(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము)

దశమ స్కంధ పరిచ్ఛేదము

దశకము 38.

శ్రీకృష్ణుని గోకులమునకుఁ జేర్చుట .

 

 

తే.గీ.

దేవ! యానందరూప! మహావతార

మంద నీవు దీప్తంపు నీ యంగ రుచులు

వర్ష వేళ నభోవృత వర్షదప్ర

భా నిభమ్మయి విలసిల్లుఁ బరమ పురుష

1.      

 

 

 

 

పరమ పురుష! దేవా! యానందరూపా! వర్షకాలమున నీ వీ మహావతారము దాల్ప  నాకాశమున నిండిన మేఘ కాంతుల వలె నీ శరీర కాంతులు వెలుంగు చున్నవి.

 

 

 

 

ఉ.

క్లేశ వినాశ నార్థము సలీల జగత్రయ వాస కోటికి

న్గేశవ పుట్టి తీవు నిశ  నీరజ వైరి సముద్భ వాభమై

యాశలు చల్లనై తనర నంబుద తోయ వితాన సార్ద్రమై

యాశలు తీర సంతసము నందఁగ సజ్జన వర్గ మెల్లెడన్

2.     

 

 

 

 

దేవా ముల్లోకముల ప్రజల కష్టములు దొలగించుటకు రాత్రి సమయమున చంద్రుఁ డుదయించిన రీతి, దిక్కులు మేఘ జలములఁ దడిసి చల్లఁబడ సజ్జనుల యాశలు దీర సంతసింపఁ బుట్టితివి.

 

 

 

 

తే.గీ.

బాల్యముననె యా సూతికా భవనమునను

నీలి మేఘ దేహ రుచుల మేలి కంక

ణాంగద కిరీట హారము లలర శంఖ

చక్ర పద్మ గదా హస్త శార్ఙ్గి వైతి

3.     

 

 

 

 

ఆ పురి టింటి లోనె పసితనముననె నీల వర్ణ మేఘ కాంతులతో నీదు దేహ మడరఁ గంకణములు, కేయూరములు, కిరీటము, హారములు, శంఖము, చక్రము, పద్మము, గద, విల్లు చేతు లందు  నలరు చుండఁ గనిపించితివి.

 

 

 

 

తే.గీ.

వక్ష మందు వెలయ లక్ష్మి రక్ష నిడ క

టాక్ష వీక్షణములు నా గృహమ్ము నందుఁ

గంస కల్పి తాలక్ష్మిని ఖండన మొన

రింప నన వాసుదేవ కన్పించె నపుడు

4.     

 

 

 

 

నీ వక్ష మందు రక్షణ నిడ నిల్చిన లక్ష్మి కటాక్ష వీక్షణము లా గృహము నందుఁ గల కంసునిచేఁ గల్పింపఁబడిన యలక్ష్మిని ఖడించుట కనఁగఁ బ్రసరించెను.

 

 

 

 

చం.

ముని నిభ ధీర చిత్తమున మూరిన శౌరి భవద్వపో విభూ

తినిఁ గని వీక్షణమ్ముల నతీత ముదమ్మునఁ బొంగి గద్గద

మ్మునఁ బులకింప హర్ష జలముం గనులందు చెలంగి కాఱ జి

వ్వునను దయారసమ్ము పరిపూర్ణము ద్రావుచు వేఁడె నివ్విధిన్

5.     

 

 

 

 

ధీరత్వమున ముని సన్నిభుఁ డైన వసుదేవుఁడు విభూ నీ తనవు వైభవమును సంతసంపుఁ జూపులఁ జూచి పొంగి మేను పులకింపఁ గన్నుల నానంద భాష్పములు శీఘ్రము రాల నీ దయా రసమును బూర్తిగఁ ద్రాగుచు గద్గదమున నిన్నిట్లు వేఁడెను. 

 

 

 

 

తే.గీ.

పరమ పురుష ప్రసన్న సువదనుఁడ వయి

తనరు తాప లతా లవిత్ర సమ నేత్ర

విలసన నిపుణ సద్దయా వీక్షణముల

బాధలు చిర మివ్విధి వేఁడెఁ బాపు మనుచు

6.     

 

 

 

 

పరమ పురుషా ప్రసన్నమైన వదనమునఁ దనరుము. తాపము లను లతలను గోయఁ గొడవలికి సమాన మైన వాఁడా, నేత్రములతో విలాసముగా నాడు వాఁడా, దయా వీక్షణములతో బాధలను బాపుము. చిర మివ్విధి నతడు పలుకుచు నిన్ను వేఁడెను. 

 

 

 

 

ఉ.

జననియు భాష్ప నేత్రముల సంస్తుతి చేసె దయానిధీ స కీ

ర్తన సుగుణమ్ము లెల్ల వనితా మణి పూర్వ భవద్వయమ్ములన్

జననికి గుర్తు చేసితివి చక్కఁగ నంతట మాతృ వాక్య పా

లన నర బాల రూపమును రమ్యముగా ధరియించితే విభూ

7.     

 

 

 

 

నీ సద్గుణ కీర్తనములతోఁ గనుల నీ రొలుకఁ దల్లి కూడ దయానిధీ నిన్ను స్తుతించెను. అప్పుడు తల్లికిఁ దన పూర్వపు రెండు జన్మలను గుర్తు చేసితివి. అంతఁ దల్లి కోరిక పై నీవు చిన్ని బాలునిగ మారి యందముగాఁ గనిపించితివి.

 

 

 

 

తే.గీ.

నీ వనఁగ నంద తనయను నిన్ను మార్ప

గూఢముగ వసుదేవుఁడు గురు ముని గణ

చిత్త వాసు నిన్నుంచెను జేతు లందు

పద్మ యుగ మధ్య కలహంస వత్స నిభము

8.     

 

 

 

 

అంత, నీవు చెప్పినట్లు, నందుని పుత్రికతో  రహస్యముగా నిన్ను మార్చుటకు వసుదేవుఁడు మునుల చిత్త మందు వసించు నిన్ను దన చేతు లందు నుంచు కొనెను. అప్పుడు నీవు రెండు పద్మముల నడుమ నున్న యంచకూన వలె నుంటివి.

 

 

 

 

తే.గీ.

పుట్టి గోపు గృహము నందు పుర జనులను

నిద్రవోవఁ జేసెను యోగనిద్ర తనదు

మాయఁ జిత్రముగను నీదు మాయ చేత

గట్టి గడియ లూడె స్వయము కార యందు

9.     

 

 

 

 

నందుని యింటఁ బుట్టి పౌరు లెల్ల నిద్రించు నట్లు నంద పుత్రి యోగ మాయ చేసెను. చిత్రముగ నిట మధురలోని చెఱసాల గడియలు స్వయముగ  ప్రభూ నీ మాయ వలన నూడినవి.

 

 

 

 

తే.గీ.

దారి శేషుఁడు పడగల వారి ధార

లాపె మణి కాంతులు పఱచి చూపె దారి

ధన్యుఁ డాయె నిన్ను ధరించి తండ్రి యట్టి

యీశ చేయుమ బాధల నాశనమ్ము

10.  

 

 

 

 

దారిలో శేషుఁడు తన పడగలతో వర్ష ధారలు నీపై పడకుండు నట్లాపెను. తన శిరము పైన నున్న రత్నపుఁ గాంతితో దారి చూపించెను. నిన్ను దలపై ధరించి వసుదేవుఁడు ధన్యుఁ డయ్యెను. అట్టి యీశ్వరా నా బాధలను నాశనము చేయుము. 

 

 

ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయమున ముప్పది యెనిమిదవ దశకము. 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము

(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము)

దశమ స్కంధ పరిచ్ఛేదము

దశకము 39.

యోగమా యానయన వర్ణనము.

 

 

ఉ.

కాంచెఁ గళింద నందనను గైకొని పో నిను శూరసూనుఁడే

మించ జలమ్ము లభ్రము నమేయ తరంగ యుతమ్ముగాఁ బయ

స్సంచయ మక్కజమ్ముగను జాఁగె వినమ్రతఁ జూచుచుండగా

నంచిత పాద మాత్రముగ నైంద్రపు మాయ యనంగ నత్తఱిన్

1.      

 

 

 

 

అంత వసుదేవుఁడు దేవా నిన్ను గొని పోవుచు యమునా నదినిఁ జూచెను. అది యువ్వెత్తున లేచు కెరటములతో నాకాశమును దాఁకు జలారాశియై యుండెను. చిత్రముగ నంతఁ జూచుచుండగఁ బాదపు లోతు మాత్రముగ నైనది యింద్రజాలమో యను నట్లు.

 

 

 

 

ఉ.

చేరి సుసుప్త గోపతతి చిద్రవ రోదన బాలి కావృ తా

ద్వార కవాట గోకులము తల్పము నందు నినుం బరుండఁగాఁ

జేరిచి భద్ర రీతి నతి శీఘ్రమ కల్లతనంపు బాలికన్

మూరి వహించి స్కంధమునఁ బ్రోలికిఁ జేరెను శూర పుత్రుఁడే

2.     

 

 

 

 

నిద్రించు చున్న గోపకులు కల, చిన్నగా రోదించు బాలికతో నున్న, ద్వార కవాటముల యడ్డంకి లేక యున్న గోకులమును జేరి యా తల్పముపై  దేవా నిన్ను భద్రముగఁ బరుండఁ బెట్టి యా కపట బాలికను మూపు పైనిడి వసుదేవుఁడు కారాగారమునకుఁ దిరిగి వచ్చెను.

 

 

 

 

తే.గీ.

అంత బాలిక రోదన మాలకించి

భటులు లేచి నివేదింపఁ బ్రసవ వార్త

కంసుఁ డదరి జుట్టు విడఁగఁ గదలి కాంచె

సుతను భగిని సరస ముదము తలఁగ మది

3.     

 

 

 

 

అప్పుడు బాల యేడ్వఁగ విని భటులు నిద్ర లేచి కంసునకుఁ దేవకికిఁ బ్రసవ మగుట తెలిపిరి. అంత కంసుఁ డదరి జుట్టు వీడఁ జెల్లెలి ప్రక్కన బాలికను జూచెను. మదిలో నతనికి సంతసము మాయమైనది. 

 

 

 

 

తే.గీ.

కాంచి పసికందు సోదరీ కాయ సక్త

విష్ణు మాయగా మది నెంచి వేగ లాగి

బాలికఁ గరి సరోవర పద్మ మడరి

లాగు రీతి విసరి కొట్టె రాతి పైన

4.     

 

 

 

 

ఆ పసికందును దల్లినిఁ దగిలియున్నదానిఁ జూచి యది విష్ణుమాయగాఁ దలఁచి సరసి లోని పద్మమును గజము లాగు నట్లు నా బాలికను కంసుఁడు వేగముగ లాగి రాతిపై విసరి కొట్టెను.

 

 

 

 

చం.

కరముల నుండి యొక్క ద్రుటిఁ గాంచఁగ వీడి సురూప మన్యముం

ద్వర ధరియించె నా శిశువు పాయు విధమ్ముగ మృత్యుపాశమే

యరయఁగ నీదు భక్తులకు నష్ట భుజమ్ముల నాయుధమ్ములం

గరముల నూని నింగినిఁ బ్రకాశిత మయ్యెను నేలఁ గూలకే

5.     

 

 

 

 

నీ భక్తులు  మృత్యుపాశమును వీడు నట్లుగా  కంసుని చేతుల నుండి త్రుటిలో వీడి చూచుచుండ మంచి రూపము నా శిశువు  ధరించి యెనిమిది భుజములతో నాయుధములతో నేలపైఁ గూలక యాకసమునఁ గనిపించినది.

 

 

 

 

తే.గీ.

దుష్ట కంస నన్నడిచినఁ దొలఁగఁ గలదె

భయము నీకు నిన్ను వధించు వాఁడు పుట్టె

నెక్కడొ తలంపు నీహితమే యని యిల

వెలసె ననుజ మందిరములఁ గొలువ సురలు

6.     

 

 

 

 

ఓ కంసా నన్ను జంపిన నీ భయము తొలఁగునా? నిన్ను జంపు వాఁడు పుట్టె నెక్కడో నీ బాగును యోచింపు మని పలికి యంత దేవా నీ సోదరి యిలలో మందిరముల సురలు గొలువ వెలసినది. 

 

 

 

 

చం.

తెలతెలవాఱఁ దెల్పె వడిఁ దెల్లముగా నిజ భృత్య కోటికిన్

లలన వచస్సు లెల్లను బ్రలంబ బకాసుర పూతనాదులన్

విలయము సేయఁ బంప నిను భీకర బాహు బలాఢ్యు లెల్ల భూ

వలయము తిర్గి పాపలఁ గృపా రహితమ్ము వధింపఁ జాగిరే

7.     

 

 

 

 

అంతఁ దెల్లవాఱఁగనే కంసుఁడు తన భృత్యులకు బాలిక మాటల నెల్ల దెలిపి ప్రలంబుఁడు, బకుఁడు, పూతన మొద లగు వారిని భీకరులను బలవంతులను నిన్ను జంపుట కొఱకుఁ బంప వారు భూలోక మెల్ల దిరిగి దయ లేకుండ పిల్ల నెల్ల జంప జాగిరి.

 

 

 

 

తే.గీ.

పురిటి శయ్యపై నిను గాంచి చరణ యుగము

కరము లాడించి రోదింపఁ దరుణు లంతఁ

దెలుప మగ బిడ్డ జననమ్ముఁ దేలె గోకు

లమ్మహో ముదాబ్ధి వచింప రాని భంగి

8.     

 

 

 

 

మందలోఁ బురిటి శయ్యపైఁ గాళ్ళు చేతుల నాడించుచు నేడ్చు చున్న నిన్ను గాంచి తరుణులు మగ బిడ్డ పుట్టె నని తెల్పఁగ గోకుల మంత చెప్పలేని విధముగా నానందాబ్ధి మునిఁగినది.

 

 

 

 

చం.

సరసన నిన్ను గాంచి యట శ్యామలుఁ ద్రాగె యశోద నీ మనో

హరమగు రూప సుందరత నక్షి యుగమ్మునఁ దత్క్షణంబ తాఁ

గరము ముదమ్మునం గుచపుఁ గమ్మని పాలను బిడ్డ కిచ్చెఁ దాఁ

కె రమణి నీదు దేహమును గేల జయించెను బుణ్యలన్ ధరన్

9.     

 

 

 

 

ప్రక్కన నిన్ను గాంచి యశోద శ్యామలవర్ణపు నీ దేహ సుందరతను గన్నులఁ ద్రాగి సంతోషముతో నీకు పాలిచ్చి నీ శరీరము నంత నిమురఁ జాగెను. నిన్ను గని ధరలోనఁ బుణ్యవతుల నెల్ల నామె జయించినది.

 

 

 

 

తే.గీ.

క్షేమము నరసి నీకు నిచ్చెను ధరామ

రులకు నందగోపుఁడు దానములు ముదమున

గోపు లుత్సవముల మున్గి రేపుగ నల

వ్యాధులఁ ద్రిజగన్మంగళ పాపు మయ్య          

10.  

 

 

 

 

దేవా నీ క్షేమమునకై నందుఁడు భూసురులకు సంతోషముగా దానములు చేసెను. గోపు లందఱు నుత్సవముల మున్గిరి. త్రిజగన్మంగళా దేవా నా రోగములు బాపుము. 

 

 

ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయమున ముప్పది తొమ్మిదవ దశకము. 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము

(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము)

దశమ స్కంధ పరిచ్ఛేదము

దశకము 40.

పూతన వధ.

 

 

తే.గీ.

నందుఁడు మహా గుణాస్ప దానందుఁడు సనఁ

గప్ప మీయఁ గంసున కటఁ గాంచి నీదు

తండ్రి కంస సేవక జనోద్యమము నెఱిఁగి

నట్టి వాఁడు గావునఁ జెప్పె నతని తోడ

1.      

 

 

 

 

సద్గుణానందుఁడు నందుఁడు కంసునకు గప్పమొసఁగుటకు మధురకు  వెడల నచట దేవా నీ తండ్రి  వసుదేవునిఁ గలుసు కొనఁగఁ గంసుని సేవకుల యొక్క ప్రయత్నముల నెఱిఁగిన వాఁడు గావున నతఁడు నందుని తో నిట్లు చెప్పెను. 

 

 

 

 

తే.గీ.

ముద మొదవె సఖా నీ సుతు నుదయ మరయ

నా సుతోదయమ్ము పగిది నంద! యంచుఁ

బల్కె గోప్యముగా నుంచి వ్రజ విభునకు

నిజ జనకత నాదరముగ నీరజాక్ష

2.     

 

 

 

 

సఖా నందా నీ పుత్రోదయము నాకుఁ గల్గినంత సంతసము  కలుగు చున్నది. తాను దండ్రి యన్న విషయ మెల్ల వసుదేవుఁడు గోప్యముగ నుంచెను.

 

 

 

 

కం.

ఇచటను గోకులమునఁ బరఁ

గు చున్నవి కరమ్ము నపశకునములు వడి నీ

వు చను మన మంద కధినే

త చనెను భయ మెంచి నీకుఁ దత్తఱపడుచున్

3.     

 

 

 

 

ఇక్కడయు గోకులమున నపశకునములు పెక్కు కాన వచ్చు చున్నవి. కనుక నందా నీవు వడిగా మందకుఁ జనుము. ఇట్లతఁడు చెప్పఁగా నందుఁడు తత్తర పడుచు నీకు భయ మగు నని జనెను.

 

 

 

 

తే.గీ.

అత్తఱి నొకానొక యతివ యలి నిభాల

క సుమనోహరాకృతి వచ్చెఁ గపట బాల

క! రయముగ మంద నున్ననీ కడకు వింత

యింతి యక్కజముగ మందిరాంతరమున

4.     

 

 

 

 

ఓ కపట బాలకా కృష్ణా యంత నొక్క వింత యువతి తుమ్మెదల రంగు కల జుట్టుతో సుందర రూపమున మందలో మందిరము లోపల నున్న నీ కడకుఁ జిత్రముగ వేగముగ వచ్చినది.

 

 

 

 

తే.గీ.

ఎవ్వ రీమె యంచు వ్రజపు టింతు లెల్ల

నపుడు తర్కించు చుండఁగ నసుర వంశ

జాత పూతన యంత తత్క్షణమ నిన్ను

జేరి యెత్తుకొనె విదిత శిశు వినాశ

5.     

 

 

 

 

శిశు వినాశినిగఁ బ్రసిద్ధ మైన యామె రక్కసి పూతన వచ్చి యెవ్వ రీమె యని గోపికలు తర్కించు చుండఁ దత్క్షణము నిన్నెత్తు కొనెను.

 

 

 

 

తే.గీ.

లలిత రూప విలాసాహృత లలనా మ

ణులు వ్రజాంగనలు నచేతను లయి యాప

కుంటి రంత నట్టింట నిన్గూడి స్తన్య

మీయఁ దొడఁగె నేరక నీదు మాయ నసురి

6.     

 

 

 

 

ఆమె రూప లావణ్యములకు గోప కాంతలు నిశ్చేష్టలై యాపక యున్న నట్టింట నిన్ను జేరి నీకు పాలీయఁ దొడఁగెను. నీ మాయ నెఱుంగక యామె యట్లు చేసెను. 

 

 

 

 

చం.

కనలు వహించి బాల వధ కారకపై మది శంక వీడి యా

వనిత యొడిన్ రయమ్మడరఁ బన్నుగ నెక్కి వరామ్ర సత్ఫల

మ్మనఁ గుచమండలమ్మును గరాంగుళిఁ బట్టి విషంపుఁ బాలు నో

టిని బిగియించి పీల్చితివి డెందము పొంగఁగ నీరజేక్షణా

7.     

 

 

 

 

బాల హంతకి పై మిక్కిలి కోప మూని శంకలేక యామె యొడిఁ జేరి మామిడి పండు వంటి యామె కుచమండలమును జేతి వ్రేళ్ళతోఁ బట్టి నోటితో బిగించి విష పూరితమైన పాలను జిత్తము పొంగఁగ నీరజేక్షణా పీల్చితివి.

 

 

 

 

తే.గీ.

అసువులు చనుపాల సహిత మారగింప

నసురి గర్జన తుల్య మహార్తనాద

మున భువిం గూలె నిజ కాయమును ధరించి

చాచి చేతులను భయ మొసఁగుచు నంత

8.     

 

 

 

 

పాలతోఁ బాటు ప్రాణములను గూడ త్రాగితివి. అంత నా రాక్షసి మేఘ గర్జనమును బోలు  నార్త నాదముతో నిజ రూపమును ధరించి చేతులు చాచి భయావహముగా నేలపైఁ గూలెను.

 

 

 

 

తే.గీ.

భయద ఘోషణ భీషణ వర్ష్మ సుశ్ర

వణ సుదర్శన మోహిత వల్ల వాంగ

న లసురి యురమునం దాట నలరు నిన్ను

నక్కున నిడిరి గోపిక లదరి బెదరి

9.     

 

 

 

 

అంత భయమును గొల్పు ఘోషణమును వినుట భీకరమైన దేహమును జూచుట వలన మోహితు లైన వల్లవాంగనలు రక్కసి మేనుపై నాడు నిన్ను బెదరుచు నక్కున జేర్చుకొనిరి. 

 

 

 

 

తే.గీ.

కట్టిరి యువతు లంత రక్ష భవదీయ

మంగళకర నామమ్ముల మానితముగ

నీకు నట్టి వాతాలయ నేత కొమ్ము

నన్ను రక్షించి సేవకుఁ డన్న రీతి

10.  

 

 

 

 

యువతు లంత నీకు మంగళకరమైన నీ నామములతోనే రక్ష కట్టిరి. అట్టి యో గురువాయూరు నాథా నన్ను రక్షించి నీ సేవకుని వలె గ్రహింపుము.

 

 

ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయమున నలువదవ దశకము. 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము

(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము)

దశమ స్కంధ పరిచ్ఛేదము

దశకము 41.

గోపి కానంద హేల.

 

 

తే.గీ.

వ్రజ విభుఁడు వసుదేవుని భాషణముల

నాలకించి వేగము చన నధ్వ మందుఁ

గాంచి భీతుఁడై పతిత వృక్షములు నొక్క

కాయమును శరణము వేడెఁ గరము నిన్ను

1.      

 

 

 

 

మందవిభుఁడు నందుఁడు వసుదేవుని మాటలు విని వేగముగఁ జని దారిలో నేలఁ గూలిన చెట్లను, భీకర కళేబరము నొక దానినిఁ జూచెను. అంత భయముతో నిన్నే శరణు వేడెను.

 

 

 

 

తే.గీ.

ఎఱిఁగి వృత్తాంత మెల్లయు నింతు లనఁగ

గోపు లెల్ల నచ్చెఱు వొంది గొప్ప భీతిఁ

బతిత ఘన పిశాచపుఁ గళేబరముఁ గాల్చి

రంతఁ గోసి ఖండములుగ నతి పరమున

2.     

 

 

 

 

గోపికలు తెలుపఁగఁ బూతన వృత్తాంత మంతయు నెఱిఁగి గోపకులు భయ సంభ్రమములు చెలఁగ నా పిశాచపు దొడ్డ శవమును ముక్కలుగఁ గోసి యతి దూరమునఁ గాల్చిరి.

 

 

 

 

తే.గీ.

ధూమ మెల్లెడల నెగసె లేమ కాయ

మపుడు కాలుచుండంగ స్తన్యమ్ము మీఱి

ద్రాగ నీ వంటగాఁ బవిత్రమ్ము కాఁగఁ

జంద నాగరు గుగ్గులు జ్వలన నిభము

3.     

 

 

 

 

పూతన దేహము కాలుచుండ నెల్లెడఁ బొగ లేచినది. ఆమె పాలు దేవా నీవు ద్రాగ నీవు ముట్టు కొనఁగఁ బవిత్రమై చందన మగరు, గుగ్గిళుల పొగ వలె నయినది.

 

 

 

 

తే.గీ.

పూతనా మాతఁ జేసితి పూర్ణ తర సు

గంధినిని నీదు  దేహ సంగమ మొసంగు

నిట్టి సద్యః ఫలమ్మన నెలమి నుడువ

గోపికలకుఁ దలఁచి యేమొ పాప హార!

4.     

 

 

 

 

దేవా పూతనను సువాసన లీను నట్లు నీవు చేసితివి. నీ మేను దాకిన నిట్లు తత్క్షణ ఫలము నిచ్చు నని గోపికలకు తెల్పుటకో యన నట్లు పాపములను నశింపజేయు నీవు చేసితివి.

 

 

 

 

తే.గీ.

చెప్పె నా శౌరి మున్నటఁ జిత్ర మయ్యెఁ

జంప లేదు పిశాచము చంటిపాప

నంచుఁ జెప్పు కొనుచు నీ ము ఖారవింద

మరయ గోపలోకమ్ము తహతహ పడెను

5.     

 

 

 

 

మునుపు వసుదేవుఁడు చెప్పెను. చిత్రము పిశాచి బాలునిఁ జంప లేదు. ఇట్లు చెప్పు కొనుచు నీ ముఖ పద్మమును జూడ నందఱు నారాట పడిరి.

 

 

 

 

తే.గీ.

నిను బడయఁగ గోకుల మెల్ల దిన దినప్ర

వృద్ధ మయ్యె మంగళముల విచ్చలవిడిఁ

బొందె మంద యానందము లందు వెల్లి

విరిసె వాసుదేవ నివాస గరిమ భృశము

6.     

 

 

 

 

నిన్ను బొందఁగా గోకుల మంతయు దినదిన ప్రవృద్ధ మగు చుండెను. మంగళము లనేకములు కలుగు చున్నవి. మంద యందు నానందము వెల్లివిరియు చున్నది. ఇది యెల్ల వాసుదేవా నీ నివాస మహిమయే.

 

 

 

 

తే.గీ.

వత్తురు ప్రతి నిత్యము తమి వల్లవీ మ

ణులు ముగించి పనులు మది తలఁచు చిండ్ల

నీదు సుకుమార రూప ప్రమోద హాస

ములు గని మురియు చుందురు ముగుద లెల్ల

7.     

 

 

 

 

ఆసతో నిత్యము గోపికలు తమ యిండ్లలో నిన్ను దలఁచుచు పనులు ముగించుకొని వత్తురు.  నీ సుకుమార సుందర రూపమును నవ్వులను జూచి మగువ లందఱు మురియు చుందురు. 

 

 

 

 

తే.గీ.

నన్నరసె నహో పాపఁడు నవ్వెఁ జూడుఁ

డంచుఁ బలుకుచు రమ్ము రమ్మనుచుఁ జాచి

చేతు లెత్తుకొనఁగఁ బ్రీతిఁ జెలఁగు చుండ్రు

రమణు లానందమునఁ జేయ రాని వేవి

8.     

 

 

 

 

 

నన్నె జూచెను. ఆహా పాపఁడు నవ్వెను. అని పల్కుచు రా రమ్మని యెత్తుకొనుటకుఁ జేతులు చాచి ప్రీతితో మురియు చుందురు. ఆ గోపిక లానందముతోఁ జేయని పనులు లేవు.

 

 

 

 

తే.గీ.

నీదు సున్నితంపుఁ దనువు మోద మలరఁ

దాఁకఁ గేలఁ గేలుం గొని తరుణు లంత

నిన్ను దీసికొనఁగ మించి నెమ్మి నుంటి

తూఁగు కెందమ్మి దండలోఁ దుమ్మెద గతి

9.     

 

 

 

 

నీ సున్నిత మైన యొంటిని దాఁకుచు మోదముతో నీ చేతిని తమ చేతులతోఁ దీసికొనుచు లాలింప దేవా నీవు ముదముతో నెఱ్ఱని తామర పూల దండలో దూఁగు తుమ్మెద వలె భాసిల్లితివి.

 

 

 

 

తే.గీ.

పాల నొసఁగుచు నంకము పైన నునిచి

నిన్ను మాత యశోద చిన్ని ముఖ మందు

నవ్వు నరయు చుండు ముదము నివ్వటిల్ల

నట్టి శ్రీహరి రోగము లాపు నావి

10.  

 

 

 

 

యశోదా దేవి నిన్ను దన యొడిలో నుంచుకొని పాల నొసఁగుచు నీ ముఖారవిందపు నవ్వుల  నరయుచు సంతసించు చుండును. అట్టి యో గురువాయూరు నాథా నా రోగముల నాపుము. 

 

 

ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయమున నలువది యొకటవ దశకము. 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము

(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము)

దశమ స్కంధ పరిచ్ఛేదము

దశకము 42.

శకటాసుర వధ.

 

 

తే.గీ.

పుట్టిన దిన మహోత్సవము జరిపింప

నీకుఁ బిలిచి మాత యశోద నెమ్మి బంధు

మిత్ర గోపికా ద్విజులను జిత్ర మునిచి

బండి సరస నిన్నరిగెఁ దా వంట గదికి

1.      

 

 

 

 

ఒకనాఁడు దేవా నీ పుట్టిన దినము పండుగ సేయ బంధువులను, మిత్రులను, గోపికలను ద్విజులను బిలిచి తల్లి యశోద నిన్నొక బండి ప్రక్కన నుంచి వంటగదికి వెడలెను.

 

 

 

 

తే.గీ.

నిన్నరయ నట నుంచిన మిన్న బాలు

రంత భీతి నేడ్వ నఱుపు లత్తఱి విని

పించెఁ గట్టె విఱిగి నట్టి పెన్రవములఁ

గలిసి యతి సమీపమ్మునఁ గాంచ నీకు

2.     

 

 

 

 

అంత నిన్ను జూచుటకు నుంచిన బాలు రేడ్వ నార్త నాదములు నీకు దగ్గరగ నున్న కట్టె విఱిఁగి నట్టి పెద్ద చప్పుళ్ల తోఁ గలసి యపుడు వినిపించెను.

 

 

 

 

తే.గీ.

ఆ ధ్వని విని వ్రజాంగన లడరి సంభ్ర

మ శ్రమ ప్రకంపిత భీత మానస లయి

కాంచిరి నిను ఖండిత ఘన కాష్ఠ ఖండ

ములు నడుమఁ జెల్లచెదర నపూర్వముగను

3.     

 

 

 

 

అంతఁ దొందరయు నలసటలతో వణఁకి భయముతో నడరి గోప కాంతలు వచ్చి విఱిగిన యట్టి కఱ్ఱ ముక్కలు వింతగాఁ జెల్ల చెదర వాని మధ్య నిన్ను జూచిరి. 

 

 

 

 

తే.గీ.

అకట బాలున కేమయ్యె నంచు భాష్ప

పూరి తాక్షులు గోపక భూసురవ్ర

జేశ్వరాదులు పర్విడి యింతి యా య

శోద యొడిఁ గాంచి తేఱిరి సేద మిగుల

4.     

 

 

 

 

అయ్యో బాలున కేమైనది యని కళ్ల నీళ్లు కాఱుచుండఁగ గోపకులు విప్రులు నందాదులు పరుగున వచ్చి యశోద యొడిలో నున్న  నిన్ను జూచి శాంతించిరి.

 

 

 

 

ఉ.

ఎక్కడి బాలుఁ డెక్కడి యహీనపుఁ గొయ్య రథమ్ము వ్రక్క లౌ

టెక్కడి చోద్య మయ్య కత మెయ్యది యేరికి నమ్మ శక్యమే

యక్కజ మయ్యె నిచ్చ టను చందఱు పల్కుచు నొక్క రొక్కరన్

ముక్కున వ్రేలు నుంచిరి ప్రభూత సువిస్మయ సంశ యాత్ములై

5.     

 

 

 

 

బాలుఁ డెక్కడ? గొప్పదైన యీ రథ మెక్కడ? బ్రద్ద లౌట యెక్కడి వింత? కారణ మేమిటి?  నమ్మ గలమా? ఆశ్చర్య మయ్యె నిచ్చట యని యొక ళ్లొకళ్లతోఁ బల్కుచు శంక పుట్టఁగ ముక్కున వ్రేలు వేసికొనిరి.

 

 

 

 

తే.గీ.

పాల కొఱ కేడ్చుచును దన్న బాలకుండు

బండి దొర్లుచు విసవిస బడఁగఁ గంటి

నేను నేనచుఁ బల్కిరి నిక్క మంచు

బాలుఁ గాచెడి బాలురు మేలు గాను

6.     

 

 

 

 

పాలకై యేడ్చుచుఁ గన్నఁడు తన్నఁగా బండి విస విస దొర్లుచు విఱిఁగి పడుట నేను జూచితి నేను జూచితి నంచు బాలునిఁ గాచు బాలురు నిక్క మని పల్కిరి.

 

 

 

 

తే.గీ.

బాలకుల మాటలను నమ్మఁ జాల రైరి

కొంద రెఱుఁగక యించుక డెంద మందు

నీ మహిమ గాంచఁ బూతన నిధన మపుడు

సంభవ మని తల్చిరి మానసమునఁ బరులు

7.     

 

 

 

 

చిత్తమున నీ మహిమ నెఱుఁగక యించు కైనఁ గొంద ఱా బాలకుల మాటలు నమ్మ కుండిరి. మఱి కొంద ఱప్పటి పూతన వధఁ దలఁచి  సంభవమే యని తమ మనస్సులలోఁ దల్చిరి.  

 

 

 

 

తే.గీ.

విద్రు మారుణ పదములు వేఁగె నేమొ

కంజ సన్నిభ కరములు కందె నేమొ

యంచుఁ గరుణ యుప్పొంగ వ్రజాంగనా మ

ణులు స్పృశించిరి నీదు మేను నిమురుచును

8.     

 

 

 

 

పగడము వంటి నీ యెఱ్ఱని పాదములు తపించిన వేమో తామరల వంటి నీ చేతులు కందిన వేమో యని జాలి యుప్పొంగ గొల్లపడచులు దేవా నీ మేను నిమురుచు నిన్ను స్పృశించిరి.

 

 

 

 

ఆ.వె.

అల జగద్విభుని దయా తరంగమ్మునఁ

దనయుఁడు కుశలమ్మ యనుచు నిమ్ము

కొడుకు నంచు హత్తుకొనియె గ్రహించి రో

మాంచితుఁ డయి నందుఁ డంచితముగ

9.     

 

 

 

 

ఆహా జగన్నాథుని దయతోఁ గొడుకు కుశలముగ నుండెనని నందుఁడు తలంచి కుమారు నిమ్మని తీసికొని యొడలు పులకరింప నాత్రముగ గుండెలకు హత్తుకొనెను.

 

 

 

 

ఉ.

చంపఁగ నెంచి దాఁగిన నిశాచరుఁ జంపితి వేమొ యిట్లు భా

వింప నగుం బరాగ మిట నింతయుఁ గానఁగ రాదు శుద్ధ స

త్త్వంపు మెయిన్విలీన మయి భద్రత భాసిలి యుండె నేమొ తా

నింపుగ దోష నాశమున నివ్విధిఁ దల్చెను నందుఁ డత్తఱిన్

10.  

 

 

 

 

నిన్ను జంపుటకు వచ్చిన రక్కసునిఁ జంపితి వనంగఁ దల్చ నగును. ఆతని ధూళి యింతయుఁ గానరాదు. తన దోషములు క్షీణింప నీలో విలీన మయ్యెనేమో యా రాక్షసుఁ డని నందుఁ డప్పుడు తలంచెను.

 

 

 

 

తే.గీ.

పూజి తావని దేవ సమూహ దత్త

మంగ ళాశీర్వచన సుసన్మాని తార్భ

క యరుదుగ మంద నలరింతు వయ కిశోర

చేష్టల మరుత్పుర ధవ నా చిక్కు లాపు

11.   

 

 

 

 

నందుని చేఁ బూజింపఁ బడి విప్రులు నీకు మంగళాశీస్సు లిచ్చి మన్నింపఁగ నర్భకా కృష్ణా బాల్య చేష్టలతో మందను మిక్కిలి యలరించితివి. అట్టి యో గురువాయూరు నాథా నా చిక్కుల నాపుము.

 

 

ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయమున నలువది రెండవ దశకము. 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము

(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము)

దశమ స్కంధ పరిచ్ఛేదము

దశకము 43.

తృణావర్త సంహారము.

 

 

చం.

రుచిరము నొక్కెడన్ గురు మరుత్పుర నాథ సలీల నైతి వీ

వు చెలువ మాత కెంచఁగను భూరి భరమ్ముగ విస్మయమ్ముగా

నచిరము శయ్యపై నునిచె నబ్బుర మంది యిదేమి యంచు నెం

చుచు మది నిత్య కృత్యములఁ జూడ వరానన యేఁగె శంకతో

1.      

 

 

 

 

గురువాయూరు నాథా యొకనాఁడు లీలఁగా నీవు నీదు మాతకుఁ ద్రుటిలో మోయరాని బరువుగా నైతివి. ఆశ్చర్య పడుచు యశోద యిది యేమి వింత యని తలంచుచు నిన్ను శయ్యపై నుంచెను. శంకతోనే తన పనులు సూచుకొనుట కేఁగెను.

 

 

 

 

చం.

వర్తిల ఘోర ఘోషము సపాంశు క ణావృత పూర్ణ దిఙ్మ హా

వర్తము నీకు దూరమునఁ బాఱుచు వచ్చెను దైత్యుఁ డా తృణా

వర్తుఁడు భీకరమ్ముగను బాలక నిన్ను గ్రహించి యేఁగె నా

ధూర్తుఁడు మేఘ మార్గమునఁ దూర్ణము మానవ చిత్త చోరకా

2.     

 

 

 

 

 

పెద్ద ధ్వనితో ధూళి కణములతో దిక్కులన్ని నిండిన సుడిగాలి నీకు దూరము నుండి పర్విడుచుఁ దృణావర్తుఁ డను రక్కసుఁడు భయంకరముగా జనుల మానసములను దోఁచు నట్టి నిన్నెత్తుకొని యాకాశ మార్గమునఁ ద్వరితముగ నేఁగెను.

 

 

 

 

తే.గీ.

ధూళి యెగయఁ జీఁక టలమఁ దోరము దిశ

లెల్లఁ గాన లే కుండిరి యేమియుఁ బశు

పాలకులు యశోదా దేవి పరుగు లెత్తి

యలమటించెఁ గానక పుత్రు హా సుత యని

3.     

 

 

 

 

దుమ్ము పైకెగయఁ జీఁకటి యలము కొనఁగ దిశ లన్నిటను  గోపాలకులు దేనిని జూడ లేకుండిరి.  యశోద పరుగున వచ్చి బాలుని నిన్ను  గాంచక హా కుమారా యని కడు దుఃఖించెను. 

 

 

 

 

ఉ.

దానవ వీరుఁ డైన భవ దద్భుత కాయ భరమ్ము నంతటం

దాను భరింప లేక యిఁకఁ దగ్గ జవమ్ము చలించి నిల్వఁగా

మానిని రోద నమ్మపుడు మంద వినంబడె ముమ్మరమ్ముగా

దీనపు టార్త నాదము సతీమణి తల్లి యశోద సేయఁగా

4.     

 

 

 

 

దానవుఁ డైనను దేవా నీ మేని యద్భుతపు బరువును మోయ లేక సత్తువ యుడిగి కంపించి నిల్చెను. తల్లి యశోదా దేవి యార్తనాదము మందలో ముమ్మరముగా వినఁబడెను.

 

 

 

 

తే.గీ.

నందుఁడు విని గోపకులు నాక్రందనమ్ముఁ

దెలిసి విషయ మేడ్చిరి యింట దీనముగను

నిన్నఖిల ముక్తి దాయకుఁ గ్రన్నన నసు

రుఁడు విడిచియు నీ విడమినిఁ బడెను బుడమి  

5.     

 

 

 

 

నందుఁడు గోపకులు నా యాక్రందనము విని విషయ మెల్లయు నెఱిఁగి దీనముగా నింట నేడ్చిరి. ఎల్లరకు ముక్తి నిచ్చు నట్టి  నిన్ను వడి యసురుఁడు విడిచినను నీ వతనిని వదలక యుండుటచే నేలపైఁ గూలెను. 

 

 

 

 

తే.గీ.

గోకులమ్మున కతి దూర ఘోర శిలను

బడఁగ నప్డు దుఃఖార్త గోపక సనంద

ముఖ్యులు గనిరి యొక దేహము శిశు వుండ

వక్షమున నవ్వుచును వింత నక్షతమ్ము

6.     

 

 

 

 

గోకులమునకు దూరముగాఁ పెద్ద ఱాతిపై నొక్క పెద్ద దేహము పడియుండఁగ దానిపై నవ్వుచు నెట్టి దెబ్బలు లేక వింతగా నీ వుండ  నందునితోఁ గూడిన గోపకులకుఁ గనిపించెను.

 

 

 

 

ఉ.

అదరఁగ ఱాతిఁ బడ్డ నసు రాధమ భగ్న సుభీమ కాయ మం

దుదరము పైన నవ్వుచు నహో తమి నాడుచుఁ జేతఁ గొట్టుచుం

గదలెడు నిన్ను గొండ పయిఁ గన్పడు నీలపు రత్న తాదృశుం

బదపడి యెత్తి యక్కున శుభమ్ముగఁ జేర్చిరి నంద గోపకుల్

7.     

 

 

 

 

చలించి ఱాతి మీద పడిన రక్కసుని విఱిఁగిన పెద్ద దేహము  దాని పొట్టపై నవ్వుచు నాడుచుఁ దన జేతులతోఁ గొట్టుచుఁ గదలుచున్న నిన్ను గొండమీద నీల రత్నము వలెఁ గన్పడు చుండఁ జూచి చక్కఁగ నెత్తు కొని యక్కునఁ జేర్చు కొనిరి నందాదులు.  

 

 

 

 

తే.గీ.

ముద్దు లాడి రొక్కొక్కరు ముద్దు లొలుకు

నిన్ను నందాదులు గ్రహించి నెలత లా వ్ర

జాంగనలు చాఁపఁ జేతుల నందుకొనఁగ  

వర కరాబ్జము లిడు నీకు వందనములు

8.     

 

 

 

 

ఒక్కొక్కరు నందుఁడు మొద లగు గొల్ల వారు ముద్దు లొలుకు నిన్ను ముద్దు పెట్టు కొనిరి. గొల్ల పడుచులు నిన్ను దీసికొనఁ జేతులు చాఁప నీ పూవుల వంటి చేతు లందించు కృష్ణా వందనములు.   

 

 

 

 

ఆ.వె.

మేము చేయఁ దగిన దేమి యింక న తార్త

హారి గాచు మాదు నాత్మజు నని

వేడి రంత నిన్న విరివి గావఁగ నిన్ను

నవని మాతయు జనకాదులు దమి

9.     

 

 

 

 

మేము చేయఁ గల్గిన దేదియు లేదు. ఇంక నమస్కరించు వారి యార్తులను హరించు వాఁడే మా బిడ్డ నిద్ధరఁ గాచుఁ గాక యని తల్లి, తండ్రి యందఱుఁ బ్రీతితో  నిన్నే వేడిరి. 

 

 

 

 

తే.గీ.

వాత రూప దనుజుఁ జంపి వాత సంభ

వాత్మ రుజలేల మఱి బాప వయ్య యేమి

చేయ నోపుదు మఱిమఱి సేరి కొలుతు

రోగ నిశ్శేషమునకు మరుత్పు రేశ

10.  

 

 

 

 

గాలి రూపు రక్కసునిఁ జంపి గాలి వలన  గలుగు మా యంటు రోగములను బాప వేమి. ఏమి చేయుదును. మరల మరల నిన్నే గురువాయూరు నాథా చేరి నా రోగ నాశనమునకై  కొల్తును. 

 

 

 

 

ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయమున నలువది మూడవ దశకము. 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము

(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము)

దశమ స్కంధ పరిచ్ఛేదము

దశకము 44.

నామ కరణ వర్ణనము.

 

 

ఉ.

కర్మపు బంధనమ్ము లనఁ గాంచని దేవర నీకు జాతపుం

గర్మ చయ మ్మొనర్ప ముని గర్గుఁడు జ్యోతిష శాస్త్ర వేత్తయే

మర్మముగాఁ జరింపు మను మాట లనన్ వసుదేవుఁ డార్తితో

ధర్మమ యంచు నవ్విధము త్వద్గృహ మత్తఱి వచ్చె మాధవా

1.      

 

 

 

 

దేవా కర్మపాశములే లేని నీకు జాతక కర్మము జరిపించుటకు, వసుదేవుఁడు బాధతో జ్యోతిష్కుని  గర్గ మునితో రహస్యముగ నొనర్ప మని పలుకఁగ నతఁ డట్లు చేయుటయే సముచిత మని నీ గృహమునకు వచ్చెను. 

 

 

 

 

తే.గీ.

నందుఁ డానంద మొంది ఘన ముని రాక

కాత్మ మిక్కుటముగ జాత కాది పరమ

కర్మముల నుత్సుకుండు నగ వలరంగ

ముఖమున మునిఁ జేయు మనియెఁ బూజ సేసి

2.     

 

 

 

 

ఆ మహా ముని రాకకు నందుఁడు మిక్కిలి సంతసించి పూజించి యుద్యమించి నగుమోముతో మునిని జాతక కర్మములను జేయింపుఁ డని వేఁడెను.

 

 

 

 

ఆ.వె.

యదువు వంశపు గురు వైన కారణమున

నంద యిచట గోప్య మందుఁ గార్య

ము నొనరింప వలయు నని పులకించి య

న్నకును నీకు నిచ్చె నామములను

3.     

 

 

 

 

యదు వంశపు టాచార్యుఁడు గర్గుఁడు నందునితో నిది రహస్యముగఁ జేయవలె నని పలికి యంతఁ బులకించి నీకు నన్నకుఁ బేళ్ల నొసఁగెను.

 

 

 

 

కం.

నామ సహ స్రాక్షయ! స

న్నామ విరాజితున కెట్టి నామం బీయన్

భూమిం దగు నని గర్గుఁడు

నామంబు రహస్యము శ్రవణమ్మునఁ బల్కెన్

4.     

 

 

 

 

అక్షయా సహస్రనామములు  గల నీకు నెట్టి నామము నీయ ధరఁ జెల్లు నని తలంచి గర్గుఁడు నీ చెవిలో రహస్యముగ నీ పేరును బలికెను.

 

 

 

 

తే.గీ.

క్రియ కృషికి ణ కారమ్ము కలియఁగ నునికి

ముదము లను నర్థము లనుచు ముని వరుండు

కృష్ణ నామ మొసఁగె నీకుఁ గీడు లఘము

లెల్ల లోకములకుఁ బాప నుల్ల మలర

5.     

 

 

 

 

కృషి ధాతువునకు ణ కారము సేర్చిన నస్తిత్వము నానందము లను నర్థము లగును గనుక ముని దేవా నీకు కృష్ణుఁ డని పేరు పెట్టెను. లోకముల కీళ్లు పాపములను బాపుదు వని ప్రీతితో నా  పేరు ముని ముదమున నొసఁగెను. 

 

 

 

 

ఆ.వె.

ఇంకఁ బెక్కు పేళ్ల నిచ్చి యగ్రజునకు

రామ ముఖ సముచిత నామము లిడి

మానుషాతి భావ మాన్యు లనుచుఁ దెల్పి

విష్ణు వీవ యనఁడు పితర తోడ

6.     

 

 

 

 

ఇంకను గర్గుఁడు నీకుఁ బెక్కు పేళ్ల నొసఁగి యన్నకు రాముఁడు మొదలగు నామము లిచ్చి మీ యిరువురు మాన వాతీత మహిమలు గల వారని తెల్పి నీవే విష్ణు వన్న మాట మాత్రము తండ్రి నందునకుఁ జెప్పఁడు.

 

 

 

 

తే.గీ.

మోహ శోకము లందఁడు స్నేహ ముంచ

నీదు తనయుపై ద్వేషింప నీ కుమారు

నెవ్వఁ డైన నశించు వాఁ డిట్టి నీ మ

హత్వ మెల్ల వ్రాకృచ్చె నా యమి వరుండు

7.     

 

 

 

 

నందా నీ పుత్రుని స్నేహము వొంద మోహ శోకములు వడయఁడు.  నీ కుమారుని ద్వేషించిన వాఁడు నశించును. గర్గుఁ డా విధముగా నీ మహిమ లెల్ల నుడివెను. 

 

 

 

 

తే.గీ.

పెక్కు దైత్యులను జయించుఁ బేర్మి నిచ్చు

నమల పదము బంధు తతికి నాలకింతు

వీవు నంద యతని కీర్తి యివ్విధమ్ము

దెల్పె గర్గుఁడు నీ విభూతి జనకునకు

8.     

 

 

 

 

నీ పుత్రుఁడు దైత్యుల ననేకులను జంపును. బంధువులకు విమలంపుఁ బదముఁ బ్రసాదించును. ఈతని కీర్తిని నీవు విందువు. ఇట్లు గర్గుఁడు నీ విభూతి నెల్ల నీ జనకునకుఁ దెల్పెను.

 

 

 

 

తే.గీ.

ఇతని చేఁ దరిం త్రాపద లెల్ల మీరు

ప్రేమ నిల్చి మీ రెల్లరు వెలయ వలయు

నిన్ను వర్ణించి చెప్పె మునిప్రవరుఁడు

హరివె నీ వని నుడువక యబ్జ నయన 

9.     

 

 

 

 

ఇతని చేత మీ రెల్లరు కష్టముల నుండి విముక్తు లగుదురు. ఈతని పై మీ రందఱు ప్రేమ తోడుత మెలఁగ వలయును. ఇట్లు నిన్ను వర్ణించి నీవే విష్ణు వని మాత్రము చెప్ప లేదు.

 

 

 

 

 

అంత నేఁగ గర్గుండు నందాదులు ముద

మొంది నిన్నెంతొ పొగిడిరి మంద హర్ష

మయము నయ్యె మిక్కుటముగ మారు తాల

య విభు నాదు రోగ వ్రాత మాప వయ్య

10.  

 

 

 

 

 

అట్లు చెప్పి గర్గుఁడు వెడలెను. నందాదులు మిక్కిలి సంతసమున నిన్ను బొగిడిరి. మంద యెల్ల మిక్కుటముగ హర్ష మయ మయ్యెను. ఓ గురువాయూరు నాథా నా రోగములను బాపుము.

 

 

 

 

ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయమున నలువది నాలుగవ దశకము. 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము

(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము)

దశమ స్కంధ పరిచ్ఛేదము

దశకము 45.

శ్రీ కృష్ణ బాల్య క్రీడలు.

 

 

తే.గీ.

కదలి మోకాళ్లతోఁ గర కంజములను

మంజు మంజీర సుశ్రావ్య శింజ లాల

కించి నీవు నన్నయుఁ బులకించి వేగ

మడర గృహ గృహమ్ములు మంద నరుగు చుంద్రు

1.      

 

 

 

 

మోకాళ్లతోఁ జేతులతోఁ గదలుచు శ్రావ్యము లైన యందె మ్రోతల నాలకించుచు నీవు నన్న యగు బలరాముఁడును మంద లోని యిండ్ల లోనికి నిత్యము వెడలు చుందురు. 

 

 

 

 

తే.గీ.

మందహాస మం దగపడ నందమైన

దంతములు ముంగురు లదర నంత నుదుటఁ

బాద పద్మ తలములు కన్పడఁ గర గళి

త కటకములు జనులఁ జేసెఁ దన్మయమ్ము

2.     

 

 

 

 

నవ్వు చున్నప్పుడు దంతములు మెఱయ, నుదుటిపై ముంగురు లల్లాడఁ, బద్మముల వంటి మీ పాదములు కనిపించు చుండఁ, నడచు నపుడు చేతుల వఱకు జాఱిన కడియములతో మిమ్ములఁ  జూచు జనులను దన్మయము సేయు చుంటిరి.

 

 

 

 

చం.

పరుగిడు చుండ మీరు వడి బాటల నవ్వుచు వింత ఘోషలం

దిరుగుచు వెన్క కొక్క పరి తీరని కౌతుక మొప్ప గోపకుల్

మురియుచు వెంట నంటుచును ముచ్చట లాడుచు సంతసమ్మునం

బరవశ మంది మిక్కుటము పన్నుగ నుండిరి గోకులమ్మునన్

3.     

 

 

 

 

వేగముగా మీరు మంద లోని దారు లందు నవ్వుచు వెనుకకుఁ దిరుగుచు  బరుగిడిన మీ వెనుక కుతూహలముతో గోపకులు మురియుచు వచ్చుచు సంతోషముగా ముచ్చట లాడుచు మిక్కిలి పరవశులై  గోకులమున నుండిరి.

 

 

 

 

ఉ.

పాఱుచు ధాత్రిపైఁ బడుచు వాజమ లేచుచు ధూళి యొంటిపై

మీఱఁగ మందహాసమున మెచ్చిరి నిర్మల మౌనిపుంగవుల్

మా ఱిల లేని మిమ్ములను మాన్యులు కొల్చిరి మాత లిద్దఱుం

బాఱి గ్రహించి యెత్తుకొని పల్మఱు తల్చిరి ముద్దు లిచ్చుచున్

4.     

 

 

 

 

మీరిద్దఱు పరుగు వెట్టుచు నేలపైఁ బడుచు వేగమ లేచుచు దుమ్ము మీ యొంటిపై నిండుచున్న మునీంద్రులు మాన్యులు సూచి నవ్వుకొనుచు మిమ్ము మెచ్చి కొలిచిరి. అడ్డు లేని మిమ్ము మాతలు యశోదా రోహిణు లిద్దఱు పర్వున గ్రహించి యెత్తుకొని ముద్దు లొసఁగుచుఁ బెక్కు మాఱులు తల్చుచుండిరి.

 

 

 

 

తే.గీ.

పాలు పొంగార నొడి నిడి పరమ సాధ్వి

పా లొసఁగ యశోదయె ధన్యురాలు సుమ్ము

కపట గోపబాలక నవ్వఁగఁ గనిపింప

దంత ముకుళములు జనని సంతసించె

5.     

 

 

 

 

తనకుఁ బాలు పొంగ నొడిలో నుంచుకొని నీకుఁ బాలిచ్చిన యశోదా దేవి ధన్యురాలు. కపట గోప బాలకా నీవు నవ్వు చుండ మొగ్గల వంటి నీ దంతములను జూచి తల్లి మిక్కిలి సంతసించెను.

 

 

 

 

చం.

మొదలిడఁ గాళ్లపై నడక ముద్దుగఁ దిర్గుచు నిండ్ల నిండ్లలో

ముదముగ నాడుచుం గరము మూరఁగ నింపగు బాల్య చేష్టలే

యుదవసితంపు మూషిక రి పూచ్చయ వత్స శుక వ్రజమ్ము తోఁ

గదలుచుఁ బాఱ నవ్వి నిను గాఱియ నాపుదు రయ్య గోపకుల్

6.     

 

 

 

 

కాళ్లపై నడక రాఁగ ముద్దు ముద్దుగ నింటింటఁ దిరుగుచు ముదముగ నాడుచు చిన్నదనంపుఁ జేష్టలతో నిండ్ల లోని పిల్లులు, దూడలు, చిలుకల వెంటఁ బరుగిడుచుండ నవ్వుచు నిన్ను మిగుల కష్టమున గోపకు లాపు చుంటిరి.

 

 

 

 

తే.గీ.

ఎక్క డెక్కడ పురిఁ జరియింతు వన్నఁ

గూడి యక్క డక్కడకును గోపికలు వి

వశ లయి పనులు త్యజియించి వత్స భృత్య

బృందము మఱచి వత్తురు మంద లోన

7.     

 

 

 

 

మంద యందు నన్నతోఁ గూడి దేవా నీ వెక్క డెక్కడి  కేఁగుదువో యక్క డక్కడకు గోపిక లెల్లరు వివశ లయి పనులు మానుకొని తమ పిల్లలను సేవకులను మఱచి వచ్చు చుందురు.

 

 

 

 

తే.గీ.

గోపిక లొసంగ నవనీత మేపుగఁ దమిఁ

గ్రోలి కమనీయముగఁ పాడి గోముగ నట

నమ్ము సల్ప నీయ ఘృతము నెమ్మి నార

గింప దత్త దుగ్ధము త్రాగు దింపుగాను

8.     

 

 

 

 

కృష్ణా గోపికలు నీకు వెన్న నీయఁ బ్రీతిఁ గ్రోలి కమనీయముగాఁ బాడుచు గోముగా నాడుచు నుండ వా రిచ్చిన నెయ్యి పాలను సంతోషముగఁ ద్రాగుదువు.

 

 

 

 

తే.గీ.

అపుడు బలిని యాచించితి నక్కట మఱి

యబలల నడుగ నను నిశ్చయమ్ము నూని

మాని యాచనను హరింతువా నితంబి

నీ ఘృత దధుల నుతచోర నీరజాక్ష

9.     

 

 

 

 

అప్పుడు బలి చక్రవర్తిని నేను యాచించితిని. కనుక యిప్పుడు రమణుల నడుగ నని పంతము నూని వారిని వెన్న నేతుల నడుగుట మానితివి. అయితే వెన్నదొంగగా ఖ్యాతి నొందిన దేవా వారి నేయి పెరుగులను దొంగిలింప నారంభించితివి.  

 

 

 

 

తే.గీ.

ఘోష యోషా గణములకు కోప శోక

ములు మది నొసఁగ నేరదు ముదము నొసఁగు

నీదు దధి ఘృత చౌర్యము నెమ్మనముల

హరణము మరుత్పు రాధిప యాపు రుజలు

10.  

 

 

 

 

మంద పడచులకుఁ గోప తాపముల నీయవు నీ వెన్న నేతుల దొంగదనము. వారి మనస్సుల హరణము సంతోషమునే యిచ్చును.  గురువాయూరు నాథా నా రోగముల నాపుము.   

 

 

 

 

తే.గీ.

కాంచి శాఖాగ్రమున శశిఁ గాంతిమంతు

ఫలమని తలంచి కోరఁగఁ జలమున జన

నీ జనకుల వారి నుడుల నీదు చేయి

చాఁపఁ బడెఁ జేత నుజ్జ్వల చంద్రుఁ డౌర

11.   

 

 

 

 

కొమ్మల పైన వెలుంగు చున్న చంద్రునిఁ జూచి పండుగా నెంచి యిమ్మని పట్టుదలతోఁ గోరఁగ దల్లిదండ్రులు నిన్ను  జేయి చాప మనంగఁ జాపఁగ నీవు వింతగఁ జంద్రుఁడు నీ చేతిలోఁ బడెను.  

 

 

 

 

తే.గీ.

ఏమి యిదని సంభ్రమమునఁ దాము మునుఁగఁ

దల్లిదండ్రుల కొసఁగి ముదమ్ము సుతుని

గా విమోహులఁ జేసితి కావు మయ్య

నను జగన్మ యానంద చిన్మయ మురారి

12.   

 

 

 

 

ఇది యేమి వింత యని సంభ్రమములో నీ తల్లిదండ్రు లుండఁ దిరిగి వారిని నిన్ను దమ పుత్రుఁడే యని తలంచెడు మోహమున ముంచితివి. జగన్మయా చిదానందా మురారి నన్ను గావుము.

 

 

 

 

ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయమున నలువది యైదవ దశకము. 

 

 

 

 

 

శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము

(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము)

దశమ స్కంధ పరిచ్ఛేదము

దశకము 46.

విశ్వరూప దర్శన వర్ణనము.

 

 

తే.గీ.

అక్కజముగ నొక్క దినము వెక్కసముగఁ

బసితనమున నీ వావలింపఁగఁ బరుండి

పాలు ద్రావి నీ విరిసిన వదన మందు

విశ్వమును జూచె నా వల్లవీ మతల్లి

1.      

 

 

 

 

దేవా చంటి బిడ్డవు వింతగ నొక్క దినము మిక్కుటముగఁ బాలను ద్రాగి పరుండి నీ వావలింపఁగాఁ దెఱవఁ బడిన నీ నోటిలో నీదు మాత వల్లవీమణి విశ్వము నంతటినిఁ జూచెను.

 

 

 

 

తే.గీ.

తిరిగి యట లీల నాడుచు మురిపె మడరఁ

దోటి బాలుర తోడ నా తోట లందు

ఫల విభాగ వంచన రోష మలరఁ జెప్పి

రంత నయ్యర్భకులు తింటి వంచు మన్ను

2.     

 

 

 

 

తిరిగి ముదమున నాటలు లీలఁగ నాడుచుఁ దోటి బాలుర తోడఁ దోట లందుఁ బండ్లు పంచుకొనుట యందుఁ దప్పు కలదంచుఁ గోప మూని యా యర్భకులు నీవు మన్ను తింటి వని తల్లికిఁ జెప్పిరి.

 

 

 

 

ఉ.

ఔర లయావధిన్ ధర జలాది సమస్త పదార్థ భక్షకున్

నేరక మన్ను తిన్న నగు నీకు రుజాది సుఘోర తాపముల్

దారుణ రీతి నంచు మదిఁ దల్చి యశోద కరమ్ము భీతితోఁ

జేరి రయమ్మునన్ జనని చెంతను నిన్గని కోపగించెనే

3.     

 

 

 

 

తల్లి యక్కట ప్రళయ కాలమున భూమి నీరు మున్నగు సమస్త వస్తువులను భక్షింతు వని తా నెఱుఁగక మన్ను తిన్న నీకు రోగములు కల్గునని తలంచి మిక్కిలి భీతితో రయముగ నిన్ను జేరి కోపగించెను.

 

 

 

 

తే.గీ.

వినయము నటింతు వేల మన్నును దినంగ

నీకు వత్స యని జనని నింద సేయ

నప్పలుకు లబద్ద మనుచు నంబఁ గాంచి

చెలఁగి నవ్వుచు నొట్టు వేసితి కదయ్య

4.     

 

 

 

 

 

వినయము నటింపకు కుమారా నీకు మన్ను దిన నవసర మేమి యని తల్లి నిందింప నమ్మతో నవ్వుచు నా పల్కు లసత్యము లని యొట్టు వేసితివి.  

 

 

 

 

తే.గీ.

విమతులే వీ రనిరి నిశ్చయముగఁ జూపు

మయ్య నీ నో రని జనని యదరవైవ  

బెదరి భవదీయ వదనార విందము విభు

చూపితి తెఱచి మాతకుఁ జోద్యముగను

5.     

 

 

 

 

ఈ చెప్పిన వారు బుద్ధి లేని వారే నీ నోరు సూపు మని తల్లి యడుగ బెదరి చోద్యముగ నీ నోటినిఁ  దెఱచి చూపితివి.

 

 

 

 

తే.గీ.

మన్ను నించు కైనను గాంచ మాత యెంచ

నామెఁ దృప్తిపఱుప నెంచి యన సమస్త

భూవలయము తోడ నఖిల భువనచయముఁ

జూపి తాస్య కుహరమునఁ జోద్యముగను

6.     

 

 

 

 

మన్ను కొంచె మైనను జూతు నని తల్లి యెంచ నామెకుఁ దృప్తి నిచ్చుటకునో యన దేవా నీవు నీ నోటి గుహలో భూమితో నఖిల జగములను జోద్యముగఁ జూపితివి. 

 

 

 

 

తే.గీ.

వన మొకట నంబుధి యొక యెడ నభ మొక్క

చోటఁ బాతాళ మొక్కట సురలు నొకట

మానవు లొకట వేఱొంట దానవులును

గానిపింప లే దొక్కటి కాన రాక

7.     

 

 

 

 

వన మొక చోట సముద్రము లింకొక యెడ నుండ నాకాశము, పాతాళము, సురలు,మానవులు, దానవులు వేఱు వేఱు చోట్ల గనిపించిరి. అక్కడ కనిపింపనిది యొక్కటియు లేదు.

 

 

 

 

తే.గీ.

వదన మందుఁ జూపట్టితి వర వికుంఠ

వాసిగను గలశాంబుధిఁ బండుకొన్న

బాలునిగ నిజ పురమందు వఱలు నిజ కు

మారునిగ వివిధ గతుల నారి కంత

8.     

 

 

 

 

నీ ముఖములోఁ దల్లికి వైకుంఠ వాసిగఁ, గలశమున వఱలు సముద్ర మందు శయనించిన యట్టి బాలునిగ, నీదు గృహమున నున్న బిడ్డఁడుగ వివిధ విధములఁ గనిపించితివి. 

 

 

 

 

తే.గీ.

నోటఁ గన్పట్టె జగములు బోటి కందు

వాయి తెఱచి నిలిచి నట్టి బాలకుండ

వీవు సుస్పష్ట ముగఁ గానిపించి తయ్య

యిట్లు విశ్వమెల్లను జూపి తెలమి యపుడు

9.     

 

 

 

 

నీ నోటిలో జగము లన్నియు వానిలో నోరు తెఱచి నిల్చిన నీవు కూడ స్పష్టముగఁ గనిపించితివి. ఇట్లు సమస్త విశ్వమును నోటి లోనే చూపితివి.

 

 

 

 

తే.గీ.

జనని కొక్క క్షణము కల్గె జ్ఞాన మంత

ముంప నాకొంటి నంటివి మోహ మందు

నాయమను విచిత్రమ్ముగ నద్భు తార్భ

క నను గాపాడ రమ్మనిల నగ రేశ

10.  

 

 

 

 

తల్లికి నొక్క క్షణము జ్ఞానము కల్గినది. అంత దిరిగి యామెను మోహమున ముంచుటకు నమ్మా యాకలి యగు చున్న దని వింతగ నంటివి. అట్టి యద్భుతపు టర్భకా గురువాయూరు నాథా నన్ను గాపాడుము.

 

 

 

 

ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయమున నలువది యాఱవ దశకము. 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము

(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము)

దశమ స్కంధ పరిచ్ఛేదము

దశకము 47.

ఉలూఖల బంధన వర్ణనము.

 

 

ఆ.వె.

పెరుఁగు చిల్కు చుండ వెసఁ దల్లి దరి చేరి

యడ్డు తగిలి పాల నారగించు

తపన మీఱ నంక తల మెక్కి యొకనాఁడు

సన్నుగుడిచి తీవు చారునయన

1.      

 

 

 

 

ఒకనాఁడు తల్లి పెరుఁగు చిలుకుచుండఁగ నామెను జేరి యడ్డు వచ్చి పాలు త్రాగుటకు నాత్రుతతో నొడి నెక్కి యందమైన కన్నులు గల కృష్ణా పాలు త్రాగుచుంటివి.

 

 

 

 

తే.గీ.

సగము ద్రాగఁ బాలు నగుచుఁ జారువదన

పాలు పొంగెడు శబ్దము నాలకించి

దింప వేగ తత్తరమున దేవి యేఁగె

లోనికి విడిచి నిన్నంబురుహ నిభాస్య

2.     

 

 

 

 

నవ్వుతో వెల్గు నందమైన ముఖము వాఁడ పాలు సగము త్రాగఁ దల్లి పాలు పొంగు సవ్వడిని విని దింపుటకు నాత్రముగా నిన్ను విడిచి లోనికి నేఁగెను.

 

 

 

 

కం.

జని తార్ధ పాన ఘన గ

ర్జన భార సమావృ తాత్మ సంరంభమునం

గొని కవ్వపు టా దండ

మ్మును వడిఁ గొట్టితి దధి ఘటమును ముక్కలుగా

3.     

 

 

 

 

సగము త్రాగుట వలన కలిగిన కోప భారము నిండిన మనస్సుతో రయమునఁ గవ్వపుఁ గఱ్ఱను దీసికొని పెరుఁగు కుండను ముక్కలుగా బ్రద్దలు కొట్టితివి.  

 

 

 

 

తే.గీ.

బల్లను ధ్వని నాకర్ణించి పరుగు పరుగు

న నరుదెంచి వీక్షించె జనని పుడమినిఁ

బాఱిన పెరుఁగు నఖిల విశ్వమున వ్యాప్త

మయిన నీదు కీర్తి పగిది నచ్చెరువున

4.     

 

 

 

 

బల్లు మను చప్పుడు విని తల్లి పరుగు పరుగున వచ్చి విశ్వమందు నలువైపుల వ్యాపించు నీ కీర్తి వోలె నేలపైఁ బాఱుచున్న పెరుఁగును జూచినది.

 

 

 

 

తే.గీ.

కానక శ్రుతిచ యాలభ్యమాన పురుష

పుంగవుని నిన్ను గిన్కను బూని తిరిగి

వెతక సుకృతాంగనకు నంత వెన్న నిడుచుఁ

బిల్లి కట ఱోటి సరసనఁ దెల్లమైతి

5.     

 

 

 

 

వేద సంచయమునకును లభ్యము కాని వానిగ నిన్ను గుర్తింపక  కోపముతో వెదక నామెకుఁ బిల్లికి వెన్న నిడుచున్న నీవు ఱోటి దగ్గర కనిపించితివి.

 

 

 

 

తే.గీ.

కాంచి నిన్నట్లు భీత ముఖ సరసిజ వి

లాసితు రుషారుణ వదన రోసి రజ్జు

వచటఁ గైకొనెఁ గట్ట నిన్నంగనా స

ఖు లెదుట యశోద మిక్కిలి కోప మూని

6.     

 

 

 

 

భీతి గన్పడు పద్మము వంటి ముఖముతో విలసిల్లు నిన్నుజూచి యశోద గోపముతో నెఱు పెక్కిన వదనముతో నొక త్రాటిని నిన్ను గట్టుటకు వెదకి  గోపికలు చూచుచుండఁ దీసికొనెను.

 

 

 

 

తే.గీ.

సజ్జనులు కోరుదు రెవరి నిజ్జగమున

నట్టి నిన్ను బంధింపఁగా నంబ యెంచి

కలుపఁ ద్రాళ్లు పెక్కింటి నక్కజమ తక్కు

వయ్యె రెండంగుళమ్ములె యరయ నెపుడు

7.     

 

 

 

 

సజ్జను లిజ్జగమున నెవ్వరినిఁ గోరుదురో యట్టి నిన్ను కట్టుటకు నెన్ని త్రాళ్లు తల్లి తెచ్చి కలిపినను వింత రెండంగుళములు తక్కు వగుచు నుండెను.  

 

 

 

 

తే.గీ.

మందహాసలై వింతగ మగువ లరయ

నలసి చెమటఁ దడిసిన యయ్యంబఁ గాంచి

నిత్య ముక్తుఁడవు ముకుంద యత్యయ మణఁ

గంగఁ దల్చితి కట్టువడంగ నీవ

8.     

 

 

 

 

 

గోపాంగనలు నవ్వుచు నా వింతఁ జూచుచుండ నిన్ను కట్ట నలసి చెమటతోఁ దడిసి యున్న తల్లినిఁ  గాంచి యామె దుఃఖము నార్ప జాలిగొని నిత్య ముక్తుఁడ వయ్యుఁ గట్టఁబడ నెంచితివి.

 

 

 

 

తే.గీ.

ఱోటి నుండుము చిర మంచు బోటి యేఁగె

గృహము లోనికిఁ బూర్వ నిక్షిప్త సర్పిఁ

బ్రీతిఁ గ్రోలుచు నాడుచుఁ బెంపు మీఱ

నిల్చి తీవు ముదమ్మున నీరజాక్ష

9.     

 

 

 

 

చిరము ఱోటితో నుండు మనుచుఁ గాంత యింటి లోనికి నేఁగెను. అంతకు మున్న దాచి యుంచిన నేతినిఁ బ్రీతిఁ గ్రోలుచు నాడుచు ముదమ్ముగ నతిశయముతో నీరజాక్షా యుంటివి.

 

 

 

 

తే.గీ.

బంధ రహితుల కిల సులభముగఁ దోఁచు

వాఁడ వేల కట్టుబడితి వీడ యమ్మ

కంచుఁ బొగడిరి దేవత లంచితముగ

నట్టి యనిలాల యాధిప! యాపు రుజలు

10.  

 

 

 

 

బంధములు లేని వారికి సులభుఁడ వగు నీవు తల్లి కేలఁ గట్టువడితి విక్కడ యని పలుకుచు సురలు నిన్ను నంచితముగఁ బొగిడిరి. అట్టి యో గురువాయూరు నాథా నా రోగముల నాపుము. 

 

 

ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయమున నలువది యేడవ దశకము. 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము

(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము)

దశమ స్కంధ పరిచ్ఛేదము

దశకము 48.

యమళార్జున భంజన వర్ణనము.

 

 

తే.గీ.

అమరులు మృదూదరా నిను నంబుజోద

ర మఱి దామోదరా యని రహిని నండ్రు

కాంచితి వులూఖల విహార! కన్న! యనతి

దూరమున మద్ది దోయి సంతోషముగను

1.      

 

 

 

 

మృదువైన యుదర మున్న నిన్ను దేవతలు దామోదరా యని ముదముగఁ గీర్తింతురు. ఱోటితో  నున్న కన్నా   యచట దగ్గరలో రెండు మద్ది చెట్లను సంతోష ముప్పొంగఁ జూచితివి.

 

 

 

 

తే.గీ.

గురు కుబేర సుతులు నలకూబరుఁడును

మఱి మణిగ్రీవు లను వారు మార రిపుని  

శివునిఁ బూజించి పడసిన సిరుల మదము

తోడ విముఖులై నీ కుండ్రు వేడుకలను

2.     

 

 

 

 

కుబేరుని కొడుకులు నలకూబరుఁడు, మణిగ్రీవుఁ డను వారలు శివుని బూజించి వరములు వొంద గర్వముతో నిన్ను గణింపక వేడుకలలో మునిఁగి యుండిరి.

 

 

 

 

తే.గీ.

నారదుండు భవత్పద నత శిరుండు

గాంచె నొక్కనాఁ డమరాప గావగాధ

కేళి మద్య మత్తత సాంగనాళి వస్త్ర

హీనులై యుండ వారల నిరువుర నట

3.     

 

 

 

 

నీ పాదముల శిరము వంచువాఁడు నారదుఁ డొకనాఁడు గంగానదిలో లలనా మణులఁ గూడి మద్య మత్తులై వస్త్రహీనులై  స్నాన మాడుచుండ వా రిరువురను గాంచెను. 

 

 

 

 

తే.గీ.

భయపడి యతివ లూనిరి వస్త్రములు మ

దాంధ చేతస్కు లరసియుఁ దాపసి నిలు

వ ముని శపియించె నీపయి భక్తియ యిడు

శాంతి మీ కనుచు సుఖ మశాంతిఁ గలదె

4.     

 

 

 

 

అంత నతివలు భయముతో వస్త్రములు ధరించిరి. మదాంధులు కుబేర సుతులు తాపసి నారదుఁ జూచియు మిన్న కున్న నలిగి ముని వారిని శపించెను. నీ పైన భక్తి వారికి శాంతి నిచ్చు ననియుఁ బల్కెను.  అశాంతి యున్న సుఖ మెక్కడిది?

 

 

 

 

తే.గీ.

చిరము కకుభాత్ము లయి నిల్చి హరిఁ దలంచు

చుండఁ గల్గు నిజాకృతి పొండన ముని

మద్దు లయ్యిరి యిద్దఱు మంద లోన

నీదు సందర్శ నాకాంక్ష నీరజాక్ష

5.     

 

 

 

 

చిరకాలము మద్ది చెట్లై యుండి శ్రీహరిని దలంచుచుండ మీకు నిజరూపము కలుగఁ గలదు పొం డనిన వారు మద్దులై దేవా నీ కై వేచుచుండిరి.

 

 

 

 

తే.గీ.

అర్జున ద్వయ మచ్చట నలరఁ గలసి

ఱోటి నీడ్చుచు మెల్లన మేటి బాల

ప్రాకఁగా నడ్డు రాఁగ నా పాదపములు

బహుళ జీర్ణము లవి కూలి పడెను బుడమి

6.     

 

 

 

 

 

ఆ మద్ది జంట యక్కడ యుండ ఱో లీడ్చుకొనుచు మేటి బాలుఁడా నీవు ప్రాకుచు నేఁగఁగ నడ్డము వచ్చిన చెట్లు ముక్కలై నేలపైఁ గూలినవి.

 

 

 

 

ఆ.వె.

చెట్ల జోడుఁ గూల్ప శీఘ్రమ నీ వంత

గొప్ప వెలుఁగు తోడ గూడి యక్ష

యుగ్మ మొదవి చూచుచుండ గోవింద ని

న్నలరి పొగడె భక్తి యతిశయింప

7.     

 

 

 

 

 

అంత శీఘ్రము నీవు వానినిఁ గూల్ప గొప్ప వెల్గుతో యక్షులిద్దఱు చూచుచుండఁ బ్రత్యక్షమై గోవింద నిన్ను భక్తి మీఱఁ బొగడిరి. 

 

 

 

 

తే.గీ.

అన్య సుర భక్తులు వరుస నౌదు రయ్య

నీకు భక్తులు దేవమునివర దయను

రుద్ర సేవకు లరసిరి భద్రముగఁ బ

దములు నీవి కోరిరి నిరంతరపు భక్తి  

8.     

 

 

 

 

ఇతర దేవతల భక్తులు వరుసగ నీకు భక్తు లౌదురు. నారదుని దయతో శివభక్తు లైన వారిరువురు నీ పాదముల నరసిరి. నీ పై నిరంతర భక్తినిఁ గోరిరి.

 

 

 

 

తే.గీ.

తరులు విఱుఁగంగ ఘోరంపు ధ్వని చెలంగ

నదరి గొల్ల వా రేతెంచ నయ్యశోద

సిగ్గిల నరసి నందుఁడు శీఘ్రమ విడి

పించెఁ దమి నిన్ను మోక్షదు నంచితముగ

9.     

 

 

 

 

ఆ విఱిఁగిన చెట్ల చప్పుడు విని యదరి గొల్లవారు వడి రాఁగ యశోద తన పనికి సిగ్గిలు చుండఁ గని నందుఁడు మోక్షముల నిచ్చు నిన్ను శీఘ్రముగా విడిపించెను.

 

 

 

 

తే.గీ.

మ్రానుల నడుమ నుండియు దీన రక్ష

కుండు హరి కావ బాలుఁడు కుంద కుండె

నంచు నేఁగి రింటికి గోపు లంత దేవ!

వాయుపురనాథ! వ్యాధులు వాపు మయ్య

10.  

 

 

 

 

పడిన చెట్ల నడుమ నుండియు బాలుఁడు దీన రక్షకుం డైన శ్రీ హరి కాపాడ భద్రముగ నుండె నని పల్కుఛు వారు దేవా యింటి కేఁగిరి. అట్టి గురువాయూరు నాథా నా వ్యాధులను బాపుము.

 

 

 

 

ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయమున నలువది యెనిమిదవ దశకము. 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము

(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము)

దశమ స్కంధ పరిచ్ఛేదము

దశకము 49.

బృందావన గమన వర్ణనము.

 

 

ఉ.

తెలియక నీ ప్రభావ మల తేరు తునుంగుట యబ్బురంబుగన్

బలితపు మద్ది వృక్షములు పాతము లౌటయు నాపదల్ గనం

గలవర మంది గోపకులు గ్రక్కున మందను వీడి పోవఁగాఁ

దలఁచిరి యాత్మ లందుఁ బెఱ తావున కత్తరి నిశ్చయమ్ముగన్

1.      

 

 

 

 

దేవా నీ ప్రభావ మని తెలియక యాశ్చర్యముగ బండి విఱుఁగుటయు, బలమైన మద్ది చెట్లు రెండుఁ  గూలుటయు, వరుసగ నాపదలను గాంచఁ గలవర పడి గోపకులు గ్రక్కున మందను వీడి వేఱొక చోటునకుఁ బోవ మనస్సు లందు నిశ్చయముగఁ దల్చిరి.

 

 

 

 

తే.గీ.

పలికె నీదు ప్రేరణ నిట్లు వ్రజ జినుం డ

ట నుపనంద నాముండు నడరి మనకుఁ బ

డమర బృందావన మన నడవి యొకటి మ

నోజ్ఞ మైనది కల దేఁగ నాజ్ఞ యైన

2.     

 

 

 

 

నీ ప్రేరణము తోడ నుపనందుఁ డను వృద్ధ గోపకుఁడు లేచి మనకుఁ బడమటి దిక్కున బృందావన మను మనోజ్ఞమైన యడవి యొకటి కలదు. ఆజ్ఞ యైన నచ్చట కేఁగుద మని పల్కెను.

 

 

 

 

తే.గీ.

నంద గోపాదులు బృహద్వనమ్ము గోకు

లమ్ము విడనాడి బృందావనమ్ము నాల

మంద గూడి చేర ననుగమనము చేసి

రంబ తో నుండ బండి నిన్నపుడు దనరి

3.     

 

 

 

 

అంత నందుఁడు మొదలగు గోపులు గోకులమును వీడి యాల మందలతో బృందావనమునకుఁ జేరఁ దల్లితో బండిలో నున్న ని న్ననుగమించిరి. 

 

 

 

 

కం.

గోవుల గిట్టల చప్పుడు

నీ వాగాలాప మధుర నినదమ్ముల నిం

దీవర నేత్రా లీల వ్ర

జావలి ముదమారఁ జనియె నధ్వము నెల్లన్

4.     

 

 

 

 

ఆవుల గిట్టల చప్పుళ్లు, తామరసనేత్రా  నీ తియ్యని పల్కుల రవముల నానందించుచు గొల్ల వారు దారి గడచుచు నేఁగిరి.

 

 

 

 

తే.గీ.

వికసిత కుసుమ కుందాది వృక్ష సంచ

య విలసిత శాద్వ లావృత హరిత మణి మ

య ప్రభా కుట్టిమ తరుల నలరు సుంద

ర తర బృందావన మరసి రహిఁ జెలఁగితి

5.     

 

 

 

 

విరిసిన పువ్వులతో మొల్ల మొదలగు లతలు తరులతో పచ్చికలు పచ్చమణుల యరుగులఁ బోలి శోభతో విలసిల్లుచున్న  బృందావనమును జూచి ముద మొందితివి.

 

 

 

 

తే.గీ.

సుందర వినిర్మి తాలయ బృంద మలర

నర్ధ చంద్రాకృతిని గోపు లంద సుఖము

గోప బాల పాళీ మధ్య గూర్మి మీఱఁ

గాంచి వనశోభలను సంతసించి యుందు  

6.     

 

 

 

 

అందముగా నర్ధ చంద్రాకృతి నిర్మింపబడిన యిండ్ల వరుసతో గోపకు లందఱు సుఖముగా నుండిరి. బాలగోపకుల నడుమునఁ బ్రేమతోఁ జరించుచు వనశోభలను దిలకించి సంతసించి యుందువు.  

 

 

 

 

తే.గీ.

తిరుగ నింపుగ నిటు నటుఁ దేట నీటి

నంచ పలుకులు నీ మాట లనఁగఁ దనరఁ

గంజములు వోలఁగఁ జిరు నగవుల ముఖ క

మలము నట్టి యమునఁ గాంచి యలరు దీవు

7.     

 

 

 

 

నీ నడక వలె వంకర టింకరగాఁ దేట నీటితో నడచుచు,  హంస భాషణములు నీ పల్కు లనఁగఁ, గమలములు నీ నవ్వుతోఁ గూడిన ముఖ మనఁగ యమునా నది యలరుచుండ నీవు చూచితివి. 

 

 

 

 

తే.గీ.

వందల నెమళ్ల కూతలు విం దొసంగఁ

జిత్ర వర్ణ కాంతు లలరు శ్రేష్ఠ మణుల

నింగి నంటు కొనల తోడ శృంగి రాజ

మచట గోవర్ధన గిరిని నరసి తీవు

8.     

 

 

 

 

వందల కొలఁది నెమళ్లు కూతలతో విందు చేయఁ జిత్ర వర్ణములతో మణుల వంటి కొండ శిఖ లాకస మంటుకొనఁగ వెలుఁగు గోవర్ధన పర్వతమును జూచితివి.

 

 

 

 

తే.గీ.

సములు గోప కుమారులు సతము తోడు

రాఁగ నెక్క డెక్కడ కేఁగ వేగ నక్క

డక్కడ కుటిల గామిని యనురతిఁ జరి

యింపఁగఁ గళింద కన్యక నెలమిఁ గంటి

9.     

 

 

 

 

నీ సమ వయస్కులు గోప బాలురు నీకుఁ దోడు రాఁగ నీ వెక్క డెక్కడికిఁ బోయిన నక్క డక్కడికి వంకర నడకల యమునా నదీ కన్య ప్రేమతో ననుగమింపఁ జూచితివి.

 

 

 

 

తే.గీ.

పశువుల కనువై తోఁచు నవ్వనము నందు

వత్స గణము ననుసరించి యుత్సహించి

తిరుగు దన్న కుమారులు పరఁగ వెంట

నట్టి వాయు పురాధిప యాపు రుజలు

10.  

 

 

 

 

పశువుల కనుకూల మగు నవ్వనమున దూడల ననుసరించుచు  నుత్సహించి యన్న బాలలు వెంట నుండఁ దిరుగు ఛుంటివి. అట్టి గురువాయూరు నాథా రోగముల నాపుము.

 

 

 

 

ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయమున నలువది తొమ్మిదవ దశకము. 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము

(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము)

దశమ స్కంధ పరిచ్ఛేదము

దశకము 50.

వత్సాసుర బకాసుర వధ వర్ణనము.

 

 

ఉ.

పూవుల తేనెఁ గ్రోలు నళి పుంజ విలాస మనోహరమ్ము బృం

దావన మందు గోప శిశు తండము వెంటఁ జరించు చుండ వ

త్సావన లోల చిత్తమున నగ్రజుఁ గూడి ధరించి బాహు లం

దావర వేత్ర వేణు గవ లాదులు తిర్గుదు దేహ కాంతులన్

1.      

 

 

 

 

పువ్వుల లోని మకరందము గ్రోలు తుమ్మెదల గుంపుతో నలరారు బృందావనమున గోప బాలురు వెన్నంట దూడలను గాచుట యందు లగ్నమైన చిత్తముతో నన్నతోఁ గూడి జేతు లందు బెత్తము, వేణువు, బూర లుండఁగా మేని కాంతులు మెఱయఁ దిరుగు చుంటివి.

 

 

 

 

మ.

కృపతో నిచ్చు భవత్పదాబ్జములు లక్ష్మీ హస్త సేవా నిమి

త్త పవిత్రమ్ములు రక్ష యెల్లరకుఁ బాదస్పర్శ మాహాత్మ్యతన్

విపరీతమ్ముగ వెల్గె నంచితముగా బృందావనక్షేత్ర పా

దప వల్లీ వసుధా జలమ్ములు సమృద్ధశ్రీ ప్రపూర్ణంబులై

2.     

 

 

 

 

దేవా లక్ష్మీదేవి స్వహస్త సేవలతోఁ బవిత్రము లైన కారణమున నీ పదాబ్జము లెల్లరకు రక్షణము లొసంగును. నీ పాద స్పర్శ మాత్రమున బృందావనములోఁ దరువులు, లతలు నేల, జలములు మున్నగునవి యన్నియు సమృద్ధము లైనవి.

 

 

 

 

చం.

తృణముల గుల్మ వల్లరులఁ దిర్గుచుఁ గానన దేశ మందు గో

గణములఁ గాచుచుం దనరి కంజహితాత్మజ తీర మందు గో

గణ పరివర్ధ నాద్రిఁ దమకమ్మున వేణువు నూదుచుం బ్రతా

రణ గుణ వత్సరూప ధరు రక్కసుఁ గాంచితి వొక్క నాఁడటన్

3.     

 

 

 

 

పచ్చగడ్డి,లతలు, పొదల యందు దిరిగుచు వనమున నావు దూడలను గాచుచు యమునా నది యొడ్డున గోవర్ధన గిరి నెక్కి తమకముతో వేణువు నూదుచు కపటమున దూడ రూపున నున్న రాక్షసుని నొకనాఁడు గాంచితివి. 

 

 

 

 

చం.

రయముగ నెత్తి తోఁకను బలమ్ముగఁ ద్రిప్పుచుఁ జూచు చుండ నిం

పయిన తఱిన్నినుం గదిసి యంతము సేయఁ జరింపఁ గాంచి నీ

వ యదను జూచి దూడ నట నంఘ్రుల నంతఁ జెలంగి పట్టి తా

భయపడఁ ద్రిప్పి వేమఱు నభమ్మునఁ జెట్టునఁ గొట్టి చంపితే

4.     

 

 

 

 

ఆ రక్కసుఁడు తోఁక నెత్తి బలముగాఁ ద్రిప్పుచు సరియైన సమయమున నిన్ను బట్టి చంపఁ దిరుగు చున్న వానిఁ జూచి పాదముల నదను జిక్కఁ బట్టి వాఁడు భయపడు చుండఁగా గాలిలోఁ బలుమార్లు  గిరగిరఁ ద్రిప్పి చెట్టునకుఁ గొట్టి చంపితివి.

 

 

 

 

తే.గీ.

పడఁ బుడమిపై నసుర దురాత్ముఁడు బలుండు

వృక్షములు కూలె వనమున వేగమునకు

దివినిఁ గూడిన దివిజు లయ్యవసరమ్ము

నఁ గురిసిరి నీ శిరమ్మున ననలు మురిసి

5.     

 

 

 

 

ఆ దురాత్ముఁడు దైత్యుఁడు బల్లిదుఁడు నేల పైఁ గూల నా వేగమునకుఁ జెట్లు కూలినవి. దివి నుండి దివిజులు నీ శిరము పయి  మురిసి పుష్ప వర్షము కురిసిరి. 

 

 

 

 

ఆ.వె.

సురభు లీ సుమములు చోద్య మెట్లు పడెఁ బై

నుండి నీ పయి యని యుద్ది కాం డ్ర

డుగఁగఁ గూల దనుజుఁడు విరు లెగిరి పడెఁ

జెట్ల నుండి యంటి విట్లు నగుచు

6.     

 

 

 

 

సువాసన లీను నీ పుష్పము  లెచట నుండి వచ్చి నీ పైఁ బడిన వని నీ మిత్రు లడుగ నవ్వుచు రక్కసుఁడు నేలఁ గూలఁ జెట్ల నుండి రాలిన వని పల్కితివి.

 

 

 

 

తే.గీ.

తిరిగి వేసవి మఱి యొక్క దినము నందు

యమున నీటినిఁ ద్రావ మీ రంద ఱరుగ

ఱెక్క లాడించు పెనుకొంగ ఱెక్క లున్న

కొండ యనఁ గని రట వెండి కొండఁ బోల

7.     

 

 

 

 

మఱియు నొక్క వేసవి దినమున యమున నీటినిఁ ద్రాగ మీరెల్లరు నేఁగ నపుడు ఱెక్క లాడించుచు ఱెక్క లున్న కొండ వలెను వెండి కొండ వలె నున్న పెద్ద కొంగను జూచిరి. 

 

 

 

 

శా.

గోపవ్రాతము త్రాగు చుండ జల మక్కొంగంత మ్రింగెన్ నినున్

వే పర్వెత్తి శిఖిప్రకాశ! యుమిసెన్ బిట్టేఁచ నాస్యంబునం

గోపం బూనుచుఁ దిర్గి చంచువున బెన్గోళ్లన్ విదారింపఁగా 

నా పక్షిన్ నసఁ జీల్చి చంపితివి యాహా దుష్ట సంహారకా! 

8.     

 

 

 

 

గోప బాలు రెల్లరు నీరు ద్రాగుచుండ నంత నా కొంగ పరువెత్తి యొక్క త్రుటి నిన్ను మింగెను. అగ్నితేజు నిన్ను భరింప లేక యది ముక్కు నందు మిక్కిలి బాధింప నుమిసెను. అంత నాఁగక కోపముతోఁ దిరిగి గోళ్లతో ముక్కుతోఁ జీల్పఁ జాగెను. అంత నీవు దాని ముక్కు పట్టి  చీల్చి దుష్ట సంహారా చంపితివి.

 

 

 

 

చం.

అచిరము గాంచ సోదరిని నబ్బక రాజము పూతనన్ నిశా

విచర నిజానుజుం డఘుని వేవ యమాలయ మేఁగ ముందుగన్

సచివులఁ గూడి యేగితివి సద్మము వీడి మనోజ్ఞ దావ మీ

వు చదలు నుండి మోదమునఁ బువ్వులు చల్లఁగ నీపయిన్ సురల్

9.     

 

 

 

 

తత్క్షణ మా కొంగ తన సోదరి రక్కసి పూతనను జూచుటకును, సోదరుఁ డఘుని రాక కెదురు చూచుట కన ముందుగానే యమాలయమున కేఁగెను. నీవు నీ యనుచరులతో మనోజ్ఞ మైన యడవి వీడి యింటికి నేఁగితివి. సురలు నీ పై దివి నుండి  పూల వాన కురిపించిరి.

 

 

 

 

తే.గీ.

ఆలకించి వేణు రవమ్ము నవ్వధూ జ

నమ్ము నిన్జేరె గాంచిరి నందుఁడు జన

నీ మణియును ముదమ్మున నో మరుత్పు

రాధిపా నా రుజలు వాపు మయ్య వేగ

10.  

 

 

 

 

వేణువు నూదుచు వచ్చు చున్న నిన్ను గోపికలు సూచి చేరిరి. ముదమున జనకుఁడు నందుఁడు తల్లి యశోదయు నిన్ను గాంచిరి. అట్టి యో గురువాయూరు నాథా నా రోగములను వేగముగాఁ బాపుము.

 

 

 

 

ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయమున నేఁబదవ దశకము. 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము

(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము)

దశమ స్కంధ పరిచ్ఛేదము

దశకము 51.

అఘాసుర వధ వర్ణనము.

 

 

తే.గీ.

ఒక్క నాఁ డుదయమ్మునఁ దక్కిన వ్రజ

బాలకుల తోడ కానన పంక్తి భోజ

నార్థ మన్న తేమనముల నలరి కొంచు                   

నేఁగి తీశ క్రేపు గములు మూఁగ ముందు

1.      

 

 

 

 

ఉదయమున నొక దినము బాలకులతో వన మందుఁ బంక్తి భోజనములు సేయ నన్నము మజ్జిగ పులుసులు దనరి తీసికొనుచు దూడల గుంపు ముందు నడువ దేవా యేఁగితివి.

 

 

 

 

తే.గీ.

చన వనమ్మున కీవు నీ చరణ పద్మ

యుగ సముత్థిత లోకత్ర యోరు పావ

న కర రజ మూని తవ దర్శన రత మునులు

తనువునఁ బులకించిరి సేరి తన్మయమున

2.     

 

 

 

 

అట్లు నీవు వనమున కేఁగ నీ పాద పద్మముల వలన చెలరేఁగిన, ముల్లోకములను బావనము సేయు ధూళిని తమ మేనుల నూని ముని వరులు నిన్ను చూచు తన్మయత్వముతో నీ దరికి వచ్చి పులకించిరి.

 

 

 

 

తే.గీ.

సంచరింప నవ్వన రాజ సాంద్ర శాద్వ

లమ్ము లందు గో శిశుగణ వ్రజ కుమార

యుత మఘాసురుం డట నిన్ను హత మొనర్ప

నెంచి భయద సర్పాకృతిఁ బొంచి యుండె

3.     

 

 

 

 

వనము నందలి దట్ట మగు పచ్చ గడ్డి ప్రదేశములలో సఖులు దూడలతో గలసి నీవు సంచరించు చుండ  నఘాసురుఁ డను వాఁడు సర్ప రూపమున నిన్ను వధింపఁ బొంచి యుండెను.

 

 

 

 

తే.గీ.

అచల గుహ వోలెఁ గన్పట్ట నహి ముఖమ్ము

దెఱచి యుండంగ మెండుగఁ దివిరి యాట

లాడ నెంచి తూఱిరి నోట నకట గోప

బాలు రలఁతి దూరమ్మునఁ బరఁగ నీవు

4.     

 

 

 

 

నోరు తెఱచి యున్న యా పాము ముఖము కొండ గుహ వోలె నున్నది. ఆట లాడ మెండుగా లీనమై బాలకులు దాని నోటిలోఁ దూఱిరి. అప్పుడు నీవు వారికిఁ గొంచెము దూరములో నుంటివి.

 

 

 

 

ఆ.వె.

నేరక చని సఖులు ఘోరోర గోదర

మావు దూడ లెల్ల నలమటింప

నెఱిఁగి తూఱి తీవు వెఱవక రక్షింప

దిక్కు లేని వారి నక్కజముగ

5.     

 

 

 

 

తెలియక పాము కడుపు లోనికి సఖులు దూడలును దూఱి బాధ సెందుచుండఁ జూచి నీవు కూడ  భయము వీడి దిక్కు లేని వారిని రక్షింప నోటిలోఁ దూఱితివి.

 

 

 

 

ఆ.వె.

పెంచ మేను నోట మించి యూపిరి యాడ

క ధర దొర్లఁ బాము గళము చీల్చి

వత్స బాలకులను వడి విడిపించితి

వనజ పత్ర నేత్ర వన విహార

6.     

 

 

 

 

నీరజాక్షా వన విహారా యంత నీ మేను పెంచఁగా నోటిలో నుండి పామునకు నూపిరి యాడక యది నేలపై దొర్లు చుండ దాని గొంతు చీల్చి దూడలను బాలురను వేగముగా విడిపించితివి.

 

 

 

 

తే.గీ.

అసు గతాసురు దేహ దివ్యప్రభా చ

యమ్మహో నభో వీథి సువ్యాప్త మౌచు

లీన మయ్యె వెలువడ నీలోన నీవు

నాట్య మాడిరి యమరు లానందమునను

7.     

 

 

 

 

ప్రాణములు వోయిన దైత్యు దేహము నుండి  దివ్యకాంతు లెగసి యాకసమున వ్యాపించి యీలోపల నీవు వెలువడ  నీ లోన లీన మైనవి. అప్పు డమరు లానందముతో నాట్య మాడిరి.

 

 

 

 

తే.గీ.

కమల సంభ వాది సురలు గాంచి యబ్బు

రపడ విహరింప వనిఁ బిల్లల గమిఁ గూడి

కాఁగ మధ్యాహ్న మాఁకలి కరము తోఁప  

భోజ నోత్సవ మలరారె రాజితముగ

8.     

 

 

 

 

బ్రహ్మాది దేవతలు వీక్షించి యాశ్చర్య మందిరి. అంతలో వనములో విహరించుచుండఁగ మధ్యాహ్న సమయ మైనది. ఆఁకలి యలరు చుండఁ బంక్తి భోజనపుఁ బండుగ యారంభ మయ్యెను.

 

 

 

 

చం.

మురళినిఁ గొమ్ముబూర మొల ముద్దుగ దోఁపి విచిత్ర రీతి నా

దరముగ గోప బాలు రుచితమ్ముగఁ గూర్చొని యుండఁ జుట్టునుం  

గరమున నూరుఁగాయ మఱి కమ్మని చిక్కని తైరు టన్న ముం

చి రుచిర హాస్య వాక్కులు వచించుచు నుండ సురల్ నుతించిరే

9.     

 

 

 

 

అంత నీవు మురళినిఁ గొమ్ము బూరను ముచ్చటగ మొలలో దోపి విచిత్రముగా నాదరముతో నీ  చుట్టును గోప బాలురు కూర్చుండఁ జేతులలో నూరుఁగాయ పెరుగన్నపు ముద్ద నుంచి నీవు హాస్య వచనములు పల్కుచుండ సురలు సూచి నిన్ను నుతించిరి.

 

 

 

 

తే.గీ.

ముదము గోపాల శిశు మధ్య బోజనమ్ము

యాగ భాగము కన్న నీ కని సురాళి

నిన్ను గీర్తింపఁగా నట్టి నీరజాక్ష

వాయుపురనాథ పాపుమ వ్యాధు లెలమి

10.  

 

 

 

 

 

దేవా నీకు గోప బాలురతోఁ జేయు భోజనమే యాగ భాగము కన్నను బ్రీతి యని దేవతలు నిన్ను పొగిడిరి. అట్టి గురువాయూరు నాథా నా వ్యాధులను బాపుము.

 

 

 

 

ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయమున నేఁబది యొకటవ దశకము. 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము

(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము)

దశమ స్కంధ పరిచ్ఛేదము

దశకము 52.

వత్సాపహరణ వర్ణనము.

 

 

తే.గీ.

మోక్ష మీయ విభూ! ము న్ననీక్షితమ్ము

నయ్యఘాసురున కట యన్యావతార

ముల నలువ గాంచి నీ మహిమల నకట గ

ణింప దాఁచె దూడల మాయ నింపుగాను

1.      

 

 

 

 

ఇతర యవతారాముల మున్ను చూడ నట్టి వింత యఘాసురునకు మోక్ష మిచ్చుటను వీక్షించి బ్రహ్మ నీదు మహిమ పరీక్షింప నెంచి దేవా మాయచే దూడలను దాఁచెను.  

 

 

 

 

తే.గీ.

కలవరపడ వత్సమ్ములఁ గానక చెలి

కాండ్రు తెత్తు నని యెఱిఁగి కంజు మనము

నేఁగ కర కబళమ్మున నీవు దాఁచె

గోప బాలురఁ బరమేష్ఠి గూఢముగను

2.     

 

 

 

 

దూడలు కనిపింపక పోవుటచే సఖులు కలఁత సెంద నీవు తెత్తు నని బ్రహ్మ దేవుని మన మెఱిఁగి చేతిలో నన్నపు ముద్దతో నేఁగఁగాఁ బరమేష్ఠి బాలురను గూడ దాఁచెను.

 

 

 

 

తే.గీ.

కొమ్ములు మురళు లింక చిక్కమ్ములు చుళు

కమ్ములు సఖ వత్స గణ రూపమ్ము లన్ని

నీవయై తిరిగి యడవి నెమ్మి సంధ్య

వేళ నరిగితి మందకు విరియ మాయ

3.     

 

 

 

 

కొమ్ముబూరలు, మురళులు, చిక్కములు, ముంతలు, బాలురు, దూడలు మొదలగున వన్నియు నీవ యై యడవిలోఁ దిరిగి సాయంకాలమునకు నీ మాయ యలర యింటికిఁ జేరితివి.

 

 

 

 

ఉ.

చిక్కము లింక బూర లనఁ జెన్నుగ నన్నియు నీవ కాఁగ నే

యొక్కరి వీడకుండ సమయోచిత రీతిని గోప వత్సముల్

చక్కఁగఁ గాఁగఁ గాంచి తమ సంతతిఁ గృష్ణ మయమ్ము స్త్రీ వశల్

మిక్కిలి సంతసించిన వమేయ సు రాగ రసానుభూతినిన్

4.     

 

 

 

 

ఎవ్వరిని వీడ కుండ వారి వారికి దగిన విధమునఁ జిక్కములు, బూరలు గోప బాలురు దూడలు నన్నియు నీవు కాఁగఁ దమ తమ సంతతినిఁ గృష్ణ మయమ్ముఁ జూచి గోప స్త్రీలు నావులు కూడ నమేయ మైన యనురాగముతో మిక్కిలి సంతోషమును బొందినవి.

 

 

 

 

తే.గీ.

పుట్ట జీవి తనయుఁ డంచుఁ బుట్టుఁ బ్రేమ

నీవ కాఁగ స్వయమ్ముగ నెమ్మి బిడ్డ

యంతు కలదె ప్రేమకు నెంచ నంతరంగ

మందు వనితా మణుల కింక నావులకును

5.     

 

 

 

 

పుట్టఁగానే బిడ్డ యని ప్రేమ పుట్టును. నీవే స్వయముగా బిడ్డవు కాఁగ నింక దరుణులకు మఱి యావులకుఁ గూడ చిత్త మందుఁ బ్రేమకు నం తన నుండునా?

 

 

 

 

తే.గీ.

అట్లు దనర క్షణక్షణ మంత హర్ష

భరిత మగుచు సకల గోప పర్వమునకు

నన్న నిన్నెఱిఁగెను వత్స రాంత మందు

నంత భేదము బ్రహ్మాత్ము లైన మీకు

6.     

 

 

 

 

ఆ విధముగా నానందమయముగా మందలో గోపాలుర కందఱకుఁ గడచు చుండ నొక్క యేఁటి చివర యన్న నీ లీలను గుర్తించెను.  మీ రిద్దఱు బ్రహ్మాత్ము లైనను మీ మధ్య నంత భేదము కలదు.

 

 

 

 

చం.

విడువఁగ వత్స పాలకుల భేదము నేరక వత్స రాంత మం

దడరుచుఁ గ్రొత్త పాత పశు లర్భకు లుండఁగ ధాత మోహియై

పడెఁ గనిపించి రెల్లరును బాహు చతుష్క కిరీట భూషలే

యడర జలాత్త తోయద నిభాంగ విహార విలాస వంతులై

7.     

 

 

 

 

అంత బ్రహ్మ బాలురను దూడలను విడిచి పెట్టెను. అప్పుడు బ్రహ్మ  క్రొత్త పాత పశువులకుఁ  బిల్లలకును భేదము తెలియక యాశ్చర్యముతో మోహమున మూర్ఛ సెందెను. అప్పుడు నల్లని మేఘపు వర్ణమున నాల్గు చేతులతో నాభరణములు కిరీటములతో  నెల్లరు కనిపించిరి.

 

 

 

 

తే.గీ.

శ్రీరమా సేవితుల మహా శేష తల్ప

గతుల సనకాది ముని గణార్చితుల సుంద

రుల నిమీలిత నేత్రుల రుచిరముగను

గాంచె బాలు రందఱ నిన్ను గమల భవుఁడు

8.     

 

 

 

 

రమాదేవి సేవించు చుండ శేష తల్పమున సనకాది మునులు సేవించు చుండ సుందరులు నిమీలిత నేత్రు లైన  బాలుర లందఱిలో నిన్నే చూచెను బ్రహ్మ.

 

 

 

 

తే.గీ.

మోహ వివశుఁ డాయె నలువ మూర్తు లెల్ల

నీవ నీ సేవకులు గాఁగ నీవ యంత

చేత నన్నపు ముద్దతోఁ జెలువ మొప్పఁ

గాన వచ్చితి వటఁ దొలఁగంగ మాయ

9.     

 

 

 

 

అచట నున్న మూర్తు లన్ని నీవు నీ సేవకులు కాఁగఁ జూచి బ్రహ్మ మోహవివశుఁ డయ్యెను. అంత నీవు మాయను దొలఁగించి చేతిలో నన్నపు ముద్దతో నందముగఁ గనిపించితివి.

 

 

 

 

తే.గీ.

మోహము నశింపఁ బల్మరు మ్రొక్కు లిడుచు

నీకు నరిగె నలినజుఁడు నిజ నివాస

మంత నీ విల్లు సేరితి వనుఁగు సఖుల

తోడఁ బాపు రుజలు మరుత్పుర వరేశ!

10.  

 

 

 

 

అప్పుడు మోహము తొలఁగి పోవ బ్రహ్మ నీకు పలుమార్లు మ్రొక్కుచుఁ దన నివాసమున కేఁగెను. నీవును నీ సఖులతో నింటి కేఁగితివి. అట్టి గురువాయూరు నాథా నా రోగములను బాపుము.

 

 

 

 

ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయమున నేఁబది రెండవ దశకము. 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము

(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము)

దశమ స్కంధ పరిచ్ఛేదము

దశకము 53.

ధేనుకాసుర వధ  వర్ణనము.

 

 

ఆ.వె.

బాల్య ముడిగి యంతఁ బౌగండ మేతేర

వత్స పాలనమ్ము వాసి జగతి

నాథ గోగణమ్ము నైపుణమ్మునఁ గాయ

నలరి తొడఁగి తీవు జలజ నేత్ర

1.      

 

 

 

 

మొదటి యైదేం డ్లయిన బాల్య దశను దాటి తదుపరి యైదేం డ్లగు పౌగండ దశను జేరఁగ దేవా దూడలను వదలి గోవులను నైపుణ్యముగఁ గావ నారంభించితివి.

 

 

 

 

కం.

గోత్రావ నార్థ మవతా

ర త్రాతా సార్థకంబ రమణీయంబై

బాత్రమ నీదు ప్రవృత్తియు

గోత్రా పరి రక్షణంబు గోవిందాఖ్యా

2.     

 

 

 

 

గోవిందా భూరక్షణార్థ మవతరించిన నీకు గోవుల రక్షణము చేయు వృత్తి రమణీయముగ సార్థక మైనది.

 

 

 

 

తే.గీ.

సంచరించుచు సుఖముగ మించి యన్న

తో వనమునఁ జెల్వ మరసి నీవ ధేను

క వనము సుదాముఁడు వచింపఁ గదిసి రయ్య

నిజ సఖుని నాదరించి జనింప ముదము

3.     

 

 

 

 

అన్నతో నట్లు సుఖముగా వనమున సంచరించు చుండ నీ సఖుఁడు సుదాముఁడు చెప్పఁగ నతని  నాదరించి ధేనుకా వనమున కందఱు సేరితిరి.

 

 

 

 

తే.గీ.

అవ్వనమ్మున బలరాముఁ డడరి తాటి

చెట్ల నూప దోర్బలమునఁ జెప్ప నీవు

రాలెను ఫలోత్కరములు ఖర తను ధేను

కాసురుండు నేతెంచె రయమునఁ గినిసి

4.     

 

 

 

 

ఆ వనమందు నీ వచనముల నాలకించి బలరాముఁడు తాటిచెట్లను బలముగా నూపఁ దాటి పండ్లు నేల రాలెను. అంత నక్క డుండు పెద్ద దేహ మున్న ధేనుకాసురుఁడు కోపించి వేగముగా వచ్చెను.

 

 

 

 

తే.గీ.

ధేనువులఁ గాచు వాఁడ నీ ధేనుకు నిటఁ

జంపఁ దగుదునే నే నను శంక తోడ

సుర విదారకు ధేనుకు శూరుఁ డగ్ర

జుండు చంపఁ జేసితి వయ్య చోద్యముగను

5.     

 

 

 

 

ధేనువులఁ గాచు నే నిక్కడ ధేనుకాసురుని నెట్లు చంపుదు నని శంకించి సురలను జీల్చు నా ధేనుకుని శూరుఁ డైన యన్న బలరామునిచే వింతగఁ జంపించితివి.

 

 

 

 

తే.గీ.

పతి వధ నరసి జంబుక వర తనువుల

భటు లెదిర్ప జంబూ వర ఫలము లనఁగ

వారిఁ గొట్టి తాటి తరుల మూరి మీ రు

భయులు లీల వధించిరి వనజనేత్ర

6.     

 

 

 

 

తమ రాజు వధను గాంచి ధేనుకుని భటులు జంబుకముల (నక్కల) రూపు నున్న వారు కినిసి మిమ్మెదిర్ప వారినిఁ దాటి చెట్లతో జంబూ ఫలముల వలె వారిని మీ రిరువురు వ్రక్కలు చేసితిరి. 

 

 

 

 

తే.గీ.

జంబు కౌఘ వధము గాంచి జంబు కాఖ్య

వరుణ దేవుండు మిక్కిలి భయము సెంది

చిత్త మందు తన్నామము శీఘ్రమ త్యజి

యించె నిల నని యెంతుఁ దా నుంచి శ్రుతుల

7.     

 

 

 

 

జంబుకపు వఱదను మీరు చంపుట చూచి జంబుక మను పేరున ప్రసిద్ధుఁ డైన వరుణుఁడు భయముతో నా పేరును వేదము లందు మాత్ర ముంచికొని జగమున విడిచెనని నేను దలంతును.

 

 

 

 

తేగీ.

సుర లనుచు నవతారపు వర ఫలమ్ము

పొందితి మిపు డని యలరి పొగడ నిన్ను

నగుచు నిజమని సఖులతో నంద సుత! ల

బించె ఫలము లనుచు నారగించి తయ్య

8.     

 

 

 

 

 

 

నీ యవతారపు ఫలము నిప్పుడు పొందితిమి మే మని సురలు నిన్ను సంతసించి పొగడు చుండ నిజము మనము పండ్లను బొందితిమి యని నవ్వుచు నీ సఖులతో నని నందకుమారా నీవు పండ్లను దింటివి. 

 

 

 

 

తే.గీ.

గుజ్జు గల పండ్లు రసమూరఁ గొసరి కొసరి

తిని తనివి దీఱ మిత్రు లేతేర పండ్ల

గుంపు తోడ ముదము నొంది గోప గృహము

చేరి తయ్య ముకుందా మురారి కృష్ణ

9.     

 

 

 

 

గుజ్జుతో రసము లూరు పండ్లను గొసరి కొసరి తిని తృప్తి సెంది మిత్రులు పండ్ల గుంపుతో వెంట నడువ సంతోషముతో ముకుందా యింటికిఁ జేరితివి. 

 

 

 

 

తే.గీ.

చచ్చె ధేనుకాసురుఁ డంచు మెచ్చు కొంచుఁ

దియ్యనౌ తాటి పండ్లను దిని జయ మగు

నంచు దీవించి జనులు జీవించు మనిశ

మనిరి యనిల పురాధిప! యాపు రుజలు

10.  

 

 

 

 

ధేనుకాసురుఁడు చచ్చె నని మెచ్చుకొని జనులు తాటి పండ్లను దిని జయ మగు నంచు నిన్ను దీవించి నిత్యము జీవించు మనిరి. అట్టి గురువాయూరు నాథా నా రోగములను బాపుము.

 

 

 

ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయమున నేఁబది మూడవ దశకము. 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము

(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము)

దశమ స్కంధ పరిచ్ఛేదము

దశకము 54.

కాళియోపాఖ్యానము.

 

 

చం.

ఘనముగ నీదు సేవల నఖండపు టుత్కత నర్కనందనా

ధునిఁ దమి ద్వాదశాబ్దములు తోరము సౌభరి నామ భక్తుఁడు

న్మునియుఁ దపమ్ము సేయ నట మోహ గతాండజ దర్శనమ్మునన్

జనితము కాఁగఁ గూర్మి మును సర్ప రిపుం డట కేఁగుదెంచియున్

1.      

 

 

 

 

మున్ను నీ సేవ లందు నుత్కంఠతతో యమునా నదిలో నుండి పండ్రెండు వత్సరములు సౌభరి యను మునీంద్రుఁడు నీ భక్తుఁడు తపము చేయుచుండఁగ నందు ననురాగముతో నున్న చేపలను గాంచ వానిపై నతనికిఁ బ్రేమ కలిగెను. అప్పుడు గరుత్మంతుఁ డచటకి వచ్చి..

 

 

 

 

తే.గీ.

తినుచు నుండ నొక్క ఝషము వినత సుతుఁడు

నీదు వాహన మ్మాఁకలినిఁ గని ముని వ

రుండు శపియించె నాతని రోష మూని

యందుఁ బ్రాణుల భక్షింప డిందు వంచు

2.     

 

 

 

 

తినుచుండ నొక చేపను వినత సుతుఁడు నీ వాహనుఁ డాకలితో నంత ముని కోపముతో నిందలి ప్రాణులను భక్షించిన చత్తు వని యాతనిని శపించెను.

 

 

 

 

ఆ.వె.

విషపు దర్ప మడర వినతాత్మజు నశన

ము దినఁ గాళియుండు మూరి కొట్ట

నతఁడు ఱెక్క దాఁగె యమునా నది గరుడుఁ

డరుగ లేని చోటు నహి వరుండు

3.     

 

 

 

 

ఒకనాఁడు కాళియుఁ డను సర్పరాజము తన విష దర్పమున గరుడుని యాహారమును దినఁగ నలిగి పక్షీంద్రుఁడు తన ఱెక్కతో గొట్టఁగాఁ గాళియుఁడు గరుత్మంతుఁడు చొఱలేని యమునా నదిలో దాఁగెను. 

 

 

 

 

తే.గీ.

అవ్విష రయమ్ము చే యము నాపగా త

టీ దరులు జ్వలించెఁ గడు మింటిఁ జరియించు

విహగ సందోహ మకట భువిఁ బడుచుండఁ

గాంచి జీవుల నీ మది కరఁగె నయ్య

4.     

 

 

 

 

ఆ విషపు జవమ్మున యమునా నది యొడ్డు నందలి చెట్లు మండుచుండెను. ఆకాశమున నెగురు పక్షులు నేలఁ గూలు చుండెను. ఆ జీవులను గాంచి నీ మనస్సు కరఁగిపోయినది. 

 

 

 

 

తే.గీ.

అంత నొకనాఁడు కాళింది కగ్రజ విర

హితముఁ గాన నాంత మరుగ నెలమి సఖులఁ

గూడి గ్రీష్మోష్మ తప్తమై గోప గో గ

ణమ్ము దనివిఁ ద్రాగె విష జలమ్ము నౌర

5.     

 

 

 

 

అంత నొకనాఁ డన్న లేకుండ సఖులతోఁ గూడి వనాంతరమునఁ గాళిందీ నది కేఁగ నెండ వేడికి నొవ్వుచు గోవులు గోపు లకట విషజలమును దనివి తీరఁ ద్రాగిరి. 

 

 

 

 

తే.గీ.

అచ్యుతా! నష్ట జీవుల నరసి పుడమిఁ

గూలఁ గదిసి సమీపము జాలి నిండ

చిత్తమున దయారస సుధా సిక్త వీక్ష

ణమ్ముల బ్రదికించితి తద్గణమ్ములఁ ద్రుటి

6.     

 

 

 

 

అచ్యుతా యంత నీవు మరణించి పుడమి గూలిన వారిఁ గాంచి సమీపించి జాలి నిండఁగ మదిలో నీ దయామృతంపుఁ జూపులు పఱచి బ్రదికించితివి. 

 

 

 

 

తే.గీ.

హర్ష వర్ష మగ్నులు లేచి యంగ గణము

లందు నేమేమి మా కయ్యె నంచు గోప

క జను లరసి యెదుట నిన్ను గౌఁగిలించి

రెల్లరు నిను నీదు ప్రభావ మెఱిఁగి మదిని

7.     

 

 

 

 

మా మా యవయవములం దేమేమి యయ్యె నంచు సంతోషపు జల్లుల మునిఁగి లేచి యా గోప బాలురు నిన్ను జూచి నీ ప్రభావము నెఱిఁగి నిన్ను గౌఁగిలించుకొనిరి.

 

 

 

 

తే.గీ.

బ్రతికి గోగణము ముదము వడసి త్రుటినిఁ

గనుల నీ రుబుకఁగ నిన్ను గాంచి సన్ని

ధాన మందు మందముగ నాదములు సేసి

చేరె నంబా యనుచు నిన్ను చెల్వముగను

8.     

 

 

 

 

ఆవులు కూడ హర్షమున నిన్ను జూచి కనుల నీరు కాఱఁగ నంబా యనుచు బిగ్గరగా నఱచుచు నీ చెంతకుఁ జేరినవి.

 

 

 

 

తే.గీ.

ఒడలు పులకించె నెల్లెడ నడరె ముదము

మా మనమ్మునఁ గలిగె సంభ్రమము భృశము

నక్కజం బయ్యె యివ్విష మంతరింప

నంచు వందించి మ్రొక్కిర య్యా ముకుంద!

9.     

 

 

 

 

అందఱు నంత మాకు నొడళ్లు పులకించినవి, మనస్సులలో మిక్కిలి సంభ్రమ ముప్పొంగె నాశ్చర్య మయ్యె నానందము కల్గెను  మా యీ విషమంతయు విఱిఁగి పోవఁగా నంచు కీర్తించి వారెల్లరు నీకు మ్రొక్కిరి. 

 

 

 

 

తే.గీ.

గోపు లివ్విధి భక్తులు కోలుపోయి

నట్టి జీవము లరసిరి యందఱి రుజ

లణఁచెదవు కృపా దృష్టి నిన్నరయ శరణు

వాయు గేహాధిపా వ్యాధి బాపు మయ్య

10.  

 

 

 

 

ఈ విధముగా నావులు గోపకులు వోయిన ప్రాణములను దిరిగి పొందిరి. నీ వందఱి రోగములను నిన్ను శరణు వేఁడ గృపా దృష్టితో నణచెదవు.  అట్టి గురువాయూరు నాథా నా రోగము నాపుము.

 

 

 

 

ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయమున నేఁబది నాలుగవ దశకము. 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము

(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము)

దశమ స్కంధ పరిచ్ఛేదము

దశకము 55.

కాళియ మర్దనము.

 

 

ఉ.

గ్రక్కున నడ్డగింప ఫణిఁ గార్యము నెంచి దృఢమ్ముగా నెదం

జక్కటి యేటి తీరమునఁ జప్పున నెక్కితి వీవు నీపమే

యక్కడ నుండ బోడుగ విషానల తప్త పతత్ర రాశితో

నుక్కు చెలంగ మిక్కుట మహో యన గోపకు లెల్ల రార్తినిన్

1.      

 

 

 

 

ఆ పాము ఘోర కార్యమును గ్రక్కున నాప నెంచి మనస్సులో దృఢముగా నా యమునా నది యొడ్డున నున్న మిక్కుటపు విషము వలన మండిన యాకులతో బోడిగ నున్న కడిమి చెట్టు నెక్కితివి. అయ్యో యని గోపకు లెల్లరు నార్తితో నఱచు చుండిరి.    

 

 

 

 

తే.గీ.

పాద పద్మ యుగమ్ములఁ బల్లవ మృదు

సుందరములఁ బాదప మెక్కి చోద్యముగ న

మంద గతి బహు దూరమునం దభంగ

భంగ కల్లోల నది దూఁకి పడితి వయ్య

2.     

 

 

 

 

పల్లవములు వలె నందముగా నున్న నీ పాద పద్మములతో నా చెట్టు పై మెల్లఁగాఁ గడు దూరము చని యడ్డు లేని కెరటములతోఁ గల్లోలముగా నున్న నది లోనికి దుమికితివి.  

 

 

 

 

ఆ.వె.

ముజ్జగములు మోయు భూరి బలుఁడ వీవు

పడఁగఁ గంపితంపు వారిఁ జెలఁగె

ఘోర రవము చెదర నీరు నూఱు విలుల

దూర మొడ్లు మునిఁగెఁ దోరముగను

3.     

 

 

 

 

ముల్లోకములను మోయఁ గల గొప్ప బలము గల నీవు నీటిలోఁ బడఁగాఁ బెద్ద ధ్వని చెలరేఁగినది. నీరు చెదరఁగా నూఱు విల్లుల దూరము వరకు నొడ్డులు నీటిలో మునిఁగినవి.   

 

 

 

 

తే.గీ.

చెల్ల చెదరై యుదకము సుళ్లెల్ల దిక్కు

లందు వ్యాపింప శబ్దమ్ము లడర నదిని

నీటి నుండి పై కేతెంచి మేటి పాము

చేరె నసహనమ్మున నీదు చెంతఁ గినిసి

4.     

 

 

 

 

నీరు చెల్లాచెదరు కాఁగ సుడులు దిక్కు లెల్ల వ్యాపించి చప్పుళ్లు చెలరేఁగఁగా విని యా పెద్ద పాము నీటి నుండి పైకి లేచి యసహనముగా నీ చెంతకుఁ గోపముతోఁ జేరినది. 

 

 

 

 

తే.గీ.

పడగ లవి వేయి విప్పార జ్వాల శిఖలు

మండు చుండ విషాగ్నుల మెండుగఁ గని

పింప బహుశి ఖాంజన గిరి మించు భంగిఁ

గాంచితి ఫణిఁ గాళియుని నీ కనుల ముందు

5.     

 

 

 

 

పడగలు విప్పారి విషపు జ్వాలలతో మెండుగ మండు చుండఁ బలు శిఖలతో నున్న యంజనంపుఁ బర్వతము వలెఁ  గనిపించు గాళియ సర్పమును నీ కనుల ముందు చూచితివి. 

 

 

 

 

ఆ.వె.

కనులు మండు చుండఁ గాళియుండు విష ని

శ్వసనములఁ గఱచి దశనముల వడిఁ

జేష్టలు కన రాని చెలువమున ననంత

బలుని నిన్ను జుట్టె నలుక మీఱ

6.     

 

 

 

 

 

అంతఁ గాళియుఁడు కనులు మండుచుండ విషము గ్రక్కు నిశ్వసనములతో బండ్లతోఁ బలుమార్లు నిన్ను ననంత బలుని నలుకతోఁ గఱచి చుట్టుకొని యుండ నీ చేష్ట లెవ్వియుఁ గన రాని విధమున నుంటివి.

 

 

 

 

కం.

కానక నిన్నట గోపక

ధేను గణమ్ములు గలఁగెను దీనత మిగులం

గానఁగ నపశకునమ్ములు

నా నందాదులును జేరి రాత్రము మీఱన్

7.     

 

 

 

 

దీనత్వముతో గోపకులు ధేనువులు నిన్ను గానక మిక్కిలి కలఁత జెందెను. అపశకునమ్ములు పెక్కు కన్పడ నందాదు లాత్రముతో నిన్ను జేరిరి.

 

 

 

 

తే.గీ.

నీదు దురవస్థ వీక్షించి నీటి యందు

నసువులను వీడ దమకింప నంద ఱంతఁ

గాంచి ఫణి బంధమును దొలఁగించి కొనుచు

వచ్చితివి వడి నగుచు నా పడగ పైకి

8.     

 

 

 

 

నీ యీ దురవస్థను జూచి యందఱు నీటిలోఁ దమ ప్రాణములను వీడ నుద్యమింపఁ గాంచి యా పాము బంధమును దొలఁగించికొని దాని పడగ పైకి నవ్వుచు వేగముగ వచ్చితివి.

 

 

 

 

తే.గీ.

అందెల రవములు కలియ హస్త కంక

ణస్వనముల ఫణములపై నాట్య మాడఁ

దొడఁగితి మృదు పాద రుచులు తోర మడర

ఘల్లు ఘల్లుమని శ్రుతులు కలుపు చుండి

9.     

 

 

 

 

అందెల ధ్వనులు చేతి కంకణముల చప్పుళ్లతోఁ గలియంగ నీ మెత్తని పాదముల కాంతి మించఁగా ఘల్లు ఘల్లు మని సవ్వడి చేయుచు శ్రుతులు గలిపి యా పాము పడగలపై నీవు నాట్య మాడ ప్రారంభించితివి. 

 

 

 

 

తే.గీ.

తోష మందిరి గోపులు తోరముగను

స్తుతు లిడిరి మునులు గురియ సురలు పూల

వాన నృత్యమ్ము నీవు సల్ప ఫణి పైన

వాయు పుర నాథ బాపుమ వ్యాధు లెల్ల

10.  

 

 

 

 

నీవు కాళీయుని పై నాట్య మాడుచుండ నందాది గోపులు మిక్కిలి సంతోషించిరి. ముని వరులు  స్తుతించిరి. సురలు నీ పైఁ బూల వాన కురిపించిరి. అట్టి గురు వాయూరు నాథా నా వ్యాధుల నెల్ల బాపుము.

 

 

 

ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయమున నేఁబది యైదవ దశకము.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము

(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము)

దశమ స్కంధ పరిచ్ఛేదము

దశకము 56.

కాళియుని ననుగ్రహించుట. 

 

 

తే.గీ.

మెఱయఁ గుండల ద్వయము కంపితము గాఁగ

నర్తనము సేసితి ఫణి ఫణమున నీవ

యమర నమర దుందుభి నిస్వనములు సెలఁగి

యమర యువతుల గానమ్ము లడర దివిని

1.      

 

 

 

 

దేవా నీ కుండలములు కంపించి కాంతి మెఱయు చుండ పాము పడగపై నర్తనము సేసితివి.అప్పుడు  దేవ దుందుభులు మ్రోగినవి. దేవ కాంతల గానములు దివినిఁ జెలంగినవి.

 

 

 

 

కం.

వంచఁగ నొక్కొక్క పడగ

నుంచి పదమ్మున్నత ఫణ ముపరి తలమునన్

మించఁ గరతాళ రవములు

నంచితముగ నాట్య మాడి తయ్య ముకుందా

2.     

 

 

 

 

ఒక పడగ వంగిన నీ పాదములు వేరొక యెత్తుగా నున్న పడగపై నుంచి వరుసగఁ చేతి చప్పుళ్లకుఁ  దాళము కలుపుచు ముకుందా నాట్యము సేసితివి.

 

 

 

 

తే.గీ.

రక్త మయ మయ్యె యమునా జలమ్ము నలిఁగి

పడగ లెల్ల నీపదముల భారమునను

గాఱ రక్తము కృశియించెఁ గాళియుండు

వ్రాలి రతని సతులు నీదు పాద యుగళి

3.     

 

 

 

 

అంతఁ బడగ లెల్ల నీ పాదముల క్రింద వాని బరువునకు నలిగి రక్తము కాఱఁగా యమునా జల మంతయు రక్త మయ మయ్యెను. కాళియుఁడు కృశించెను. అప్పుడు వాని భార్యలు దేవా నీ పాదములపైఁ బడిరి.

 

 

 

 

తే.గీ.

మున్న వారు నీ మహిమమ్ము విన్న వార

మగ్న చిత్తలు నీ యంద మౌని వరుల

కంద రాని స్తోత్రమ్ముల నడ్డు లేక

నిన్ను నుతియించి రీశ్వర సన్నత లయి

4.     

 

 

 

 

కాళియుని భార్యలు నీ మహిమము మున్న యెఱిఁగిన వారు, నీ యందు మనమును లగ్నము చేసిన వారలె. ముని పుంగవులు కూడ నేరని స్తోత్రములతో వినయమ్మున మిక్కిలి వంగి నిన్ను నుతించిరి.   

 

 

 

 

ఉ.

సర్ప వధూ లలామ నుతి సంచయ మింపుగ నాలకించి సం

తర్పిత మానసమ్మునఁ ద్రిధామ దయారస వీక్షణమ్ములన్

సర్ప వరేణ్యు జీవములు సక్కఁగ నీయ నతండు నెమ్మి నీ

కర్పిత సన్నతాంగుఁ డయి యచ్యుత మ్రొక్కెను భక్తి మీఱఁగన్

5.     

 

 

 

 

ఆ సర్ప కాంతల స్తోత్రములను విని త్రిధామా! తృప్తి సెందిన చిత్తముతో దయారస వీక్షణములతోఁ గాళియుని రక్షించితివి. అంత నతఁడు నతాంగుఁ డయి యచ్యుతా నీకు భక్తితో మ్రొక్కెను.

 

 

 

 

తే.గీ.

చనుమ రమణక దీవికి వనధి మధ్యఁ

గలదు గరుడు వలని భీతి కనవు నీ వ

చట యనంగ మన్నించి యచటకు సతులఁ  

గూడి యేఁగె నురగపతి కూర్మి తోడ

6.     

 

 

 

 

అంత దేవా నీవు కాళీయునితో జలనిధి మధ్య నున్న రమణక మను దీవికి నేఁగ మని యచట గరుత్మంతుని వలని భయ ముండ దని చెప్పఁగా నిన్ను గౌరవించి  యతఁడు దన భార్యలతోఁ గూడి ప్రీతితో నేఁగెను.

 

 

 

 

ఆ.వె.

ఫణి సతీ మణు లిడ మణులు హారమ్ములు

పట్టు బట్ట లేటి గట్టు నందు

నున్న వారిఁ గూడ నుల్ల మలరె సంత

సమున నశ్రులొలుక సాయ మయ్యె

7.     

 

 

 

 

కాళియుని భార్యలు మణులు పట్టు బట్టలు నీ కొసంగిరి. అంత గట్టున యున్న వారినిఁ జిత్తమున సంతోష ముప్పొంగఁ గన్నుల నీరు కాఱఁ గూడితివి.  అంత సాయంసమయ మయ్యెను.

 

 

 

 

తే.గీ.

అంధకారము వ్యాపింప నంత నింటి

కేఁగ లేక పరుండిరి యెల్ల రచట

నీ పదము లాశ్రయించి యయ్యాపగా త

టిని దవానల మంత రేఁగె నలుదిశల

8.     

 

 

 

 

అంత చీకటి క్రమ్ముకొనఁగ నింటికిఁ బో నలవి కాక యచ్చటనే నదియొడ్డున నెల్లరు నీ పదముల నాశ్రయించి పరుండిరి. అప్పుడు నలు దిశల కార్చిచ్చు వ్యాపించినది.

 

 

 

 

ఆ.వె.

చూచి కారు  చిచ్చు లేచి యెల్లరు కన్న

కావు కావు మనఁగఁ గరుణ తోడఁ

ద్రాగ నగ్ని వీడి త్రాస మెల్లయుఁ జిత్ర

మయము నీదు ముఖ మరయఁగ ననిరి

9.     

 

 

 

 

వా రపుడు లేచి కారుచిచ్చును జూచి కన్నా మమ్మలను గావు మంచు వేఁడగా నీవు  కరుణతో నా దవాగ్నినిఁ ద్రాగితివి. అంత వారు భయము వీడి కృష్ణా నీ ముఖము చూడ బహు చిత్ర మనిరి.

 

 

 

 

ఆ.వె.

వహ్ని యందు వఱలు వర్ణమ్ము పీతము

కల దది యిపుడు క్రియగ నల పీత

మనఁగఁ బొగిడి రయ్య నిను హర్ష మొదవంగ

హరి! హరించు మామ కాఘ రుజలు

10.  

 

 

 

 

అగ్ని సహజపు వర్ణము పీతము. ఇప్పు డది నీవు త్రాగిన క్రియ చేత గూడ పీతమే యయిన దని నిన్నెల్లరు పొగిడిరి. అట్టి హరీ నా పాపములను రోగములను హరించుము.

 

 

 

 

ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయమున నేఁబది యాఱవ దశకము. 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము

(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము)

దశమ స్కంధ పరిచ్ఛేదము

దశకము 57.

ప్రలంబాసుర వధ వర్ణనము. 

 

 

కం.

ఒక నాఁ డడవికి వ్రజ బా

లకు లావుల తోడుత బలరామునితో నం

శుకములు మెఱయ నరిగితి త

మకమ్ముతో వరద! దేవ! మన మలరంగన్   

1.      

 

 

 

 

దేవా వరముల నిచ్చువాఁడా నీ వొకనాఁడు గోపబాలురు నన్నయు దోడు రా నావులతోఁ బ్రకాశింప వస్త్రము లడవికి సంతోషమున వెడలితివి.

 

 

 

 

ఆ.వె.

విమల తర సురుచిర బృందావన విభవ

మ్ములను జూపుచు నల బలున కెలమి

దండ మమర చేత భాండీరక వటముఁ

జేరి తాడ నట సచివుల తోడ

2.     

 

 

 

 

అందమైన బృందావన విభవములు బలరామునికి ముదముతోఁ జూపుచుఁ  జేతిలో దండము విలసిల్లఁ జెలికాండ్రతో నాడుటకు భాండీరక మను మఱ్ఱి చెట్టు సేరితివి. 

 

 

 

 

తే.గీ.

నిన్ను జేరెఁ జంపఁగ నెంచి నిల్చి గోప

బాలునిగ బ్రలంబుఁడు లంబ బాహుఁ డంత

కనికరము వీడి యసురుండు కాననమ్ము

నందుఁ గాంచి యెల్లర వెస నంద సూన!

3.     

 

 

 

 

 

ఓ నందతనయా నిన్ను జంప నెంచి గోపబాలుని వేషమునఁ బొడవు చేతు లున్న ప్రలంబుఁ డను రాక్షసుఁడు దయవీడి మిమ్మెల్లర నడవిలోఁ జూచి యచటకు వేగఁ జేరెను.

 

 

 

 

తే.గీ.

కాంచి వాని గుర్తించియు వంచనఁ గని

యెఱుఁగని విధమ్మున మసలి తీవు వాని

గూడి మఱ్ఱి సరసఁ బటు గోప బాల

కులఁ గలసి ద్వంద్వ యుద్దము గూర్చి తయ్య

4.     

 

 

 

 

వానిని జూచియు వంచింప గుర్తింప నట్లు నటించితివి. అంత మఱ్ఱి చెట్టు దగ్గర బాలురను ద్వంద్వ యుద్ధపు టాటకై కూర్చితివి.

 

 

 

 

తే.గీ.

బలుఁ డొక దెస నీ వొక దెస నలర రెండు

సంఘముల నేర్పఱుపఁ బలాశనుఁడు బల మె

ఱింగి నీది భీతిల్లి నీ సంగడి నర

యంగఁ జేర్చుకొంటివి దేవ! సంగరమున

5.     

 

 

 

 

బలరాముఁ డొక వైపు నీ వొక వైపుగా రెండు గముల నేర్పఱచితివి. నీ బలము నెఱింగిన వాడు కనుక యా రక్కసుఁడు భయమంది నీ వైపు నుండ గోర యుద్ధమున నతనినిఁ జేర్చుకుంటివి.

 

 

 

 

కం.

నీ వోడఁగ శ్రీదాముని

నీవే మోసితి నియమము నెరవేర్పంగం

గావే సద్భక్తాళికి

సేవకుఁడవు పంకజాక్ష! చిత్రం బగునే

6.     

 

 

 

 

అప్పుడు నీ వోడ శ్రీదాముని నియమము ప్రకారము నీవు మోసితివి. చిత్ర మేమున్నది నీ వకట సద్భక్తులకు సేవకుఁడవే కదా పంకజాక్ష.

 

 

 

 

తే.గీ.

ఇవ్విధము మోయు వారల నింక మోయఁ

బడెడు వారల బలభద్రు వలన నోడి

నం బ్రలంబుఁడు మోసె నన్న నతి దూర

ము గొనిపోయె నీకు బెదరి మూర్ఖుఁ డకట

7.     

 

 

 

 

ఈ విధముగా మోసెడు మోయఁ బడు వారలలో బ్రలంబుఁ డోడఁగా బలరాముని మోసికొని నీకు భయపడి మూర్ఖుఁడు చాల దూరము తీసికొని పోయెను. 

 

 

 

 

ఆ.వె.

తనను గొని చనఁగ నతఁడు కడు దూరము

గాంచి హలధరుండు పెంచెఁ దనదు

బరు వసుర ధరించె వడి స్వీయ రూపము

చకితుఁ డయ్యె నంత శౌరి గూడ

8.     

 

 

 

 

ఇట్లు దనను దూరముగఁ తీసికొని చను చుండ బలరాముఁడు దన శరీరపు బరువును వింతగ విపరీతముగాఁ బెంచెను. అంత నసురుఁడు నిజరూపము ధరించెను. అంత బలరాముఁడు గూడ చూచి  యాశ్చర్యము సెందెను.

 

 

 

 

తే.గీ.

ఎత్తున నసుర మూపున నింపుగఁ గని

నీ ముఖము దూరమున ముష్టిని బిగియించి

భీతిలక త్రుటి నతి దుష్టు పిశిత భోజ

ను నడిచె దృఢమ్ముగ బలుఁడు కినిసి కరము

9.     

 

 

 

 

ఆ రాక్షసుని మూపున నెత్తున నుండి దూరము నుండి నీ ముఖము సూచి భీతిల్లక తన ముష్టిని బిగించి వేగముగ బలరాముఁడు నా దుష్టుని రక్కసునిఁ గోపముతో దృఢముగాఁ గొట్టెను.

 

 

 

 

తే.గీ.

చంపి దైత్య వీరుని నీదు సన్నిధి కరు

దెంచి యాలింగన మొనర్ప నంచితముగ

నమరులు కురిసిరి విరుల నలరి మీ ప

యిన భృశముగ నభమ్మునఁ దనరి యపుడు

10.  

 

 

 

 

అట్లు దైత్యుని జంపి బలరాముఁడు నీ సన్నిధికిఁ జేరి యాలింగనము సేయఁగా దివి నుండి సురలు సంతసించి మీ యిరువురిపైఁ బూలవాన కురిపించిరి.   

 

 

 

 

తే.గీ.

పన్నుగఁ బ్రలంబ నిధనము పరఁగఁ జేసి

తయ్య యిందీవరశ్యామ యఖిల భువన

సంచ యాధార కరుణఁ దత్క్షణమ నాదు

క్లేశ చయము హరింపుమ కేశవ! హరి!

11.   

 

 

 

 

అట్లు చక్కఁగఁ బ్రలంబుని జంపించితివి. సకల భువనములకు నాధార మైన వాఁడా యిందీవర  శ్యామా కేశవా హరీ కరుణతో నా క్లేశములను శీఘ్రమ తొలఁగించుము. 

 

 

 

 

ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయమున నేఁబది యేడవ దశకము. 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము

(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము)

దశమ స్కంధ పరిచ్ఛేదము

దశకము 58.

దావాగ్ని మోక్షాది వర్ణనము. 

 

 

మత్తకోకిల.

ఆట లందుఁ బ్రలంబుఁ జంపుట యందు నుండ విలంబనం

బౌట ధేనువు లంత స్వైర విహార లీలఁ జరించి దూ

రాటవీ స్థిత శాద మారసి యారగింప నిషీకపుం

దోట కేఁగిన వెల్ల శీఘ్రమ దూఁకుచుం దమి మాధవా

1.      

 

 

 

 

మాధవా యాటలలోను, బ్రళంబునిఁ జంపుట యందు నాలస్యము కాఁగ ధేనువులు యథేచ్ఛగా విహరించుచు నడవిలో దూరమున నున్న ఱెల్లు గల  తోటలోఁ బచ్చ గడ్డినిఁ జూచి తినుటకు దూఁకుచు వేగముగా నేఁగినవి. 

 

 

 

 

తే.గీ.

ఘర్మ తాప మెఱుంగని నిర్మ లాతి

రమ్య బృందావ నాంత రారణ్య మేఁగ

నూష్మ దాహ సంతప్త ధేనూత్కరమ్ము

నీదు విరహమ్మున నిలిచె నిశ్చలముగ

2.     

 

 

 

 

వేసవి వేఁడి నెఱుఁగని బృందావనమునకుఁ జివర నున్న యడవి కేఁగఁగ నుష్ణము దాహములతో మిగుల సంతప్తమైన యావుల గుంపు నిన్ను నెడఁబాసిన దుఃఖముతో నిశ్చలమై నిల్చినది. 

 

 

 

 

తే.గీ.

శౌరి! సహచరులం గూడి సరణి తప్ప

వెతక దవ్వుల ముంజాటవి కదిసి కని

తప్త పశువులఁ జేర యత్నమ్ము సేయ

నగ్ని చెలరేఁగె నెల్లెడ నక్క టకట

3.     

 

 

 

 

కృష్ణా నీ సఖులతోఁ గూడి వెతకుచు దారి తప్పి ముంజిగడ్డి యున్న తోటకుఁ జేరి తపించుచున్న యావులను జూచి వానినిఁ జేరుటకు యత్నించుచుండ నంత నక్కటా యగ్ని చెలరేఁగినది.

 

 

 

 

ఆ.వె.

సకల దిశలు మండ శబ్దించి భయదమ్ము

గ ననలమ్ము మూయ గతుల లోక

బంధు కావు మనుచుఁ బ్రార్థించి శరణాగ

తు లయి రంత నీకు దుఃఖ హార

4.     

 

 

 

 

దిక్కు లన్నిట భయంకరపు శబ్దములతో మండుచు నగ్ని దారులను మూయఁగా లోక బాంధవా మమ్ము గావు మనుచు బ్రార్థించుచు దుఃఖములను బాపు నీకు నెల్లరు శరణాగతు లైరి.  

 

 

 

 

ఉ.

చాలు భయమ్ము చా లనుచుఁ జక్కఁగ మూయుఁడు కన్ను లంటి నీ

మేలగు పల్కులన్విని నిమీలిత నేత్రులు కాఁగ నెల్లరుం

గాలెడు నగ్ని ముంజ వర కానన మెక్కెడ యక్కజమ్ముగం

గాలిడి రవ్వ టాగమ సకాశము విప్పఁగఁ గన్ను లెల్లరున్

5.     

 

 

 

 

భయము చాలు నింక మీ కన్నులు మూసికొనుఁ డన్న నీ మాటలు విని వారు దమ కన్నులను మూసికొనిరి. అంత వారు కన్నులు తెఱవఁగా వింతగా నగ్ని లేదు ముంజాటవి లేక పోఁగా వారు మఱ్ఱి చెట్టు చెంత నున్నారు.

 

 

 

 

తే.గీ.

జయము జయ మని మందహాసమున మాయ

యంచుఁ బొగడంగ నిను గ్రీడ లాడ మించి

వన విహారమ్ము లలరంగఁ బాట లాది

కుసుమములఁ దేటపడె వేసవి సమయ మని

6.     

 

 

 

 

 

అంత జయము జయము నీ కని చిరునవ్వుతో నిన్ను వారెల్లరు మాయ యిది యని పొగిడి క్రీడలతో వనవిహారము సేసిరి. పాట లాది పుష్పములు పూయుట వలన మాత్రమే యది వేసవి కాల మని తెలియు చున్నది.

 

 

 

 

తే.గీ.

విముఖులు భరింప వేసవి వేఁడి నెల్ల

నిన్నుభజియింపఁ దాపము నీరు కాఁగ

నీ భుజముల తేజమ్మది నెగడ నెల్లఁ

గడపితి యమునా తటి ఘర్మ మడరి నీవు

7.     

 

 

 

 

నీ శత్రువులు వేసవి వేఁడికిఁ దాపము సెందిరి. నిన్ను భజించిన వారు తాపమును బొందక యుండ  నీ భుజ బలము దనరఁగా యమునా నది తటిని వేసవి కాలమును గడిపితివి.

 

 

 

 

చం.

ఘనములు రేఁగ నీదు ఘన కాయ నికాశ వికాసమానమై

తనరగఁ జంచలా రుచులు తావక పీత దుకూల కాంతులై

జనులకు నీయ హర్షము భృశమ్ముగ వచ్చెను వర్ష కాలమే

యనువుగ శైల కందరము లందు విహారములం జెలంగితే

8.     

 

 

 

 

దేవా నీ శరీర వర్ణమున దనరు మేఘములు రేఁగఁగ నీ పచ్చని దుస్తుల కాంతి వంటి మెఱపుల కాంతి మెఱయు చుండ జనుల కెల్లరకు హర్షము నిచ్చుచు నంత వర్ష కాలము వచ్చెను. అనువుగాఁ గొండ గుహలలో విహారము సేయుచు నీవు ప్రకాశించితివి.    

 

 

 

 

తే.గీ.

గుహల చరియించు నిన్ను నా కుధర రాజ

ము నుతియించె గోవర్ధనమ్ము మధు రాతి

మధుర కేకి ధ్వనులఁ గదంబ కుటజ కుసు

మాంజళుల దేవ! ముదమార నంచితముగ

9.     

 

 

 

 

గుహలలో విహరించు నిన్ను గోవర్ధన పర్వతము మధురమైన నెమళుల కూతలతోఁ గదంబము,  కొండమల్లె పూవులతో నంజళు లిడి నుతించెను.

 

 

 

 

తే.గీ.

ఆమని యరుదెంచెను విమ లాంబు పూర

ములు నదులు భక్త మనముల వలెఁ జరించు

చు వనములఁ బశువుల మేపుచు వెలసితివి  

యనిల నగరేశ్వర యనామయమ్ము నిమ్ము

10.  

 

 

 

 

అంత వసంత ఋతు వేతెంచెను. నదుల లోని  నీరు భక్తుల మనస్సుల వలె నతి నిర్మలముగా నుండెను. నీవు వనము లందుఁ దిరుగుచుఁ బశువులను మేపు చుంటివి. అట్టి గురువాయూరు నాథా నాకు నారోగ్యము నిమ్ము.

 

 

 

 

ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయమున నేఁబది యెనిమిదవ దశకము. 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము

(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము)

దశమ స్కంధ పరిచ్ఛేదము

దశకము 59.

వేణుగాన వర్ణనము. 

 

 

తే.గీ.

నవ కుసుమ కోమ లాజిర మవనిఁ బ్రణయ

జనకము నశేష మోహనము నయి తనర

నీవు పర చిన్ముదాత్మకమై వఱల న

బల లహ రహము వశ లైరి బ్రహ్మతత్త్వ

1.      

 

 

 

 

క్రొత్త పూవు వలె మృదువైన మేనితోఁ బ్రేమ పుట్టించెడు మోహన రూపముతోఁ జిదానందమును గలుగఁ జేయు నట్లు నీ వలరు చుండ బ్రహ్మతత్త్వా నీకు గోపిక లెల్లరు దిన దినము వశలైరి.

 

 

 

 

తే.గీ.

మన్మ థోన్మథి తాత్మ భామా మణులు త్వ

దీయ దర్శన రత తప్త దీన మాన

సలు సహింపఁ జాల రయిరి చనఁగ నీవు

వన ముదయమం దకట గోప వనితలు హరి!

2.     

 

 

 

 

హరీ యుదయమున నీవు వనమున కేఁగ గోప కాంతలు మన్మథార్తలై నీ దర్శనమునకై మిక్కిలి తపించుచు దీనమైన మనస్సులతో  నీ వియోగమును సహింపఁ జాల రైరి. 

 

 

 

 

ఆ.వె.

నీవు వెడల దృష్టి నిల్పి మృగేక్షణ

లు కడు దవ్వు లలనలు మనసు లరు

గంగ నీ వెనుకనె కథలు నుడువుచు వే

ణు రవము వినుచు ముద మరసిరి మది

3.     

 

 

 

 

నీ వేఁగఁగానే యా మృగ నయనలు చాల దూరము వఱకు దృష్ట్లు నిలిపి యా లలనలు మనసు లుప్పొంగ నీ వెనుక నీ కథలను జెప్పుకొనుచు నీ వేణు గానమును వినుచు సంతోషమును బొందుచుండిరి.

 

 

 

 

ఆ.వె.

అటవి కేఁగి సుంద రాగమ మూలమం

దుంచి కాలి పైన నొక్క కాలు

నతి విలాస మొప్ప నవ్వేణు నాళము

నూఁద తొడఁగి తీవు నాద మలర

4.     

 

 

 

 

అడవి సేరి యందమైన చెట్టు మొదలునఁ గాలిపైఁ గాలు వేసికొని నిల్చి విలాసముగా వేణువును మధురముగా నూఁదఁ జాగితివి. 

 

 

 

 

తే.గీ.

మదన బాణ హత లయిరి సుదతులు దివి

జంతు పక్షి జాలమ్ము నిశ్చలము నిలిచెఁ

గఠిన శిలలు గూడ చలించి కరఁగఁ జాగె

నీదు వేణు నాళ జనిత నాదమునను

5.     

 

 

 

 

అంత నా గానమునకు సుదతులు మదనుని బాణముల పాలైరి. యాకాశమునఁ బక్షులు, జంతు రాశులు చలనము లేక నిల్చినవి. గట్టి ఱాళ్లు కూడ కరఁగఁ జాగినవి.

 

 

 

 

తే.గీ.

వేణు బిలములఁ దరళంపు వ్రేళ్లు కదలఁ

దాళ బద్ద మాడంగఁ బాద ముకుళమ్ము

చూడ కున్న నూహల వ్రజ సుందరు లట

మోహ పరవశ లై రయ్య మోహ నాంగ

6.     

 

 

 

 

వేణు రంధ్రముల నీ ప్రకాశవంతమైన వ్రేళ్లు కదలుచుండఁ దాళమున కనుగుణముగ మొగ్గ వోలు నీ పాద మాడుచుండఁ జూడకున్నను దమ యూహాలలోఁ గాంచి గోపికలు మోహ పరవశ లైరి.

 

 

 

 

తే.గీ.

నీదు మెయిఁ గాంచి ఖేచరీ నిచయ మింక

ఖగ మృగ పశు నికాయముఁ గాననమ్ము

పదము లంటఁగ ధన్యతఁ బడసె నంచు

గౌరవించిరి నిశ్శంకఁ గాంత లెల్ల

7.     

 

 

 

 

నీ శరీరము గాంచి ఖేచరకాంతలు, మృగములు పక్షులు పశువులు నీ పాదముల నంటి యడవియు ధన్యత బడసినవి యని నిన్ను కాంత లెల్లరు గౌరవించిరి.

 

 

 

 

తే.గీ.

మురళి గ్రోల మిగిలిన యధర సుధా ర

సమ్ము నైన నక్కట నొక్క సారి గ్రోలు

టయు దురాశ యనఁగ దూర మయినది మన

కని పలుమఱు వేఁగిరి వల్ల వాబ్జ ముఖులు

8.     

 

 

 

 

ఆ గోపికలు మురళి త్రాగఁగా మిగిలిన నీ యధర సుధ నైన నొక్కసారి కూడ గ్రోలుట తమకు దురాశ యైన దని పలుమార్లు కలఁత సెందిరి.

 

 

 

 

తే.గీ.

అవ్విధి ననంగుని యనుగ్రహమ్మున వశ

లైరి నీకు వశలు రాగ మలర భృశము

దేవ! నిత్యము మూఢత యావహించె

వారి కన్య కార్యమ్ముల వారి జాక్ష!

9.     

 

 

 

 

దేవా యా విధముగా ననురాగము మీఱ గోపికలు నీకు మిక్కిలి  వశ లైరి.  ఇది యా మన్మథుని యనుగ్రహమే. నిత్యము వారికి నితరము లైన పనులపై నాశ సన్నగిల్లినది.

 

 

 

 

తే.గీ.

పుట్టు ననురాగము స్వభావమునఁ జెలంగి

యత్నమునను సందేహమ యగును ముక్తి

వా రొకట రెండు వడసిరి భాగ్య మబ్బ

వాయు పురనాథ నన్ను గాపాడు మయ్య

10.  

 

 

 

 

స్వభావ సిద్ధముగఁ బ్రేమ పుట్టును. ప్రయత్నమునఁ గూడ ముక్తి యనుమానమే. వారి భాగ్య మనంగ నా రెండును వా రొక్కటనే పొందిరి. గురువాయూరు నాథా నన్ను గాపాడుము.

 

 

 

ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయమున నేఁబది తొమ్మిదవ దశకము. 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము

(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము)

దశమ స్కంధ పరిచ్ఛేదము

దశకము 60.

గోపీ వస్త్రాపహరణ వర్ణనము. 

 

 

తే.గీ.

అంగజ పరి తప్తాత్మ లహ రహము భవ

దంఘ్రి తామరసద్వయ దాస్య కాంక్ష

నద్రిజ కిసుక బొమ్మకు యమున యొడ్డు

నందు గోపిక లొనరింతు రర్చనఁ దమి

1.      

 

 

 

 

గోపికలు కాముని తాపమున కలసి దినదినము నీ పాద పద్మ యుగమునకు దాస్యము సేయు భాగ్యము నందలి కోరికతో యమున యొడ్డున పార్వతి రూపమున  నిసుక బొమ్మను జేసి భక్తిఁ  బూజింతురు.  

 

 

 

 

తే.గీ.

నిన్ను భర్తగాఁ బడయంగ నెలఁత లబ్జ

నేత్ర లుదయమ్ము కాళింది నాత్ర మడరఁ

జేరి మ్రొక్కు లర్పించిరి మూరి వా ర

నేకములు నీదు కథల వహించి రతిని

2.     

 

 

 

 

దేవా నిన్ను భర్తగాఁ బొంద గోరి పద్మనేత్ర లుదయమునఁ గాళిందీ నది సేరి నీ కథ లనురక్తితోఁ దలంచుచు మ్రొక్కు లర్పించిరి. 

 

 

 

 

ఆ.వె.

పూర్తి కాఁగ వ్రతము ముప్పది దినముల

సుదతుల దయఁ జూడ మదినిఁ దలఁచి

కరుణఁ గదలి యమునఁ దరలాక్షులను గాంచఁ  

జిద్విలాస మురిసి చేరి తయ్య

3.     

 

 

 

 

అట్లు ముప్పది దినముల వ్రతము పూర్తి కాఁగ వారినిఁ గరుణింప మది నెంచి యమునా నదికి నా తరళాక్షులను గాంచ నో చిద్విలాసా సంతసమునఁ జేరితివి.

 

 

 

 

కం.

యమునా తటిని విడిచి వ

స్త్రములు జలక మాడఁ దొడఁగ రమణులు వ్రత మం

తము కాగన్ సిగ్గు పడిరి

యమునా తటి గొల్ల భామ లారసి నిన్నున్

4.     

 

 

 

 

వ్రతాంతమున యమున యొడ్డున బట్ట లుంచి రమణులు స్నాన మాచరింపఁ దొఁడఁగ నంత దేవా ని న్నచ్చట సూచి సిగ్గుపడిరి. 

 

 

 

 

కం.

అవనత లజ్జాన్విత ముఖ

ధవలాక్షులు నిల్వ నీటఁ ద్వరితమ్ముగ నీ

వు వసన జాలము కొని భూ

జ విటప మెక్కి నిలిచితివి జలజద ళాక్షా

5.     

 

 

 

 

సిగ్గుతోఁ దలలు వంచుకొన్న వారై నీటిలో నుండఁగ నా వనితలు నీవు త్వరితముగ వారి వస్త్రము లన్నిటిని గ్రహించి వనజాక్షా యచ్చటి చెట్టు కొమ్మ నెక్కితివి.

 

 

 

 

కం.

సునయన లారా రండిఁకఁ

గొనుండు మీ మీ వలువలు కోమలు లారా

యని పలుక నగుచు నీ వా

వనితా రత్నములు పడిరి భ్రమలో నంతన్

6.     

 

 

 

 

అంత నీవు నవ్వుచు నో సుదతు లారా వచ్చి మీ మీ బట్టలు గొనుఁ డని పలుకఁగా వారు సంశయ భ్రాంతిలో బడిరి.

 

 

 

 

కం.

అల మనుము చిరము బాలక

కలతం బెట్టంగ నేలఁ గన్నా వసన

మ్ముల నిమ్మంబుజ నయనా

వలదీ జా గన నొసఁగితి పన్నుగ స్మితమున్

7.     

 

 

 

 

అంత వా రో బాలక చిరకాలము జీవించుము మమ్ము కష్ట పెట్టక మా వస్త్రముల నిమ్ము. ఇంక నీ వాలస్యము సేయకు మనిన నీవొక్క నవ్వు నిచ్చితివి.

 

 

 

 

కం.

చేతులు మోడ్చి విశుద్ధపుఁ

జేతస్సుల నీ పయి నిడి చిత్తమ్ములు వా

రా తటి నెక్కి యడుగఁగాఁ

బోతములు వరముల తోడ మూరి యొసఁగితే

8.     

 

 

 

 

శుద్ధ మైన మనస్సులతోఁ జేతులు మోడ్చి నీ పైఁ జిత్తము నుంచి వా రా యొడ్డునకు వచ్చి వేడు కొన వస్త్రములతోఁ బాటు వరములను గూడ నొసంగితివి.  

 

 

 

 

కం.

తెలిసిన విఁక మీ కోర్కులు

లలనామణు లార మీ రరసెదరు యమునా

తలమున వెన్నెల పన్నుగ

నలర నిసిని నాఁ బలికితి వంబుజ నాభా

9.     

 

 

 

 

ఓ లలన లారా మీ కోర్కుల నెఱింగితిని వెన్నెల విరియు చుండ యమునా తటిని రాత్రి మీరు వాని నరసెద రని పద్మాక్షా పలికితివి. 

 

 

 

 

కం.

విని యా మధు రస కలిత వ

చనములు నీ నోట మదగజ గమనలు ముద

మ్మున మఱిమఱి సూచుచు వల

పున నిను మెల్లగను ధామముల కేఁగి రిఁకన్

10.  

 

 

 

 

తేనె వంటి నా పలుకలను నీ నోట  విని సంతోషముతో నా మదగజ గమనలు నిన్ను దిరిగి తిరిగి చూచుచు మెల్లగ వారి వారి యిండ్లకు నేఁగిరి.

 

 

 

 

తే.గీ.

వల్లవీ కాంత లెల్లరఁ జల్లఁగఁ గరు

ణించి యిట్లు వనమ్ముల సంచరించు

చును యథావిధి నుంటివి చూచి చల్ల

ని కరుణామయ! బాధలు నెమ్మిఁ బాపు

11.   

 

 

 

 

ఆ గోపికలను జల్లఁగఁ గరుణించి యట్లు వనములో సంచరించుచు యథావిధి నుంటివి. ఓ కరుణా మయా మా బాధల నరసి పాపుము.

 

 

 

ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయమున నఱువదవ దశకము. 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము

(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము)

దశమ స్కంధ పరిచ్ఛేదము

దశకము 61.

యజ్వపత్న్యుద్ధరణ వర్ణనము. 

 

 

కం.

వనమున కొక తఱి బృందా

వనమున కతి దూర మేఁగి వ్రజ గోగణముల్

దనర ద్విజాంగనల గమిని

ననుగ్రహింపఁ దలఁచితి మహా భక్తాలిన్

1.      

 

 

 

 

దేవా యొక దినము బృందావనమునకు దూరముగఁ జని గోవులు గోపులు నలరు చుండంగ నక్కడి బ్రాహ్మణ వనితల గుంపు నీ భక్త సమూహమును గరుణింప నెంచితివి.

 

 

 

 

తే.గీ.

అగృహ విపి నాంతరమున గోపార్భకులను

గాంచి యాఁకలి దప్పులఁ గలఁతఁ జెంద

వారిఁ బంపితి వచ్చోట జేరు వందు

యాగ మొనరించు విప్రుల నన్న మడుగ

2.     

 

 

 

 

ఇల్లులు లేని యా యడవిలో గొల్ల పిల్ల లాకలితో నలమటించుటను గాంచి యక్కడ యాగమును జేయుచున్న విప్రుల నన్నము నడిగి రండని వారిని బంపితివి.

 

 

 

 

తే.గీ.

ఏఁగి గోపబాలకు లన్న మింత యడుగ

నీదు పే రెలమి నుడివి నీరజాక్ష

వినియు వేదజ్ఞు లక్కట వినని రీతి

నుండిరి పలుక రైరి ద్విజోత్తము లట

3.     

 

 

 

 

నీరజాక్షా యా పిల్ల లేఁగి నీ వడిగితి వని వారల నన్నము నడుగఁగా నా వేదజ్ఞులు వినియు వినని యట్లుండి బ్రాహ్మణోత్తములు పలుకరైరి.

 

 

 

 

ఆ.వె.

అట్లనాద రార్ది తాత్మ గోపాలార్భ

కులు వెను దిరిగి రులుకునఁ గన నది

యుక్త మెట్లనంగ భక్తి విహీన య

జ్వ లిడుదురె యశనము తలఁప నిజము

4.     

 

 

 

 

అట్లనాదరమున కలఁత సెంది గోప బాలురు తాపమున వెనుదిరిగిరి. కాంచఁగ నయ్యది యుక్తమే. ఏ లనిన భక్తి లేని యాజ్ఞికులు నిజ మెంచ నన్నము నిత్తురే?

 

 

 

 

తే.గీ.

తెలుపుఁ డే నడిగిన యట్లు నల గృహిణుల

కేఁగి దయ నన్న మీగల రెలమి యనఁగ

మందహాస మలర విని యంద ఱపుడు

దారకులు దారల నడిగి రారగింత

5.     

 

 

 

 

అంత నే నడిగి నట్లు వారి భార్యల నడుగుఁడు వా రీయఁ గల రని నవ్వుచు బాలకులను దేవా పంపితివి. అప్పుడు వా రేఁగి భార్యల నన్నము నడిగిరి.

 

 

 

 

చం.

మనసుల నింపి నీ యభిధ మానిను లంతట సంభ్రమమ్మునన్

మునుకొని భక్ష్య భోజ్యములు మూరఁగ నింపుగ నాల్గు రీతులం

గని తము నడ్డగించినను గాదని త్రోసి స్వకీయు లందఱిం

గన నిను వచ్చి రచ్చటకుఁ గన్నులు నిత్యము కాయ కాయలే

6.     

 

 

 

 

 

మనస్సు లందు నీ పేరు నిలిపి సంభ్రమముగ నుద్యమించి భక్ష్య భోజ్యాది నాల్గు రకములను దీసి కొని యడ్డగించెడు తమ వారి నందఱినిఁ గాదని నిన్ను జూచుటకు వచ్చిరి. దేవా వారికి నిరతము నిన్ను జూడ వలె నన్న తపనతోఁ గన్నులు కాయలు కాచినవి.

 

 

 

 

కం.

శిరమునఁ పింఛము కదలఁ జి

కురములు చెక్కిళులు దూఁగు గుండలములతోఁ

గరము మెఱయంగ నిను నీ

కర ముండగ సఖు భుజమునఁ గాంచిరి ముగుదల్

7.     

 

 

 

 

వచ్చి తలపై పించము, ముంగురులు గదలాడ, చెక్కిళ్లు నూగు చుండు కుండలములతో  మెఱయుచుండ నొక చేయి నీ సఖుని భుజముపై నుంచి నిల్చిన నిన్ను ముని పత్నులు సూచిరి.  

 

 

 

 

తే.గీ.

ఒకత యంతట నిను జేర నుత్సహింప

ధవుఁడు ఋత్విజుఁ డాపఁగఁ దరుణి తలఁప

నిజ మనమ్మున నిన్నిఁక నెమ్మి భక్తి

సుకృత మౌర కైవల్యమ్ముఁ జోద్య మందె

8.     

 

 

 

 

నిన్ను జేరు నుత్సామున జను తఱి నొకతె భర్త ఋత్విజుఁ డాపగాఁ దన మనమ్మున నిన్నే భక్తితోఁ దలంప నామె  కైవల్యమును బొందెను. ఆహా యేమి సుకృతము!

 

 

 

 

తే.గీ.

భోజనమ్ములఁ గైకొని ముదితల దయ

వెస ననుగ్రహించి రతినిన్వీడ నొల్ల

కున్న నధ్వరుల కొఱకుఁ గన్న యనిపి

తయ్య వా రాదరించిరి యా సుదతుల

9.     

 

 

 

 

కన్నా యా భోజనములను స్వీకరించి ముని పత్నుల ననుగ్రహించితివి. వారు నిన్ను నీ యందలి ప్రేమతో నిన్ను వీడ నొల్ల కున్న నయ్యాగ కర్తల కొఱకు వారినిఁ బంపితివి. వారి భర్తలు కూడా వారి నాదరించిరి. 

 

 

 

 

తే.గీ.

ఎఱిఁగి నిజదోషములు మది నెఱిఁగి దార

లందుఁ జెలఁగు భక్తిఁ దిరిగి యార్య జనులు

తత్త్వ మెఱిఁగి నుతించిరి తమిని నిన్ను

రోగములఁ బాపుమ దయ మరుత్పురేశ!

10.  

 

 

 

 

ఆ మునులు తమ దోషముల నెఱిఁగి తమ భార్యల భక్తి తత్పరత నెఱిఁగి నీ తత్త్వమును గ్రహించి ప్రీతితో నిన్ను మిక్కిలి నుతించిరి. ఓ గురువాయూరు నాథా నా రోగములను బాపుము.

 

 

 

 

ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయమున నఱువది యొకటవ దశకము. 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము

(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము)

దశమ స్కంధ పరిచ్ఛేదము

దశకము 62.

ఇంద్రయాగ విఘాత వర్ణనము. 

 

 

చం.

 

ఒకపరి గోగ ణావన జనోత్తము లెల్లరు సేయ నధ్వర

మ్మొకటి పదార్థ సంచయము నొప్పుగఁ గూర్పఁగఁ గాంచి శౌరి! తం

డ్రి కడకు నేఁగి యింద్రునకు రేఁగిన దర్ప మడంప నెంచి నీ

వకట యెఱింగి కూడ యిది యంతయు నేమిటి కంచు నంటివే

1.      

 

 

 

 

ఒకసారి గోపాలకు లందఱు యజ్ఞము నొకటి సేయ నెంచి సంభారముల నొడఁగూర్పఁగా దేవా నీవు దాని నెఱింగియు నింద్రుని గర్వ మణఁప నెంచి తండ్రి కడ కేఁగి యిది యంతయు దేని కని జనకుని నడిగితివి.

 

 

 

 

ఉ.

ఇంద్ర మఖమ్ము సేయఁ దగు నింపుగఁ బుత్ర యతం డొసంగు దే

వేంద్రుఁడు వర్ష వర్షముల నిద్ధర వర్షము మాన వాళికిన్

మంద్ర ఘన ప్రదత్త వన మండల జీవులు లోకు లెల్ల ఘో

షేంద్రము మీదు మిక్కిలిఁ దృ ణేద్ధ జ లార్తమ నందుఁ డిట్లనెన్

2.     

 

 

 

 

కుమారా యింద్రునికై యాగము సేయ వలెను. అప్పు డింద్రుఁడు ప్రతి సంవత్సరము వర్షముల నొసఁగును. గంభీరమైన మేఘములచే నీయఁ బడిన నీటి సమూహమున నాధార పడిన వార లీ లోకు లెల్లరు. మీదు మిక్కిలి మన మంద గడ్డికి నీటికై తపించునదియే. ఇట్లు నందుఁడు చెప్పెను.

 

 

 

 

తే.గీ.

అప్పలుకు లాలకించి సత్య మకట యది

కా దని సహేతు వంటివి కాంచ జీవ

రాశుల యదృష్టము లిడు వర్షమ్ముల నిల

నివ్వన తరు లే మొసఁగె నా యింద్రునకును

3.     

 

 

 

 

ఆ పల్కులను విని యది సత్యము కాదని కారణములతో నీవు పల్కితివి. జీవ రాశుల మున్ను చేసిన యదృష్టములే వర్షముల నొసఁగును. ఈ యడవిలోని వృక్షము లింద్రున కేమి యిచ్చినవి యని ప్రశ్నించితివి.

 

 

 

 

తే.గీ.

మనము మన పశువులు కుల ధనము సత్య

మరయ గిరి నిమిత్తమ శైల వరున కీయఁ

బూజ లుచితమ్ము సురలు సుపూజ్యు లయ్యు

భూసురేంద్రు లారాధ్యులే పుడమి నంటి

4.     

 

 

 

 

మనము, మన పశువులు, మన జాతి ధనము కూడా యీ కొండ వలననే కదా. ఈ కొండకుఁ బూజ సేయ నుచితము. దేవతలు పూజ్యు లైనను భూసురులును బుడమిలో మనకు మిక్కిలి యారాధ్యులే. అని దేవా నీ వంటివి.

 

 

 

 

ఉ.

నా విని నీదు పల్కులను నందుఁడు మున్నగు గోప ముఖ్యులున్

వే విన యాన తాంగులయి విప్రుల కర్చ లొనర్చి దానముల్

వావిరి యిచ్చి యద్రికినిఁ బన్నుగఁ జేయఁ బ్రదక్షిణమ్ములన్

నీ వవి యారగించితివి నెమ్మి నగాత్మగ వారి సన్నిధిన్

5.     

 

 

 

 

ఆ పల్కులు విని నందుఁడు మున్నగు గోపకులు వినయమ్ముగ బ్రాహ్మణులకుఁ బూజ లొనర్చి యా కొండకుఁ బ్రప్రదక్షిణములు సేసి నైవేద్య దానములు విరివిగ నిచ్చిరి. కొండ కాత్మగ నీవు వారి సమక్షమున నవి యారగించితివి.

 

 

 

 

తే.గీ.

అంతఁ జూడుఁడు నగమ స్వయముగ నార

గించె నిడిన వనృతములే గిరలు నావి

కొండ కావ నోపు నలుగఁ గొండ గొంగ

నెల్లర నన మురిసిరి వారెల్ల రపుడు

6.     

 

 

 

 

అంత నీ కొండయే స్వయముగా నారగించినది చూచితిరా నా మాట లసత్యములు కావనియు నింద్రుఁ డలిగినచో నీ కొండ మనలను గాపాడు ననియు నీవు పలుక వారెల్లరు సంతసించిరి.  

 

 

 

 

తే.గీ.

అంత వారు మంద కరుగ నలరి యాగ

మాగఁగ రజో గుణాక్రమి తాత్మఁ గినిసె

నింద్రుఁ డెఱిఁగియు నిన్ను దన్నింతగాఁ బ

దోన్నతునిఁ జేసి తీవనియు మద మూని

7.     

 

 

 

 

అంత వారెల్లరు మందకుఁ జేరిరి. తనకు చేయు యాగ మాగఁగా నింద్రుఁడు రజోగుణము మనస్సు నిండఁగ నీ వలననే తా నున్నత పదవినిఁ బొందెనని తెలిసియు నిన్నెఱింగియు గర్వము మీఱఁ గోపించెను

 

 

 

 

తే.గీ.

మద ఖని మఘవుండు నగారి మానుషత్వ

మూని యమ రావినయము నీ వూని తంచు

మూర్ఖ గోపాలుఁడ వని విముఖ సురాళి

వనుచు సంపదను నశింప నకట వచ్చె

8.     

 

 

 

 

గర్వపు నిధియైన నగరిపు వింద్రుఁడు నీవు మనుష్య రూపమున దేవతలకు వినయుఁడవు గాక మూర్ఖపు గొల్ల వాఁడ వని సుర శత్రు వనియు నెంచి నీ సంపదను నశింపఁ జేయుటకు వచ్చెను.

 

 

 

 

తే.గీ.

ప్రళయ కాల మేఘమ్ములఁ బఱచె భూ ది

వమ్ములను మంద మునుగంగ వాయ్వనల గ

ణాదులను గూడి సకులిశ మయ్యి భేంద్ర

మెక్కి హరి నీకు మోహితు లెవరు కారు

9.     

 

 

 

 

ప్రళయ కాలపు మేఘములను మందలో భూమ్యాకాశములు నిండ సృజించి యగ్నివాయువు మున్నగు వారితో వజ్రమును ధరించి యైరావతము నెక్కి దేవేంద్రుఁడు వచ్చెను. దేవా నీకు మోహితులు కాని వారు కలరా?

 

 

 

 

తే.గీ.

అలిగిన సురేశుఁ డభయము నవని సురులు

శైల రాజము కరుణ నొసంగఁ జాలు

దు రని నమ్మించి తెల్లర హరి నరయఁగ

వేచు ననిల పురప పాపు వేదనలను

10.  

 

 

 

 

ఇంద్రుఁ డలిగిన మనకు భూసురులు నీ కొండయు నభయము నొసంగుదు రని యెల్లరను నీవు  నమ్మించితివి. ఇంద్రుని రాకకై వేచు దేవా గురువాయూరు నాథా నా వేదనల నాపుము.

 

 

 

 

ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయమున నఱువది రెండవ దశకము. 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము

(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము)

దశమ స్కంధ పరిచ్ఛేదము

దశకము 63.

గోవర్ధనోద్ధరణ వర్ణనము. 

 

 

తే.గీ.

తత్క్షణమ్మ నిరంతర స్థనిత జృంభి

త ఘన కంపిత దిక్త టోదక ధరమ్ము

లు భవదంగ వర్ణ నిభములు వ్రజ పుర వ

రోపరిఁ గనంబడెను నీకు నుద్ధృతముగ

1.      

 

 

 

 

తత్క్షణము గొల్లపల్లె పైన నీ వర్ణమున నలరు మేఘములు దిక్కులు కంపింప నిరంతరముగా ఘోషించుచు విజృంభించుచు దేవా నీకుఁ గనిపించినవి. 

 

 

 

 

ఆ.వె.

కుపిత మఘవ కృతము ఘోరాశ్మ యుత వర్ష

ధార కురియ గోప తనయ దిశలఁ

బాహి పాహి యను రవము లార్తములు విని

యంటివి భయము వల దనుచుఁ గృష్ణ

2.     

 

 

 

 

కోపించిన యింద్రుని సేఁత వలన వడగండ్లతోఁ గూడిన వర్ష ధార కురియగా గోపబాలు రున్న దిశల నుండి కావు కావు మనుచు ఆర్తరావములు  రా విని కృష్ణా భయము వల దంటివి. 

 

 

 

 

తే.గీ.

పరఁగఁ గుల దేవత యయి గోవర్ధన గిరి

గోత్ర శత్రువు దాడి యీ కొండ యాప

సంశయమె యని మందహాసమ్మున గిరి

నెత్తితి మొదలంట నిరు కై నత్తఱి వడి

3.     

 

 

 

 

కులదేవతగా నలరారు నీ గోవర్ధన పర్వతము కొండకు శత్రువైన యింద్రుని దాడిని నాపు ననంగ ననుమాన మేల యని నీవు నీ రెండు చిన్ని చేతులతో నా కొండను మొదలుతో సహితము వేగమ యెత్తితివి. 

 

 

 

 

ఉ.

అవ్విధి నెత్తి యద్రి నొకహస్త సరోజము నందు నుంచఁగా

నవ్వన మాగె దవ్వుల న గాధర సైకత మందు నంత నే

నొవ్వులు లేక గోపక జనుల్ మఱి ధేను గణమ్ము వస్తువుల్

రివ్వున నిల్వ నిచ్చితివి లీలఁగ రక్షణ మంబుజేక్షణా

4.     

 

 

 

 

ఆ విధముగాఁ గొండ నెత్తి యొక్క చేతిలో నుంచఁగా నా నీరు దూరము వఱకు నాగినది. ఆ కొండ క్రింద యిసుక నేల మీద యే బాధలు లేక యాల మందను, గోపక జనమును సమస్త వస్తువులతో రివ్వున నిల్పితివి. అట్లు నీరజాక్షా వానికిఁ జక్కని రక్షణ మిచ్చితివి.

 

 

 

 

కం.

కరమునఁ దాల్చి గిరి వరముఁ

దరుణులు మిత్రులు సకేళిఁ దనరన్ గిరలన్

దరిఁ జేరిన గోవులఁ బర

కరమున లాలింప గోపక గణం బలరెన్

5.     

 

 

 

 

ఒక చేతితో గిరిని దాల్చి మిత్రులు వనితలు నాట చందమున మాటలతో  నిలువఁ, జెంతకుఁ జేరిన యావుల నింకొక చేతితో నిమురు చుండ నాబాల గోపాలము నలరినది.

 

 

 

 

కం.

నిను గన్న గోపకులె యి

ట్లని రీ యున్నత గిరీంద్ర మాహా వింతన్

నన వోలు నెడమ చిఱు కే

లునఁ జిర ముండెను మహిమ నలోలం బగుచున్

6.     

 

 

 

 

నిన్ను జూచిన గోపకు లాశ్చర్యముతో నాహా యీ పెద్ద కొండ యొక పువ్వు వంటి నీ యెడమ చేతిలో  జిర కాల ముండెను గదా చలింపక మహిమతో నని  పల్కిరి.

 

 

 

 

కం.

చిన్ని బుడతండు నొవ్వఁగఁ

గ్రన్నన దించు గిరి నంచు గర్వం బడరన్

నిన్నెన్నక హరి వానను

మిన్నఁగ సత దినము లకట మేదినిఁ గురిసెన్

7.     

 

 

 

 

చిన్న పిల్ల వాఁడు చేయి నొచ్చిన గ్రక్కున గొండను దించు నని యెంచి గర్వముతో నిన్ను గణింపక యింద్రుఁడు వాన నా భూమిపై నేడు దినము లక్కట కురిపించెను.

 

 

 

 

కం.

ఒక్క యడు గేని కదలక

యుక్కున నున్న నిను గాంచి యుదకం బింకం

జిక్కఁగ మబ్బులు గాలికి

వెక్కస మగు శంకను బలభేదియె పాఱెన్

8.     

 

 

 

 

ఒక్క యడుగు కూడ కదలక దృఢముగా నున్న నిన్ను జూచి మబ్బులు గాలికి చిక్కఁగా జలము  లింకఁగ మిక్కిలి శంకతో నింద్రుఁడు పాఱెను.

 

 

 

 

కం.

ఆఁగఁగ వర్షం బెల్లయు

నా గో గోపక గణమ్ము హర్షం బడరన్

వేగమ వెడలఁగ బయటకు

నా గిరి దింప నిను జేసి రాలింగనముల్

9.     

 

 

 

 

వర్ష మెల్లయు నాఁగి నంతనె సంతసమున గోవులు గోప గోపికా గణములు వేగముగ బయటకు వెడలఁగ నీ వా గిరిని దించితివి. అప్పుడు వా రెల్లరు నిన్ను జేరి కౌగిలించుకొనిరి.

 

 

 

 

తే.గీ.

భూమి నెత్తితివే మున్ను భూధర మన

నెంత నీ కని పొగడిరి యంత సురలు

నిన్ను గమలాపతి దివిని నిల్చి యట్టి

వాయు పుర వరాధిప నాదు వ్యాధు లాపు

10.  

 

 

 

 

భూమినే యెత్తితివి యీ కొండ యన నెంత నీ కని దేవత లాకసమున నుండి కమలాపతీ నిన్ను బొగిడిరి. అట్టి గురువాయూరు నాథా నా వ్యాధుల నాపుము.

 

 

 

ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయమున నఱువది మూడవ దశకము. 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము

(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము)

దశమ స్కంధ పరిచ్ఛేదము

దశకము 64.

గోవిందాభిషేకము నందానయనముల వర్ణనము. 

 

 

తే.గీ.

అరసి గోవర్ధ నోద్ధర ణాది మహిమ

తతులు విశ్వేశ్వరునిగను దలఁచి నిన్ను

బల్మఱు లడిగి రా నందు భవ దనుపమ

జాతకమును గోపాలురు సంతసమున

  1.  

 

 

 

 

గోపకు లెల్లరు గోవర్ధన పర్వతము నెత్తుట మొదలగు నీ మహిమలను గాంచి నిన్ను విశ్వపతిగ నెంచి నీ యసమాన జాతక చక్రమును బలుమార్లు నందుని నడిగిరి.

 

 

 

 

కం.

నుడువఁగ గర్గోదిత గిర

లడరి జనకుఁడు దనవారి కానందమునం

గడు దొడ్డ నీ మహిమ ను

గ్గుడు వారి కిఁక ననురక్తి గొండం తయ్యెన్

  1.  

 

 

 

 

అంత నందుఁడు సంతసమున గర్గుఁడు తనకు చెప్పిన మాటలను నీ మహిమమును వారికిఁ జెప్ప నవి వినిన వారికి దేవా నీ పై గౌరవము, ప్రేమ మిక్కిలి యధిక మైనవి.

 

 

 

 

ఆ.వె.

కడు వడి నవమానితుఁ డయి యింద్రుఁడు తత్త్వ

మెఱిఁగి దివ్య గో సహితము సేరి

యెలమి నిన్ను గర్వ మెడలఁ బొగిడె మణి

మౌళి నీదు పద సుమమ్ము దాఁక

  1.  

 

 

 

 

ఇంద్రుఁడ ట్లవమానము వొందిన వాఁడై నీ యొక్క తత్త్వము నెఱింగి కామధేనువుతోఁ గూడి నిన్ను జేరి మణులతో నలరు తన శిరమును నీ పాద పద్మములను దాఁకగఁ జేసి గర్వము నెల్ల వీడి నిన్ను బొగిడెను.

 

 

 

 

తే.గీ.

స్నేహమున సురభి పయో౽భిషేక మలరి

చేసె గోవింద నామము సెలఁగ నీకు

దివ్య గంగా జలమ్మును దెల్ల గౌరు

తే నభిషవ మొనర్చెఁ బ్రీతి సురపతియు

  1.  

 

 

 

 

ప్రేమతోఁ గామధేనువు తన పాలతో నీ కభిషేకము సేయఁగా నీవు గోవిందుఁ డను పేరున ఖ్యాతి కెక్కితివి. తెల్ల యేనుఁ గా యైరావతము సుర గంగా జలమును దీసికొని రాఁగ నింద్రుఁడు కూడా నీ కభిషేకము సేసెను.

 

 

 

 

తే.గీ.

వ్రజమున నభిషిక్తునిఁ జేయ వ్రజ గణేశ

త్రిజగదీశ నిన్ను గలిగె దివ వికుంఠ

పదము లందు నరయని సంపదలు దనర

నీదు మహిమ గోకులమున నీరజాక్ష

  1.  

 

 

 

 

మందలో నీకు నభిషేకము సేయ గోపాల విభూ త్రిలోకనాయకా స్వర్గము వైకుంఠములలో లేని సంపదలు మందలో నీ మహాత్వమునఁ గలిగినవి. 

 

 

 

 

కం.

నందుఁ డొక దినమ్ము యమున

యందు మునుఁగ వరుణదేవు ననుయోజ్యుండే

నందుఁ గొని పోవ నేఁగితి

కంది జనకుఁ దే నచటికిఁ గారణ జన్మా

  1.  

 

 

 

 

ఒక దినము నందుఁడు యమునలో స్నానము సేయుచుండ వరుణుని సేవకుఁ డొకఁ డతనినిఁ దీసికొని పోయెను.  జనకునిఁ దిరిగి తెచ్చుటకు కారణజన్ముఁడా నీ వచటకు నేఁగితివి.

 

 

 

 

తే.గీ.

వరుణ పుర మేఁగ నీవు సంభ్రమము నంది

వరుణ దేవుఁడు పూజించి వప్త నొసఁగఁ

దెచ్చి తీ వింటి కా కథఁ దెల్లముగను

నుడివెఁ దనవారి కెల్ల నందుఁ డలరి మది

  1.  

 

 

 

 

వరుణ పురము సేర నిన్ను గని వరుణుఁడు సంభ్రమమున వచ్చి నిన్ను బూజించి నీ జనకుని నొసఁగెను. తండ్రితోఁ గూడి నీవు తిరిగి వచ్చితివి. అప్పుడు నందుఁ డా కథ నంతయుఁ దన వారికి ముదముగా నుడివెను.

 

 

 

 

తే.గీ.

నిశ్చయించి నీవ హరి వని మదిఁ గోర

నీదు పద వీక్షణ మెఱిఁగి నీవు వారి

తృష్ణ నన్య దుర్లభ మైన దివ్య పదము

చూపి తీవు వారికి దయ నో పరాత్మ

  1.  

 

 

 

 

నిన్ను విష్ణువుగా నిశ్చయించి నీ దర్శనమును గోపకులు కోర దుర్లభమైన నీ పదమును వారి తృష్ణ నెఱిఁగి పరమాత్మా దయతోఁ జూపితివి.

 

 

 

 

ఆ.వె.

ముద్రసామృత ప్రపూర్ణ కైవల్యాబ్ధి

మునుఁగ గోపులు చిరము గని యంతఁ

దిరిగి నీవ తేల్చితివి వారి నెల్లర

సదయ లోక స్పృహ నొసంగి దేవ

  1.  

 

 

 

 

హర్ష రసామృతముతో నిండిన కేవలత్వ మను సముద్రమున గోపు లెల్లరు మునిఁగి యుండ పెద్ద తడవు సూచి వారినిఁ దిరిగి దయతో నీ లోక స్పృహ కలిగించి తేర్చితివి. 

 

 

 

 

తే.గీ.

చేత రేఁగుపం డనఁగ నీ రీతి నిజ ప

దము నవాప్యమును నిజ భక్త జన తతికి

నే యవతరణమునఁ జూపి తీవు గోప

బాధలను బాపు మయ్య పవన పురేశ

  1.  

 

 

 

 

చేతిలో రేఁగు పండు వోలె నీ ధామమును బొంద నలవి కాని దానిని నీ భక్తులకు నిది గాక యింక నే యవతారము నందుఁ జూపించితివి. అట్టి యో గురువాయూరు నాథా నా బాధలను బాపుము.

 

 

 

ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయమున నఱువది నాలుగవ దశకము. 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము

(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము)

దశమ స్కంధ పరిచ్ఛేదము

దశకము 65.

రాస క్రీడా గోపీ సమాగమన వర్ణనము. 

 

 

కం.

చెల్లింప వ్రతాంత మిడిన

వల్లవులకు భావ జోత్సవపు శపథమ్ముం

జల్లని వెన్నెల వేళల

నుల్ల మలర నర్కజ దరి నూదితి మురళిన్

1.      

 

 

 

 

వ్రతము పూర్తి యైన దినమున గోపికల కిచ్చిన మన్మథోత్సవంపు మాట చెల్లింప నెంచి  చల్లని వెన్నెల రాత్రి యమున యొడ్డున మన స్సలరంగ మురళిని వాయించితివి. 

 

 

 

 

తే.గీ.

కలిత సప్త స్వర స్వనము లఖిల భువ

నాంతరాళములఁ జెలంగ నంత మధుర

వేణు నాదము విని వల్లవీ మణులు వి

మోహ మందిరి వింతఁగ మోహనాంగ

2.     

 

 

 

 

సప్త స్వరములతోఁ గూడిన మధుర మైన వేణు నాదము దిక్కుల మధ్య చెలఁగ వల్లవ కాంతలు విని మోహనాంగా వారెల్లరు మోహ పరవశ లైరి.  

 

 

 

 

తే.గీ.

నిత్య కర్తవ్య నిజ గేహ కృత్యములను

పుత్ర లాలన నిజకాంత పూజనములు

నలిన లోచన లొల్లక కలఁగి మురళి

నాద మోహిత లయి చేరి రా దవమ్ము

3.     

 

 

 

 

అంత నిత్యకృత్యములు, పిల్లలను లాలించుట, భర్తల సేవించుట మున్నగు పనుల నెల్ల కాంతలు సేయ నొల్లక కలఁత సెంది మురళీ నాదమున కలరి యడవిఁ జేరిరి. 

 

 

 

 

తే.గీ.

అన్నులు తొడవులు తొడుగు చున్న తఱి వి

నంగ రవము నూని సగము చెంగు చెంగు

న నిను జేరఁ బూర్ణ విభూషిత నలి నాక్షు

లకును మించిరి నీ కనులకు సొగసున

4.     

 

 

 

 

బట్టలు ధరించు వేళ నీ నాదము విని యా యన్నుల మిన్నలు సగము తొడిగికొని చెంగు చెంగున నిన్ను జేరిరి. అప్పుడు పూర్ణముగా నలంకరించు కొని నప్పటి కన్న మిన్నఁగ నీ కన్నులకు వారు కనిపించిరి.

 

 

 

 

ఆ.వె.

హార మూనఁగ మొలయం దిఁక మొలనూలు

కంఠ మందు నూని కాంత యొకతె

రాఁగఁ దమక మూని రమణ కన్పడె మొల

సొగసు నీకు చూపు సొంపు దేవ

5.     

 

 

 

 

మొలలో హారమును, మొలనూలు కంఠమున ధరించి యొక కాంత తమకమున రాఁగ నామె నీకుఁ దన మొల యందము చూప నెంచు చందమునఁ గన్పడెను. 

 

 

 

 

తే.గీ.

మఱచి ఱవిక ధరించుట మగువ యొకతె

యింతు లితరులు నక్కట నెఱుఁగ నోప

రధిక రతి నీ దరికిఁ గలశ ధర యనఁగఁ  

దరలె రాజ్యాభిషేచ నార్థమ్మ నాఁగ

6.     

 

 

 

 

ఒక మగువ ఱవిక నూన మఱచినది. ఆ సంగతి నితర యింతులు కూడ గుర్తింపరు. నీ దరికి ప్రేమ రాజ్యాభిషేక మొనర్చుటకు కలశములతో నరుగుదెంచు నట్లనఁగ వచ్చినది. 

 

 

 

 

తే.గీ.

కొంద ఱిండ్లు వెడల లేక కూర్మి నిండ

నిన్న యుంచి డెందమ్మున నీదు హర్ష

మయపు టేక రూపమ్మున మెయులు విడిచి

లీన మైరి ధన్యలు సుమ్ము మానవతులు

7.     

 

 

 

 

కొందఱు తమ యిండ్ల నుండి రాలేక ప్రేమ నిండఁగఁ దమ మనస్సులలో నీ చిదానం దైక రూపమును నిల్పి దేహములు  వీడి నీ లోనే లీన మైరి. ఆ వనితలు ధన్యాత్మలు సుమ్ము.

 

 

 

 

తే.గీ.

పరమ హంస పదము వడసిరి వ్ర జేందు

ముఖులు జారత్వమునఁ గాదు ముగుద లరసి

మదిని పరమాత్మత నితర మతుల సులభ

ముగను బరమాత్మ తను లయము గనఁ గలనె

8.     

 

 

 

 

ఆ గొల్ల పడచులు పరమ పదమును జారత్వముననే పొందిరి. ఆ మగువలు మనస్సు లందు పరమాత్మతను జూచి కాదు. ఇతర బుద్ధుల సులభముగఁ బరమాత్ముని తనువున లయ మగుటఁ కాంచఁ గలనా?

 

 

 

 

తే.గీ.

చేరి చెంత గోపికలు సుస్మిత వదనము

కరుణ నొలుకు నీ ముఖము ప్రకాశితమ్ము

విశ్వహృద్య వీక్షించిరి ప్రీతి నట్టి

పవన పురనాథ వ్యాధులఁ బాపు మయ్య

9.     

 

 

 

 

విశ్వమునకు హృద్య మైన వాఁడా యా గోపికలు మందహాసముతోఁ గరుణను గురియుచు మిక్కిలి ప్రకాశించు  నీ ముఖమును బ్రీతితోఁ జూచిరి. అట్టి యో గురు వాయూరు నాథా నా వ్యాధులను బాపుము.  

 

 

 

ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయమున నఱువది యైదవ దశకము. 

 

 

 

శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము

(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము)

దశమ స్కంధ పరిచ్ఛేదము

దశకము 66.

రాస క్రీడలందు ధర్మోపదేశము మఱియు క్రీడా వర్ణనము. 

 

 

కం.

సుమబాణ బాణ వివశలు

కమనీయ తనూ విలసిత కాంతలు రాఁగన్

సముఖమునకుఁ గోరికలు కృ

త మతివి నెరవేర్ప దాఁచి దాని నని తిటుల్

1.      

 

 

 

 

దేవా నీ సముఖమునకుఁ గామవివశలై యందమైన శరీరము గల యా కాంతలు రాఁగ వారి వైన కోరికలను దీర్ప నిశ్చయించినను దానిఁ గనఁబఱవక యిట్లంటివి.

 

 

 

 

తే.గీ.

గగన  మందు మునులు వినంగఁ బలికితివి

కుల సతీ ధర్మములు ధర్మ్యము లవి జగతి

నాచరింపఁ దగును నిర్మ లాంతరంగ

నీ వచనములు చేష్టలు గావు చుమ్మి

2.     

 

 

 

 

ఆకాశమున నున్న మునులు వినుచుండఁ గులసతుల ధర్మములు విడువ రానివి  జగతిలో నవి యాచరింపఁ దగిన వని పల్కితివి.  నిర్మల మయన మనస్సు గలవాఁడా నీ వచనములను దప్పక యాచరింప వలెను. నీ చేష్టల ననుకరింపఁ దగదు.

 

 

 

 

కం.

విని యప్రియములు దీనలు

వనితా రత్నములు వలదు వలదు దయా సిం

ధు నగధరా మము వదలకు

మని విలపించిరి చిరమ్ము నంగజ వశలై  

3.     

 

 

 

 

అప్రియమైన యా పలుకులు విని దీనముగా నున్న యా కాంతామణులు దయాసాగరా మమ్ము విడువకు విడువకు మని పెద్ద తడవు వారి మనసును దోఁచిన నిన్ను వేఁడుచు విలపించిరి.

 

 

 

 

ఆ.వె.

ఆలకించి వారి యాక్రందనమ్ములు

కరుణ నిండిన మదిఁ గాంతల సహి

తము విహారము స ముదమ్ము సలుప యము

నా తటిఁ దొడఁగితివి నంద తనయ

4.     

 

 

 

 

అంత నంద కుమారా వారి యాక్రందనలు విని దయ నిండిన మనస్సుతోఁ గాంత లెల్లరఁ గూడి యా యమున యొడ్డున సంతోషముగా విహారము సేయ సమకట్టితివి.

 

 

 

 

తే.గీ.

విరియ వెన్నెల వెల్గులు దరులఁ గరము

జమున యిసుక తిన్నెల పయి జవ్వను లటఁ

పఱపఁ బయ్యెదల నలరఁ బఱుపు దాని

పైనఁ గూర్చుంటి వింపుగ భామ లలర

5.     

 

 

 

 

తరు లందు వెన్నెలలు విరియు చుండ యమున యిసుక తిన్నెలపై జవ్వనులు దమ పయ్యెదలు పఱపఁ బఱపు మెఱయ దానిపై నింపుగ భామలు చుట్టు దనరు చుండఁ గూర్చుంటివి.

 

 

 

 

తే.గీ.

మధుర నర్మ భాషణముల మానినీ క

ర గ్రహణ చుంబనమ్ముల రహి చెలంగ

గాఢతర పరిష్వంగ ప్రకటనముల వ్ర

జాంగనల మురిపించితి వబ్జ నయన

6.     

 

 

 

 

మధుర మైన ప్రియంపు భాషణముల గోపికలఁ జేరి కరగ్రహణముల, ముద్దుల, గాఢపు కౌగిలింతల నానందము చెలరేఁగ వారిని మురిపించితివి.

 

 

 

 

ఆ.వె.

చీర లాహరింప వారి కిచ్చిన మాట

దాని తీర్చి తిపుడు తరుణులకు ర

స వివశాత్మలకును జారుతరభ్రూ వి

లసిత సుంద రాస్యలకు ముకుంద

7.     

 

 

 

 

ముకుందా యట్లు వారి చీరల నపహరించి నపుడు వారికి నానంద రసముల మునింగి వివశ లైన వారికి నందమైన కనుబొమల విలాసముతో నలరు వారికి సుందర వదనలకు నిచ్చిన మాటను తీర్చితి విప్పుడు.

 

 

 

 

తే.గీ.

చిఱు చెమట లూర మేనునఁ జిద్విలాస

హాస మొప్ప ముఖాబ్జమ్ము నందు నంద

తనయ నిన్ను ద్రిలోకసుందర వరించి

కౌఁగిలించి హర్షించిరి కాంత లెల్ల

8.     

 

 

 

 

చిఱు చెమటలు వారి మేనులఁ జిందఁ జిద్విలాసపు హర్షము వారి ముఖారవిందములఁ గన్పట్టఁగ నందసుతా త్రిలోక సుందరా నిన్ను వరించి కౌఁగిలించి కాంత లెల్లరు హర్షించిరి.

 

 

 

 

తే.గీ.

విరహ శృంగార మయ చిత్త తరుణుల కక

ట నిజ మంగార మయ మీ వట మఱి నీవ

తలఁపఁ దను రమా మయ మైతి నలిన లోచ

నలకు సంగమమునఁ జిత్ర మిల ముకుంద

9.     

 

 

 

 

విరహము శృంగార మయమైన తరుణులకు దేవా నీవు మండుచున్న బొగ్గు వట! చిత్రముగ నీ సంగమమున కాంతలకు నీవే యాహా దేహ కాంతి మయమును.

 

 

 

 

తే.గీ.

మమత రా ధోరు వక్షస్స్థలమున నొఱగ

నెంచు వనజాక్ష నిను మది నెంచి నిత్య

మర్చన నొనరించెద భక్తి ననిల నగర

నాథ సమయింపఁ జేయుమ నాదు రుజలు

10.  

 

 

 

 

ప్రేమతో రాధ వక్షస్స్థలమున వ్రాల నెంచు వనజాక్షా నిన్ను నిత్యము మదిలోఁ దల్చుచు భక్తితో నర్చన సేయుదును. ఓ గురువాయూరు నాథా నా రోగములను బాపుము.

 

 

 

ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయమున నఱువది యాఱవ దశకము. 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము

(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము)

దశమ స్కంధ పరిచ్ఛేదము

దశకము 67.

రాస క్రీడలందు కృష్ణాదృశ్యము, గోపికాన్వేషణము, పునర్దర్శన వర్ణనము. 

 

 

తే.గీ.

కేవ లానంద రసమయ మీవ నిన్ను

గూడి యానంద కేళి నా కోమలాంగు 

లెల్ల హర్షాబ్ధి మునుఁగ నొకింత గర్వ

మకట పొడచూపె మది నంబుజాక్షులకును

1.      

 

 

 

 

కేవలానంద మయమైన నిన్ను గూడి కోమలాంగు లానంద కేళిలోఁ దేలియాడుచు  నానంద జలధి మునుంగ వారి కొకింత గర్వము వొడచూపెను.

 

 

 

 

తే.గీ.

విశ్వ మోహనుఁడు రమకు నీశ్వరుండు

మరులు గొనియె నాపయి ననుమాన మింత

లేదు లేదని తలఁపంగ లేమ లెల్ల

రట్ల కాంచి గోవింద మాయ మయి తీవు

2.     

 

 

 

 

విశ్వమోహనుఁడు రమాపతియు నైన గోవిందుఁడు నా పైన మరులు గొనెను సందియ మింతయు లేదని వా రెల్లరు తమ తమ మనస్సులలోఁ దలఁచు చుండఁగా నెఱింగి దేవా నీవు మాయ మైతివి.

 

 

 

 

తే.గీ.

రాధ యను గోపకాంత గర్వమ్ము సుంత

చూపకున్న నతిప్రియ సుందరీ మ

ణినిఁ గొని సుదూర మేఁగితి నెమ్మి స్వైర

గతి విహారము సల్పంగఁ గాంత తోడ

3.     

 

 

 

 

రాధ యను గోపకాంత మాత్రము గర్వము లేక యున్న నా ప్రియ మైన సుందరీ మణితోఁ గూడి స్వైర విహారము సేయ సుదూర ప్రాంతమున కేఁగితివి.

 

 

 

 

ఆ.వె.

వెను దిరుగఁగ నీవు వెలఁదులు వేదన

పొంగఁ గరము కలసి పుండరీక

నయన లంత వన వనమ్మున గాలింపఁ

దొడఁగి రేడ్చు చింకఁ దోరముగను

4.     

 

 

 

 

నీ వట్లు వెను దిరుగఁగా వేదనతోఁ గాంత లందఱు బిగ్గరగ నేడ్చుచు వన వనములు వెతకఁ జాగిరి.  

 

 

 

 

కం.

హా చూతమ హా మల్లిక

హా చంపక కర్ణికార హా మాలతి మీ

రా చారు హృదయ చోరునిఁ

జూచిరె విలపించి రిట్లు సుదతులు చింతన్

5.     

 

 

 

 

హా మామిడి మ్రానా, హా మల్లికా హా చంపకా కర్ణికారా మాలతీ మీ రా మానస చోరునిఁ గాంచితిరా యని సుదతు లెల్ల విలపించిరి.

 

 

 

 

తే.గీ.

కట్టెదుట సఖీ కంటిఁ బంకజదళాక్షు

ననుచు నాకులమున వాఁగ నరసి తలఁపుఁ

గన్నుల నొకతె రెట్టింపుగాఁ జెలంగెఁ

జెలువలకుఁ దాప మక్కట నలిననేత్ర

6.     

 

 

 

 

ఓ సఖీ నా కట్టెదుట పంకజాక్షుని జూచితి నని తన భావనలోని కన్నులతోఁ గని వాఁగుచుండ నొకతె నలినాక్షా కాంత లందఱకుఁ దాపము రెట్టిం పైనది.

 

 

 

 

తే.గీ.

తమ్ము నిన్నుగ భావించి తరుణు లంత

నీదు చేఁతల మాటల మోద మంది

యనుకరించి వెతకు చుండఁ గనిరి తటిని

మద మరసి నీవు వీడిన మగువ రాధ

7.     

 

 

 

 

వారు తమను నిన్నుగా భావించి ముదముగ నీ చేష్టలను మాటల ననుకరించుచు వెతకుచుండ నంత నా యొడ్డున సంతసించి నీవు వదలఁగ నొంటరిగ నున్న రాధను గాంచిరి.

 

 

 

 

ఆ.వె.

అంధకార మలము నంతవఱకు నెల్ల

రు కలసి వెతకి తిరిగి కలిసిరి య

మున దరిని గుణములు పొగడుచు వగచుచు

గోపకన్య లరయఁ గోరి నిన్ను

8.     

 

 

 

 

చీకటి యలముకొను నంత వఱకు నందఱు కలిసి నీ గుణములను బొగడుచు వగచుచు నిన్ను గాంచ నెంచి వెతకుచు  దిరిగి యమున యొడ్డునకు వచ్చి యందఱు కలిసిరి.

 

 

 

 

తే.గీ.

విరహ తప్త చిత్తలు వల్లవీమణులకు

నెదుటఁ గన్పించి తీవు జలదనిభాంగ

చిఱునగవులు మెఱయ దయాసింధు త్రుటిని

విశ్వమోహన మోహన విశ్వగర్భ

9.     

 

 

 

 

అంత విశ్వమును మోహింపఁ జేయు మోహనాంగా విశ్వ మంతయు గర్భమున గలవాఁడా దయా సాగరా మేఘము వంటి దేహ వర్ణము గల వాఁడా  త్రుటిలో చిరు నగవులు చిందుచు నా విరహ తప్త లైన గోప కాంతలకు నెదుట నీవు  కనిపించితివి. 

 

 

 

 

తే.గీ.

సంశయము కాఁగ నీదు దర్శనము నిన్ను

గాంచి హర్ష భారమ్మునఁ గాంత లనని

సుద్దు లవి లేవు పొగడని స్తుతులు లేవు

నాదు రుజలు వాపుమ మరున్నగర నాథ

10.  

 

 

 

 

నిన్నిఁకఁ గన లేమో యన్న శంకతో వేఁగు వారికి నీవు కనిపింపఁగాఁ జిత్తము హర్షముతో నిండఁగ వారు నిన్ను పొగడని మాటలు గాని స్తుతులు గాని లేవు. అట్టి యో గురువాయూరు నాథా నా రోగములను బాపుము.

 

 

 

ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయమున నఱువది యేడవ దశకము. 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము

(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము)

దశమ స్కంధ పరిచ్ఛేదము

దశకము 68.

రాసక్రీ డానంద పారవశ్య, ప్రణయ కోప , కృష్ణ కృత సాంత్వన వర్ణనము. 

 

 

కం.

కని నిన్ను గోపికా మణు

లు నలిన లోచనలు కడు నరుదయిన హర్ష

మ్మున మునిఁగి రమృత భాండ

మ్మున నన నిశ్చేష్ట లయిరి ముందు నిలిచినన్

1.      

 

 

 

 

దేవా నీవు వారి ముందు నిలువఁ గని యమృత భాండమున మునింగి నట్లు నా గోపికా మణులు నిశ్చేష్ట లైరి. అరుదైన యట్టి యానందమున మునిఁగిరి.

 

 

 

 

ఆ.వె.

అంత నొక్క కాంత వింత నీ హస్తాబ్జ

మంది శంక లేక తొందర నిజ

ఘన పయోధరముల నునిచి నిలిచెఁ దమ

కమ్మునఁ జిరము పులకరము లొదవ

2.     

 

 

 

 

అంత నొక కాంత మేను పులకరింప ననుమానము లేక సంభ్రమముగ నీ కరాబ్జమును గైకొని తన వక్షస్స్థలమున నుంచి పెద్ద తడవు నిలిచెను. 

 

 

 

 

కం.

నారి యొకర్తుక నిన్నుం

జేరి యెలమిఁ దన గళమునఁ జేర్చెను జుట్టుం

దీరుగ నీకరములు సుకు

మారములు వెడలు నసువుల మాన్పెడు మాడ్కిన్

3.     

 

 

 

 

వేఱొక కాంత ప్రీతితో నిన్ను జేరి నీ రెండు చేతులను దన కంఠము చుట్టును బోయెడు నసువుల నాప నెంచ ననంగఁ జేర్చెను.

 

 

 

 

కం.

ననఁబోఁడి యొకతె నీ నో

ట నున్న యవ్విడ్య మక్కట వదలి లజ్జం

గొని నిజ వక్త్రాబ్జమ్మున

నునిచి సుసంపూర్ణకామ యొప్పుగ నయ్యెన్

4.     

 

 

 

 

ఒక పూఁబోడి నీ నోట నున్న తాంబూలమును సిగ్గు విడిచి యక్కటా తన నోటిలో నుంచికొని పూర్ణ కామ యయ్యెను.

 

 

 

 

కం.

నను వీడితి వని విగత ద

యను నిన్నెవ్వ రిఁక ముట్ట నాత్మఁ దలఁతురో

కనియెద నని కన్నుల నీ

రును నింపె నొకతె యరయుచు రోసి నిను హరీ

5.     

 

 

 

 

దయ లేకుండ నన్ను వీడితివి యింక నిన్నెవరు ముట్టుదురో చూచెద  నే నంచు రోషముతో నొక కాంత కన్నుల నీరు నింపి  విలపించెను.

 

 

 

 

తే.గీ.

మంద మగువ లానందమ్ము నందు మునిఁగి

యుండి పఱుపఁ బచ్చని పైట లుల్లసమున  

యమున యొడ్డునం దంగన లంద ఱలరఁ

జుట్టు కూర్చుంటి వచ్చట సుందరముగ

6.     

 

 

 

 

గోపిక లానందముగా యమున యొడ్డునఁ దమతమ పయ్యెదలను బఱుప వారెల్లరు నీ చుట్టును దనరఁగ నచ్చట నందముగఁ గూర్చుంటివి.

 

 

 

 

తే.గీ.

కలుగు దయ బలురీతులఁ గాంతు రంద

ఱి పయిఁ గొంద ఱనఁ దమవారి పయిఁ బరు ల

న నిను బోఁటి వారు కనరు నా విధమ్ము

వారి నైన నని యనిరి వగపు మీఱ

7.     

 

 

 

 

దయ పలు విధములఁ గలుగును. కొంద ఱందఱి పైన జూపింతు రని గోపికలు కొంద ఱనిరి. మఱి కొందఱు దమ వారి పైననే చూపింతు రని యనిరి. దేవా నిను బోటి వారు నా వంటి వారి పైనను జూపింప రని కొందఱు ప్రేమ యుప్పొంగ ననిరి.

 

 

 

 

తే.గీ.

శంక వలదింక నాపయిఁ జారువదన

లార నిర్దయుఁడ ననుచు మీరు చిత్త

ముంచఁ గలరని నా పయి నంచితముగ

నిట్లు సేసితి నని యంటి వీవు నగుచు

8.     

 

 

 

 

అంత దేవా నీవు నవ్వుచు నో సుందరాంగు లారా నిర్దయుఁడ నని నన్ను మీ రింక శంకతో నన వలదు.  మీరు నా పైన మీ చిత్తముల నుంచుదు రని యిట్లు దూర మైతి నని యంటివి.

 

 

 

 

తే.గీ.

వినుఁడు ప్రాణప్రియ సఖులు ప్రియులు లేరు

నాకు మీకన్న మిన్నఁగ వీఁకను విహ

రింప రమ్యంపు యామిని కెలమి యడ్డు

లేక రండని పలికితి లీల దేవ

9.     

 

 

 

 

ఓ ప్రాణ సఖులారా మీ కన్న మిన్న యైన ప్రియులు నాకు లేరు. ఉత్సాహముతో విహరింప రమ్య మైన యీ యమునా తటికి నడ్డు లేక రండు. ఇట్లు దేవా వారితోఁ బలికితివి.

 

 

 

 

తే.గీ.

మోద మధిక మయ్యె వినఁగ సాదరంపుఁ

బల్కులు వ్రజ సుందరులకు వారిఁ గూడి

యాడితివి రాసలీలల నర్థి యట్టి

వాయుపురనాథ వ్యాధులు వాపు మయ్య

10.  

 

 

 

 

ఆ ట్లాదరంపు నీ పల్కులు విని వారికి సంతోషము మిక్కిలి యధిక మైనది. అంత వ్రజాంగనలను గూడి యింపుగ రాసలీల లాడితివి. అట్టి యో గురువాయూరు నాథా నా రోగములను బాపుము.

 

 

 

ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయమున నఱువది యెనిమిదవ దశకము. 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము

(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము)

దశమ స్కంధ పరిచ్ఛేదము

దశకము 69.

రాసక్రీడా వర్ణనము. 

 

 

చం.

శిరమునఁ బింఛ సంచయపుఁ జెల్వము హార లతాంతమాల లా

యురమునఁ గుండలమ్ము లవి యొప్పఁ గడింది ప్రకాశమానమై

కరముగ నంగరాగములు కమ్ర సువాసన లీన రత్న నూ

పుర వర మేఖలా వసన భూషితునీశ్వరుఁ గొల్తు నెమ్మదిన్

1.      

 

 

 

 

సిగలో నెమలి పింఛ గుచ్ఛపు టందము,  హారములు పూదండలు నురమున, జెవుల నొప్పెడు కుండలములతోఁ బ్రకాశమానమై, యంగ లేపనము లింపైన  సువాసనలం దనరఁగ రత్న ఖచిత నూపురములు, మొలత్రాడు లలర వస్త్ర భూషితుఁ డైన యీశ్వరుని మదిలోఁ గొల్చెదను.

 

 

 

 

ఉ.

చక్క నలంకరించుకొని చన్మఱువుల్ ధరియించి వెల్గగం

జెక్కులఁ గుండలమ్ము లటఁ జెల్వల మండలి మండలమ్ముగన్

మక్కువ మీఱ జుట్ట నిను మధ్యఁ జరించుచు బోటి దోయికిం

జక్కఁగ రాసకేలి నిఁకఁ జల్పితి వంబుజనాభ లీలఁగా

2.     

 

 

 

 

చక్కగా నలంకరించుకొని పయ్యెదలు ధరించి కుండలముల కాంతి చెక్కిళ్లపై మెఱయఁ జెలువల గుంపు మండలాకారమున మక్కువతో నిన్ను జుట్టి యుండ నిద్ద ఱింతుల మధ్యను చరించుచుఁ బద్మనాభా రాసకేళి సల్పితివి.

 

 

 

 

చం.

సదమల రాసకేళి రస సౌరభ మంతయు నారదుం డనన్

ముదముగ వాసుదేవ విని మోద మనమ్ముల నిర్జ రౌఘమే

మదిఁ గుతుకమ్ము చొప్పడ సమంచిత వేష విలాస భూషలౌ

ముదితలఁ గూడి యొక్క త్రుటి ముచ్చటఁ గాంచఁగ నిల్చె నా దివిన్

3.     

 

 

 

 

అట్టి విమలంబైన రాసకేళి సుగంధమును నారదుని వలన విని మోదముతో నమర సంఘము మదిలో నుత్సాహము పొంగ యుక్తమైన వేషవిలాసముల నాభరణము లూనిన కాంతలతోఁ గూడి యాకసమున నా ముచ్చట గాంచ నో వాసుదేవా  నిల్చినది.

 

 

 

 

మ.

మురళీ నాదము గాన రాగములకుం బూర్ణానుకూలమ్ము గాన్

దరుణీ పాద సుతాడ నారవము గీతధ్వాన మిశ్రమ్ము గాన్

గర తాళధ్వని కంకణోత్కర కృతక్వాణమ్ము నేకమ్ము గాన్

గరముల్ నీ విడ మూపు లందుఁ దఱచుం గట్యంబరమ్ముల్ చలిం

ప రమాకాంతుని రాసలీల లలరన్ భక్తిన్ సమీక్షించిరే

4.     

 

 

 

 

గాన రాగములకు నీ మురళీ నాదము ననుగుణము గాఁగ రమణుల పాద తాడన రవములు గీతముల స్వనములతోఁ గలియ గరతాళ ధ్వనులు, కంకణముల ధ్వను లేకము గాఁగ నీ చేతులను గాంతల మూపు లందు నుంచఁ గటిపైఁ గట్టిన పుట్టములు చలింప నలరు చున్న నా రాసకేళిని సురలు భక్తితో వీక్షించిరి.  

 

 

 

 

ఉ.

పంతము లూని పాడి రనఁ బాటలు పాడఁగఁ బెంచి పెంచి వా

రెంతయుఁ దియ్యనం జెలఁగి యింతులు నర్తన వేగ ధూత భూ

షాంతర రత్న పుంజలు వియచ్చరులే తవ లీన చిత్తులై

యంతటఁ గుర్సి రింపుగ సుమావృత వర్షము దార లారయన్

5.     

 

 

 

 

పంతముతోఁ బాడిరా యను నట్లు పెంచి పెంచి పాటలు నర్తన వేగమునకు రాలిన భూషణముల లోని రత్నముల గల యా యింతులు పాడఁగ తియ్యఁగా దేవతలు నీ యందు నిమగ్నమైన చిత్తములు గల వారు ముదమునఁ దమ భార్యలు చూచుచుండ పుష్ప వర్షమును గురిపించిరి.

 

 

 

 

చం.

ఒక పశు పేభ యాన భవ దోరు త రాంసము పైన వ్రాలె మూ

సి కనులు క్లాంతి ఘర్మ జల సిక్త వరాశ్రయ కామి తాత్మయై

యొక పర కాంత కుంతల చయోన్నత కంపిత రోమహర్ష నీ

ప్రకట పటీర సౌరభ విభాసిత బాహు తలమ్ము మూర్కొనెన్

6.     

 

 

 

 

ఒక గోప కాంత గజగమన నీ విశాలమైన మూపుపైఁ గనులు మూసి యలసి చెమటతోఁ దడిసినది  యై యాశ్రయము గోరి వ్రాలినది. మఱి యొక కాంత కుంతలములు చెదరఁగాఁ బులకి తాంగియై చందన సౌరభముతో భాసిల్లుచున్న నీ  భాహు తలమును ముద్దాడెను.

 

 

 

 

చం.

మఱి యొక కాంత పుణ్యనిధి మత్తిలి వే నిజ గండ మాన్చి తా

వెఱవక నీదు చెక్కిలిని విడ్యముఁ గైకొనె నోట నర్మిలిం

దెఱవ రమా మనోనిలయ దేవుని సుందరు వింత పొంద నం

దఱు నటనాంత వేళ మఱి దక్కని హర్షము వారి కున్నదే

7.     

 

 

 

 

ఇంకొక పుణ్యకాంత మదమునఁ దన చెక్కిలి భయము లేక నీ చెక్కిలి నాన్చి తన నోటితో నీ విడియమును బ్రేమతో నీవు తెఱవఁగాఁ గొననెను.  లక్ష్మీకాంతుని సుందరుని నిన్ను బొందఁగా నందఱు నర్తనము ముగిసిన వేళ వారికిఁ దక్కని యానందము లేదు.

 

 

 

 

ఉ.

ఆగిన గాన వాద్యములు హ్లాద సుపూర్ణ హృదంగనా మణుల్

సాగఁగ నృత్య మాగక భృశమ్ముగ నేరరు ముళ్లు వీడుటల్

రేఁగఁ గురుల్ ని జాంగికలు రివ్వున నూడుటలున్ నభమ్ములో

నూఁగక నిల్వఁ దారలు నయో యిఁక నేమని చెప్ప నేర్తునో

8.     

 

 

 

 

గానము వాద్యములు నాగినవి. ఆహ్లాదముతో నిండిన హృదయములు గల యంగనా మణులు నృత్య మాగక సాగుచుండ వారి జడ ముళ్లు వీడుట యెఱుఁగరు. కురులు రేఁగి రవిక లూడుటయు నెఱుంగరు. యాకాశమున తారలును జలింపక నిల్చినవి. ఆ వింత చెప్ప నేరనుకదా.

 

 

 

 

చం.

జగతి నమేయ మోద రస సాగరమం దల ముంచి రాసలీ

ల గమన మాప స్వేద సలిలమ్మున మున్గి యనంగ తప్తలౌ

ముగుదల కెల్ల నన్ని వర మూర్తుల సత్కృత చోదకుండవై

తగ నొనరించి తీ వడరి తామర తూపరి పండు గత్తరిన్

9.     

 

 

 

 

జగత్తు నమేయ మైన యానందాబ్ధి ముంచి రాసలీలను జాలించి చెమటతోఁ బూర్తిగా మునింగిన మన్మథార్త లైన యా కాంతల మంచి పనులచేఁ బ్రేరితుఁడవై యందఱికి నన్ని మూర్తులఁ దనరి నీవు మన్మథోత్సవము సేసితివి. 

 

 

 

 

తే.గీ.

వివిద కేళుల నలసిన విరివి బుజ్జ

గింపఁ బడిన వెలదుల తో నింపుగ యము

నా నదిని వన గత శీత లానిలముల

స్వేచ్చఁ దిరిగితి మోహిత స్త్రీలఁ గూడి

10.  

 

 

 

 

అట్లు పలు విధము లగు నాటల నలసి బుజ్జగింపఁ బడిన నా మోహ పరవశ లైన  కాంతల తోడ యమునా నది యొడ్డున వనముల శీతల వాయువు లలర స్వేచ్ఛగాఁ దిరిగితివి.

 

 

 

 

తే.గీ.

యోగిజన వరార్హ పరితో షోదధిఁ బశు

పాంగనల ముంచ శంక రాభవ ముఖులకు

మాన్య లయి రయ్య భక్తతమ సులభ విభు

కృష్ణ నన్నిఁకఁ గావుమ కృప వహించి

11.   

 

 

 

 

యోగీశ్వరులకు నర్హ మైన యానందాబ్ధిని గోప కాంతలను ముంచఁగా నబ్జజ శంక రాదులకు వా రెల్లరు గౌరవనీయ లైరి.  భక్తులకు సులభముగా దొరకు కృష్ణా కృపతో నన్ను గావుము.

 

 

 

ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయమున నఱువది తొమ్మిదవ దశకము. 

                                                  

 

 

 

 

 

 

 

 

 

 

శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము

(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము)

దశమ స్కంధ పరిచ్ఛేదము

దశకము 70.

సుదర్శన శాప మోక్షణ శంఖచూడ వృషబాసుర వధ వర్ణనము. 

 

 

చం.

ముద మను వార్ధిలోమునిఁగి పూర్ణము గోపిక లుండ నవ్విధిన్

ముదముగ నంత గోపకులు పూజ లొనర్ప శివాలయమ్ము స

మ్మదముగ నీవు రాఁ గదిసి మానుగ నర్చన సేసి నిద్ర వో

వఁ దనిసి యంబి కాటవినిఁ బన్నగ మొక్కటి మ్రింగె నందునిన్

1.      

 

 

 

 

ఆనందాబ్ధి మునింగి గోపిక లెల్లరు నుండఁగా గోపకులు సంతసముగ నర్చనలు సలుపుటకు నీవు రాఁగ  శివాలయమును జేరి యర్చనలు చేసి యలసి యా యంబికారణ్యమున నిద్రించిరి. అంత నొక్క పాము నందుని మ్రింగెను.

 

 

 

 

తే.గీ.

కొట్టినను విడువదు మండు కట్టెల నుర

గమ్ము పైకి చూచుచు నంతఁ గావు కావు

మనుచు వేఁడ వ్రజపలు కృపను దరళ ప

దముల విద్యాధరుం డాయెఁ దాఁక నీవు

2.     

 

 

 

 

మండు కట్టెలతోఁ గొట్టినను పాము పైకిఁ జూచుచు విడువ లేదు. అంత నా గోపకులు రక్షింప మని వేఁడఁగ నీవు నీ ప్రకాశవంత మగు పాదములతో నా పామును దాఁకఁగ నది యొక విద్యాధరునిగా నయ్యెను. 

 

 

 

 

ఉ.

నేను సుదర్శ నాఖ్యుఁడ మునిప్రవరుండు శపింపఁ బన్నగం

బైన భువిన్ సుదర్శనధరా యిట నీ పద మానఁ బొందితిన్

నా నిజ రూప మంచు నని నమ్రత మ్రొక్కి ని జాలయమ్ము వే

తాను జనంగ గోపకులు తద్దయు మోదిలి యేఁగి రిండ్లకున్

3.     

 

 

 

 

అంత నా విద్యాధరుఁడు నేను సుదర్శునుఁ డను విద్యాధరుఁ డను నన్నొక ముని శపింపఁగా నిట్లు  పన్నగము నైతిని. నీ పదములు సోకఁగానే శాప విమోచన మై నిజ రూపము నొందితి నని వినయముతో మ్రొక్కి తన నివాసమున కేఁగెను. అంత గోపకులు కూడ సంతసించి తమ తమ యిండ్లకు నేఁగిరి.

 

 

 

 

చం.

ఒకపరి సీరపాణి కొమ లుండఁగ నీవు విహారకేళిలో

నొక ధన దాంతరంగికుఁడ యుద్ధతి దాఁచెను గోపకాంతలం

జకచక శంఖచూడుఁ గని చంపి దురాత్ముని స్త్రీలఁ దెచ్చి యా

సికఁ గల రత్న మందుకొని శీఘ్రమ యిచ్చితి వన్న కింపుగన్

4.     

 

 

 

 

ఒకప్పుడు బలరాముఁడు నాడువారు నుండఁగ తోడు నీవు వన విహారమున కేఁగితివి. అంత కుబేరుని భటుఁ డొకఁడు గర్వముతో గోపకాంతలను దాఁచెను. అంత నీ వేగ మేఁగి యా దురాత్ముని శంఖచూడుని వధించి వాని తలపైని రత్నమును గొని వచ్చి యన్నకు నిచ్చితివి. 

 

 

 

 

చం.

దినముల మిత్ర సంయుతము తిర్గుట కానన మందు మారు నా

త్మను సహితమ్ము మోహమునఁ దత్తర వెట్టియు వేణునాదమే

తనర సుధారసమ్ము నయి దైవత కాంతల దృష్టి నత్తరిన్

మినుకుల నుంచ నేర్చెదరె మేరను నీ విరహార్త గోపికల్

5.     

 

 

 

 

పగలు సఖులతోఁ గూడి వనము లందుఁ దిరుగుచు మరుని సహితము మోహపఱచుచు, దేవ కన్యల దృష్టిలో నీ  వేణు నాద మమృత మయి తనరఁగ విరహమున వేఁగు గోపికలు మాటలలో హద్దు నుంచ నేర్తురే?

 

 

 

 

తే.గీ.

అంత నిల్చె నరిష్టుఁడు చెంత దుష్టుఁ

డడరి దృష్టిడి ఘన వృష భాకృతి నిను

జంప నిష్ఠు రారవమునఁ బంప భోజ

రాజు భృత్యుఁడు కష్టుఁడు వ్రజకుమార

6.     

 

 

 

 

అరిష్టుఁ డను దుష్టుఁడు కంసుని సేవకుఁ డతఁడు పంపఁగా నిన్ను జంపు దృష్టితో గోప బాలకా కృష్ణా యెద్దు రూపమునఁ బెద్దగా నఱచుచు నీ చెంత నిలిచెను.

 

 

 

 

తే.గీ.

వృషభము జగద్ధృతి వినాశి భీమ కాయ

మూని మందఁ జేరి తఱిమి యుద్ధతిఁ బశు

వులను వేద వేదాంగ సంపూర్ణ నిధివి

నిన్ను జేరె భీకరముగ నీరజాక్ష

7.     

 

 

 

 

ఆ వృషభము జగముల ధైర్యమును హరించునది, పెద్ద దేహము నూని మంద లోనికిఁ జేరి పశువులను గర్వముతోఁ దఱిమి వేదవేదాంగ నిధివి యైన నిన్ను భయంకరముగాఁ జేరెను.

 

 

 

 

ఆ.వె.

కొమ్ములు తల నెత్తి కుమ్మఁగ నరుదెంచు

నశుభ దైత్యు శుభపు టాకృతి వడి

సంగ్రహించి వానిఁ జంప నీవు ధృతి ము

దమ్ము వడసె నంత దైవ గణము

8.     

 

 

 

 

తల కొమ్ములు నెత్తి కుమ్ముటకు నా యశుభ దైత్యుఁడు శుభ రూప మైన వృషభాకృతిని వచ్చు చుండఁ గాంచి వడి వానిఁ బట్టుకొని ధైర్యముతోఁ జంపితివి.  అంత సుర గణము మిక్కిలి సంతసించెను.

 

 

 

 

ఆ.వె.

చిత్ర మయ్యె నేడు ఛేదింప వృషభమ్ము

వృషము నిలిచె నుర్వి వృషుఁడు సంత

సించె మిక్కుటమ్ము చేతస్సున నని ను

తించిరి నిను సురలు నంచితముగ

9.     

 

 

 

 

చిత్రముగ నేఁడు వృషభమును ఛేదింప వృషము( ధర్మము) ధరలో నిలిచెను, మఱియు వృషుఁడు (ఇంద్రుఁడు)  మదిలో మిక్కిలి సంతసించె నని దేవతలు నిన్ను నుతించిరి.

 

 

 

 

ఆ.వె.

ఉక్ష రాజు లార యుఱుకుండు వేగమ్మ

యుక్ష భేది వచ్చె శిక్ష వేయఁ

గలఁ డని పరిహాసముల నేఁగి రిండ్లకు

గోపు లనిల పురప తాప మణఁపు

10.  

 

 

 

 

వృషభ రాజు లారా వేగము పరుగు లెత్తుఁడు వృషభ వైరి శిక్ష వేయ గలఁ డని పరిహాసము లాడుచు గోపబాలు రిండ్లకు నేఁగిరి. గురువాయూరు నాథా నా తాపమును బాపుము.

 

 

 

ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయమున డెబ్బదవ దశకము. 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము

(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము)

దశమ స్కంధ పరిచ్ఛేదము

దశకము 71.

కేశి మథన వ్యోమ వధ వర్ణనము. 

 

 

తే.గీ.

ఇలఁ బనుల నెగ్గ నవకాశ మెఱుఁగు నట్టి

కేశి కంస సఖుఁడు సింధుజేశుఁ జేరు

నూహ సింధుజాశ్వాకృతి నూని తివిరి

నిన్ను జేరె దర్పమ్మున నీలదేహ

1.      

 

 

 

 

పను లన్నిట నిల నెగ్గు నవకాశ మెఱుంగు నట్టి కేశి కంససఖుఁడు నీవు సింధుజేశుఁడవు గనుక (లక్ష్మీ కాంతుడఁవు) సింధు దేశమునఁ బుట్టి నట్టి గుఱ్ఱపు రూపమునఁ జేర సులభ మని యెంచి దేవా నిన్ను గర్వముతో సమీపించెను.

 

 

 

 

తే.గీ.

అకట గంధర్వ రూపమ్ము నందు నున్న

భీమ రవమున భయపెట్టి విశ్వ మంత

మంద జనుల మర్దించి సంభ్రమము మీఱ

నిన్ను గనుటకు మున్నంత నిన్ను దాఁకె

2.     

 

 

 

 

అకటా గంధర్వ( గుఱ్ఱము) రూపమున నున్నను భయంకరమైన యఱపుతో  నిన్ను జూచుటకు మున్ను మంద జనులను మర్దించి విశ్వమును భయ పెట్టి  తొందర మీఱ నిన్ను దాఁకెను.

 

 

 

 

తే.గీ.

తార్క్ష్యు మూపున నీదు పాదమ్ము మెఱయ

నలరు నీదు వక్షమ్మున నకట తన్నెఁ

దార్క్ష్య రూప కేశి భృగుఁడు తన్న నెఱిఁగి

యట్లు తనకు శక్యం బని యంధుఁ డగుచు

3.     

 

 

 

 

తార్క్ష్యుని (గరుత్మంతుఁడు) వీపున నీ పాదము మెఱయ నలరు నీ రొమ్మును దార్క్ష్యపు (గుఱ్ఱము) రూపమున నున్న కేశి యక్కటా తన్నెను. భృగు మహర్షి తన్ను టెఱింగి తనకు నట్లు చేయ శక్యమని యెంచి యంధుఁడై తన్నెను.

 

 

 

 

ఆ.వె.

ఎత్తి నట్టి గిట్ట నిట్టె పట్టి విసరి

తీవు దాని దూర మావలకును

మూర్ఛఁ జెంది లేచి మూరి మ్రింగఁ గనలి

మిగుల నీ పయికి దుమికె హయమ్ము

4.     

 

 

 

 

పై కెత్తిన దాని గిట్టను పట్టి దూరముగా నావలకు విసరితివి. అంత నా గుఱ్ఱము మూర్ఛిల్లి తిరిగి లేచి నిన్ను మ్రింగుటకుఁ గోపముతో నీ పైకి దుమికెను.

 

 

 

 

తే.గీ.

నీ వపుడు వాహ దండమ్ము నిశ్చయించి

వాహ దండమ్ము క్రుక్కి యా వారువంపు

వాతి లోనఁ బెంచ భృశమ్ము శ్వాస యాగి

చచ్చి నీలోన లయ మయ్యె సప్తి యయ్యు

5.     

 

 

 

 

నీ వంత వాహమును (గుఱ్ఱము) దండింప నిశ్చయించి నీ వాహ(భుజ) దండమును దాని నోటిలో గ్రుక్కి పెంచ నెక్కువగా శ్వాస యాడక యది చచ్చి గుఱ్ఱ మై యుండి కూడ నీ లోన లీన మైనది. 

 

 

 

 

కం.

హరిఁ జంప నశ్వమేధ మ

నిరి దీనిని నూతనం బనిమిషులు స్తుతియిం

చిరి నిన్ను నీ కొసఁగి రా

దరం బడరఁ గేశ వాభిధానం బీశా

6.     

 

 

 

 

గుఱ్ఱము నట్లు చంపఁగ నీవు క్రొత్త దైన యశ్వమేధ మని దాని నని దేవతలు నిన్ను నుతించిరి. నీ  కపుడు కేశవ నామ మొసంగి రలరి. 

 

 

 

 

ఆ.వె.

నారదుండు చెప్పి శౌరి సుతుండ వీ

వంచుఁ గంసున కతఁ డెంచ నాపి

శౌరి వధను గేశిఁ జంపు టెఱిఁగి వచ్చి

నిన్ను బొగడె మౌని మిన్నగాను

7.     

 

 

 

 

నారదుఁడు కంసునకు నీవు వసుదేవుని కొడుకు వని చెప్పఁగా నతఁడు వసుదేవుని నంత జంపఁ దలఁచిన  వాని నాపెను. అంత నీవు కేశినిఁ జంపు టెఱిఁగి నీ వద్దకు వచ్చి ముని నిన్ను మిక్కిలి పొగడెను.

 

 

 

 

కం.

దాగుడు మూతల నాటల

నా గోపాలరు చెలంగ నందాత్మజ నీ

తోఁ గలసి మయాత్మజుఁ డా

ద్యో గమన వ్రజ రిపుండు వ్యోముఁడు వచ్చెన్

8.     

 

 

 

 

నందతనయా నీ తో గోప బాలురు దాగుడు మూత లాట లాడుచుండ మయ సుతుఁడు వ్యోముఁడు  గగనచరు లైన సురలకు శత్రువు వచ్చెను.

 

 

 

 

తే.గీ.

చోర రక్షక గణ మందుఁ జోరుఁ డౌచుఁ

గొండ గుహ లోన వ్యోముఁడు గోప గో గ

ణమ్ము దాఁచి మూసిన ఱాతిఁ బమ్మి యెఱిఁగి

వానిఁ గదిసి వధించితి వారిజాక్ష

9.     

 

 

 

 

చోర రక్షకు లందుఁ జోరునిగాఁ గొండ గుహలో గోవులను గోపకులను దాచి యొక ఱాతితో నా గుహను వ్యోముఁడు మూసెను. దాని నెఱింగి వాని జేరి యతిశయించి వారిజాక్షా వధించితివి.

 

 

 

 

తే.గీ.

ఇప్పగిది నద్భుతమ్ములు నింక రక ర

కంపు టాటలు ముద మొసఁగంగ నలరె

నిత్య నూతనమ్ముగ మేర నేర కుండ

ననిల పురనాథ పరమాత్మ యాదుకొనుమ

10.  

 

 

 

 

ఈ విధముగ నద్భుతముగ నానంద మొసఁగు రకరకము లైన యాటలు నిత్యనూతనముగ నడ్డు లేక చెలఁగు చుండెను. ఓ పరమాత్మా గురువాయూరు నాథా నన్నాదుకొనుము.

 

 

 

ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయమున డెబ్బది యొకటవ దశకము. 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము

(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము)

దశమ స్కంధ పరిచ్ఛేదము

దశకము 72.

అక్రూరాగమన వర్ణనము. 

 

 

మ.

విని యా నారదు భాషణమ్ములను దా భీతిల్లి నిన్మంద వా

సునిగాఁ జెప్పఁగఁ గార్ము కాధ్వర మిషం జోద్యమ్మ యా గాందినీ

తనయున్ వే పిలిపించి కృష్ణ నిను దంత్రం బొప్పఁ దోడ్తేరఁగా

ననిపెన్ మందకు దుష్ట కంసుఁడు సరోషావేశ తప్తాత్ముఁడై

1.      

 

 

 

 

నీవు మందలో నివసించు వాఁడ వని నారదుఁడు చెప్పఁగా విని కంసుఁడు భీతిల్లి ధనుర్యాగమును జూచు నెపమునఁ జిత్రముగా నిన్ను తీసికొని వచ్చుటకు నక్రూరునిఁ బిలిపించి రోష మూని నతని మందకుఁ బంపెను.

 

 

 

 

తే.గీ.

నీ పద చిరార్తి యక్రూరుఁడే పుడమి దొ

ర భయమున నిను గన్నులారఁ గనఁ జాల

ననుచు నుండఁ జిత్రము రాజు నాజ్ఞఁ జూడఁ

గదల నానంద వార్ధి యెడఁదఁ జెలంగె

2.     

 

 

 

 

నీ పదములు గాంచు నార్తితో నున్న యక్రూరుఁడు రాజు కంసుని భయము వలనఁ గాంచ నోచక యుండఁ జిత్రముగ రాజాజ్ఞతో నీ వద్దకుఁ గదలు చుండ నాతని మనస్సులో నానందాబ్ధి చెలంగెను.

 

 

 

 

తే.గీ.

అరదము నధిరోహించి యయ్యదు వరేణ్యుఁ

డరుగుచు సుకృతుండు భవద్గృహమ్మునకు ద

లంచుచు నిను జిత్తమ్మున నించు కేని

వ్యథలఁ బడయమికిని దారి నరయఁ డెద్ది

3.     

 

 

 

 

అక్రూరుఁడు యదు పుంగవుండు రథ మెక్కి పుణ్యకర్ముఁడు తా నెట్టి కష్టములను గొంచె మైనను బొందకుండుటకు నిన్ను మదిలోఁ దలంచుచు నీ గృహమునకు నరుగుచు దారిలో యే కష్టమును బొందఁడు .    

 

 

 

 

చం.

కనియెదనే నరోత్తమునిఁ గాంచెదనే శ్రుతి కాయ సన్నుతుం

దనియఁగ ముట్ట నేర్చెదనె తప్పక కౌఁగిలి నిచ్చునే తమిన్

నను గని చెప్పు నెట్టి వచనమ్ముల నెక్కడ గాంతు నాతనిన్

మనమున నెంచు చిట్లు నిజ మానస మందిడి నిన్నె చాగెనే

4.     

 

 

 

 

ఆ నరోత్తమునిఁ జూచెదను, వేదములచేఁ బొగడఁబడు వానిఁ జూచెదను, తాఁక గలను, దప్పకుండ నతడు నాకుఁ బ్రేమతోఁ గౌఁగిలి యిచ్చును, నన్ను జూచి యెట్టి వచనములు వల్కునో యెక్కడ నతనిఁ గాంతునో యని మనస్సులోఁ దల్చుచు నిన్ను దన చిత్తమున నిడి చాగుచుండెను. 

 

 

 

 

తే.గీ.

ఇమ్ముగఁ గదిసి బృందావన మ్మజ సుర

వంద్యమును నీ పద యుగ పావనము హర్ష

మగ్నచిత్త విమోహాది లగ్న దశల

నెన్ని కాంచెనో నలినాక్ష యెన్నఁ దరమె

5.     

 

 

 

 

శివాది సురలకు పూజనీయము, నీ పాదములచేఁ బావన మైనయట్టి బృందావనము చక్కఁగఁ జేరి హర్షము, విమోహము మొదలగు నెన్ని దశల ననుభవించెనో దేవా చెప్ప నలవి కాదు.

 

 

 

 

ఆ.వె.

కని నమస్కరించె వని నీ తిరిగిన స్థ

లములు దొర్లె రజములఁ బొడగాంచి

యేమి చెప్ప జనుల కేమి కొఱత యిట్టి

భక్తు లరుదు సుమ్ము పరమ పురుష

6.     

 

 

 

 

అక్రూరుఁడు వనమును గాంచి నమస్కరించెను, నీవు తిరిగిన నేల దుమ్ములో దొర్లెను, జనులకుఁ  గొఱత యేమి కాని పరమాత్మా యిట్టి భక్తులు చాలా యరుదు సుమ్ము. 

 

 

 

 

కం.

సాయంసమయమ్మున గో

పాయతనమ్ము లవి నీవ యలరిన చోటుల్

డాయం జని పేయ పద ర

సాయన ఖను లుల్లసాబ్ధి జాల మునింగెన్

7.     

 

 

 

 

సాయంకాలమునకు నీవు తిరిగిన గోపకుల యిండ్లు చేరెను. కర్ణ పేయ మగు గీతామృతమునకు నాలవాలము లవి. చేరి యానందాబ్ధిలో నతఁడు మునింగెను. 

 

 

 

 

ఉ.

దూరము నందు గాంచెను యదుప్రవరుం డమలాంతరంగు డ

క్రూరుఁడు నీర దాభ వర కుంతల లోచన రమ్య భాగ్వపు

స్సారస సన్నిభాక్షియుగ సార భుజద్వయ పింఛశీర్ష సో

దార రసస్వ నాకలిత తన్మురళీధర జిష్ణుఁ గృష్ణునిన్

8.     

 

 

 

 

దూరము నుండి యదు వరేణ్యుఁ డక్రూరుఁడు విమల చిత్తుఁడు మేఘవర్ణపు కుంతలములవానిఁ  గనుల కింపైన ప్రకాశించు దేహము కలవానిఁ, బద్మముల వంటి కన్నుదోయి కలవాని, దట్ట మైన భుజ ద్వయము గల వానిఁ, బింఛముతో నున్న శిరము వాని, నధికంపు రసముతోఁ గూడిన నాద యుతమైన మురళిని ధరించిన యా జిష్ణునిఁ గృష్ణునిఁ జూచెను.

 

 

 

 

తే.గీ.

పాలు పితుకఁ జూచెడు వాని భక్తు రాకఁ

గోరు నట్లగపడు వానిఁ గూడి యగ్ర

జుఁ దనరెడు వాని యక్రూరు మదిఁ జెలంగు

ముద్సుధారస సాగర మూర్తిఁ గాంచె

9.     

 

 

 

 

పాలు పితుకు చుండఁ జూచు వాని, నగ్రజునితోఁ గూడిన వాని, భక్తుని రాక కొఱకు నెదురు చూచు చున్నట్లు కన్పించు వానిఁ, దన మనస్సునఁ చెలఁగెడు  హర్షామృతంపు గడలి మూర్తీభవించి నట్టు లున్న వాని నక్రూరుఁడు సూచెను.

 

 

 

 

ఉ.

సాయపు స్నాన శుద్ధ తను సారస లోచన నీల పీత వ

స్త్రాయత లోభనీయ రుచి రాల్ప విభూషిత చారు వేషులన్

ప్రాయ విలాస సుస్మిత విరాజిత వక్త్ర విశాల వక్షులన్

వే యదు పుంగవుం డరసె వీరుల గోపుల రామకృష్ణులన్

10.  

 

 

 

 

సాయంసమయ స్నానమున శుద్ధ మైన శరీరులను, బద్మాక్షులను, నల్లని పచ్చని వస్త్రముల నూనిన వారిని, మిక్కిలి యాకాంక్షనీయులను, యొప్పిదములు నల్పము లగు నాభరణములు గల యందమైన వేషముల వారిని, యౌవనముతో విలసిల్లు వారిని, దరహాసముతో వెల్గు ముఖముల వారిని, విశాలమైన వక్షముల వారిని, వీరులను రామకృష్ణులను రయమున యదుపుంగవుఁ డక్రూరుఁడు సూచెను.

 

 

 

 

తే.గీ.

దూరమున దిగి రథమును వారిఁ జేరి

మ్రొక్క లేపి క్షేమమ్మును జక్కఁగ మిత

గిరల నడిగి యక్రూరుని కరము నంది

యతనిఁ గొనిపోయి తింటికి నన్నఁ గూడి

11.   

 

 

 

 

దూరమున రథము నుండి దిగి వారిఁ జేరి మ్రొక్కఁగ దేవా నీవు నక్రూరుని నెత్తి మిత వచనముల క్షేమ మడిగి యతని చేతిని నందుకొని యన్నతోఁ గూడి యింటికిఁ గొని పోయితివి.

 

 

 

 

తే.గీ.

ఆదరించి సనందము నధికముగను

విని యదూత్తము మాటలు వివరముగ వ

చించి కంసు నాజ్ఞలు గోపశేఖరులకుఁ

గడపితి వతనితోఁ బలు కథల నిశను

12.   

 

 

 

 

అక్రూరుని నంద సహితముగ నీ వాదరించి వాని పల్కులు విని గోపకుల కెల్లరకుఁ కంసుని యొక్క యాజ్ఞలను వివరించితివి. ఆ రాత్రి యక్రూరునితోఁ బలు కథలను వినుచుఁ గడపితివి.

 

 

 

 

తే.గీ.

చంద్రభాగ యింటనొ రాధ చంద్ర మిత్ర

విందల గృహము లందైన నందజుండు

తిరిగె నిసి నంచు శంక నతివలు వగచి

రట్టి దేవ కాపాడుమ యనిల పురప

13.   

 

 

 

 

అప్పుడు గోపికలు నీవు చంద్రభాగ యింటనొ, రాధ యింటనో, చంద్ర లేక మిత్రవిందల యిండ్లలోనో రాత్రి గడపితి వని శంకించి చింతిల్లిరి. అట్టి యో గురువాయూరు నాథా నన్ను గాపాడుము.

 

 

 

ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయమున డెబ్బది రెండవ దశకము. 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము

(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము)

దశమ స్కంధ పరిచ్ఛేదము

దశకము 73.

మథురాపుర యాత్రా వర్ణనము. 

 

 

తే.గీ.

వార్త విని మధురా యాత్ర యార్త చిత్త

లా వ్రజాంగన లిది యేమి యకట యేమి

యెట్లు జరిగె నిది యనుచు నెల్ల రొకటఁ

గూడి రోదించిరి చిగురుఁ బోఁడులు కడు

1.      

 

 

 

 

మధురా యాత్ర వార్త విని గోపిక లార్త చిత్త లిది యేమి యీ ప్రయాణ మెట్లు కలిగె నని యెల్ల రొక చోట గుమిగూడి కృష్ణుని యెడబాటు నోర్వలేక చింతించిరి.

 

 

 

 

ఆ.వె.

దయకు నిధియ నందతనయుం డనన్య ప

తులను మనల వీడఁ దలఁపఁ గలిగె

నెట్లు విధి బలమ్మ యిట్లాయె నని నీ ప

యి మది నుంచి వగచి రెల్ల రపుడు

2.     

 

 

 

 

నందకుమారుఁడు దయా నిధియే. అనన్య నాథలను మనలను వీడ నెట్లు  దలఁపఁ గలిగెను? విధి బల మిట్లున్న దని నీ పైనఁ దమ చిత్తముల నుంచి విలపించిరి. 

 

 

 

 

కం.

సఖు నొకని గోపవశల స

ముఖం బనున యింపఁ బంపి ముగియఁగ నిశయే

సఖ బృందమ్మును జనకుఁడు

నఖిల జనులు రాఁ దొడఁగితి యానమ్మునకున్

3.     

 

 

 

 

అంతఁ దన సఖుని నొకని గోపికల ననునయింపఁ బంపితివి. ఆ రాత్రి ముగియఁగా జన కాదులు, సఖులు తోడు రాఁ బ్రయాణమునకు సిద్ధ పడితివి. 

 

 

 

 

తే.గీ.

వత్తు నచిరమ్ము దర్శన మిత్తు సురుచి

రమ్ము ముంచుదు సంగమ రస పయోధి

నిశ్చయమ్మిది నమ్ముఁడు నెలఁత లార

యాశ్వసించి తిట్లెల్లర నంబుజాక్ష

4.     

 

 

 

 

అచిరకాలమున వత్తును. మిమ్ములను సత్సంగ మామృ తాబ్ధి ముంచెదను. ఇది నిశ్చయము. వనిత లార నన్ను నమ్ముఁడు. ఇట్లు వారి నెల్లర నాశ్వసించితివి.

 

 

 

 

కం.

ఆక్రోశించుచు రా దుః

ఖాక్రాంత లతివలు దూర మరయుచు నిన్నున్

నీ క్రీఁ జూడ్కులఁ జూచుచు

నక్రూరు రథమున నేఁగి తన్న బలునితో

5.     

 

 

 

 

దుఃఖముతోఁ దపించుచు నా కాంతలు నిన్ను దూరము వఱకు వచ్చి జూచుచు నుండ వారినిఁ గ్రీఁ గంటఁ జూచుచు నన్నతోఁ గలిసి యక్రూరుని రథము నెక్కి యేఁగితివి.

 

 

 

 

తే.గీ.

వల్లవీ మనములు నింక వల్ల వాంగ

నములు వెంట రాఁగ విషణ్ణ నగము లార్త

మృగముల నరణ్యము రయమునఁ గడచి యము

నా నదీ తటిఁ జేరితి నలిన నయన

6.     

 

 

 

 

వల్లవ కాంతల మనములు నింక వల్లవుల వాహనములు తోడు రాఁగ దుఃఖించుచున్న తరులను, దపించు చున్న మృగములను నరణ్యమును దాటి యమునా నదీ తీరము సేరితివి.  

 

 

 

 

తే.గీ.

నియమ మనుసరించి మునిఁగి నీర మందు

గాందినేయుఁడు జల మందుఁ గాంచి నిన్ను

నరద మందు నరసి నిన్ను వరద యేమి

చిత్ర మరయ నంతట నని చింతసేసె

7.     

 

 

 

 

అంత నియమానుసార మక్రూరుఁడు యమున నీటిలో మునిఁగి యందు నిన్ను గాంచి తిరిగి యా రథమున నున్న నిన్నే కని యిది యేమి వింత యంతట నుంటి వని యాలోచించెను.

 

 

 

 

తే.గీ.

తిరిగి పుణ్యశీలి మునిఁగి దివ్య ఫణి ఫ

ణమ్మున నలర వీక్షించె నెమ్మి నిన్ను

శంఖ చక్ర గదాబ్జ హస్త ప్రభా వి

లసిత సుర సిద్ధ సేవిత లలిత మూర్తి

8.     

 

 

 

 

ఆ పుణ్యాత్ముఁ డక్రూరుఁడు తిరిగి నీటిలో మునిఁగి లేచి శంఖము, గద చక్రము పద్మములు  గల చేతులతోఁ బ్రకాశించుచున్న, దేవతలు సిద్ధులు సేవించు చుండ లలితంపు టాకారమున నాదిశేషు ఫణమున నున్న నిన్ను జూచెను. 

 

 

 

 

తే.గీ.

మునిఁగి సచ్చి దానం దాబ్ధి నిను నుతించె

సగుణ నిర్గుణ విధముల గగురుపాటు

నంది సమ్మదాబ్ధి నదృశ్య మైన గూడ

నీవు వీడి నీరముఁ జేరె నిన్ను నంత

9.     

 

 

 

 

అంతఁ జిదానంద సాగరమున మునిఁగి యతఁడు నిన్ను సగుణ నిర్గుణ రూపముల నుతించెను. నీ వదృశ్యమైనను గూడ గగుర్పాటు నంది యానందమున మునిఁగెను. అంత నతఁడు నీటి నుండి వెడలి నిన్ను జేరెను.

 

 

 

 

తే.గీ.

పులక లగపడు చుండె శీతలమ జల మ

ని యడుగ నతని మాటలు నిండ హర్ష

ము మది రాకున్న నూని మౌనమును రథము

నెక్కె రక్షింపు పవనపు రేశ నన్ను

10.  

 

 

 

 

దేవా నీ వతని మేనునఁ బులకలింత లగపడ నీళ్లు చల్లగ నున్నవా యని యడుఁగ మదిలో హర్షము నిండఁగ మాటలు రాక యతఁడు మౌనముగా రథము నెక్కెను.  అట్టి గురు వాయూరు నాథా నన్ను రక్షింపుము.

 

 

 

ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయమున డెబ్బది మూడవ దశకము. 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము

(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము)

దశమ స్కంధ పరిచ్ఛేదము

దశకము 74.

 

మథురాపుర ప్రవేశ రజక నిగ్రహ వాయక మాలాకార కుబ్జానుగ్రహ ధనుర్భంగాది వర్ణనము. 

 

 

చం.

నడి దిన మందుఁ జేరి వ్రజ నందనుఁ డా మథురా పురమ్మునున్

విడిసి వనాంతరమ్మునను వేగమ యన్నము నారగించి తా

నడుగిడె రాజమార్గమున నారయ నప్పురమున్ సమిత్రముం

గడిఁది కుతూహలమ్ము మగ కల్కుల పుణ్య నికాయ మారయన్

1.      

 

 

 

 

మధ్యాహ్నమున నా నంద నందనుఁడు మథురా పురము సేరి వనములో విడిసి త్వరగ నన్నము దిని పురమును జూచుటకు మిత్రులతోఁ గూడి రాజమార్గమున మగవారు నాడు వారలు గలట్టి పుణ్య సమూహము తన్ను మిక్కిలి కుతూహలముతోఁ జూచుచుండ బయలుదేరెను. 

 

 

 

 

ఉ.

చేరిరి కాంచ నీ సమలు చేడెలు వారి సరాగ వక్త్రముల్

నీ రుచి రారు ణాంఘ్రి రుచి లీలఁ జెలంగ లసత్పయోధరల్

మీరలు సంచలాక్షులును మీ యురముల్ మఱి చేరు సౌరులే

తీరగు నవ్వు పింఛశిఖ తేటయు భూషలు నీకు వారికిన్

2.     

 

 

 

 

అంత కాంతలు నీకు సమానలు నిన్ను జేరిరి. వారి ప్రేమతోఁ నెఱుపెక్కిన ముఖములు నీ యెఱ్ఱని పాదముల కాంతితోఁ దూఁగు చున్నవి. నీవు ప్రకాశించు మేఘపుఁ గాంతి గల వాఁడ వా కాంతలు పయోధరములతో వెల్గు చున్నారు. నీవు వారును గదలెడు కన్ను లున్న వారే. మీ యురములు హారములతో మనోజ్ఞ మైనవే.  తీరైన నవ్వులు, పించము నీకును, స్వచ్ఛత మఱియు భూషణ సంచములు వారికి నందము నిచ్చుచున్నవి.

 

 

 

 

చం.

ఒసఁగఁగ వాలు చూపుల మహోల్లస ముద్ధృత హర్ష మందు నూఁ

గు సుజన కోటి నొక్క రజకుం గని వేఁడఁగఁ గొన్ని వస్త్రముల్

విసిగి యతండు రాజతతి పేర్మి ధరించెడు వాని నేరి కే

నొసఁగ ననంగఁ ద్రుంపఁ దల నొక్క కరమ్మునఁ బొందె నాకమున్

3.     

 

 

 

 

నీవు నీ వాలు చూపులతో  నుల్లాసము నీయఁగా మిక్కిలి హర్షముతో నూఁగు వారిలో చాకలిని నొకని నీవు గాంచి కొన్ని బట్టల నిమ్మని కోరఁగా వాడు రాజులు ధరించు దుస్తులను నే నెవ్వరికి  నీఁ జాలనని విసుగుతో ననఁగాఁ గినిసి వానిని నీ చేతితోఁ ద్రుంప నతఁడు స్వర్గమున కేఁగెను. 

 

 

 

 

చం.

సుకృతము లెంచి యిచ్చితివి శుభ్రపు వస్త్రము లీయ నేఁత కా

నికి సువిశాల చిత్తునకు నీదు పదమ్మును జీవవేది! మా

లికునకు భక్తి నీ పయిఁ జరించు వరమ్మును మాల లిచ్చి నీ

కిఁక నడుగంగ దాని నిడి కేళి నొసంగితి కల్ము లింపుగన్

4.     

 

 

 

 

అంత నచ్చట నొక నేతకాఁడు మంచి వస్త్రముల నీయఁగా వానికి సుహృదయునకు జీవుల నెల్ల జక్కఁగ నెఱుంగు నీవు నీ ధామమునే యొసఁగితివి. ఒక మాలల నమ్ము వాఁడు నీకు మాల లీయఁగా వానికి వాఁడు కోరిన నీ పైని భక్తి నిచ్చి యింకను నింపైన సంపదల నిచ్చితివి.

 

 

 

 

ఉ.

కూర్మిని నబ్జ లోచనకుఁ గుబ్జకు నీ కిడ నంగరాగముల్

పేర్మి నొసంగి వక్రతను లీలఁగ నెత్తి కరమ్మునన్ మనో

ధర్మము రీతి నుంచగను దానికిఁ దీసితి కాయ మందు నా

మర్మము లోక సుందరిగ మానినిఁ జేసెను నీరజోదరా

5.     

 

 

 

 

ప్రేమతో నొక పద్మలోచన కుబ్జ నీకు నింపైన మైపూతల నొసఁగ నామెకుఁ బ్రేమ నిచ్చి యామె దైన గూనెను జేతులతో నామె నెత్తి తీసి యామె మనస్సు వలె చక్కఁగాఁ జేసితివి.ఆ మర్మ మామెను బద్మనాభా! లోక సుందరిగాఁ జేసెను.

 

 

 

 

ఉ.

నీ మహిమంబు నేరిన మనీషు లొసంగఁగ నాతిపాపులే

దామ సువీటి కాదులు ముదమ్మున శక్తి కొలంది గాంచుచున్  

భామయె యంజలించుటకు ఫల్యము లడ్డయి నిల్చి యుండగా

నేమని యందుఁ దత్ఫలము నేడ్చె నిటుల్ మది నెంచి కుబ్జయే

6.     

 

 

 

 

దేవా నీ మహిమ నెఱిఁగిన కొందఱు పెద్ద పాపములు చేసిన వారు కాని వారు నీకు ముదముగాఁ  దమ శక్తి కొలఁది పూదండలు తాంబూలములు మున్నగు నవి యొసంగఁగాఁ గాంచి కుబ్జ తన చేతిలోఁ బూవు లున్న కారణమున నంజలి కూడ ఘటింప లేకుంటి దాని ఫలము నేమని యందు నింక నని మదిఁ దలంచి యేడ్చెను.  

 

 

 

 

చం.

విడిచినఁ దిర్గి వత్తునను వీక్షణ మిచ్చుచు లేప్య దాత్రికిం  

గడు నెడ కేఁగు నంతకును గాఁకను గాంచెడు నామె కింపుగా

నడు గిడి తీవు గోపురము హర్షము పొంగఁగఁ బొంగె క్షీరమే

పడఁతుక దేవకీ సతికిఁ బాఱెఁ బురమ్మున నీ యశం బనన్

7.     

 

 

 

 

ఇప్పుడు నిన్ను వీడినను దిరిగు వత్తు నను రీతి దూర మగు వఱకు నిన్ను దాపముతోఁ  జూచు చున్న కుబ్జను జూచుచు నేఁగి మథురాపుర గోపురము సేరితివి. నీ జనని యైన దేవకీ సతికి హర్ష ముప్పొంగ నీ కీర్తి యా పురములోఁ బాఱెనా యనఁగఁ బాలు పొంగెను.           

 

 

 

 

ఉ.

అంతటఁ గార్ము కాలయము నారయ నచ్చటి వారు గౌరవ

స్వాంతములన్ గణింపఁ గని చందును దేజము లోని కేఁగి స్ర

క్కాంతి కరార్చిత త్రిణతఁ గాంచి జనుల్ వల దన్న నెక్కిడన్

వింతగ భగ్న మయ్యె విలు పెల్లున నీరజ పత్ర లోచనా

8.     

 

 

 

 

అంత నీవు ధనురాలయము కనిపింప నచ్చటి వారు నిన్ను గౌరవముతో గూడిన మదితో  నాదరింపఁగా దాని యందము తేజమును జూచి లోనికి నేఁగి పూవుల కాంతి కిరణములచే పూజింపఁ బడిన వింటినిఁ  గావలి వారు వల దని వారించు చున్నను నెక్కు పెట్టితివి.  అంత నది పెల్లున విఱిఁగినది.  

 

 

 

 

ఉ.

రేపటి కంస మారణ నిరీక్షిత పర్వ నినాద తుల్యమై

చాప విపాటన స్వనము చక్రధరా! దివి నిర్జరాళికిం

జూపెను రోమహర్షమును శుక్కున బీతిలెఁ గంసుఁ డత్తఱిం  

జాపపు శల్కలన్ భటులఁ జంపఁగ నార్పులు పెంచెఁ దద్ధ్వనిన్

9.     

 

 

 

 

నిరీక్షింపఁ బడుచున్న మఱునాడు జరుగఁ బోవు కంస వధ యను పండుగ నందుండు ధ్వనులకు సమానమైన వింటిని విఱువ రేఁగిన శబ్దములను జక్రధరా దేవతలు దివి నిల్చి చూడ వారికి రోమ హర్షము కలిగెను. కంసునకు శోకముతో మిక్కిలి భీతి కల్గెను. విఱిఁగిన వింటి ముక్కలతో రక్షకు లెదిరింపఁ జంప వారి యార్పు లా ధ్వనిని రెట్టింపు చేసెను.  

 

 

 

 

తే.గీ.

విదిత శిష్ట దుష్ట జనులు ప్రీతి భీతి

నీదు మహిమ గాంచిరి రాధ నీటుఁ దలఁచి

పురపు శ్రీఁ గాంచి వీటికిఁ బోయి తలరి

రాఁగ శ్రీదాముఁ డనిలపురప యరయుమ

10.  

 

 

 

 

ప్రసిద్ద శిష్ట జనులు దుష్ట జనులు క్రమమునఁ బ్రీతిని భీతిని నీ మహిమ గాంచిరి. అంత నీవు రాధ మురిపెమును నగర సంపదను జూచుచు శ్రీదాముఁడు తోడు రాఁగ విడిది కేఁగితివి. అట్టి యో గురు వాయూరు నాథా నన్ను గావుము.

 

 

 

ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయమున డెబ్బది నాలుగవ దశకము. 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము

(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము)

దశమ స్కంధ పరిచ్ఛేదము

దశకము 75.

కంసవధ వర్ణనము. 

 

 

మ.

ఉదయం బందు భయార్త భోజపతి యీ నోజం జెలంగెం బురిన్

రొద లా మల్ల కటంబ ఘోషములు గూర్చుండంగ క్ష్మాభృత్తులే

ముద మేపారఁగ నందగోపుఁడును నా భూజాని నీ వన్న తో 

బెదరే లేక మదేభ మా కువలయాపీడంబు రా నాపెనే

1.      

 

 

 

 

ఉదయముననే భయ పీడితుఁ డా కంసుఁ డీయ నాజ్ఞ నంతఁ పురములో రాజ వర్గము, ముదిత నందుఁడు  రాజైన కంసుఁడు కూర్చొని యుండ నుత్సాహముగ మల్లుర వాద్య ఘోషము లొక్క త్రుటి చెలంగినవి. అన్నతో గూడి దేవా నీవు రాఁగఁ గువలయాపీడ మను మత్తేభము బెదరు లేక నిన్ను నాపెను. 

 

 

 

 

చం.

విడు మిడు దారి దుష్ట యన వేగమ మార్కొని మావటీఁడు దాఁ

దడయక రేఁపఁ గోపమున దంతి గ్రహింపఁగ నిన్ను లీలఁగా

విడివడి కొట్టి గుబ్బ సరి పెందల పైనఁ గరీంద్రు దాఁగి నీ

వడరుచుఁ కాళ్ల మధ్యఁ జిఱు హాసముతో మఱి నిర్గమించితే

2.     

 

 

 

 

ఓ దుష్టుఁడ మావాటీఁడ దారి విడువు మన వాడు వినక నెదుర్కొని కోపముతో నేనుఁగు నుసి కొల్ప గజము నిన్ను పట్టుకొనెను. అంత లీలఁగా దానినిఁ దప్పించుకొని కొండ వంటి దాని పెద్ద తలపైఁ గొట్టి దాని కాళ్ల మధ్య దూఱి నవ్వుచు బయటకు వెడలితివి.

 

 

 

 

చం.

కరి కర మందుఁ జిక్కినను గ్రక్కున జాఱుదు మౌని కోటికిన్

జరిగెడు నట్లు లీలఁగ గజమ్మును గ్రిందికిఁ ద్రోసి లేచినం

గరి ఘన దంతముం బెఱుక గట్టిగ మూలము తోడ వెల్వడన్

సరమగు రాధ కంచు నని సఖ్యున కిచ్చితి వాణిపూసలన్

3.     

 

 

 

 

మునులకుఁ జిక్కి నట్లుండి జాఱు విధమున నేనుఁగు పట్టు నుండి గ్రక్కున జాఱి దానిఁ గ్రిందికిఁ ద్రోసిన నది లేవఁగా దాని దంతమును మూలముతోఁ బెఱుకఁగా మజ్జ నుండి పుట్టిన యట్టి యాణి ముత్యములను  రాధకు దండ కాఁగల దని చెప్పి నీ సఖున కిచ్చితివి.

 

 

 

 

ఉ.

దంతము నంస మందు నిడి తాళపతాకుని తోఁ జనంగ నీ

వంతట మల్లరంగమున కచ్చెరు వందిరి మంగళాకృతిం

గంతు నిభమ్ము లోకు లటఁ గాంచి వచించిరి ధన్యులౌర యా

కాంతలు నయ్యశోద వ్రజకాంతుఁడు కాదయ మేమ ధన్యులమ్

4.     

 

 

 

 

ఆ దంతమును భుజముపై నిడికొని యన్నతో నీవు మల్ల రంగమునకు నేఁగఁగ నక్కడి వారు మన్మథుని బోలి మంగ ళాకారమునఁ గనిపించు నిన్ను జూచి యాశ్చర్యపడి యిట్లనిరి. నందుఁడు యశోద వల్లవ కాంతలు కాదు కాదు మేమే ధన్యులము.

 

 

 

 

శా.

ఆ గోపాలుర యందు భాసిలఁగఁ నీవచ్చోట నిస్సీమునిన్

భోగానంద రసాత్ము బ్రహ్మము సురూపున్ సాంద్ర రోచిష్ణునిన్

రాగం గొందఱు నిన్గనంగఁ దొలుతన్ రంజిల్లి  లుప్తాఘులై

రాగం బొప్ప నెఱింగి నీ సుకృత కార్యవ్రాతముం దల్చిరే

5.     

 

 

 

 

ఆ గోపబాలకుల నడుమ వెలుంగు చుండి రాఁగ మేరలేని వానిని, సౌఖ్యానంద రసాత్ముని, బ్రహ్మ స్వరూపుని,మిక్కిలి ప్రకాశించు వాఁడవు  నైన నిన్ను మొట్ట మొదట సారిగాఁ గాంచి జూచి నంతనే తొలఁగ నెల్ల పాపములు సంతోష మంది  కొందఱు ప్రేమ యుప్పొంగ నీ మహత్వ కార్యముల నెల్ల నెఱింగి వానినిఁ దలఁచుకొనిరి.

 

 

 

 

తే.గీ.

ముష్టికుండు చాణూరుఁడు మూరి కంసు

నాజ్ఞ బలరాము నిన్ను దర్పాతిశయు లె

దిర్పఁ బడి లేచి లాగుచుఁ దిరుగు చొఱగ

మోక్ష బంధనములఁ గనె ముందుగ మృతి

కన్నఁ జాణూర మల్లుఁడు కన్న! వింత

6.     

 

 

 

 

కన్నా యంత కంసు నానతి చాణూరుఁడు ముష్టికుఁడు నిన్ను బలరాముని దర్పమున నెదిర్చిరి. చాణూర మల్లుఁడు నిన్నెదిర్చి పడి, లేచుచు, లాగుచు, దిరుగుచు, వ్రాలుచుండ మృత్యువునకు ముందే వింతగా నీ బంధమును విడుదలను బొందెను.  

 

 

 

 

మ.

అకటా చిన్ని కుమారు లీ లలిత దేహస్వాంతు లీ మల్లు లే

మొ కఠోరాగ్ర తనూ విభాసితులు దర్పోల్లాసులే చూడ రా

దిఁక ఘోరమ్మనఁ ద్రిప్పి చంపితివి మల్లేభేంద్రుఁ జాణూరు ము

ష్టికు నత్యుగ్రునిఁ జంప నగ్రజుఁడు తచ్ఛేషమ్ము వే పాఱెనే

7.     

 

 

 

 

అక్కటా యీ చిన్ని కుమారులు చూడఁ గోమలమైన శరీరము మనస్సులు కలవారు కాని యీ మల్లులు కఠోరమైన మేను గలవారు దర్పము నుత్సాహము మిక్కుటముగా గల వారు నింక నీ ఘోరమును చూడ లే మని సభ్యు లనుఛుండ నీవు మల్లవీరుని చాణూరునిఁ ద్రిప్పి చంపితివి. ముష్టికుని నత్యుగ్రుని బలరాముఁడు చంపెను. మిగిలిన వారు పాఱిపోయిరి. 

 

 

 

 

ఉ.

తూర్య రవమ్ము లాప మని తోఁపక కంసుఁడు కాల యుక్తముల్

కార్యము లాన తీయ జనకక్షయ మావల నిన్ను గెంట దు

ర్వార్యుఁడు దుష్ట వాక్యముల రంగపు మంచము పైకి దుమ్కి నీ

వార్యుఁడు పక్షి రాజు వలె నాతనిఁ బట్టితి వౌగ్రసేనునిన్

8.     

 

 

 

 

అంత కంసుఁడు తూర్యనాదముల నాప మని యా కాలమునకుఁ దగిన పనులు నేరక నీ తండ్రినిఁ  జంపు కార్యమున కానతి యొసఁగి యావల నిన్ను గెంటుటకును దుర్వార్యుఁడు చెడ్డ పలుకులు పలుక నీవు గరుత్మంతుని వలె రంగపు మంచము పైకి దుమికి యా కంసునిఁ బట్టితివి.

 

 

 

 

చం.

రయముగఁ గీళులన్ నలిపి రాజును గ్రిందికిఁ ద్రోసి వాని పై

న యదు వరేణ్య పడ్డఁ గని నాకులు జల్లిరి పూలవాన నీ

పయి సతతమ్ము భీతి నిను వారక చిత్తము నందు నుంచఁగా

నయముగ ముక్తి నిచ్చితివి నర్కి గతాసువు కాలనేమికిన్

9.     

 

 

 

 

అంత వేగముగఁ గంసుని కీళ్లు నలిపి క్రిందికిఁ ద్రోసి వాని మీద యదుపుంగవా నీవు పడ్డఁ గాంచి దేవతలు నీ పైనఁ బూల వాన కురిపించిరి. నిరంతరము భీతితో నిన్నే యాగక తన చిత్తము నందు నుంచఁగ నఱికి కాలనేమి యైన  కంసునకు మరణింప ముక్తి నిచ్చితివి.

 

 

 

 

చం.

మఱియును వాని తమ్ము లెనమండ్రురఁ జంపి నమస్కరించియుం

దఱచుగఁ దల్లిదండ్రులకుఁ దాతను రాజునిఁ జేసి బంధు లం

దఱకు నొసంగి దానములు ధన్యుని యుద్ధవు సఖ్య మందియున్

వఱలితి పట్టణమ్మునను వాయుపు రాధిప పాపు రోగముల్

10.  

 

 

 

 

మఱియు నెనమండ్రుగురు వాని తమ్ములను జంపితివి. అంత నధికముగా దేవకీవసుదేవులకు నీ తల్లిదండ్రులకు నమస్కరించి తాత యుగ్రసేనునకుఁ బట్టము కట్టి బంధువు లందఱికి దానము లొసంగి ధన్యుఁ డుద్ధవుని స్నేహము నొంది మథురాపట్టణమునఁ బ్రకాశించితివి. గురువాయూరు నాథా నా రోగములను బాపుము. 

 

 

ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయమున డెబ్బది యైదవ దశకము. 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము

(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము)

దశమ స్కంధ పరిచ్ఛేదము

దశకము 76.

ఉద్ధవ దూత్య వర్ణనము. 

 

 

మ.

చని సాందీపని పర్ణశాలకుఁ జతుష్షష్టిద్యుమాత్రమ్ము నం

దునె సర్వజ్ఞ సువిద్యలన్ని బలుతోఁ దోరమ్ముగా నేర్చి పు

త్రుని మృత్యుం గతుఁ దెచ్చి యిచ్చి మునికిం దూర్ణమ్ముగం జేరి కా

లుని వేశ్మంబును బాంచజన్య నిన దాలోలా పురం బేఁగితే

1.      

 

 

 

 

సాందీపని యాశ్రమమునకు నేఁగి యఱువది నాలుగు దినముల లోనే సర్వజ్ఞుఁడ వైన నీవు విద్యల నెల్ల బలరాముని తోఁ గూడి నేర్చితివి. మృతుఁ డైన గురుపుత్రుని యముని యాలయము సేరి రయమునఁ దెచ్చి యిచ్చితివి. అంత పాంచజన్య నాదమునకు విలోలుఁడ వగుచుఁ నిజ బురము సేరితివి.

 

 

 

 

తే.గీ.

తలఁచి తలఁచి గోప వశలఁ దమిఁ దలఁచెడు

వారి ననిపితి వుద్ధవు మూరఁ గరుణ

ప్రియ సఖునకు నరుదగు వారి దగు భక్తి

దుర్లభముఁ జూప సుద్దుల తోడ నటకు

2.     

 

 

 

 

నిన్ను ప్రీతితోఁ దలఁచెడు గోపికలను మదిలోఁ దలఁచి తలచి కరుణ యుప్పొంగ నుద్ధవుని నీ కతి ప్రియమైన  మిత్రుని నీ మాటలుగా వారికిఁ జెప్ప మని కొన్నిసెప్పి దుర్లభము నరుదు నయిన వారి భక్తిని వానికిఁ గూడఁ జూపఁ దలఁచి వారి వద్దకుఁ బంపితివి. 

 

 

 

 

ఉ.

చేరి దినాంత మందు యదుశేఖరుఁ డుద్ధవుఁ డిద్ధ గోకుల

మ్మారయ నీ మహత్త్వమున కద్దము నందునకున్ యశోదకున్

వారని మోద మిచ్చెఁ దవ వార్తలఁ బ్రొద్దుటఁ దేరు గాంచి రా

నారులు శంక మిత్రుఁడ యనం గని కూడిరి వీత కార్యలై

3.     

 

 

 

 

ఆ యదుపుంగవుఁ డుద్దవుఁడు దినము ముగియు వేళకు నీ మహత్తున కద్దము వంటి గోకులము చేరి యశోదా నందులను గలుసు కొని చెప్పఁగ నీ వార్తలు  మిక్కిలి సంతోషము నిచ్చినవి. మఱు నాటి యుదయమున రథమును గాంచి గోపికలు నీవు వచ్చితి వన్న శంకతో వచ్చి నీ  మిత్రునిఁ గని పనులు మానుకొని నంద గృహమున గూడిరి. 

 

 

 

 

చం.

నిను మది నెంచి యెంచి కని నీరజ నేత్రలు మిత్రుఁ డుద్ధవుం

గనఁబడ వేష భూషల నికాశము నీకును మాట రాక నో

టను మఱి తమ్మునన్యుల నటం గన నేరక గద్గదంబుగన్

మినుకులు పల్కి రెల్లరును మెల్లఁగఁ జేష్టల విస్మరించుచున్

4.     

 

 

 

 

నిన్ను మదిలోఁ దలఁచి తలఁచి యా నీరజాక్షులు వేషమున నలంకారముల నీ వలె నున్న నీ మిత్రుఁ డుద్ధవునిఁ గాంచి యచ్చెరువున మాటలు రాక  తాము నితరు లను భేదము నెఱుఁగక గద్గదముగఁ దమ చేష్టలను విస్మరించుచు మెల్లగ నెల్లరు మాట లిట్లు పల్కిరి.

 

 

 

 

తే.గీ.

అయ్య మాతా పితల కంపి నట్టి వాఁడ

వీవ నిర్దయుం డా కాంతుఁ డెక్క డయ్య

నగరి మురిసెన యాలింగనములు ముద్దు

లింక గుసగుసల మఱచు నింతు లెవరు

5.     

 

 

 

 

అయ్యా నీవు తల్లిదండ్రుల కొఱకుఁ బంపఁ బడిన వాడఁవా? నిర్దయుఁ డైన యా కాంతుఁ డెక్కడ? నగరములో మురియుచు నుండెనా? యాతని యాలింగనములు, ముద్దులు, గుసగుసలను మఱచు భామ లెవ్వ రిక్కడ?

 

 

 

 

చం.

లలితపు రాసలీలఁ గల రంజన రూపము క్షిప్త ఘర్మ కో

మలము విలోల కేశ తతి మార సమాన విలాస దేహమున్

నలినదళాక్ష చూపు మిట నాథుఁడ కౌగిల లోభనీయమున్

వలపునఁ బల్కి రిట్లుఁ గడు వల్లవ కాంతలు మన్మ థార్తలై

6.     

 

 

 

 

రాసలీల నాటి లలితము రంజకమైన నీ రూపమును, నిక్షిప్త మైన స్వేదజలమును, జెదరిన జుట్టుతో మన్మథ సమాన విలాస దేహము నో నలినాక్షా మాకు జూపుము. లోభనీయమైన కౌగిలి నిమ్ము. ఇట్లు గోపకాంతలు కామ తప్తలై వలపు మీఱఁ బల్కిరి.

 

 

 

 

తే.గీ.

పలు విధము లిట్లు వివశపుఁ బల్కు లనుచు

నార్త గోపిక లూఱట నంది రంత

నీదు సందేశముఁ దెలుప నెమ్మి నుద్ధ

వుండు కతిపయ దివసము లుండె నతఁడు

7.     

 

 

 

 

పలు విధములుగ నిట్లు వివశత్వమున నార్తితో గోపికలు పలుక దేవా నీ సందేశము నుద్ధవుఁడు వారికిఁ దెలిపిన నూఱట సెందిరి.  అంత నచ్చట యుద్ధవుఁడు కొన్ని దినములు గడపెను.

 

 

 

 

చం.

చెలఁగ సతమ్ము నెల్లెడలఁ జేయఁ బనుల్ చెవి నీదు గానముల్

చెలువపు నీదు వార్తలు విశేషము లొప్పుగఁ జెప్పుచుండగం

బలుకులఁ జెయ్వు లందుఁ గనఁ బన్నుగ నీదు విడంబనమ్ములే

లలనల త్వన్మయంపు టనురాగము విస్మితుఁ జేసె నుద్ధవున్

8.     

 

 

 

 

అంతటఁ బనులు సేయుచుఁ జెవుల నీ గానములు చెలఁగ నందమైన నీ వార్తలు విశేషములను జెప్పు చుండుచుఁ బలుకు లందు చేష్ట లందు నీ యనుకరణములే గన్పడఁ దన్మయలై లలనలు నీ యంద చూపు ననురాగము నా యుద్ధవుని విస్మయపఱచినది.

 

 

 

 

ఉ.

నా సఖి రాధ కిష్ట మిది నా దరి రాధయె పల్కు నివ్విధిన్

నా సఖ మౌన మేల నయ నా ప్రియ మానిని వోలె నంచుఁ దా

నో సఖి నీ ప్రియుం డనును యుక్తపు రీతిని నొంటి నుండగా

బాసల నంచు నుద్ధవుఁడు పద్మదళాక్షి కొసంగె హర్షమున్

9.     

 

 

 

 

నా సఖి రాధ కిది యిష్టము, రాధ యివ్విధి పల్కును, నా రాధ వలె నీకు నో సఖా మౌన మేల యని మాటలలో మే మొంటిగ నున్నప్పుడు నాతో యుక్తముగ నో రాధాదేవీ  నీ ప్రియుఁడు పల్కు చుండు నని చెప్పి యా పద్మదళాక్షికి సంతోష మొసంగెను. 

 

 

 

 

మ.

అచిరం బే నిఁక వత్తు నచ్చటకుఁ గార్యార్థమ్మ జాగయ్యెడిన్

రుచిర జ్ఞప్తులు నిబ్బర మ్మయిన నాక్రోశమ్ము లెట్లుండు మీ

రచిరం బింపుగఁ గాంచు వారలరు బ్రహ్మానంద మందుండుగా

నుచితంబై విరహమ్ము సంగమము మీ కోర్వంగఁ దుల్యంబుగన్

వచన వ్రాతము లిట్లు తెల్పి పరితాపంబెల్లఁ బోగొట్టెనే

10.  

 

 

 

 

అచిరము నేను వచ్చెదను. పను లుండుట వలన జాగయ్యెను. చక్కటి జ్ఞాపకములు పెల్లుగ నుండఁగ దుఃఖము లేల యుండును? త్వరలో బ్రహ్మానందమును బడయ మీకు నా విరహము సంగమము కూడ సమానములై యుండును. ఇట్లు చక్కటి నీ పల్కులను దెలిపి వారి తాపము నుద్ధవుఁడు పోగొట్టెను.  

 

 

 

 

తే.గీ.

విశ్వముల నిట్టి భక్తిని వినము కనమె

యేల శ్రుతులు తపము లని యీ వ్రజాంగ

నలకు రహి నిన్ను గనె వీడి నంద గృహ మ

తండు రుజలు మరుత్పుర ధవ యణఁపుమ

11.   

 

 

 

 

లోకములో నిట్టి భక్తిని వినము చూడము. వేదములు తపములు నేల యీ గోపికలకు? ఇట్లెంచి నందుని గృహము వీడి సంతసమున నుద్ధవుఁడు నిన్ను జూచెను. గురువాయూరు నాథా నా రోగములను బాపుము.

 

 

 

ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయమున డెబ్బది యాఱవ దశకము. 

 

 

 

 

 

 

 

శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము

(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము)

దశమ స్కంధ పరిచ్ఛేదము

దశకము 77.

ఉపశ్లోకోత్పత్తి, జరాసంధాది యుద్ధ, ముచుకుందానుగ్రహ వర్ణనము. 

 

 

ఆ.వె.

దినదినమ్ము గృహముఁ దనరించి శోభల

భూష లూని చిత్తమునఁ దలంచు

చుండు కామ తప్త సుదతి కుబ్జ యిలు సే

రితివు యుద్ధవుని సహితము దేవ

1.      

 

 

 

 

ప్రతి దినము తన గృహము నలంకరించి యాభరణముల నూని మనస్సులో నిన్ను దల్చుచు నీ పైఁ గోరికతో నున్న వనిత కుబ్జ యింటికి నుద్ధవునితోఁ గూడ నేఁగితివి.

 

 

 

 

కం.

చని సఫలేచ్ఛను సోద్వే

గను గృత సమ్మానఁ గుబ్జఁ గంప్ర ఘన కుచం

గని యేకాంతముగా సుఖ

ము నొసంగితి గట్టువాలు ముద్దియ కెలమిన్

2.     

 

 

 

 

నిండిన కోరికతో నుద్వేగముగా నున్న నీ చే గౌరవింపఁ బడిన కుబ్జను గాంచి యేకాంతముగా నా సైరంధ్రికి సుఖము నొసంగితివి.

 

 

 

 

తే.గీ.

వర మడుగు మన విరిఁబోఁడి సురత మడిగె

నకట నిశ లందు నీ యందు నైక్య మింక

నీదు సామీప్య మైనను నేర దడుగఁ

బాప మేమందు దాని దుర్భాగ్య మకట

3.     

 

 

 

 

అంత నీ వామెను వర మిచ్చెదఁ గోరుకొను మన రాత్రు లందు నీ పొందునే యామె కోరుకొన్నది. పాపము నీ లో నైక్యతను గాని నీ సాన్నిధ్యమును గాని కోర నేరదు. ఆమె దౌర్భాగ్యము నకట యే మందుము?

 

 

 

 

కం.

సుదతి వినోదపఱచి సకృ

ప దినమ్ములు గొన్ని సుతు నుపశ్లోకుని నా

రద దయ సాత్త్వత తంత్ర సు

విదునిఁ బ్రసాదించి తీవు విశ్వాధీశా

4.     

 

 

 

 

అంత కొన్ని దినము లా కుబ్జను సంతోష పఱచి యుపశ్లోకుఁ డను బుత్రు నిచ్చితివి. అతఁడు నారదుని కృపతో సాత్త్విక సిద్ధాంతములో  నేర్పరి యయ్యెను.

 

 

 

 

తే.గీ.

అంత నక్రూరు నింటికి నన్న యుద్ధ

వుల సహిత మేఁగి ముద మంది పొగడ ని న్న

తండు వని నుండి మరలిన పాండు సుతుల

చరితము ధృతరాష్ట్రు పనుల నరయు మంటి

5.     

 

 

 

 

తదుపరి యన్న యుద్ధవుల తోఁ గలసి యక్రూరుని యింటికి నేఁగ నతఁడు నిన్ను సంతోషముతోఁ  బొగిడెను. అడవుల నుండి మరలి వచ్చిన పాండవుల విషయమును ధృతరాష్ట్రుని పనులను దెలిసికొన మని  యక్రూరునిఁ బంపితివి.

 

 

 

 

మ.

తన జామాతను జంప నూని యెదఁ గ్రుద్ధమ్మున్  జరాసంధుఁడే

యని రోషాంధత ముట్టఁగా మథురఁ బెన్నక్షౌహిణీ సేనలం

గని, తాలాంక యుతమ్ము కొంచెపు టనీకంబుండ వే చంపితే

నిను జేరన్ వెస స్యందనాదులు నభోనీతమ్ము లింపారఁగన్    

6.     

 

 

 

 

తన యల్లుఁడు కంసుని నీవు చంపుట విని కోపము మనస్సు నందుంచి యనే కాక్షౌహిణీ  సేనలతో మథురను ముట్టడింపఁగా స్వర్గము నుండి లబ్దమైన రథములు మున్నగునవి రాఁగ నా కొంచెపు సేనతో  బలరామునిఁ గూడి యుద్ధమున నా శత్రు సేనలను వేగమ  బరిమార్చితివి.

 

 

 

 

చం.

బలిమిని మాగధుం దొడరి బంధితుఁ జేయ బలుండు నమ్మహా

బలుఁ దమిఁ దిర్గి రాఁ దలఁప భావి బలమ్మును బ్రోగుచేసి సం

కుల కలి కంచు ముక్తినిగఁ గోరి యొనర్చితి వంత మాధవా

బల తరుఁ డన్యుఁ డుండఁ డని పాత్రుఁడు సైన్య సుచోదకుం డిలన్

7.     

 

 

 

 

బలముతో జరాసంధుని మహా బలశ్రేష్ఠుని నెదిరించి బలరాముఁడు బంధింపఁగా నింకను సేనను గూడఁ గట్టు కొనుటకు సమర్థుఁడు గనుక నట్లు సేనతో తిరిగి యుద్ధమునకు రాఁ దలఁప వలెనని యెంచి వానిని విడిపించితివి. ఇతని కంటె బలమైన వాఁడు యోగ్యుఁడు, సైన్యమును బ్రేరేపింపఁ గల వాఁడు మఱి యొకండు ధరలో లేఁడని యట్లు చేసితివి.

 

 

 

 

తే.గీ.

సమర షోడశ మొనరించె సడలిన మది

నలిగి ప్రేరేప నృపులు జరాత్త తనుఁడు

పూని ధ్వంసము చేసితి వాని మూడు

నూర్ల తొంబది యొక్క పెన్మొనను గనలి

8.     

 

 

 

 

ఓడిన నలిగి యితర రాజులు ప్రోత్సహింప జరాసంధుఁడు పదునాఱు తడవలు  యుద్ధము చేసెను. నీ వుద్యమించి వాని మున్నూఱు తొంబది యొక్క యక్షౌహిణుల సేనను ధ్వంసము చేసితివి.

 

 

 

 

తే.గీ.

పదునెనిమిదవ యాజి యవనుఁడు మూడు

కోట్ల యవనులఁ గూడి రా నట్లు గాంచి

జలధి మధ్య పురినిఁ ద్వష్ట సత్కృతమ్ము

స్వజన గణ ముంచితివి యోగ బలము వలన

9.     

 

 

 

 

పదునెనిమిదవ మాఱు  యుద్ధమున యవనుఁడు కూడ  మూడు కోట్ల యవనులను గూడి ముట్టడింపఁ గాంచి సముద్ర మధ్యమునఁ ద్వష్టచే నొక నగరమును నిర్మింపఁ జేసి నీ వారి నందఱిని యోగ బలమున నచ్చట నుంచితివి.

 

 

 

 

చం.

నడచితి మాల నూని త్రసనమ్మున నా నగరమ్ము వీడి దు

ష్టుఁడు యవ నేశు పుణ్యగణ శూన్యు వినాశము నెంచి తోడు రా

వడి ముచుకుంద సుప్త గుహఁ బన్నుగఁ దూఱఁగఁ దన్న వాఁడు ఱేఁ

డడరి కనంగ నయ్యె మసి యా నృపుఁ గాంచితి రమ్యరూపునిన్  

10.  

 

 

 

 

అంత నీవు మెడలో మాల ధరించి భయమున మథురా నగరము వీడి పుణ్యహీనుఁడు దుష్టుఁడు నైన యవన పతి నాశము గోరి  పఱుఁగిడ వాడు వెంటఁబడ ముచుకుందుఁడు నిద్రించు గుహలోఁ  దూఱితివి. వాఁడు వచ్చి నిద్రించుచున్న ముచుకుందునిఁ దన్నఁగ నతఁడు లేచి త్వరపడి చూచి నంతనే యవనుఁడు మసి యయ్యెను.  అంత నీవు సుందరుఁ డైన ముచుకుందునిఁ జూచితివి.

 

 

 

 

తే.గీ.

దేవ యైక్ష్వాకుఁడను నేను లేవు కోరి

క లిల నీ ప్రసాదమ్ము తక్క నని ప్రణతు

లిడఁగ ముద మంది మఱి ముక్తి నిచ్చి తపము

నాచరింప మంటివి వాని నఘము లడఁగ

జనుల కిలఁ జూప మార్గమ్ము సత్యముగను

11.   

 

 

 

 

అంత ముచుకుందుఁడు దేవా నే నిక్ష్వాకు వంశస్థుఁడను నీ దయ తక్క నొండేమియుఁ గోర నని నీకు ప్రణామములు సేయ నీవు సంతసించి ముక్తినిఁ బ్రసాదించి పాపము లడఁగుటకుఁ దపము సేయ మంటివి. ఈ విధముగా జనులకు ముక్తి మార్గమును నిజముగఁ జూపితివి.  

 

 

 

 

తే.గీ.

మథుర కేఁగి యవన వీర మాన్య సైన్య

మణఁచి మగధపతి కొసఁగ నంత నాజి  

నంతిమ జయము బాఱితే యబ్ధి పురికి

వాయు పురనాథ నన్ను గాపాడ వయ్య

12.   

 

 

 

 

అంత మథుర కేఁగి యవన సైన్యమును నాశనము చేసితివి. జరాసంధుఁ డడ్డు పడ నతనికిఁ జివరి విజయము నొసఁగుటకుఁ గడలిలో నున్న పురికిఁ బాఱిపోయితివి. గురువాయూరు నాథా నన్ను గాపాడుము.

 

 

ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయమున డెబ్బది యేడవ దశకము. 

 

శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము

(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము)

దశమ స్కంధ పరిచ్ఛేదము

దశకము 78.

రుక్మిణీ స్వయంవరము. 

 

 

తే.గీ.

త్రిదివ వర్ధకి నైపుణ తేజ మలరఁ

ద్రిదశ దత్త విభూతి విరియ కరమ్ము

తిమి జలాంతర నవ నగరము నలంక

రించితి వపో రుచులు చిమ్మి యంచితముగ

1.      

 

 

 

 

విశ్వకర్మ నైపుణ్యపుఁ గాంతి మెఱయ దేవత లిచ్చిన వైభవము మిక్కిలి వికసింప సముద్రములో  నున్న నూత్న ద్వారకా నగరమును నీ దేహ కాంతులు సిమ్మి యొప్పుగ నలంకరించితివి.

 

 

 

 

కం.

రేవత భూపతి నిజ సుత

రేవతి నీయ సతిగ ముసలికి విధ్యాజ్ఞన్

నీ వడరి యాదవ గణ ము

దావహము మహోత్సవమ్ము నడరించితయా

2.     

 

 

 

 

రేవత రాజు తన కూతురు రేవతిని బలరామునికి విధి యానతిని భార్యగా నీయ సకల యాదవ జనులకు సంతోషము నీయ దేవా నీ వతిశయించి యా యుత్సవమును జరిపించితివి. 

 

 

 

 

తే.గీ.

సుదతి వైదర్భి రుక్మిణిఁ జొప్పడంగ

నీ పయిన ప్రణయమ్మువనితకు నగ్ర

జుండు చైద్యున కొసఁగంగ నుండె నడరి

యవగుణు సఖిత్వ మెంచి దేవా యవిద్య

3.     

 

 

 

 

విదర్భ రాజకుమారి యైన రుక్మిణికి దేవా నీ పై ననురాగము కలిగినది. అజ్ఞానమున రుక్మిణి యన్న రుక్మి  మిత్రుఁ డయినందున నవగుణుఁ డైనను జైద్యుఁడు శిశుపాలునకుఁ దన చెల్లెలి నీయఁ దల్చెను.

 

 

 

 

కం.

చిరకాల రతిఁ దలఁకి ని

ర్భర మార విఘాత తప్త భగ్నేప్సిత సా

దరము నిజ దుఃఖముఁ దెలుప

ధరణి సురుని నంపె నీకుఁ దరుణీ మణియే

4.     

 

 

 

 

చిరకాలపుఁ బ్రేమకుఁ జలించి నిర్భరమైన మన్మథ బాధకు గురియై తన కోరిక భగ్నము కానున్నఁ దన దుఃఖమును నీకు దెలుపుటకు సాదరముగా నొక భూసురుని నీ వద్దకుఁ బంపెను.

 

 

 

 

కం.

ద్విజ సుతుఁడు చేరి త్వరితముఁ

గుజన దురాసద తవ పురిఁ గొనె నీ వొసఁగన్

నిజ చిత్త మలరఁ గడు జ

న్మజ దుఃఖ చయాపహారి మాధవ! పూజల్

5.     

 

 

 

 

ఆ బ్రాహ్మణ కుమారుఁడు త్వరితముగ దుష్టులకుఁ జొరారాని నీ నగరమును జేరెను. జన్మ జన్మల దుఃఖములను హరించు మాధవా స్వయముగా నీవు చేసిన సన్మానముల నలరి స్వీకరించెను.

 

 

 

 

తే.గీ.

రుక్మిణీ సతి ధైర్యవిలోల కుండి

న నృపకన్య నీ యందుఁ దనరఁ గర మను

రాగము నను ననుప సత్వరమ్ము వచ్చి

తి నని పలికె నతఁడు నిన్ను గని నుతించి

6.     

 

 

 

 

అతఁడు నిన్ను జూచి నుతించి కుండిన నగర రాజ కుమారి రుక్మిణి నీ యందుఁ బ్రేమ యుప్పొంగ ధైర్యము కోల్పోయినది యై  నీ వద్దకు నన్ను బంప వచ్చితి నని పల్కెను.

 

 

 

 

తే.గీ.

మునుపె వశ నైతి నీ గుణములను గాంచి

నీకు నేఁడు చైద్యుఁడు నన్ను వీఁకఁ గొనఁ ద

లంచె నకట కృపాలయ మంచు మంచు

విశ్వపతి వేఁడుచున్నది వెలఁది నిన్ను

7.     

 

 

 

 

నీ గుణగణముల నెఱింగి మున్న నీకు వశ నైతిని. తివిరి యక్కట చైద్యుఁడు నన్ను గొనఁ దలంచు చున్నవాఁడు. కృపానిధీ నన్ను కాపాడు మని విశ్వదేవా నిన్ను రుక్మిణి వేఁడుకొను చున్నది.  

 

 

 

 

తే.గీ.

నీవు నన్నుపేక్షించిన నిక్కమ యశ

రణను విడుతుఁ బ్రాణమ్ములు రయము నన్న

సుదతి పల్కులు వినినంత సుజను నోట

హృదయ మది నీది చలియించె భృశము దేవ

8.     

 

 

 

 

నీవు న న్నలక్ష్యము సేసిన నిక్కముగ శరణు లేక ప్రాణములను విడిచెద నన్న దేవి పలుకులను విప్రు నోట విని నీ మనస్సు మిక్కిలి చలించెను.

 

 

 

 

తే.గీ.

అంత నంటివి మిత్రమ యామె కన్న

మిన్న నాకుఁ గలిగెఁ బ్రేమ యన్నరపతి

సన్నిధి నసితేక్షణఁ దెత్తు కన్నియను ద

యితను నిశ్చయముగ హరియించి ధృతిని

9.     

 

 

 

 

అంత దేవా నీ వా విప్రునితో మిత్రమా నాకు నామె కంటె నధికముగాఁ బ్రేమ కలిగినది. ఆ రాజు చూచు చుండ నల్లని కన్నులు గల యా కన్యను బ్రేయసిని నిశ్చయముగ నపహరించి తెత్తు నని ధైర్యముతోఁ బల్కితివి.

 

 

 

 

తే.గీ.

హర్ష మలర నతనిఁ గూడి యంత రథము

నందుఁ గుండిన కేఁగితి వబ్జనయన

దయ వహించి మరుత్పుర ధవ యణఁపుమ

నాదు క్లేశము లన్నిటి నలిననాభ

10.  

 

 

 

 

పద్మనాభా యంత హర్ష ముప్పొంగ దయతో నా భూసురుని తోఁగూడి రథమున గుండిన నగరమున కేఁగితివి. అట్టి గురువాయూరు నాథా నా బాధల నాపుము.

 

 

 

ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయమున డెబ్బది యెనిమిదవ దశకము. 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము

(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము)

దశమ స్కంధ పరిచ్ఛేదము

దశకము 79.

రుక్మిణీ స్వయంవర వర్ణనము. 

 

 

తే.గీ.

బలుఁడు సబలమ్ము ననుగమింప నిను జేరఁ

బురము భీష్మకుఁ డంత నాదరమున మిము

గౌరవించెఁ దెల్ప భవ దాగమనము ముద

మంది ద్విజునకు సతి సేసె వందనములు

1.      

 

 

 

 

సైన్యముతో బలరాముఁడు ని న్ననుగమింపఁగ నీవు కుండిన పురము చేరితివి. అంత భీష్మకుఁడు మిమ్ములను బ్రేమతో గౌరవించెను. నీ రాకను విప్రుఁడు దెలియఁ జేయ రుక్మిణి యతనికి వందనములు సేసెను.

 

 

 

 

కం.

జగదేక సుందరు నరసి

జగతి పతి కుమారు చేష్ట చయము నెఱిఁగియున్

నగర నివాసులు పల్కుచు

వగచుచుఁ గడపి రిఁక రాత్రి భార హృదయులై

2.     

 

 

 

 

జగదేక సుందరుఁడవైన నిన్ను జూచి పురప్రజలు రాజకుమారుని చేష్టల నెల్ల నెఱిఁగి వానిని చెప్పు కొనుచు చింతించుచు భారముగా రాత్రి గడపిరి.

 

 

 

 

కం.

చంద్రవదన యా రుక్మిణి

చంద్ర ధరార్థాంగి పూజ సలుపన్ నిజ సౌ

ధేంద్రము విడె సభట యదు కు

లేంద్రార్పిత హృది విభూషి తేద్ధాంగి వగన్

3.     

 

 

 

 

భటులతోఁ గూడిన యా చంద్రవదన రుక్మిణి పార్వతీదేవి పూజ సేయుటకుఁ దన నివాసమును వీడెను. యదు పుంగవుండ వైన నీకు నర్పించిన మనస్సుతో నలంకారములతోను వగపు గూడ కలిగి  యున్నది యామె.

 

 

 

 

తే.గీ.

చేరి గుడి కులకాంతలతో రమణి ప

దముల పైఁబడి వేఁడె సాదరముగ మఱి

మఱి గిరిసుతను గావలె మగఁడ వంచు

నింకఁ గేవల మీవ మహీతలమున

4.     

 

 

 

 

పుణ్య స్త్రీలతోఁ గలిసి రమణి గుడి సేరి పార్వతీ దేవి పాదములపైఁ బడి మన్ననతో నీవ తనకు భర్త కా వలెనని మఱల మఱల వేఁడుకొన్నది.

 

 

 

 

తే.గీ.

రాజసుతఁ గాంచ నిల్వ నరపతు లచట

నీవు నుండ గూఢముగను నిర్గమించె

నాలయము నుండి రాపట్టి యాశ లెల్ల

వెలుఁగ నంగ నాంగ రుచులు విరియ భృశము

5.     

 

 

 

 

రుక్మిణినిఁ జూడఁ గోరి నరపతు లచ్చట నిలిచి యుండ నీవు రహస్యముగా నుండ రాజకుమారి యాలయము నుండి బయటకు వచ్చెను. ఆమె శరీర కాంతులతో దిక్కు లెల్ల ప్రకాశించినవి. 

 

 

 

 

ఆ.వె.

వివశ మయ్యె రాజ వితతి భువన మోహ

నంపు రూపు గాంచి నలిన దళ న

యన కటాక్ష వీక్షణావలి వీక్షించి

నంత మోహ మడరె సుంత నీకు

6.     

 

 

 

 

భువన మోహన రూపమున నున్న రుక్మిణినిఁ జూచి నంత రాజలోకము వివశ మయ్యెను. నలినాక్షా నీవు కూడ యామె కడకంటి చూపులను జూచి యించుక మోహ వశుఁడ వైతివి. 

 

 

 

 

కం.

ఎట కేఁగెదు చంద్రానన

యిటు లని సతినిఁ గదిసి హరియించి కరమ్ముం

ద్రుటిఁ గొని నుంచఁగ రథమునఁ

బటుతర రవములు సెలంగెఁ బగతుర మధ్యన్

7.     

 

 

 

 

చంద్రవదనా యెట కేఁగెద విటు రమ్మని యా సతినిఁ జేరి యామె చేతిని గ్రహించి యొక్క ద్రుటిలో నీ రథముపై నుంచఁగా నా పగవారి మధ్య పెద్ధ ధ్వనులు చెలరేఁగినవి.

 

 

 

 

కం.

గొల్లఁ డెటు పోయె నంచని

యెల్ల రలిగి యాజి సేయ నీసున బలు పె

న్వెల్లువ వడి నోడించెను

దల్లడిలవు హరి వలె వృకదంశమ్ములకున్

8.     

 

 

 

 

అంత నెల్లరు గొల్ల వాఁడు కృష్ణుఁ డెటు వోయె నంచుఁ గోపించి యుద్ధమునకుఁ దిగఁగా బలరాముని పెద్ద సైన్యము వారి నోడించెను. కుక్కలకుఁ జెదరని సింహము వోలె నీవు కొంచె మైనను జలింప లేదు.

 

 

 

 

చం.

కదియగ నంత రుక్మి తమకమ్మున నాజికిఁ జంప నెంచ కా

మద గుణ మత్తు బంధన నిమగ్నునిఁ జేసి విరూపిఁ జేయగం

జెదరఁగ గర్వ మగ్రజుఁడు సెప్ప విముక్తునిఁ జేసి వాని నీ

వు దయ వహించి యింక వడిఁ బోయితి వీటికిఁ గాంత తోడుతన్

9.     

 

 

 

 

అంత రుక్మి తమకమున నిన్నెదెర్చి యుద్ధమునకు రాఁగ నతనిఁ జంప నిష్టము లేక మదముతో మత్తెక్కిన వానిని బంధించి వాని గర్వము చెదరు నట్లు విరూపినిఁ జేసితివి (జుట్టు  మీసములు గొఱిగి). అన్నమాటపై నతనిని దయతో విడిచి పెట్టితివి.  అంత కాంతతో రయమున నింటికి వెడలితివి.

 

 

 

 

తే.గీ.

క్రొత్త పెండ్లి కుమార్తె సిగ్గు లొలుకంగఁ

బ్రణయ హర్ష విజృంభిత పరమ కాంక్ష

నతివ నలరించితి విభు రహస్యముగను

రమ్య దరహాస వికసిత రాజి తాస్య

10.  

 

 

 

 

దేవా యందమైన చిరునవ్వుతోఁ బ్రకాశించు వదనము కల రుక్మిణినిఁ గ్రొత్త పెండ్లి కూతురు సిగ్గు లొలుకుచుండఁ బ్రణయముతో మూరు కోరిక గల నామెను రహస్య ప్రదేశముల నలరించితివి.

 

 

 

 

ఆ.వె.

అలరు నర్మ గిరల నతివ యహరహము

చెలఁగి ముదము కలుగఁ జేయ దేవ

పరఁగ నొక్క నాఁడు వక్రభాషలు తీవ్ర

కలఁత మునుఁగు సరళ కాంత యకట

11.   

 

 

 

 

నీవు నర్మపు భాషణములతో దినదినము సంతోష పెట్టుచుండ రుక్మిణి  యలరు చుండును. నీవు వక్రపు మాటలాడ నొక్కక్క నాఁడు సరళ భావపు కాంత తీవ్ర కలఁతలో మునుంగును.

 

 

 

 

తే.గీ.

అంత నప్పుడు లాలింతు వధికముగను

మునుపు కన్న నెక్కుడు సుఖము నొసఁగుచు ము

కుంద కీర్తింతు నీ లీల లందముగను

నాదు రోగము లణఁపుమ నలిననేత్ర

12.   

 

 

 

 

అంత నీ వామెను మునుపటి కన్న మిక్కిలి సుఖము నొసఁగుచు లాలింతువు. ముకుందా నీ లీల నందముగాఁ గీర్తింతును. నలినాక్షా నా రోగములను బాపుము. 

 

 

 

ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయమున డెబ్బది తొమ్మిదవ దశకము. 

 

 

 

 

 

 

 

శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము

(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము)

దశమ స్కంధ పరిచ్ఛేదము

దశకము 80.

స్యమంతకోపాఖ్యానము. 

 

 

మ.

తగునే లుబ్ధుని భంగి నీ వడుగ సత్రాజిత్తుఁ బూషుండిడన్

నగ దివ్యంపు స్యమంతకమ్ముఁ దమి నన్యాయంబె తత్కారణ

మ్మగు బెక్కుల్ దనరంగ వంకలు వివాహంబాడఁ జిత్తమ్మునం

దగ నూహించుట నెంతు వాని సుతఁ ద్వద్రక్తాత్మ సాత్రాజితిన్

1.      

 

 

 

 

సత్రాజిత్తునకు సూర్యుఁ డీయ దివ్య మైన స్యమంతక మను నగ నాసక్తితో దానిని నీ వడుగుట తగునే? యన్యాయమా! కాదు. దానికి నెపములు పెక్కులుండ నీ యందుఁ గడు ననురాగము వహించిన సత్యభామను సత్రాజిత్తు పుత్రికను బెండ్లాడఁ దలంచుట కారణ మని నే నూహింతును. 

 

 

 

 

చం.

ఒసఁగక యున్న లోభి యయి యుత్తమ రత్నము నీకు నత్తఱి

న్మసలఁగఁ గంఠమం దిడి యనంతరజుండు ప్రసేనుఁ డమ్మణిన్

వెస వని మాంశ ఖండమని ప్రీతిఁ గొనన్ సమయించి సింహమే

కసి హరిఁ జంపి రత్నమును గాదిలి సూనున కిచ్చె నచ్ఛమే

2.     

 

 

 

 

ఆ యుత్తమ రత్నమును లోభియై నీ కీయక యున్న నంత నాతని తమ్ముఁడు ప్రసేనుఁడు మణిని మెడలో ధరించి మసలు చుండ వనమున మాంస ఖండమని యెంచి యొక సింహము వానిని వధించి మణిఁ గైకొని చనుచుండ నా సింహమును జంపి యొక యెలుఁగుబంటి యా రత్నమును గ్రహించి తన ప్రియ మైన కుమారునకు నొసంగెను. 

 

 

 

 

మ.

తనరన్ శంకలు పౌర కోటి కిఁక సత్రాజిత్తు వాక్యమ్ములం

గన నయ్యెన్ మణి దొంగ వీ వనఁగ నే కాసంత దోషమ్ము గాం

చినఁ బీయూషమ బంధు యుక్తము బరీక్షింపంగ సర్వజ్ఞ వే

చని వీక్షించి హరిప్రసేనులను  ఋక్షస్వాంతముం జేరితే

3.     

 

 

 

 

మణి దొంగవు నీ వని సత్రాజిత్తు పలుకుచుండఁ బౌర సమూహమునకు సందేహములు కలుగు చుండ నీ యందుఁ గొంచెము దోష మున్నను జనులకు నమృతము వంటిదే. దేవా సర్వజ్ఞుఁడ వైనను నీవు బంధు సమేతముగా వెదకుటకు వేగమ యేఁగి సింహ ప్రసేనులఁ గాంచి భల్లూకపు గుహ సేరితివి.  

 

 

 

 

ఉ.

నేరక నిన్ను వృద్ధతను నిల్పఁగ నన్నిట విష్ణు రక్షితుం

జేరిన వీరుఁ డెవ్వఁ డని చింతిలి మిక్కిలి ప్రేలుచుండి రా

మా రఘువీర నీకు విజయమ్మగు  నంచును  జాంబవంతుఁడే

వారని పూజ చేసె వర భక్తశిరోమణి స్వీయ ముష్టులన్

4.     

 

 

 

 

ముసలిదనము వలన నిన్ను నేరక యన్నిట విష్ణువుని నిల్పి నట్టి యీ రక్షితునిఁ జేర వచ్చిన వీరుఁ డెవ్వఁ డని చింతించుచు రామా రఘు వీరా నీకు జయ మగు గాక యని మిక్కిలి ప్రేలుచు భక్త శిరోమణి జాంబవంతుఁడు తన ముష్టి ఘాతములచే దేవా నీకు వారని పూజ సేసెను. 

 

 

 

 

తే.గీ.

నిన్నెఱిఁగి తుది నతఁ డీయ నన్నుమణుల

జాంబవంతుఁడు కరుణించి చక్కఁగ నత

నిని గ్రహించి రయమ్మున నెలవు సేరి

నగ నొసఁ గితి సత్రాజిత్తునకు ముకుంద

5.     

 

 

 

 

తుదకు ని న్నెఱింగి జాంబవంతుఁ డీయ మానినీ మణులను గ్రహించి నతనిని కరుణించి వేగమ యిల్లు సేరి సత్రాజిత్తునకు ముకుందా మణి నిచ్చితివి.

 

 

 

 

తే.గీ.

సిగ్గుఁ జెంది సత్రాజిత్తు శీఘ్ర మొసఁగె

లోల లోచన మాటఁ బరున కొసంగి

నట్టి సుతను సరత్నము నబలను గొని

మణి నొసఁగితి గుంభన మతి మామ కలర

6.     

 

 

 

 

అంత సత్రాజిత్తు సిగ్గు సెంది ము న్నితరునికి నీయ మాట యిచ్చినను దన సుతను రత్నముతోఁ గూడ శీఘ్రమ నీకు నొసంగెను. అబలను గ్రహించి లోతగు తలంపున మణిని మామకుఁ దిరిగి దేవా యిచ్చితివి.

 

 

 

 

తే.గీ.

సత్యభామ లజ్జావతి నిత్యము నల

రింపఁ బాండవ దహనమ్ము నెఱిఁగి యరుగ

నీవు చంపి సత్రాజిత్తు నిర్దయ శత

ధనుఁడు రత్న మపహరించెఁ దన్ను నుత్స

హింప నక్రూర కృతవర్మ లించుక నట

7.     

 

 

 

 

సత్యభామ సిగ్గు సింగారము కాఁగ నిత్యము ని న్నలరించు చుండెను. అంత పాండవులు లక్క యింట దహన మైరి యని వినఁగ నీ వేఁగితివి. అక్కడ శతధనుఁడు తన్ను నక్రూర కృత వర్మ లించుక ప్రోత్సహింప సత్రాజిత్తును జంపి రత్నము నపహరించెను. 

 

 

 

 

తే.గీ.

వగపున వధువు రాఁ గురు నగరము వధి

యించి శతధను ముదితఁ గావించి తీవు

మిథిల కేఁగి మణి నరయ మీఱి బలుఁడు

ధార్తరాష్ట్రు నొనర్చె గదా కుశలుని

8.     

 

 

 

 

బాధతో సత్యభామ కురు నగరమునకు రాఁగ నెఱిఁగి నీవు మణి వెదక మిథిలకు నేఁగి శతధనుని జంపి యామెకు మోద మొసంగితివి. అచట బలరాముఁడు దుర్యోధనుని గదా కుశలునిగఁ దీర్చి దిద్దెను. 

 

 

 

 

ఆ.వె.

నీ యనుమతి గాందినీ తనయుఁడు నిమ్న

జు కుజను వధ కయ్యెఁ జూడఁ గతము

మణినిఁ గొనవు తిరిగి మాధవ యొసఁగ వి

భూతి యతని కంచు బొసఁగు మాట

9.     

 

 

 

 

దేవా నీ యనుమతితోన యక్రూరుఁడు నిమ్నుని పుత్రుఁ డైన సత్రాజిత్తుని కుచరిత్రుని వధకు కారకుఁ  డయ్యెను.  మాధవా యతఁడు మణి నిచ్చిన నతని మంచి కొఱకు నీవు గ్రహింపక యతనికే తిరిగి యిచ్చితి వన్న మాట యొప్పును.

 

 

 

 

తే.గీ.

క్రూరమతి యేలఁ గల్గు నక్రూరునకు స్థి

రతర భక్తుఁడు నీకు గర్వ మొదవంగఁ

దాను విజ్ఞాన ఘనుఁడు దాంత మతి యంచు

దాని నణఁపంగ నీదు చేఁత యగుఁ గాక

10.  

 

 

 

 

నీకు సుస్థిర భక్తుఁ డక్రూరునకుఁ గ్రూర బుద్ధి యేల కల్గును? తాను విజ్ఞానము  నోర్పుగల వాఁడ నను గర్వము పొడచూప నణఁప నెంచి నీవు చేసిన పనీయే యది.

 

 

 

 

తే.గీ.

కూడి కృతవర్మఁ బాఱ నక్రూరుఁ బిలిచి

దాఁచిన మణి వెలికిఁ దీసి దాని నతని

కిచ్చి సుజను దృప్తి పఱచి తచ్చముగను

బవన పురనాథ సత్యేశ ప్రాపు నిమ్ము

11.   

 

 

 

 

కృతవర్మతోఁ గలసి పాఱుచుండ నక్రూరునిఁ బిలిచి దాఁచిన మణిని బయటకుఁ దీసి యతనికే యిచ్చి యా సజ్జనుని స్వచ్ఛముగఁ దృప్తి పఱచితివి. అట్టి గురువాయూరు నాథా రక్షణ మొసఁగుము.  

 

 

 

ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయమున నెనుబదవ దశకము. 

 

 

 

 

 

 

 

 

 

శ్రీమదాంధ్ర  శ్రీమన్నారాయణీయము

(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము)

దశమ స్కంధ పరిచ్ఛేదము

దశకము 81.

సుభద్రా హరణ కాళింద్యాది వివాహ నరకాసుర వధ వర్ణనములు . 

 

 

ఉ.

నిరతము ముద్దు సేయుచును స్నిగ్ధను ముగ్ధను సత్యభామనుం

దరుణను గూడి యేఁగితివి ద్రౌపది పెండ్లికిఁ బాండవేయులన్

సురుచిర మింపు గొల్పఁ గని సుందర హస్తిపురమ్ము కూర్చియుం

బురవర మింద్రు ప్రస్థమును మూరి దినమ్ములు కొన్ని వచ్చితే

1.      

 

 

 

 

నిత్యము కాంతివతి చక్కనిది సత్యభామను ముద్దు సేయు చుంటివి. ఆమెతోఁ గూడి ద్రౌపదీ వివాహమునకుఁ బాండు తనయులను సంతోషపఱప నేఁగితివి. సుందర మైన హస్తినాపురమును జూచితివి. ఇంద్రప్రస్థ పురిని నిర్మాణము చేయించి కొన్ని దినము లుండి తిరిగి వచ్చితివి. 

 

 

 

 

మ.

అనుగుం జెల్లి సుభద్రఁ గౌరవ సుతా ద్యాకాంక్షితం బంపు మే

ర నికారంపు మునీంద్రు వేషమున నింద్రప్రోద్భవుం డాహరిం

చిన రోషాగ్రజు నూఱడించి నరునిం జెల్లిన్ వడిం గూడి స

త్యను నీతోఁ గొని మిత్రహర్షముగ నింద్రప్రస్థముం జేరితే

2.     

 

 

 

 

నీ ప్రియమైన చెల్లెలిని సుభద్రను ధృతరాష్ట్రుని పుత్రులలో నాద్యుఁ డైన దుర్యోధనునిచేఁ గాక్షింపఁ  బడిన యామెను నీ యాజ్ఞ మేర వంచనపు మునివేషమున నింద్రసుతుఁ డర్జునుఁ డపహరింపఁగఁ గోప మూనిన యగ్రజుఁడు బలరాముని నూఱడించి నరునిఁ జెల్లెలినిఁ ద్వరితముగఁ గూడి సత్య భామతోఁ గలిసి మిత్రులు సంతసింప నింద్రప్రస్థము సేరితివి.

 

 

 

 

ఉ.

అంద చరింప నాడుచును నయ్యమునా తటి యందుఁ గాంచి కా

ళిందినిఁ బెండ్లి యాడి నెఱి లేమను వచ్చితి వీటి కింక వే

నందితుఁ జేసి తగ్ని నట నారి సహోదర భీత గోర నిన్

సుందరి మేనయత్త సుతఁ జూచి హరించితి మిత్రవిందనున్

3.     

 

 

 

 

అందు నాడుచు చరించు చుండ యమునా నదీ తటమున నందమైన భామ కాళిందీ కన్యను జూచి పెండ్లియాడి యింటికి వచ్చితివి. మఱియు నగ్ని దేవుని సంతోషపఱచితివి. సోదర భీతితో నున్న నారి సుందరి నీదు మేన యత్త కూతురు మిత్రవింద నిన్నుగోరఁ గాంచి యపహరించి తెచ్చితివి.   

 

 

 

 

మ.

అల సత్యా సతి నగ్న జిత్తనయ నీ వా యెద్దులం బట్టితే

యల యేడింటిని నేడు రూపములఁ బెండ్లాడంగ సంతర్ద నా

దులు భద్రాగ్రజు లిచ్చి రా సహజ సంతోషమ్ముగా నీకు నా

లలనా రత్నము మేనయత్త  సుతయే రాజీవ లోలాక్షియున్  

4.     

 

 

 

 

అంత నగ్నజిత్తు తనయ సత్యా సతిని నుంకువగ సప్త వృషభములను నీవ  సప్త రూపము లూని నిరోధించి పెండ్లి యాడితివి. దేవి భద్రకు నన్నలు సంతర్ద నాదులు తమ సోదరిని నీకు ముదమున నొసంగిరి. ఆ లలనా రత్నము రాజీవాక్షి కూడ నీ మేనత్త కూతురే.  

 

 

 

 

చం.

ఉదకము నంద కాన నగు నుచ్ఛల మత్స్యము సవ్యసాచి గా

మొద లగు పార్థివేంద్రులకు మూర నశక్యముఁ గొట్టి నైపుణిన్

సుదతినిఁ బెండ్లి యాడితి సచోద్యము లక్ష్మణ మద్రకన్య నె

న్మిదవ కళత్రమే దెలిపె నీకు దివస్పతి భౌము చేష్టలన్

5.     

 

 

 

 

పైన నుండి క్రింద నుదకమునఁ గాన నగు మత్స్యమును సవ్యసాచి మొదలుగాఁ గల రాజ వరు లెవ్వరకు సాధ్యము కాని దానిని నైపుణ్యముతోఁ జోద్యముగఁ గొట్టి మద్రకన్య లక్ష్మణను (లక్షణను) బెండ్లి యాడ నెనిమిదవ భార్య యయ్యెను. అంత నింద్రుఁడు నీకు నా నరకాసురుని చేష్టలను దెలిపెను.

 

 

 

 

మ.

తలఁపన్ వచ్చెడు పక్షిరాట్టు పయి సత్రాజిత్సుతం నిల్పి నీ

లలితాంకమ్మున నేఁగి శత్రు నిలు లీలాకేళిఁ గ్రీడావన

మ్ములు దర్శించు విధమ్ము దుర్గముల నున్మూలించి తున్మాడ వీ

రులఁ బ్రాగ్జోతిష మంత శోణిత ర సోల్లో లావృతం బాయెనే

6.     

 

 

 

 

నీవు తలంపఁగనే వచ్చు గరుత్మంతునిపై సత్యభామను నీ యంకమున నుంచి లీలఁగాఁ గ్రీడా వనములు దర్శించు నట్లు శత్రువు నింటి కేఁగి దుర్గములను నిర్మూలించి వీరులను దున్మాడఁగాఁ  బ్రాగ్జ్యోతిష పురము రక్తజల కల్లోలములతోఁ గూడికున్న దైనది.

 

 

 

 

చం.

మురుఁ డను రాక్షసుండు శిరముల్ గన నైదు చెలంగ వీడి యా

శరనిధి సన్నిభాటవినిఁ జంప నెదిర్చినఁ ద్రుంచి తత్తఱిన్

శిరములు చక్రఘాతమున శీఘ్రమ మార్కొన నుడ్డ దంతపుం

గరి దళ భర్త యా నరక కాంతునిఁ జేసితి తీర్ణ నారకున్

7.     

 

 

 

 

మురాసురుఁడు పంచ శిరములతోఁ జెలంగి యర్ణవము వంటి నరణ్యమును వీడి నిన్ను జంప నెదిర్చిన నంత చక్రాయుధముతో వాని యైదు తలలను నఱికితివి. అంత నరకాసురుఁడు నాల్గు దంతములు గల గజ సమూహమున కధిపతి యెదిరింప వాని నుత్తీర్ణమైన నరకము గల వానిగాఁ జేసితివి.   

 

 

 

 

చం.

తడయక భూమి వేఁడ భగదత్తున కిచ్చితి రాజ్య మంతయుం

గొడుకున కొక్క యేనుగును గుంజర కోటిని శేషముల్ తగం  

బడయుచు దైత్య బంధితలు భామలు వేలు పదాఱు మంది ని

న్నెడ నిడ నీ పురమ్మునకు నింపుగఁ బంపితి విత్త రాశితో

8.     

 

 

 

 

భూదేవి వేఁడగా నాలస్యము సేయక నరకుని పుత్రుఁడు భగదత్తునకు రాజ్యము నొక్క యేనుఁగు నొసంగి మిగిలిన యేనుగులను గ్రహించి నరకునిచే బంధింపఁ బడిన పదాఱు వేల భామలను నీ పై ననురాగ మున్న వారిని ధనరాశులతోఁ గూడ నీ పురమునకుఁ బంపితివి. 

 

 

 

 

చం.

అదితికి నిచ్చి వేగ నర కాపహృతమ్ములు కుండలమ్ములం

ద్రిదివపు స్త్రీల కీల లిడు తీరున వెన్కొన సత్యభామయే

యదితి సుతాదులే పొగడ నచ్చటఁ గైకొనఁ గల్పవృక్షమే

యెదిరిన గెల్చి శక్రు వెలయింప ధనాత్త మదమ్ముఁ దిర్గితే

9.     

 

 

 

 

ఆదిత్యులు పొగడ నరకుఁడు సంగ్రహించిన కుండలముల నదితికి నిచ్చి దేవతా వనితలకు మంట నొసఁగు తీరున సత్యభామ నీ వెంట రాఁగ నచ్చటి కల్పవృక్షమును గైకొనఁగ కోపించి యింద్రుఁడు సంపద మదము సూపుచు నెదిరింప గెల్చి వెనుదిరిగితివి.

 

 

 

 

చం.

అగమము సత్య భామ భవ నావని నాటి సహస్ర షోడ శే

భ గమనలన్ వరించి తగ వారి నలర్ప నొకండ యందఱై

తగఁ దిలకించె నారదుఁడు దారల కిచ్చితి బంతి బిడ్డలన్

మగువల కెల్ల స్వంతముగ మారుత పట్టణ నాథ కావుమా

10.  

 

 

 

 

ఆ కల్పవృక్షమును సత్యభామ యింటి ప్రదేశమున నాటితివి. పదాఱు వేల మదగజ గమనలను బెండ్లాడితివి. వారిని వివిధ రీతుల నలరించితివి. ఆ వింత లీలను నారదుఁడు గాంచెను. భార్యల కొక్కొక్కరికి స్వంతముగాఁ బది మంది బిడ్డల నొసఁగితివి. అట్టి గురు వాయూరు నాథా నన్ను గావుము.

 

 

 

ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయమున నెనుబది యొకటవ దశకము. 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

శ్రీమదాంధ్ర  శ్రీమన్నారాయణీయము

(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము)

దశమ స్కంధ పరిచ్ఛేదము

దశకము 82.

బాణయుద్ధ నృగమోక్ష వర్ణనములు. 

 

 

మ.

ఉరువౌ బాలుఁడు రౌక్మిణేయుఁడును బ్రద్యుమ్నుండు తద్దైత్యు శం

బరుఁ జంపెన్ హరియింపఁ దన్ను దవ రూపస్తీర్వి యేతెంచె నం

త రతీ యుక్తము రుక్మి కన్య వర హస్తమ్ముం గొనెన్ రుక్మి న

ప్త రహిన్ రోచన రౌక్మిణేయ సుతుఁ డుద్వాహమ్ము నాడంగ న

త్తరుణం బందు బలుండు సంపెఁ గసి జూదం బందు నారుక్మినిన్  

1.      

 

 

 

 

గొప్పబాలుఁడు రుక్మిణీ తనయుఁడు ప్రద్యుమ్నుఁడు శంబరాసురుని తన్ను నెత్తికొని పోయిన వానినిఁ జంపెను. దేవా నీ రూపమున నున్న నాతఁడు రతీ సహితము తిరిగి వచ్చెను. రుక్మి కూతురునిఁ బెండ్లియాడెను. రుక్మి మనుమరాలు రోచనను రుక్మిణి మనుమఁడు (అనిరుద్ధుఁడు) పెండ్లి యాడెను. ఆ సమయమున బలరాముఁడు జూదము నందలి కసితో రుక్మినిఁ జంపెను. 

 

 

 

 

తే.గీ.

బాణుఁడు సహస్ర బాహువు బలి సుతుఁడు శి

వార్చకుఁ డుష వాని తనయ యరయఁగఁ గల

నీదు మనుమని ననిరుద్ధు నేరదు మును

పయిన వలచి విరహ తప్త యయ్యె దేవ

2.     

 

 

 

 

సహస్ర బాహువుల గల బాణుఁడు బలి చక్రవర్తి కొడుకు శివ భక్తుఁడు. ఆతని పుత్రిక యుష కలలో దేవా నీ మనుమఁ డైన యనిరుద్ధునిఁ గాంచి యింతకు ము న్నాతనిఁ జూడకున్నను వలచి విరహ తప్త యయ్యెను.  

 

 

 

 

తే.గీ.

చిత్రలేఖ యోగిని సఖి చిత్రలేఖ

నమ్మునఁ గుశల గీయఁగ నరవరుల ము

ఖమ్ము లనిరుద్ధు నం దుష గాంచ యోగ

మహిమ మీయింటి నుండి యమ్మగువ దెచ్చె

3.     

 

 

 

 

యోగిని యైన చిత్రలేఖ యుషా దేవికు సఖి. చిత్రలేఖనమున నిపుణురాలు. ఆమె నృపు లందఱి చిత్రములు గీయ నందు ననిరుద్ధుని యుష గాంచఁ జిత్రలేఖ తన యోగ మహిమచే ననిరుద్ధుని మీ యింటి నుండి తెచ్చినది.

 

 

 

 

కం.

తేల సుఖమ్ములఁ బ్రియ సఖి

తో లలితమ్ముగఁ జెఱ నిడె ధ్రువ భక్తుండే

వ్రాలితి శోణిత పురమున

నాలమ్మునకే స యాదవాలి ముని యనన్

4.     

 

 

 

 

అనిరుద్ధుఁడు ప్రియసఖి యుషతో సుఖములలోఁ దేలియాడెను. అంత శివ భక్తుఁ డైన బాణుఁ డతనినిఁ జెఱసాల నుంచెను. నారద ముని చెప్పఁగా దేవా నీవు యాదవ సైన్యముతో యుద్ధము సేయ బాణుని శోణిత పురమున వ్రాలితివి.

 

 

 

 

మ.

అయొ తాకెం బురపాలకుండు గిరి జాత్మాధీశుఁడే ధీరుఁ డా

ప యదుశ్రేణి స భూత కోటి వడి నా బాణుండు పోరాడె నా

యుయుధా నాఖ్యునితో గుహుం డడరెఁ బ్రద్యుమ్నార్యుతో నీవు నా

లయ సంధాత పురత్రయ క్షయునితో రౌద్రాంతరంగంబుతో

5.     

 

 

 

 

అకట యా పురమును రక్షించు ధీరుఁడు పార్వతీపతియే యదుసైన్యము నాప భూత గణములతోఁ గూడి తాకెను. బాణుఁడు శీఘ్రమ సాత్యకితోఁ బోరెను. కుమారస్వామి ప్రద్యుమ్నునితోఁ బోర నీవు లయ కారకుఁడు త్రిపురారి శివునితో రౌద్ర చిత్తమునఁ బోరితివి.

 

 

 

 

మ.

జిత సర్వాస్త్ర! తవాస్త్ర ఘాతమున నా శ్రీకంఠుఁడే మూర్ఛిలెన్

ధృతి హీనంబుగ సర్వ భూతములు భీతిం బాఱె శైవార్చకుల్

మృతు లై రచ్చటఁ బిండి సేయ గుహునిన్ మీఱెన్ సుమాస్త్రమ్ములన్

రతినాథుండు బలుండు మంత్రివరుఁ జీల్పన్ వేగ కుంభాండునిన్

6.     

 

 

 

 

జయించిన సకలాస్త్రములు గల నీవు ప్రయోగించిన సమ్మోహనాస్త్రముచే శ్రీకంఠుఁడు మూర్ఛిల్లెను. ధైర్యము గోల్పోయి భూతగణము లన్నియుఁ బాఱెను. శివసేవకులు మృతులైరి. కుమారస్వామిఁ బ్రద్యుమ్నుండు సుమాస్త్రములచే మీఱెను. బలరాముఁడు బాణుని మంత్రి కుంభాండునిఁ జీల్చెను.    

 

 

 

 

చం.

ధనువుల నైదు వందలను ధారణ సేసి యెదిర్ప బాణుఁడే

తునియగ నయ్యె వ్యర్థములు తూర్ణము శంభు వరజ్వరమ్ము రాన్

మునిఁగె హరిజ్వరమ్మునను బోరు నెఱింగి నుతించి వీడి తాఁ

జనె విడి నీదు భక్తులను జ్ఞానులె తామసు లైరి రుద్రులే

7.     

 

 

 

 

ఐదు వందల విల్లులను ధరించి బాణుఁడు పోరాడ నవి నీచే శీఘ్రమ విఱుఁగఁగ వ్యర్థము లైనవి. అంత శివజ్వరము విజృంభింప నది హరిజ్వరములో మునింగినది. అది నిన్ను గుర్తించి పోరు వీడి నీదు భక్తులను విడిచి నిన్ను నుతించి వెడలి పోయెను. రుద్రులు గూడ జ్ఞాను లైనను జిత్రముగఁ  దామసాత్ము లైరి.

 

 

 

 

ఉ.

ఛిన్నము సేయ దర్పమును శీఘ్రమ బాణుఁడు నాయుధమ్ములన్

నిన్నెదిరింప బాహువుల, నిన్ను భవుండు నుతించి వేఁడఁగాఁ,

బన్నుగ నుంచి బాహు లిరు వైపుల జంటలు వాఁ డొసంగ న

క్కన్నియ సానిరుద్ధ సహకన్యక యేఁగితి వీటి కింపుగన్

8.     

 

 

 

 

ఆయుధములతో బాణుఁడు ని న్నెదిరింప బాహువులను దర్పమును చిన్నము సేసితివి. అంత శివుఁడు నుతించి ప్రార్థింప నిరు వైపులను జత బాహువుల మాత్రము నుంచితివి. అంత బాణుఁడు తన పుత్రిక నీయ కన్యా సహితము ననిరిద్ధునితో నింటి కేఁగితివి.   

 

 

 

 

తే.గీ.

ఇంద్రుఁ బలుమాఱు గెల్చితి వీ వరుణుఁ బి

తృ హరణమున గురు సుతునిఁ దెచ్చి యముని

వత్సల హరింప నజు గెల్చి వహ్ని మ్రింగి

శివు నిట గెలువ మిన్న యీ యవతరణము

9.     

 

 

 

 

పలుమారు లింద్రుని నోడించితివి. జనకు హరింప వరుణుని నోడించితివి. యముని గెలిచి గురు సుతులను దెచ్చితివి. అగ్ని మ్రింగితివి. వత్సలను హరింప బ్రహ్మను గెలిచితివి. ఇప్పుడు శివుని గెలిచితివి. నీ యీ యవతార మన్నిటి కన్న మిన్నయై యుండెను. 

 

 

 

 

తే.గీ.

ద్విజ వరుని శాప మూసరవెల్లిఁ జేయ

నృగునిఁ గరుణించి మోక్షము నెమ్మి నొసఁగి

ద్విజ విభూతిని వివరించితి నిజ జనుల

కట్టి పవన పురేశ మమ్మరయు మయ్య

10.  

 

 

 

 

విప్రుని శాపమున నృగుఁడు చక్రవర్తి యూసరవెల్లి కాఁగఁ గరుణించి నతనికి నెమ్మి  మోక్షము నిచ్చితివి. భూసురుల మహిమను జనులకుఁ దెలిపితివి. అట్టి గురువాయూరు నాథా మమ్ము కాపాడుము. 

 

 

 

ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయమున నెనుబది రెండవ దశకము. 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

శ్రీమదాంధ్ర  శ్రీమన్నారాయణీయము

(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము)

దశమ స్కంధ పరిచ్ఛేదము

దశకము 83.

పౌండ్రక వధ కాశీపురి దాహ ద్వివిద వధ లక్ష్మణా స్వయంవర వర్ణనములు. 

 

 

ఉ.

గోకుల మేఁగి గోపికలఁ గూడి చరించుచు మద్య మత్తుఁడై

యాగకఁ బిల్వ రాని యెడ నయ్యమునా గతి మార్చిరాముఁడే

రేఁగుచు నుండ నంత నిట రివ్వునఁ బౌండ్రక వాసుదేవుఁడే

వీఁగఁగఁ జేయ సేవకులు వీఁగుచు నీ దరి కంపె దూతనున్

1.      

 

 

 

 

బలరాముఁడు గోకులము వచ్చి గోపికలతో మద్యపు మత్తునఁ జరించుచు నుండి యమునా నదిని తన వద్దకు రమ్మని పలుమార్లు పిలువ రాకున్న నది కోపించి యా నది గతిని మార్చి చెలంగు చుండెను.  ఇటఁ బౌండ్రక వాసుదేవుఁడు తన సేవకులు తన్ను విజృంభింపఁ జేయ దేవా నీ వద్దకు విఱ్ఱ వీఁగుచు దూతను బంపెను.  

 

 

 

 

తే.గీ.

నేన నారాయణుఁడ భువి నెగడు చుంటి

నీవు నవ్విధిఁ జరియింతె వే విడిచి మ

మాంకములు వేఁడు శరణు నా ననఁగ దూత

నవ్వి రెల్లరు సభయందు నంద తనయ

2.     

 

 

 

 

దూత తన విభుని మాటలుగా నేనే భువిలో నారాయణుఁడను, నీవు నా వలె జరించెదవా నా యాభరణములు గుర్తులను వీడి నన్ను శరణు వేఁడు మని పలుకఁగా నో నందాత్మజా సభలోని వారెల్లరు నవ్విరి.

 

 

 

 

కం.

చన దూత యాద వానీ

కినిఁ గూడి చని యటఁ గంటి కృత కౌస్తుభ చి

హ్నుని మకర కుండలునిఁ బీ

త నివసనునిఁ బౌండ్ర కాఖ్యుఁ దామర సాక్షా

3.     

 

 

 

 

అంత దూత యేఁగఁగా యాదవ సైన్యము గూడి యచటకుఁ జని కౌస్తుభము నూనిన వాని, మకర కుండలముల వాని, పీత వస్త్రము ధరించిన వాని పౌండ్రక నాముని తామర సాక్షా చూచితివి.

 

 

 

 

తే.గీ.

విసర నినుప చక్ర మతఁడు వెసఁ దునిమితి

దాని నీ సుదర్శనమునఁ దలను ద్రుంచి

వాని సైన్యముఁ జంపి వే వాని మిత్రు

కాశి ధవు తల తునిమితి కాశి కంప

4.     

 

 

 

 

ఆ పౌండ్రకుఁడు నీ పై నినుప చక్రమును విసర నీవు నీ సుదర్శన చక్రమున దానిఁ ద్రుంచి యతని తలను వేగముగఁ ద్రుంచితివి. వాని సైన్యము నెల్లఁ జంపితివి. వాని మిత్రుఁ డైన  కాశీ రాజు తలను ద్రుంచితివి. దానిని కాశికిఁ బంప మంటివి.  

 

 

 

 

ఆ.వె.

మూర్ఖత నిరతమ్ము పూనఁగ వాసు దే

వాఖ్య నమ్మి మదిని నరసె సాంగ

మమ్ము నాతఁడు సుకృతమ్ము లేరిని నెట్టి

గతుల కంపు నేరు కలరు నేర

5.     

 

 

 

 

మూర్ఖత్వమున నిత్యము వాసుదేవు పేరు వెట్టుకొని తానె వాసుదేవుఁ డని నమ్మి యతఁడు నీ సంగమము నరసెను. సుకృతము లెవ్వరిని నెట్టి గతులకుఁ బంపునో యెవ్వరి కెఱుక?

 

 

 

 

తే.గీ.

కాశి రాపట్టి కొల్చి శంకరు సుదక్షి

ణుండు మంత్రించి తాఁ గృత్యను విడిచె నన

లాభ నదియు బాణ రణ భయార్త భూత

ములఁ గలుపుకొనె వేడబముగఁ జెలంగి

6.     

 

 

 

 

సుదక్షిణుఁడు కాశి రాజుని కొడుకు శివునిఁ గొలిచి మంత్రించి కృత్యను నగ్ని సన్నిభను విడిచెను. అది బాణుని సమరములో భయపడి పాఱిన భూతములను దనతో మాయగఁ గలుపు కొనెను. 

 

 

 

 

తే.గీ.

తాళవృక్ష నిభాంఘ్రులఁ దనరి కాల్చు

చు నఖిలమ్మును జెలఁగు కృత్య నటఁ గాంచి

భీతిఁ దెలుపఁ బౌరులు నీవు ద్యూత నిరతిఁ

జెలఁగి యచలిత మంపితి శీఘ్రమ యరి

7.     

 

 

 

 

తాటి చెట్టు వంటి కాళ్లతో సకలమును గాల్చుచు విజృంభించు నా కృత్యను గాంచి జనులు భీతిల్లి నీకుఁ దెలియఁ జేయ జూదములో మగ్నుఁడ వైన నీవు చలింపక శీఘ్రమ నీ చక్రమును దాని పైకిఁ బంపితివి.    

 

 

 

 

ఉ.

కాంతుల నీనుచుం గదియఁగా శిత చక్రము కృత్య భీతితో

గెంతుచుఁ బర్వు లెత్తి వడి కీటడగించె సుదక్షిణున్ రుషా

స్వాంతతఁ గాల్చి సత్వరము చక్రము గూడ పురమ్ము కాశినిన్

సాంతము సేసె నర్పణము నగ్నికి నింపుగఁ జూచు చుండఁగన్        

8.     

 

 

 

 

ఆ తీక్ష్ణ చక్రము కాంతు లీనుచుఁ జేరఁగాఁ గృత్య భీతిల్లి గెంతుచుఁ బరుగు లెత్తి యా సుదక్షిణునే కోపముతోఁ గాల్చి చంపెను. చక్రము గూడ గాశీ పురమును బూర్తిగాఁ గాల్చెను. 

 

 

 

 

చం.

ద్వివిదుఁడు మున్ను సేయ కపి వీరుఁడు సాయము రాక్ష సాంక మం

దు వరము వొంద నీ వలనఁ దూలఁగ నిచ్చట దుష్ట చిత్తుఁడై

యవని కుమారు మిత్రుఁ డయి యప్పురి  ద్వారక కీయ క్లేశముల్

వివిధము లంతఁ జంపె యదు వీరుఁడు రాముఁడు చేతి వ్రేటునన్

9.     

 

 

 

 

మున్ను( త్రేతా యుగమున) ద్వివిదుఁడు కపి వీరుఁడు రావణ యుద్ధమున సాయము సేయ నీ చేతిలో మరణమును వరముగా నీ వీయ నిచట నరకునికి మిత్రుఁడై దుష్ట చిత్తమున ద్వారకాపురి నివాసులకు వివిధము లైన  కష్టముల నొసంగ బలరాముఁడు చేతి దెబ్బతో నతనినిఁ జంపెను.

 

 

 

 

చం.

కురు విభు పుత్రి లక్ష్మణను గోమలి సాంబుఁడు సంగ్రహింప వే

సరి చెఱ నుంచ సాత్వతుఁడు శాంతత వేడఁగ రోష వాక్యముల్

కురియఁగ హస్తినాపురముఁ గూల్పఁగ నెత్తియు  నాఁగెఁ దల్ప  నీ

వరు లటఁ బాలు బాండవుల కంచు మరుత్పుర నాథ కావుమా

10.  

 

 

 

 

దుర్యోధనుని కూతురు లక్ష్మణను సాంబుఁడు హరింప నతనిని జెఱలో నుంచ శాంతముగ  బలరాముఁడు కౌరవులను వేడఁగ వారు రోష వాక్యములు వలుక నలిగి హస్తినాపురము కూల్పఁగ నెత్తి తిరిగి శాంతించి విడిచెను. ఆ శత్రువులను బాండవులే వధింప వలెనని నీవు తలంప నట్లు జరిగెను. అట్టి గురువాయూరు నాథా నన్ను గావుము.

 

 

 

ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయమున నెనుబది మూడవ దశకము. 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

శ్రీమదాంధ్ర  శ్రీమన్నారాయణీయము

(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము)

దశమ స్కంధ పరిచ్ఛేదము

దశకము 84.

సూర్య గ్రహణ యాత్రా వర్ణనము. 

 

 

కం.

ఒక సూర్యగ్రహణ దివస

ము కూర్చి కృతవర్మ కామమూర్తిజులఁ బురిన్

సకల జనులఁ గూడి సమం

తక పంచక మరిగి తీవు తరుణుల తోడన్

1.      

 

 

 

 

దేవా యొక సూర్య గ్రహణము నాఁడు కృతవర్మను బ్రద్యుమ్నుని కొడు కనిరుద్ధునిఁ బురమున నుంచి  తరుణులఁ గూడి సకల జనులతో సమంతకపంచక తీర్థమున కేఁగితివి. 

 

 

 

 

కం.

బహుజన హితార్థ మతివై

సహచర సంహితము మున్గి జలములఁ బ్రీతిన్

బహుధన రాశి ద్విజుల కిడి

రహిఁ గురు పాండవ ముఖుల నరసి తచ్చోటన్

2.     

 

 

 

 

జను లందఱి హితమును గోరి సహచరులతోఁ గూడి జలముల మునింగి ప్రీతితో ధన రాశులను విప్రుల కొసంగి యక్కడ సంతోషముగాఁ గౌరవ పాండ వాదులను జూచితివి.

 

 

 

 

తే.గీ.

కృష్ణ, తవభక్తి పూర్ణాత్మ, గిరలు వినఁగ

నీ ప్రియ సతీమణుల నోట నెమ్మి నొందె

నీవు వారిఁ గొన్న గతులు నెలఁతు లితరు

లెల్లరు ముద మందిరి విని యుల్లములను

3.     

 

 

 

 

నీ భక్తితో నిండిన చిత్తము కల ద్రౌపది నీ ప్రియ సఖీమణుల నోట నీవు వారిని గైకొన్న విధము లెల్లను దెలుపు వచనములు  విని సంతోషము నొందినది. యితర స్త్రీ లెల్లరు కూడ వారి మనము లందు ముద మందిరి.  

 

 

 

 

కం.

కని యచ్చట గోపకులన్

ఘన హర్షంబొదవ వారిఁ గదిసి వినమ్రం

బున మ్రొక్కితి చిర విర హాం

గనల వ్రజాంగనల నెలమిఁ గాంచి కదిసితే

4.     

 

 

 

 

అక్కడ గోపకులను గాంచి మిక్కిలి హర్షము నొంది వారినిఁ జేరి వినమ్రముగా మ్రొక్కితివి. చిరకాల విరహ తప్త లైన గోపికలను జూచి సమీపించితివి.

 

 

 

 

కం.

హర్షాతిరేకమున నా

మర్షమ్మును వీడి రంత మానిను లెల్లం

గర్షిత చోలమ్ముల నా

కర్షితుఁ డైతి తమి సుచిర కాలపు టెఱుకన్

5.     

 

 

 

 

ఆ కాంతలు హర్షాతిరేకమునఁ గోపమ్మును వీడిరి. ఆనందమున నుబుక వీడిన ఱవికలతోఁ దనరు వారి గని చిరకాలము నెఱింగి యున్న కారణమున నాసక్తితో నాకర్షితుఁ డైతివి.    

 

 

 

 

తే.గీ.

రాక కాలస్య మయ్యెఁ బర జన కలహ

కారణమ్మునఁ బలుమార్లు కాంత యనుచు

నీవు కౌఁగిలింప రయమ్ము నీకు వివశ

యయ్యె రాధిక మది లీన మయ్యె నంత

6.     

 

 

 

 

పలుమార్లు శత్రువులతోఁ గలహ కారణమున నాలస్య మైనది రాధా నా రాక కని చెప్పి రయమునఁ గౌఁగిలింపఁగా నీవు నీకు వివశ యైనది. ఆమె మనస్సు నీ యంద లీన మైనది. 

 

 

 

 

తే.గీ.

తీర విరహమ్ము ముదముగ నారులకును

దనరి మఱుఁగున బోధించి తత్త్వ మపుడు

పరమ చిన్మయబ్రహ్మమె యరయ నేన

యంచు నుందు ననితి వారి యాత్మ లందు

7.     

 

 

 

 

అంత నారులకు విరహము తీరఁగ వారికిఁ బరమ తత్త్వమును రహస్యముగా బోధించి నీవ యే పరబ్రహ్మ మని తెలిపి వారి మనస్సుల లోన నుందు నని పల్కితివి.

 

 

 

 

తే.గీ.

ముద్విరహ తాపములు కల్గె మున్ను నుద్ధ

వు నుపదేశమున నిపుడు తనరెఁ బరమ

సుఖపు టానంద మమృతమ్ము చోద్యముగను

దలఁచి నంత మాత్రమ్మునఁ దరుణులకును

8.     

 

 

 

 

ఉద్ధవుని యుపదేశమున మునుపు గోపికలకు హర్షము విరహ తాపములు కలిగినవి. ఇప్పుడు నిన్ను దలంచి నంత మాత్రమ్మునఁ దరుణులకు వింతఁగ మహదానంద మను నమృతము లభించినది. 

 

 

 

 

ఆ.వె.

పాప శాంతి కొఱకు నోపు జన్నమ్ములఁ

దెల్పుఁ డంచును వసుదేవుఁ డడుగ

ముని వరులను నీవు తనర నేల యన న

వ్వి యురు తరముగ జరిపించి రంత

9.     

 

 

 

 

వసుదేవుఁడు పాపములు వోవుటకుఁ జేయఁ దగు జన్నములను దెల్పుఁ డని మునివరుల నడుగ వారు దేవా నీ వుండంగ వేఱు యాగము లెందు కను నట్లు నవ్వి యట్టివి గొప్పగ జరిపించిరి.

 

 

 

 

తే.గీ.

అలరి యజియించి ముదముగ నాదరింప

మిత్రుల సగోప నిచయమ్ము మీఱి యాద

వులు త్రిమాసమ్ములు గడపి పూర్వ రీతి

నీదు సంగమ సుఖము గనిరి సచివులు

10.  

 

 

 

 

మూడు నెలలు యజ్ఞమును సంతసముగ జేసి యాదవులు గోపకులను మిత్రులను గౌరవింపఁగాఁ  గడపి నీ మిత్రులు నీ సామీప్య సుఖమును పూర్వపుఁ దీరునఁ బడసిరి.

 

 

 

 

తే.గీ.

రాధను గదిసి దృఢ పరిరంభణమ్ము

సేసి పోగొట్టి దుఃఖము చిత్తము నల

రించి వెడలు తఱి మరలి తంచితముగ

రోగములఁ బాపు మయ్య మరుత్పుర ధవ

11.   

 

 

 

 

నీవు వెడలు సమయమున రాధను గాఢముగఁ గౌగిలించికొని మనం బలరఁగ దుఃఖమును బాపి యేఁగితివి. అట్టి గురువాయూరు నాథా నా రోగములను బాపుము.

 

 

 

ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయమున నెనుబది నాల్గవ దశకము. 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

శ్రీమదాంధ్ర  శ్రీమన్నారాయణీయము

(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము)

దశమ స్కంధ పరిచ్ఛేదము

దశకము 85.

జరాసంధ వధ రాజసూయ వర్ణనములు. 

 

 

ఉ.

మగధ విభుండు కార నిడ మాన్య మహీపతులన్ జయించి తాఁ

దగవున దచ్చి వంద లయుతమ్ములు రెం డగు సంఖ్య లెల్లరన్

వగచి యనాథ నాథుఁడవు పార్థులు పంపిరి నిన్ను వేఁడఁగాఁ

దగిన నరోత్తమున్ మగధుఁ దత్క్షణ మంతము సేయ నుక్కునన్

  1.  

 

 

 

 

యుద్ధమున జయించి మగధ రాజు జరాసంధుఁడు గౌరవనీయులైన రాజులను రెం డయుతముల యెనిమిది వందల సంఖ్యులరను(20800) జెఱలో నుంచెను. వారు బాధతో ననాథ శరణ్యుఁడవు నీ వద్దకు నొక మంచి పురుషుని జరాసంధుని వధించు మని వేఁడుటకు పంపిరి.   

 

 

 

 

చం.

తలపడ నెంచ మాగధుని ధర్మజు నధ్వర మశ్వమేధపుం

దలఁపును దెల్ప నారదుఁడు తద్దయు సంశయ మైన నుద్దవుం

డల వివరించి శత్రువధ నారయు జన్నము గాన నేఁగఁగా

వలయు ననంగ నేఁగితి సబంధు గణమ్ము ద్వికార్య సిద్ధికిన్

  1.  

 

 

 

 

మాగధుని నెదిరింప నెంచ నంత నారదుఁడు వచ్చి ధర్మరాజు రాజసూయ యాగమును జేయఁ దలంచు చున్నటులు దెల్పఁగా సంశయమునఁ బడితివి. అంత నుద్ధవుఁడు శత్రు వధను జన్నము జూచును గావున నచ్చట కేఁగ వలయు నని పల్కఁగా బంధువులతోఁ గూడి రెండు కార్యములు సమకూరు నని యేఁగితివి.  

 

 

 

 

ఉ.

సర్వ సతీ యుతమ్ము చన సన్నుతి సేయుచు నిచ్చి యర్చనల్

సర్వ మహేశులన్ గెలువ శక్యము సేయ భవత్కృపేక్షణల్

పర్వగ సోద రోర్జములు పంపె యుధిష్ఠిరుఁ డంత నిన్ను నా

గర్వ మదాంధు మాగధుని కర్జము గాంచ సభీమ పార్థుతో

  1.  

 

 

 

 

భార్య లందఱితోఁ గూడి యేఁగఁగ ధర్మరాజు నీ కాదర పూర్వక పూజలు సేసెను. నీ కృపా దృక్కులే దమ్ముల బలము లలర సకల రాజన్యులను గెలువ శక్యము సేసెను. అంత యుధిష్ఠిరుఁడు నిన్ను భీమార్జునులతో జరాసంధుని జయింపఁ బంపెను.

 

 

 

 

తే.గీ.

అరిగి మీరు గిరివ్రజ పురము ముగ్గు

రంతఁ గపటపు ద్విజు లయి యడిగి యుద్ద

ము సుకృత విహీను మగధు భీముని నెదిర్పఁ  

జేసి నిల్చి తర్జునినితోఁ జేరి కనుచు

  1.  

 

 

 

 

అంత మీరు ముగ్గురు కపటపు విప్రుల వేషమున గిరివ్రజపుర మరిగి యుద్ధము నడిగి మాగధుని భీముని నెదిరింపఁ జేసి యర్జునినితోఁ జేరి చూచుచు నిల్చితివి.   

 

 

 

 

ఉ.

భీకర యుద్ధ మందు నట భీమున కిచ్చి శిఖావిదార ణై

కైక సు సంజ్ఞ మాగధు నహీన పరాక్రముఁ జంపఁ జేసి యా

యాకులి తావనీ పతుల నందఱ ముక్తులఁ జేసియుం గృపా

శ్రీకర భక్తి నిచ్చి ధరఁ జేకొనఁ బంపితి ముక్త సంగులన్

  1.  

 

 

 

 

ఆ భయంకర మైన యుద్ధమున భీమునకుఁ గొమ్మను జీల్చి యట్లు సేయ  నేకైక సంజ్ఞ నిచ్చి మహా పరాక్రముఁడు జరాసంధునిఁ జంపించితివి. ఆర్తు లా రాజులను జెఱ నుండి విడిపించి ముక్త సంగులు వారికి నీ పై భక్తి నొసఁగి రాజ్యము నేలుకొనఁ బంపితివి.   

 

 

 

 

తే.గీ.

రాజసూయము సేయ ధర్మజుఁడు రాజు

లెల్లరును భృత్య తుల్యు  లై రెలమి మీఱ

దేవ విశ్వప యేమి యుధిష్ఠిరు మహి

మము ద్విజ పదములు కడుగ మహిని నీవు

  1.  

 

 

 

 

ధర్మరాజు రాజసూయ యాగము సేయ రాజు లెల్లరు సంతోషము మీఱ నీకు భృత్య సమాను లైరి. ఆ ధర్మజుని మహిమ మేమని పొగడఁ గలము? ఆ యాగమున దేవా విశ్వరక్షకా నీవు బ్రాహ్మ ణోత్తముల పాదములను గడుగ నుద్యమించితివి.

 

 

 

 

తే.గీ.

సవనమున నగ్రపూజకుఁ  జాలు వానిఁ

దలఁప సహదేవు భాషణముల ముదమున

నీకు ధర్మాత్మజుఁడు సభ నిర్వహింప  

మురిసె స నర సుర జగతి కరము నంత

  1.  

 

 

 

 

యాగమున నగ్రపూజకు సహదేవుఁడు దేవా నిన్ను నర్హునిగాఁ బేర్కొనఁగ నా మాటల నాదరించి ధర్మజుఁడు సభలో నిర్వహింప నర సురలతో నెల్ల జగతి మిక్కిలి సంతసించెను.

 

 

 

 

తే.గీ.

అంతఁ గినిసి చేది నృపుఁడు వింత నింద

ఱు మునులు నృపులుండఁగ నెల్లర మఱచి పశు

పాలకుఁడు దుష్టునకు నహో పాడి యగునె

యని యెదిర్పఁ బాండవులు సయ్యన నెదిరిరి

  1.  

 

 

 

 

అంతఁ గోపించి చేదిరాజు శిశుపాలుఁడు వింత నిందఱు మునులు రాజులు నుండ మఱచి యొక పశువుల పాలకునకు దుష్టున కహో తగునే యని యెదిరింపఁ బాండవులు కూడ వాని నెదిర్చిరి.

 

 

 

 

తే.గీ.

ఆపి తన వారిని నిజ చక్రాయుధమునఁ

జంప శిశుపాలు నట మూడు జన్మ లతఁడు

వైరమున నిన్న స్మరియింపఁ బడసె పదము

యోగి దుర్లభము శుచియై యున్నతమ్ము

  1.  

 

 

 

 

దేవా యంత వారి నాపి నీ చక్రమున నా శిశుపాలునిఁ జంపితివి. మూడు జన్మ లందు నతఁడు వైరముతో నిన్ను నిత్యము తల్చు చుండుటచే నీ చేతఁ జచ్చి శుచియై యోగీంద్రులకును దుర్లభ మైన నీ పదమును బడసెను. 

 

 

 

 

చం.

విజయము కల్గు ధర్మసుత విశ్వుల కం చని రాజు లేగి రా

యజము సమాప్త మైన ఖలుఁ డంత సుయోధన చక్రవర్తి విం

తఁ జలము విస్తరిల్ల మది దాయల సంపదఁ గాంచి దైత్య శి

ల్పి జనిత మా సభం గదిసి పీథ త లాంతర మోహుఁ డయ్యెనే

  1.  

 

 

 

 

దేవా నీకు ధర్మరాజునకు విజయము కల్గుఁ గాక యని దీవించి రాజులెల్లరు యజ్ఞము పూర్తి కాఁగ నేఁగిరి. ఖలుఁడు దుర్యోధనుఁడు దాయల సంపదఁ జూచి యసూయ సెందెను. దైత్య శిల్పి మయుని చే నిర్మింపఁ బడిన సభలో జలము తలముల భేద మెఱుంగ లేక మోహితుఁ డయ్యెను. 

 

 

 

 

తే.గీ.

నవ్వులు సెలంగె భీమ కృష్ణ లకు కడ క

నుల నరయ నీవు వసుధా భర లయమునకు

బీజములు వడి వేసితి వో జనార్ద

న రుజ లాపు మరుత్పుర నాథ మాకు

  1.  

 

 

 

 

నీవు క్రీఁ గనులఁ జూడ నంత భీముని ద్రౌపదుల నవ్వులు చెలరేఁగెను. అప్పుడే జనార్దనా భూ భార మణఁగుటకు బీజములను వేసితివి. గురువాయూరు నాథా మా రోగముల నాపుము.   

 

 

 

ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయమున నెనుబది యైదవ దశకము. 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

శ్రీమదాంధ్ర  శ్రీమన్నారాయణీయము

(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము)

దశమ స్కంధ పరిచ్ఛేదము

దశకము 86.

సాల్వాది వధ భారత యుద్ధ వర్ణనములు. 

 

 

ఉ.

సౌభక మీయ నీశ్వరుఁడు సాల్వుఁడు యాదవ నిర్జితుండు కా

వైభవ రుక్మిణిం గొనెడు పట్టున హస్తిని నుండ నీ వహో

లోభి పురమ్ము ముట్టికొన రుక్మిణి పుత్రుఁడు సంహరించె పి

త్రాభుఁడు సప్తవింశతి దినాళి ససేన ద్యుమంతు మంత్రినిన్

1.      

 

 

 

 

రుక్మిణిని నీవు గ్రహించు వేళ నోడఁగా సాల్వుఁడు సౌభక విమానము నీశ్వరుఁ డీయఁగఁ బగతో నీ పురమును లోభియై ముట్టడించెను. అప్పుడు నీవు హస్తినా పురమున నుంటివి. అప్పుడు నీకు సమానుఁడు రౌక్మిణీయుఁడు ప్రద్యుమ్నుఁ డిరువది యేడు దినముల యుద్ధములో యాదవ సేనతోఁ  గూడి సాల్వుని మంత్రి ద్యుమంతునిఁ జంపెను.

 

 

 

 

చం.

అల బలభద్రుఁ గూడి వడి నచ్చొటు సేరి వధింప శత్రు సే

నల నెదిరించి నీవు పరనాథుఁడు సాల్వుఁడు కొట్టియున్ గదన్

విలయ విహార శార్ఙ్గమును బేడిజ మేర్పడఁ దండ్రిఁ జంపి న

ట్టులఁ జన నమ్మి తంచుఁ బ్రజ  టూకి ననంగ ననండు వ్యాసుఁడే

2.     

 

 

 

 

అంత బలభద్రునితోఁ గూడి వేగమ యచటకు వచ్చి శత్రు సేనలను వధించితివి. శత్రువు సాల్వుఁడు గదతో విలయ విహారము సేయు నీ ధనుస్సును గొట్టి నీ తండ్రినిఁ జంపి నట్లు మాయ యేర్పడఁగఁ  జేయ నీవు నమ్మితి వని జనులు సంగ్రహముగ ననఁగ వ్యాస మహర్షి మాత్ర మట్టు లనఁడు. 

 

 

 

 

చం.

రయమునఁ బిండి సేసియుఁ గరమ్ము గదాహుతి సౌభకమ్ము ముం

చి యుదధి సాల్వు మూర్దమును శీఘ్రమ త్రుంచితి చక్ర మంపి లే

చి యెదుర దంతవక్త్రు నటఁ జెండఁగ నీ గద తోడఁ జేరె ని

న్న యతఁడు చైద్యు భంగి సుకృతాకరుఁ డందుకె యెత్తి తీవయా

3.     

 

 

 

 

అంత వేగముగ సౌభకమును గదతో మిక్కిలిగ ముక్కలు సేసి సముద్రమున ముంచితివి. సాల్వుని తలను జక్రముచేఁ ద్రుంచితివి. అంత నట దంతవక్త్రుఁడు లేచి యెదిరింప నీవు నీ గదతో ఖండింప నతఁడు శిశుపాలుని వలె నిన్నే చేరెను. అందుకే నీ వవతారము నెత్తితివి.     

 

 

 

 

చం.

చన నట నీవు హస్తిపురిఁ జాగఁగ జూదమ యార్తిఁ బిల్వఁగా

నిను ద్రుప దాత్మ జార్థము ననేకపుఁ జీర లొసంగితే దయన్

ముని శివు నంశజుం డశన పూర్తిని రాఁగఁ దలంప ద్రౌపదీ

మన మలరంగ శేష కణ మాత్రము కుడ్వఁగఁ దృప్తు లై రటన్

4.     

 

 

 

 

నీవు చనఁగ ద్వారకకు నిట హస్తినా పురమున జూదము జెలఁగఁగ నార్తితో నిన్ను ద్రౌపది పిల్వఁగా (వస్త్రాపహరణ సమయమున) నశేషమైన చీరలను ద్రౌపది కొఱకు దయతో నొసఁగితివి. శివాంశుఁడు దుర్వాస ముని అన్నము పూర్తి యైన తరుణమున రాఁగ నప్పుడు ద్రౌపది నిన్ను దలంపఁగ వచ్చి మిగిలిన యన్నపు మెతుకును నీవు దిన నా మునియు శిష్యులు కడుపులు నిండఁగఁ దృప్తు లైరి.

 

 

 

 

చం.

తనరఁగ యుద్ధ తంత్రములు దత్తము సైన్యము కౌరవాలికిన్

నిను నని గోరె నర్జునుఁడు నీ వన దూతగ ద్రోణ భీష్ములే

మినుకుల గౌరవింపఁగ నమిత్ర సుయోధనుఁ డెంచఁ గీడు నీ

తనరిన విశ్వరూపమునఁ దాపస సన్నిధి వీడు తూలెనే

5.     

 

 

 

 

యుద్ధ సన్నాహములు చెలరేఁగెను. నీ సైన్యము కౌరవులకుఁ జెంద నర్జునుఁడు నిన్ను మాత్రము గోరుకొనెను. దూతగ నీవు పల్కిన పల్కులను భీష్మ ద్రోణులు గౌరవించిరి. కాని దుర్యోధనుఁడు వినక నీకుఁ గీడు నెంచఁగా నీవు మునుల సముఖమున విశ్వరూపమును జూపితివి. అప్పుడు హస్తినాపుర మెల్ల కంపించెను.

 

 

 

 

చం.

అని నరుఁ డాత్మ బంధువుల హత్యకు నొచ్చి తపింపఁ గృష్ణ యం

చును గని యేమి టయ్య సఖ చూడుమ యాత్మ సతమ్ము సుమ్మ యె

వ్వని సమయించు నెవ్వఁ డని వ్రాలు నెవండు త్యజించి హత్య భీ

తి నని నొనర్పు మర్పిత మదిన్ ధృతి నంటివి విశ్వరూపివై

6.     

 

 

 

 

యుద్ధ సమయమున నర్జునుఁడు బంధువుల హత్యకు బాధతోఁ గృష్ణా యని దపింప సఖా యేమి టిది, చూడు మాత్మ నిత్య మెవ్వఁ డెవ్వని వధించు నాజి నెవ్వఁడు చచ్చును, జంపు భీతిని వీడి ధైర్యముతో నర్పిత మతి యుద్ధము సేయు మని విశ్వరూపము సూపి పల్కితివి.  

 

 

 

 

ఉ.

ఉత్తమ భక్తు భీష్ము నెప మూని దినం బయుతంపు సేన నీ

విత్తగ వందు నాశనము నేర్పడఁ జేసి కిరీటి డయ్యఁగా

నత్తఱి విస్మరించి మది నాడిన మాటను జక్ర మూని రాఁ

దత్తర నంజలింప నత తచ్ఛిరునిం గని భీష్ము మెచ్చితే

7.     

 

 

 

 

ఉత్తమ మైన భక్తుఁడు భీష్ము నెపమునఁ బ్రతి దినము బదివేల సైన్యము నీ యుద్ధము నందు వినాశ మగు నట్లు సేసితివి. అంత నర్జునుఁ డలసిన తఱి నీ వాడిన మాటను వీడి చక్రము ధరించి భీష్ము దెసకుఁ ద్వరితముగ రాఁగ నతఁడు తలవంచి నమస్కరింప భీష్ముని మెచ్చితివి. 

 

 

 

 

తే.గీ.

ఆపి భగదత్తు నారాయ ణాస్త్ర మెదను   

గురుని యని సూర్యు గప్పినీ యరిని సైంధ

వు నడఁగించి కర్ణాగాస్త్రము నట వమ్ము

సేసి పాండుసుతుల నరసితి కరమ్ము

8.     

 

 

 

 

ద్రోణ యుద్ధమున భగదత్తుని నారాయణాస్త్రమును నీ వక్షమున నాపి చక్రముచే నా సూర్యుని మూసి సైంధవుని మరణింపఁ జేసి కర్ణుని నాగాస్త్రమును వమ్ము చేసి పాండుసుతులను మిక్కిలిగఁ గాపాడితివి.   

 

 

 

 

తే.గీ.

బలుఁడు సమ రాది నైమిశ వనము చని కి

నిసి వధించి సూతుఁ బదవిని సుతున కిడి

ఖరుఁడు వల్కలు వధియించి తిరిగి భీమ

కురుపతుల పోరు గని నిజ పురము సనియె

9.     

 

 

 

 

బలరాముఁడు యుద్ధ ప్రారంభమున నైమి శారణ్యము సని యచట సూతుని (తన్నరసి యతఁడు లేవ లేదని) కోపించి  చంపి యతని పుత్రుని నతని పదవి యందు  నిల్పి వల్కలాసురుని వధించి తిరిగి వచ్చి భీమ దుర్యోధనుల పోరు గాంచి తన పురమునకు వెడలెను. 

 

 

 

 

మ.

నిదురం దేలెడు ద్రౌపదేయులను దా నిర్దోషులం జంప ద్రౌ

ణి దయన్ వీడి నరుండు నీ పనుపునన్ నిర్వీర్యముం జేసి ద్రౌ

ణిది బ్రహ్మాస్త్రము రత్నముం గొనియె వే నీ వుంటి వైరాటి దౌ

యుదరం బందు సచక్ర మల్ప మయి బ్రహ్మోగ్రాస్త్రముం బాపఁగన్

10.  

 

 

 

 

నిద్రలో నున్న యుపపాండవులను నిర్దోషుల నశ్వత్థామ దయలేక చంపెను.  ఇంకను దేవా నీ యాజ్ఞ నర్జునుఁడు ద్రౌణి వేసిన బ్రహ్మాస్త్రము నుపసంహరించి యతని శిరో రత్నమును గ్రహించెను. మఱియు నీ వశ్వత్థామ వేసిన బ్రహ్మాస్త్రము నణచుటకు నుత్తర గర్భమున సూక్ష్మరూపము నూని చక్రముతోఁ గూడి చేరితివి.

 

 

 

 

తే.గీ.

భీష్ముఁ డిచ్ఛామృతి కనెఁ జెప్పి తగ నీతు

లా పృథాత్మజునకు నీ దయ నజు పదము

సేయ మూడశ్వమేధము లా యమజుఁ డ

రసి చనితి రుజ లణఁపు తరస్వి పురప

11.   

 

 

 

 

స్వేచ్ఛా మరణము గల భీష్ముఁడు ధర్మజునకు ధర్మములను జెప్పి నీ దయతో బ్రహ్మపదమును బడసెను. యుధిష్ఠిరుఁడు మూ డశ్వ మేధ యాగములు సేయఁ గాంచి నీ పురమున కేఁగితివి. అట్టి గురువాయూరు నాథా నా రోగములను బాపుము.

 

 

 

ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయమున నెనుబది యాఱవ దశకము. 

 

 

 

 

 

శ్రీమదాంధ్ర  శ్రీమన్నారాయణీయము

(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము)

దశమ స్కంధ పరిచ్ఛేదము

దశకము 87.

కుచేలోపాఖ్యానము

 

 

తే.గీ.

ద్విజ వరుండు కుచేలాఖ్య సుజనుఁ డుభయు

లరయ సాందీపనికి మీరు పరమ శిష్యు

లతఁడు నీయంద నిడి భక్తి నాశ విడిచి

విత్తమున గృహస్థుఁ డయి భువిని వెలింగె

1.      

 

 

 

 

దేవా కుచేలుఁడు సజ్జనుఁడు విప్రుఁడు మీ రిరువురు సాందీపని మునికి శిష్యులు. కుచేలుఁడు నీ పై భక్తి నుంచి ధనాశను వీడి గృహస్థ ధర్మమున ధరలోఁ బ్రకాశించు చుండెను. 

 

 

 

 

తే.గీ.

ద్విజ సతి సమానశీలయు నిజ మనమ్ము

నాప లేక యొక్క దినమునం దనెఁ బతి

తోడ సఖు రమాసతి పతిఁ జూడ వేల

భుక్తి నీయ నంచుఁ గదిసి పుణ్యశీల

2.     

 

 

 

 

ఆ ద్విజుని భార్య యాతనికి సమాన మైన గుణములు కలది పుణ్యవతి. ఒక దినమున మనో బాధ నాప లేక తన పతితో నార్యా మీ మిత్రుఁడు లక్ష్మీ పతిని భుక్తి కొఱకు నేల జూడఁ దలంప రని యడిగినది.

 

 

 

 

కం.

అనఁ గృష్ణ దర్శన రతిని

ధనేర్ష్య యున్నను క్షుధార్త దార పలుకులన్

విని కొన్నియటుకు లుంచి వ

సనమున బహుమతిగ ద్విజుఁడు సనెను సఖుఁ గనన్

3.     

 

 

 

 

ఆకలి బాధతో ననిన భార్య మాటలు  విని కృష్ణునిఁ జూచు నిచ్ఛతో ధనము పై నాశ లేకున్నను బహుమతిగ గొన్ని యటుకులను బట్టలో మూట కట్టికొని మిత్రునిఁ జూడ నేఁగెను.  

 

 

 

 

కం.

చని కనె నాశ్చర్య మయము

ఘన పుర మా ద్వారక గృహ కాయమ్ముల శై

బ్య నిలయ మరుగ వికుంఠం

బన శాంతము నీదు గౌరవ మహో లవమే

4.     

 

 

 

 

చని యాశ్చర్యమయ మైన ద్వారకా నగర మచట గృహ పంక్తిలో నున్న మిత్రవింద గృహమునకు నేఁగఁగా వైకుంఠ మేఁగి నట్టి శాంతము నచట నీవు చూపిన గౌరవము కూడ మహోన్నతములు.

 

 

 

 

తే.గీ.

ఆదరింప నీవు చమర మాలు విసరఁ

గరము నూని పల్కితి వంతఁ గాననమున

గురుసతి యనుపఁ దడియు వివరము లపు డ

కాల వర్షమున మునుపు కట్టెలు గొన

5.     

 

 

 

 

అంత దేవా  నీ వాతని నాదరించి చమరమును భార్య విసరుచుండఁగ మిత్రుని చేతినిఁ బట్టికొని మునుపు గురు సతి కట్టెలకై మిమ్ము  పంపఁగా నడవిలో నకాల వర్షమున మీరు తడిసిన సంగతి గుర్తు చేసితివి.   

 

 

 

 

ఆ.వె.

సంశయింప నీయఁ జయ్యనఁ గైకొని

యటుకు లొక పిడికెడు గుటుకు మని తి

నంగఁ జాలు చాలు నాథ యంచుఁ గమల

కరము పట్టి యాపెఁ గదిసి వేగ

6.     

 

 

 

 

కుచేలుఁ డటుకుల నీయ సందేహించుచుండ దేవా నీవు చయ్యన నొక పిడికెడు నటుకులను గైకొని గుటుక్కు మని మ్రింగి యింకను దిన నెంచఁ జాలు చాలు నాథా యని రమా దేవి వేగఁ జేరి  ని న్నాపెను. 

 

 

 

 

తే.గీ.

భక్తులకు భక్తుఁడవు నీవు యుక్తముగఁ గు

చేలు గౌరవింప వసియించి యొక రాత్రి

నీ దరి రహిని మఱునాఁడు నెమ్మి  వెడలె

విత్త రహితమ్ము నీ దయ వింత సుమ్ము

7.     

 

 

 

 

నీవు భక్తులకు భక్తుఁడవు. నీ వా కుచేలిని నట్లు గౌరవింప నొక రాత్రి సంతోషముతో నీ సన్నిధిని వసించి మఱునాఁడు ధనమును బొంద కుండకయే మఱలెను. నీ దయ వింత సుమా!

 

 

 

 

తే.గీ.

అడిగిన నొసంగు విత్తము నచ్యుతుండు

దార కేమందు నేఁ జని యౌర యనుచుఁ

దలఁచి నీ హాస భాషలు తద్దయు మదిఁ

జని చని యరసె మణిదీప్త సద్మ మెదుర

8.     

 

 

 

 

అంత కుచేలుఁడు తన్నడిగిన నచ్యుతుండు ధనము నిచ్చెడివాఁడే, యింటి కేఁగి భార్యకు నేమని చెప్పు వాఁడ నౌరా యని దేవా నీ హాస భాషణములను దలఁచుచుఁ జని చని యెదుట నొక మణి మయంబైన సౌధవరమును గాంచెను.  

 

 

 

 

ఆ.వె.

దారి తప్పె నంచుఁ దా భ్రమపడి యొక్క

క్షణము చేరి గృహము గాంచి యచట

సతిని సఖుల తోడఁ జారు తర మణిభూ

షను నెఱింగె నీదు సదమల దయ

9.     

 

 

 

 

దారి తప్పితి నేమో యని యెంచి యొక్క క్షణ మా గృహమును జేరి యచట తన భార్యను జెలి కత్తియలతో రత్న భూషణముల నలంకృతయై యుండఁ గాంచెను. అప్పుడు దేవా నీ దయా గుణము నతఁ డెఱింగెను.    

 

 

 

 

తే.గీ.

రత్న మయపు టిళ్లుల నున్న రక్తి భక్తు

లుంచి నీ పయి మోక్షము నంచితముగఁ

బడసెఁ బూరించెదవు భక్త వాంఛితములు

రుజల వారింపు మయ్య మరుత్పు రేశ

10.  

 

 

 

 

కుచేలుఁడు రత్నఖచితపు సౌధము లున్నను నీ పై రక్తిని భక్తిని నుంచి తుదకు మోక్షమును బడసెను. దేవా నీవు భక్తుల వాంఛితములను బూరించెదవు. అట్టి గురువాయూరు నాథా నాదు రోగములను బాపుము.

 

 

 

ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయమున నెనుబది యేడవ దశకము. 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

శ్రీమదాంధ్ర  శ్రీమన్నారాయణీయము

(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము)

దశమ స్కంధ పరిచ్ఛేదము

దశకము 88.

సంతాన గోపాలోపాఖ్యానము.

 

 

చం.

మును గురు సూను దెచ్చి యిడు ముచ్చటఁ దా విని తల్లి కోరఁగాఁ

దనయుల నార్వురం గనఁగఁ దత్క్షణ మా సుతలంబుఁ జేరి యా

ఘను బలిచే స్తుతింపఁబడి కంస విఘాతులఁ జూపి పంపితే

తనుజులు పైడితిండికిని ధారణ శప్త మరీచి సూనులే

1.      

 

 

 

 

గురుపుత్రుని మున్ను తెచ్చి యిచ్చితి వని యెఱింగి తల్లి దేవకి కోరఁగాఁ గంసునిచేఁ జంపఁ బడిన యాఱుగురు పుత్రులను జూప మని దేవా నీవు సుతలమున కేఁగి బలి చక్రవర్తిచేఁ బూజ లంది వారిని తెచ్చి చూపి తిరిగి యథాస్థానము పంపితివి. వారు పూర్వము బ్రహ్మదేవునిచే శపింపఁ బడిన మరీచి పుత్రులు హిరణ్యకశిపునకు పుత్రులై పుట్టి పిదప దేవకికిఁ బుట్టిన వారు. 

 

 

 

 

కం.

ద్విజ పుంగవుఁడగు శ్రుతదే

వు జనకు బహులాశ్వ నృపునిఁ బుణ్యాత్ములనున్

నిజ భక్తుల దయఁ గాంచం

గఁ జనితి తాపసులతో నగరము మిథిలకున్

2.     

 

 

 

 

అంత మిథిలా నగరమునకు మునులతోఁ గలిసి నీ భక్తులు పుణ్యాత్ము  లైన భూసుర పుంగవుఁడు  శ్రుతదేవుని, జనక రాజు బహులాశ్వునిఁ జూచుట కేఁగితివి.

 

 

 

 

తే.గీ.

ఏఁగ మూర్తిద్వయమ్మున నెలమి నేక

వేళ నొక్కఁడు బూజింప విభవ యుతము

నన్యుఁ డా దినపు భృతిని నన్న ఫలము

లొసఁగఁ దృప్తి నిచ్చితి ముక్తి నుభయులకును

3.     

 

 

 

 

ఒక్క తఱినే రెండు రూపముల నూని ప్రీతితో నేఁగఁగ నొకఁడు వైభవముగాఁ బూజింప రెండవవాఁ డా దినమున దొరికిన  భిక్ష యన్నము ఫలముల నర్చించెను.  ఇద్దఱికిఁ దృప్తితో సమానముగా ముక్తి నిచ్చితివి. 

 

 

 

 

ఉ.

ద్వారక నొక్క బ్రాహ్మణుఁడు పంచత నొందుచు నుండఁ బుత్రులే

యేరును లేరె దేవతలు నీ క్షయ మాపఁగ నంచు నేడ్వఁగా

నేరిన విశ్వ భర్త వయొ నేర్పున రక్షణ నీయ వా నరుం

డారయ నిన్ను మర్త్యునిగ నాతని విజ్ఞునిఁ జేయ నెంచియో

4.     

 

 

 

 

ద్వారకలో నొక బ్రాహ్మణుఁడు తన పుత్రులు మరణించుచుండ దానిని నాపుట కెవ్వరు లేరా యని యేడ్చు చుండ నెఱింగియు, నర్జునుఁడు నిన్ను కేవల మర్త్యుఁడ వని తలంచు చుండ నాతనికి నీ  యెఱుక నీఁ దలఁచిన యందుల కేమో యన, విశ్వ రక్షకుఁడవు నీవు రక్షింప రావు.

 

 

 

 

చం.

మరణము సెంద నష్టమ కుమారుఁడు నూఱక యుండ నీ వహో

నరుఁ డట స్నేహ పూర్వకమునం బురి రా నవ మాత్మజుక్షయం

పు రవమునం బ్రతిజ్ఞఁ గొనెఁ బుత్రు నొసంగఁ దదన్య మగ్ని దూ

క రయము నిశ్చయమ్ముగ జగమ్ము వినంగ సవిప్ర మవ్విధిన్

5.     

 

 

 

 

ఎనిమిదవ కుమారుఁడు మరణించి నపుడును నీ వూఱక యుంటివి. అంత మిత్రత్వమునఁ జూడ  నర్జునుఁ డచటికి రాఁగఁ దొమ్మిదవ పుత్రుఁడు కూడా మరణింప నేడ్పులు విని పుత్రునిఁ బ్రదికించి యిత్తు నని ప్రతిజ్ఞ చేసెను. లేనిచో నగ్ని దూకుదు ననియు విప్రునితో సహా జనులు విను చుండఁ బల్కెను.

 

 

 

 

చం.

అడుగక నిన్ను దర్పమున నర్జునుఁ డా ద్విజు వేశ్మ మేఁగి తా

బెడిదపు టస్త్ర బాణములు పేర్పఁగఁ గానుపు టింటి నష్టి కాఁ

గొడుకు బలారి ధర్మ ముఖ కోటి సు రావసధమ్ము లేఁగఁ గాం

చఁడు నరుఁ డగ్ని దూకఁ జన సస్మిత మాపి తసిద్ధ యత్నునిన్

6.     

 

 

 

 

గర్వముతో ని న్నడుగకయె విప్రు గృహమున కేఁగి పురుటింటిలో మహాస్త్ర జాలములు కప్పెను. అయినను పదవ పుత్రుఁడు మాయ మయ్యెను. అంత నర్జునుఁడు యమాది దేవతల యిండ్ల కేఁగి వెదకి బిడ్డను గాంచక నగ్ని దూకుటకు యత్నింప నా విఫలయత్నుని దేవా నవ్వుచు నాపితివి.  

 

 

 

 

చం.

పడమటి దిక్కు వైపు నతి వాజపుఁ దేరునఁ జక్రవాళముం

గడచి చెలంగు చీకటిని గ్రక్కునఁ దీరిచి చక్ర కాంతినిన్

జడియ నరుండు కాంతి కటఁ జక్షులు నొవ్వఁగఁ జూడు మంచు వే

జడములు దాటి నీ పదముఁ జక్కఁగఁ జూపితి నిస్తమస్కమున్

7.     

 

 

 

 

అతి వేగవంత మైన రథమునఁ బడమటి దిక్కు చక్రవాళమును (లోకాలోక పర్వతము) దాఁటి యచటి చీకటిని నీ సుదర్శన చక్ర కాంతిచే వెలిగించి యా కాంతిని భరింప లేని యర్జునునిఁ జూచి చూడు మంచు జలములను దాటి నీ ధామమును దామసము లేని దానినిఁ జూపితివి. 

 

 

 

 

ఉ.

అచ్చట నాది శేషు శయ మందు ప రాభర ణాయుధమ్ములన్

నిచ్చలు లక్ష్మి యుండ దరి నీల ఘనాంగక పీత చేలుఁ డా

యచ్చపు మూడు మూర్తుల వరాంగుఁడు వేద మయుండు నుండ నీ

విచ్చ సమిత్ర మంత నతు లిచ్చితి నీకును నీవ వింతగా

8.     

 

 

 

 

అచట యాదిశేషుని తల్పమున దివ్యమైన భూషణములు నాయుధములతోఁ బ్రక్కన నిత్యము లక్ష్మీ దేవి యుండ నీల మేఘ వర్ణ శరీరముతోఁ బచ్చని వస్త్రముతో ముమ్మూర్తుల యాకారమున వేద మయుఁ డైన వానిఁ గాంచి ప్రీతిని  మిత్రుఁ డర్జునునితోఁ గూడి నీకు నీవ నమస్కరించితివి.   

 

 

 

 

తే.గీ.

తలఁపఁగ వివృ తాంతర్హితముల విభిన్ను

లుభయు లిల మీరు నేనును నొక్క టౌదు

మరయ మిమ్ముఁ దెచ్చితి బాలు నందు కొనుఁ డ

నఁగ గ్రహించి ద్విజున కిడ నరుఁడు మ్రొక్కె

9.     

 

 

 

 

నే నొకరి యందు వివృతము నింకొకని యందు నంతర్హితము నగుట వలన మీరిరువురు భిన్నులు గా కనిపింతురు. కాని మీరు నేను నొక్కటే. మిమ్ముఁ జూచు కాంక్షతో బాలుని దెచ్చితిని. వీనినిఁ గైకొనుఁ డని యీయ గ్రహించి దేవా నీవు విప్రునకు నీయ నర్జునుఁడు నీకు మ్రొక్కెను.

 

 

 

 

ఉ.

ఇవ్విధి పెక్కు లీలల నహీన ముదమ్ము నొసంగి ధాత్రికిన్

నివ్వటిలంగ నీ కులము నిచ్చలు వృష్ణికులమ్ముఁ జేసి నీ

వివ్వసుధం గ్రతువ్రజము లింపుగఁ జేసి యలర్చి భార్యలం

జివ్వున ముక్తి నిచ్చితివి శ్రేష్టుల కెల్లను భూభరఘ్నతన్

10.  

 

 

 

 

ఈ విధముగా ననేక లీలలతో మిక్కిలి సంతోషమును ధాత్రికి నొసంగి నీ వృష్ణి కులము వృద్ధి సెందఁ జేసి క్రతువు లనేకము చేసి భార్యలను సంతోష పఱచి యుత్తముల కెల్ల ముక్తి నిచ్చి భూభారము నెల్లఁ దగ్గించితివి. 

 

 

 

 

చం.

వర ముని నారదుండు పురి ద్వారక నిల్వ సతమ్ము నీదు భ

క్తి రతి నెఱింగె నాతని నుతించి సుకృత్యుఁడు నీదు తండ్రి య

ప్పరమపుఁ దత్త్వ బోధమును భక్తుఁడు నుద్ధవుఁ డంత నేర్చె నీ

గిరలను బోధ సారమును గీర్తితుఁ డబ్బదరిం గలం డిఁకన్

11.   

 

 

 

 

నారదమునీంద్రుఁడు ద్వారకలో సతము నీ పై భక్తితో నుండెను.  ఆతని నుండి భక్తులలో శ్రేష్ఠుఁడు పుణ్య కర్ముఁడు నైన నీ తండ్రి పరమ తత్త్వ జ్ఞానమును బడసెను. ఉద్ధవుఁడు నీ వచనముల జ్ఞాన సారమును నేర్చెను. కీర్తిమంతుఁ డింకను బదరిలోఁ గలఁడు.

 

 

 

 

తే.గీ.

అలఘు వియ్యవతారము తలఁపఁ గృష్ణ

ముక్తు లౌదురు స్నేహము భక్తి భీతి

పగయుఁ బ్రీత్యాదులను జయమగును నీకు

యార్తి హర! భక్తి మాకు నిమ్మనిల పురప

12.   

 

 

 

 

ఈ నీ యవతారము కృష్ణా చాలా గొప్పది. స్నేహమున, భక్తిని, భీతిని, ద్వేషమున, ప్రేమతో నైన నిన్ను దలంప ముక్తు లౌదురు. నీకు జయమగుఁ గాక! బాధల నెల్ల హరించు గురు వాయూరు నాథా మాకు నీ పై భక్తి నిమ్ము.

 

 

ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయమున నెనుబది యెనిమిదవ దశకము. 

శ్రీమదాంధ్ర  శ్రీమన్నారాయణీయము

(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము)

దశమ స్కంధ పరిచ్ఛేదము

దశకము 89.

వృకాసుర వధ వర్ణనము.

 

 

తే.గీ.

నే నెఱుఁగుదు రమాధవ నీదు పరమ

భక్తులకు నీవు సంపద త్వరితముగఁ బ్ర

శాంత పఱచి యిడుదు వేగ శాంతులకును

లేదు నీ భక్తులకుఁ జ్యుతి లేశ మైన

  1.  

 

 

 

 

రమానాథా నీ పరమ భక్తులకు సంపదను ద్వరితముగా నీయ వని నే నెఱుఁగుదును. ఆశలను శాంతింపఁ జేసి యిత్తువు. శాంతులకు వేగముగనే యిత్తువు.  నీ భక్తులకు నాశము లేదు.

 

 

 

 

తే.గీ.

కొందఱు భజింత్రు తమ కనుగుణముగ నజ

శంకరాదుల వేగ ప్రసాద రుషితు

లఁ బిదప నగుదురు చ్యుతులు లపిత మీ వృ

కాసురు కథఁ గాంచంగఁ దార్కాణ మగును

  1.  

 

 

 

 

వేగముగా ననుగ్రహము  కోపమును జూపు బ్రహ్మ రుద్రాదులను దమ స్వభావముల ననుసరించి కొందఱు పూజింతురు. పిమ్మట నశించుదురు. చెప్పఁ బడిన వృకాసురుని కథ దీనికిఁ దార్కాణ మగును.

 

 

 

 

కం.

వృకుఁ డడిగిన శుక సూనుం

డొక నాఁ డా నారదు వడి నుప్పొంగెడు వాఁ

డొక దేవుఁ దెలుపు మని వా

నికి నిను వీడి తెలిపె శివునినిఁ గలుషారీ

  1.  

 

 

 

 

పాపములను నాశము చేయు వాఁడా శుకుని కుమారుఁడు వృకుఁ డను వాఁ డొకనాఁడు త్వరిత గతి సంతోషపడు దేవుని చెప్పుఁ డని  నారదుని నడిగిన వానికి నారదుఁడు నిన్ను వదలి  శివుని పేరు తెలిపెను.  

 

 

 

 

తే.గీ.

ఘోర తప మొనరించి వృకుండు కోప

మంది సప్తమ దినమున నడర నఱక

నిజ శిరము శివుఁ గని యెవని తల నుంచ

కరము వాఁ డణఁగ గొనియె వరము నంత

  1.  

 

 

 

 

అంత ఘోర మైన తపము శివునిఁ గూర్చి చేసి యేడవ దినమున దర్శన మీని కారణమున నలిగి తన తలను నఱక నుద్యమింప శివుఁడు ప్రత్యక్ష మయ్యెను. శివుని గాంచి తా నెవ్వరి తలపైఁ దన చేతి నుంచిన వాఁడు నశించు నట్లు వర మడిగి పొందెను. 

 

 

 

 

చం.

పరువులు వెట్టె దిక్కులకు భర్గుఁడు దైత్యుఁడు వెంటఁ బర్వఁగాఁ

గరము భయమ్ముతో వెనుకఁ గాంచుచు నెల్లరు మిన్న కుండఁగా

నురు వగు నీ పదమ్మరుగు చుండఁగఁ గాంచి త్రినేత్రు దూర మం

దు రయము బ్రహ్మచారి వయి ధూర్జటి ముందఱ నిల్చి వేచితే

  1.  

 

 

 

 

అంత దైత్యుఁడు తన వెంటపడగా (వరము పరీక్షింప) శంకరుఁడు దిక్కులకుఁ బరువులు దీసెను. అందఱు మిన్నకుండఁగా వెనుకకుఁ జూచుచు గొప్ప దైన నీ ధామము సేరుచుండ దూరము నుండి నీ వాతనిఁ జూచి బ్రహ్మచారి వేషమున శివుని ముందట నిల్చి ప్రతీక్షించుచుంటివి. 

 

 

 

 

చం.

చనవున శాకునేయుఁడ పిశాచపు మాటలు నమ్మి తౌర నా

మినుకులు నమ్మవేని నిఁక మీఱి శిరమ్మున నీ కరమ్ము నుం

చినను నెఱుంగ నోపు దన శీఘ్రమ యట్లొనరింప వాఁడు నా

శన మట నయ్యె నన్య సుర శంసుల కట్లగు శంభుఁ గాచితే

  1.  

 

 

 

 

కోరికతో నో శుక కుమారా యీ పిశాచ నాథుని మాటలు నమ్మితి వక్కట. నా మాటలు నమ్మవేని నింక నీ తలపైఁ జేతి నుంచిన నీకే తెలియు నని నీ వన నతఁ డట్లే చేయఁగా నక్కడ తత్క్షణమ్ము మరణించెను. పర దేవతలును బూజించిన నట్లగును. నీ వట్లు శివునిఁ గాచితివి.

 

 

 

 

చం.

మునులు సరస్వతీ తటిని ముగ్గురు దేవత లందు సాత్వతన్

ఘనుఁ డెవ రంచు నా భృగునిఁ గన్గొనఁ బంపఁగ నేఁగి బ్రహ్మ దే

వునిని ననాదరింప రుషఁ బొమ్మ యడంప వృషధ్వజుండు దాఁ

దనరఁగఁ జంప నాప నుమ తాపసి వచ్చెను నీదు చెంతకున్

  1.  

 

 

 

 

సరస్వతీ తీరమున మునులు త్రిమూర్తు లందు సత్త్వ గుణ మందు నెవ్వరు మిన్నలో కనుగొన మని భృగు మహర్షినిఁ బంపిరి . అతఁడు బ్రహ్మదేవుని వద్దకు నేఁగి యాదరింపక నిల్చినఁ గోపము రాఁగ ధాత యాపుకొనెను. శివుని వద్ద కేఁగి యట్లుండఁ కోపముతోఁ జంపఁ బూనిన బార్వతీ దేవి  యాపెను. అంత భృగువు దేవా నీ చెంతకు వచ్చెను.

 

 

 

 

తే.గీ.

రమ యొడి శయనింపఁగఁ గమలదళ నేత్ర

తన్న విప్రుఁడు లేచి ముదమ్మున ముని

వర క్షమింపు మంటివి నీదు పాద చిహ్న

ముండు భూషణముగ నని వెండి యంటి

  1.  

 

 

 

 

కమలాక్షా నీవు కమల యొడిలో శయనించు చుండ నా విప్రుఁడు నీ వక్షమునఁ దన్నెను. అంత నీవు లేచి ముదమున మునీంద్రా నన్ను క్షమించు మని యంటివి. తిరిగి నీదు పాద చిహ్నము నాకు భూషణమే యని పల్కితివి.    

 

 

 

 

ఆ.వె.

వర సరస్వతీ తటి రమించు మును లెల్ల

నిన్న సాత్వికుఁడ వని మదిఁ గొల్చి

ముక్తి వడసి రంత భక్తితో నచ్యుత

సత్వతముఁ గొలుతుము సతము మేము

  1.  

 

 

 

 

అంత సరస్వతీ నదీ తీర మునులు నీవయే సత్వతముఁడ వని మదిఁ గొలిచి ముక్తి వడసిరి. భక్తితో నచ్యుతా నిన్ను నిత్యము మేము కొలిచెదము.

 

 

 

 

తే.గీ.

శ్రుతులు సన్నుతించు భువి మంత్రుల విధమ్ము

నిన్ను సృష్ట్యాది నుండియు నిత్యమును బ

రాత్మ సచ్చిదానంద వ్రజాంగ నైక

రూప రుజలను మాపు మరుత్పుర ధవ

  1.  

 

 

 

 

రాజును మంత్రులు నుతించు నట్లు దేవా నిన్ను వేదములు సృష్టి ప్రారంభ మైన యప్పటి నుండి నిత్యము నుతించును. సచ్చిదానందా  పరమాత్మా గోపికా వనితల కేక రూప మైన వాఁడా గురు వాయూరు నాథా మా రోగములను బాపుము.

 

 

 

ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయమున నెనుబది తొమ్మిదవ దశకము. 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

శ్రీమదాంధ్ర  శ్రీమన్నారాయణీయము

(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము)

దశమ స్కంధ పరిచ్ఛేదము

దశకము 90.

ఆగమములఁ బరమ తాత్పర్య నిరూపణము.

 

 

తే.గీ.

అంబరీషుని మోహిని యభ్భృగు వృకు

చరితముల నీదు మహిమమ్ము కరము తెలిసె

శంక రాది సర్వులకు నిశ్శంక మిన్న

నిష్కల సక లాకృతులను నెగడు దీవు

1.      

 

 

 

 

అంబరీషుని, మోహినీ సతి, భృగు మహర్షి, వృకుని చరిత్రల దేవా నీ గొప్పదనము విశద మైనది. శంకరాది దేవతలకు నీవు మిన్న యైన వాఁడవు. అవిభాజ్యముగను విభాజ్యముగను నుండి నీవు (నిష్కల, సకల) ప్రకాశింతువు.

 

 

 

 

తే.గీ.

ఈశ్వర సదాశివత్రిమూ ర్త్యేక రూప

ము శివ పంచక మన నీవు మూడు మూర్తు

లొకటిగ సదాశివుఁ డనఁగ నుందు వట వి

కుంఠమున మూడు వంతుల గురు పరాత్మ

2.     

 

 

 

 

ఈశ్వరుఁడు, సదాశివుఁడు, త్రిమూర్తుల రూపములు శివపంచక మని చెప్పఁ బడును. అందు నీవు ముమ్మూర్తు లొకటిగ నున్న సదాశివుఁడవు. పరమాత్మా నీవు వైకుంఠమున మూడురూపముల మూడు భాగముల యందు నుందువు.

 

 

 

 

తే.గీ.

అచట సాత్త్వి కాంగుఁడు విష్ణు వనఁబడంగ

విరళ సత్త్వ రజః పూర్ణతర విరించి

సత్త్వ ఘనుఁడు చేష్టలఁ దామసమ్ము సుమ్ము

శంకరుని రూపుఁ గొందువు చక్క నీవ

3.     

 

 

 

 

నిత్య సాత్త్విక గుణమున విష్ణు రూపమున, నించుక సత్త్వగుణము పూర్ణ రజోగుణములతో బ్రహ్మ రూపమునను, సత్త్వ గుణమున ఘనుఁడు చేష్ట లందు తామసము  జూపు శంకరుని రూపమున నీవే వైకుఠమున నుందువు. 

 

 

 

 

తే.గీ.

మూర్తులను ముగ్గురను మించి మూరు దీవు

శంక రాత్మత నింకయు సర్వమయత

వెల్గ నుడివి యుపాసనా విధము లెల్ల

రు నుతియింత్రు నిన్గలవు నిరూపణములు

4.     

 

 

 

 

దేవా నీవు ముగ్గురు మూర్తులను మించి యతిశయింతువు. శంకరాత్మతను సర్వ మయునిగ నిన్ను వివిధోపాసనములను నుడివి యెల్లరు నుతింత్రు. దీనికి తార్కాణములు గలవు. 

 

 

 

 

తే.గీ.

శంకరాచార్యుఁడు నల నిష్పక్షపాతి

యన్ని రూపుల నీరూపు నంద నిష్ఠ

నుంచి వేయి పేరులకు బహుళపు టర్థ

ము లిడి నిను నుతించి వడసె ముక్తి తుదను

5.     

 

 

 

 

జగద్గురువు లాది శంకరాచార్యులు నిష్పక్షపాతముగ సకలరూపములను నీ రూపము నుంచి నిష్ఠతో సహస్ర నామములకు నర్థములను వివరించి నిన్ను నుతించి చివరకు మోక్షము వడసెను.

 

 

 

 

తే.గీ.

మంత్రసారపు టాదిని మౌని తెలిపె

నిన్న యా త్రిమూర్తుల కన్న మిన్న వంచు

నీలి మేని నోంకారము నిల్పి ధ్యాన

మునకు నన్యునిఁ గాక నిన్ను నుడివె నట

6.     

 

 

 

 

ఆ ముని తన  మంత్రసారమున మొదట నిన్ను త్రిమూర్తులకు మిన్న వని తెలిపెను. నిన్ను నీల మేఘశ్యామునిగ సకలముగను  నోంకారమున నిష్కలముగను  నిల్పి  ధ్యానమునకు నన్యుని గాక నిన్నే చెప్పెను. 

 

 

 

 

కం.

సకల పురాణ విషయములు

ప్రకటించును నీదు మహిమ బ్రహ్మ పదమునం

దిఁక మూడు భాగములపై

వికసించును నీ పదమ్ము భృగువుది కాదే

7.     

 

 

 

 

సమస్త పురాణములు నీ మహిమను బ్రకటించినవి. సత్యపదమున మూడు భాగములకును బైన  శంకరునిది కాక నీ పదము (వికుంఠము ) విరాజిల్లును.

 

 

 

 

తే.గీ.

బ్రహ్మ కల్ప మందుం గనఁబడితి వీవ

భాగవతపు ద్వితీయ విభాగ మందు

కలదు శివ భక్త మధ్వుఁడు పలికె నిన్న

హరి శివ యని పురాణసా రాంతరమున

8.     

 

 

 

 

బ్రహ్మ కల్ప మందును నీవ కనఁబడితివి. భాగవతపు ద్వితీయ భాగము నందును జెప్పఁబడెను. శివ భక్తుఁడు మధ్వాచార్యులును హరి శివ యని పురాణసారము నందుఁ బలికెను.

 

 

 

 

ఆ.వె.

నిజ మతి కనుగుణపు నేర్పున గిరిశుని

వేఁడ భక్తి దృఢత వీరి కొనరు

ఫల మని ముని వ్యాసు పలుకులు స్కాందము

లు తవ హాని గిరలు నుతు లగు నవి

9.     

 

 

 

 

తమతమ స్వభావముల కనుగుణముగా గిరీశుని దృఢమైన భక్తితో వేఁడిన వారికి ఫలములు గల్గు నని వేద వ్యాసుఁడు స్కాంద పురాణాదులఁ బలికిన పలుకులు నీకు హాని కరముగాఁ దోఁచినను నవి నీకు కీర్తనలే యగును.

 

 

 

 

తే.గీ.

అతిశయోక్తులు ననువాద మతి విరుద్ధ

వాదములు మూడు విధములు వాదములు వి

రుద్ధము లవి స్కాందముల వెలుంగు నీదు

తామసత్వమును బరబోధనము లడరి

10.  

 

 

 

 

అతిశయము, యనుభవ సహితము ననుభవ వ్యతిరిక్తత యను మూడు విధముల  వాదములు గలవు. స్కాందపురాణము మొదలగు వానిలో నీ  తామస గుణము, నీ కితరుల బోధనములును గలవు. అవి పైన నుదహరించిన మూడవ తరగతి వాదము లగును. 

 

 

 

 

తే.గీ.

అల్పుఁడ నవివేకిని యిటఁ జల్పి నట్టి

నుడులు మంత్ర శాస్త్రంపు వ్యాసుఁ డని నట్టి

భాగవతపు నుడులె చుమ్ము పరమ పురుష

భక్తి నింపి మరుత్పురప రుజ లాపు

11.   

 

 

 

 

అల్పుఁడ నవివేకి నయి యిచ్చట పల్కిన పల్కులు మంత్రశాస్త్రము నందు నున్న వ్యాస మునీంద్రుఁడు భాగవతము నందుపల్కిన మాటలే చుమ్ము. పరమ పురుషా గురు వాయూరు నాథా నా లో భక్తి నింపి రోగములను బాపుము.

 

 

 

ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయమునఁ దొంబదవ దశకము. 

దశమ స్కంధ పరిచ్ఛేదము సమాప్తము.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

శ్రీమదాంధ్ర  శ్రీమన్నారాయణీయము

(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము)

ఏకాదశ స్కంధ పరిచ్ఛేదము

దశకము 91.

భక్తి స్వరూప వర్ణనము.

 

 

ఉ.

నీ పద సేవ కృష్ణ భయ నిర్వృతి సేయు నసత్య భావ వా

దాపహృ తాంతరంగులకు నార్త జనాలికి నంచు నమ్మెదన్

నీ పలుకుల్ వినంగఁ దమి నిత్యము నిన్ను నుతుంచు రీతులౌ

యాపద లందుఁ జిక్క రెవ రైనను జాఱరు పాఱ మోహులై

1.      

 

 

 

 

కృష్ణా మిథ్యా వాదములచేఁ జిక్కిన వారికి, నార్తులకు నీ పద సేవ భయములను దొలఁగించు నని నేను నమ్మెదను. నిన్ను నుతించు రీతులౌ నీ పలుకులు (భగవద్గీతలో చెప్పినవి) నిత్యము తమకముతో వినిన నెవ్వరైన నాపద లందుఁ జిక్కరు. మోహమునఁ దిరిగిన నధోగతికి జాఱరు.  

 

 

 

 

చం.

పలుకుల దేహ చిత్తములఁ బన్నుగఁ జేసిన నీదు ప్రేరణం

దలకొని కర్మ సంచయము దప్పక యర్పణ మిత్తు నీక భూ

తలమున హీనజాతుఁడును దార్ఢ్య మనో వచ నేంద్రియార్థముల్

నిలిపిన నీ పయిన్ భువిఁ బునీతము సేయును నేరఁ డన్యుఁడున్

2.     

 

 

 

 

దేవా నీ ప్రేరణముతో వాక్కుల,దేహము మనస్సులచేఁ జక్కఁగఁ జేసిన పనుల నెల్లను  దప్పక నీక యర్పింతును. భూమిపై హీన జాతుఁ డైనను బలము, మనస్సు, వాక్కులు, మఱియు నింద్రియ విషయములు నీ పై నిలిపినఁ బుడమినిఁ బునీతము చేయును. అన్యుఁ డెవ్వరైన నట్లు చేయ నేరఁడు.

 

 

 

 

చం.

భయ మనఁ జిత్త మందు నొక భావము గల్గు ద్వితీయ చేతనన్

స్వయము మనమ్ము చేత నది సంభవ మందును దాని నాపు దే

న యడరు బుద్ధి నేకతపు టభ్యసనమ్మున శక్తి మాయ చే

లయ మయి యింక బుద్ధియె విరాజిల కున్న నుతింతు గెల్వఁగన్

3.     

 

 

 

 

మనస్సులో భయ మను భావము (తాను గాక)  రెండవ చేతనమునఁ గల్గును. ఆ రెండవ చేతన మది స్వయముగా మనస్సు చేతనే పుట్టును. ఏకత్వము నభ్యసించి బుద్ధిచే దానిని శక్తితో నేన యాపుదును. ఒక వేళ మాయ చే నా బుద్ధి రాణింప కున్న గెల్చుటకునై నిన్నే నుతింతును.

 

 

 

 

తే.గీ.

పుణ్యజన సంగమమ్మునఁ బుట్టు భక్తి

వృద్ధి సెందు శ్రీమంతుల విత్త మబ్బి

నట్లు నీదు సంకీర్తన మలరఁ జేయు

నఘ వినాశక భక్తి దార్ఢ్యమును భృశము

4.     

 

 

 

 

పుణ్యజనుల కలయిక వలన భక్తి పుట్టును శ్రీమంతులను జేరిన ధనము కల్గు నట్లు వృద్ధి జెందును. నీదు సంకీర్తనము పాపములను హరించు భక్తి బలము నతిశయింపఁ జేయును.  

 

 

 

 

తే.గీ.

పరము మోక్షగతుల కెల్ల భక్తి పథము

జన్మ కర్మ శుభద నామ సంచయ స్మ

రణమున మునుఁగు చుందు నలరుచుఁ బాడు

చాడు చేడ్చుచు నున్మాది యట్ల యుందు

5.     

 

 

 

 

మోక్ష గతుల కెల్ల భక్తి మార్గము శ్రేష్ఠము. నీ జన్మముల గర్మముల శుభ కరము లగు నీ నామ స్మరణముల మునుఁగుచు, నలరుచు, నాడుచు, బాడుచు నేడ్చుచు నున్మాది వలె నుందును.

 

 

 

 

తే.గీ.

భూతమయ భూత సంచయములు విహంగ

మీన మర్త్య మిత్ర రిపుల మేను లీవ

నియత బుద్ధి నీ సేవల నిరత ముండ

భక్తి వైరాగ్య తత్త్వ భావములు నేర్తు

6.     

 

 

 

 

పంచ భూతాత్మక మైన జీవ సంచయము పక్షులు, మీనములు, మానవులు, మిత్రులు, శత్రువులు వీరి యెల్ల మేనులు నీవయే. నియమిత మైన బుద్ధితో నీ సేవ లందు నిత్యము నుండ భక్తి వైరాగ్య తత్త్వమలును నేర్చెదను. 

 

 

 

 

తే.గీ.

వదలి యాఁకలి దప్పులఁ బథ మతిక్ర

మింపకయు ధ్యాన ముంచుచు  నెడఁద సతము

సముఁడ నగుదు నిష్టా నిష్ట సమ్మద వ్య

సనము లందు మాయ నెఱిఁగి చరణ రతిని

7.     

 

 

 

 

ఆఁకలి దప్పుల బాధఁ దలంపక నీ పథము నతిక్రమింపక నిత్యము మనస్సులో ధ్యానము నుంచి యిష్టా నిష్టము లందు సుఖదుఃఖము లందు సమానముగా నుండి మాయ నెఱింగి నీ చరణము లందాసక్తితో నుందును. 

 

 

 

 

తే.గీ.

ఎఱుఁగ కున్న భూ తైక్యత నిపుడు నీదు

నేను ప్రేమ నీ పయి మైత్రి నీదు సఖుల

ప్రేమ జడుల రిపువుల నుపేక్షతఁ బ్రతి

మా సుసేవా నిరతిఁ గందు మంచి గతుల

8.     

 

 

 

 

భూతముల యేకత్వ మెఱుఁగ కున్నను నిపుడు నేను నీ పైఁ బ్రేమతో నీ సఖు లందు మైత్రితో జడులందుఁ  బ్రేమతో శత్రువు లందు విముఖతతో నీ ప్రతిమల పూజా నిరతితో మంచి గతులను బడయుదును. 

 

 

 

 

తే.గీ.

భూ జలాగ్ని ముఖులు దాఁప మురరిపు తవ

రూపము మునుఁగ నరులు కర్మాపములను

మాయ ముంచకు నన్ను రమా సతీశ 

భక్తియ గతి యనె ప్రబుద్ధ పరమ యోగి

9.     

 

 

 

 

భూమి, నీరు, యగ్ని మొదలగునవి నీ రూపమును దాఁచినవి. జనులు కర్మముల వలని దుఃఖ జలము లందు మునుఁగు చున్నారు. రమాపతీ నన్ను నీ మాయ లో ముంచకుము. నీ పై భక్తి యొక్కటే దిక్కని పరమ యోగి ప్రబుద్ధుఁడు చెప్పెను.

 

 

 

 

తే.గీ.

తెలివి వడసి ప్రాణుల దుఃఖముల నెఱింగి 

గురు ముఖమున నీ వర తత్త్వ చరిత గుణము

లరసి దాఁటి మాయను నీ పదాబ్జముల ము

రియుదు రుజ లాపు మయ్య గాలి పురి దేవ

10.  

 

 

 

 

జీవుల దుఃఖములను జూచి తెలివి నొంది గురువులు చెప్పఁగా నీ తత్త్వము, చరిత్రము, గుణ గణముల నెఱింగి, నీ మాయను దాఁటి, నీ పాదాబ్జ మూలముల సంతోషమును బడయుదును. గురు వాయూరు నాథా నా రోగముల నాపుము. 

 

 

 

ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయమునఁ దొంబది యొకటవ దశకము. 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

శ్రీమదాంధ్ర  శ్రీమన్నారాయణీయము

(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము)

ఏకాదశ స్కంధ పరిచ్ఛేదము

దశకము 92.

కర్మ మిశ్ర భక్తి స్వరూప వర్ణనము.

 

 

చం.

శ్రుతులఁ గలట్టి కార్యములు సూడ ఫలమ్ములఁ గోర నట్టివే

నత సుర దేవ యర్పణ మనంగ నొనర్చెద నీకు వానినిం

బతనము కాను గర్మముల వాక్కులఁ జేష్టల యందు వేద వ

ర్జితములఁ జేయ నొల్ల మదిఁ జేసిన నిత్తును నీక మాధవా

1.      

 

 

 

 

వేదము లందుఁ జెప్పఁ బడిన కర్మములు ఫలములను గోరని వని యెఱిఁగి వినమ్రు లైన దేవతలు గల దేవా నీకే యర్పితమని వానినిఁ జేసెదను. పతనము గాను. వాక్కుల చేష్టల మనమ్మునను వేదములు వలదన్నవి చేయ నొల్లను. తప్పక  చేసినను వానిని నీకే యిత్తును. 

 

 

 

 

చం.

తనరఁగఁ గర్మ యోగ మని తాల్చి మనమ్మున నీదు రూపమున్

మను కలు విగ్రహమ్ముల సమంచిత భక్తిని నిన్ను సత్త్వ రూ

పునిఁ దమి గంధ పుష్పములు పూర్ణ నివేద్యము లిచ్చి శక్తి మే

ర నతు లొసంగి కొల్చెదను రమ్యపు నీ దయఁ బొంద నిత్యమున్

2.     

 

 

 

 

కర్మయోగ మనఁగ నీ రూపమును మనస్సులో దాల్చి మట్టి ప్రతిమలు కాని రాతి విగ్రహములు గాని యుంచి తగిన భక్తితో సత్త్వ రూపుఁడ వైన నిన్ను గంధము, పుష్పములు, నైవేద్యములతో శక్తి మేరఁ గొల్చెదను. నీదయఁ బొందుటకు నిత్యము నమస్కరించెదను.

 

 

 

 

చం.

వినుటకు నోచ రక్కట పవిత్రపు గాథలు నీవి శూద్రులున్

వనితలు చెంత నుండియును బాఱులు యాజకు లౌర భుక్తికై

వినకయు నీదు బోధలను విద్యల జాతి మదమ్ము తోడ శాం

తిని విడి దుష్ట కృత్యములఁ దృప్తులు చేయ కటుల్ విభూ ననున్

3.     

 

 

 

 

శూద్రులు , వనితలు నీ పవిత్ర మైన గాథలను వినుటకు నోచుకొనరు. నీ చెంత నుండియు కూడ బ్రాహ్మణులు భుక్తికి మాత్రమే యాజకులు నీ బోధలను వినకయే విద్య వంశముల గర్వముతో శాంతిని వీడి చెడ్డ పనులు సేయుచు దృప్తు లౌదురు.  దేవా న న్నట్లు చేయకుము. 

 

 

 

 

మ.

చనుచున్ నిత్యము స్వీయ దుశ్చరితఁ గృష్ణా రామ రావమ్ములం

గన రాకుండఁగ నంచు దుష్ట జన సంఘాతమ్ము హాస్యమ్మునన్

ఘన భక్తాలినిఁ జూచు నక్కతనఁ బల్కన్నేర నీ గాథలం

గనఁ బెక్కింటిని దేవ సేయకుమ శ్రీకాంతుండ నన్నవ్విధిన్

4.     

 

 

 

 

నిత్యము తమ తమ దుష్ట కార్యముల నుండుచుఁ దెలియ కుండుటకునై కృష్ణా రామా యన్న రావములు పల్కుదు రని  నిజమైన గొప్ప భక్తులను దుష్టులు హాస్యము సేయు చుండుటచే వారి పెక్కైన యిట్టి మాటలను నేను పల్క నేరను. దేవా శ్రీకాంతా న న్నట్లు చేయకుము.

 

 

 

 

ఉ.

తెల్లని మౌనిపుంగవుని దేహిని గొల్త్రు కృతమ్మునన్ మునుల్

జల్లఁగ స్రుక్కు నా స్రువపు సంజ్ఞలఁ దామ్ర శరీరుఁ ద్రేతనున్ 

నల్లని వాని ద్వాపరమునన్ స గదారినిఁ దంత్రరీతులన్

నల్లని రూపు నిక్కలిని నామ సహస్రములన్ నరుల్ ప్రభూ

5.     

 

 

 

 

ప్రభూ తెల్లని దేహము గల మౌని పుంగవునిఁ గృతయుగమున మునులు  గొల్తురు. సంతసముగ స్రుక్కు స్రువముల గుర్తుల నెఱ్ఱని శరీరుని త్రేతా యుగమునఁ గొల్తురు. ద్వాపర యుగమున నల్లని శరీరుని గదయుఁ జక్రము గల వానిని తంత్రములతోఁ గొల్తురు. ఈ కలి యుగమున నల్లని రూపు వానిని సహస్ర నామములతో నరులు గొల్తురు. 

 

 

 

 

చం.

కలియుగ మం దగున్ జయము కైటభ వైరి! తలంప నెచ్చటన్

లలితపు నామ కీర్తనములం జిఱు యత్నత మేలు లెల్ల వే

కలుగుఁ గృతాది కాలములఁ గల్గిన వారు కలిన్ జనింపఁగాఁ

దలఁతురు పుట్ట మేము కలిఁ దప్పుల నెంచకు మీకు మోసమున్

6.     

 

 

 

 

ఎచ్చట లలితము లైన నీ నామ కీర్తనముల చేతను నించుక యత్నముతో  మేళు లెల్ల వేగముగఁ గలుగునో యట్టి యీ  కలి యుగమున కైట భారీ నిన్ను తలంచి నంతనే విజయములు కల్గును.  కృతాది మూడు  యుగముల వారు కలి యుగములో జనింపఁ గోరెదరు. అట్టి యీ కలి యుగము నందుఁ బుట్టితిమి.  మా తప్పుల నెంచకుము మఱియు మోస తలంపుల నీకుము.

 

 

 

 

ఉ.

పుట్టితి భార తావనినిఁ బుణ్యులు భక్తులు పెక్కు రిచ్చటన్

దట్టపు శుద్ధ పుష్కర నదమ్ములు పాఱుఁ బ్రతీచి కిద్ధరన్

గట్టిగ నమ్మి నిన్నెదను గానక యుంటిని బంధముక్తి న

న్నెట్టుల నైన నీ పయిన నింపగు భక్తిని నిచ్చి కావుమా

7.     

 

 

 

 

ఈ భరత భూమిని జనించితిని. పుణ్యాత్ములు భక్తు లిచ్కట పెక్కు మంది గలరు. దట్టమైన విమలుము  లైన తీర్థ నదులు పశ్చిమమునకు నిచ్చట పాఱును. నిన్ను గట్టిగ మది నమ్మితిని. బంధమోచనము గానక యుంటిని. ఎట్టు లైనను నాకు నీ పై నింపగు భక్తి నొసంగి దేవా నన్ను గావుము.

 

 

 

 

మ.

కలి వీరుం గని ఖడ్గ మెత్తియును దుష్కర్ముం బరీక్షిత్తు ము

న్పల కూల్పండు గుణమ్ములం గనియు సత్యజ్ఞానునిన్ నీదు సే

వలు సద్యః ఫలదమ్ములౌఁ జెడు పనుల్ వ్యర్థమ్ములౌ నీదు భ

క్తుల భీతిన్ రుజ లిచ్చి మాపు కలినిం దోరమ్ము శిక్షింపుమా

8.     

 

 

 

 

కలిని వీరునిఁ జెడ్డపనుల వానినిఁ బరీక్షిన్మహారాజు కత్తి యెత్తి కూడ సత్యము నెఱింగిన యతని గుణములఁ గాంచి  చంపక వదలెను. నీ సేవలు తత్క్షణ ఫలము లొసఁగును. చెడ్డ పను లట్లు గా నేరవు. నీ భక్తులకు భీతిలి వారికి రోగముల నిచ్చి నాశము చేయు కలిపురుషుని దేవా యధికముగ శిక్షింపుము.

 

 

 

 

తే.గీ.

గంగయును గీత గాయత్రి మంగళ తుల

సి తవ నామస్మరణ గంధ మవల పదునొ

కటి వ్రతమ్ము సాలగ్రామ ఘనపుఁ బూజ

లొసఁగు శీఘ్ర ఫలము లవి పొసఁగ గూర్పు  

9.     

 

 

 

 

గంగా నది స్నానము, భగవద్గీత పఠనము, గాయత్రి, మంగళకర మగు తులసి మొక్క పూజ, నీ నామ స్మరణము, చందనము, నేకాదశి వ్రతము, సాలగ్రామ పూజ లీ యెనిమిది  శీఘ్రముగా ఫలముల నొసఁగును. దేవా యవి నాకు కలుగు నట్టు లనుగ్రహింపుము.  

 

 

 

 

చం.

పితరుల దేవ సంయముల పేర ఋణమ్ములు దీరు నింక ని

న్నతి రతి వేఁడ రక్షణము నచ్యుత వారికిఁ గారు సేవకుల్

సతతము వీడ కర్మములు సంచిత పాపము నాశ మౌను నీ

స్థితపుఁ గతమ్ము భక్తి నిడి తీర్పు మరుత్పుర నాథ తాపమున్

10.  

 

 

 

 

నిన్ను బ్రీతితో రక్షణమునకై వేడిన నచ్యుత పితరుల సురల మునుల ఋణములు దీరును. వారికి సేవకులు కాకుండ నుందురు. వీడఁ గర్మములు మును గల్గిన పాపములు మదిలో నీ వున్న కారణమునఁ దొలఁగును. గురు వాయూరు నాథా మాకు భక్తి నిచ్చి తాపములను బోఁగొట్టుము.

 

 

 

ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయమునఁ దొంబది రెండవ దశకము. 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

శ్రీమదాంధ్ర  శ్రీమన్నారాయణీయము

(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము)

ఏకాదశ స్కంధ పరిచ్ఛేదము

దశకము 93.

గురుశిక్షా వర్ణనము.

 

 

చం.

సకల జగత్తు మాయ యని సత్య మెఱింగి భవద్దయా నిధిన్

వికలము కాఁగ బంధు రతి వీడి సమస్తము నుండఁగా వలెన్

బ్రకటము భ్రాంత చిత్తులకు వర్జన సంగ్రహ కార్య సంచయ

మ్ము కలుగునే య వెల్లయును మూరిన భక్తి విబేధ హీనతన్

1.      

 

 

 

 

దేవా నీ దయ యను నిధి వలన జగ మంతయు మాయ యన్న సత్యము నెఱిఁగి బంధు ప్రీతి నశింప నన్నిటిపై నాశ వీడి యుండ వలెను. భ్రాంత చిత్తులకు విడువఁ దగిన చెడ్డ పనులు, చేయఁ దగిన మంచి పనులును విశదములే. కాని యవి యెల్లయు భేదము లెఱుంగని వారికి నీ పై భక్తి మూరిన వారికిఁ గలుగునే? 

 

 

 

 

చం.

అల యిఁకఁ దీర్ప నెంచు నవి యాఁకలి దప్పుల జంతువుల్ మను

ష్యులు తెలివిన్ వహించి మది నుండ వరిష్ఠులు దుర్లభుల్ ధరం

దలఁప నరుండునుం దనకుఁ దానె సఖుండు విరోధి యెంచి నిం

దలఁప నుపాయముల్ సఖుఁడు తాప మడంపఁ బరుండు శత్రువే

2.     

 

 

 

 

జంతువులు తమ యాఁకలి దప్పులను దీర్చుకొనుటకే తలంచును. తెలివి గూడి మనుష్యులు శ్రేష్ఠులు, ధరలో దుర్లభులును. ఆలోచింపఁగా నరుఁడు తనకుఁ దానే మిత్రుఁడు మఱియు శత్రువు నగును.నిన్ను గణించి తన తాపము లణఁచుటకు నుపాయములను దలఁచిన వాఁడు మిత్రుఁడు. ఇతరుఁడు శత్రువు.

 

 

 

 

ఉ.

నీ దయ యుండ విస్తృతము నేర్పుదు రిద్ధర నంద ఱొజ్జలై

మీద వహించి సర్వమును మేదిని నేర్పు క్షమా గుణమ్ము నీ

యీఁద స్పృశించి యన్నిటిని నింతయు మాయక వీత రక్తినే

యీ దివి వ్యాప్తమై దిశల నీ హృది కింపగు నిర్వికారమున్

3.     

 

 

 

 

నీ దయ విస్తారముగా నుండ నందఱు గురువులై నేర్పెదరు. తన మీద నెల్లరను మోయు చుండి భూమి క్షమా గుణమును నేర్పును. ఈ గాలి యన్నింటినిఁ దాఁకుచును గొంచె మైనను మాయక వైరాగ్యమును నేర్పును. ఆకాశము దిక్కుల నెల్ల వ్యాపించి యీ మనస్సున కాహ్లాదము నొసంగు నిర్వికారమును బోధించును. 

 

 

 

 

చం.

ఉదకము వంటి స్వచ్ఛతను నుండఁ గటంకట మారగించియుం  

బదిలము వహ్నివృక్షముల భంగిని నన్నిట నుందు నంచు నా

కుఁ దెలిసెఁ జంద్రుఁ బోలె పెరుగుల్ తరుగుల్ మెయి కుండ నాత్మ నే

రదని జలమ్ములన్ దినకరస్థితి సర్వుల నేక భావమున్

4.     

 

 

 

 

నీటి వలె స్వచ్ఛముగా నుండుట, యగ్ని వలె నేది భక్షించినను క్షేమముగా నుండుట, వృక్షములలో నగ్ని వలె యన్నిట నుందు ననుచుఁ జంద్రుని వలెఁ బెరుగుట తఱుగుట దేహమునకే కాని యాత్మకుఁ గా దనియు నీటిలోఁ గనిపించు సూర్య బింబము వలె సకలమున నేకత్వమును దెలిసెను.

 

 

 

 

ఉ.

చేయకుమా సపుత్రకము జీర్ణ కపోతపు భంగి నన్నిలం

జేయుమ నన్ను నాఁకలినిఁ జెన్నుఁ జెలంగెడు కొండ పాముగాఁ

జేయుమ సింధు ధీరు నలి చెన్ను ధనగ్రహు నాపి దాఁచుటం

జేయకు మగ్నిలో మిడుత సేరు విధమ్ముగ స్త్రీ విలోలునిన్

5.     

 

 

 

 

పిల్లలతో నశించిన పావురము వలె నన్ను జేయకు, మాకలినిఁ గొండచిలువ వలెఁ జేయుము కడలి వలె ధీరునిఁ జేయుము తుమ్మెద వలె ధనమును గ్రహించు నట్ల కాని దాఁప కుండు నట్లు  జేయు మగ్నిలో దూఁకు మిడుత వలె నన్ను స్త్రీ లోలునిఁ జేయకుము. 

 

 

 

 

చం.

తరుణులఁ జిక్క నీయకుమ దంతి విధమ్ము ధనార్జనమ్మునం

బరుగిడ నీకు చౌర్యమగుఁ బాటల ముంచకు లేడి భంగి భో

జ్య రతి ఝషంపు భంగి నెర నాశను జేయకు కోతి భంగి ని

ద్దుర నిడు మయ్య నిర్భయము తూల్పకు పెన్నడపుల్గు రీతినిన్

6.     

 

 

 

 

ఏనుఁగు రీతి నాడువారి యందుఁ జిక్క నీకుము, చోరుల పా లగు డబ్బు సంపాదనకై పరువెట్ట నీకుము, లేడివలె పాటల మత్తులో పడ నీకుము చేపకు నెరపై వలె నన్ను  తిండిపై  నాశ నుంచ నీకుము, కోతి వలె నిర్భయమైన నిద్ర నిమ్ము, కురరము వలె నన్ను తూల్పకుము.

 

 

 

 

చం.

తిరుగుదు బాలుఁ బోలెను రతిన్ యుగళమ్ముల నెల్ల వీడి నేఁ

దరుణుల గాజు భంగిని ముదమ్ముగ నొంటరి నౌదు ఱేని రా

కరయని బాణకారు వలె ధ్యాసను నీపయి నుంచి యుందు నేఁ

బరుల గృహమ్ములో నెలుక వాసమునం దురగమ్ము రీతినిన్

7.     

 

 

 

 

సుఖ దుఃఖాది ద్వంద్వములను వీడి బాలుని వలె ప్రీతితోఁ దిరుగుదును. వనితల గాజు భంగి నేను రహిని  నొంటరిగా నుందును. రాజు రాక నెఱుంగని బాణములు సేయు వాని వలె ధ్యాస నంతయు నీ పై నుంచి యుందును. ఎలుక కన్నములోఁ బాము వసించు నట్లు నే నితరుల గృహము లందు నుందును.

 

 

 

 

ఉ.

లూతను గాంచి నేర్చితిని లోలత నీవ సృజించి విశ్వముం

జూతువు దాని క్షీణమును జూడ దృఢమ్మగుఁ బేడ పుర్వునున్

బ్రీతి నినున్ స్మరింపఁ గడు వెల్గుదు రెల్లరు నీదు భంగి మై

రోఁతగు విట్టు బూదుల గురుం డయి వెల్గు విరక్తి విత్తులన్

8.     

 

 

 

 

దేవా నీవే విశ్వమును సృజించి నాశము సేయుదు వని సాలె పురుగు వలన నేర్చితిని. పేడ పురుగును జూచిన నిన్ను స్మరింప నీ వలెనే యెల్ల రగుదురని దృఢ మగును. శరీరము రోత లగు పురీషాదుల భస్మముల వలన గురు వయి విరక్తిని వివేకములను వెల్గును. 

 

 

 

 

చం.

తలఁపరు నిన్నునక్కట స్వదార గృహార్థ పరాత్ము లౌచు మే

నుల పయి మోహ మార్పు తుద నుగ్గయి కుక్కల పాలు మండు నా

వల నివలన్ నిజేంద్రియ విభావము త్రోయుఁ బరమ్ము నీ బద

మ్ములకును లేరు చేర్పఁగను ముచ్చట నొక్కరు వాని చెంతకున్   

[విభావము = ఆకర్షణము]

9.     

 

 

 

 

తమ భార్యలపై గృహములపై మమకారముతో నిన్ను దలంపరు. దేవా మా మేనులపై మోహము నార్పుము. తుద కవి కుక్కల పాలు లేక మంటల పాలు. మా యింద్రియములే మమ్ము నావల కీవలకు నీ పాదములకు దూరముగాఁ ద్రోయును. వాని చెంతకు మమ్ము తిరిగి చేర్ప నొక్కఁడును లేఁడు. 

 

 

 

 

తే.గీ.

దేహ మోహము విడనాడ దేవ తరమె

భక్తి నిల్పు దృఢమ్ముగఁ బాపి రుజలు

వివిధ జన్మములఁ గలిగె విప్ర జనువు  

వలదు సుఖములు కాపాడు వాయుపురప

10.  

 

 

 

 

దేవా దేహముపై మోహమును వీడఁ దరమే? అనేక జన్మముల పిదప బ్రాహ్మణ జన్మము కలిగినది. మా కే సుఖములు వలదు. మా రోగముల నాపి దృఢ మైన భక్తి నిమ్ము. గురు వాయూరు నాథా మమ్ము కాపాడుము.

 

 

 

ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయమునఁ దొంబది మూడవ దశకము. 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

శ్రీమదాంధ్ర  శ్రీమన్నారాయణీయము

(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము)

ఏకాదశ స్కంధ పరిచ్ఛేదము

దశకము 94.

తత్త్వజ్ఞానోత్పత్తి ప్రకార, బంధ మోక్ష స్వరూప భక్తి ప్రార్థనా  వర్ణనములు.

 

 

మ.

పరిశుద్ధాత్ములు సద్గురోక్తులను సంభావించి నిష్కామ ధ

ర్మ రతిన్ నేర్తురు నీ స్వరూపమును నైర్మల్యంపు దేహేంద్రి యా

ది రవాతీతము సర్వదర్శితమునౌ దిట్టమ్ము నల్పంబునుం

బరగన్ ముగ్గుణముల్ భుజిప్రతి మహత్వ స్వల్ప శాంతాంశులన్

1.      

 

 

 

 

నిష్కాములు పరిశుద్ధులు నైన భక్తులు గురుబోధనమున నీ స్వరూపమును దెలిసికొందురు. అది నిర్మలము, దేహమునకు నింద్రియ రావములకు నతీతము, నంతటఁ గనిపించునది, స్తూలము, సూక్ష్మము, సత్త్వరజస్తమో గుణములు మూడింటను దనరును. అది మిక్కుటమగు, నల్పమగు, శాంతించిన కాంతి గల యగ్ని వంటిది. 

 

 

 

 

తే.గీ.

గురువు శిష్యు లరణు లనఁ గూర్ప జ్ఞాన

మనెడు నగ్ని కాల్చు గత జన్మాది కృతము

లనెడు వనిఁ గాలఁ బూర్ణము నది లయ మగు

నైక్య మనఁగ నీలోన జ్ఞానాగ్ని దేవ

2.     

 

 

 

 

గురు శిష్యు లగ్ని పుట్టించు కట్టె లనుకొనిన వారి వలన జ్ఞాన మనెడు నగ్ని పుట్టి గత జన్మములఁ  జేసిన కర్మము లనెడు నడవినిఁ బూర్తిగ గాల్చిన పిదప నీ లోన నైక్య మనఁగ  జ్ఞానాగ్ని లయ మగును.

 

 

 

 

తే.గీ.

కలుగ నీయవు కర్మయోగమ్ము లాఱు

కృషియు మందు లనఁగ నాఱు క్లేశ లయముఁ

ద్వల్లయమ మిన్న శ్రుతిగతి వ్యథల మయము

మఱచి మదమునఁ జెడుదురు తఱచు వెతల   

3.     

 

 

 

 

కృషి మందులు మొదలగు నాఱు గుణములు, షడంగ కర్మయోగములు బాధలను దొలఁగింప లేవు. వేద కర్మములు కష్టతరములు గర్వము నీయ నిన్ను మఱచి జనులు తఱచు వెతల బారి పడుదురు. అన్నింటి కన్న నీ లోన లయ మగుటయే మిన్న.

 

 

 

 

చం.

కనుదుమె నీదు లోకమును కైటభ మర్దన మించు లోకముల్

కనఁ బరమేష్టి భీతిలు యుగంపు ముగింపున నిన్ను సేపు రూ

పున వఱలంగ మానవులఁ బొంద నధర్మగతుల్ వచింప నే

ల నిఁకఁ గృపా రసార్ణవ వరప్రద త్రెంచుమ నాదు బంధముల్

4.     

 

 

 

 

కైటభారీ నీ వైకుంఠమును మించు లోకములను గాంచఁ గలమా? బ్రహ్మ కూడా తన వయస్సులో రెండవ సగ మయిన యుగాంతమునఁ గాల రూపుఁడ వైన నిన్ను జూచి భయపడును. ఇంక నధర్మ చరితులు మానవులను జెప్ప నేల? ఓ కృపా నిధీ వరదాతా నా బంధములను ద్రెంచుము. 

 

 

 

 

చం.

నిజ మిది నీ పరమ్మయిన నే నిల నేరను బంధ మోక్షముల్

నిజ సృజనమ్ము దేవ కన నిద్రయు మెల్కువ మాయ విద్యలే

బ్రజలను బంధ ముక్తులను వర్ష్మమహీజపుఁ బండ్ల నారగిం

పఁ జనును బూర్వుఁ డన్య గుణవంతుఁడు దా నగు నిర్వ్యథాత్ముఁడే

5.     

 

 

 

 

దేవా నీకు వశ మైన నాకు బంధ మోక్షములు లేవు. నిద్రయు మెలుకవ మాయ విద్యలే. నీ చేత సృజింప బడినవియే.  బంధములఁ గూడిన  ప్రజలను, ముక్తులైన  ప్రజలను జూడఁగా మొదటి వాఁడు దేహ మను చెట్టు పండ్ల నారగించును.  రెండవ వాఁడు పురుష శ్రేష్ఠుఁడు బాధలు లేని వాఁ డగును. 

 

 

 

 

చం.

ఇటు లగు నంచు వాక్తతుల నిబ్భవ ముక్తి వచింపఁగా ఫల

మ్మట కలదే యశుద్ధ మతి కక్కట చిక్కునె భక్తిఁ దక్క న

క్కట లఘు శోధన మ్మరుదు గావున ని మ్మది నిన్నెఱింగి నేఁ

ద్రుటి నరయంగ నైక్యము గురువ్రజ బోధల నాలకించెదన్

6.     

 

 

 

 

జీవన్ముక్తి యీ విధ మగు నని వాక్కలు పల్కినఁ జెడ్డ మతికి ఫల మేమిటి? కొంచెమైన శుద్ధి కాదు. భక్తిని గాక యన్యమునఁ జిక్కునా? కనుక యా భక్తిని నా కిమ్ము. నిన్ను నెఱింగి నీ లో నైక్య మగుటకు గురువుల బోధల నాలకించెదను.

 

 

 

 

ఉ.

గొడ్డగు గోవుఁ గోరు విధిఁ గొందఱు నిన్నన నట్టి వేదముల్

దొడ్డఁ బఠింత్రు వారి శ్రమ తోరము వ్యర్థము వేనిఁ గాంచనో

చెడ్డ హరించు, రూపములు చెల్వము దాల్చెడు, సత్తు చిత్తులన్

దొడ్డ నినుం దవ స్తుతులఁ దుష్టము లా శ్రుతులం బఠింపఁ జూ

7.     

 

 

 

 

గొడ్డావును గోరు విధము కొందఱు నిన్ను గీర్తింపని వేదములను మిక్కిలి పఠింతురు. వారి శ్రమ వ్యర్థమే. వేనిలో దురితములను హరించు నట్టి, చెలువంపు టవతారములు దాల్చునట్టి, సత్తు చిత్తులలో దొడ్డ వైన యట్టి నిన్ను  నీ స్తుతులను గాంచనో యట్టి వేదములను నేను పఠింపను జుమీ.

 

 

 

 

తే.గీ.

ఇది యదియు నివ్విధియు నీవు నెవ్విధియొ యె

ఱుంగ దేవ భజింప నెఱుంగుదుఁ గన

నిమ్ము నీ ప్రతిమలు చూపు లింక స్పృశము

భక్త పదములఁ గొను నతి వర నుతులను

8.     

 

 

 

 

దేవా నీ విది యది లేక నివ్విధి యెవ్విధియో నే నెఱుంగను. నిన్ను భక్తిఁ బూజించుట మాత్రము నెఱుంగుదును నీ ప్రతిమలను జూడ నిమ్ము, నీ భక్తుల పాదముల దర్శనము స్పర్శను గన నిమ్ము . నా నమస్కారమును నుతులను స్వీకరించుము.

 

 

 

 

చం.

దొరికిన దెల్ల నీ కిడుదుఁ దుడ్చెద నీదు గృహమ్ము బంటునై

పరఁగుదు లేక మాయయె లవమ్మును భూసుర సూర్య వహ్నులన్

వర పురు షాత్మలన్ వెలయు బాహు చతుష్క సురూప మ్రొక్కుదుం

బరమపు భక్తి యోగమున మగ్నత నిమ్ము కృపారసమ్మునన్

9.     

 

 

 

 

దేవా నాకు లభించిన దెల్ల నీ కర్పింతును. బంటునిగా నీ యాలయముల నూడ్చెదను.  ఇంతయు నైన మాయ లేక యుందును, విప్రుల యందు, సూర్య వహ్ను లందు, నుత్తమ పురుషు లందు వెలసెడు చతుర్బాహులతోఁ జక్కని రూపము గలవాఁడా  నీకు మ్రొక్కెదను.  నా పైఁ గృపారసము నొలికించి భక్తియోగములో నన్ను మునుఁగ నిమ్ము.   

 

 

 

 

చం.

పరఁగదు దాన హోమ సుతపమ్ముల సువ్రత రాశి సాంఖ్య యో

గ రతములం ద వైక్యము సుఖమ్ముగ నీదు సుసంగమమ్మునం

బరమ సుఖమ్ము గోపికలు భక్తుల కన్నను మిన్నఁ బొందిరే

వర మిడు భక్తినే రుజలఁ బాపుమ గృష్ణ! మరుత్పురేశ్వరా!

10.  

 

 

 

 

దానహోమ తపముల వ్రతముల సాంఖ్యయోగము నందాసక్తుల వలన నీ యైక్యము లభ్యము కాదు. నీ సంగమమున గోపికలు పరమ సౌఖ్యమును భక్తుల కన్న మిన్నఁగాఁ బొందిరి. కృష్ణా నాకు భక్తినే వరముగా నిమ్ము. గురు వాయూరు నాథా నా రోగములను బాపుము.

 

 

 

ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయమునఁ దొంబది నాలుగవ దశకము.  

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

శ్రీమదాంధ్ర  శ్రీమన్నారాయణీయము

(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము)

ఏకాదశ స్కంధ పరిచ్ఛేదము

దశకము 95.

కైవల్య సిద్ధి ప్రకార వర్ణనము.

 

 

ఉ.

ఆది హిరణ్యగర్భుఁడ వనంత శరీరుల గూడి మాయచే

మేదిని ముగ్గుణమ్ములను మేనులు పుట్టఁగ విశ్వయోనివే

బూదిగ నయ్యె రెండు గుణముల్ గని సత్త్వము, పుట్ట భక్తియే

నీ దరి సత్త్వ మాఱ నిఁక నిర్గుణ మూర్తివి నీవ యౌదునే

1.      

 

 

 

 

ముందుగా ననంతమైన జీవులతోఁ గూడి యుండ నీవు హిరణ్య గర్భుఁడ వైతివి. పిదప మాయ మఱియు ద్రిగుణము లుద్భవింప జీవులు ధరలో పుట్టఁగా విశ్వ యోని వైతివి. సత్త్వ గుణము వలనను నీ పై భక్తి పుట్టుట వలనను రజోగుణము తమో గుణములు రెండు నాశన మైనవి. సత్త్వగుణము కూడ నశింప నేను నిర్గుణ మూర్తివి యైన నీవే యౌదును.

 

 

 

 

తే.గీ.

సత్త్వ గుణము విషయపు దోషమ్ము లెఱిఁగి

నను దమస్సు రాజసములు తనరు దేవ

మనసుఁ గూడి యవారిత మనఁగ నాప

దిక్కగుఁ దురీయ మందు భక్తి యని తీవ

2.     

 

 

 

 

సత్త్వగుణ మింద్రియ భోగముల దోషము లెఱుఁగినను, రాజస తామస గుణములు మనస్సుతో  ననివార్యముగఁ గలిసి  చెలరేఁగును. వాని నాపుటకు నాల్గవది యైన సన్న్యాసాశ్రమమున భక్తియే దిక్కని దేవా నీవు బోధించితివి.  

 

 

 

 

తే.గీ.

తనరుఁ  బెక్కు క్షుద్రానందదములు గతులు

జనుల కనుగుణముగఁ గృష్ణ సఖున కీవు

చెప్పిన మహదానందద శివద భక్తి

గతికి సమములౌనె గణింపఁగ నలినాక్ష

3.     

 

 

 

 

క్షుద్రమైన యానందము నిచ్చు మార్గములు జనుల కనుకూల మైనవి పెక్కులు గలవు. కృష్ణా నీ సఖుఁ డైన యుద్ధవునకుఁ జెప్పిన పరమానందము నిచ్చు శుభముల నొసఁగు భక్తి మార్గమున కవి సమానము కాఁ గలవా?

 

 

 

 

చం.

జలచర జీవ రాశి కట సర్వము తోయ మయంపు రీతి నీ

వలని చెలంగు భక్తి కిలఁ బన్నుగఁ దృప్తి వహింప నెల్ల ది

క్కులును సుఖమ్ములై తనరఁ గోరరు శక్ర విధాతృ లోకముల్

వలవరు యోగ సిద్ధుల నవాంఛిత సంగత మోక్షసౌఖ్యముల్

4.     

 

 

 

 

నీటిలో నుండు జీవులకు సర్వము నీటి మయమై నట్టులు నీ పైఁ జెలఁగిన భక్తికిఁ దృప్తి సెందఁగ దిశ లన్నియు సుఖ మయములై తనరఁగ నీ భక్తు లింద్ర లోకమును గాని బ్రహ్మ లోకమును గాని కోరరు.    యోగ సిద్ధులను, గోరకయె వచ్చిన మోక్ష సౌఖ్యముల నిష్ట పడరు.  

 

 

 

 

చం.

నియతి వహింప కింద్రియపు నిగ్గును భక్తుఁడు దుఃఖ మందినన్

రయమున భక్తి సాంద్రతఁ బరాజితముల్ సక లేంద్రియమ్ములే

స్వయముగఁ గాల్చుఁ బాపముల భక్తియె కఱ్ఱల వహ్ని భంగి నిం

ద్రియముల దుర్మ దాంధముల దిట్టతనం బిఁకఁ జెప్ప నేలయా

5.     

 

 

 

 

ఇంద్రియముల మెఱుంగు నరికట్టక భక్తుఁడు దుఃఖము నందినను వేగముగ భక్తి దృఢత్వమున నింద్రియము లన్నియుఁ బరాజితము లగును. కట్టెలను నిప్పు కాల్చు నట్లు స్వయముగా భక్తియే పాపములను గాల్చును. దుర్మదాంధములైన యింద్రియముల దిట్ట తనము నింకఁ జెప్ప నేల?

 

 

 

 

ఉ.

కన్నుల హర్ష భాష్పములు గల్గునె మేనున రోమహర్షముం

జెన్నుగఁ జిత్త మార్ద్రతను జెందక నిష్ఠలు విద్య లేలయా

సన్నము కాఁగ భక్తి మదిఁ జక్షులు నంజన మంది చూచు న

ట్లున్నత గాథలం జదువ నూరును దత్త్వమె యేల తర్కముల్

6.     

 

 

 

 

మంచిగ మనస్సు తడియకున్న కన్నులలో నానందపు గన్నీరు, నొంటిలో పులకరింతలు కలుగ నగునా? మదిని భక్తి సన్నగిల్లిన నిష్ఠలు,  చదువు లేల? కన్నులలోఁ గాటుక నుంచిన శుద్ధి యయి కన్నులు  చూచి నట్టు లున్నతమైన నీ గాథలను జదివిన మనస్సు శుద్ధి యయి నీ తత్త్వము తప్పక తెలియును. తర్క శాస్త్రము  లెందులకు? 

 

 

 

 

తే.గీ.

నిట్ట మెయి సుఖస్థితిఁ దల్చి నిన్ను నిజ న

సాగ్రము గనుచుఁ బూరకమం దణంచి

గాలి చిత్త పద్మమ్మున మేలుగ రవి

శశి శిఖులపై నిను దలంతు శ్యామలాంగ

7.     

 

 

 

 

పొడవైన మేనున సుఖముగఁ గూర్చొని నిన్ను స్మరించి నా ముక్కు చివరి భాగమును జూచుచుఁ  బూరకమున గాలి నాపి హృదయ పద్మమున రవి శశి వహ్నులపై భాగమున మేఘశ్యామా నిన్ను ధ్యానింతును.

 

 

 

 

మ.

వర నీలాంచిత కేశు సన్మకర సౌవర్ణేద్ధ సత్కుండలున్

దర హాసార్ద్ర ముఖారవిందు విలసద్దామప్రభా కౌస్తుభున్

వరలక్ష్మీ యుత వక్షు రమ్య తను శ్రీవత్సాంకు బాహోరు సుం

దరు సౌమ్యోదరు స్వర్ణ చేలు మృదు పాదద్వంద్వు నేఁ దల్చెదన్

8.     

 

 

 

 

గొప్ప వైన నీలి కేశముల వాని, ప్రకాశించు స్వర్ణ మకర కుండలముల వాని,  దరహాసముతోఁ గూడిన ముఖ పద్మము వాని, దామముతో వెలుంగు కౌస్తుభము వాని,  లక్ష్మీదేవితో నున్న వక్షము వాని, నంద మైన దేహము వాని, శ్రీవత్సమతో వెలుఁగు వాని నందమైన బాహువులు, నూరువుల వాని, సౌమ్య మైన యుదరము వానిఁ, బసుపు పచ్చని వలువ వాని, మృదువైన  పాదపద్మముల వానిని నేను దలఁచెదను.

 

 

 

 

ఉ.

ఉంచెద నన్ని యంగముల నుత్సుకతం గడు నంత చిత్తమం

దుంచెద నీదు ధ్యాన మిఁక నుంతు ముఖమ్మున మందహాసమం

దంచిత దృష్టి నొక్కిట ననంత సుఖప్రద చేతనమ్ముతో

నెంచక యన్య మెద్ది మది నెంచుదు నేకత నుందు యోగిగా

9.     

 

 

 

 

దేవా నీ యంగముల నన్నిటిపై మిక్కిలి యాసక్తి నుంచెదను. నా మనస్సు నందు నీ ధ్యానమునే యుంచెదను.  నీ ముఖములోని మందహాస మందు నా యొప్పిద మైన దృష్టి నుంచెదను. ఒక్క చోట ననంత మైన యానంద మొసంగు జేతనముతో నన్య మెద్దియు నెంచక నిన్నే స్మరించెదను. ఏకాంతముగా యోగిగా నుందును.

 

 

 

 

ఉ.

ఆరయ నిన్స్మరింప నణి మాదులు లబ్దము లష్ట సిద్ధులున్

దూరపు విన్కియున్ వలదు దూరము సేయు న వెల్ల ముక్తినిం

గోరుదు నిన్ను మాత్ర మిలఁ కోటి సుఖమ్ముల కాలవాలమున్

మారుత పట్టణేశ దయ మాపుము రోగము లెల్ల నా కిఁకన్

10.  

 

 

 

 

చూడఁగా నిన్ను స్మరించిన నణి మాదిగ నష్ట సిద్ధులు లభ్య మగును. దూర శ్రవణము కూడ లభించును. కాని యవి యెల్ల ముక్తిని దూరము సేయును గాన వలదు. కోటి సుఖములకు  నాలవాల మైన నిన్ను మాత్రము గోరుదును. గురు వాయూరు నాథా దయతో నా రోగములను మాపుము. 

 

 

 

ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయమునఁ దొంబది యైదవ దశకము.  

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

శ్రీమదాంధ్ర  శ్రీమన్నారాయణీయము

(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము)

ఏకాదశ స్కంధ పరిచ్ఛేదము

దశకము 96.

భగవద్విభూతి వర్ణన, కర్మ జ్ఞాన మార్గాధికారి నిరూపణ, చిత్తోపశమన ప్రార్థనములు.

 

 

చం.

స్వయముగ నీవ బ్రహ్మవు యశశ్చరితుండ వ కార మక్ష రో

దయముల నోమ్మనంగ నగుఁ దథ్యము మంత్రము లందు రాజులం

దయ మనువౌదు వింపుగ మహర్షుల నారదుఁడున్ భృగూత్తముం

డయితివి కామధేనువవె యారయ జంతువు లందు నున్నతిన్

1.      

 

 

 

 

యశస్వి యైన దేవా నీవు స్వయముగ బ్రహ్మవె, యున్నతమైన యక్షరములందు న కారమవు మంత్రము లందు నోం కారమవు, రాజు లందు మనువవు, మహర్షు లందు నారదుఁడు మఱియు భృగుఁడవు, ఔన్నత్యమునఁ బశువులందుఁ గామధేనువవు. 

 

 

 

 

తే.గీ.

అరయఁ బ్రహ్లాదుఁడ వసురు లందు వైన

తేయుఁడవు విహగమ్ముల దివ్య నదివి

నదుల ఫణుల ననంతుఁడవు దలఁపఁగ న

నశ్వరుఁ డనంతుఁడవు నీవ విశ్వమూర్తి

2.     

 

 

 

 

దైత్యు లందుఁ బ్రహ్లాదుఁడవు, పక్షు లందు వైనతేయుఁడవు, నదు లందు గంగా నదివి, సర్పము లందు ననంతుఁడవు విశ్వమూర్తీ నీ వశ్వరుఁడవు ననంతుఁడవును.

 

 

 

 

సీ.

బలి చక్రవర్తివి బ్రహ్మణ్యులందుఁ గ్రతువు లందు జపయోగ మవుదు వీవు

వర వీర జనులందుఁ బార్థుఁడ వీవు సదుత్తమ భక్తుల నుద్ధవుఁడవు

బలవంతు లందలి బల మీవ యురుతర తేజస్వు లందలి తేజ మీవ

యంత ముండదు నీ మహత్వమునకు విశ్వమందు నన్నియును నీయంద యుండు

 

తే.గీ.

భాసమానమై కన్పట్టు వస్తు జాల

మెల్ల నీవ జీవుఁడ వీవ యెంచఁ బ్రకృతి

వీవు లేనిది వెతకఁగ నిందు నందుఁ

గాంచము ప్రపంచ మందు నే కొంచె మైన

3.     

 

 

 

 

పవిత్రు లందు బలి చక్రవర్తివి, క్రతువు లందు జప యజ్ఞమవు, వీరప్రవరుల నర్జునుఁడవు, భక్తు లందు నుద్ధవుఁడవు, బలవంతుల లోని బలము నీవు,  తేజస్వుల లోని తేజము నీవు, నీ మహత్త్వమున కంతము లేదు, విశ్వములో నన్నియు నీ యందే యుండును. ప్రకాశవంతమై కన్పడు వస్తువు లెల్లయు నీవ, జీవుఁడు ప్రకృతు లీవ, యిందు నందు నెందుఁ బ్రపంచ మందు నీవు లేనిది యేదియుఁ గొంచె మైనను లేదు.

 

 

 

 

చం.

వర నిజ ధర్మ వర్ణ సువిభాగ విధుల్ శ్రుతు లందు నుక్తముల్

పరఁగఁగఁ జేయ నీ పయిన భక్తి వహింప విరాగ వృద్ధి గా

సొరిదిని సత్త సంతసము స్ఫూర్తియునౌ నిను దమ్ముగాఁ దలం

తు రెఱిఁగి మూల కారణము తోఁప జగత్తున కెల్ల నీ వనన్

4.     

 

 

 

 

వేదములలోఁ జెప్పఁ బడిన స్వీయ ధర్మములు కుల ధర్మములు పాటించి నీ పైన భక్తి నుంచఁగ వైరాగ్యము వృద్ధి కాఁగ క్రమముగా నునికి, యానందము, చేతనత్వము  నయిన నిన్ను తాముగఁ  దలఁచెదరు. జగత్తున కెల్ల నీవ మూల కారణముగఁ దోఁపఁగా నెఱింగి యట్టు లద్వైతమును దలఁచెదరు.   

 

 

 

 

చం.

చనుఁ ద్రివిధమ్ము లంద నిను జ్ఞానము కర్మము భక్తి మార్గముల్

మనమున వీడ నాశలను మానవ కోటికి జ్ఞాన మార్గమే

కన నిఁక రక్తి కర్మములఁ, గర్మ పథమ్ము, నొసంగ నీక వా

ని నడుమ నున్న వారి కిఁక నిత్యము మేలగు భక్తి మార్గమే

5.     

 

 

 

 

నిన్ను బొందుటకు జ్ఞాన, కర్మ భక్తి మార్గము లని మూడు విధము లుండును. మనస్సులలో నాశ లన్నింటిని వీడిన వారికి జ్ఞాన మార్గము మే లగును. కర్మము లందు రక్తి కలిగి  కర్మములను నీకే యొసఁగిన  గర్మ యోగము మే లగును. ఈ  రెంటికి మధ్య నున్న వారికి నిత్యము భక్తి మార్గమే మే లగును.

 

 

 

 

ఉ.

చేరును సత్కృతమ్ములను శీఘ్రమ జ్ఞానమొ భక్తియో భువిన్

కోరుదు రుద్భవింప నిట కూర్మి దివౌకస నారకుల్ సిరిన్

మూరె భవమ్మ యొజ్జ నడపుం దరి గాలివి నీవ దాఁటుదున్

మూరి భవాంబుధిం గొలిచి నూఱు విధమ్ముల నిన్ను భక్తితో

6.     

 

 

 

 

  భువిలో మంచి పనుల వలన జ్ఞానము కాని నీ పై భక్తి గాని కల్గును. అందులకే స్వర్గ వాసులు నరక వాసులు నిక్కడ పుట్టుటను గోరుకొందురు. భాగ్య వశమున నా కిక్కడ పుట్టుక కల్గెను. గురువు నావికుఁడు కాఁగ నీవు గాలి కాఁగ ని న్ననేక విధముల భక్తితోఁ గొలిచి యీ సంసార మనెడు సాగరమును దాఁటుదును.   

 

 

 

 

తే.గీ.

వెదకి యవ్యక్తు జ్ఞానులు వే భవముల

సిద్ధు లగుదురు కష్టము సిద్ధి కర్మ

యోగులకును సత్వర ఫల మొసఁగు భక్తి

నీదు సన్నిధి దానిని నెమ్మి నిమ్ము

7.     

 

 

 

 

జ్ఞాను లనేక జన్మల పిదప నవ్యక్తుఁడ వైన నిన్ను శోధించి సిద్ధినిఁ బొందుదురు. కర్మ యోగులకు సిద్ధి వడయుట కష్టతరము. భక్తి మాత్రము సత్వర ఫలము, నీ సన్నిధి, నొసంగును. దేవా యా భక్తి నాకు నిమ్ము.

 

 

 

 

తే.గీ.

బ్రహ్మ తత్త్వ మెఱుఁగఁ గోరి వ్యాసుఁ డడరె

మిగుల గాఢపుఁ బద భక్తి మించ ముక్తి

కరమున నిలుచుఁ జిత్తము కదలఁ గష్ట

మగును భక్తి శిక్షయు నీ దయ గలుగ నగు

8.     

 

 

 

 

బ్రహ్మతత్త్వ జ్ఞానము నెఱుంగ వ్యాస మహర్షి చాలా కష్ట పడెను. గాఢ మైన భక్తి యున్న ముక్తి కర తలామలకము. మనస్సు చంచల మైన భక్తి  కష్ట మగును. అభ్యాసము, నీ దయ యున్న నది కలుగును.

 

 

 

 

తే.గీ.

కష్ట కర్మ పథము వీడి కథలు వినిన

శ్రద్ధను వహింప నలవియె సంగమ చ్యు

తి కలుష మెఱిగి నుతుల హృది నిలువంగ

నీవు వీత సంగు నగుదు నేను భక్తి

9.     

 

 

 

 

కష్ట మైన కర్మమార్గమును వీడి శ్రద్ధ వహించి నీ కథలను వినినను గోరికలను జయింప శక్యము కాదు. దోషములను గుర్తించి భక్తితో నిన్ను నుతింపఁగ నా హృదయ మందు నీవు నిలిచిన నేను సర్వసంగ పరిత్యాగి నౌదును.

 

 

 

 

తే.గీ.

విప్రుఁ డొకఁ డార్జితం బైన విత్త మణఁగ

జనులు బాధింపఁ గాలము జనులు కావు

గ్రహములు మనస్సుమాత్రము కత మని పడ

సెను బ్రశాంతి నా కది కల్గఁ జేయు మయ్య

10.  

 

 

 

 

ఒక విప్రుని తాను సంపాదించిన విత్త మెల్ల నశింప జనులు బాధించు నప్పుడు నతఁడు జనులు, కాలము, గ్రహచారము లీ దుఃఖమునకు  కారణము కావు. మనస్సు మాత్రమే కారణ మని మది నెఱింగి ప్రశాంతినిఁ బొందెను. దేవా నా కా శాంతిని ప్రసాదించుము. 

 

 

 

 

తే.గీ.

ఐలుఁ డూర్వశి వివశుఁడై యనవరతము

సుఖములు వడసి పిమ్మట క్షుద్ర మని త

లంచి ముక్తుఁ డయ్యె నిను భజించి యట్ల

యణఁచి రక్తి రుజల నాపు మనిల పురప

11.   

 

 

 

 

ఇలా తనయుఁ డైన పురూరవుఁ డూర్వశికి నిత్యము వశుఁడై సుఖము లనుభవించి చివరకు నది క్షుద్ర మని యెఱిఁగి నిన్ను భజించి ముక్తిఁ బొందెను. గురువాయూరు నాథా యవ్విధి నా రక్తి నెల్ల నణఁచి నా రోగములను బాపుము.

 

 

 

ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయమునఁ దొంబది యాఱవ దశకము.  

ఏకాదశ స్కంధ పరిచ్ఛేదము సమాప్తము.

 

శ్రీమదాంధ్ర  శ్రీమన్నారాయణీయము

(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము)

ద్వాదశ స్కంధ పరిచ్ఛేదము

దశకము 97.

ఉత్తమ భక్తి ప్రార్థనా మార్కండేయోపాఖ్యానములు.

 

 

ఉ.

జ్ఞానము శ్రద్ధ కర్త యిలు సంతస మింకయు తిండి కర్మముల్

గానఁగ ముగ్గుణమ్ములను గన్పడు భేదము వాని వానికిన్

హీనము మధ్యమమ్ము నిఁక నెంచఁగ నుత్తమ మట్లుఁ గాకయే

నీ నతు లింక క్షేత్రములు నిర్గుణముల్ మఱి యిచ్చు సిద్ధినే

1.      

 

 

 

 

జ్ఞానము, శ్రద్ధ, కర్తయు, నిల్లు, సంతోషము, నాహారము, కర్మము లందు సత్త్వ రజ స్తమో గుణ భేదము లుత్తమము, మధ్యమము మఱియు నధమము లనఁగఁ గనిపించును. అట్లు గాక నీ వైన స్తోత్రములు, నాలయములు నిర్గుణములు.  అవి సిద్ధిని ప్రసాదించును.

 

 

 

 

ఉ.

నిన్నిడి చిత్త మందు మఱి నీ కొఱకై పను లెల్లఁ జేయుచున్

సన్నుతి సేసి భక్తులను జక్కఁగఁ దిర్గుచుఁ బుణ్యభూములన్

మన్నన చోర విప్రుల సమమ్ముగఁ జేసి యసూయ స్పర్ధయుం

గ్రన్నన వీడి మచ్చరముఁ గందును నిన్నిట నెల్ల  జీవులన్

2.     

 

 

 

 

దేవా చిత్తము నందు నిన్నుంచి, నీ కొఱకునే పనులను జేయుచు, నీ భక్తులను నుతించి, పుణ్య క్షేత్రములు దర్శించుచు, దొంగలను విప్రులను సమముగ మన్నించుచు,నసూయ, ద్వేషము, మత్సరములను గ్రన్నన వీడి యెల్ల జీవు లందు నిన్ను జూచెదను.   

 

 

 

 

తే.గీ.

అట్ల యర్చింతు నీ భావ మందు వఱకు

నేకత తెలియఁ జరియింతు నేక మగుచు

భాగవత ధర్మ మణఁగదు పరమపురుష

యట్టి భక్తి మార్గ మొసఁగు మయ్య నాకు

3.     

 

 

 

 

ఆ విధముగా నీ యేకత్వ మెఱుంగు వఱకు నర్చింతును. అద్వైతమును గుర్తింపఁగనే నీతో నేకత్వము నంది చరింతును. భాగవత ధర్మ మెన్నటికి నణఁగదు. పరమపురుషా యట్టి భక్తి మార్గము నా కిమ్ము.

 

 

 

 

తే.గీ.

ఆయురారోగ్యములు నిత్య మవసరమ్ము

భక్తి వృద్ధికి భక్తి కవసర మౌను

బాద సేవయ మందయ్యెఁ బాలె యేఁటి

పూజ బ్రతికె మార్కండేయుఁ డోజ నూని

4.     

 

 

 

 

భక్తి వృద్ధి చెందుటకు నెల్లప్పుడు నాయురారోగ్యములు కావలయును. దానికి నీ పాద సేవయే  యవసరము.ఆహా పాలు కూడ మం దైనవి.  మార్కండేయుఁ డను వాఁ డొక్క సంవత్సర కాల  ముత్సాహముతోఁ బూజ సేసి బ్రతికెను. 

 

 

 

 

మ.

ఘన భక్తుండు చిరాయువై తనరు మార్కండేయుఁ డిద్ధాత్రి ని

న్మన మందుంచి తపమ్ము సేయఁ గడు ప్రేమం బుష్పభద్రా తటిన్

మను కాలమ్ములు నాఱు దేవపతియే మాత్సర్యతం బంపి ద్యో

వని తానంగ సమారుతమ్ములఁ దపో భగ్నార్థమై యోడెనే

5.     

 

 

 

 

పరమ భక్తుఁ డైన మార్కండేయుఁడు చిరాయువై భూమిపై వర్ధిల్లును. అతఁడు నిన్ను మనస్సులో నిల్పి పుష్పభద్రా తటిని నాఱు మను కాలములు తపము చేయ నేడవ మను కాలమున  నింద్రుఁడు ద్వేషమున నప్సరసలను మన్మథుని మారుతముతోఁ గూడి తపో భగ్నమున కై పంపి పరాజితుఁ డయ్యెను.

 

 

 

 

తే.గీ.

నర సఖుండు నారాయణుఁ డరిగి మౌని

కడకు నుతియింపఁ బడి వర మడుగు మనిన

భక్తినె యడిగి మాయఁ జూప మనె నకట

కుతుకమున నేరకయు దాని వెతలు మదిని

6.     

 

 

 

 

అంత నర సఖుఁ డైన నారాయణుఁడు మార్కండేయ ముని కడకు నేఁగి వానిచేఁ బూజింపఁ బడి, వర మడుగు మనిన నతఁడు భక్తినే కోరి మఱియు విష్ణుమాయను జూప మని యడిగెను. దాని వలన కలుగు వెతల నేరక యట్లడిగెను.

 

 

 

 

మ.

చన నీ వంతటఁ గ్రమ్మె మేఘములు వర్షంబంత భూగోళమున్

మునిచెన్ సప్త మహార్ణవమ్ములు సుసంపూర్ణంబు నేకమ్ము గా

వన రాశిం దిరుగాడి కోటి శకముల్ భట్టారుఁడే కాంచె బా

లునిఁ బత్రిన్ ఘనవర్ణుఁ గాలి తొలి వ్రేల్మూతిం బ్రకాశింపఁగా 

7.     

 

 

 

 

అంత దేవా నీవు చనఁగా, మేఘములు క్రమ్మి వర్షములు భూగోళమును ముంచెను. సప్త సముద్రము లేక మైనవి. ఆ నీటి కుప్పలో నా ముని కోటి సంవత్సరములు తిరిగి తిరిగి నచ్చట నొక యాకుపై నొక్క బాలుని మేఘవర్ణునిఁ దన కాలి బొటన వ్రేలు నోటిలో నుంచికొని యుండఁగఁ గాంచెను. 

 

 

 

 

చం.

కని నిను మౌని సత్తముఁడు గగ్గురు కల్గ సమీప మేఁగ స్ప

ర్శనమునకై నసాంతరము శ్వాసను గూడి చనంగఁ జూచి కు

క్షిని వడి విశ్వ మంతయును జేరె బహిర్గతి శ్వాసతో ముద

మ్మున నిను కౌఁగిలింపఁ జన ముందటి వాసముఁ జేరె వింతగన్

8.     

 

 

 

 

అట్టి నిన్ను ముని సూచి గగుర్పొడ ముట్టుకొనఁ జెంతకు రాఁగ నీ శ్వాసతో ముక్కులోనికిఁ దూఱి నీ కుక్షిలో విశ్వము నంతటినిఁ జూచి తిరిగి దిగ యూపిరితో బయటకు రాఁగ సంతసమున నిన్ను గౌఁగిలింపఁ జేర వింతఁగాఁ దాను మున్నున్న చోటునకుఁ జేరెను.

 

 

 

 

ఉ.

గౌరినిఁ గూడి శంకరుఁడు కాంచఁగ మౌనిని వచ్చి వానికిం

గోరక యిచ్చెఁ జావమినిఁ గూర్మిని నిత్యపు యౌవనమ్ము కే

దారుఁడు నీదు సేవల ముదమ్మున నందును మూడు మూర్తు లా

కార మనంగ నీ వని ప్రకాశము సేయఁగ సర్వ రక్షకా

9.     

 

 

 

 

అంత శంకరుఁడు పార్వతితో వచ్చి మార్కండేయునకు నిత్య యౌవనము, మృత్యు రాహిత్యమును గోరకయే  వరముగ నిచ్చెను. నీవు త్రిమూర్త్యాత్మక మని తెలుపుటకునై నీకు ముని చేసిన పూజ లెల్ల జగద్రక్షకా కేదారేశ్వరుఁడు సంతోషముగా నందుకొను చుండెను.

 

 

 

 

తే.గీ.

అజ హరి హరుల పైపైన నమరు మూడు

వాసములు పైన వైకుంఠ వాస ముండు

ప్రకృతి మాయలు లేకయె వ్రజము నందు

నుండు పవన పురప రుజ లుండ నీకు

10.  

 

 

 

 

బ్రహ్మ విష్ణు మహేశ్వరు లున్న నొకదానిపై నొకటి యుండు మూడు నివాసముల పైన వైకుంఠము మాయా ప్రకృతుల ప్రభావములు లేక యుండును.  గోకులమున నున్న కృష్ణా గురు వాయూరు నాథా నాకు రోగములు లేకుండ జేయుము.

 

 

 

ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయమునఁ దొంబది యేడవ దశకము.  

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

శ్రీమదాంధ్ర  శ్రీమన్నారాయణీయము

(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము)

ద్వాదశ స్కంధ పరిచ్ఛేదము

దశకము 98.

నిష్కళ బ్రహ్మోపాసన.

 

 

ఉ.

ఎవ్వని చేతఁ గాన నగు నెవ్వని చే నిది యింక డిందునో

యెవ్వని యందు విశ్వ మది యెవ్వఁడొ యెవ్వని వెల్గు కారణం

బివ్విధి వెల్గ వాక్కులకు నెవ్వఁడు దవ్వగు దేవ మౌనులే

యెవ్వని నేర రాకృతిని నెన్నఁడు మ్రొక్కెదఁ గృష్ణ వానికిన్

1.      

 

 

 

 

ఈ విశ్వ మెవ్వని చేతఁ బ్రకాశ మైనదో, యెవనిచే నెవ్వని యందు లయ మగునో, యయ్యది యెవ్వఁడో, యెవ్వని వెలుఁగుల నివ్విధి వెల్గునో వాక్కులకు నెవ్వఁ డందఁడో, దేవర్షులు  నెవ్వని రూప మెన్నఁ డెఱుంగరో యట్టి వానినిఁ (పరం బ్రహ్మమును) గృష్ణా కొలిచెదను.

 

 

 

 

తే.గీ.

జన్మ కర్మ నామమ్ముల సంభవింతు

వవన మెంచి లోకమ్ముల నలర మాయఁ

బె క్కరూప రూపమ్ముల విష్ణు హర్ష

నిధివి కైవల్య మూర్తివి నిన్ను గొలుతు

2.     

 

 

 

 

విష్ణు దేవా లోకముల రక్షణ మెంచి మాయ మీఱఁ బెక్కు రూపముల నే రూపములు లే కుండఁగ జన్మములు, కర్మముల, నామములతో నుద్భవింతువు.  ఆనంద నిధివి, కైవల్య మిచ్చు నట్టి మూర్తివి నిన్ను గొలిచెదను.

 

 

 

 

చం.

ఖగ మృగ మర్త్య నిర్జరులు కౌణపు లందును రావు స్త్రీవియున్

మగఁడవు కావు ద్రవ్యమును మానుగ కర్మగుణమ్ము లన్వయ

మ్ముగను దలంప రాదు మఱి పుట్టువు పుట్టమి గాదు శేష మే

మగు నన లక్షణమ్ము లరయంగఁ బరంపు సుఖమ్మవే నతుల్

3.     

 

 

 

 

పక్షులు, జంతువులు, మానవులు, సురలు రాక్షసు లందును రావు. స్త్రీవియుఁ బురుషుఁడవు కావు, ద్రవ్యముగఁ గర్మ గుణములుగను దలంప రాదు. పుట్టువు బుట్టమియు నీకు లేదు మఱి లక్షణములను గాంచ  నింక మిగిలిన పరమానందమే నీవు. నీకు నమస్కారములు.

 

 

 

 

చం.

ఎలమిని నీదు మాయ సృజియించితి వయ్య మహత్తహమ్ములుం

గలియఁగఁ బంచమాత్రలు జగత్తును భూతము లైదు నింద్రియా

దులును తలంచి స్వప్నగతిఁ దోర మడంచితి వంత కూర్మ మం

ఘ్రుల వలెఁ గాలశక్తియె నిగుడ్పఁగఁ జీఁకటి వెల్గితే నతుల్

4.     

 

 

 

 

ప్రీతితో నీ మాయచే మహత్తు, నహము, పంచ మాత్రలు ( శబ్ద స్పర్శ రూప రస గంధములు), పంచభూతములు ( పృధ్వి, జలము, నగ్ని, వాయు వాకాశములు) జ్ఞానకర్మదశేంద్రియములు, మనస్సు లతో జగత్తును గలలోని వస్తువుల వలె సృజించి తిరిగి, తాబేలు తన కాళ్ళను ముడిచికొను నట్లు, నీ లోనే లయము చేసితివి.  కాలశక్తి కూర్చిన చీఁకటిలోను  నీవు వెలిఁగితివి. నీకు నతులు.

 

 

 

 

తే.గీ.

అణువు పనులు శబ్దబ్రహ్మ మరయ కాల

మంచు విభు విశ్వ హేతువ యన్నిటఁ గనఁ

బడెడు పురుష పరచిదాత్మ పలుకు శ్రుతులు

జగతి మాయ నడపు కృష్ణ! సన్నుతింతు

5.     

 

 

 

 

విభూ విశ్వకారకా, సర్వదర్శనుఁడ వైన పురుషా, పరచిదాత్మా  నిన్ను వేదము లణువు, కర్మము, శబ్ద బ్రహ్మము, కాలము నని పలుకును. మాయతో జగత్తును నడపు  కృష్ణా నిన్ను నుతింతును.

 

 

 

 

తే.గీ.

అజ్ఞత గను జగతి రజ్జు వహుల భంగి

కలిగిన కలుగ కున్న లేక యుభయమున

శ్రుతుల వినికి నీదు కృప నది తఱిఁగిన న

సి యయి నఱకు భవవని నిన్జేరి కొలుతు

6.     

 

 

 

 

అజ్ఞానము జగతినిఁ ద్రాడుపాముల రీతి జూచును. అది కలిగినను, కలుగకున్న నుండియు నుండ కున్నను వేదములను వినుట వలన నీ యొక్క కృప వలనను నశింపఁగఁ గత్తి యయి పుట్టుక లనెడు నడవిని  నఱకును. కృష్ణా నిన్ను గొలిచెదను.

 

 

 

 

తే.గీ.

మన్ను కుండల స్వర్ణము మండనమ్ము

లఁ బగిది నిజ మరయ నేడు వపువు నీది

యద్వితీయమ కల ముగియ తిమిర మడఁ

గఁ గన నగుఁ ద్రా డటుల నిన్ను గనుదు విద్య

7.     

 

 

 

 

కుండలలో మన్ను, భూషణముల బంగారము విడ రాని యట్టులు కన్పడు రీతి నిజ మెంచ నీ శరీర మిప్పుడు కూడ నద్వైతముగఁ గనిపించును.  కల ముగిసి చీకటి తొలఁగఁ ద్రాటినిఁ జూడ కలిగి నట్లు జ్ఞానము కలుగ నిన్ను గాంచెదను.

 

 

 

 

ఉ.

ఎవ్వని భీతి సూర్యుఁ డుదయించు దహించును వహ్ని గాలి తా

నవ్విధి వీచుఁ బద్మజుఁడు నన్యులు నిత్తురు కాల చేష్టలే

యివ్విధి నిల్పుఁ దీయు నిఁక నెవ్వఁడు స్థానములన్  నియంత్రణం

బెవ్వఁ డొనర్చు నట్టి నిను నేమును గొల్తుము కృష్ణ మ్రొక్కులన్

8.     

 

 

 

 

ఎవ్వని భీతితో సూర్యుఁ డుదయించునో, యగ్ని కాల్చునో, గాలి వీచునో, బ్రహ్మ మున్నగు వారు కాలానుగుణపుఁ బనులు చేయుదురో, వారి నెవ్వఁ డివ్విధి స్థానముల నిల్పి తీయునో, నియంత్రణ మెవ్వఁడు వహించునో యట్టి నిన్ను గృష్ణా మ్రొక్కులతో మేము కొలిచెదము. 

 

 

 

 

ఉ.

మూడు గుణమ్ము లోమ్మగుదు ముజ్జగ కర్తవు ముగ్గు రీవయే

మూడు శ్రుతుల్ నుతించు నిను మూడు యుగమ్ముల మూ డవస్థలం

బాడిగ నుండి ముప్పదము పట్టి జగమ్ముల భేద హీనమై

మూడు తఱుల్ సెలంగు నిను మూడు విధమ్ముల నెమ్మిఁ గొల్చెదన్

9.     

 

 

 

 

దేవా నీవు ముగ్గుణముల వాఁడవు.  మూడక్షరముల యోం కారమవు, ముల్లోకములను సృజించితివి. త్రిమూర్తులు నీవ, మూడు వేదములు నిన్ను మూడు యుగము లందు నుతించును, మూ డవస్థల (జాగ్రత్స్వప్న నిద్రావస్థలు) నుండి మూడు పదముల జగత్తు నాక్రమించి, మూడు కాలముల (భూత భవిష్య ద్వర్తమాన కాలములు) భేదము లేక చెలఁగు నట్టి నిన్ను నేను మూడు విధముల (జ్ఞాన భక్తి కర్మ యోగముల) ప్రీతితోఁ గొలిచెదను.

 

 

 

 

సీ.

నిజ మైనది వపువు నీది శుద్ధము మెలకువ మిన్న నిత్య ముక్తుఁడవు లేవు

కోరిక లెన్నఁడు గుణ గణాధారుఁడ వీవు ద్వంద్వమ్ముల కీ వతీతుఁ

డవు వికారమ్ము లుండవు లేవు మూలము లెంచ నిర్మల చిత్త మంచితమ్ము

నిరవధిక మహిమ నెగడు దీవు సతతోల్లాసివి పరగు నారాయణాఖ్య

 

తే.గీ.

మునుల నిస్సంగుల హృదయముల వెలుంగు

దీవు పరమంపు టానంద మింక సాంద్ర

మై తనరు చుండును బ్రకాశమై సతమ్ము

నీల ఘనమేఘ సంకాశ నీరజాక్ష

10.  

 

 

 

 

నీల మేఘశ్యామా, నీరజాక్షా నీ మేను సత్యము, శుద్ధము, విబుద్ధము. నీవు నిత్య ముక్తుఁడవు, నిష్కాముఁడవు, సద్గుణాకరుఁడవు, ద్వంద్వ రహితుఁడవు, నిర్వికారుఁడవు, మూలములు లే నట్టి వాఁడవు, నిర్మల చిత్తుఁడవు, మహామహిమాన్వితుఁడవు, నిత్యసంతోషివి, నారాయణ నామము  నీ కతిశయించును, నిస్సంగుల మునుల చిత్తముల నుందువు,  సాంద్రానందము మిక్కుటముగాఁ దనరు చుండును.

 

 

 

 

తే.గీ.

అడ్డు లేనిది పండ్రెండు దొడ్డ మూల

లుండు మున్నూఱు నఱువది యుగ్ర దంష్ట్ర

లున్న కాలచక్రము దేవ యుఱక నీకు

నా పయి మరున్నగర నాథ యాపు రుజలు

11.   

 

 

 

 

దేవా కాల చక్రము పండ్రెండు మూలలతో మున్నూఱు నఱువది దంష్ట్రలతో నడ్డు లేనిది. దానిని నాపై నుఱక నీయకుము. గురువాయూరు నాథా నా రోగముల నాపుము. 

 

 

 

ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయమునఁ దొంబది యెనిమిదవ దశకము.  

 

శ్రీమదాంధ్ర  శ్రీమన్నారాయణీయము

(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము)

ద్వాదశ స్కంధ పరిచ్ఛేదము

దశకము 99.

భగవన్మాహాత్మ్యాను వర్ణనము.

 

 

ఉ.

ఎంచఁగ విష్ణు విక్రమము నేరికి శక్యము రేణుకోటి యే

రెంచ సమర్థు లౌదు రయ యిద్ధర ముచ్చర ణాక్రమంబుగా

నుంచె జగత్రయమ్ము బరు వోర్చు జగమ్ముల బ్రీతి నిచ్చుఁ దా

నంచిత సంపదల్ ఘనపు టక్షయ ధామమ నేను గోరుదున్

1.      

 

 

 

 

విష్ణువు విక్రమమును గణింప నెవ్వరికి సాధ్యము? భూరేణువుల నెంచఁగ నెవ్వరు సమర్థులు? మూడు పదములతో ముల్లోకముల నాక్రమించెను. విశ్వపు బరువు నోర్చును.  ప్రీతితో మంచి సంపదల నొసంగును. దేవా నేను ఘన మైన నీ యక్షయ ధామమునే గోరుకొందును

 

 

 

 

ఉ.

ఆద్యుని విశ్వకర్త నసితాంగ నవీనుని నాథనాథునిం

బాద్య నివేద్య యజ్ఞ సముపాసన లింపుగఁ జేయుచుండి కృ

ష్ణాద్యవతార కీర్తనము లంచిత రీతి నొనర్ప భక్తుఁడే  

వేద్యము సేరు నీ పదము వేగముగం దుదిఁ గీర్తిమంతుఁడై

2.     

 

 

 

 

ఆద్యుఁ డైన వాని, విశ్వమును సృజించిన వాని, నిత్య నూతన మేఘ శ్యాముని, ప్రభువుల కెల్లఁ బ్రభు వైన వానినిఁ బాద్యము నైవేద్యము యజ్ఞములు సముపాసనలు  చేయు చుండి కృష్ణాది మహోన్న తావతారములను గీర్తన చేయు భక్త వరేణ్యుఁడు తుదకు కీర్తి మంతుఁడై వడి నీ పదమును జేరును. ఇది తెలియఁ దగినది. 

 

 

 

 

చం.

తెలిసిన రీతి సత్కవి నుతింపఁ దగుం దమి వేదసారునిం

దెలిసి భవంపు గాథలను దివ్యపు లీలలు నామజాలముల్

సులభ ముదావహమ్ములను సుందర లీల రమా ధవా మదిం

గలుగఁగఁ జేయుఁ గీర్తనల గానము నా కిలఁ దత్త్వబోధమున్

3.     

 

 

 

 

సత్కవి తెలిసిన రీతి వేదసారుఁడ వైన నిన్ను నాసక్తితో నీ యవతారముల కథల నింక దివ్య లీలలను సులభ హర్ష దాయకము లగు నామములను తెలిసి సుందరముగఁ గీర్తింప వలెను. మాధవా నీ కీర్తనల గానము నాకు మదిలో తత్త్వ జ్ఞానము నొసంగును. 

 

 

 

 

ఉ.

వెన్నుని యెల్ల కర్మములు ప్రీతినిఁ జూడుమ ధర్మబద్ధముల్

చెన్నుగ మిత్ర భృత్య విధిఁ జేయఁడె యింద్రుని కీయ సౌఖ్యముల్

నిన్నిలఁ జిత్ప్రకాశ పదు నెమ్మినిఁ గాంచిరి యోగ సిద్ధులే

సన్నుతి విప్ర పుంగవులు సల్పుదు రెల్లరు చారు గీతులన్

4.     

 

 

 

 

పరిశీలించి చూడుము (తన్ను దా ననుట) వెన్నుని పనులను ధర్మ బద్ధములను. ఇంద్రునకు మిత్రుని వలె సేవకుని పగిది సౌఖ్యము లీయఁగఁ బనులను జేసెను కద. సిద్ధి పొందిన యోగులు నిన్ను జిత్ప్రకాశపు టిల్లు గల వానిని సంతోషముగఁ గాంచిరి. విప్ర వరులు సుందర గీతములతోఁ జక్కఁగ నీ సన్నుతి సేయుదురు.  

 

 

 

 

తే.గీ.

మేర పుట్టిన పుట్టెడు వారు నేర

రయ్య నీ మహిమకు దేవ యరసి శ్రేయ

ములు పొగడుదును వివిధ నుతులను ముజ్జ

గముల కవల వికుంఠ మోకస్సు నీకు

5.     

 

 

 

 

దేవా నీ మహిమకుఁ బుట్టిన వారు నింకఁ బుట్టఁ బోవు వారు కూడ మేర నెఱుఁగరు. శ్రేయములను గాక్షించి  నిన్ను బలు విధములఁ బొగుడుదును. ముల్లోకముల కావల నున్న వైకుంఠము నీకు నిలయము.

 

 

 

 

ఉ.

ఆదినిఁ బుట్టె నీరు పరమాత్మ వహించెను నిన్ను గుక్షిలో

లే దల జీవ మెద్దియును లీలఁగ నిద్రిల జీవు లుండె నీ

లో దయ నంత నాభిని సరోజము వుట్టెను దిగ్దళమ్ములం

బాదుకొనంగఁ గర్ణికగ బంగరు కొండయె లోక రూపమై

6.     

 

 

 

 

మొదట నీరు పుట్టెను. అది నిన్ను దనలో నుంచు కొనెను. జీవము లెవ్వియు లేవు. లీలఁగ నీవు నిద్రించు చుండ జీవులు నీలో నున్నవి. అంత నీ నాభి నుండి యొక కమలము దిక్కు లనెడు రేకులతోఁ బుట్టెను. కర్ణికగ మేరు పర్వతము లోకములను సూచించుచు నుండెను.

 

 

 

 

తే.గీ.

ప్రజ జగత్కర్త హరి యని నిజ మెఱుఁగదు

వాని లోనఁ గల దనియుఁ బరఁగ మోహ

మరసి నామ రూపముల నధ్వరము లందుఁ

దృప్తిఁ బొంది తలంపదు కృష్ణ నిన్ను

7.     

 

 

 

 

జనము సృష్టి కర్త హరియే యని సత్య మెఱుఁగదు. వాని లోన జగ త్తున్న దనియు నెఱుఁగదు. మోహము తనరఁగ నామములు రూపముల నరసి యాగములు చేయుచుఁ దృప్తి సెంది కృష్ణా నిన్ను దలంప దకట.

 

 

 

 

తే.గీ.

వేయి తల లంఘ్రులు కనులు వెలయ విశ్వ

మెల్ల నిండి యన్నియు నయి యెలమి దేహి

చిత్తముల వసించి తగుల ముత్తరించి

పొందు దీవు మోక్షానంద భోగ మెల్ల

8.     

 

 

 

 

వేయి తలలు పాదములు కన్నుల నలరు చుండ విశ్వము నంతయు నిండి నీ వన్నియు నయి ముదమున దేహుల చిత్తము లందు వెలసి వానికిఁ జిక్కక మోక్షానందమును  బొందుచుందువు.

 

 

 

 

తే.గీ.

అవిర ళానంత శుద్ధ బోధాత్మ! రక్తి

లేని ముల్లోక రూపము లూని వెల్గు

దు మహిమ నొక వంతయిన భాగమున జగము

నిండ శేష మొంద ముదము నీకు నతులు

9.     

 

 

 

 

అవిరళము, ననంతము నిర్మలమైన జ్ఞానాత్మకలవాఁడ రక్తి రహితమై ముల్లోక రూపముల నూని యొక్క వంతు భాగమున జగ మంత నిండ వెల్గుదువు. మిగిలిన యట్టి మూడు భాగము లానంద సాంద్రమై యుండును. అట్టి నీకు నమస్కారములు.  

 

 

 

 

ఉ.

కష్ట తరమ్ము నిర్గుణ మగాధము నేరఁగ నీదు రూపముం

దుష్టి నొసంగుఁ జూచినను దోరపు సత్త్వ యుతంపు రూపమే

యిష్టము మోక్ష సాగరపు టిద్ధ తరంగ సమాన మూర్తి నా

విష్టపు రూపు నిన్గొలువ వే రుజ లాపు మరుత్పురాధిపా

10.  

 

 

 

 

నిర్గుణ మైన నీ రూప మగాధము తెలిసికొనుట కష్టతరము. సత్త్వముతో కూడుకొనిన నీ రూపము సూచి నంత సంతోషము కల్గును. మోక్ష మను కడలి యలలకు సమాన మైన మూర్తి (ప్రతిమ) నావేశించిన రూపమున నిన్ను గొలువ నా కిష్టము. గురువాయూరు నాథా నా రోగము లాపుము.

 

 

 

ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయమునఁ దొంబది తొమ్మిదవ దశకము.  

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

శ్రీమదాంధ్ర  శ్రీమన్నారాయణీయము

(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము)

ద్వాదశ స్కంధ పరిచ్ఛేదము

దశకము 100.

కేశాది పాద వర్ణనము.

 

 

ఉ.

చూచుచు నుంటిఁ దేజమును సుందర సాంద్ర కవేల రాశితోఁ

దోఁచిన లోభనీయ మయి త్రుళ్లితి మున్గి సుధా రసమ్మునం

దోఁచిన మధ్య నీ వడరి తోరపు బాలుని వేష మూనుచున్

వేచిన యౌవనమ్ము వృత వేద వ దిందుముఖీ సురర్షివై

1.      

 

 

 

 

నీ తేజము నా నీలి కలువల రాశి మధ్య లోభనీయమై దోఁపఁగఁ జూచు చుంటిని. వాని మధ్య నీవు యౌవన మేతేరు బాలుని రూపమున నుండ వేదముల వంటి సుందరీ మణులు, నారదుఁడు నిన్ను బరివేష్టించి యుండ నా దృశ్యామృతము నందు మునిఁగి త్రుళ్లితిని.

 

 

 

 

తే.గీ.

నీలి నెఱి జుట్టు దట్టమ్ము నిగ్గు మెఱయ

మూరి ముడువ రత్నములు మందార దామ

ము వర పింఛమ్ము గాంచితి మురిసి చంద్ర

రేఖ నిభ పుండ్ర మమరంగ లీల నుదుట

2.     

 

 

 

 

నల్లని మెఱసెడు దట్టపు జుట్టునఁ బింఛము, రత్నములు, మందార మాల ముడువగ, నుదుటను జంద్ర రేఖ వలె పుండ్రము ప్రకాశింప నిన్ను మురిసి  కాంచితిని.   

 

 

 

 

చం.

రుచిర కృపా ర సార్ణవ విలోల తరంగ నిభంపు భ్రూ విలా

స చలన! నీల పక్ష్మ విల సన్నయన ద్వయ భాసి తేశ్వరా!

ప్రచుర తర ప్రభా వితత రక్త సరోరుహ పత్ర ముగ్ధ తా

ర! చిర దయా విలోకన కలాప సురక్షిత విశ్వ! కావుమా

3.     

 

 

 

 

మనోజ్ఞ మైన కృపా రస మను కడలి యలల వలె విలాసముగాఁ గనుబొమలు కదల్చు వాఁడా, నీలి కనురెప్ప వెండ్రుకల వాఁడా,  ప్రకాశించు నేత్రద్వయము కలవాఁడా, మిక్కిలి కాంతితో వెలుఁగు నెఱ్ఱని కలువ రేకుల వంటి రమ్యమైన  కనుగ్రుడ్లు కలవాఁడా,  నిత్యము దయావీక్షణ సమూహముచే రక్షింపఁబడిన విశ్వము గల వాడా నన్ను గావుము.   

 

 

 

 

ఉ.

ఉన్నత రమ్య నాసిక మహోజ్జ్వల దర్పణ గండ గండ కా

సన్న చలచ్ఛ్రవో మకర సాదృశ కుండల యుగ్మ దీప్త రా

జన్నవనీత సన్నిభ లసద్రద బింబ నిభోష్ఠ నిత్య వ

ర్షన్నయ మందహాస ముఖ రాజ నిభానన నిన్ను జూడనీ

4.     

 

 

 

 

ఉన్నత మైన రమ్యంపు నాసిక కలవాఁడా, యుజ్జ్వలమైన యద్దము వంటి చెక్కిళ్లు కలవాఁడా, చెక్కిళ్లు చేరఁ గదలాడు కర్ణ  మకర కుండల ద్వయముతోఁ బ్రకాశించు వాఁడా, ప్రకాశించు వెన్న వంటి తెల్ల దనముతో వెల్గు దంతములు, దొండ పండు వంటి పెదవులు కల వాఁడా, నిత్యము చిందు మంద హాసపు ముఖము కలవాఁడా, చంద్రుని వంటి ముఖము కలవాఁడా నిన్ను దనివి తీరఁ జూడ నిమ్ము.  

 

 

 

 

చం.

కర యుగ మందు భాసిలఁగఁ గాంచన రత్న సుకంకణమ్ములే

వర మురళిం గరమ్మునఁ బ్రవాళ నిభమ్మున నంగుళీ ప్రభల్

కరము వెలుంగ నోటి నిడి కమ్మని రాగము బ్రహ్మ శబ్దముల్

విరియ సుధా రసమ్మనఁగ విశ్వముఁ జల్లఁగ నుంచ నూఁదుమా

5.     

 

 

 

 

బంగారపు రత్న కంకణములు నీ చేతులలో భాసిల్లఁ, జేతితో గొప్ప మురళిని పట్టి పగడముల వంటి వ్రేళ్ల కాంతులు మిక్కిలి వెదజల్ల నోటిలో నుంచి కమ్మని రాగములు శబ్ద బ్రహ్మములను సుధారస మనఁగఁ బలికింప, విశ్వము ప్రశాంతముగా నుండుటకు నూఁదుము.

 

 

 

 

చం.

అరుణము దాల్చె నీ గళ మహర్నిశ మంచిత కౌస్తు భాభలన్

సిరి యను మచ్చ వక్షమునఁ జెన్నుగ భాసిలు లక్ష్మితోడుతం

దరల తరమ్ము దీప్తములు తౌతిక షండ సరాది భూషలే

యురమునఁ బూల దండ లవి యుండు మిళింద విలోలమానమై

6.     

 

 

 

 

అంచిత మైన కౌస్తుభ ప్రభలతో నిత్యము నీ కంఠ మెఱ్ఱని కాంతి దాల్చినది. లక్ష్మీదేవితో శ్రీవత్సము ముత్యముల దండలు మొదలగు భూషణములు  నీ వక్షమున నింపుగ భాసిల్లును. ఉరమున పూలదండలు తుమ్మెదలు పరిభ్రమించుచుండ నున్నవి.  

 

 

 

 

మ.

తను లేప్యమ్ముల సౌరభమ్ము జన చిత్తవ్రాతమున్ లాగగం

దను మధ్యమ్ము లతా నిభమ్ము త్రిజగద్ధార్యమ్మునై వెల్గఁగన్

ఘన నీలాశ్మ సువర్ణ పీత వసనాంగత్విట్టు లేపార ని

స్వన కాంచీ స్థిత కింకిణీ లసిత చిద్బాలున్ నినుం గొల్చెదన్

7.     

 

 

 

 

నీ శరీర గంధ లేపనములు జనుల మనస్సుల నాకర్షించుచున్నవి. లత వంటి నీ సన్నని నడుము ముజ్జగములను మోయగల్గినది. గొప్పదైన యింద్ర నీలము, బంగరు వోలు పచ్చని వస్త్ర కాంతులు వెదజల్ల, బంగారపుఁ గటి సూత్రపు గంటల రవములతో వెలుఁగు జ్ఞాన మయ బాలుఁడ వైన నిన్ను గొలిచెదను.

 

 

 

 

చం.

ఘనతర సున్ని తోరువులు కాంతల చిత్తము లాహరించుచున్

మనముల నొవ్వఁ జేయఁగ సమస్త జగమ్ములఁ బీత చేలమే

యనువుగఁ గప్ప భక్తులకు నర్థము దాఁపఁగ నున్న జానువుల్

చనఁ జన లావునై తనరు జంఘ యుగమ్ముల నెంతు నెమ్మదిన్

8.     

 

 

 

 

సున్నితములు పెద్దవి యగు నీ తొడలు కాంతల చిత్తములను దోఁచుకొనుచు సకల జగముల మనస్సులను నొప్పించు చుండ వానినిఁ బచ్చని బట్టయే కప్పఁగా, భక్తుల విత్తము దాఁచు నట్లు నుండు మోగాళ్లు, క్రమముగ లావుగ నౌ రెండు పిక్కలను నా చిత్తమున స్మరింతును.

 

 

 

 

ఉ.

నీ పద గీతమే నయము నిత్యము నందెల మ్రోత లట్టులన్

లేపును నీ పదద్వయము లెస్సగ భక్తుల మున్గ భ్రాంతిలో

నాపము నందు మందరము నప్పుడు కూర్మము భంగి దీన సం

తాప హరంపు గోరులను దామ్ర విరాజులఁ గొల్తు వ్రేళులన్

9.     

 

 

 

 

అందెల మ్రోత వలె నీ పాద కీర్తన రవములే మేలు. భక్తులు భ్రాంతిలో మునుఁగ నీ పాద పంకజ  ద్వయము, నీటిలో మునిఁగిన మందర పర్వతమును గూర్మము లేపి నట్లు, లేపును. దీన జనుల సంతాపమును హరించు నీ గోళ్లను, తామ్ర వర్ణమున వెల్గు  నీ వ్రేళ్లను గొల్చెదను.

 

 

 

 

ఉ.

యోగి వరేణ్య కాయమున కుత్తమ పాదము లంగకమ్ములన్

బాగుగ తీపి ముక్తిఁ గను వారల వేశ్మము కల్ప భూజముల్ 

వేగమ తీర్పఁ గోరికలు వీనిని నా మది నుంచుమా దయా

సాగర కృష్ణ హర్ష మిడు శారపురాధిప త్రుంచి తాపముల్

10.  

 

 

 

 

దేవా నీ యెల్ల యంగము లందు యోగులకు నీ యుత్తమ పాదములే చాల యిష్టము. ముక్తిఁ గోరు వారికి నిలయములు. కోరికలు తీర్చుటకు కల్ప వృక్షములు. దయానిధీ కృష్ణా వీనిని నా మనస్సు నందు నిల్పుము. గురు వాయూరు నాథా నా తాపములను ద్రుంచి సంతోషము నిమ్ము.

 

 

 

 

మ.

క్షమియింపం దగు విశ్వనాథ నను వక్కాణింప నే నేరకుం

డ మహత్త్వమ్మును జేయ స్తోత్రమును గాఢమ్మే సహస్రాధికం

బు మహిం బద్య సుమాలి నింపుగను సంపూ ర్ణాయు రారోగ్యముల్

గమి సౌఖ్యంబుల నిమ్ము కైకొని నమస్కారమ్ము నారాయణా

11.   

 

 

 

 

విశ్వనాథా నీ మహత్త్వమును బూర్తిగ నేరక చెప్పినందుకు గాఢముగ స్తోత్రము చేసి నందుకును  నన్ను క్షమింపుము. ఇచట వేయికి మించిన యీ పద్య పుష్పములను స్వీకరించి సంపూర్ణము లగు నాయు రారోగ్యముల నధిక సౌఖ్యముల (అనంత సౌఖ్య వైకుంఠ వాసము) నిమ్ము. నారాయణా నీకు నమస్కారములు.   

 

 

 

ఇది విబుధ జన వినయ పోచిరాజాన్వయ కామేశ్వర రావు నామధేయ ప్రణీతమైన శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయమున నూఱవ దశకము.  

స తాత్పర్య శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము సంపూర్ణము.

 

 

 

 

 

 

Description: HPIM1019

శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము

(మూలము: శ్రీనారాయణ భట్ట తిరి కృతము)

 

గ్రంథ కర్తృ దంపతులు

 

 

వివరములు:

పోచిరాజు కామేశ్వర రావు, M.Tech. (Machine Design)

స్వగ్రామము:

బి. దొడ్డవరము, నగరము మండలము, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్.

ఉద్యోగము:

1.          Retd. Senior Manager, Electronics Corporation of India Limited (A Govt. of India Undertaking),             Hyderabad.

2.         Former Assoc. Professor, Dept. Of Mech. Engg. , M.V.S.R Engineering College Hyderabad.

3.         Former Assoc. Professor, Dept. Of Mech. Engg. , Rungta College of  Engineering and Technology,       Raipur.

 

నివాసము: H.No. 19, Shiva Residency, Phase 1, Mathpurena, Raipur, Chchattisghar - 492013 

              Cell. Nos. 8602787525, 9440378434.

 

స్వీయ రచనలు:

1.       రామ చంద్ర శతకము.

2.       పోచిరాజ శతకము.

3.       పద్మావతీ శ్రీనివాసము (ద్విపద కావ్యము- సప్తాశ్వాసములు).

4.       వేంకటేశ్వరా శతకము (అష్టోత్తర శతనామ సంభృతము).

5.       శ్రీమదాంధ్ర సుందర కాండ (నిర్వచన వాల్మీకి రామాయణానువాదము, 68 సర్గలు).

6.       శ్రీకృష్ణ సూక్తి సుధాకరము (శ్రీమదాంధ్ర భగవద్గీత, శ్లోక క్రమానువాదము).

7.       శ్రీమన్నారాయణ శతకము.

8.       శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము (100 దశకములు).

9.       శ్రీమన్నారాయణ దండక సహిత దేవీ మూర్తి త్రయ స్తోత్ర మాలిక.

10.    మాహేశ్వర దండకము.

11.    మాయా జాలము (అష్టాదశ శంకలు) ఖండిక.

12.    ఉదాహరణ కావ్యము_ దొడ్డవర సోమేశ్వరుఁడు

13.    శ్రీమదాంధ్ర రామాయణము 

14.    శ్రీ బాల రామాయణము      

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి